“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జనవరి 2014, మంగళవారం

సాధనా సమ్మేళనం - కోటప్పకొండ-1



ఇప్పటివరకూ పంచవటి సాధనా సమ్మేళనాలు నాలుగు జరిగాయి. మొదట పూనూరు,రెండు హైదరాబాద్,మూడు మహానంది నాలుగు హైదరాబాద్ లో జరిగాయి.ఇప్పుడు ఐదవ సాధనాసమ్మేళనం కోటప్పకొండ మీద జరిగింది.ఈసారి కొద్దిమందితో మాత్రమే ఇది నిర్వహించబడింది.

నేను,రామన్నగారు,మదన్,రాజు నలుగురమే ఈసారి ఇందులో పాల్గొన్నాము.శనివారం ఉదయం ఏడున్నరకు మొదలైన కార్యక్రమం సోమవారం ఉదయం పదిగంటలకు ముగిసింది.

కోటప్పకొండ నరసరావుపేట దగ్గరలో ఉన్న శైవక్షేత్రం.దీని అసలుపేరు త్రికూటేశ్వర క్షేత్రం.దీనిని త్రికూటాద్రి అనికూడా అంటారు.ఇది దూరంనుంచి చూస్తె అరుణాచలంలాగా ఉంటుంది.ఇక్కడ పరమశివుడు జ్ఞానమూర్తిగా దక్షిణామూర్తి రూపంలో కొలువై ఉంటాడు.అమ్మవారికి ఇక్కడ ప్రత్యెక ఆలయం లేదు.ఇక్కడ మూడుకొండలు కలిసి ఉంటాయి.వీటిని బ్రహ్మ,విష్ణు,రుద్ర శిఖరాలంటారు.


వీటిలో ప్రస్తుతం అందరూ వెళ్ళే ఆలయం ఎడమవైపున ఉండే బ్రహ్మశిఖరం మీద ఉన్నది. ఇక్కడవరకూ రోడ్డుమార్గం ఉన్నది. తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నపుడు కోడెల శివప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఈక్షేత్రం బాగా వృద్ధిలోకి వచ్చింది. రోడ్డునిర్మాణం చేసి పైన మంచి వసతులు కల్పించారు.అంతకు ముందు అయితే కొండకోమ్ముకు ఎక్కాలంటే చాలా కష్టం అయ్యేది.ఇప్పుడు రోడ్డు ఉన్నది కనుక బ్రహ్మశిఖరం వరకూ తేలికగా కార్లలో బస్సుల్లో వెళ్ళవచ్చు.

మూడుకొండలలో కుడివైపున విష్ణుశిఖరం ఉంటుంది.దీనికి కొంచం కిందగా పాపనాశేశ్వరస్వామిగా శివుడు ఉన్నాడు.ఇక్కడకు మెట్లదారి లేదు. రాళ్ళమీదుగా పాకుకుంటూ దట్టమైన చెట్లపొదలలోనుంచి ఒక అరకిలోమీటరు పైకి ఎక్కవలసి ఉంటుంది.దారిలో నరమానవుడు కనిపించడు.గుబురుగా కప్పేస్తున్న చెట్లమధ్యలోనుంచి పాములా పాక్కుంటూ కొండను ఎక్కాలి.

మూడవది మధ్యలో ఉన్న రుద్రశిఖరం.దీనిపైన కొండకొమ్మున పాత శివలింగం ఉన్నది.ఇక్కడకు కూడా మెట్లదారి లేదు.బ్రహ్మశిఖరం వద్దనుంచి రాళ్ళమీదుగా ఎక్కుతూ దాదాపు రెండు కిలోమీటర్లు పైనున్న శిఖరానికి పోవాలి.ఇదీ కష్టమే.పైన ఇప్పుడు ఒక మంటపం కట్టినారు. బ్రహ్మశిఖరం పైన ఉన్న పుట్ట పక్కనుంచి ఎగుడుదిగుడు కాలి బాటలో రాళ్ళమీదుగా నడుస్తూ దూకుతూ పాకుతూ వెళ్ళవలసి ఉంటుంది.

ఉదయం పదిగంటలకు త్రికూటేశ్వర స్వామి దర్శనం చేసుకొని పుట్ట పక్కగా ఉన్న కాలిబాటలోనుంచి రుద్రశిఖరంవైపు ఎక్కడం ప్రారంభించాము.మెట్లు లేవు. రాళ్ళ మీదుగా ఎక్కుతూ పోవాలి. అక్కడక్కడా ఆగుతూ అలుపు తీర్చుకుంటూ నడక సాగించి ఒక గంటన్నర తర్వాత కొండకొమ్ముకు చేరుకున్నాము. నెత్తిమీద ఇసుక బస్తాలు మోసుకుంటూ కొండ కొమ్ముకు వెళుతున్న పనివాళ్ళు మాకు దారిలో కనిపించారు.మామూలుగా నడకే కష్టంగా ఉంటె వాళ్ళు ఇసుక బస్తాలు మోసుకుంటూ కర్రపోటుతో ఎక్కుతున్నారు.అలుపు లేకుండా ఉండటానికి ఫాస్ట్ బీట్ సినిమా పాటలు సెల్ లో వింటూ కొండ ఎక్కుతున్నారు.


'రామేశ్వరం పోయినా ఏదో తప్పనట్లు, నిశ్శబ్దాన్ని కోరుకుంటూ మనం ఇంత ఎత్తుకు వచ్చినా ఇక్కడకూడా సినిమా పాటలు మనల్ని వెంటాడుతూ ఉన్నాయే' అన్నాను.

రాజు కూడా జ్యోతిష్కుడే గనుక వారిని బాగా గమనించి ఇలా అన్నాడు.



'సార్.వీళ్ళ జాతకాలలో శనిబుధుల మధ్యన శుభదృష్టి ఉండి ఉంటుంది. అందుకే ఇలాంటి సినిమా పాటలు వింటూ కాయకష్టంతో కొండ ఎక్కుతున్నారు.పైగా ఈరోజు శనివారం కూడా.'

నేను మెచ్చుకోలుగా అతనివైపు చూచాను.జ్యోతిష్య విద్యార్ధికి ఇలాంటి పరిశీలన చాలా అవసరం.దీనివల్లనే స్ఫురణశక్తి అనేది జ్యోతిష్కునిలో క్రమేణా మేల్కొంటుంది.

'బుధుడే కాదు.శుక్రుడు కూడా కావచ్చు.ఎందుకంటే సినిమా పాటలకు శుక్రుడే కదా కారకుడు' అన్నాను.

ఇంతలో ఒకతను తన సెల్ లో శివస్తోత్రాలు వింటూ కొండ ఎక్కుతూ కనిపించాడు.అతన్ని గమనించి ఇలా చెప్పాను.
'రాజు.ఇతని జాతకంలో గురు సంబంధం కూడా ఉండి ఉంటుంది. ఎందుకంటే మిగతా వాళ్ళు చెత్త పాటలు వింటున్నారు.ఇతనొక్కడే భక్తి పాటలు వింటున్నాడు.ఈ తేడాను గమనించావా?' అడిగాను.

అవునంటూ రాజు తలూపాడు.

అలుపు తీర్చుకోవడానికి ఒకచోట కూచున్నాము.


'సార్.త్రికూటం గురించి కొంచం చెప్పండి' మదన్ అడిగాడు.

'మదన్.కంఠం పైది వాగ్భవకూటం. కంఠంనుంచి కటివరకూ కామరాజ కూటం. కటినుంచి క్రింద శక్తికూటం. 'శ్రీమద్వాగ్భవకూటైక స్వరూప ముఖపంకజా, కంఠాధ కటిపర్యంత మధ్యకూట స్వరూపిణీ,శక్తికూటైకతాపన్న కట్యధోభాగధారిణీ మూలమంత్రాత్మికా మూలకూటత్రయ కళేబరా' అనే లలితానామాలు దీనినే సూచిస్తున్నవి.

శిరస్సుపైది అంబరం.అక్కడ అంతా శూన్యమే.త్రికూటమనబడే భ్రూమధ్యం లోనే ఇడాపింగళా సుషుమ్నానాడులు కలుస్తాయి.అదే త్రివేణీ సంగమం. అక్కడనుంచే కోటి కోరికలు పుట్టుకొస్తాయి.అందుకే 'త్రికూటా కామకోటికా' అని కూడా లలిత అంటుంది.'

'త్రికూటేశ్వరుడు అంటే మూడు కూటములకూ అధిపతి అని అర్ధమా?' అడిగాడు మదన్.

'అంతేగా మరి.ఈ శబ్దం త్రిగుణాతీత పరబ్రహ్మ వాచకం.త్రికూటేశ్వరుడు అనే పేరు క్రమేణా రూపాంతరం చెంది కోటేశ్వరుడు అయింది.అదే కోటప్పకొండ లేదా కోటయ్యకొండ అయింది.గుంటూరు జిల్లాలో తరచుగా వినిపించే కోటేశ్వరరావు అనే పేరు ఇదే.' అన్నాను.

ఈ ఆలయాల గురించి ఒక గాధ వినిపిస్తుంది.అందరూ చెప్పే కధ ఏమంటే,ఇక్కడ గొల్లభామ అని ఒకామె ఉండేది.ఆమె ఈ కొండమీద మేకలు కాచుకుంటూ ఉండేది.శిఖరం మీద ఉన్న శివునికి ఈమె రోజూ పాలు ఇస్తూ ఉండేది.కాలక్రమేనా ఈమెకు వివాహమై గర్భం దాల్చింది.కనుక కొండ ఎక్కలేక శివుడినే క్రిందకు వచ్చి నేలమీద ఉండమని కోరుకున్నది.ఆయన సరేనని ఒక నియమం పెట్టినాడు.

నీవు వెనక్కు తిరిగి చూడకుండా కొండ దిగి వెళుతూ ఉండు.నేను నీ వెనుకే నడుస్తూ వస్తుంటాను.నీవు వెనక్కు తిరిగితే మాత్రం అక్కడే నేను ఉండిపోతాను అని చెప్పినాడు.ఆమె సరే అని కొండ దిగుతూ ఉన్నది. వెనుకనుంచి ఏవేవో భయంకరమైన శబ్దాలు వినిపిస్తుంటే ఏమిటా అని వెనక్కు తిరిగి చూచింది.అప్పటికి వాళ్ళు రుద్రశిఖరం పైనుంచి బ్రహ్మశిఖరం వరకూ వచ్చినారు.ఆమె వెనక్కు తిరిగి చూచింది గనుక అక్కడే శివుడు లింగరూపం ధరించి శిల అయిపోయినాడు.అని ఒక గాధ వినిపిస్తుంది.

మన పురాణాలు,ప్రాంతీయ కథలలో చరిత్రా,మార్మిక విషయాలూ,ప్రాంతీయ నమ్మకాలూ అన్నీ కలగలసి ఏది ఏదో చెప్పలేనంతగా పెనవేసుకుని ఉంటాయి.అందుకే వీటిలో ఏది నిజమో ఏది కాదో చెప్పలేము.కాకుంటే కొంత ప్రయత్నం చెయ్యవచ్చు.

