“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

13, ఏప్రిల్ 2012, శుక్రవారం

కాలజ్ఞానం -10

ఆగిపోయినవన్నీ మళ్ళీ కదులుతాయి
పడుకున్న పాములు నిద్రలేస్తాయి
గొడవలు మళ్ళీ మొదలౌతాయి
ప్రమాదాలూ భయభ్రాంతులూ 
పెద్ద విపత్తుకు సూచనలు

మనిషి అతితెలివితో విర్రవీగితే  
ప్రకృతేనా తెలివి లేనిది?   

సంపదవెంట పరుగులు మాని 
సంతోషంకోసం విలువలకోసం
జీవించడం తెలివైన పని
లోకానికి ఇది పిచ్చిలా తోచినా 
నిజం నిలకడమీదే తెలుస్తుంది
సారమే చివరికి మిగుల్తుంది
read more " కాలజ్ఞానం -10 "

సినిమా నటులా మనకు ఆదర్శం?

ఈమధ్య ఒక తెలిసినవారి ఇంటికి వెళితే అందరూ టీవీ ముందు కూచుని గుడ్ల ప్పగించి చూస్తున్నారు.ఏం ప్రోగ్రాం వస్తోందా అని చూస్తె,ఒక సినిమా నటుడికి సన్మానం జరుగుతోంది.దానికి ఇంటిల్లిపాదీ పనులు మానుకుని టీవీ ముందు కూచుని పరవశంగా చూస్తున్నారు. వాళ్ళ చీప్ టేస్ట్ ని చూచి నాకు బాధేసింది. అలాటివాళ్ళ ఇంటికి వచ్చినందుకు సిగ్గేసింది. మా ఇంట్లో టీవీని ఒక్కొక్కసారి వారంరోజుల వరకూ ఆన్  చెయ్యటం అంటూ జరుగదు.అందుకని ఆ ప్రోగ్రాం సంగతి నాకు తెలీలేదు.ఆవిషయం అలా ఉంచితే,ముఖానికి రంగేసుకుని వేషాలేసిన నటులను ఏదో చారిత్రిక పురుషులలాగా భావించడం,వాళ్ళను మహనీయులు మహానుభావులు యుగపురుషులు అని సంబోధించే వాళ్ళను,పుస్తకాలు రాసేవాళ్ళను చూస్తె,ఈ అభిమానులు  అసలేం మాట్లాడు తున్నారో వాళ్లకు తెలుస్తోందా? వాళ్ళు స్పృహలో ఉండి మాట్లాడుతున్నారా లేదా? అని నాకు సందేహం వస్తుంటుంది. నేటి అభిమాన సంఘాలు కులసంఘలేగాని ఇంకేమీ కాదు.కులపిచ్చితో మనుషులు ఎంతలా దిగజారగలరో వీళ్ళు నిరూపిస్తూ ఉంటారు. 

కెమెరా ముందు తైతక్కలాడినంత మాత్రాన సినీనటులు మహనీయులు యుగపురుషులు ఎలా అవుతారో నాకు ఎప్పటికీ అర్ధం కాదు. ఒక  నటుడు వేసిన తాగుబోతు వేషాలవల్ల 1970  లలో ఒక తరమంతా తాగుబోతులుగా మారారు. ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. జీవితంలో ఏ రకమైన ఆదర్శాలూ లేనివారికి సినిమానటుల వేషాలేకదా ఆదర్శం !!! అందులోనూ మన తెలుగువాళ్లకున్న సినిమా పిచ్చి అంతాఇంతా కాదు. హీరో ఏది చేస్తే అది చెయ్యడం గొప్ప అని వీడనుకుంటాడు. కనుక ఆ నటుడు వేసిన తాగుబోతు వేషాలు చూసీ, ఆ గ్లాసు పట్టుకోవడం, సిగిరెట్టు తాగడం, అర్ధనగ్న డాన్సర్లతో ఎగరడం, ఈ చండాలం అంతా చూసి డంగై పోయి, వాటిని అనుకరిస్తూ తాగుడికి తిరుగుడికి జూదానికి అలవాటుపడి తనతోబాటు తన కుటుంబసభ్యుల జీవితాలను కూడా నాశనం చేసినవాళ్ళు 1970 దశకంలో ఎందఱో ఉన్నారు. 

సమాజం ఈ రకంగా దిగజారడానికి కారణం అయిన నటుణ్ణి చూసి వీళ్ళు ఒళ్ళుమరిచిపోయి చప్పట్లు కొట్టడం, కాళ్ళమీద పడి దణ్ణాలు పెట్టడం, మహానుభావుడంటూ పొగడటం  చూచి నాకు నోటమాట రాలేదు. మానవ మనస్తత్వస్థాయి ఇంత  చండాలంగా ఉంటుందా అని నాకు బాధ కలిగింది. ఈ నటులు మానవాళికి ఏమి మేలు చేశారని వీళ్ళకు ఇంత విలువ ఇవ్వాలో నాకెప్పటికీ అర్ధం కాదు. ముఖానికి రంగేసుకుని వేషాలు వేసినంత మాత్రాన వీళ్ళకు ఏమి ఔన్నత్యం వస్తుందో, ఎలా వస్తుందో, వీళ్ళు ఆదర్శ పురుషులు ఏరకంగా అవుతారో నా మట్టి బుర్రకైతే ఎప్పటికీ అర్ధంకాదు.

పాతతరంలో అయితే పురాణగాధలు, మహనీయుల జీవితాలు, త్యాగమయుల చరిత్రలు, ధార్మికుల జీవితాలలోని సంఘటనలు, మహాభక్తులజీవితాల నుంచి, అవతారపురుషుల జీవితాలనుంచి ఉత్తేజపూరిత ఘట్టాలు, కీర్తనలు, శతకాలు, పాటలు, పద్యాలూ చిన్నప్పటినుంచే నేర్పించేవారు. దానివల్ల ఒక బాలునికి గాని బాలికకు గాని  చిన్నవయసులోనే మంచి ధార్మికమైన పునాదులు పడేవి. మాటగాని, చేతగాని, నిక్కచ్చిగా, నిజాయితీగా ఉండేది. జీవితం ధర్మపరంగా గడిపేవారు. ఇతరులకు సాయపడదామన్న తత్త్వం ఉండేది. మాటల్లో అసభ్యపదాలు దొర్లేవి కావు. పెద్దవాళ్ళను గౌరవించడం, పద్దతిగా ఉండటం, మంచీ మర్యాదా ఇత్యాదులు సహజంగా అలవడేవి.

సినిమాలు రాకముందు ఎక్కడచూచినా ఇటువంటి పరిస్తితి ఉండేది.సినిమాలు వచ్చిన తర్వాతకూడా మొదటితరం వరకూ కొంత బాగానే ఉంది. ఆ తర్వాత సినిమాలలో వెర్రిపోకడలు, వెకిలివేషాలు, ద్వంద్వార్ధపు పాటలు,డాన్సులు ఎప్పుడైతే మొదలయ్యాయో సమాజంలో మార్పురావడం మొదలైంది.నేటి సమాజం ఇలా అఘోరించడానికి సినిమారంగానిదే పూర్తిబాధ్యత అని చెప్పచ్చు. డబ్బుకోసం నానా ఛండాలపు సినిమాలు నిర్మించి జనంమీదకు వదిలి సమాజం సర్వనాశనం కావడానికి కారకులైనవారికి లోకం నీరాజనం పట్టడం చూస్తుంటే ఇదేకదా కలిమాయ అనిపిస్తుంది.

