“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, మే 2019, ఆదివారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 34 (సాధ్యమైనదే సాధన)

'ధర్మపదం' పుస్తకం ఆవిష్కరణకు జిల్లెళ్లమూడికి వెళ్లాము. అక్కడ అమ్మ పాదాల దగ్గర ఆ పుస్తకాన్ని ఆవిష్కరించాలని మా సంకల్పం. ముందుగా మా ఫ్లాట్ లో దిగి, ఫ్రెష్ అయ్యి, టిఫిన్లు చేసి, పుస్తకాలు తీసుకుని అమ్మ ఆలయానికి వెళ్ళాము. అక్కడున్న మేనేజర్ గారికి ఇలా చెప్పాను.

'మాకు ఈ పూజ తంతు అక్కర్లేదు. ఊరకే అమ్మ పాదాల దగ్గర ఈ పుస్తకాలు ఉంచి తిరిగి ఇవ్వండి చాలు.'

నేను చెప్పినది ఆయనకు అర్ధం కాలేదు. అందుకని అక్కడున్న పూజారిని పిలిచి "అంగపూజ ఒక్కటి చెయ్యండి చాలు" అని చెప్పాడాయన.

నేనుండి ' అదీ ఒద్దు. ఎంత వీలైతే అంత సింపుల్ గా చెయ్యండి. అసలు పూజే వద్దు.' అని చెప్పాను.

ఆ పూజారి అదేమీ పట్టించుకోకుండా 'ఆచమ్య, కేశవాయ స్వాహా, నారాయణాయ స్వాహా' అంటూ తనకలవాటైన తంతు మొదలు పెట్టాడు.

అమ్మ విగ్రహం వైపు చూచాను. గుంభనంగా నవ్వుతున్నట్లు అనిపించింది.

ఆ మంత్రాలూ అవన్నీ నాకు చిన్నప్పటినుంచీ తెలిసినవే. కానీ ఇప్పుడా మంత్రాలు వింటుంటే నాకు ఒళ్లంతా కంపరం ఎత్తుతోంది. ఎందుకంటే వాటిల్లో ప్రతిదానికీ - 'ఆభరణార్ధం అక్షతాన్ సమర్పయామి, వస్త్రార్ధం అక్షతాన్ సమర్పయామి' అంటూ చదవకూడని మంత్రాలు చదువుతున్నాడు ఆ పూజారి. అదీగాక ఆ దేవుడే ఎదురుగా ఉన్నప్పుడు ఇక ఈ మంత్రాలెందుకు? ఈ పూజారులెందుకు?

'బాబూ ఇక ఆపు నీ పూజ' అని అతనికి మెల్లిగా చెప్పాను.

ఏమనుకున్నాడో ఏమో, అదో రకంగా నన్ను చూస్తూ, పూజని కట్ షార్ట్ చేసి ముగించాడు పూజారి.

పూజ ముగిశాక బయటకు వస్తుండగా ఆ మేనేజర్ గారితో ఇలా చెప్పాను.

'మాకు ఈ తంతులు ఇష్టం ఉండదు. మేము చెప్పినట్లుగా మాకు చెయ్యండి చాలు. మాకీ పూజలూ అవీ అవసరం లేదు. ఇంకోసారి ఇలా చెయ్యకండి మాకు నచ్చదు.'

ఆయన నిర్లిప్తంగా చూచాడు నా వైపు.

'మీది ఏ మార్గం?' అని అడిగాడు.

'అమ్మ మార్గం' అని అందామని అనుకున్నా కానీ అనలేదు.

'ఆత్మవిచారణ మార్గమా మీది?' అడిగాడాయన.

'కలుస్తుంది' అన్నాను.

'ధ్యాన మార్గమా?' మళ్ళీ అడిగాడాయన.

'అదీ ఉంది' అన్నాను.

ఇంకేమనుకున్నాడో ఏమో ఆయనేమీ రెట్టించలేదు.

మర్నాడు కలిసినప్పుడు ఆయనిలా అన్నాడు.

'అమ్మ ఒకటంటూ ఎవరికీ ఏమీ బోధించలేదు. ఎవరికి వీలైనది వారిని చెయ్యమంది. 'సాధ్యమైనదే సాధన' అనేది అమ్మ బోధ. మీకు ధ్యానం నచ్చవచ్చు. మాకు పూజలు నచ్చవచ్చు. ఎవరి సాధన వారిది.'

నేనిలా అన్నాను.

'నేను చెబుతున్నదీ అదే. మాకు సాధ్యమైనది మేము చేస్తాము. మాదే చెయ్యమని మిమ్మల్ని బలవంతం చెయ్యము. మీకు పూజలు తంతులు సాధ్యమౌతున్నాయి. మీరవి చేసుకోండి. అవి మాకొద్దు. అవి కాకుండా ఇంకేదో మాకు సాధ్యమౌతోంది. దానిని మేము చేసుకుంటాము. మీ పూజలు మాచేత చేయించకండి. అమ్మ చెప్పినదే మేము ఆచరిస్తున్నాము. 'సాధ్యమైనదే సాధన' - కరెక్టే !' అన్నాను.

ఆయనకు అర్ధమైందో లేదో నాకర్ధం కాలేదు.

ఉన్నతమైన సాధనలు అందరూ చెయ్యలేరు. వాటికి కావలసిన అర్హతలు అందరికీ ఉండవు. ఆ కష్టం కూడా అందరూ పడలేరు. ఉన్నత స్థాయికి చెందిన సాధనలు చెయ్యలేనివారు, షోడశోపచార పూజలు, నోములు, వ్రతాలు, చేసుకుంటూ భక్తి చానల్ లో ప్రోగ్రాములు చూసుకుంటూ, మహా అయితే టీవీ ఉపన్యాసకుల ఉపన్యాసాలు వింటూ, ఏదో హిందూధర్మాన్ని ఉద్ధరిస్తున్నామనుకుంటూ భ్రమల్లో బ్రతకవలసిందే. వాళ్లకు చేతనైంది అంతే మరి !