శివుడు మానవనేత్రాలకు కనిపించటం దుర్లభం. కొండకొమ్ము మీద తపస్సులో ఉన్న శివునికి గొల్లభామ రోజూ పాలు సరఫరా చెయ్యడం అనేది సంభవం కాదు.పరమశివునికి పాలు అవసరం లేదు.కాకపోతే ఒకటి జరిగి ఉండవచ్చు.పాతకాలంలో రుద్రశిఖరం మీద ఒక యోగి తపస్సు చేసినాడని అంటారు.ఈ కొండశిఖరం మీద తపస్సు చేసిన యోగీశ్వరుడిని ఈమె మేకలు కాచుకునే సమయంలో చూచి అతనికి ఆహారంగా మేకపాలను ఇచ్చి ఉండవచ్చు.పాతకాలంలో ఇలాంటి అమాయక భక్తులు ఎందఱో ఉండేవారు. బుద్ధునికి కూడా సుజాత అనే యువతి పాయసాన్ని ఇచ్చినట్లు గాధ ఉన్నది. అలా రోజూ చేస్తూ ఉండగా కొన్నాళ్ళకు ఈమె కొండ ఎక్కలేని పరిస్తితిలో ఉన్నపుడు ఆయననే క్రిందకు వచ్చి ఉండమని కోరి ఉండవచ్చు.


సామాన్య జనసహవాసాన్ని తట్టుకోలేని ఆయన పూర్తిగా కిందకు రాకుండా బ్రహ్మశిఖరం వరకూ వచ్చి అక్కడే కొంతకాలం తపస్సులో ఉండి తన శరీరాన్ని వదలిపెట్టి శివైక్యం చెంది ఉండవచ్చు.ఆ సమాధిమీద శివలింగప్రతిష్ట జరిగి ఉండవచ్చు. ఎందుకంటే శైవంలో మహనీయుల సమాధులమీద శివలింగాన్ని ప్రతిష్టించడం ఆచారంగా ఉన్నది. కాలక్రమేణా ప్రాంతీయగాధలు దీనితో కలసిపోయి ఇప్పుడు మనం వినే కధ రూపుదిద్దుకుని ఉండవచ్చు.

ఇలా మాట్లాడుకుంటూ దాదాపు 1500 అడుగుల ఎత్తున ఉన్న రుద్రశిఖరం చేరుకున్నాము. అక్కడనుంచి చూస్తె చుట్టుపక్కల ఎన్నో ఊళ్లు కనిపిస్తున్నాయి. పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న నరసరావుపేట కూడా దూరంగా కనిపిస్తున్నది.శిఖరం పైన ఒక చిన్న దేవాలయమూ అందులో శివలింగమూ ఉన్నాయి.అక్కడ ఒక మంటపం నిర్మాణంలో ఉన్నది. దానికోసమే పనివాళ్ళు క్రిందనుంచి ఇసుక బస్తాలు మోసుకొస్తున్నారు.

అంతపైకి ఎక్కి వచ్చినందుకు బాగా అలుపు వచ్చింది.మంటపంలో కూలబడ్డాము.


ఆ మంటపంలో నల్లగా తుమ్మమొద్దులా ఉన్న ఒక కాంట్రాక్టర్ కామోసు కూచుని ఉన్నాడు.అతను కూడా సినిమా పాటలు సెల్ లో పెట్టుకుని వింటున్నాడు.'హతోస్మి' అనిపించింది.'ఇంత ఎత్తుకు ఎక్కి వస్తే ప్రశాంతతను భగ్నం చేస్తూ ఇక్కడ కూడా తయారయ్యావా నాయనా?' అనుకున్నాను.

కాసేపు అక్కడ కూచున్న తర్వాత 'లోపలకు వెళ్లి శివలింగాన్ని దర్శనం చేసుకోండి.మీకు వీలైతే అభిషేకం కూడా మీరే చేసుకోవచ్చు' అని ఆ కాంట్రాక్టర్ అన్నాడు.

లోనికి వెళ్లి చూద్దామని లేచాను.

'చొక్కా విప్పి లోపలకు వెళ్ళాలి' అని కాంట్రాక్టర్ అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

'పంచె ఏం పాపం చేసింది?' అన్న మాట నా నోటివరకూ వచ్చి ఆగిపోయింది.

అతనికి ఏమీ సమాధానం చెప్పకుండా చొక్కాతోనే లోపలకు వెళ్లి లింగానికి తలను తాకించి ప్రణామం చేసి బయటకు వచ్చాను.కాంట్రాక్టర్ ఏదో గొణగడం లీలగా వినిపిస్తున్నది.అతని ముఖం చూస్తె నామీద బాగా కోపం వచ్చినట్లు అర్ధమైంది.

'చెప్పినా కూడా వినకుండా చొక్కాతోనే లోపలికి వెళుతున్నాడు.చూడబోతే పెద్దాయనలాగా ఉన్నాడు. ఏంటిది?'అని విసుక్కున్నాడని తర్వాత క్రిందకు దిగేసమయంలో రాజు మాతో అన్నాడు.నవ్వుకున్నాను.మొత్తానికి కొండకొమ్ముమీద ప్రశాంత మౌనధ్యానంలో గడపవలసిన సమయం అనవసరమైన మాటలలో వృధా అయిపోయింది.

చాలాసార్లు ఇలాగే అవుతూ ఉంటుంది.అత్యున్నతమైన దాని పక్కనే అతి నిమ్నమైనదీ ఉంటుంది. నిధిని చుట్టుకొని విషసర్పం ఉన్నట్లు.

'కొండ పక్కనే లోయ ఉంటుంది' అని చైనీస్ తత్వవేత్త లావోజు అంటాడు.భగవంతుని ముఖద్వారం లో కూడా మనకోసం సైతాన్ ఎదురు చూస్తూనే ఉంటాడు.చాలామంది సత్యానికి ఒక్క అడుగు దూరంలోకి వచ్చి అక్కణ్ణించి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారు.ఇది లోక సహజమే.

అయితే శబ్దం నిశ్శబ్దాన్ని భగ్నం చెయ్యలేదు.దానికి ఆధారమైన ఆకాశాన్ని అదేం చెయ్యగలదు?శబ్దం కొంచంసేపు ఉండి తర్వాత లయిస్తుంది. దానిముందూ వెనుకా కూడా స్థిరంగా నిలిచి ఉండేది నిశ్శబ్దమే.అంతరిక నిశ్శబ్దం అనుభవంలో ఉన్నవారిని బయటి శబ్దాలు ఏమీ చలింపచెయ్యలేవు.


ఇంకాసేపు అక్కడే కూచుని క్రిందకు దిగడం మొదలుపెట్టాము.మదన్ చెప్పులు వేసుకుని రాలేదు. దిగేటప్పుడు కోసు రాళ్ళు కాళ్ళకు గుచ్చుకుని చాలా బాధ పడ్డాడు.అందుకని నా చెప్పులు అతనికిచ్చాను.కొండరాళ్ళమీద నడిచేటప్పుడు అడుగులు వెయ్యడంలో కొన్ని టెక్నిక్స్ ఉంటాయి.అవి పాటించకపోతే కాళ్ళు బొబ్బలు వస్తాయి.లేదా స్లిప్ అయి కిందపడే ప్రమాదం ఉంటుంది.అయితే ఎక్కేటప్పుడు ఉన్న అలుపు దిగేటప్పుడు లేదు.క్రిందకు దిగేటప్పుడు పాటలు వినిపించ లేదు.ఎందుకంటే పనివాళ్ళు మూటలు పైన పడేసి వెంటనే క్రిందకు వెళ్ళిపోయారు.అప్పుడు రాజుతో ఇలా చెప్పాను.

'రాజు.ఇందాక మనం కొండ మీదకు ఎక్కేటప్పుడు బుధహోర నడుస్తున్నది. కనుక ఆ చెత్త పాటలు వినిపించాయి.ఇప్పుడు బుధహోర అయిపొయింది. చంద్రహార నడుస్తున్నది.శనిలో చంద్రుడు అంటే వైరాగ్యం,నిశ్శబ్దం.అందుకే ఆ పనివాళ్ళు ఇప్పుడు ఎవరూ మనకు తారసపడటం లేదు.మనం కూడా పూర్తి నిశ్శబ్దంగా వైరాగ్య భావాలతో నడక సాగిస్తున్నాం.'

'అవును సార్.హోరలు చాలా బాగా పనిచేస్తాయి.ఇంతకూ ముందు కూడా మీరు హోరలను ఉపయోగించి మంచి మంచి ప్రిడిక్షన్స్ ఇవ్వడం నేను గమనించాను.' అన్నాడు.


'అవును రాజు.వాడుకోవడం తెలిస్తే హోరలు చాలా బాగా ఉపయోగిస్తాయి.' అన్నాను.

బ్రహ్మశిఖరం వరకూ దిగేసరికి మధ్యాన్నం రెండు అయింది.అక్కడ ఉన్న ఏకైక హోటల్లో ఏదో భోజనం చేశామనిపించి గదులకు బయల్దేరాము.కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని సాయంత్రం నాలుగుకు లేచి మళ్ళీ సంచారానికి బయలుదేరుదామని  అనుకుని నిద్రకు ఉపక్రమించాము.

(ఇంకా ఉంది)
read more " సాధనా సమ్మేళనం - కోటప్పకొండ-1 "

27, జనవరి 2014, సోమవారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది -4

ఒకసారి బ్రహ్మంగారు నంద్యాలలో పర్యటిస్తూ ఉన్నపుడు కంసాలి వీధిలో తన శిష్యులతో నడచి వెళుతున్నారు. ఆయనకు దాహం వేసి మంచినీళ్ళు అడిగారు.వాళ్ళు కరిగిన బంగారాన్ని తాగమని ఇచ్చినారు సార్.అప్పట్లో నంద్యాల అంతా సస్యశ్యామలంగా ఉండేది.అందరూ ధనమదంతో విర్రవీగుతూ ఉండేవారు. ఆయన్ని ఎగతాళి చెయ్యడానికి కరిగిన బంగారాన్ని త్రాగమని ఇచ్చినారు.పొగలు కక్కుతున్న ఆ బంగారాన్ని ఆయన గుటుక్కున త్రాగేసి ఏమీ జరగనట్లుగా తన శిష్యులతో నడచి వెళ్ళిపోయాడు.

'ఇదే మహిమను ఆదిశంకరులూ,త్రైలింగ స్వామీ కూడా చేసినారని కధలున్నాయి' అన్నాను.

'అదేమో నాకు తెలియదు సార్.ఇది మాత్రం నంద్యాలలో జరిగింది.బ్రహ్మంగారు చేసినారు.ఇంకొక మహిమ కాళికామాత ఆలయంలో చేసినాడు' అన్నాడు.

'ఈ ఊరిలో కాళికామాత ఆలయం ఉన్నదా?' అడిగాను.

'ఎందుకు లేదు సార్? ఈ ఊరికి రక్షాదేవత కాళీమాతనే.అయిదువందల ఏండ్ల క్రితం ఈ ఊరిని నందిమహారాజు పరిపాలించే సమయంలో ఈ ఊరి చుట్టూ పెద్ద అగడ్త ఉండేది.అందులో మొసళ్ళు ఉండేవి.ఆ కందకం బయటగా కాళీమాత ఆలయం ఉండేది.ఇప్పుడైతే అది ఊరిమధ్య అయిపొయింది.రాజు యుద్దానికి వెళ్ళేటప్పుడూ వచ్చేటప్పుడూ కాళీమాతను పూజించేవాడు.' అన్నాడు.

'కాళీమాత ఆలయంలో బ్రహ్మంగారు చేసిన మహిమ ఏమిటి?' అడిగాను.

'ఒకసారి ఆయన ఒక పదిమంది శిష్యులతో ఈ ఊరికి వచ్చినాడు సార్.మధ్యాన్నం భోజనానికి ఎవరినో అడిగినారు.వారు ఈయన్ను పరీక్షించాలని 'సరే మీరు స్నానం చేసుకుని రండి.ఈలోపల భోజనాలు సిద్ధం చేస్తాము'అని చెప్పినారు.వారు స్నానసంధ్యలు చేసుకొని వచ్చేసరికి ఏభైమందికి సరిపడా అన్నం వండించి కుప్పపోసి పెట్టినారు.