తాగుడూ డ్రగ్సూ తార్పుడు బిజినెస్ ఎంత నీచమైనదో, విలువలు లేని సినిమాలు తీసేవారి వృత్తీ అంత నీచమైనదే.కాని ఇంద్రియాలను రేగజేస్తుంది గనుక అది చాల ఆకర్షణీయంగా ఉంటుంది. లాభసాటిగా కూడా ఉంటుంది. అయితే దీనివల్ల సమాజం ఎంతగా నాశనం అవుతుందో ఎవరికీ అర్ధం కావడం లేదు. ఎవరెన్ని చెప్పినా సినిమా అనేది ఒక శక్తివంతమైన మాధ్యమం అనీ అదిఎన్నో జీవితాలను ప్రభావితం చేస్తుంది అనీ అనడం అబద్దం కాదు.

ఇంటర్ చదువుతున్న విద్యార్ధుల ప్రేమకధ అంటూ ఒక పదిహేనేళ్ళక్రితం వచ్చిన ఒక చిత్రమైన సినిమాతో టీనేజి లవ్వులు సమాజంలో విజ్రుమ్భించిన సంగతి అందరికీ తెలిసిందే.ఇప్పుడు చాలామంది అమ్మాయిలు కూడా "ప్రేమకి కొందరు-పెళ్ళికి ఒక్కరు" అనే సిద్ధాంతాన్ని అనుసరిస్తూ ఉన్నారంటే సినిమాలు టీవీలదే  పూర్తిబాధ్యత. పెళ్ళికిముందు సాధ్యమైనంత ఎక్కువమందితో తిరిగేసి తర్వాత ఎవడో ఒకడితో తాళికట్టించుకోవడం నేటి అమ్మాయిలకు ఫేషన్ అయిపోతున్నది.ఇక అబ్బాయిలకైతే విలువలు అనేవి పూర్తిగా మృగ్యమై పోతున్నాయి.ఇదీ సినిమాల ప్రభావమే. 

నేటిసమాజంలో విద్యార్ధి ని "జీవితంలో నీ ఆదర్శం ఎవరు" అనడిగితే సినిమానటుల పేర్లు చెబుతున్నాడు.అది కూడా తన కులపు హీరోపేరు చెబుతున్నాడు.సినీనటుల అభిమానసంఘాలన్నీ కులసంఘాలే అన్నది నగ్నసత్యం.అంతటి సంకుచితభావాలు నేటియువతకు ఉంటున్నాయి. భారతదేశాన్ని పరిపాలించిన మహనీయులైన ప్రాచీన చక్రవర్తుల పేర్లు కానీ,సంప్రదాయ నిర్మాతలైన మహర్షులపేర్లు కానీ,వారి చరిత్రలు కానీ నేడు ఎవరికీ తెలియవు.కనీసం నవీనకాలపు సంఘసంస్కర్తల పేర్లు, స్వాతంత్ర సమరయోధుల పేర్లు కూడా తెలియవు. నేటితరానికి తెలిసిందల్లా పక్షవాతం వచ్చిన కోతుల్లా ఎగిరే నటులపేర్లు మాత్రమే. నేటి యువతకు ఆదర్శప్రాయులు కూడా వీరే. అంతగా దిగజారిపోయింది ప్రస్తుత సమాజం.

సమాజాన్ని పూర్తిగా సర్వనాశనం చెయ్యడంలో సినిమాలు చక్కని పాత్రను పోషించాయి, ప్రస్తుతం కూడా పోషిస్తూ ఉన్నాయి అన్నది నిజం.సినిమా నటులే మనకు ఆదర్శంగా ఉన్నంతవరకూ మన మేధోస్థాయి ఎదిగే అవకాశం ఎంతమాత్రమూ లేదు అని నేను ఘంటాపధంగా చెప్పగలను. కలిపురుషునిస్థానాలుగా మన పురాణాలు కొన్ని కొన్ని ప్రదేశాలను సూచించాయి.ఆ జాబితాలో సినిమాహాళ్ళు కూడా చేర్చుకోవలసిన అవసరం ఉంది. సినిమానటులను కలిపురుషుల అవతారాలుగా భావించవచ్చు.

సినీనటులను యుగపురుషులుగా,మహానీయులుగా,మహానుభావులుగా  భావించి కీర్తించే స్థాయికి చెందిన మరుగుజ్జు మనస్తత్వాలున్న సమాజం ఔన్నత్యాన్ని పొందగలుగుతుందని ఎప్పటికైనా ఎలా ఆశించగలం?
read more " సినిమా నటులా మనకు ఆదర్శం? "

11, ఏప్రిల్ 2012, బుధవారం

ఆంధ్రాలో విద్యావంతుల కంటే కేరళలో తాగుబోతులు మేలు

మొన్నీ మధ్య మా స్నేహితులు కేరళ వెళ్ళి వచ్చారు. ఆ సందర్భంగా వారు చూచిన విషయం ఒకటి చెప్పారు. అక్కడ ఉన్న శుభ్రతా, ఏ వస్తువైనా దానిమీద ఉన్నధరకే అమ్మడమూ,మోసం లేకపోవడమూ, దేవాలయాలలో నియమనిష్టలు చక్కగా పాటించడమూ,రోడ్డుపక్కన మూత్రవిసర్జన చేసేవాళ్ళు వెతికి చూచినా లేకపోవటమూ, రైల్వే ట్రాక్ శుభ్రంగా ఉండటమూ, అడుక్కుండేవాళ్ళు కనపడకపోవటమూ,నదీతీరాలలో మలవిసర్జన  చేసేవారు లేకపోవడమూ  చూచి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. 

మన తెలుగువాళ్ళు కేరళని చూచి చాలా నేర్చుకోవలసిన అవసరం ఉందని వాళ్ళు వెంటనే గ్రహించారు. ఇవన్నీ ఇలా ఉంచితే,వాళ్ళను సంభ్రమానికి గురిచేసిన అసలైన  విషయం ఇంకోకటుంది. తిరువనంతపురంలో ఒకచోట పెద్ద క్యూ కనిపిస్తే, ఎవరా ఇంత క్రమశిక్షణతో క్యూలో నిలబడి ఉన్నారు?ఎక్కడికి పోతున్నారు? అని చూస్తె అదొక బార్.వాళ్ళంతా దానిముందు క్యూలో ఉన్న జనం.అంటే తాగుబోతులలో కూడా ఎంత క్రమశిక్షణ ఉందో అని మావాళ్లకు మతిపోయిందిట.

దీనికి వ్యతిరేకంగా మన ఆంధ్రాలో కొన్ని సంఘటనలు చూద్దాం.బాగా చదువుకున్న వాళ్ళు కూడా ఆంధ్రాలో ఎక్కడా క్యూలో నిలబడరు.ఏదో ఒకరకంగా అడ్డదారిలో దూరేద్దాం అనేచూస్తారు.గుడిదగ్గరైనా,బడి దగ్గరైనా,సినిమా హాలైనా,రైల్వేస్టేషనైనా,కారుపార్కింగ్ దగ్గరైనా,రోడ్డు మీదైనా ఎక్కడైనా ఇదే తంతు. సందు దొరికితే దూరిపోదాం అనే ప్రతివాడూ చూస్తాడు కాని క్రమశిక్షణతో క్యూలోవద్దాం అని ఎవడూ ఆలోచించడు.పోలీసు లేకపోతే, సిగ్నల్ దగ్గర స్వీయ క్రమశిక్షణ పాటించేవారు ఎంతమంది మన ఆంధ్రాలో ఉంటారు? అని ప్రశ్నించుకుంటే ఒక్కడంటే ఒక్కరు కూడా ఉండరు అని ఘంటాపధంగా చెప్పవచ్చు.