గుళ్ళూ, పూజలూ, పారాయణలూ చాలా తక్కువ తరగతికి చెందిన 'లో క్లాస్' తంతులు. వాటిని దాటినవారికి అవి అవసరం ఉండవు. ఇప్పటికే నాలుగు పీ.హెచ్.డీలు చేసినవాడు మళ్ళీ ప్రతిరోజూ 'అ.. ఆ..' లు దిద్దుకోవాల్సిన అవసరం ఏముంది?
read more " జిల్లెళ్ళమూడి స్మృతులు - 34 (సాధ్యమైనదే సాధన) "

24, మే 2019, శుక్రవారం

జ్యోతిష్కుల్లారా దుకాణాలు మూసుకోండి !

తెలుగుదేశం పార్టీ భారీ మెజారిటీతో గెలుస్తుంది అని చాలామంది జ్యోతిష్కులు జోస్యాలు చెప్పారు. కానీ దానికి పూర్తిగా విరుద్ధంగా జరిగింది. టీడీపీ గల్లంతు లేకుండా ఓడిపోయింది. టీడీపీకి అనుకూలంగా చెప్పిన జ్యోతిష్కుల అంచనాలన్నీ తప్పయ్యాయి.

ఈ రోజుల్లో నాలుగు మాయమాటలు నేర్చుకున్న ప్రతివాడూ ఒక జ్యోతిష్కుడే. తెలిసీ తెలియని పూజలు, హోమాలు చేయించి అమాయకుల్ని మోసం చేసి డబ్బులు కాజేయ్యడం తప్ప అసలు సబ్జెక్టు వీళ్ళలో ఎక్కడా లేదు.

రెండు నెలల క్రితం జగన్ ఇచ్చిన ఇంటర్వ్యూని ఈరోజు మధ్యాన్నం యూట్యూబులో చూచాను. అందులో ఆయన క్లియర్ గా చెప్పాడు. ''ఇప్పుడు ఎన్నికలంటూ వస్తే, టీడీపీకి 40 సీట్ల కంటే రావు. కావాలంటే రాసిస్తాను'' అని స్పష్టంగా చెప్పాడు. అదే జరిగింది. మరి జగన్ కి జ్యోతిష్యం రాదే? జరగబోయేదాన్ని అన్ని నెలలముందే ఎలా చెప్పాడు?

సమాజంలో ఏం జరుగుతున్నది? ప్రజల నాడి ఎలా ఉంది? అన్న విషయాలు జాగ్రత్తగా గమనించిన ప్రతివారూ జగన్ రెండు నెలల క్రితం చెప్పినదే చెప్పారు. అదే జరిగింది. దీనికి పెద్ద జ్యోతిష్యాలు రానక్కరలేదు. వాస్తవిక దృక్పధం ఉంటె చాలు. మన చుట్టూ ఏం జరుగుతున్నదో గమనిస్తే చాలు.

అసలీ జ్యోతిష్కులలో దొంగ జ్యోతిష్కులే ఎక్కువ. వీళ్ళకున్నంత దురహంకారం ఇంకెవరికీ ఉండదు. వీళ్ళలో నీతి నియమాలతో కూడిన జీవితం కూడా ఉండదు. డబ్బుకోసం ఏమైనా చేసే రకాలే నేడు జ్యోతిష్కులుగా సమాజంలో చెలామణీ అవుతున్నారు. వీళ్ళ మాటలు నిజాలెలా అవుతాయి?

నిన్న మా మిత్రుడు ఒకాయన పోన్ చేశాడు. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్.

'రిజల్స్ చూశారా?' అన్నాడాయన.

'చూశాను' అన్నాను.

'మీ అభిప్రాయం?' అడిగాడు.

'జనం అభిప్రాయమే నాది కూడా. టీడీపీ ప్రభుత్వం మీద ప్రజలలో విశ్వాసం లేదు. వాళ్ళు చెప్పే అబద్దాలు, వాళ్ళు చేస్తున్న అవినీతి చూడలేక జనం విసుగెత్తిపోయి ఉన్నారు. అందుకే జగన్ స్వీప్ చేశాడు. ప్రజాతీర్పు స్పష్టంగా ఉంది. ఇంకేం కావాలి? కమ్మవారికి కంచుకోటలైన కృష్ణా, గుంటూరు జిల్లాలలో కూడా టీడీపీ ఓడిపోయింది అంటే, వాళ్ళు కూడా టీడీపీకి వెయ్యలేదని స్పష్టంగా తెలుస్తున్నది. కులాలకతీతంగా ప్రజాతీర్పు జగన్ వైపే ఉంది. కనిపిస్తోంది కదా? ప్రజలు పిచ్చోళ్ళు కారు. ఎల్లకాలం అబద్దాలు చెప్పి వారిని మోసం చెయ్యడం సాధ్యం కాదనేది మళ్ళీ రుజువైంది' అన్నాను.

'మరి నాకు తెలిసిన జ్యోతిష్కుడు ఒకాయన టీడీపీ ఖచ్చితంగా గెలుస్తుందని చెప్పాడు. అదేంటి?' అన్నాడాయన.

ఎవరా జ్యోతిష్కుడు? అని నేను అడగలేదు. ఎందుకంటే, అలాంటి వారి పేరు తెలుసుకోవడం కూడా నాకు ఇష్టం లేదు. ఆయనే చెప్పుకొచ్చాడు.

'ఆయన చాలా పేరున్న జ్యోతిష్కుడు. పది వేళ్లకీ పది ఉంగరాలుంటాయి. టీవీలో వస్తుంటాడు. టీడీపీ గెలుపు ఖాయం అన్నాడు. బోర్లా పడ్డాడు.' అన్నాడు.

'అడక్కపోయారా మరి?' అన్నాను.

'ఫోన్ చేసి అడిగాను. ''అదే నాకూ అర్ధం కావడం లేదండీ?'' అని నసిగాడు' అన్నాడు మా ఫ్రెండ్.

భలే నవ్వొచ్చింది నాకు.

'ఆయనకే అర్ధం కాకపోతే ఇక జనానికేం చెబుతాడు జ్యోతిష్యం? దుకాణం మూసుకొని, ఉంగరాలు మొత్తం తీసేసి, ఏదైనా పని చేసుకుని బ్రతకమనండి బుద్ధుంటే.' అన్నాను.