'తినండి' అని ఆయన్ను చాలెంజ్ చేసినారు.

బ్రహ్మంగారు వారి కుయుక్తిని గ్రహించి ' ఈ అన్నం అంతా నా శిష్యుడు సిద్దయ్య ఒక్కడికే చాలదు.మిగిలిన వారికి ఏమి పెడతారు?' అని అడిగినాడు.

వారు ఎగతాళిగా నవ్వుతూ 'ఏభై మందికి వండిన అన్నం ఒక్కడికే చాలదా? తినమనండి చూద్దాం" అనినారు.

అప్పుడు బ్రహ్మం గారు ఆజ్ఞాపించగా సిద్దయ్య కాళీమాతను మదిలో స్మరించి ఆ కుంభం ముందు కూర్చోనగా అతన్ని ఆవహించిన కాళికాశక్తి ఆ అన్నకుంభం మొత్తం అమాంతం ఆరగించి ఇంకా చాలక 'ఆకలి ఆకలి' అని పెడబొబ్బలు పెట్టసాగింది.అది చూచిన ఆ ప్రజలు భయంతో గడగడా వణికిపోయి బ్రహ్మంగారి కాళ్ళమీద పడి క్షమించమని వేడుకున్నారు.

అప్పుడు బ్రహ్మంగారు 'అల్పులారా! మావంటివారిని మీరు పరీక్షించ తగునా? తప్పుకదా?' అని బుద్ధి చెప్పి, తన కమండలంలోని నీటిని సిద్ధయ్యమీద చల్లి 'అమ్మా!ఇక సిద్ధయ్యను వదలిపెట్టు' అని ప్రార్ధించగా అతన్ని ఆవహించిన కాళికాదేవి వదలి వెళ్ళిపోయింది. అప్పుడు సిద్దయ్య శాంతించాడు సార్.ఇది నిజంగా జరిగిన మహత్యం.ఇప్పటికీ దీనిని నంద్యాలవాసులు కధగా చెప్పుకుంటారు.' అన్నాడు.

అయితే ఈ సారి వచ్చినపుడు అమ్మ దర్శనం చేసుకోవాలి అనుకుంటూ దేవాలయం ఎక్కడ ఉంటుందో అడ్రస్ అడిగి తెలుసుకున్నాను.

ఇలా మాట్లాడుకుంటూ, మాటల్లోనే శ్రీశైలం చేరుకున్నాము.దారిలో ఒకచోట మల్లయ్య మాకోసం వేచిఉన్నాడు. అతన్ని కార్ ఎక్కించుకొని బయల్దేరాము.దారిలోనే కమీషనర్ గారి ఇల్లు ఉన్నది.పలకరించి వెళదాం అని మల్లయ్య అన్నాడు.సరే అని అటు దారి తీశాము.

మేం వెళ్లేసరికి ఆయన తోటపనిలో ఉన్నాడు.దగ్గరుండి మొక్కల పని చేయిస్తున్నాడు.కుశల ప్రశ్నలు అయ్యాక కూర్చుని టీ తాగుతూ ఉండగా 'మీకు గార్డెనింగ్ అంటే బాగా ఇష్టంలా ఉన్నది' అన్నాను.

అవునండి.ఎక్కడెక్కడి నుంచో నాకిష్టమైన మొక్కలు తెప్పించి పెంచుతూ ఉంటాను.' అన్నాడాయన. చుట్టూ చూస్తె దానికి తార్కాణంగా రకరకాల మొక్కలు తోటలో కనిపించాయి. వాటిలో కొన్నింటిని బొమ్మూరు నర్సరీ నుంచీ, ఇంకోన్నింటిని వేరే నర్సరీల నుంచీ, మరి కొన్నింటిని శ్రీశైలం అడవిలోనుంచీ తెప్పించానని ఆయన చెప్పాడు.

'ఇది బ్రహ్మకమలం.ఏడాదికి ఒకసారి పూస్తుంది.దీనిని హిమాలయాల నుంచి తెప్పించాను.'అంటూ ఒక మొక్కను చూపించాడు.అది కేక్టస్ జాతికి చెందిన మొక్కలాగా కనిపించింది.నీటిని బాగా నిలువచేసుకునే జాతి మొక్క అది.దాని కొమ్మను తుంచి ఇంకొకచోట పెట్టినా అది చెట్టుగా మారుతుందని చెప్పాడాయన.కొమ్మనుంచి ఆకులోకి వచ్చిన దాని నరాలు కూడా బలంగా బాగా ఉబ్బి కనిపిస్తున్నాయి.ఆ మొక్కను చూస్తూనే దాని ఆకారాన్ని బట్టి అది గురుగ్రహ అధీనంలో ఉన్నదని నాకర్ధమైంది.గురువుకు 'జీవుడు'అని ఇంకొక పేరు.అందుకే దీనికి కూడా జీవశక్తి అధికంగా ఉన్నది.'అనుకుంటూ తలపంకించాను.ఆయన హాబీని అభినందించాను.

'చాలామంది మా ఇంట్లో బ్రహ్మకమలం ఉన్నది అనీ అది పూసింది రండి చూద్దురుగాని' అనీ అనడం నేను విన్నాను.కొంతమంది అదేపనిగా వెళ్లి దానిని చూడడమూ నాకు తెలుసు.బ్రహ్మకమలం తోటలో ఉంటె చాలదు.ప్రతిమనిషిలోనూ బ్రహ్మకమలం ఉన్నది.నీలో ఉన్న బ్రహ్మకమలాన్ని నీవు దర్శించాలి.అదే అసలైన విషయం.

తోటలో బ్రహ్మకమలం ఉన్నా ముళ్ళచెట్టు ఉన్నా నీకేమీ ఉపయోగం లేదు.మహా అయితే ఫోటోలు తీసి నలుగురికీ చూపడానికి పనికొస్తుంది. ఇంటికొచ్చిన గెస్ట్ లకు చూపితే వారు ముక్కుమీద వేలేసుకుని 'ఇదేనా బ్రహ్మకమలం?'అని ఆశ్చర్యపోవడానికి పనికొస్తుంది.కాని దానివల్ల ఇసుమంతైనా ఉపయోగం లేదు.

ఈ ఆలోచనలో ఉన్న నా మనసులో ఒక పద్యం ఆశువుగా పుట్టుకొచ్చింది.

ఆ||బ్రహ్మకమలమంచు భేషజంబది యేల
పత్ర పుష్పములను పొగడనేల
కమలమందు వెలయు కైవల్యమెరుగరా
బాహ్యదృష్టి మీరి బ్రహ్మమందు

అసలైన బ్రహ్మకమలం మనిషి లోపల ఉన్నది.దానిని దర్శించే సులువును మనిషి తెలుసుకోవాలి.ఏడాదికి ఒకసారి పుష్పించే దాని రహస్యం ఏమిటో మానవుడు గ్రహించాలి.

ఈలోపల కమీషనర్ గారు ఆలయసిబ్బందికి ఫోన్ చేసి ఫలానావాళ్ళు వస్తున్నారు.దగ్గరుండి దర్శనం చేయించండి.అని ఆదేశాలు జారీ చేశాడు.ఫోన్ పెట్టేసి నావైపు తిరిగి ఇలా అన్నాడు 'ఇక్కడ ఎవరైనా సరే శివలింగాన్ని తాకవచ్చు.కాని కాలక్రమేణా ఎవరుబడితే వారి చెమట తాకడంవల్లా,పాలతో అభిషేకం చేస్తున్నప్పుడు అందులోని కెమికల్స్ తాకడంవల్లా శివలింగం పాడైపోతున్నది.కనుక వెండిగాని బంగారుగాని కవచం చేయించి అందరూ శివలింగాన్ని తాకడం ఆపుదామని ఆలోచిస్తున్నాము.'

దానికి నేనేమీ జవాబు చెప్పలేదు.ఆయనకు థాంక్స్ చెప్పి గెస్ట్ హౌస్ కి దారితీశాము.కాసేపు అక్కడ ఫ్రెష్ అయ్యి సోఫాలో కూలబడుతుండగా 'టీవీ పెట్టమంటారా?' అడిగాడు అటెండర్.

'వద్దు' అన్నాను.

'పోనీ ఏసీ వెయ్యమంటారా?' అడిగాడు.

'అదీ వద్దు'అన్నాను.

అతను వింతగా చూచాడు.

'అదేంటి సారూ.ఇక్కడికి వచ్చేవాళ్ళు లోపలి వచ్చీరాకముందే ఏసీ వెయ్యి టీవీ పెట్టు అంటారు.మీరు వద్దంటున్నారు?' అన్నాడు విచిత్రంగా చూస్తూ.అంటూనే ఏసీ ఆన్ చేసి అక్కణ్ణించి వెళ్ళిపోయాడు.

నేనేం జవాబు చెప్పలేదు.కాసేపు ఆ ఏసీలో ఆ సోఫాలలో కూచునేసరికి ఏదో కృత్రిమంగా అనిపించి ఒళ్లంతా కంపరం పుట్టింది.వెంటనే బయటకొచ్చి మెట్లమీద ఎండలో హాయిగా కూచున్నాను.

'అదేంటి సార్.లోపల హాయిగా ఏసీలో కూచోక ఇక్కడ కూచున్నారు?'అని మావాళ్ళు అడిగారు.ఇక అడుగువేసి అడుగుతీసిన ప్రతిదానికీ ఏమని జవాబులు చెప్తూ కూచునేది?అందుకని ఏం మాట్లాడకుండా నవ్వి ఊరుకున్నాను.

ఆ తర్వాత దేవాలయానికి వెళ్ళడమూ యధావిధిగా దర్శనం చేసుకోవడమూ జరిగిపోయాయి.'శ్రీవిద్య' శుద్దోపాసనను పద్యరూపంలో అనుగ్రహించినందుకు లోపాముద్రాదేవికీ, అమ్మవారికీ, పరమేశ్వరునికీ మనస్సులో ప్రణామాలు అర్పించాను.శ్రీశైల దేవాలయంలో నాకిష్టమైన కొన్ని ప్రదేశాలున్నాయి.అక్కడ ప్రశాంతంగా కూచుని వేరే వాళ్లకు అనుమానం రానిరీతిలో నాపని పూర్తి చేశాను.

అర్ధం చేసుకోలేని మనుష్యులు వెంట ఉన్నప్పుడు ప్రతిదీ ఒక విసుగు అవుతుంది.కానీ తప్పదు.మనల్ని అర్ధం చేసుకుని మౌనంగా అనుసరించేవారు దొరకడం నిజంగా ఒక అదృష్టమే.ఆ అదృష్టం గొప్పగొప్ప యోగులకు కూడా దక్కదు.వారికీ అనుక్షణం ఏదో ఒక చికాకు ఉంటూనే ఉంటుంది.అలా మాటమాటికీ విసిగించే మనుషులూ పరిస్థితులూ వారికీ అనుక్షణం ఎదురౌతూనే ఉంటాయి.ఇక మనమెంత?

కార్యక్రమాలు అన్నీ అయిన తర్వాత వెనక్కు బయలుదేరాము.దగ్గరలోని ఒక గెస్ట్ హౌస్ నుంచి కింద నదీ డ్యామూ చాలా మంచి వ్యూ ఉంటుంది.అక్కడకు వెళ్లి కొన్ని ఫోటోలు దిగాము.శ్రీశైలంలో రైల్వే గెస్ట్ హౌస్ నిర్మాణంలో ఉన్నది.దానిని కూడా చూద్దామని అక్కడకు వెళ్ళాము. 