మొన్న ఏవో పరీక్షలు అయిపోయాయి.రోడ్డుమీద ఒక స్కూల్ బస్సు పోతున్నది. దాంట్లోంచి కాయితాలూ నోట్సులూ చించి విద్యార్ధులందరూ రోడ్డు మీదకు విసురుతున్నారు. ఆ కాయితం ముక్కలు ఆ బస్సు వెనుక వస్తున్న ఒక స్కూటరిష్టు ముఖాన పడ్డాయి.అతనా కంగారులో, నడిచివస్తున్న ఒకతన్ని గుద్దేసి  ఇద్దరూ కింద పడిపోయారు. ఈమధ్య ఇదొక పాడు అలవాటు మొదలైంది. పరీక్షలు అయిపోతే ఆ నోట్సులు అన్నీ చించి స్కూల్ బస్సులోనుంచి రోడ్డు మీదకి విసురుతున్నారు. ఆ కాగితాలు ఎవరు ఎత్తి పోస్తారు? అలా చెయ్యడం తప్పు అని ఆ విద్యార్ధులకు ఎవరూ చెప్పడం లేదు. కార్పోరేట్ స్కూళ్ళలో ఏమి క్రమశిక్షణ నేర్పుతున్నారో అర్ధం కావడం లేదు. మా చిన్నప్పుడు కాగితాన్ని పొరపాటున తొక్కితే, కాగితం సరస్వతీ స్వరూపం, తీసి కళ్ళకద్దుకోమని పెద్దవాళ్ళు బుద్ధి చెప్పేవారు.   

నేను మనదేశంలో చాలారాష్ట్రాలు చూచాను.మన ఆంధ్రాలో ఉన్నన్ని దరిద్రపు అలవాట్లు ఇతరరాష్ట్రాలలో ఎక్కడాలేవు (బీహార్ లాంటి కొన్ని రాష్ట్రాలు మినహాయించి)అని చెప్పగలను. ఇప్పుడు బీహార్ కూడా  బాగుపడుతున్నది.దానిస్థానాన్నిత్వరలో మన ఆంధ్రా ఆక్రమించబోతున్నది. దక్షిణాదినున్న నాలుగురాష్ట్రాలలో కేరళ కర్నాటకలు బాగుంటాయి. తమిళనాడు ఆంధ్రాలు వాటిముందు దిగదుడుపే.ఈ రెంటిలో మళ్ళీ మనఆంధ్రా పరమదరిద్రం. మనకు శుచీశుభ్రతా, క్రమశిక్షణా ఏకోశానా లేవు. మిగతారాష్ట్రాలవాళ్ళు మన  ఆంధ్రాకు వచ్చి ఈస్తితి మీద  చండాలంగా కామెంట్ చెయ్యడం చాలాసార్లు చూశాను. అందులో నిజం లేకపోలేదు.

ఆంధ్రాలో చదువుకున్నవాళ్ళ కంటే, కేరళలో తాగుబోతులు నయం అనేది నిజమే అనిపిస్తోంది.
read more " ఆంధ్రాలో విద్యావంతుల కంటే కేరళలో తాగుబోతులు మేలు "

10, ఏప్రిల్ 2012, మంగళవారం

ఈ రోజు డా. హన్నేమాన్ పుట్టినరోజు

వాన ముందు పుట్టే ఉసిళ్లలాగా ఈ ప్రపంచంలో ఎందఱో పుట్టి చనిపోతుంటారు. శిశ్నోదర పరాయణులై నిరర్ధకమైన జీవితాలు గడుపుతూ ఉంటారు.కాని జీవితాన్ని ఒక ఉన్నతమైన ఆశయం కోసం వెచ్చించి, చనిపోయేముందు గొప్ప ఆత్మతృప్తితో, "నేను నా జీవితాన్ని వ్యర్ధంగా గడపలేదు. నావల్ల మానవాళికి ఈమంచి జరిగింది.నేను భూమ్మీద పుట్టినందుకు ఇంతమందికి మేలు చెయ్యగలిగాను. మానవాళికి ఎప్పటికీ మిగిలిపోయే ఈ మంచి పనిని నేను చేశాను. ఈ తృప్తి నాకుచాలు." అన్న భావనతో చనిపోయేవారు ఎక్కడో అరుదుగా ఉంటారు. అలాంటి వాళ్ళే కారణజన్ములు. వాళ్లకు మన మెప్పులూ కిరీటాలూ అవసరం లేదు. వాళ్ళు వచ్చ్సిన పని చేసి నిష్క్రమిస్తారు.

ఇదంతా ఎందుకు వ్రాస్తున్నానంటే, ఈ రోజు ప్రపంచ మానవాళికి అద్భుతమైన మేలు చేసిన ఒక నిజమైన మహనీయుడు పుట్టినరోజు. రెండువందల ఏళ్ల క్రితం ఇదే తేదీన డా. హన్నేమాన్ జన్మించాడు. ఎనభై ఏళ్ల సార్ధక జీవితాన్ని గడిపి, దాదాపు నూరుకు పైగా మందులను కనిపెట్టి, హోమియో సూత్రాలను క్రోడీకరించి, దీర్ఘవ్యాధుల స్వరూపాన్ని అర్ధం చేసుకొని, వాటిని నయం చెయ్యాల్సిన తీరును వివరించి చెప్పి, కొన్ని కోట్ల మందికి ప్రాణదానం చేసిన మహనీయుడు డా. హన్నేమాన్. కాని ఇలాంటి వారిని ఎవరూ తలుచుకోరు. ఎక్కడో కొందరు తెలిసినవాళ్ళు మాత్రం వారిని స్మరిస్తారు. మిగతా గొర్రెలన్నీ, సినిమానటులనో రాజకీయ నాయకులనో చూస్తూ భజన  చేస్తూ ఉంటాయి.

ఒక్క ఔషదం కనిపెట్టినవాడికి నోబెల్ ప్రైజ్ ఇస్తే, నూరు మందులు కనిపెట్టినవాడికి ఏమివ్వాలి? ఒక శాస్త్రంలో ఒక సూత్రాన్ని కనుగొన్నవాడిని గొప్ప శాస్త్రవేత్తగా హారతి పడితే, ఒక శాస్త్రాన్ని ఆమూలాగ్రమూ తానొక్కడే నిర్మించి, దానిని సూత్రీకరించి,క్రోడీకరించిన వానికి ఎంత గౌరవం ఇవ్వాలి? కానీ లోకం ఇలాంటి విషయాలు పట్టించుకోదు. దానికెప్పుడూ చౌకబారు విషయాలూ, నాశిరకం కాలక్షేపాలూ మాత్రమే కావాలి. ఎందుకంటే లోకుల మేధోస్థాయి అలాంటిది.

వైద్యరంగంలో ట్రీట్మెంట్ అనేది మానవతతో కూడి ఉండాలని, సరళంగా ఉండాలనీ, అనవసర మందులు వాడకూడదనీ, నిజాయితీగా ఉండాలనీ చెప్పినవాడు డా.హన్నేమాన్. పిచ్చివాళ్ళకు కరెంట్ షాకులివ్వకూడదనీ, గొలుసులతో కట్టకూడదనీ, వాళ్ళను మానవత్వంతో ట్రీట్ చెయ్యాలనీ, హింసించకూడదనీ చెప్పడమే కాక ఆచరించి చూపిన గొప్ప డాక్టర్ శామ్యూల్ హన్నేమాన్. ప్రూవింగ్ అన్న విధానాన్నీ, పొటేన్టైజేషన్ అన్న ప్రక్రియనీ కనిపెట్టి, కనీసం నూరుమందుల స్వరూప స్వభావాలను రికార్డ్ చేసిపెట్టి,  మయాజంస్ అనే దీర్ఘరోగకారక దోషాలను గుర్తించి, వాటిని ఎలా ట్రీట్ చెయ్యాలో వ్రాసిపెట్టి లోకానికి మహోపకారం చేసిన కారణజన్ముడు డా. హన్నేమాన్. 

ఒక మనిషి,మానవాళి మేలుకోసం తపించి,ఒక శాస్త్రాన్ని పునాదులనుంచి నిర్మించుకుంటూ వచ్చి,ఒక మహాసౌధంగా దాన్ని తయారుచేసి,తన కష్టాన్ని లోకంకోసం ధారపోసి తృప్తిగా వెళ్ళిపోయిన ఇటువంటి జీవితాలు లోకంలో అతి కొన్నిమాత్రమే ఉంటాయి.కానీ ఇలాటివాళ్ళను లోకం అసలు గుర్తించదు. పనికిమాలిన సినిమానటులకూ రాజకీయనాయకులకూ మాత్రం  కుళ్ళులోకం బ్రహ్మరధం పడుతుంది.

డా. హన్నేమాన్ తన చివరిరోజులలో ఒక మాట అనేవాడు -- "My life has not been spent in vain." డబ్బు సంపాదించడమో, లేక భార్యా పిల్లలను పోషించడమో లేక పది ఇళ్ళు కట్టించడమో చేసి అదేదో గొప్ప ఘనకార్యం చేసినట్లు ఉబ్బిపోయే లోకులకు ఈ మాటలోని లోతు అర్ధం కావాలంటే వాళ్ళు ఒక పది జన్మలెత్తాలి. అప్పుడు గాని వాళ్లకు కావాల్సినంత  పరిణతి రాదు. ఈ మాటను నిజాయితీగా మనలో ఎందరం అనగలమో, డా. హన్నేమాన్ జన్మదినం రోజున ఒక్కసారి ఆత్మపరిశీలన చేసుకుందామా?
read more " ఈ రోజు డా. హన్నేమాన్ పుట్టినరోజు "

9, ఏప్రిల్ 2012, సోమవారం

కాలజ్ఞానం - 9

మూలుగుతున్న దేశానికి 
వ్యతిరేకంగా కుట్ర 
విధ్వంసరచనకు వీలు కల్పిస్తోంది
స్వార్ధ నాయకులకు
ముందు చూపేదీ 
కన్నతల్లిని అమ్ముకునేవాళ్ళకు
నీతి ఎలా ఉంటుందీ?
నీచులంతా కలిసి 
నిస్సహాయ అబలను 
చుట్టుముడతారు
read more " కాలజ్ఞానం - 9 "

8, ఏప్రిల్ 2012, ఆదివారం

ఓషో రజనీష్ జాతకం,భావజాలం -5

రజనీష్ గురించి ఒకరెవరో చెబుతూ ఇలా అన్నారు. He is best of the best and worst of the worst. బహుశా ఆయన కోరుకున్న ఇమేజి కూడా అదేనని అనిపిస్తుంది. తనగురించి ఒక ప్రసంగంలో చెబుతూ ఆయన  ఇలా అన్నాడు-- 

'కొంతకాలం తర్వాత నా గురించి ఎవరైనా రీసెర్చ్ చేస్తే, వారు నా గురించి ఏమీ చెప్పలేని అయోమయంలో పడతారు. ఎందుకంటే నేనేమీ కొత్త  సిద్ధాంతాన్ని నిర్మించలేదు. ఉన్న సిద్ధాంతాలను ధ్వంసం చెయ్యడమే నేను చేశాను. నేను ఒకచోటచెప్పిన దానిని ఇంకొకచోట ఖండించాను. కనుక చివరికి ఏమీ మిగలదు.' ఇది నిజమే. రజనీష్ సిద్ధాంతాలను సరిగ్గా అధ్యయనం చేసినవారు చివరికి ఏమీ చెప్పలేని మౌనంలో మునిగిపోతారు.

ఇప్పటివరకూ వచ్చిన గురువులలో రజనీష్ లాగా ప్రపంచంలోని అన్ని టాపిక్స్ మీదా ఓపెన్ గా మాట్లాడిన వాళ్ళు ఎవరూ లేరు. చాలామంది గురువులు మాట్లాడటానికి ఇష్టపడని విషయాల గురించి కూడా ఆయన మామూలుగా చర్చించాడు. రజనీష్ ఉపయోగించే తర్కం సూటిగా ఉంటుంది. అది హృదయాన్ని హత్తుకుంటుంది. చాలా తార్కికంగా కాదనడానికి వీల్లేకుండా ఉంటుంది.

సైన్సునూ సైకాలజీనీ చరిత్రనూ సామాజికశాస్త్రాన్నీ యోగాన్నీ మతాన్నీ వివిధ ప్రవక్తలనూ ఉటంకిస్తూ ఆయన చేసిన ప్రసంగాలు విషయపరిజ్ఞానంలోనూ లోతులోనూ తర్కపటిమలోనూ చెప్పేతీరులోనూ అద్భుతంగా ఉంటాయి.ఆయన ఉపన్యాసం విని ఒక విధమైన  'హిప్నాటిక్ స్పెల్' కు లోనవని మనుషులు చాలా అరుదు. 

సామాజికసమస్యల గురించి ఆయన చర్చించిన తీరూ వాటికి ఆయన సూచించిన పరిష్కారాలూ ఒక మార్మికవాది సూచించినట్లే ఉంటాయి.అవి అత్యుత్తమ వేదాంతాదర్శాలను ప్రతిబింబిస్తూ ఉంటాయి. కనుక ఆచరణలో అందరికీ సాధ్యపడవు. కాని అంతమాత్రాన మార్మికవాదులు తమ భావనలను పలుచన చేసుకొని రాజీపడరు. ఉదాహరణకి,దేశాల మధ్య సరిహద్దులనేవి ఒక బూటకం అని ఆయన అన్నాడు. భూమి అంతా ఒకటే, మనమే గీతలు తీసుకొని సరిహద్దులు ఏర్పరచుకున్నాం. ఇదొక అనవసర చర్య అని ఆయన అంటాడు. అలాగే, సైన్యాన్ని మేపడం అనేది సుద్ధ దండగమారిపని అని ఆయన అంటాడు.ప్రపంచ దేశాలు సైన్యం మీదా ఆయుధాల మీదా ఖర్చు పెడుతున్న డబ్బుతో ప్రపంచంలో ఎవరికీ ఏ బాధా లేనన్ని సౌకర్యాలు కల్పించవచ్చు అంటాడు.పోలీస్ వ్యవస్థ కూడా అనవసరం అని ఆయన ఉద్దేశ్యం. ఆదర్శరాజ్యంలో పోలీసులు అవసరం లేదని ప్లేటో కూడా చెప్పాడు. 

కొన్ని విషయాలలో ఆయనలో ఒక ప్లేటో కనిపిస్తాడు. ఒక సోక్రటీస్ కనిపిస్తాడు. ఒక అష్టావక్రుడూ,ఒక పతంజలీ దర్శనం ఇస్తారు. ఆయన భావాలు సోషలిస్టుభావాలకూ కమ్యూనిస్టుభావాలకూ దగ్గరగా ఉన్నట్లు కనిపిస్తాయి. నిజమైన ఆధ్యాత్మికవాదుల భావాలు అలాగే ఉంటాయి. అయితే వాటిలో భౌతికవాదం కంటే ఆధ్యాత్మిక కోణాలు ఎక్కువగా ఉంటాయి. అంతే తప్ప ఆధ్యాత్మికానికీ సోషలిజానికీ పెద్ద భేదాలు లేవు.

ఉన్నతమైన ఆధ్యాత్మిక విషయాలను రజనీష్ చెప్పినంత సులభమైన భాషలో,వివరణాత్మకమైన శైలిలో ఇంతవరకూ ఏ గురువూ కూడా చెప్పలేదు అంటే అతిశయోక్తి కాదు. రజనీష్ ఉపన్యాసశైలి విలక్షణంగా ఉంటుంది. ఏదో ఒక అతీతమైన టాపిక్ ను ఎంచుకొని ఆయన ఎప్పుడూ ఒక గహనమైన ఉపన్యాసం ఇవ్వలేదు. ఈ విషయంలో ఆయన బుద్దున్ని అనుకరించాడు. బుద్దుడు కూడా ఎప్పుడూ ఒక వ్యక్తిని ఉద్దేశించి అతను అడిగిన ప్రశ్నకు మాత్రమే  సమాధానం చెప్పేవాడు. నేటి గురువులవలె ఒక గహనమైన  టాపిక్ మీద ఆయన ఊకదంపుడు ఉపన్యాసాలు ఇవ్వలేదు.అదే శైలిని రజనీష్ కూడా అనుకరించాడు. అది చాలా మంచి పద్ధతి. 

బుద్ధునికి వ్యక్తి ముఖ్యం. అంతేగాని సమాజం కాదు. వ్యక్తులనుంచి సమాజం వస్తుంది కాబట్టి వ్యక్తులను చక్కదిద్దితే సమాజం చక్కదిద్దబడుతుంది. అంతేగాని ఊరకే నీతిసూత్రాలు గాలిలో వల్లించినంత మాత్రాన సమాజం మారదు. గురువులూ ప్రవక్తలూ సమాజాన్ని ఎప్పుడూ లెక్కచెయ్యరు. సమాజం వారిని అనుసరించాల్సిందే. లేకుంటే అఘోరించాల్సిందే. అంతేగాని వారు సమాజాన్ని ఎన్నటికీ అనుసరించరు. సమాజం ఉన్న స్తితిలో కంటే ఉన్నత స్థాయిలో వారు ఉండటమే దానికి కారణం. 

రజనీష్ ఉపన్యాసాలలో వేదాలు,ఉపనిషత్తులూ,యోగమూ,తంత్రమూ అన్నీ తొంగి చూస్తుంటాయి. ప్రపంచప్రవక్తలు అందరూ సమయానుసారంగా స్టేజిమీదకి వచ్చి వారివారి భావాలను చెప్పి వెళ్లిపోతుంటారు. చివరికి అంతా ఒక చక్కని ముగింపుకు వస్తుంది. ఈ కోణం రజనీష్ ఉపన్యాసాలలో చాలాసార్లు మనం చూడవచ్చు. అందుకే ఆయన ఒక అద్భుతవక్త అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.విషయపరిజ్ఞానంలో ఆయన ఏ ఇతరగురువుకూ తీసిపోడు.చాలాసార్లు చాలామంది గురువులు ఆయన ముందు వెలవెలా పోతారు అనడంలోనూ సందేహం లేదు. అన్ని వేలమంది జిజ్ఞాసువులు ఆయన బోధలకు ఎందుకు ఆకర్షింపబడ్డారంటే ఇవే కారణాలు. 

రజనీష్ వ్యక్తిగతంగా ఒక ఉన్నతమైన ఆధ్యాత్మికస్థాయిని అందుకున్నవాడే. అందులో అనుమానం లేదు.కాని తనబోధలతో ప్రజలను అందరినీ సామూహికంగా స్వర్గానికి చేర్చాలని ఆయన తలపోశాడు. మానవసమాజాన్ని ఒక్కసారిగా కొన్నివేల సంవత్సరాలు ముందుకి తీసికెళ్లాలని అనుకున్నాడు. ఆయన బోధలు కూడా అలాటివే. కాని అది సాధ్యమయ్యే పని కాదు. ఎందుకంటే ప్రపంచం చీకటిలో ఉంది. ఇక్కడ మాటలు చెప్పేవారు ఎక్కువ,చేతలలో చూపేవారు తక్కువ. ఎందరు ఎన్నినీతులు చెప్పినా చివరికి అందరికీ భోగమే కావాలి. ఆధ్యాత్మికత ఎవరికీ అవసరం లేదు.నేలబారు బతుకులకు అలవాటుపడిన మనుషులను ఒక్కసారిగా మేఘాలలోకి తీసికెళ్ళాలంటే అది సాధ్యంకాదు.ఇక్కడే అందరు ప్రవక్తలూ గురువులూ ఓడిపోయారు. ఆశాభంగానికి గురయ్యారు.

ఏ కాలంలోనైనా సరే,ఉన్నతజీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకునేవారు చాలా తక్కువమందే ఉంటారు.మిగతా అందరూ విషయాన్ని తెలుసుకోవడానికి ఇష్టపడతారు,కాని ఆచరణకు ఎవ్వరూ ముందుకు రారు. ఇది సృష్టి మొదటినుంచీ వస్తున్న మానవచరిత్ర.అందుకే మహాగురువులందరూ కొద్దిమంది అర్హులైన శిష్యులను మాత్రమే ఎంచుకొని వారికి మాత్రమే రహస్యమైన స్వర్గద్వారాలమెట్లను చూపించారు.అవి ఎలా ఎక్కాలనే రహస్యాలనుకూడా అర్హత ఉన్న అతి కొద్దిమందికే వారు నేర్పించారు.ఎందుకంటే ఆధ్యాత్మిక రహస్యాలు బజారులో అందరితో చర్చించదగ్గవి కావు.అవి అర్హులైన కొందరికే అందుతాయి.అర్హత అనేది భౌతిక సమాజంలో కూడా అవసరమే కదా.లోకంలో ఒక మంచిఉద్యోగాన్ని మనం సాధించాలంటే కూడా మనకు కొన్ని అర్హతలు ఉండాలి. దానికి తగిన పరీక్షలు పాసవ్వాలి. ఎవరుబడితే వారు అన్నీ సాధించలేరు.మరి దివ్యజీవనాన్ని పొందాలంటే ఏ అర్హతలూ అవసరం లేదు,అది అందరికీ అందుతుంది,అందాలి అనుకుంటే ఎలా? అదెన్నటికీ సాధ్యం కాదు.

స్వర్గద్వారాలను అందరికీ తెరుద్దామని రజనీష్ అనుకున్నాడు. అది జరిగే పనికాదు అని ఆయనకు తన జీవితం చివరిలో అర్ధమయింది. అందుకే తన చివరి మాటగా - I leave you my dream. అని చెప్పి కన్నుమూశాడు. ఎంచుకున్న కొందరు ప్రత్యేకశిష్యులతో ఒక మార్గంలో ప్రయాణించడం తేలిక. కాని,మందినందర్నీ తనతో తోలుకొనిపోవాలంటే బాధలెక్కువ.వారు కదలరు.వీళ్ళని అడుగు ముందుకు పడనివ్వరు.బహుశా రజనీష్ అందుకే విఫలమయ్యాడు.అంతేకాదు,ప్రతి ప్రవక్తా గురువూ ఇదేవిధంగా చివరికి విఫలం అవక తప్పదు.పరిమిత లక్ష్యాలు పెట్టుకున్న గురువులకు సుఖంగా ఉంటుంది.వారు అనుకున్నపని అయిపోతుంది,వారు వెళ్ళిపోతారు.కాని ప్రపంచమానవస్థాయిని ఒకేసారి ఉద్దరించాలన్న పెద్దపెద్ద ఆశయాలు పెట్టుకున్న వారికి చివరికి ఆశాభంగం తప్పదు.ఎందుకంటే ప్రకృతిఊహ ఒకవిధంగా ఉంటే,దానికి విరుద్ధంగా లక్షలసంవత్సరాల పరిణామాన్ని ఒకేతరంలో తేవాలని వారు ప్రయత్నిస్తారు.ఇది సృష్టిప్రణాళికకు విరుద్ధం కనుక వారు ఓడిపోక తప్పదు.ఎవరైనా సరే ప్రకృతిని ధిక్కరించి సాధించేది అంతిమంగా  ఏమీ ఉండదు.

బుద్ధుని మధ్యేమార్గాన్ని రజనీష్ ఆదర్శంగా స్వీకరించాడు.శరీరాన్ని హింసపెట్ట్టే ఉపవాసాలు మొదలైన పిచ్చిపనులు సాధనకు అనవసరం అని ఆయన తలచాడు.ఇది  సరియైన భావనే. యోగం కూడా ఇదే చెబుతుంది. నిజమైన యోగులకు ఈ విషయం తెలుసు.అంతేకాదు సీరియస్ గా ముఖం పెట్టుకుని అసలు నవ్వకుండా ఉండటం ఆధ్యాత్మికలక్షణం కాదు అది రోగలక్షణం అనికూడా ఆయన చెప్పాడు.ఇదీ నిజమే.బలవంతాన నియమనిష్టలు పాటించడం పరమదండగ. లోపల కోరికలుంచుకుని బయటకి ప్రవరాఖ్యులవలె నటిస్తే ప్రయోజనం లేదు.అలా అణిచిపెట్టుకోడంవల్ల ఉపయోగం లేకపోగా న్యూరోటిక్ రోగాలు వస్తాయి అనికూడా ఆయన చెప్పాడు. చాలామంది దీనిని తప్పుగా అర్ధం చేసుకుని రజనీష్ విచ్చలవిడి సెక్స్ ని బోధించాడు అని భావించారు. ఇది పూర్తిగా తప్పుభావన. తన ఉపన్యాసాలలో ఇదే విషయాన్ని ఆయన చాలాసార్లు చెప్పాడు.మితిలేని భోగమూ తప్పే,అణచివేతా తప్పే,ఎరుకతో కూడిన నియమాన్ని అనుసరించమని రజనీష్ చెప్పాడు. ఇది అక్షరసత్యం.ఏ నియమమైనా తన అవగాహన నుంచి ఎరుక నుంచి ఏర్పడాలి అని ఆయన అన్నాడు. ఇదీ సత్యమే.

అందుకే నేడు యోగాలూ దీక్షలూ చేస్తున్న అనేకమంది జీవితాలలో ఏమీ మార్పులు కనపడవు. దానికి కారణం ఏమంటే, ఉండాల్సిన చండాలం అంతా లోపల ఉంచుకుని బయటకు నల్లగుడ్డలూ ఎర్రగుడ్డలూ డ్రస్సులు మార్చి దీక్షలంటూ నాటకాలాడినంత మాత్రాన ఏమీ జరగదు. మనం కొట్టే కొబ్బరికాయలకు దాసోహం అనడానికి దేవుడు కోతికాదు.మనం మొక్కుకునే అనైతికమొక్కులలో ఆయన ఎన్నటికీ భాగస్వామీ కాబోడు.నిజమైన ఆధ్యాత్మికతను పిచ్చిజనం ఎన్నటికీ గ్రహించలేరు.ఒకవేళ గ్రహించినా ఆచరించలేరు.వీళ్ళకు మిగిలేవన్నీ ప్రాణంలేని తంతులూ, పిక్నిక్ పూజలూ, వారికే అర్ధంకాని వ్రతాలూ, నామతం గొప్పంటే నామతం గొప్ప అంటూ,మతంపేరుతో కొట్టుకుచావటాలూ మాత్రమే.

ఇది గురువులకు తెలియదా మరి? అంటే తెలుసనే చెప్పాలి. మరి తెలిసినాకూడా లోకంతో వారికెందుకీ బాధ? అంటే ఒకటే సమాధానం వస్తుంది.లోకంపట్ల వారికున్న కరుణవల్ల వారు లోకులకు దారిచూపాలని భావిస్తారు. వారు మేఘాలలోకి వెళ్లారు. అక్కడ చాలా హాయిగా ఉంది. ఈ భూమ్మీది బాధలేవీ అక్కడ లేవు.ఆ విషయాన్ని అందరికీ చెప్పాలనీ,అక్కడికి చేరే దారి అందరికీ చూపాలనీ వారి తాపత్రయం.మనం పడే బాధలు అజ్ఞానజనితాలనీ, మన జీవితాలను మనం వృధా చేసుకుంటున్నామనీ  వారికి తెలుసు.ఇంత  జీవనపోరాటం అనవసరం అనీ, ఇలా కాకుండా కూడా మనిషి హాయిగా బ్రతకొచ్చు అనీ, స్వర్గానికి చేరేదారి ఒకటుందనికూడా వారికి అనుభవపూర్వకంగా తెలుసు. ఆ దారిని లోకులకు చూపాలని వారు తపిస్తారు. ప్రవక్తలందరూ ఇలాగే తపించారు. కాని వారందరూ చివరికి తీవ్ర ఆశాభంగం చెందారు. 

ఎందుకంటే మానవులు స్వాభావికంగా చీకటిలో ఉండటానికే ఇష్టపడతారు. కాని అదే సమయంలో వెలుగును ప్రేమిస్తున్నట్లు నటిస్తారు. అలా నటించకపోతే తమను అనాగరికులుగా ఇతరులు భావిస్తారేమో అన్న భయమే ఈప్రవర్తనకు కారణం.అసలు మనిషి జీవితమే నాటకాలమయం.స్వచ్చమైన ప్రవర్తన కలిగినవారు ఒక్కరంటే ఒక్కరు కూడా ఈలోకంలో లేరు అనేది నగ్న సత్యం.

లోకంలో భక్తులు పెరిగిపోతున్నారు అని బాధపడుతున్న తన అనుచరుడితో సైతాన్ ఇలా అన్నాట్ట. "నువ్వేమీ బాధపడకు. ఈ లోకంలో అందరూ నా అనుచరులే,నా భక్తులే. దైవభక్తులుగా నటిస్తున్నవారు కూడా నిజానికి నా భక్తులే.ఈ మతమూ,దేవుడూ,పూజలూ తెలియని మామూలు మనుషులతో పోలిస్తే భక్తులే నిజమైన దొంగలు. వాళ్ళు బయటికి దేవుని భక్తులు, కాని లోపల మాత్రం అందరూ నా భక్తులూ అనుచరులూనూ." క్రైస్తవులూ, ముస్లిములూ చెప్పే సైతాన్ అనేవాడు అసలు లేనేలేడు. అది వేరే విషయం. కాని ఈ కధ మాత్రం సత్యం.

మనిషి యొక్క ఈ నాటకాన్ని అంతం చెయ్యాలనే ప్రతి ప్రవక్తా తపిస్తాడు. రజనీష్ కూడా అలాగే తపించాడు. కాని ఏ ప్రవక్తనూ సమాజం సరిగ్గా అర్ధం చేసుకోదు, అనుసరించదు.అనుసరించినట్లు నటిస్తుంది. రజనీష్ కూ అదే గతి పట్టింది.

(మిగతాది ఆరో భాగంలో) 
read more " ఓషో రజనీష్ జాతకం,భావజాలం -5 "

7, ఏప్రిల్ 2012, శనివారం

కాలజ్ఞానం -8

వాహనాల ప్రమాదాలు
ఎగసిపడే కోరికలు 
విలాసజీవిత కష్టాలు  
కనిపించే అగ్నిజ్వాలలు 
పోటెత్తే నేరాలు 
బలయ్యే అబలలు 
ముంచెత్తే జలాలు
కపట పొరుగుదేశాలు 
ఓ మంజునాధా ...
read more " కాలజ్ఞానం -8 "

6, ఏప్రిల్ 2012, శుక్రవారం

బాబు జగజ్జీవన్ రాం జాతకం - అధికార యోగాలు

బాబూ జగజ్జీవన్ రాం 5-4-1908  తేదీన బీహార్లో జన్మించాడు. పేదరికంలో, నిమ్న కులాలలో పుట్టినప్పటికీ జాతకంలో మంచి యోగాలు ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో ఉన్నతస్థానాలకు తప్పకుండా  ఎదుగుతాడు అన్న విషయం ఈయన జాతకంలో ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. మంచి పూర్వకర్మ లేకుంటే ఇటువంటి యోగాలు జాతకంలో ఉండవు. కనుక ఇతనికి మంచి పుణ్యబలం ఉందని అర్ధం చేసుకోవాలి. ఈయనయొక్క జనన సమయం దొరకలేదు. కనుక ముఖ్యమైన గ్రహస్తితులను బట్టి పైపైన చూద్దాం.

ఈయన చైత్రశుక్లపంచమి రోజున, శనివారంనాడు, రోహిణీ నక్షత్రంలో జన్మించాడు. జనన సమయానికి చంద్రుడు గురువు ఉచ్ఛస్తితిలో ఉన్నారు. వారాదిపతి శని, స్వనక్షత్రంలో ఉండి, ఉచ్ఛగురువుయొక్క క్షేత్రంలో  ఉన్నాడు. రాహుకేతువులు మంచిస్తితిలో ఉన్నారు. ఈ గ్రహస్తితులవల్ల జీవితంలో మంచి అభివృద్ధి తప్పక కలుగుతుంది. అలాగే జరిగింది కూడా.

శుక్లపంచమి చాలా మంచితిధి. తిధినిబట్టి ఒక వ్యక్తి జాతకంలోని రవిచంద్రుల  బలాన్ని వెంటనే తెలుసుకోవచ్చు. ఇది భారతీయజ్యోతిష్యంలోని ఒక గొప్పసూత్రం. పాశ్చాత్య జ్యోతిష్యంలో ఇటువంటి విధానాలు లేవు. బుధుడు ఉచ్చ గురువుయొక్క నక్షత్రంలో ఉండటం వల్ల,  మంచి విద్య కలిగింది.  ఈ యోగంవల్ల, ఆరోజులలోనే, బెనారెస్ హిందూ యూనివర్సిటీ, కలకత్తా యూనివర్సిటీలలో చదివాడు. ఉచ్ఛగురువు యొక్క దృష్టి శని రవుల మీద ఉంది. ఈ యోగం వల్ల, సామాన్యజనానికి సంబంధించిన ధర్మపోరాటం చేస్తాడనీ, ఆ కోణంలో ఉన్నతస్థానాలకు చేరుకుంటాడనీ, అధికార ప్రాప్తి ఉంటుందనీ అర్ధం అవుతుంది. గురుగోచారంలో మూడవ ఆవృత్తిలో కుజచంద్రశుక్రులను తాకినప్పుడు,36ఏళ్ళకే, నెహ్రూమంత్రిమండలిలో అతిచిన్నవయస్కుడైన మంత్రి అయ్యాడు అంటే గురుచంద్రుల ఉచ్ఛస్తితి ఎంత బలీయంగా పనిచేసిందో చూడవచ్చు. దీనికి తోడు రాహుకేతువుల మంచిస్తితి తోడై 30 సంవత్సరాలపాటు కేబినేట్ మంత్రిగా పనిచేసే అదృష్టాన్ని ఇచ్చింది. ఇది చిన్నాచితకా యోగం కాదు.రాహుకేతువుల మంచి స్తితివల్ల ఈవిధంగా కాలం కలిసివస్తుంది.

రవి శనుల యుతి వల్ల ఆయన అలంకరించిన పదవులన్నీ, లేబర్ , రైల్వే , ఆహారం, వ్యవసాయం,రవాణా ఇత్యాదులయ్యాయి. ఒక మనిషికి వచ్చే పదవులూ,చేసే ఉద్యోగాలూ కూడా జాతకపరంగానే ముందే నిర్ణయింపబడి ఉంటాయి. దానికి భిన్నమైన ఉద్యోగాలూ వృత్తులూ చెయ్యాలని ఆశ ఉన్నా అది వీలుకాదు. ఇది ఎన్నో జాతకాలలో నిరూపితమైంది.

గురువుగారి ఏడో ఆవృత్తిలో కేతువుని తాకినప్పుడు తన  78వ ఏట ఈయన  మరణించాడు. ఒక మనిషి చదివేచదువూ,చేసే వృత్తీ, జీవితంలో ఎదుగుదలా, ముఖ్య సంఘటనలూ, చివరికి మరణం కూడా, ఎలా జరగాలో ముందే నిర్ణయింపబడి ఉంటుంది అని ఎన్నోజాతకాలలో స్పష్టంగా కనిపిస్తుంది. అయితే,జాతకాన్ని సరిగా డీకోడ్ చెయ్యడం రావాలి.

ఒక మనిషి జాతకం బాగుంటే, అతను ఏ కులంలో,ఏ సామాజిక వర్గంలో, ఎంత అట్టడుగు స్థాయిలో పుట్టినప్పటికీ ఉన్నతస్థానాలకు చేరుకోగలడు అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే అతని కృషి లేకుండా ఉత్తజాతకమే సరిపోతుందా, తలుపులేసుకుని ఇంట్లో కూచుంటే అన్నీ అవేవచ్చి ఒళ్లో పడతాయా అనే అనుమానం చాలామందికి వస్తుంది. ఈ అనుమానం అర్ధరహితం. జ్యోతిష్యాన్ని సరిగ్గా అర్ధం చేసుకోలేకపోవడం వల్లే ఇలాంటి సందేహాలు వస్తుంటాయి. జాతకం బాగా ఉన్నప్పుడు అతనికి ఎదగాలని ఆకాంక్ష, తపన, పట్టుదలలు ఉంటాయి. దానికి తోడు అవకాశాలు కూడా సరైన సమయానికి కలిసి వస్తాయి. తద్వారా త్వరగా ఎదగడం జరుగుతుంది. అంతేగాని ప్రయత్నం లేకుండా ఇంట్లో కూచుంటే అదృష్టం అదే వచ్చి తలుపు తడుతుందని మాత్రం కాదు. అలాంటివారు అలా కూచోలేరు కూడా. దీనికి భిన్నమైన గ్రహస్తితులు ఉన్నప్పుడు జీవితం కూడా దానికి అనుగుణంగానే ఉంటుంది. అలాటి వారికి ఎదగాలని తపన ఉండదు. ఒకవేళ ఉన్నా కాలం కలిసిరాదు.

ఉన్నతస్థానాలకు ఎదిగిన వారి జాతకంలో, అటువంటి ఎదుగుదలను చూపే గ్రహస్తితులు తప్పకుండా ఉంటాయి. బాబూ జగజ్జీవన్ రాం జాతకం కూడా దీనికి నిదర్శనమే.
read more " బాబు జగజ్జీవన్ రాం జాతకం - అధికార యోగాలు "

1, ఏప్రిల్ 2012, ఆదివారం

బ్లాగు క్వాలిటీ -ఆధ్యాత్మిక సందేహాలు.