'అదేంటి అంతమాటన్నారు?' అన్నాడు.

'ప్రతి జ్యోతిష్కుడూ తప్పులు చేస్తాడు. ఎక్కడ తప్పు పోయిందా అని తన జోస్యాన్ని సరిచూసుకోవాలి. అది కూడా తెలీకుండా 'ఎక్కడ తప్పు పోయిందో అర్ధం కావడం లేదండీ' అంటే అతను వేస్ట్ అని అర్ధమన్నమాట. అలాంటప్పుడు అది చెయ్యక ఇంకేం చెయ్యాలి?' అన్నాను.

'అంతేలెండి. కానీ నాదొక డౌటు. జ్యోతిష్యం అనేది ఒకటే సబ్జెక్టు కదా? ఇలా రకరకాలుగా ఎలా చెబుతారు వీళ్ళు?' అన్నాడు.

'చెప్తా వినండి. జ్యోతిష్యం ఒకటే సబ్జెక్టు. కానీ వీళ్ళకు రకరకాల మైండ్ సెట్స్ ఉంటాయి. వీళ్ళేమైనా ఋషులా స్వచ్చమైన నిష్కల్మషమైన మైండ్ తొ ఉంటానికి? వీళ్ళలో చాలామంది డబ్బుకు అమ్ముడుపోయే రకాలే. పైగా దురహంకారం నిలువెల్లా నిండి ఉంటుంది వీళ్ళకు. ఇక వీళ్ళకు జ్యోతిష్యవిద్య ఎలా పట్టుబడుతుంది? ఏవో ఫుట్ పాత్ పుస్తకాలు నాలుగు చదివేసో, లేదా తెలుగు యూనివర్సిటీ నుంచి ఎమ్మే జ్యోతిషం కరెస్పాండేన్స్ కోర్స్ చేసో, నాకు జ్యోతిష్యం వచ్చేసింది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. జ్యోతిష్యశాస్త్రం పట్టుబడాలంటే కొన్ని దైవికమైన క్వాలిటీస్ మనిషిలో ఉండాలి. అది ఉత్త ఎకాడెమిక్ సబ్జెక్ట్ కాదు ఆషామాషీగా రావడానికి. పైగా, జ్యోతిష్కుడికి బయాస్ లేని మైండ్ ఉండాలి. ఈ సోకాల్డ్ జ్యోతిష్కులందరూ ఏదో ఒక పార్టీకి బాకారాయుళ్ళే. పైగా డబ్బుకు అమ్ముడుపోయే రకాలే. కనుక వీళ్ళకు unbiased minds ఉండవు. వేషంలో తప్ప వీళ్ళ జీవితాలలో ఏ విధమైన దైవత్వమూ ఉండదు, సబ్జెక్టూ  ఉండదు, నీతీ ఉండదు. అందుకే వీళ్ళ జోస్యాలు ఫలించవు.

'ఈయనకు పదివేళ్ళకూ పది ఉంగరాలున్నాయని చెప్పాను కదా?' అన్నాడు మా ఫ్రెండ్.

'అంతమాత్రం చేత జ్యోతిశ్శాస్త్రం వస్తుందని అనుకోకండి. అది ఉత్త వేషం. వేశ్యకూడా వేషం వేస్తుంది. కానీ అది పతివ్రత కాలేదు. వీళ్ళూ అంతే. రెమెడీలు చేబుతామంటూ అమాయకుల్ని మోసం చేసిన డబ్బులతో చేయించుకున్న ఉంగరాలు అవన్నీ. అవి వాళ్ళ చెడుఖర్మకు సూచికలు. వాళ్ళ జ్ఞానానికి కాదు. గడ్డం పెంచి, రుద్రాక్షమాలలు మెళ్ళో వేసుకుని, వేళ్ళకు ఉంగరాలు పెట్టుకుంటే జ్యోతిష్యం రాదు. వస్తుంది అనుకుంటే అది పెద్ద భ్రమ. అలాంటి వేషాలు చూసి మోసపోకండి.' అన్నాను.

'మరి మా జ్యోతిష్కుడిని ఏం చెయ్యమంటారు?' అడిగాడు ఫ్రెండ్.

'దుకాణం మూసుకోమనండి' అని ఫోన్ కట్ చేశాను.
read more " జ్యోతిష్కుల్లారా దుకాణాలు మూసుకోండి ! "

21, మే 2019, మంగళవారం

జిల్లెళ్ళమూడి రిట్రీట్ - 'ధర్మపదము' పుస్తకం విడుదల

Releasing the book 'Dharma Padamu'
18-5-2019 బుద్ధపూర్ణిమ నాడు జిల్లెల్లమూడిలో జరిగిన స్పిరిట్యువల్ రిట్రీట్ లో మా లేటెస్ట్ పుస్తకం 'ధర్మపదము' ను విడుదల చేశాము. రెండురోజులపాటు ధ్యానం, అందరం కలసిమెలసి జీవిస్తూ మనసులు విప్పి మాట్లాడుకోవడం, అమ్మ సమక్షాన్ని ఆస్వాదించడం, అక్కడివారితో కలసిపోతూ వారికి అమ్మతో ఉన్న అనుభవాలను తెలుసుకుని ఆనందించడంతో గడిచాయి.

ఇకమీద నా శిష్యులుగా చేరగోరేవారికి మా మార్గంలో ఫస్ట్ లెవల్ దీక్ష ఇవ్వడానికి రాజు, జానకిరాం, సునీల్ వైద్యభూషణలకు అధికారం ఇచ్చాను. పంచవటిలో వీరే మొదటి బ్యాచ్ గురువులు.

ఆ సందర్భంగా తీసిన ఫోటోలలో కొన్నింటిని ఇక్కడ చూడవచ్చు.