రామమూర్తి ఇలా అన్నాడు.

'సార్.ఇక్కడ మనవైపునుంచి లైజాన్ ఆఫీసర్ గా ఉండమని నన్ను అడిగినారు.కాని నేను ఒప్పుకోలేదు.'

'ఎందుకు?మీకు కూడా ఇక్కడ ఉండటం ఇష్టమే కదా?'అడిగాను.

'ఒక్క సమస్య ఉన్నది సార్.నేను ఇక్కడకు వస్తే నా జీతం తగ్గిపోతుంది.'

'తగ్గితే ఏమి?మీకు ఇష్టమైన పని చెయ్యడంలో ఆనందం ఉంటుంది కదా?పైగా మీరు సర్వీస్ చివరికి వచ్చిఉన్నారు కూడా?' అడిగాను.

'అదికాదు సార్.ప్రస్తుతం నాకు ఏభైవేలు జీతం వస్తుంది.అందులోనుంచి ప్రతినెలా పాతికవేలు ఖర్చుపెట్టి అయిదుగురు అనాధ పిల్లలను చదివిస్తున్నాను.ఈ విధంగా గత ఇరవై ఏళ్ళనుంచీ నా జీతంలో సగం ఖర్చు చేసి పేద పిల్లలను చదివించడం ఒక సాధనగా చేస్తున్నాను.నేను జీవితంలో ఏదన్నా మిగుల్చుకుంటే ఈ పుణ్యమే సార్.ఇప్పుడు ఆ పిల్లలు కాలేజీకి వచ్చి ఉన్నారు.అర్ధాంతరంగా నేను సాయం చెయ్యడం ఆపితే వాళ్ళ జీవితాలు చెదిరిపోతాయి.అందుకని వాళ్ళ చదువు అయిపోయి ఉద్యోగాలు సంపాదించుకుని వాళ్ళ కాళ్ళమీద వాళ్ళు నిలబడితే అప్పుడు నేను ఉద్యోగానికి రిజైన్ చేసి ఇక్కడ వచ్చి సెటిలై పోతాను సార్.మీరు నమ్ముతారో లేదో? ఇప్పటికీ నాకు సైకిల్ కూడా లేదు సార్.'అన్నాడు రామ్మూర్తి.

ఒక్క క్షణం అతని వైపు చూచాను.నా కళ్ళు అప్రయత్నంగా చెమర్చాయి.

అతను నా దృష్టిలో అమాంతం ఎదిగిపోయి ఎంతో ఉన్నతంగా కనిపించాడు.

'నీ అభిప్రాయాలు ఏమైతేనేమి?నీ ఆలోచనలు ఏమైతేనేమి?ఆధ్యాత్మికం అంటే నీకు సరియైన అవగాహన ఉంటేనేమి?లేకుంటేనేమి?కాశినాయనను నీవు సరిగ్గా అర్ధం చేసుకుంటే ఏమి?చేసుకోకపోతేనేమి?ఆయన చెప్పిన పనిని నీవు తూచాతప్పకుండా చేస్తున్నావు.నీ అవసరాలు మానుకొని ఇంకొకరి ఉన్నతి కోసం నీవు పాటుపడుతున్నావు.నీవు వివేకానందస్వామి అడుగుజాడలలో నడుస్తున్నావు.మహనీయుల కటాక్షం నీమీద కాకుంటే ఇంకెవరిమీద ఉంటుంది?కాశిరెడ్డినాయన  అనుగ్రహానికి ఇంతగా నీవు పాత్రుడవయ్యావంటే ఇదన్నమాట అసలు కారణం?' అనుకున్నాను.

ఒక మనిషికి కోటిరూపాయలు ఉంటే,ఒక వంద దానం చెయ్యడం పెద్ద గొప్ప విషయం ఏమీ కాదు.కాని అందులోనుంచి ఒక ఏభైలక్షలను నిస్వార్ధంగా ఒక పనికి ఖర్చు చెయ్యడం గొప్ప.ఆ విధంగా ఏళ్ళ తరబడి చేస్తూనే ఉండటం అసలైన గొప్పవిషయం.తన అవసరాలు మానుకుని చెయ్యడం ఇంకా గొప్ప విషయం.

మహామహా కోటీశ్వరులు అతి పిసినారులై వాళ్ళవాళ్ళ సుఖాలకీ విలాసాలకీ మాత్రం కోట్లు ఖర్చు చేసుకుంటూ,సాటి మనిషి ఆకలిని పట్టించుకోని ఈ లోకంలో ఒక సామాన్య ఉద్యోగి తన జీతంలో నుంచి సరిగ్గా సగభాగం గత ఇరవై ఏళ్ళనుంచీ అజ్ఞాతంగా ఒక మంచిపని కోసం వెచ్చిస్తున్నాడంటే ఎంత గొప్ప విషయం?

చాలామందికి రైల్వే అంటే లంచగొండులైన టీటీయీలూ రిజర్వేషన్ క్లార్కులూ గుర్తొస్తారు.కాని ఇలాంటి ఉదాత్తులైన ఉద్యోగులు కూడా రైల్వేలో ఉన్నారు.కాని వాళ్ళు అజ్ఞాతంగా ఉంటారు.వారికి లోకం మెప్పు అవసరం లేదు.దైవం మెప్పు ఉంటె వారికి చాలు.రామ్మూర్తే దీనికి ఉదాహరణ.

లోకం మెప్పు పొందటంలో ఏ ఉపయోగమూ లేదు.అది నిలిచేదీ కాదు.దైవం మెప్పును నీవు పొందాలి.అది శాశ్వత ఫలితాన్ని ఇస్తుంది.దానికి టాంటాం అవసరం లేదు.లోకంలో గొప్ప పనులు నిశ్శబ్దంగానే జరుగుతూ ఉంటాయి.తెలియనివారు ఊరకే గోల చేస్తుంటారు.తెలిసినవారు మౌనంగానే ఉంటారు.

వివేకానందస్వామి ఒక మాట అనేవారు.

'నలుగురూ చూస్తున్నపుడు వాళ్ళ మెప్పుకోసం ఒక గొప్ప పనిని చెయ్యడంలో ఘనత లేదు.నిత్యజీవితంలో ఎవ్వరూ నిన్ను గమనించడం లేదు అన్నటువంటి పరిస్థితిలో కూడా నీవు ఉదాత్తమైన జీవితం గడపగలిగితే అదీ నిజమైన ఘనత.'

ఒక మనిషిలోని ఆలోచనలూ అభిప్రాయాలూ అలవాట్లూ ప్రధానం కాదు. అతనిలో ఉన్న ఆచరణాత్మకమైన మంచితనమే అత్యంత ముఖ్యమైన విషయం.అంతర్దృష్టి ఉన్నవారు దానినే గమనిస్తారు.విలువిస్తారు.అంతేగాని పైపై వేషాలకు వారు ఏమాత్రం విలువను ఇవ్వరు.

'మల్లయ్యా.ఈసారి వచ్చినపుడు అక్కమహాదేవి తపస్సు చేసిన గుహలు చూడాలి' అన్నాను.

'తప్పకుండా చూద్దాం సార్.తీసుకువెళతాను' అన్నాడు తను.

వచ్చిన పని పూర్తయింది.తిరుగు ప్రయాణంలో నంద్యాల వెళ్ళకుండా, మార్కాపూర్ స్టేషన్ లో దిగి గుంటూరు వెళ్ళే రైలెక్కాము.

(సంపూర్ణం)
read more " శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది -4 "

20, జనవరి 2014, సోమవారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది -3

'ఒక్కొక్క సారి ఆయన జోలెలో నుంచి ఒక రూపాయి తీసి ఇచ్చేవాడు సార్.ఆ రూపాయిని బీరువాలో జాగ్రత్తగా ఉంచుకొని దాచుకున్న వారు నేడు కోటీశ్వరులైపోయారు.అలాంటి వాళ్ళు ఎందఱో ఉన్నారు.నాకూ ఒకరోజున తన జోలేలోనుంచి ఒక రూపాయిబిళ్ళను తీసి ఇచ్చినాడు సార్.దానిని ఇంట్లోనే జాగ్రత్తగా ఉంచినాను.కానీ ఇంట్లో వాళ్ళు ఏదో పనికి దానిని వాడేసినారు.అది ఇంట్లోనుంచి వెళ్ళిపోయింది.' అన్నాడు.

నాకు ప్రయాణం అంతా భలే వినోదమే అనుకున్నాను.అమ్మ నాకోసం ఇలాంటి ఏర్పాట్లు ఎప్పుడూ చేస్తూనే ఉంటుంది.

ఒక సద్గురువును ఇలాంటి నాసిరకం మహాత్యాలతో లెక్కిస్తారు తెలియనివారు. షిరిడీ సాయిబాబాని కూడా ఇదే పనిచేశారు.ఒక గురువుని సరిగ్గా అర్ధం చేసుకోవడం ఎప్పుడైనా సరే అతికొద్దిమందికే సాధ్యమౌతుంది. ఎందుకంటే,దానికి మన మనస్సులో ఉండే కుళ్ళును,మన ఆలోచనా విధానాలను,మన ఆశలను,మన ద్వేషాలనూ,మన సంకుచిత మనస్తత్వాలనూ పక్కన పెట్టి ఉన్నవిషయాన్ని ఉన్నట్టుగా అతన్ని చూడగలగాలి.ఆపని చెయ్యడం చాలామందికి సాధ్యంకాదు.దానికి వారి అహం తీవ్రంగా అడ్డు వస్తుంది.అందుకే సద్గురువులు సామాన్యంగా ఎవరికీ అర్ధం కారు.పైగా పొరపాటుగా అర్ధం కాబడతారు.

లోకుల దృష్టిలో ఒక గురువు యొక్క విలువ ఎప్పుడంటే - అప్పనంగా కోట్లు వచ్చిపడే సులువు చెప్పడమో, లేదా వీళ్ళ కోరికలు తేరగా తీర్చే మార్గమో రెమెడీయో చెబితే అప్పుడు అతన్ని గొప్పవాడని లోకం అంటుంది.లేకుంటే 'నాకు హారతి పట్టు ఇక నువ్వు ఏ వెధవపని చేసినా నేను కాపాడతాను'- అంటే లోకం దృష్టిలో అతడు గొప్ప గురువు అవుతాడు.ఇది చాలా చవకబారు మనస్తత్వం అని నేనంటాను.సద్గురువైనవాడి విలువ ఇలాంటి చీప్ ట్రిక్స్ లో ఉండదు.నిజమైన సద్గురువు ఇలా అప్పనంగా ఎవడికీ ఏదీ ఇవ్వడు.ఇస్తానని అభయమూ ఇవ్వడు.

'నన్ను నమ్ము.ఇక నువ్వేది చేసినా నాదే భారం' అని అనేవాడు అసలు సద్గురువే కాదు.'సరియైన దారి ఇది.దీనిలో నడిచే ప్రయత్నం చెయ్యి.చేస్తే నీ అదృష్టం.లేకుంటే నీఖర్మ.దారి మాత్రం ఇదే.' అని చెప్పేవాడే అసలైన సద్గురువు.