నిన్న ఒక మిత్రురాలు ఫోన్ చేసింది. 
'మీరేమనుకోక పోతే ఒక విషయం చెప్తా' అంది.
'చెప్పండి' అన్నాను. 
'మీ బ్లాగు గురించి మాట్లాడాలి' అంది.
'పర్లేదు చెప్పండి' అన్నాను.
'ఏమీ లేదు. మీ బ్లాగులో క్వాలిటీ తగ్గింది. మొదట్లో మంచి డెప్త్ ఉన్న పోస్ట్ లు వ్రాసేవారు. రాన్రాను వాటిల్లో డెప్త్ తగ్గుతూ వస్తున్నది. గమనించారా?' అడిగింది.
'డెప్త్ అంటే మీ ఉద్దేశ్యం ఏమిటి?' అడిగాను.
'అంటే,మంచి స్పిరిట్యువల్ డెప్త్ ఉన్న పోస్ట్ లు ఇంతకూ ముందు వ్రాసేవారు. ఇప్పుడు వ్రాయడం తగ్గించారు. అవునా?'
'మీరు సరిగ్గానే గమనించారు. అది నిజమే.' అన్నాను.
'ఎందుకలా చేస్తున్నారు. ఇలా చెయ్యడం బాలేదు.' అవతలనుంచి ప్రశ్న.
'చదువరులకు ఆకలి ఉందేమో అని ఇంతకు ముందు మంచి ఆహారం వండి పెట్టెవాణ్ని. అది సరైన విధానం కాదు అని తెలుసుకున్నాను. అందుకే వంటలో మార్పు చేసాను.' అన్నా.
'మరి ఈ మార్పు మీ అభిమానులకు బాధ కలిగిస్తోంది. మేం మీ నుంచి ఇంకా మంచి మంచి ఆధ్యాత్మిక పోస్ట్ లు కోరుకుంటున్నాం.' చెప్పింది.
'కుదరదు. మీ కోరిక నేను తీర్చలేను' చెప్పాను.
'ఎందుకో తెలుసుకోవచ్చా.' అటునుంచి ప్రశ్న.
'ఎందుకంటే,మొదటిగా మీలో ఎవరికేం కావాలో నాకు తెలియదు. రెండవదిగా, ఆధ్యాత్మికత అనేది ఊరకే చదివి ఆనందించే విషయం కాదు. మూడవదిగా, నిత్యమౌనులముందు ఊరకే వాగుతూ ఉండటానికి నేను హరికధాభాగవతార్ని కాను. నాలుగవదిగా,మీరు పంచవటి మెంబర్ అయితే అక్కడ అడగండి.మీ సందేహం తీరుస్తాను.' చెప్పాను.
'ఇవేవీ కాకుండా మరేం చెయ్యాలి.' అడిగింది.
'ఇప్పుడు మీరు నాతో మాట్లాడుతున్నారు కదా. మీరేం తెలుసుకోవాలని అనుకుంటున్నారో అడగండి. చెప్తాను' అన్నాను.
'అలా అయితే అది పర్సనల్ ఇంటరాక్షన్ అవుతుంది. ఇలా కాకుండా బ్లాగులోనే మీరు మంచి మంచి పోస్ట్ లు వ్రాయవచ్చు కదా.' అడిగింది.
'దానికి జవాబు ఇందాకే ఇచ్చానుకదా.నిజమైన ఆధ్యాత్మికత అనేది వ్యక్తిగతంగా మాట్లాడి తెలుసుకోవడం ద్వారానే అర్ధమౌతుంది. పైగా ఆధ్యాత్మికత అనేది పూర్తిగా వ్యక్తిగత వ్యవహారం. వ్యాసాలలో అయితే జెనెరల్ గా మాత్రమే మనం వ్రాయగలం.అది ఊహాజనితం.దానికంటే,మీ వ్యక్తిగత ఆలోచనలు సందేహాలు అడిగి తెలుసుకోడమే మంచిది.నిజమైన ఆధ్యాత్మికత మీరంటున్న పర్సనల్ ఇంటరాక్షన్ ద్వారానే వస్తుంది.' అన్నాను.


నా జవాబు ఆమెకు నచ్చినట్లు అనిపించలేదు. కానీ,అంతకంటే నేను చెయ్యగలిగిందీ లేదు. సత్యాన్ని చెప్పడంవరకే నావంతు. ఒకరి మెప్పు కోసం కల్లబొల్లి కబుర్లు చెప్పడం నా పని కాదు.

చాలామందితో వచ్చిన చిక్కే ఇది. వాళ్ళ మనసులో ఉన్న విషయం మనం కనిపెట్టి దానికి జవాబు చెప్పాలని కోరుకుంటారు. బయటపడి అడిగితే ఏదో తక్కువ అయినట్లు, ఏదో పోగొట్టుకున్నట్లు, చులకన అయినట్లు బాధపడతారు. అలా దాక్కుని ఆధ్యాత్మికసందేహాలు తీర్చుకుందామని చూడటం మంచిపద్దతి కాదు. అవి అలా తీరేవీ కావు. అడిగితే మనం చులకన అవుతామేమో అని బాధపడేవాళ్ళు ఆధ్యాత్మికతకు పనికిరారు. వాళ్ళు మానసికంగా ఇంకా చాలా ఎదగవలసి ఉంటుంది. ఆవిధమైన మానసికచట్రం నుంచి వారు బయటకు రావలసి ఉంటుంది.

పత్రికలలో, టీవీలలో, 'సందేహాలు-సమాధానాలు' శీర్షికల ద్వారా కొందరు ఏవేవో అడుగుతూ ఉంటారు. చెప్పేవాళ్ళు వారికి జవాబులు చెబుతూ ఉంటారు. కొన్ని పత్రికలలో యాజమాన్యమే కల్పించి ఆ ప్రశ్నలు వ్రాస్తారని కూడా అంటారు. ఉదాహరణకి 'సీత రాముని కంటే పెద్దదా?, 'హరిశ్చంద్రుని తల్లిదండ్రులెవరు?'' ఇలాటివి. ఇవన్నీ నాకు నవ్వు తెప్పిస్తూ ఉంటాయి. 


సీత రామునికంటే పెద్దదైనా చిన్నదైనా మనకు ఒరిగేదేమీలేదు. హరిశ్చంద్రుని తల్లిదండ్రులేవరో తెలిసినంత మాత్రాన మనకు ఆధ్యాత్మికంగా ఒక్క అడుగుకూడా ముందుకుపడదు.ఇలాటివన్నీ,ప్రయాణాలలో తోచక ఒకరికొకరు చెప్పుకునే కాలక్షేపం కబుర్ల వంటివి.  ఎవరి మజిలీ వచ్చిన తర్వాత వారు దిగిపోతారు. తర్వాత ఒకరికొకరు అసలు గుర్తుకూడా ఉండరు. ఈ సందేహాలూ సమాధానాలూ ఇలాంటివే. వాటివల్ల ఒరిగేది ఏమీ ఉండదు. ఇవి ఆధ్యాత్మికసందేహాలు కానేకావు.


అసలు ఆద్యాత్మికసందేహాలు ఆలోచనాస్థాయిలో తీరేవి కావు. నిజమైన ఆధ్యాత్మిక సందేహాలు అనుభవస్థాయికి చెందినవి. సరైన అంతరిక అనుభవంతోనే అవి తీరుతాయి. అనుభవం సాధనద్వారా మాత్రమె కలుగుతుంది. అది చెయ్యకుండా ఉత్త ఊహాజనిత సందేహాలు, పుస్తకాలు చదవడంవల్ల వచ్చిన సందేహాలు అడుగుతూ ఉండటంవల్ల ఏమీ ఫలితం ఉండదు. ఉత్త కాలక్షేపం మాత్రం జరుగుతుంది. మహా అయితే 'అహం' ఇంకా పెరుగుతుంది.

బౌద్ధికస్థాయిలో వచ్చే సందేహాలు, ఊహాజనిత సందేహాలు, ఆధ్యాత్మికమైనవి కావని, జెనెరల్ గా వ్రాసిన వ్రాతలవల్ల వ్యక్తిగత సందేహాలు తీరవనీ మనం గుర్తుంచుకోవాలి.
read more " బ్లాగు క్వాలిటీ -ఆధ్యాత్మిక సందేహాలు. "