Brothers in God arriving one by one

In the Cellar of our flats

Going for Mother's darshan

A copy to Vasundhara Akkayya who served mother for two decades

In the house of Vasundhara Akkayya


Srinivas, Raju and Sunil

In the Ganesha Temple Yard

Before Buddha Purnima speech

Our great photographer Sunil

On the terrace, after meditation


Speech on second day of retreat

Panchawati gurus


read more " జిల్లెళ్ళమూడి రిట్రీట్ - 'ధర్మపదము' పుస్తకం విడుదల "

20, మే 2019, సోమవారం

ఆంజనేయ కళ్యాణము చూతము రారండి !

'సీతారాముల కల్యాణం చూతము రారండి' అనే పాటను మీరు వినే ఉంటారు. ఈ టైటిల్ కూడా అలాగే ఉంది కదూ? వినడానికి ఏదో ఇబ్బందిగా కూడా  ఉంది కదూ ! మీ సందేహం కరెక్టే. ఈ టైటిల్ ఎందుకో చెప్పాలంటే చాలా కధుంది. వినండి మరి !

మొన్నొక రోజున ఏదో పనుండి ఎక్కడికో వెళితే, ఒకాయన నాకు పరిచయం కాబడ్డాడు.

'ఈయనే 'సువర్చలా సహిత ఆంజనేయ కళ్యాణవిధానము ' అనే పుస్తకం వ్రాసినాయన' అంటూ ఒకరిని నాకు పరిచయం చేశాడు ఒక ఫ్రెండ్.

నవ్వుతో నాకు పొలమారింది. కానీ నవ్వితే బాగుండదని తెగ తమాయించుకుని, ఆయనకు నమస్తే చెబుతూ ' ఓహో మీరేనా అది?' అన్నాను.

'అవును. నేనే' అన్నాడాయన గర్వంగా.

'సర్లే! పుర్రెకో బుద్ధి' అనుకుంటూ నాపని చూసుకుని అక్కడనుంచి వచ్చేశాను.

మర్నాడు మళ్ళీ అక్కడికే పనిమీద వెళితే ఆయన లేడుగాని, మా ఫ్రెండ్ కూచుని ఉన్నాడు. ఆమాటా ఈ మాటా అయ్యాక మెల్లిగా - 'నిన్నంతా చంపాడు ఆయన. ఒకటే సోది' అన్నాడు నవ్వుతూ.

'ఏమైంది?' అన్నాను.

'ఏంటో ఆంజనేయుడి గోత్రం మారిందంటాడు. పెళ్లి తంతు మార్చాలంటాడు. వినలేక చచ్చాను' అన్నాడు నవ్వుతూ. 'ఎందుకు నువ్వాయన్ని రానిస్తున్నావ్?' అని నేనడగలేదు. ఎందుకంటే, అది అతని వృత్తి కాబట్టి.

'ఇంతకీ ఆంజనేయుడికి పెళ్లయిందా?' అడిగాడు మా ఫ్రెండ్.

'చిన్న జీయర్ స్వామి నడుగు. చెప్తాడు' అన్నాను.

'అదేంటి?' అన్నాడు

'వైష్ణవం మీద ఆయనే కదా ప్రస్తుతం అధారిటి? ఆంజనేయస్వామి వైష్ణవసాంప్రదాయపు దేవుడే. కనుక చిన్నజీయర్ స్వామి ఏది చెబితే అదే కరెక్ట్' అన్నాను.

'ఆయన ప్రకారం ఆంజనేయుడు బ్రహ్మచారి. బ్రహ్మచారికి పెళ్ళేంటి నాన్సెన్స్ అంటున్నాడు స్వామీజీ' అన్నాడు.

'అంతేకదా మరి ! కరెక్టే' అన్నాను.

'మరి ఈయనేంటి ఏకంగా పెళ్లితంతుతో పుస్తకమే వ్రాశాడు? గోత్రనామాలతో సహా ఇచ్చాడు. ఇదేంటి? అంతా గందరగోళంగా ఉంది.' అన్నాడు మావాడు.

'అందుకే ఈ గోలంతా వద్దుగాని, వాళ్ళిద్దర్నీ వదిలేసి నా శిష్యుడివైపో, ఏ బాధా ఉండదు. హాయిగా ఉంటుంది' అన్నా నవ్వుతూ.

'చివరకు అదే చేస్తాలేగాని, ప్రస్తుతం నా సందేహం నివృత్తి చెయ్యి' అన్నాడు మావాడు.

'రామాయణాలలో వాల్మీకి రామాయణం తర్వాతనే ఏదైనా. దానిప్రకారం ఆంజనేయస్వామి బ్రహ్మచారి. ఆయనకు పెళ్లి కాలేదు. కనుక మనం ఆయనకు కల్యాణం చెయ్యకూడదు. వాల్మీకి కాకుండా ఇంకా తొంభై ఆరు రామాయణాలు మనకున్నాయి. వాటిల్లో ఎవడికి తోచిన కధలు వాడు రాసి పారేశాడు. అవి నిజాలు కావు. ఈ కాకమ్మ కబుర్లు నమ్మకు.' అన్నాను.

'అసలేంటి ఇదంతా? చెప్పవా ప్లీజ్' అడిగాడు ఫ్రెండ్ దీనంగా.

'చెప్తా విను. సువర్చల అంటే అమ్మాయి కాదు. సు అంటే మంచి, వర్చల అంటే వర్చస్సు, వెరసి 'సువర్చల' అంటే మంచి తేజస్సు అని అర్ధం. ఆంజనేయస్వామి బ్రహ్మచారి. బ్రహ్మచర్యం పాటించే ఎవడికైనా మంచి వర్చస్సు ఉంటుంది. ఎందుకంటే ఎనర్జీ లాస్ ఉండదు కాబట్టి. అదే 'సువర్చల' అంటే. దానిని ఒక అమ్మాయిని చేసి ఆయన పక్కన కూచోబెట్టి ఆయనకు పెళ్లి చేస్తున్నారు అజ్ఞానులు. వాళ్ళ పబ్బం గడుపుకోడానికి అమాయకుల్ని ఫూల్స్ ని చేస్తున్నారు కొందరు సోకాల్డ్ పండితులు, పూజారులు. తెలీని గొర్రెలు మోసపోతున్నాయి. ఇదంతా పెద్ద ఫార్స్.' అన్నాను.