చాలామంది సోకాల్డ్ శిష్యులు గురువును ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి తమ అవసరాలకు అతడిని వాడుకుందామని చూస్తారు. వాళ్ళు చేసే స్తోత్రాలూ పూజలూ పొగడ్తలూ ఈ ప్రక్రియలో భాగాలే.అది వాళ్ళ తప్పుకూడా కాదు.వారిలో ఉండే భయమూ సంకోచమూ అహమూ దురాశా వారిచేత ఈ పనిని చేయిస్తాయి.అవే వారిని అడుగు ముందుకు వెయ్యనివ్వవు.చాలామంది మనుషులకు వీటిని వదిలించుకునే లోపే జీవితాలు పరిసమాప్తి అయిపోతూ ఉంటాయి.లోకంలో ఎక్కడైనా ఇదే జరుగుతుంది.ఈ సంఘర్షణలో ఏళ్ళకేళ్ళు గడుపుతూ ఉంటారుగాని గురువు చెప్పిన దారిలో నడుద్దామని త్రికరణశుద్ధిగా ముందుకు రారు.రాలేకుండా వారిలోని భయమూ సంకోచమూ అహమూ దురాశా అడ్డు పడుతుంటాయి. అక్కడే వాళ్ళు పరీక్షలో తప్పిపోతుంటారు.చివరిలో బాధపడతారు.


గురువును మనం అనుసరించాలిగాని అతనికి దారిని మనం చూపకూడదు. అలా చూపిస్తే అది మన అహం అవుతుంది.అహం ఉన్నవారు ఎన్నటికీ శిష్యులు కాలేరు.శిష్యులు కానిదే దారిలో నడవలేరు.నడవనిదే గమ్యం దొరకదు.ఇవన్నీ ఒకదానికి ఒకటి అనుసంధానం ఉన్న ప్రక్రియలు.మనలని పట్టి బంధిస్తున్న సంకెళ్ళను ఒక్కొక్కటీ తెంచుకుంటూ గురువు చూపిన మార్గంలో నడవాలి.అంతేగాని ఊరకే మాటలు మాట్లాడుతూ చర్చిస్తూ కూచుంటే ఆధ్యాత్మికంగా ఏమీ సాధించలేరు.అప్పుడు అశాంతి తప్పదు.

పాండిచ్చేరి మదర్ అనిన మాట ఒకటి మనసులో తళుక్కున మెదిలింది.

'మహత్యాన్ని బట్టి గురువును అంచనా వేసేవారు అల్పులైన శిష్యులు. గురువును బట్టి మహత్యాన్ని అంచనా వేసేవారు ఉత్తమ శిష్యులు.'

ఈ మాట సరిగ్గా అర్ధం కావడానికే చాలామందికి సగం జన్మ సరిపోదు.

నా ఆలోచనను భగ్నం చేస్తూ రామ్మూర్తి స్వరం మ్రోగింది.

'ఒకసారి కాశినాయన ఏదో ఊరికి పోవడానికి ఒక బస్సెక్కినాడు సార్.నాయన టికెట్ తీసుకుంటాడు.కాని ఆయన వేషంచూచి అడుక్కునేవాడేమో అని భావించి బస్ కండక్టర్ బస్సులోనుంచి ఆయన్ను ఒక్క త్రోపు త్రోశినాడు. నాయన కింద పడిపోయినాడు. బస్ కడ్డీ ఒకటి తగిలి నాయనకు బాగా దెబ్బ తగిలింది.బస్సు బయలుదేరి వెళ్ళిపోయింది.ఆ బస్సు చేరవలసిన ఊరికిచేరి ఆగేసరికి నాయన నవ్వుతూ బస్సుకు ఎదురుగా నిలబడి ఉన్నాడు.చూచిన వారి పై ప్రాణాలు పైనే ఎగిరిపొయ్యాయి.'

ఇంకో సంగతి ఇలాంటిదే చెబుతాను వినండి.కాశినాయనకు శిదిలాలయాలను బాగుచేయించి వాటిలో మళ్ళీ పూజా పునస్కారాలు మొదలు పెట్టించడమంటే చాలా ఇష్టం.ఆ విధంగా ఆయన రాయలసీమలోని ఎన్నో శివాలయాలను బాగుచేయించాడు.ఒక సారి నల్లమల అడవిలోని ఒక శివాలయాన్ని ఇలాగే బాగుచేయించాడు.ఆ క్రమంలో అక్కడ చెట్లను కొన్నింటిని కొట్టించాడు.ఆ నేరానికి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనపైన కేసు పెట్టారు.స్వయానా ఒక కలెక్టర్ ఆయన్ను అరెస్ట్ చెయ్యడానికి వచ్చాడు.

'నాయనా,నువ్వు కోర్టుకు రావాలి.జీపెక్కు' అని వాళ్ళు అడిగినారు.

'ఎందుకు నాయనా?' అని కాశినాయన అడిగినాడు.

'నీవు అడవిలో చెట్లను కొట్టించినావు.అది నేరం.కాబట్టి నీవు ఫలానా ఊరిలోని కోర్టుకు రావాలి.రా జీపెక్కు పోదాం.' అని వారన్నారు.

'నేను మామూలు మనిషిని నాకు జీపెందుకులే నాయనా.మీరెళ్ళండి.నేను నడిచి వస్తాలే.పదండి.' అని ఆయన లేచాడు.

'వాళ్ళు ఆ ఊరికి చేరి కారులో కోర్టుకు చేరేసరికి,అక్కడ కోర్టు ఆవరణలో ఒక చెట్టు కింద కూర్చుని నాయన వాళ్లకు కనిపించాడు.కలెక్టర్ తన కళ్ళను తానే నమ్మలేక బిత్తరపోయి నాయనకు భక్తుడై పోయినాడు.' అన్నాడు రామ్మూర్తి.

'ఇవన్నీ నిజాలేనా?'- కావాలనే ఇలా అడిగాను.

'మీకు అబద్దాలు చెబితే మాకేమొస్తుంది సార్?' అన్నాడు రామ్మూర్తి.

'కాశినాయన నంద్యాలకు వస్తే లక్ష్మమ్మగారి ఇంటికి మాత్రమే ఎక్కువగా పొయ్యేవాడు.లక్ష్మమ్మ అనే సాధ్వి ఎన్నో ఏండ్ల నుంచి ఈ ఊరిలో నిత్యాన్నదానం చేస్తూ ఉన్నది.నంద్యాల చాలా మహత్యం ఉన్న ప్రాచీనమైన ఊరు సార్.లక్ష్మమ్మ ఆయనను కూర్చుండబెట్టి ఆయనకాళ్ళు ఒక పళ్ళెంలో పెట్టి కడిగి పూజ చేసేది.కాసేపు అక్కడ ఉండి తర్వాత ఎటో వెళ్ళిపోయేవాడు.'

'ఆయన ఎప్పుడైనా ఏదైనా బోధ చేసేవాడా?' అడిగాను.

'లేదు సార్.అలాంటి బోధలూ అవీ చెయ్యగా నేను ఎప్పుడూ చూడలేదు. అసలు ఎక్కువగా మాట్లాడేవాడే కాదు.ఎక్కువభాగం మౌనంగా ఉండేవాడు. మొన్నా మధ్యన రిటైరైన స్టేషన్ మాస్టర్ రామకృష్ణయ్యగారు కూడా నాయనను ఎక్కడైనా కనిపిస్తే వాళ్ళింటికి తీసుకెళ్ళి కాళ్ళు పళ్ళెంలో పెట్టి కడుగుతూ రుద్రమూ నమకచమకాలూ చదివేవాడు.రామకృష్ణయ్య గారు సద్బ్రాహ్మణుడు. ఆయన నాయనకు పరమభక్తుడు.'

'మరి ఒక బ్రాహ్మణుడు తన కాళ్ళు కడుగుతూ రుద్రం పఠిస్తే నాయన ఏమనేవాడు?' అడిగాను.

'ఏమీ అనేవాడు కాదు.కడిగించుకునేవాడు.అంతే.చదవడం ఆపితే మాత్రం 'పోగులయ్యా..చదువయ్యా' అని మాత్రం అనేవాడు.'రామకృష్ణయ్య గారి చెవులకు పోగులుండేవి.అందుకని అలా అనేవాడు.'

చాలాసార్లు రైల్లో కూడా ప్రయాణం చేస్తూ ఉండేవాడు.మన రైల్వే స్టాఫ్ చాలామందికి కాశిరెడ్డినాయన తెలుసు సార్.మనలో ఎంతోమంది ఆయన భక్తులున్నారు.అలా కనిపించినప్పుడు బాగా బతిమిలాడితే ఒక కప్పు టీ మాత్రం తాగేవాడు.ఒక్కొక్కసారి అదీ తీసుకునేవాడు కాదు.

'ఆయన చాలా దేవాలయాలను జీర్ణోద్ధారణ చేయించినాడు సార్.నంద్యాల దగ్గరున్న 'ఓంకారం' శివాలయం కూడా ఆయన బాగుచేసినదే.ఆయన మఠాలలో అన్నిచోట్లా నిత్యాన్నదానం నడుస్తున్నది సార్.ఎవరు అక్కడికి పోయినా చక్కగా భోజనం పెడతారు.' అన్నాడు రామ్మూర్తి.

'చాలా మంచిపద్ధతి.ఒక్కొక్క ప్రాంతంలో ధర్మోద్ధరణ ఒక్కొక్కరిద్వారా జరుగుతోంది.మంచి పరిణామమే.తన లీలలో అమ్మ ఎవరిని ఎలా ఉపయోగించుకుంటుందో ఎవరికి తెలుస్తుంది?' అన్నాను.

'ఆయన ఎందుకని అలా ఊళ్లు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు?' రామ్మూర్తి ఏమంటాడో చూద్దామని అడిగాను.

'అది మనం అర్ధం చేసుకోలేం సార్.వాళ్ళు ఎప్పుడు ఎందుకు ఏ పని చేస్తారో మనకు అర్ధంకాదు.వాళ్ళ ఆలోచనాస్థాయి వేరుగా ఉంటుంది.చాలాసార్లు మనం అనుకునేది ఒకటీ వాళ్ళ మనసులో ఉండేది వేరోకటీ అయ్యి ఉంటుంది.' అన్నాడు రామ్మూర్తి.

'ఫరవాలేదు బాగానే అర్ధం చేసుకున్నాడు'- అనుకున్నాను.

ఇంతలో అడివి మధ్యలోకి వచ్చినాము.తెలతెలవారుతూ ఉంటే మసక చీకటీ అప్పుడే వస్తున్న వెలుతురూ కలసి ఒక విధమైన మార్మిక వాతావరణం అలముకుంటుంది.ఏదో ఫెయిరీ లాండ్ లోకి అడుగు పెట్టినట్లు అనిపిస్తుంది.తెల్లవారుతోందికదా ఇంక చిన్నచిన్న సాధుజంతువులూ పక్షులూ ఆహారవేటకు బయలుదేరాయి.

'ఇప్పుడు పులులూ ఎలుగుబంట్లూ కనిపించడం మానేశాయిగాని, పాతకాలంలో దారికి అడ్డంగా కూడా కనిపించేవి సార్.వాటి జనాభా కూడా బాగా తగ్గిపోయింది.కనిపించినదాన్ని కనిపించినట్లు చంపేసి చర్మం దగ్గరనుంచీ అన్నీ అమ్మేసుకుంటున్నాడు మనిషి.ఇప్పుడు మనిషి కనిపిస్తే అవి వణికిపోయి అడవిలోకి పారిపోతున్నాయి.ఇంతకు ముందు అడవి ఇంకా బాగా చిక్కగా ఉండేది.ఇప్పుడు పలచబడిపోయింది.ఎక్కడికక్కడ చెట్లు కొట్టేసి అమ్మేసుకుంటున్నారు.' అన్నాడు రామమూర్తి.

దారిలో అడవికోళ్ళూ,కోతులూ దారి పొడుగూతా కనిపించాయి.ఊరికోడికీ అడవికోడికీ ఆకారంలో చాలాతేడా ఉన్నది.ఇక కోతులైతే చెప్పనక్కర్లేదు.కార్లో పోయేవాళ్ళు విసిరే పదార్ధాలు తినడానికి కోతులు అలవాటు పడ్డాయిలా ఉన్నది.కారు వస్తుంటే గుంపులుగా కారు దగ్గరగా వచ్చి ఏమైనా వేస్తామేమో అని చూస్తున్నాయి.

'అరె.ఈ సంగతి తెలిస్తే ఒక అరటి గెలను కార్లో పెట్టించి దారిలో కోతులకి వేస్తూ వెళ్ళేవాళ్ళం కదా?' అన్నాను.

'మాకూ ఆ ఆలోచన రాలేదు సార్.అయినా అంత పొద్దున్నే అరటి పళ్ళు ఎక్కడ దొరుకుతాయి?ఈసారి వచ్చినప్పుడు అలా చేద్దాం.డోర్నాల దాటినాక అడివిలో ఒక కోతిమూక మనకు ఎదురువస్తుంది.వాటి లీడర్ కోతి రెండుకాళ్ళ మీద మనిషిలా నడుస్తుంది.అంతేకాదు బస్సుకు ఎదురుగా నిలబడి రెండుకాళ్ళమీద వెనక్కు నడుస్తుంది అది.మళ్ళీ మనం విసిరినవాటిని అదేమీ తినదు.తన గుంపులోని కోతులు అన్నీ తినిన తర్వాత చివరిలో అది తింటుంది.' అన్నాడు.

'అది మంచి లీడర్ రామమూర్తిగారు.నాయకత్వ లక్షణాలు దానికి పుష్కలంగా ఉన్నాయి.నిజమైన లీడర్ తన గుంపులోని వారి బాగోగులు ముందుగా చూచి తన బాగోగులు చివరిలో చూచుకోవాలి.అదే నిజమైన నాయకలక్షణం' అన్నాను.

'ఇందాక నంద్యాల ఊరి గురించి చెప్పినారు కదా? బ్రహ్మంగారు ఇక్కడికి వచ్చినారా?' అడిగాను.

'ఎందుకు రాలేదు సార్? ఆయన చాలాసార్లు నంద్యాలకు వచ్చినారు.ఈఊరు చాలా ప్రాచీనమైనది.బ్రహ్మంగారు చేసిన రెండు గొప్పమహత్యాలు నంద్యాలలో చేసినవే. వినండి.' అని చెప్పసాగాడు రామ్మూర్తి.

(ఇంకా ఉంది)
read more " శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది -3 "

18, జనవరి 2014, శనివారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-2

'కాశిరెడ్డి నాయన ఎక్కడ ఉండేవాడు.' అడిగాను.

'ఆయనకొక ఊరంటూ లేదు సార్.ఎక్కడ బడితే అక్కడ అలా తిరుగుతూ ఉండేవాడు.ఎక్కువగా మాత్రం ఆళ్లగడ్డలో కనిపించేవాడు.ఆళ్ళగడ్డ బస్టాండ్ దగ్గర ఒక కానుగ చెట్టు ఉండేది.ఆ చెట్టుకింద ఒక నులక మంచంలో పడుకొని ఉండేవాడు.ఆ మంచానికి కూడా నిలువుగా మూడు అడ్డంగా మూడు పట్టీలు మాత్రమె ఉండేవి.అందులో పడుకొని ఉండేవాడు.చొక్కా వేసుకోడు.నడుముకు ఒక అంగవస్త్రం వంటిది మోకాళ్ళవరకూ కట్టుకొని ఉంటాడు.ఎంత చలిలో అయినా మంచులో అయినా అదే వేషంలో ఉంటాడు.

భుజానికి ఒక సంచీ వేలాడుతూ ఉండేది.అది ఎప్పుడూ ఖాళీగా ఉండేది.కానీ అందులోనుంచే మాకు చాలా వస్తువులు తీసి ఇచ్చేవాడు.ఆయన పొట్ట కూడా ఎప్పుడూ వెన్నుకు అంటుకొని ఉండేది.ఆయన ఎప్పుడూ ఏమీ తినగా మేము చూడలేదు.


'ఆయనకు ఎన్నేళ్ళు?' అడిగాను.

'సమాధి అయ్యే సమయానికి దాదాపు నూరేళ్ళు ఉండేవి సార్.బాగా పెద్దవాడై పోయాడు.బాగా వంగిపోయి నడిచేవాడు.' 

'మరి ఏమీ తినకుండా ఎలా ఉండేవాడు?' తెలీనట్టు అడిగాను.

'అదేసార్ యోగశక్తి.వాళ్ళు యోగులు. ఉండగలరు. మనకు తెలియని అనేక విద్యలు వాళ్లకు తెలిసి ఉంటాయి.కానీ ఎప్పుడైనా బలవంతం చేస్తే ఒక కప్పు టీ తాగేవాడు.అంతకంటే ఆయన తినగా త్రాగగా నేను ఈ ఇరవైముప్పై ఏళ్ళలో ఎప్పుడూ చూడలేదు.'అన్నాడు.

నాకు వెంటనే అమ్మ గుర్తొచ్చి కళ్ళలో నీళ్ళు గిర్రున తిరిగాయి.తన చేతిమీదుగా లక్షలాది మందికి అన్నం పెట్టిన జిల్లెళ్ళమూడి అమ్మ ఎప్పుడూ ఏమీ తినగా ఎవ్వరూ చూడలేదు.ఎప్పుడో చిన్నతనంలో వాళ్ళ అమ్మ బ్రతికున్నపుడు తిన్న అన్నమే.తల్లి చనిపోయిన తర్వాత అమ్మ తిన్నదో లేదో ఎవ్వరూ పట్టించుకోలేదు.'బంగారుతల్లి' అనీ 'ఎంత చక్కగా మాటలు చెబుతుందో' అంటూ ముద్దు చేసినవారూ 'ఎంత పెద్ద మాటలో' అంటూ ఆశ్చర్యపోయినవారూ కూడా అమ్మ ఆకలిని ఎవరూ పట్టించుకోలేదు.తల్లిలేని పిల్ల అని బాధపడిన  వారేకాని వేళకు ఆ పిల్ల తిన్నదా లేదా ఎవరికీ పట్టేది కాదు.తన ఆకలిని గురించి ఏమాత్రమూ పట్టించుకోని ఈ లోకానికి అమ్మ తన జీవితాంతమూ అన్నం పెడుతూనే ఉన్నది.ఈనాటికీ జిల్లెళ్లమూడిలో నడుస్తున్న 'అన్నపూర్ణాలయం' ద్వారా అన్నం పెడుతూనే ఉన్నది.

ఎవరైనా తనను చూడవస్తే 'తర్వాత మాట్లాడుకుందాం.ముందు అన్నం తినిరా నాన్నా' అని చెప్పేది.1950.1960 ప్రాంతాలలో అయితే అర్ధరాత్రయినా అపరాత్రయినా తనే వంటచేసి వచ్చినవారికి వడ్డించేది.

'అమ్మ ఏమీ తినేది కాదు.ఎప్పుడైనా కాఫీ మాత్రం తాగేది.' అని అమ్మతో అనేక ఏళ్ళు అతి సన్నిహితంగా గడిపిన వసుంధర అక్కయ్యే మాతో ఒకరోజున చెప్పింది.ఏమీ తినకపోయినా అమ్మ ముఖంలో తేజస్సు ఏమాత్రమూ తరిగేది కాదు.ఇది చూచి ఆశ్చర్యపోయిన వాళ్ళు ఎందఱో ఇప్పటికీ ఉన్నారు.అసలు తిండి తినకుండా జీవితాంతం ఒక మనిషి ఉండటం సాధ్యమేనా?సైన్స్ కు ఇది అందే విషయమేనా? అంటే,సైన్స్ కు అందనివి ఎన్నో యోగుల లోకంలో ఉన్నాయి అని చెప్పవచ్చు.అలా ఉన్న జిల్లెళ్ళమూడి అమ్మ నిన్న మొన్నటి వరకూ మన మధ్యనే ఉన్నారు.కాశిరెడ్డి నాయన కూడా అలాంటివాడే.

'యోగులకు పొట్ట లోపలికి ఉండాలి సార్.అదే భోగులకైతే బాగా పొట్ట ఉంటుంది.అదే వారికీ వీరికీ తేడా' అన్నాడు రామమూర్తి.

నాకు మళ్ళీ నవ్వొచ్చింది.ఇలాంటి మాటలు వింటే నాకు భలే వినోదం వేస్తుంది.

త్రిలింగ స్వామికి పెద్ద బానపొట్ట ఉండేది.కాని ఆయన మహాయోగి.రమణమహర్షికీ ఒక మోస్తరు పొట్ట ఉండేది.పొట్టను బట్టి యోగి స్థితిని ఎలా కొలవగలం?లోకులు ఇంతే.వారికి ఏవేవో తెలిసీ తెలియని కొన్ని అభిప్రాయాలుంటాయి.వాళ్ళ కళ్ళద్దాల నుంచే వాళ్ళు ఎప్పుడూ చూస్తూ ఉంటారు.అక్కడే వాళ్ళు సత్యాన్ని చూడలేక బొక్కబోర్లా పడిపోతుంటారు.పొట్ట ఒక్కటే యోగానికి కొలబద్ద అయితే నేడు జిమ్ కెళ్ళి సిక్స్ ప్యాక్ లు పెంచుతున్న కుర్రకారు అందరూ మహాయోగులే అవ్వాలి కదా.

లోలోపల నవ్వుకొన్నాను.

'కాశిరెడ్డి నాయన గురించి ఏదో చెబుతానని ఇందాక అంటూ ఆపారు.'అడిగాను.

అవును సార్.ఆయన శుక్రవారం నాడు శరీరాన్ని వదిలేశాడు.అంతకు మూడు నాలుగు రోజుల ముందు నాకు ఇక్కడే కనిపించి 'రేపు శుక్రవారానికి జ్యోతికి వచ్చేయ్ నానా.' అన్నాడు.

'ఎందుకు నాయనా' అని నేను అడిగాను.

'ఏమోరా.నాకు చెప్పాలని అనిపించింది.చెప్పినాను.నీ ఇష్టం' అన్నాడు.

'నువ్వు రమ్మంటే అట్లాగే వస్తాలే నాయనా' అన్నాను.

'కాని ఆరోజుకు నాకు పోవడానికి కుదరలేదు.విచిత్రం ఏమంటే,అదే రోజున రకరకాల ఊర్లలో చాలామందికి ఆయన కనిపించి ఇదే మాట చెప్పినాడు.శుక్రవారం నాటికి ఎంతోమంది గిద్దలూరు దగ్గర ఉన్న జ్యోతి ఆశ్రమానికి చేరినారు.అందరి సమక్షంలో ఆయన సమాధి అయిపోయాడు.' అన్నాడు.

'ఆయన ఏ విధంగా శరీర త్యాగం చేశినాడు?' అడిగాను.

'వాళ్ళు మనలాగా చనిపోరు సార్.ఊరకే హంసను వదిలేస్తారు.అంతే.' అన్నాడు.

'ఓహో అలాగా' అని తల పంకించాను.

'ఆ తర్వాత చాలా బాధపడ్డాను సార్.నాయన రమ్మని చెప్పినా నేను పోలేకపోయానే అని.తర్వాత ఒకసారి జ్యోతికి వెళ్ళినాను.అక్కడ గుడిదగ్గర ఉన్నప్పుడు కాశినాయన స్వరం స్పష్టంగా విన్నాను.

'ఏం నాయనా ఇప్పుడు వచ్చినావా?సరేలే.లోపలి రా' అంటూ ఆయన పిలవడం స్పష్టంగా ఈ చెవులతో విన్నాను సార్..ముందుగా నా భ్రమ ఏమో అనుకున్నాను.ఆయన గొంతు నాకు బాగా పరిచయమే గదా సార్.ముప్పై ఏళ్ళ నుంచీ వినిన గొంతేగా.అదే గొంతు.తర్వాత పూజారి మళ్ళీ పిలిచాడు.ఆ స్వరం వేరే.అప్పుడు లోనికి వెళ్లి పూజారితో ఇదే మాట చెప్పినాను.

'నువ్వు పిలవడానికి ముందు వేరు ఎవరో రమ్మని పిలిచినారు.అది నాయన గొంతు లాగా ఉన్నది.'

'ఇలాంటివి ఇక్కడ మామూలే'- అన్నాడు పూజారి.

నిజమైన మహనీయులు శరీరానికి అతీతంగా పనిచెయ్యగలరు.వారికి శరీరం పెద్ద సమస్య కానేకాదు.మామూలు మనుషులకు అడ్డుపడే దేశకాలాలు వారిని ఏమీ చెయ్యలేవు.

ఒకసారి తన వద్దకు వచ్చిన ఒక భక్తురాలితో జిల్లెళ్ళమూడి అమ్మ ఇలా అన్నారు.'మీ ఇంట్లో మామిడిచెట్టు కింద భలే చల్లగా హాయిగా ఉంటుందే.'

ఆమెకు ఏమీ అర్ధం కాలేదు.అమ్మ కూడా దానిగురించి అంతకంటే ఏమీ వివరించలేదు.

తర్వాత వాళ్ళఇంటికి వెళ్లి చూస్తె,అక్కడ మామిడిచెట్టు నీడ పడేచోట అమ్మ ఫోటో ఒకటి కనిపించింది.ఇది వింటూ ఉంటె ఆ సంఘటన నాకు గుర్తొచ్చింది.

'ఇంకా చెప్పండి' అడిగాను.

శ్రీరామ్మూర్తి  గొంతు సవరించుకున్నాడు.

(ఇంకా ఉంది)
read more " శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-2 "

17, జనవరి 2014, శుక్రవారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-1

 'శ్రీవిద్య' పూర్తయింది.

అమ్మనుంచి ఇంకా పిలుపు రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను.ఇంతలో శ్రీశైలానికి రమ్మని పిలుపొచ్చింది.వెంటనే బయలుదేరాను.ఈ సారి నంద్యాల నుంచి ఘాట్ రోడ్డులో ప్రయాణం.రాత్రికి నంద్యాల చేరుకొని పొద్దున్న అయిదుకే నంద్యాల నుంచి కారులో బయలుదేరాం.గిద్దలూరు మీదనుంచి వెళదామని డ్రైవర్ అన్నాడు.వద్దు ఆత్మకూరు మీదనుంచి ఘాట్ లో పోనిమ్మని చెప్పాను.అటైతే అడవినీ పొద్దున్నే కనిపించే మృగాలనూ చూచుకుంటూ వెళ్ళవచ్చు.

ఈసారి శ్రీరామమూర్తి మాతో వచ్చాడు.ఆయనకు ఆ దారి అంతా బాగా తెలుసు.అయితే నాతో ప్రయాణం చేసేవారికి ఒక ఇబ్బంది ఎదురౌతుంది. అనవసరమైన మాటలు మాట్లాడితే నేను ఊరుకోను.అయితే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాలి.లేకుంటే మౌనంగా ఉండాలి.ఆధ్యాత్మికం కూడా సోదిగా మాట్లాడితే మళ్ళీ నాకు నచ్చదు.అనుభవం నుంచి మాట్లాడాలి.కార్లో పిచ్చిపిచ్చి పాటలు పెట్టనివ్వను.కాబట్టి నాతో ప్రయాణం అంటే చాలామందికి నరకమే.

రాయలసీమ నేల తగిలితే నాకు ఆనందం కలుగుతుంది.ఎందుకంటే దానిలో ఆధ్యాత్మిక తరంగాలు అధికంగా ఉంటాయి.అదే మాట అన్నాను.శ్రీరామ్మూర్తి స్పందించాడు.

'అవును సార్.ఇక్కడ అవధూతలు యోగులు ఎక్కువ.వీరబ్రహ్మంగారినే తీసుకోండి.ఆయనలాగా సమాధిలోకి వెళ్లి రెండుసార్లు బయటకు వచ్చి సజీవంగా దర్శనం ఇచ్చినవాళ్ళు చరిత్రలో ఎవరూ లేరు.జీవసమాధి అయినవాళ్ళు చాలామంది రాయలసీమలో ఉన్నారు.కాని అందులోనుంచి రెండుసార్లు బయటకు వచ్చి అందరికీ కనిపించి మళ్ళీ లోనికి వెళ్ళినవారు బ్రహ్మంగారు తప్ప ఎవరూ లేరు.

మొదటి సారి సిద్దయ్య కోసం బయటకు వచ్చాడు.రెండోసారి,లోకపోరు భరించలేక తన కుమారులు సమాధిని తవ్వగా ఆగ్రహంతో బయటకు వచ్చి తన వంశాన్నే నిర్వంశం అవ్వమని శపించాడు.అందుకే ఇప్పుడు ఉన్న ఆయన వంశస్తులు ఆయన కూతురి బిడ్డలు.'

'అవును.బ్రహ్మంగారు మహాయోగి.ఆయన చెప్పినది శుద్ధ యోగమూ వేదాంతమూ.' అన్నాను నేను.

'సార్.ఒక చిన్న విచిత్రం చూడండి.కులాన్ని ఆయన ఏనాడూ లెక్కచెయ్యలేదు.హరిజనుడైన కక్కయ్యకు అక్కడికక్కడే చక్రదేవతలను చూపించాడు.ఇంకా ప్రియశిష్యుడైన సిద్ధయ్యకే టైం పట్టింది.ఎప్పటికో ఆయనకు దర్శనాలు అయ్యాయి.కాని కక్కయ్యకు క్షణంలో కలిగించాడు.'

'రామమూర్తి గారు.మనం పాటించే కులాలూ ఇవన్నీ యోగులకు ఉండవు.వాళ్ళు వీటికి అతీతులు.వాళ్ళు మనిషి గుణాన్ని చూస్తారు గాని కులాన్ని కాదు.' అన్నాను.

'బ్రహ్మంగారు చెబుతున్న చక్రరహస్యాలు విని కక్కయ్య తన భార్యను చంపి ఆ చక్రాలూ దేవతలూ ఎక్కడా అని వెదికాడు.రక్తంలో మాంసంలో అవెక్కడుంటాయి?అవి సూక్ష్మశరీరంలో ఉంటాయి.దొంగస్వామి మాటవిని పెళ్ళాన్ని చంపుకున్నానని ఏడుస్తుంటే బ్రహ్మంగారు జాలిపడి 'ఒరే.మాంసపు కళ్ళతో మాంసంలో వెదికితే ఏమి కనిపిస్తుందిరా?ఇప్పుడు చూడు'.అంటూ యోగనేత్రాలు తెరిపించాడు.వాటితో చూచిన కక్కయ్యకు అన్ని చక్రాలూ అన్ని దేవతలూ యధావిధిగా దర్శనం అయ్యాయి.

ఆ తర్వాత బ్రహ్మంగారు ఆ అమ్మాయిని బ్రతికించారు.కత్తితో ముక్కలుగా నరికిన ఆమె ఎలా బ్రతికింది? అదే యోగశక్తి.బ్రహ్మం గారు ఇలాంటి మహత్యాలు ఎన్నో చేశారు."

'బ్రహ్మంగారి యోగశక్తిని పరీక్షించాలని కడప నవాబు ఆయన్ని తన దర్బార్ కు పిలిపించి మాంసం ముక్కలు ఒక పెద్ద ప్లేట్ లో పెట్టి వాటిమీద ఒక గుడ్డ కప్పి ఆయనకు ఇచ్చాడు.బ్రహ్మంగారు అది కనిపెట్టి తన కమండలంలో నుంచి కొంచం నీళ్ళు దానిమీద చల్లి గుడ్డ తొలగించమన్నాడు.అందులో అన్నీ స్వీట్లు ఉన్నాయి.బిత్తరపోయిన నవాబు బ్రహ్మంగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు.ఇలాంటి మహత్యాలు ఎన్నో ఆయన చేశాడు.'

అంటూ గొంతెత్తి శివగోవిందతత్వాలు కొన్ని ఆలపించాడు.అవి వింటూ కొంతసేపు ప్రయాణం సాగించాము.

'శ్రీరామ్మూర్తిగారు.వినండి.బ్రహ్మం గారు కూడా కొత్తగా చెప్పినది ఏమీ లేదు.There is nothing new under the sun అని ఒక మాట ఉన్నది మీకు తెలుసుకదా.ఆయనేకాదు ఎవరైనా మన దేశంలో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు.ఉన్నదాన్నే ఆచరిస్తే చాలు.మన దేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ ఉన్న యోగాన్నీ వేదాంతాన్నీ ఆయన ఆచరించాడు సాధించాడు బోధించాడు. ఆయనే కాదు మనదేశంలో పుట్టిన పుడుతున్న మహానీయులందరూ చేసినదీ చేస్తున్నదీ అదే.మనకు ఎంతో ప్రాచీన జ్ఞానసంపద మూలుగుతున్నది.ఆచరించేవారే లేరు.ఎక్కడో ఒకరో ఇద్దరో అలాంటివారు ఉంటారు.వారే బ్రహ్మంగారు వేమన మొదలైన యోగులౌతారు.'అన్నాను.

రామ్మూర్తిగారికి ఈ మాట నచ్చలేదు.

'కాదు సార్.బ్రహ్మంగారు ఎన్ని అద్భుతమైన యోగరహస్యాలను తన తత్వాలలో చెప్పారో చూడండి.అవి ఇంతకు ముందు ఎక్కడా ఎవరూ చెప్పలేదు' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

చాలామంది ఇలాగే ఉంటారు.వారు ప్రధమంగా ఒక మహనీయుని బోధలను చదివి కొన్ని కొత్తవిషయాలను తెలుసుకున్నపుడు ఆ వ్యక్తి చాలా ప్రత్యేకుడు అనీ ఆయన చెప్పినది కొత్త విషయమనీ భావిస్తారు.ఇక ఆ వ్యక్తికి పూజ ప్రారంభిస్తారు.కానీ వారు మన ప్రాచీన సాహిత్యాన్ని విస్తృతంగా క్షుణ్ణంగా చదివితే వారి అభిప్రాయాలు మారుతాయి.ఆధ్యాత్మిక లోకంలో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు."కొత్తసీసాలో పాతసారా" అంతే.

చాలామంది చేసే తప్పు ఏమంటే,వారు సారాయిని వదిలిపెట్టి సీసాకి పూజ చేస్తూ కూచుంటారు.సీసా ముఖ్యంకాదు.అది ఏదో ఒకరోజున పగిలిపోతుంది. కాని సారా ఎప్పటికీ ఉంటుంది.కనుక సారాయి త్రాగాలి.ముందు సారా త్రాగి అప్పుడు కావాలంటే సీసాను పూజించవచ్చు.కాని సారా త్రాగకుండా సీసాను పూజిస్తూ కూచోకూడదు.కానీ లోకంలో అందరూ చేసేది అదే.సారా ఎవ్వరూ త్రాగరు.సీసాను మాత్రం పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటారు.వీలైతే దాన్ని మెడలో వేసుకుని కూడా ఊరేగుతారు.సీసా మీద స్తోత్రాలు వ్రాస్తారు.దానికి భజనలు చేస్తారు.కాని సారా మాత్రం త్రాగరు.

ఎందుకంటే సారా త్రాగితే మనలో మార్పు వస్తుంది.ఆ మార్పు ఎవరికీ ఇష్టం ఉండదు.మార్పంటే మనకు భయం కూడా.కనుక సీసాను పూజిస్తూ కూచుంటారు.ఆ సీసాకి రకరకాల అలంకరణలు చేస్తారు.సీసాకూడా తనలోని సారాయిని త్రాగమనే చెబుతూ ఉంటుంది.కాని దానిమాట ఎవ్వరూ పట్టించుకోరు.సీసాకు కిరీటాలు చేయిస్తారు.కవచాలు చేయిస్తారు.వీలైతే దానికి పెళ్ళికూడా చేస్తారు.కాని సారా మాత్రం ఎవ్వరూ త్రాగరు.ఆధ్యాత్మిక లోకంలోని అసలైన మాయ ఇదే.

'రామ్మూర్తిగారు.బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొత్త విషయాలు చెప్పారు.కాని ఆయన చెప్పిన తత్త్వం కనీసం అయిదువేల ఏళ్లక్రితమే మన దేశంలో ఉన్నది.ఇంకా ముందుది కూడా కావచ్చు.తమిళ సిద్ధసాంప్రదాయం లోనూ, శైవసాంప్రదాయంలోనూ ఈ యోగరహస్యాలు తెలిసినవారూ ఆచరించినవారూ ఎందఱో సిద్ధులు మన దేశంలో ఎప్పటినుంచో ఉన్నారు.ముందునుంచీ ఉన్నదానినే బ్రహ్మంగారు కూడా ఆచరించి బోధించారు.' అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.

ఈమధ్య కాలంలో రాయలసీమలో ఉద్భవించిన మహనీయుల్లో కాశిరెడ్డి నాయన ముఖ్యుడు.కాశిరెడ్డి నాయనతో ఇరవైఏళ్ళ పైన పరిచయం ఉన్నది శ్రీరామమూర్తికి.నాయనతో అనేక అనుభవాలు ఆయనకు ఉన్నవి.వాటిని చెప్పమని అడిగాను.

'సార్.ఒకటా రెండా ఎన్నని చెప్పేది?ఎన్నో ఉన్నాయి.'అంటూ మొదలు పెట్టాడు.

'కాశిరెడ్డి నాయన నిజమైన మహనీయుడు సార్.ఆయన అవధూత.ఊళ్లు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు.ఒకే క్షణంలో అనేక ఊళ్లలో అనేకమందికి కనిపించేవాడు.నాకే జరిగిన అనుభవం చెబుతాను వినండి.'అంటూ చెప్పసాగాడు.

(ఇంకా ఉంది)
read more " శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-1 "

కుళ్ళు భారతం

డెన్మార్క్ టూరిస్ట్ డిల్లీలో రేప్ కు గురికావడం,అక్కడి పరిస్తితి ఎంత దారుణంగా ఉన్నదో కళ్ళకు కడుతోంది.నిర్భయ సంఘటన జరిగాక పార్టీలూ ప్రభుత్వాలూ దానిని ముక్తకంఠంతో ఖండించాయి.ఆ తర్వాత యధావిధిగా మరిచిపోయాయి.సరియైన చర్యలు తీసుకుని ఉంటే అలాంటి సంఘటనలు మళ్ళీ మళ్ళీ ఎందుకు జరుగుతాయి?

రేప్ కు గురైన స్త్రీ చాలా మానసిక క్షోభను అనుభవిస్తుంది.అందులో గ్యాంగ్ రేప్ అయితే ఆమెకు బ్రతకాలన్న ఇచ్ఛ సమూలంగా నశిస్తుంది.ఆ క్షోభ నుంచి తట్టుకుని బ్రతికి బట్టకడితే గొప్ప విషయమే అని చెప్పాలి.ఒకవేళ ఆ అమ్మాయి బ్రతకాలని నిశ్చయించుకున్నా చాలాసార్లు చుట్టూ ఉన్న సమాజం అనే సూటీపోటీ మాటలు భరించలేక ఆత్మహత్య చేసుకునే సందర్భాలు కూడా ఉంటాయి.ఈమధ్యనే అలాంటి సంఘటన ఒకటి జరిగిందికూడా.మనదొక sexually repressed and perverted society అని రజనీష్ చెప్పిన మాట అక్షరాలా యదార్ధం అని ప్రతిరోజూ రుజువౌతూనే ఉన్నది.

అసలు మనదేశంలో నీతి అనేది ఉన్నదా అని నాకెప్పటినుంచో పెద్ద సందేహం. మనదేశం అంటే ఏదో పెద్ద ఆధ్యాత్మికనిధి అని భావించి చూద్దామని వచ్చిన విదేశీమహిళలు చాలాసార్లు రేప్ కు గురౌతూ ఉంటారు.లేదా నిత్యానంద వంటి కుహనాగురువుల చేతిలో పడుతూ ఉంటారు.ఇదెంత అవమానకరమైన పరిస్తితో ఊహించలేము.పుట్టపర్తిలో అలాంటి పరిస్థితులు అనుభవించిన ఒకరిద్దరు విదేశీవనితలు నాకు పర్సనల్ గా తెలుసు.

మనదేశంలో ఇలాంటి సంఘటలు జరిగినప్పుడల్లా బాధితమహిళకు చెందిన దేశంలో ఉన్న భారతీయులు వాళ్ళు ఉద్యోగులు గానీ విద్యార్దులుగానీ చాలా అసహ్యకరమైన పరిస్తితిని ఆయా దేశాలలో ఎదుర్కొంటారు.చాలాసార్లు వాళ్ళు అక్కడ స్నేహితులకూ సాటి ఉద్యోగులకూ సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్తితి కలుగుతూ ఉంటుంది(వాళ్ళు భారతీయులైన పాపానికి).

ఒకసారి నేను తిరుపతిలో ఉన్నపుడు రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఒక రష్యా అమ్మాయి హడావుడిగా నా వద్దకు వచ్చింది.రైల్వే స్టేషన్ లో రిటైరింగ్ రూమ్స్ బయట నేను నిలబడి ఉన్నాను.రూం రేట్స్ ఎంక్వైరీ చెయ్యడానికి ఆ అమ్మాయి వచ్చింది.ఆ సమయానికి అక్కడ ఎవరూ లేకపోతే ఆ బోర్డ్ చూపించి నేనే వివరించి చెప్పాను.ఆ సమయంలో ఆమె ఒంటరిగా ఒక్కతే ఉండటం నాకు ఆందోళన కలిగించింది.

ఇంకోమాట కూడా చెప్పాను.

'మీరు త్వరగా మంచి హోటల్ చూచుకుని చెక్ ఇన్ అవండి.అర్ధరాత్రి వరకూ రోడ్లమీద తిరగవద్దు' అని చెప్పాను.

ఆమె నవ్వి 'ఇది హోలీ టౌన్ కదా' అన్నది.

ఎక్కువగా వివరించడం ఎందుకని 'డోంట్ టేక్ రిస్క్ ఈవెన్ విత్ హోలినెస్' అని మాత్రం చెప్పాను.

ఆమె నవ్వేసి వెళ్ళిపోయింది.నేను చెప్పిన మాటలు ఆమె సీరియస్ గా తీసుకున్నట్లు అనిపించలేదు.అప్పుడు నా మనస్సులో మన దేశప్రతిష్ట ఒక్కటే మెదిలింది.ఆమెకు ఏమీ జరుగకుండా చూడమని వెంకన్నను ప్రార్ధించాను.

ఎదురుగా కనిపిస్తున్న వ్యభిచార గృహం మీద దాడి చెయ్యమని లా మినిస్టర్ ఆదేశిస్తే తిరస్కరించిన పోలీసులున్న దేశం మనది.ఎంత గొప్ప దేశమో?ఉద్యోగులు కూడా కుళ్ళిపోయారనడానికి ఇంతకంటే ఇంకొక ఉదాహరణ అవసరం లేదు.నాయకులూ ఉద్యోగులూ చీకటి వ్యాపారులూ కలసి ఒక భయంకరమైన మాఫియా ఏర్పడితే ఇక ఆ సమాజాన్ని ఎవడూ రక్షించలేడు.

చదువరులకు అనుమానం రావచ్చు.ఎక్కడో జరిగిన ఒక stray incident ను పట్టుకుని అందర్నీ generalize చెయ్యడం తప్పు కదా.ఎవరో ఏదో చేస్తే దేశంలో మొత్తం అందరూ అలాంటివాళ్ళే అని మీరెలా అనగలరు? అనవచ్చు.నిజమే.ఈ దేశంలో అందరూ రేపిస్టులే లేరు.అర్ధరాత్రి దారితప్పి అడ్రస్ అడిగిన స్త్రీని ఆమె ఇంటిదగ్గర భద్రంగా దించిన వ్యక్తులూ నాకు తెలుసు.ఎవరో కాదు నా మిత్రుడే ఆపని చేశాడు.

అసలు డిల్లీ పోలీసులు డిల్లీ ముఖ్యమంత్రి చేతుల్లో లేకపోవడం భలే పెద్ద వింత.ఇక జవాబుదారీ తనం ఎలా వస్తుంది.ఏదైనా జరిగితే గవర్నర్ ను కలసి సీఎం అడుక్కోవాలి.కేంద్ర ప్రభుత్వానికీ డిల్లీ ప్రభుత్వానికీ పడకపోతే ఈ లోసుగును చక్కగా ఉపయోగించుకోవచ్చు.వైరివర్గం మీద బురద చల్లవచ్చు.ఇలాంటి సంఘటనలను కూడా చక్కగా ప్లాన్ చెయ్యవచ్చు.ఒకళ్ళు గట్టిగా ఏదైనా చెయ్యాలి అనుకుంటే(అందులోనూ డబ్బూ అధికారమూ చేతిలో ఉన్నవాళ్ళు)మన దేశంలో సాధ్యం కానిదేముంది?

అర్ధరాత్రి ఆడది నిర్భయంగా తిరిగినప్పుడే మన దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్లు అని గాంధీ అనేవాడు.ప్రస్తుతం ఏ ఆడదైనా అలా తిరిగితే ఆమె 'నిర్భయ'గా మారిపోవడం ఖాయం.అర్ధరాత్రి దాకా అక్కర్లేదు దేశరాజధానిలో సాయంత్రం నాలుగుకే ఆడదానికి రోడ్డుమీద భద్రత కరువైంది. మనకు సొతంత్రం వచ్చి 66 ఏళ్ళు దాటింది కదా. ఆమాత్రం పురోగతి లేకుంటే ఎలా?కనీసం దేశరాజధానిలో వీధి దీపాలు సరిగ్గా లేని మన దేశం ఎంత గొప్పదో కదా?

రాజకీయ నాయకులూ అధికారులూ కలసి ఇన్నేళ్ళలో సృష్టించిన lawlessness పండిస్తున్న విషఫలాలు ఇలా ఉండక ఇంకెలా ఉంటాయి?అమెరికాలో ఉన్నట్లు మన దేశంలో కూడా 'రూల్ ఆఫ్ లా' ఉండే పరిస్తితి ఇంకెప్పుడొస్తుందో కదా?నాయకులూ అధికారులూ ప్రజలకు జవాబుదారీ ఎప్పుడు అవుతారో కదా?
read more " కుళ్ళు భారతం "