“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, జనవరి 2014, శుక్రవారం

శ్రీశైలం నుంచి పిలుపొచ్చింది-1

 'శ్రీవిద్య' పూర్తయింది.

అమ్మనుంచి ఇంకా పిలుపు రాలేదేమిటా అని ఆలోచిస్తున్నాను.ఇంతలో శ్రీశైలానికి రమ్మని పిలుపొచ్చింది.వెంటనే బయలుదేరాను.ఈ సారి నంద్యాల నుంచి ఘాట్ రోడ్డులో ప్రయాణం.రాత్రికి నంద్యాల చేరుకొని పొద్దున్న అయిదుకే నంద్యాల నుంచి కారులో బయలుదేరాం.గిద్దలూరు మీదనుంచి వెళదామని డ్రైవర్ అన్నాడు.వద్దు ఆత్మకూరు మీదనుంచి ఘాట్ లో పోనిమ్మని చెప్పాను.అటైతే అడవినీ పొద్దున్నే కనిపించే మృగాలనూ చూచుకుంటూ వెళ్ళవచ్చు.

ఈసారి శ్రీరామమూర్తి మాతో వచ్చాడు.ఆయనకు ఆ దారి అంతా బాగా తెలుసు.అయితే నాతో ప్రయాణం చేసేవారికి ఒక ఇబ్బంది ఎదురౌతుంది. అనవసరమైన మాటలు మాట్లాడితే నేను ఊరుకోను.అయితే ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడాలి.లేకుంటే మౌనంగా ఉండాలి.ఆధ్యాత్మికం కూడా సోదిగా మాట్లాడితే మళ్ళీ నాకు నచ్చదు.అనుభవం నుంచి మాట్లాడాలి.కార్లో పిచ్చిపిచ్చి పాటలు పెట్టనివ్వను.కాబట్టి నాతో ప్రయాణం అంటే చాలామందికి నరకమే.

రాయలసీమ నేల తగిలితే నాకు ఆనందం కలుగుతుంది.ఎందుకంటే దానిలో ఆధ్యాత్మిక తరంగాలు అధికంగా ఉంటాయి.అదే మాట అన్నాను.శ్రీరామ్మూర్తి స్పందించాడు.

'అవును సార్.ఇక్కడ అవధూతలు యోగులు ఎక్కువ.వీరబ్రహ్మంగారినే తీసుకోండి.ఆయనలాగా సమాధిలోకి వెళ్లి రెండుసార్లు బయటకు వచ్చి సజీవంగా దర్శనం ఇచ్చినవాళ్ళు చరిత్రలో ఎవరూ లేరు.జీవసమాధి అయినవాళ్ళు చాలామంది రాయలసీమలో ఉన్నారు.కాని అందులోనుంచి రెండుసార్లు బయటకు వచ్చి అందరికీ కనిపించి మళ్ళీ లోనికి వెళ్ళినవారు బ్రహ్మంగారు తప్ప ఎవరూ లేరు.

మొదటి సారి సిద్దయ్య కోసం బయటకు వచ్చాడు.రెండోసారి,లోకపోరు భరించలేక తన కుమారులు సమాధిని తవ్వగా ఆగ్రహంతో బయటకు వచ్చి తన వంశాన్నే నిర్వంశం అవ్వమని శపించాడు.అందుకే ఇప్పుడు ఉన్న ఆయన వంశస్తులు ఆయన కూతురి బిడ్డలు.'

'అవును.బ్రహ్మంగారు మహాయోగి.ఆయన చెప్పినది శుద్ధ యోగమూ వేదాంతమూ.' అన్నాను నేను.

'సార్.ఒక చిన్న విచిత్రం చూడండి.కులాన్ని ఆయన ఏనాడూ లెక్కచెయ్యలేదు.హరిజనుడైన కక్కయ్యకు అక్కడికక్కడే చక్రదేవతలను చూపించాడు.ఇంకా ప్రియశిష్యుడైన సిద్ధయ్యకే టైం పట్టింది.ఎప్పటికో ఆయనకు దర్శనాలు అయ్యాయి.కాని కక్కయ్యకు క్షణంలో కలిగించాడు.'

'రామమూర్తి గారు.మనం పాటించే కులాలూ ఇవన్నీ యోగులకు ఉండవు.వాళ్ళు వీటికి అతీతులు.వాళ్ళు మనిషి గుణాన్ని చూస్తారు గాని కులాన్ని కాదు.' అన్నాను.

'బ్రహ్మంగారు చెబుతున్న చక్రరహస్యాలు విని కక్కయ్య తన భార్యను చంపి ఆ చక్రాలూ దేవతలూ ఎక్కడా అని వెదికాడు.రక్తంలో మాంసంలో అవెక్కడుంటాయి?అవి సూక్ష్మశరీరంలో ఉంటాయి.దొంగస్వామి మాటవిని పెళ్ళాన్ని చంపుకున్నానని ఏడుస్తుంటే బ్రహ్మంగారు జాలిపడి 'ఒరే.మాంసపు కళ్ళతో మాంసంలో వెదికితే ఏమి కనిపిస్తుందిరా?ఇప్పుడు చూడు'.అంటూ యోగనేత్రాలు తెరిపించాడు.వాటితో చూచిన కక్కయ్యకు అన్ని చక్రాలూ అన్ని దేవతలూ యధావిధిగా దర్శనం అయ్యాయి.

ఆ తర్వాత బ్రహ్మంగారు ఆ అమ్మాయిని బ్రతికించారు.కత్తితో ముక్కలుగా నరికిన ఆమె ఎలా బ్రతికింది? అదే యోగశక్తి.బ్రహ్మం గారు ఇలాంటి మహత్యాలు ఎన్నో చేశారు."

'బ్రహ్మంగారి యోగశక్తిని పరీక్షించాలని కడప నవాబు ఆయన్ని తన దర్బార్ కు పిలిపించి మాంసం ముక్కలు ఒక పెద్ద ప్లేట్ లో పెట్టి వాటిమీద ఒక గుడ్డ కప్పి ఆయనకు ఇచ్చాడు.బ్రహ్మంగారు అది కనిపెట్టి తన కమండలంలో నుంచి కొంచం నీళ్ళు దానిమీద చల్లి గుడ్డ తొలగించమన్నాడు.అందులో అన్నీ స్వీట్లు ఉన్నాయి.బిత్తరపోయిన నవాబు బ్రహ్మంగారి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకున్నాడు.ఇలాంటి మహత్యాలు ఎన్నో ఆయన చేశాడు.'

అంటూ గొంతెత్తి శివగోవిందతత్వాలు కొన్ని ఆలపించాడు.అవి వింటూ కొంతసేపు ప్రయాణం సాగించాము.

'శ్రీరామ్మూర్తిగారు.వినండి.బ్రహ్మం గారు కూడా కొత్తగా చెప్పినది ఏమీ లేదు.There is nothing new under the sun అని ఒక మాట ఉన్నది మీకు తెలుసుకదా.ఆయనేకాదు ఎవరైనా మన దేశంలో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు.ఉన్నదాన్నే ఆచరిస్తే చాలు.మన దేశంలో అతి ప్రాచీనకాలం నుంచీ ఉన్న యోగాన్నీ వేదాంతాన్నీ ఆయన ఆచరించాడు సాధించాడు బోధించాడు. ఆయనే కాదు మనదేశంలో పుట్టిన పుడుతున్న మహానీయులందరూ చేసినదీ చేస్తున్నదీ అదే.మనకు ఎంతో ప్రాచీన జ్ఞానసంపద మూలుగుతున్నది.ఆచరించేవారే లేరు.ఎక్కడో ఒకరో ఇద్దరో అలాంటివారు ఉంటారు.వారే బ్రహ్మంగారు వేమన మొదలైన యోగులౌతారు.'అన్నాను.

రామ్మూర్తిగారికి ఈ మాట నచ్చలేదు.

'కాదు సార్.బ్రహ్మంగారు ఎన్ని అద్భుతమైన యోగరహస్యాలను తన తత్వాలలో చెప్పారో చూడండి.అవి ఇంతకు ముందు ఎక్కడా ఎవరూ చెప్పలేదు' అన్నాడు.

నాకు నవ్వొచ్చింది.

చాలామంది ఇలాగే ఉంటారు.వారు ప్రధమంగా ఒక మహనీయుని బోధలను చదివి కొన్ని కొత్తవిషయాలను తెలుసుకున్నపుడు ఆ వ్యక్తి చాలా ప్రత్యేకుడు అనీ ఆయన చెప్పినది కొత్త విషయమనీ భావిస్తారు.ఇక ఆ వ్యక్తికి పూజ ప్రారంభిస్తారు.కానీ వారు మన ప్రాచీన సాహిత్యాన్ని విస్తృతంగా క్షుణ్ణంగా చదివితే వారి అభిప్రాయాలు మారుతాయి.ఆధ్యాత్మిక లోకంలో కొత్తగా చెప్పేది ఏమీ ఉండదు."కొత్తసీసాలో పాతసారా" అంతే.

చాలామంది చేసే తప్పు ఏమంటే,వారు సారాయిని వదిలిపెట్టి సీసాకి పూజ చేస్తూ కూచుంటారు.సీసా ముఖ్యంకాదు.అది ఏదో ఒకరోజున పగిలిపోతుంది. కాని సారా ఎప్పటికీ ఉంటుంది.కనుక సారాయి త్రాగాలి.ముందు సారా త్రాగి అప్పుడు కావాలంటే సీసాను పూజించవచ్చు.కాని సారా త్రాగకుండా సీసాను పూజిస్తూ కూచోకూడదు.కానీ లోకంలో అందరూ చేసేది అదే.సారా ఎవ్వరూ త్రాగరు.సీసాను మాత్రం పట్టుకుని వేళ్ళాడుతూ ఉంటారు.వీలైతే దాన్ని మెడలో వేసుకుని కూడా ఊరేగుతారు.సీసా మీద స్తోత్రాలు వ్రాస్తారు.దానికి భజనలు చేస్తారు.కాని సారా మాత్రం త్రాగరు.

ఎందుకంటే సారా త్రాగితే మనలో మార్పు వస్తుంది.ఆ మార్పు ఎవరికీ ఇష్టం ఉండదు.మార్పంటే మనకు భయం కూడా.కనుక సీసాను పూజిస్తూ కూచుంటారు.ఆ సీసాకి రకరకాల అలంకరణలు చేస్తారు.సీసాకూడా తనలోని సారాయిని త్రాగమనే చెబుతూ ఉంటుంది.కాని దానిమాట ఎవ్వరూ పట్టించుకోరు.సీసాకు కిరీటాలు చేయిస్తారు.కవచాలు చేయిస్తారు.వీలైతే దానికి పెళ్ళికూడా చేస్తారు.కాని సారా మాత్రం ఎవ్వరూ త్రాగరు.ఆధ్యాత్మిక లోకంలోని అసలైన మాయ ఇదే.

'రామ్మూర్తిగారు.బ్రహ్మంగారు కాలజ్ఞానంలో కొత్త విషయాలు చెప్పారు.కాని ఆయన చెప్పిన తత్త్వం కనీసం అయిదువేల ఏళ్లక్రితమే మన దేశంలో ఉన్నది.ఇంకా ముందుది కూడా కావచ్చు.తమిళ సిద్ధసాంప్రదాయం లోనూ, శైవసాంప్రదాయంలోనూ ఈ యోగరహస్యాలు తెలిసినవారూ ఆచరించినవారూ ఎందఱో సిద్ధులు మన దేశంలో ఎప్పటినుంచో ఉన్నారు.ముందునుంచీ ఉన్నదానినే బ్రహ్మంగారు కూడా ఆచరించి బోధించారు.' అన్నాను.

ఆయనేమీ మాట్లాడలేదు.

ఈమధ్య కాలంలో రాయలసీమలో ఉద్భవించిన మహనీయుల్లో కాశిరెడ్డి నాయన ముఖ్యుడు.కాశిరెడ్డి నాయనతో ఇరవైఏళ్ళ పైన పరిచయం ఉన్నది శ్రీరామమూర్తికి.నాయనతో అనేక అనుభవాలు ఆయనకు ఉన్నవి.వాటిని చెప్పమని అడిగాను.

'సార్.ఒకటా రెండా ఎన్నని చెప్పేది?ఎన్నో ఉన్నాయి.'అంటూ మొదలు పెట్టాడు.

'కాశిరెడ్డి నాయన నిజమైన మహనీయుడు సార్.ఆయన అవధూత.ఊళ్లు పట్టుకుని తిరుగుతూ ఉండేవాడు.ఒకే క్షణంలో అనేక ఊళ్లలో అనేకమందికి కనిపించేవాడు.నాకే జరిగిన అనుభవం చెబుతాను వినండి.'అంటూ చెప్పసాగాడు.

(ఇంకా ఉంది)