'అంతేనా? నాకూ ఇలాంటిదేదో ఉందనే అనిపించేది ఇన్నాళ్ళూ' అన్నాడు ఫ్రెండ్.

'అవును. ఇంకా విను. వినాయకుడు కూడా బ్రహ్మచారే. కానీ ఆయనకు సిద్ధి బుద్ధి అని ఇద్దరు అమ్మాయిల్ని జోడించాం మనం. వాళ్ళూ అమ్మాయిలు కారు. మరెవరు? విఘ్నేశ్వరుడు మంత్రసిద్ధిని ఇవ్వగలడు. సిద్ధి అంటే అదే. మంచి బుద్దినీ ఇవ్వగలడు. బుద్ధి అంటే అదే. ఆ రెంటినీ అమ్మాయిలుగా మార్చి ఆయనకు పెళ్ళిళ్ళు చేస్తున్నాం.

యావరేజి హిందువుకు జీవితంలో తెలిసిన అతిగొప్ప ఎచీవ్ మెంట్ పెళ్లి ఒక్కటే. అంతకంటే వాడి బుర్ర ఎదగదు. అంతకంటే పెద్ద ఆదర్శమూ వాడి జీవితంలో ఉండదు. కనుక 'మాకు పెళ్ళోద్దురా బాబూ' అని పారిపోతున్న బ్రహ్మచారులకు కూడా కట్టేసి మరీ పెళ్ళిళ్ళు చేస్తాం మనం. చివరకు దేవుళ్ళను కూడా వదలం. ఇంకోటి చెప్తా విను. కుమారస్వామికి కూడా ఇద్దరు భార్యలని అంటారు కదా. అదీ అబద్దమే. ఎలాగో చెప్తా విను. శ్రీవల్లి సంగతి అలా ఉంచు. దేవసేన అని రెండో అమ్మాయి ఉంది కదా. ఆమె సంగతి విను.

కుమారస్వామి అనే దేవుడు దేవతల సైన్యానికి అధిపతిగా ఉండి తారకాసురుడిని చంపాడని పురాణాలు చెబుతున్నాయి. అంటే, ఆయన దేవసేనాపతి. ఈ పదాన్ని దేవ-సేనాపతి (దేవతల సైన్యానికి అధిపతి)  అని చదవాలి. దాన్ని మనవాళ్ళు దేవసేనా-పతి అని విడదీసి దేవసేన అనే అమ్మాయికి పతి అని వక్రభాష్యం చెప్పారు. దేవసేనను ఒక అమ్మాయిగా మార్చి ఆయనకు పెళ్ళిచేశారు. దానికొక తంతు తయారు చేశారు. ఇలాంటి చీప్ పనులు చాలా చేశారు మన పండితులూ పూజారులూనూ. అందుకే వీళ్ళ మాటలు నమ్మకూడదు. అదీ అసలు సంగతి' అన్నాను.

పగలబడి నవ్వాడు మా ఫ్రెండ్. ' అమ్మో ఇదా అసలు సంగతి! నిజాలు తెలీకపోతే ఎంత మోసపోతాం మనం? అన్నాడు నోటిమీద వేలేసుకుంటూ.

'అంతేమరి ! దీంట్లో సైకాలజీ ఏంటంటే - పెళ్లి చేసుకుని మనం నరకం అనుభవిస్తున్నాం కదా, ఈ దేవుడుగాడు ఎందుకు సుఖంగా ఉండాలి? వీడికి కూడా ఒకటో రెండో పెళ్ళిళ్ళు చేసేస్తే అప్పుడు తిక్క కుదురుతుందనేది మన ఊహన్నమాట. అంటే, నేనొక్కడినే చావడం ఎందుకు? నాతోపాటు ఇంకొకడిని కూడా తీసుకుపోదాం అనే చీప్ మెంటాలిటీకి ఇవన్నీ రూపాలు. అర్ధమైందా? సరే నే వస్తా !' అంటూ నేను బయలుదేరాను.

'ఆజన్మబ్రహ్మచారికి కల్యాణం ఏంట్రా దేవుడా?' అంటూ కుర్చీలో కూలబడ్డాడు మా ఫ్రెండ్.
read more " ఆంజనేయ కళ్యాణము చూతము రారండి ! "

17, మే 2019, శుక్రవారం

'ధర్మపదము' - మా క్రొత్త E Book ఈరోజు విడుదలైంది

రేపు బుద్ధపౌర్ణమి. బుద్ధభగవానుని నేను ఎంతగానో ఆరాధిస్తాను. ఆయనంటే పడని చాందస హిందువులకు చాలామందికి ఇదే కారణంవల్ల నేను దూరమయ్యాను. అయినా సరే, నేను సత్యాన్నే ఆరాధిస్తాను గాని లోకులని, లోకాన్ని, కాదు. నా సిద్ధాంతాల వల్ల కొందరు వ్యక్తులు నాకు దూరమైతే, దానివల్ల నాకేమీ బాధా లేదు నష్టమూ లేదు. నేను అసహ్యించుకునే వారిలో మొదటిరకం మనుషులు ఎవరంటే - చాందసం తలకెక్కిన బ్రాహ్మణులే. మన సమాజానికి జరిగిన తీరని నష్టాలలో కొన్ని వీరివల్లనే జరిగాయి.

బుద్ధుని వ్యతిరేకించిన వారిలోనూ, అనుసరించిన వారిలోనూ బ్రాహ్మణులున్నారు. ఛాందసులు ఆయన్ను వ్యతిరేకిస్తే, నిస్పక్షపాతంగా ఆలోచించే శక్తి ఉన్న బ్రాహ్మణులు తమ వైదికమతాన్ని వదలిపెట్టి 2000 ఏళ్ళ క్రితమే ఆయన్ను అనుసరించారు. విచిత్రంగా - బుద్ధుని ముఖ్యశిష్యులలో చాలామంది బ్రాహ్మణులే. అయితే, వైదికమతంలా కాకుండా, ఆయన బోధలు కులాలకతీతంగా అందరినీ చేరుకున్నాయి. అందరికీ సరియైన జ్ఞానమార్గాన్ని చూపాయి. అదే బుద్ధుని బోధల మహత్యం.

కులానికీ మతానికీ బుద్ధుడు ఎప్పుడూ విలువనివ్వలేదు. సత్యానికే ఆయన ప్రాధాన్యతనిచ్చాడు. గుణానికీ, శీలానికీ, ధ్యానానికీ, దు:ఖనాశనానికీ ప్రాధాన్యతనిచ్చాడు. చాలామంది నేడు నమ్ముతున్నట్లుగా 'అహింస' అనేది ఆయన యొక్క ముఖ్యబోధన కానేకాదు. అయితే ఈ సంగతి చాలామందికి తెలియదు.

బుద్ధుని యొక్క ముఖ్యమైన బోధలన్నీ త్రిపిటకములలో ఉన్నాయి. ఆయా బోధలన్నీ ఈ దమ్మపదము (ధర్మపదము) అనే గ్రంధంలో క్రోడీకరింపబడి మనకు లభిస్తున్నాయి. 2000 సంవత్సరాల నాటి ఈ పుస్తకం మనకు ఇంకా లభిస్తూ ఉండటం మన అదృష్తం. దీనికి తెలుగులో వ్యాఖ్యానాన్ని వ్రాయడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. ఈ పుస్తకాన్ని చదవడం ద్వారా బుద్ధుని అసలైన బోధనలు ఏమిటన్న విషయం మీరు స్పష్టంగా తెలుసుకోవచ్చు.

పొద్దున్న లేచిన దగ్గరనుంచీ పూజలు చేస్తూ, లలితా పారాయణాలు, విష్ణు సహస్రపారాయణాలు చేస్తూ ఉండే బ్రాహ్మణులు ఎందఱో మనకు కనిపిస్తారు. కానీ సాటి మనిషితో ఎలా ప్రవర్తించాలి? మనసును మాటను చేతను ఎలా శుద్దంగా ఉంచుకోవాలి? అన్న విషయం మాత్రం వీరిలో చాలామందికి తెలియదు. ఇలాంటివారు బ్రాహ్మణులు అన్న పేరుకు తగరు. బ్రాహ్మణవంశంలో పుట్టిన చీడపురుగులు వీరంతా.

నిజమైన బ్రాహ్మణుడు ఎవరో వివరిస్తూ బుద్ధుడు అనేక సందర్భాలలో చెప్పిన మాటలు ఈ పుస్తకంలోని 26 అధ్యాయంలో వివరించబడ్డాయి. ఆయా నిర్వచనాలతో నేటి బ్రాహ్మణులలో ఎవరూ సరిపోరు. కనుక వీరంతా కులబ్రాహ్మణులే కాని నిజమైన బ్రాహ్మణత్వం వీరిలో లేదని నేను భావిస్తాను.

అసలైన జీవితసత్యాలను బుద్దుడు నిక్కచ్చిగా చెప్పాడు. అందుకే ఆయన్ని మన దేశంలోనుంచి తరిమేశాం. దశావతారాలలోని బలరాముణ్ణి తీసేసి ఆ స్థానంలో బుద్ధుడిని కూచోబెట్టి చేతులు దులుపుకున్నాం. కానీ బుద్ధుని బోధనలను మాత్రం గాలికొదిలేశాం. అంతటి ఘనసంస్కృతి మనది !

బుద్ధుని బోధలనే ఆయన తదుపరి వచ్చిన కొన్ని ఉపనిషత్తులూ, పతంజలి యోగసూత్రాలూ, భగవద్గీతా నిస్సిగ్గుగా కాపీ కొట్టాయి. క్రీస్తు బోధలు కూడా చాలావరకూ బుద్దుని బోధలకు కాపీలే. అయితే తన పూర్వీకులు అనుసరించిన యూదు మతాన్ని కూడా బుద్ధుని బోధలకు ఆయన కలిపాడు. అంతే తేడా ! కానీ బుద్ధుని పేరును మాత్రం హిందూమతం గాని, క్రైస్తవం గాని ఎక్కడా ప్రస్తావించలేదు. ఇది ఆయా మతాలు చేసిన సిగ్గుమాలిన పనిగా నేను భావిస్తాను. నేను హిందువునే అయినప్పటికీ ఈ విషయాన్ని స్పష్టంగా చెబుతున్నాను. ఈ విషయాన్ని నేను సతార్కికంగా నిరూపించగలను.

అప్పటివరకూ లేని ఒక క్రొత్తమార్గాన్ని బుద్ధుడు తను పడిన తపన ద్వారా, తన సాధనద్వారా ఆవిష్కరించాడు. లోకానికి దానిని బోధించాడు. ఈ మార్గాన్ని అనుసరించడం ద్వారా ఇప్పటికి కొన్ని కోట్లమంది జ్ఞానులైనారు. పరమస్వేచ్చను, బంధ రాహిత్యాన్ని, దుఖనాశనాన్ని పొందారు. 

బుద్ధభగవానుని ఉపదేశసారమైన 'ధర్మపదము' కు నేను వ్రాసిన వ్యాఖ్యానాన్ని E - Book రూపంలో ఈరోజున విడుదల చేస్తున్నాను. తెలుగులో ఇలాంటి పుస్తకం ఇప్పటివరకూ లేదని నేను గర్వంగా చెప్పగలను. త్వరలోనే దీని ఇంగ్లీష్ వెర్షన్ మీ ముందుకు వస్తుంది. తెలుగు ప్రింట్ పుస్తకం రేపు బుద్ధపౌర్ణిమ నాడు జిల్లెళ్ళమూడిలో అమ్మ పాదాల సమక్షంలో విడుదల అవుతుంది.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకెంతో సహాయపడిన నా శిష్యురాళ్ళు అఖిల, శ్రీలలితలకు, కవర్ పేజీల డిజైన్ అధ్బుతంగా చేసి ఇచ్చిన నా శిష్యుడు ప్రవీణ్ కు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

యధావిధిగా ఈ పుస్తకం google play books నుండి లభిస్తుంది.
read more " 'ధర్మపదము' - మా క్రొత్త E Book ఈరోజు విడుదలైంది "

8, మే 2019, బుధవారం

కనకధారా స్తోత్రం ఎలా చదవాలి?

'ప్రతిరోజూ కనకధారా స్తోత్రం చదివితే చాలా మంచిది. నేను చదువుతున్నాను' అన్నాడు మా ఫ్రెండ్ ఒకడు ఈ మధ్య.

'ఏమౌతుంది? ఆ స్తోత్రం చదివితే?' అడిగాను ఏమీ తెలీనట్లు.

'కనకవర్షం కురుస్తుంది. నీకు తెలీదా? శంకరాచార్యులవారు చిన్నపిల్లాడిగా ఉన్నపుడు ఒక పేదరాలికోసం ఈ స్తోత్రం చదివాడు. అప్పుడు బంగారు ఉసిరికాయల వర్షం కురిసి ఆ పేదరాలి పేదరికం తీరిపోయింది.' అంటూ ఆ కధంతా నాకు వివరించాడు వాడు.

జీవితంలో మొదటిసారి ఆ కధను వింటున్నట్లుగా ముఖం పెట్టి మరీ అదంతా విన్నాను. అసలు జరిగింది ఒకటైతే వీడి కల్పన ఎక్కువగా ఉంది ఆ కధలో. సరే, మనుషుల పైత్యాలు మనకు బాగా తెలిసినవే గనుక నవ్వుకుంటూ అదంతా విన్నాను.

'కనుక, నువ్వు కూడా రోజూ చదువు. డబ్బులు బాగా వస్తాయి' అన్నాడు వాడు.

'సర్లేగాని, ఎవరు చెప్పారు నీకు ఇలా చదవమని?' అడిగాను.

'మా శాస్త్రిగారు చెప్పారు. ఆయన మాకు గురువు. ఆయన మాట మాకు వేదవాక్కు' అన్నాడు వీడు తన్మయంగా.

ఆ శాస్త్రిగాడెవడో గాని, నాకెదురుగా ఉంటే మాత్రం, ఒక్క తన్ను తందామన్నంత కోపం వచ్చింది నాకు. ఇలాంటి తెలిసీ తెలియని పురోహితులు పూజారులూ సమాజాన్ని నాశనం చెయ్యడంలో, మూడనమ్మకాలను జనానికి ఎక్కించడంలో ముందుంటున్నారు.

'వేదమొక్కటే నీకైనా, నీ గురువుకైనా వాక్కు కావాలి గాని, డబ్బులకోసం ఏమైనా చేసే పూజారి మాట మీకు వేదవాక్కు కాకూడదు' అన్నాను చాలా సీరియస్ గా.

ఫ్రెండ్ గాడు ఖంగుతిన్నాడు.

'అదేంటి అలా అంటున్నావు?' అడిగాడు అయోమయంగా.

'బంగారువర్షం మాట అలా ఉంచు. నీలాంటి వాళ్ళు ఎంతోమంది ఈ స్తోత్రాన్ని చదువుతున్నారు కదా !' అడిగాను.

'అవును. మా విష్ణుసహస్రనామం బ్యాచ్ ఒకటుంది. మేము రెగ్యులర్ గా ఈ స్తోత్రాన్ని ప్రతిరోజూ చదువుతాం' అన్నాడు వాడు గర్వంగా.

'మరి ఇంతమంది పడి రోజూ చదూతుంటే, కనీసం మామూలు వర్షం కూడా సకాలంలో కురవడం లేదేమిటి? నువ్వు బంగారు వర్షం దాకా వెళ్ళావ్. మామూలు నీళ్ళ వర్షానికే దిక్కులేకుండా ఉందిగా. ఇదేంటి?' అడిగాను.

'ఆ ! దానికీ దీనికీ సంబంధం ఏముంది? నే చెప్పేది నీకు డబ్బులు బాగా కలసి వస్తాయని' అన్నాడు.

'సరే, పోనీ నువ్వన్నట్లుగానే మీ ఇంటివరకూ బంగారువర్షం కురిసిందే అనుకో. అంత బంగారాన్ని నువ్వు ఏం చెసుకుంటావ్? దాన్ని ఎలా మేనేజ్ చేస్తావ్?' అడిగాను నవ్వుతూ.

'ఏమో. అది అప్పుడు ఆలోచిస్తా' అన్నాడు.

'నీకంత ట్రబుల్ ఇవ్వడం ఇష్టం లేకేనేమో అమ్మవారు ఆ వర్షం కురిపించడం లేదు. బహుశా నువ్వెన్నాళ్ళు అలా ఎదురుచూచినా ఆ వర్షం కురవకపోవచ్చు కూడా. ఇలాంటి మూర్ఖపు నమ్మకాలు నా దగ్గర చెప్పకు.' అన్నాను.

'సర్లే నీ వితండవాదం నీది' అంటూ వాడు లేచి వెళ్ళబోయాడు.

'నీ మూఢనమ్మకాలు నీవి' అన్నాను నవ్వుతూ.

వాడు కోపంగా చూస్తూ నా రూమ్ లోనుంచి వెళ్ళిపోయాడు.

జనాల పిచ్చిని చూస్తుంటే నాకు భలే కామెడీగా ఉంటోంది ఈ మధ్య. ఎవరిని చూచినా ఒకటే నవ్వు ! పడీపడీ నవ్వుకుంటున్నా వీళ్ళ పిచ్చి గోలా వీళ్ళూనూ !

ఇదొక రెలిజియస్ మార్కెటింగ్ ! ఈ స్తోత్రం చదవండి. ఈ రంగు గుడ్డలు వేసుకోండి. ఈ దీక్షలు చెయ్యండి. ఈ పూజలు చేయించండి. మీకు మంచి జరుగుతుంది. అంటూ ప్రతివాడూ ఒక గుడినో ఒక దేవతనో మార్కెటింగ్ చేస్తూ, సోమరిగా బ్రతుకుతూ, వాడి పబ్బం గడుపుకోవడమేగాని, ఆ చెప్పేదాంట్లో ఎంత సత్యం ఉంది? అన్న ఆలోచన ఒక్కడికీ లేదు.

అంత డబ్బు వచ్చి పడితే కూడా కష్టమే. ఏది ఎక్కువైనా కష్టమే. సరైన సమయానికి సరైనది దొరకడమే జీవితంలో అతి పెద్దవరం గాని, ప్రపంచంలోని డబ్బంతా మా ఇంట్లోనే ఉండటం కాదు. అలా ఉంటె, దాన్ని ఏం చెయ్యాలో అర్ధంగాక పిచ్చెక్కడ ఖాయం.

కొంతమంది, ఇరవై తరాలదాకా సరిపడా సంపాదించి పడేస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని చూస్తే నాకు చాలా జాలేస్తూ ఉంటుంది. ఇరవై తరాలదాకా ఎందుకు? తర్వాత తరంలో ఏం జరుగుతుందో ఎవడికి తెలుసు? నీ పిల్లలకు ధర్మంగా బ్రతకడం, సంస్కారయుతంగా బ్రతకడం నేర్పకపోతే ఆ ఇరవై తరాల డబ్బులూ ఒక్క తరంలో సర్వనాశనం చేసుకుంటారు. దీనిని మాత్రం ఎవరూ గమనించరు !

శంకరాచార్యులు ఆ స్తోత్రాన్ని ఆశువుగా చదివితే నిజంగా అమ్మవారు మెచ్చి అలా బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించిందేమో? కానీ ఆ తర్వాత ఇన్ని వందల ఏళ్ళలోనూ ఒక్కడికి కూడా అలా జరిగినట్లు దాఖలాలు లేవు. అసలు ఈ కధ నిజంగా జరిగింది అనడానికి కూడా రుజువులు లేవు. ఇదంతా తర్వాత ఎవడో వ్రాసిన కట్టుకధ కావడానికే అవకాశం ఎక్కువగా ఉంది.

పోనీ, అదే శంకరాచార్యులవారు చెప్పిన మిగతా స్తోత్రాలు ఏం అంటున్నాయో పట్టించుకుంటారా ఈ మూర్ఖభక్తులు? 'భజగోవింద స్తోత్రం' లో, ఇదే ఆదిశంకరులు - 'డబ్బులు శాశ్వతం కావురా, అందం శాశ్వతం కాదురా, ఈ ప్రపంచంలో ఏదీ శాశ్వతం కాదురా, భగవంతుని చరణాలను నిష్కల్మషంగా ధ్యానించండి. అదే అసలైన మంచి పని' - అంటూ నెత్తీ నోరూ మొత్తుకుని చెప్పాడు. అదెవరు వింటారు?

భజగోవింద స్తోత్రాన్ని కూడా రాగయుక్తంగా పాడుకుని ఆనందించడమే గాని, అదేం చెబుతున్నదో అర్ధం చేసుకుని ఆచరించేవారు ఎక్కడా కనిపించరు. అంటే, మహనీయులు చెప్పిన వాటిల్లో కూడా మన స్వార్ధానికి ఉపయోగపడేవి మాత్రం తీసుకుని మిగతాని గాలికొదిలేస్తాం ! ఇదీ మన వరస ! ఇదీ మన సంస్కృతి !

చాలా ఏళ్ళ క్రితం మా బంధువుల్లో ఒకాయన కూడా రిటైరైన తర్వాత ఇదే స్తోత్రాన్ని ప్రతిరోజూ తడిబట్టలతో చదువుతూ ఉండేవాడు.

ఒకరోజున మా ఇంటికి వచ్చినప్పుడు పొద్దున్నే స్నానం చేసి ఒక మూల నిలబడి గట్టిగా ఈ స్తోత్రం చదువుతూ ఉన్నాడు. విషయం నాకర్ధమైనా ఏమీ తెలీనట్లు మౌనంగా ఉన్నాను. ఆయన తతంగం అంతా అయ్యాక - 'రిటైరైన తర్వాత కూడా ఇదేం పాడుబుద్ధి? డబ్బుల మీద ఇంతాశ ఎందుకు నీకు?' అని అడిగాను.

'బాగా కలిసొస్తుంది' అని ఆయనన్నాడు. ఆయన అజ్ఞానానికి, దురాశకు, నాకు నవ్వాలో ఏడవాలో అర్ధం కాలేదు. కాటికి కాళ్ళు చాచుకున్నవాడికి ఇంకా కలిసోచ్చేది ఏముంటుందో మరి? నా ఆలోచనకు అనుగుణంగానే ఆ తర్వాత రెండేళ్లలో ఆయన చనిపోయాడు. వాళ్ళింట్లో ఏ బంగారువర్షమూ కురవలేదు.

నేటి మనుషుల్లో ఉన్నతమైన ఆలోచనలు తక్కువ, దురాశ చాలా ఎక్కువ. దానిని ఎగదోస్తూ కొందరు పూజారులు, పురోహితులు, నకిలీ గురువులు ఇలాంటి పనికిరాని పనులను ప్రోత్సహిస్తూ జనాలలో మూడనమ్మకాలను ఎక్కువ చేస్తూ ఉంటారు. దురాశాపరులు వాటిని గుడ్డిగా అనుసరిస్తూ ఉంటారు. అంతేగాని సత్యం చెబితే ఎవరూ వినరు.

శంకరులు ఆ స్తోత్రాన్ని చదివినప్పుడు కూడా అమ్మవారు ఎందుకు బంగారు ఉసిరికాయల వర్షం కురిపించింది? 'బాలశంకరుడు భిక్షకు వస్తే ఏమీ ఇవ్వలేని దరిద్రురాలిని కదా నేనని' ఆ పేదరాలు ఏడ్చింది. ఆమె ఏడుపు చూచి శంకరుని హృదయం ద్రవించింది. ఆ ద్రవింపు కనకధారాస్తోత్రంగా ఆయన నోటినుంచి ఆశువుగా ప్రవహించింది. ఇదంతా, జగన్మాతను కదిలించింది. బంగారువర్షాన్ని ఆ పేదరాలి ఇంట్లో కురిపించింది. ఆ సంