“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, అక్టోబర్ 2018, బుధవారం

నాందేడ్ యాత్ర - 2 (Spiritual City)










 హోటల్ కు చేరుకొని ఫ్రెష్ అయ్యి, కాసేపు ప్రశాంతంగా కూర్చున్నాను.

నాందేడ్ గురించి మా కొలీగ్స్ ద్వారా నేను చాలా విన్నాను. అదొక నరకమనీ, అక్కడ తిండి, భాష, మనుషుల ప్రవర్తనా అన్నీ వేరనీ, మహారాష్ట్ర కల్చర్ అనీ, అక్కడ మనం ఉండలేమనీ నాకు చాలామంది చెప్పారు. కానీ నాకలా ఏమీ అనిపించలేదు. అక్కడి వైబ్రేషన్స్ ను బట్టి అదొక ఆధ్యాత్మిక నగరం అని నాకనిపించింది.

మా కొలీగ్ ఒకాయనతో ఫోన్లో ఈ మాట అంటే -' టూరిస్ట్ గా అక్కడకు వెళితే బాగానే ఉంటుంది. కానీ అక్కడ ఉండి ఉద్యోగం చెయ్యవలసి వస్తే అప్పుడు నరకం కనిపిస్తుంది' అన్నాడు.

ఏ ఊరైనా సరే, అక్కడున్న గొర్రెల్లాంటి మనుషుల వల్ల దానికి విలువ రాదు. ఎక్కడైనా మనుషులు ఒకే విధంగా పశువుల్లా బ్రతుకుతూ ఉంటారు. వాళ్లకు కావలసింది డబ్బు, తిండి, సెక్స్, సరదాలు, ఆస్తులు అంతే. ప్రపంచం మొత్తం ఈ ఊబిలోనే ఉంది. వీటివల్ల ఒక ఊరికిగాని మనిషికిగాని విలువ ఎప్పటికీ రాదు. అక్కడున్న కొన్ని కొన్ని ప్రత్యేకమైన స్థలాల వల్ల, అక్కడ బ్రతికిన ప్రత్యెక వ్యక్తులవల్ల ఆ ఊరికి విలువ వస్తుంది. అతని ఉన్నతమైన జీవనవిధానం వల్ల మనిషికి విలువ వస్తుంది. నేను ఏ ఊరినైనా ఏ మనిషినైనా ఇదే దృష్టితో చూస్తాను.

నేను మన దేశంలో ఏ రాష్ట్రానికి వెళ్ళినా అక్కడ తిండినే తినడానికి చూస్తాను, అక్కడి కల్చర్ ను అర్ధం చేసుకోడానికి ప్రయత్నిస్తాను గాని మన ఆంధ్రా హోటల్ ఎక్కడుందా, తెలుగు వాళ్ళు ఎక్కడున్నారా అని వెతుక్కుంటూ వెళ్ళను. అందుకని, ఇతర రాష్ట్రాల గురించి మామూలుగా మన తెలుగుజనం మాట్లాడుకుండే సోదిమాటలు నాకు రుచించవు. 

ఇంతలో టిఫిన్ వచ్చింది. తినేసి స్టేషన్ కు బయలుదేరాను. అక్కడకు చేరాక, పొద్దున్న నేనేదైతే స్టేషన్ లో రెండుగంటల పైగా రైల్లో వేచి ఉన్నానో, అదే మాల్ టేక్డి స్టేషన్ లో నాకు నైట్ డ్యూటీ అని తెలిసింది.  రోజంతా చేసేదేమీ లేదు. కాసేపు ఆఫీస్ లోనే కూర్చుని అక్కడ మనుషుల పనితీరును గమనిస్తూ ఉన్నాను.

ఇంతలో మా ఇన్స్పెక్టర్ ఒకాయన వచ్చి - 'సార్. ఇక్కడ గురుద్వారాలు చాలా ఫేమస్. మిమ్మల్ని అక్కడకు తీసుకు వెడతాను. వెహికిల్ రెడీగా ఉంది. మీరు సిద్ధమైతే మనం వెళదాం' అన్నాడు.

'ఏ గురుద్వారాకు వెళదాం?' అన్నాను.

'ఇక్కడ దాదాపు 14 గురుద్వారాలున్నాయి. కానీ వాటిల్లో ముఖ్యమైనది 'సచ్ ఖండ్ గురుద్వారా'. దానిపేరు మీదనే అమృత్ సర్ నుంచి ఇక్కడకు 'సచ్ ఖండ్ ఎక్స్ ప్రెస్' ఉన్నది.' అన్నాడు.

'ఓహో అదా సంగతి' అనుకున్నాను.

'సచ్ ఖండ్' అంటే సత్యస్వరూపమని సత్యలోకమని అర్ధం. నిత్యసత్య స్వరూపమైన బ్రహ్మమునే గురునానక్ 'సచ్ ఖండ్' అన్నాడు. కనుక ఆ గురుద్వారాకు అదే పేరు వచ్చింది.

నాందేడ్ చాలా ఓల్డ్ టౌన్. ఫక్తు నార్త్ ఇండియా కల్చర్ అక్కడ కనిపిస్తున్నది. నవీనకాలపు పోకడలు కూడా అక్కడక్కడా కనిపిస్తున్నాయి. మంచి రిచ్ టౌన్ అని కొద్ది సేపట్లోనే అర్ధమైంది. కొద్దిసేపట్లో సచ్ ఖండ్ గురుద్వారాకు చేరుకున్నాం. అది చాలా పెద్దది. ఎంతో విశాలమైన ప్రాంగణంలో కట్టబడింది. సిక్కుల పదవ గురువైన గురు గోవింద్ సింగ్ ఇక్కడే చనిపోయాడని అంటారు.

మమ్మల్ని సరాసరి గర్భాలయంలోకి తీసుకెళ్ళిన మా ఇన్స్పెక్టర్ అక్కడ ఉన్న ప్రధాన పూజారికి మమ్మల్ని పరిచయం చేశాడు. ఆయన ఆదేశం మేరకు అక్కడున్న ఒక సిఖ్ ముందుకొచ్చి మా భుజాల చుట్టూ శాలువలు కప్పి సత్కరించాడు. చాలా సంతోషం కలిగింది. కొద్దిసేపు అక్కడ ఉండి, కొన్ని ఫోటోలు తీసుకుని, బయట హోటల్లో భోజనం చేసి మళ్ళీ హోటల్ కు చేరుకున్నాం. రాత్రికి డ్యూటీ ఉంది కనుక మధ్యాన్నం కొద్దిసేపు నిద్రపోయాను.

(ఇంకా ఉంది)
read more " నాందేడ్ యాత్ర - 2 (Spiritual City) "

నాందేడ్ యాత్ర - 1 (అనుక్షణం జరిగేదే అనుష్ఠానం)

ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ హైదరాబాద్ కు రాత్రి పదకొండున్నరకి చేరింది. రైల్వేలో ఉన్న నాకే విసుగు పుట్టింది. సమయానికి సరిగ్గా నడపడం చేతకానప్పుడు ఎందుకు కొత్తకొత్త రైళ్ళు ప్రవేశపెడతారో అర్ధం కాదు. మంత్రిత్వశాఖ నుంచి ఒత్తిడి ఉంటుంది. అందుకని ప్రవేశపెడతారు. కానీ సమయానికి నడపడానికి అనేక ఇబ్బందులు ఉంటాయి. కనుక నడపలేరు. అలాంటప్పుడు కొత్త రైళ్ళు ప్రవేశ పెట్ట కూడదు. కానీ ఇదంతా ఎవడికి పట్టింది?

జపాన్ లో అయితే, నూరు రైళ్ళు కరెక్ట్ గా నడపడానికి వీలున్న ఒక లైన్ లో డెబ్భై రైళ్ళు నడుస్తున్నపుడే కొత్త లైన్ వేసుకుంటారు. పాత లైన్లో ఇంకో రైలును అనుమతించరు. ఈ విషయం అమరావతిని సందర్శించిన జపాన్ రైల్వే బృందం చెప్పింది. కానీ మన భారతీయ రైల్వేలలో అదే లైన్ మీద నూట డెబ్భై రైళ్ళను కుక్కి కుక్కి నడుపుతున్నాం. ఇండియాలో రైల్వే పరిస్థితి ఎంత ఘోరంగా ఉందో దీన్ని బట్టి అర్ధం చేసుకోవచ్చు. ఇదంతా రాజకీయ నాయకుల నిర్వాహకమే. మన రైల్వేలో ప్రస్తుతం కావలసింది కొత్త లైన్లు మాత్రమే. కానీ అవి వెయ్యకుండా కొత్త రైళ్ళు మాత్రం వేస్తున్నారు. అందుకే రైళ్లన్నీ లేట్ గా నడుస్తూ ఉంటాయి. ఇదీ లోగుట్టు !!

నాందేడ్ పాసింజర్ ఉందో వదిలిందో తెలీదు. మొత్తం మీద ఒకటో నంబరు ప్లాట్ ఫాం మీద దిగాక అది ఏడో నంబర్ నుంచి కదలడానికి సిద్ధంగా ఉందని ఎనౌన్స్ మెంట్ వినిపించింది. పరుగు అందుకుని బ్రిడ్జి ఎక్కి చూస్తే, 7A ఉంది 7B ఉందిగాని ప్లాట్ ఫాం 7 మాత్రం కనిపించలేదు. భలే చిరాకనిపించింది. రైల్వేలో ఇన్నేళ్ళుగా పనిచేస్తున్న నాకే ఇలా ఉంటే ఇక ఒక మామూలు ప్రయాణీకుడి పరిస్థితి ఏమిటా అని ఆ హడావుడిలో కూడా ఒక ఆలోచన వచ్చింది. రైల్వేని జనం తిడుతున్నారంటే తిట్టరూ మరి !

సరే ఏదైతే అది అవుతుందిలే అని 7A లోకి దిగాను. అక్కడే కదలడానికి సిద్ధంగా ఉంది ఈ పాసింజర్. దానికి ఒక ఏసీ త్రీ టైర్ కోచ్ ఉంటుంది. కానీ అదెక్కడో ముందు ఉంది. నేనేమో గార్డు పెట్టె దగ్గర ఉన్నాను. ఈలోపల బండి కదిలింది. ఇక పరుగు లంకించుకున్నాను. యాక్సిడెంట్ లో దెబ్బతిన్న కుడిమోకాలు కలుక్కుమంది. అయినాసరే, దాన్ని లెక్కచెయ్యకుండా పరుగెత్తుకుంటూ వెళ్లి కోచ్ లో ఎక్కాను. నాందేడ్ లో పనిచేస్తున్న కొందరు స్నేహితులు అందులో కనిపించారు. వాళ్ళతో కాసేపు మాట్లాడి నా బెర్తులో సెటిలై నిద్రకు ఉపక్రమించాను.

ఉదయం 6 కు నాందేడ్ చేరవలసిన బండి 9.30 కి చేరింది. నేను లేచి చూస్తే మాల్ టేక్ది అనే స్టేషన్లో ఆగి ఉంది. అక్కడే దాదాపు రెండు గంటలు ఆగిపోయింది. పక్క స్టేషనే నాందేడ్. చాలామంది జనం దిగి లగేజి తీసుకుని పట్టాల మీద నడుస్తూ రైల్వేని తిట్టుకుంటూ పోతున్నారు. లేచి చూస్తె మా పెట్టె మొత్తం ఖాళీ అయి ఉంది. అందరూ దిగిపోయారు. నేనే మాత్రం చలించకుండా, చేరినప్పుడే చేరుతుందిలే అనుకుంటూ ఆ పెట్టెలో ఒక్కడినే ప్రశాంతంగా కూర్చుని రెండు గంటలు మౌనంగా కాలక్షేపం చేశాను. చివరకు ఉదయం 9.30 కు నాందేడ్ చేరుకున్నాను.

స్టేషన్లోనే ఉన్న మా ఆఫీసుకు వెళ్లి వాకబు చెయ్యగా అక్కడ శర్మగారని మా కొలీగ్ ఆఫీసర్ కనిపించాడు. హోటలుకు వెళ్ళడానికి వెహికిల్ రెడీగా ఉందని అన్నాడు. లేటైనందుకు నొచ్చుకుంటూ, 'టీ కోసం మనిషిని పంపాను. వస్తుంది. కొంచంసేపు కూర్చోండి' అన్నాడు. మళ్ళీ ఆయనకేం అనుమానం వచ్చిందో, 'హోటల్ కెళ్ళి ఫ్రెష్ అయ్యి, అనుష్ఠానం అయ్యాక టీ త్రాగుతారా? లేక పరవాలేదా?' అని అనుమానంగా అడిగాడు.

నా ముఖం చూస్తే పొద్దున్నే లేచి అనుష్ఠానం చేసేవాడిలాగా కనిపిస్తున్నానో ఏమో అనుకుంటూ - 'అబ్బే అలాంటిదేం లేదు. నేనింకా ముఖమే కడగలేదు. కానీ మీరిచ్చే టీ త్రాగే హోటల్ కి వెడతాను' అన్నాను సోఫాలో సెటిలౌతూ.

'మరి అనుష్ఠానమో?' అన్నాడు. పాపం చాలామంది సర్వీసులో ఉంటూ కూడా ఆ మడీ, పూజలూ చేసుకుంటూ ఏదో విధంగా మానేజ్ చేస్తూ ఉంటారు. అలాంటివారిలో ఈయనా ఒకడన్నమాట ! 

ఆయన వైపు చూచి నవ్వుతూ 'అనుక్షణం జరిగేదే అనుష్ఠానం' అన్నాను.

ఆయనకా మాట అర్ధం కాలేదు. అదీగాక ఆయన విపరీతమైన పని హడావుడిలో ఉన్నాడు. అందుకని - 'అలాగా ఓకే సార్' అన్నాడు.

ఈ లోపల టీ వచ్చింది. తాపీగా దానిని సేవించి, కారెక్కి హోటల్ కి బయలుదేరాను.

(ఇంకా ఉంది)
read more " నాందేడ్ యాత్ర - 1 (అనుక్షణం జరిగేదే అనుష్ఠానం) "

జిల్లెళ్ళమూడి స్మృతులు - 31 (మరికొన్ని ఫోటోలు)





















































read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 31 (మరికొన్ని ఫోటోలు) "

జిల్లెళ్ళమూడి స్మృతులు - 30 (కరసేవ)

ట్రెయిన్ లో కూచుని ఉన్న నాకు గత రెండురోజులుగా జిల్లెళ్ళమూడిలో మేము చేసిన కరసేవ గుర్తొచ్చింది.

చాలామంది ఏమనుకుంటారంటే, ఆధ్యాత్మికం అంటే, టిఫిన్ చేసి మళ్ళీ భోజనం చేసే లోపల టీవీలో వస్తున్న ప్రవచనాలు వినడం అనుకుంటారు. ఆధ్యాత్మికం అంటే అది కాదు.

ఆధ్యాత్మికం అంటూ ఊరకే మాటల్లో పెద్ద పెద్ద ప్రసంగాలు చెబితే చాలదు. అది ఉత్తమాటలకు పరిమితమైనదీ కాదు. మన చేతల్లో, మన నిత్యజీవితంలో అది ప్రతిఫలించాలి. అప్పుడే అది నిజమైన ఆధ్యాత్మికత అవుతుంది.

తన అనుచరులు ఆధ్యాత్మిక జ్ఞానఖనులు మాత్రమేగాక, కర్మవీరులుగా కూడా ఉండాలని వివేకానందస్వామి ఆశించారు. నిజమైన యోగి జీవితం అంతరికంగానూ బాహ్యంగానూ కూడా పరిపక్వతను సంతరించుకుని ఉండాలి.

మేం అక్కడున్న రెండురోజులలో కొంత physical service చేస్తామని ఆశ్రమ నిర్వాహకులతో చెప్పాము. కొన్ని కారణాల వల్ల మొదటిరోజున అది కుదరలేదు. రెండవరోజున భోజనశాలలో వడ్డన దగ్గర మనవాళ్ళందరూ పని అందిపుచ్చుకుని చక్కగా పనిచెయ్యడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. అదే విధంగా, అక్కడున్న గ్రౌండ్ లో అందరూ ఇష్టం వచ్చినట్లు పారేసిన కాగితాలను, చెత్తా చెదారాలను అందరం కలసి ఏరిపారేసి శుభ్రం చేశాము. ఈ సారి వచ్చినపుడు ఇలాంటివి Community Works ఏమేమి ఉన్నాయో చెబితే మేము చేస్తామని అక్కడి వారితో చెప్పాము.

జీవితంలో నిస్వార్ధసేవ అనేది చాలా ముఖ్యమని, దానిని మీరంతా మీమీ జీవితాలలో తప్పకుండా ఆచరించాలనీ నా శిష్యులకు నేను చెబుతూ ఉంటాను. పంచవటి ఆశయాలలో ఇది చాలా ముఖ్యమైనది.

లోకంలో అందరూ ప్రతిఫలం ఆశించే ఏ పనైనా చేస్తూ ఉంటారు. కానీ ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని ఆశించేవాడు ప్రతిఫలాన్ని ఆశించకుండా పని చేసేవాడై ఉండాలి. అదే కర్మయోగం అంటే.

మనకు కావలసింది వాచా వేదాంతం కాదు. ఆచరణ వేదాంతం కావాలి. అనుష్టాన వేదాంతం కావాలి. దీనినే శ్రీరామకృష్ణులు వివేకానందస్వామికి బోధించారు. వారు చెప్పిన 'నిస్వార్ధసేవ' అనే దానిని తర్వాతకాలంలో ఇప్పటివరకూ వచ్చిన మహనీయులందరూ అనుసరిస్తూనే ఉన్నారు. వారికి తెలిసినా తెలియకపోయినా, శ్రీరామకృష్ణుల బ్యానర్ క్రింద వారు పని చేసినా చెయ్యకపోయినా, సేవాభావాన్ని ప్రచారం చేస్తున్నవారందరూ శ్రీరామకృష్ణులు, వివేకానందస్వామి చెప్పినదానిని ఆచరిస్తున్నట్లే. దీనినే 'పంచవటి' కూడా పాటిస్తున్నది.

కరసేవలో పాలుపంచుకున్న అందరికీ ఈ సందర్భంగా నా ఆశీస్సులు అందజేస్తున్నాను.





































read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 30 (కరసేవ) "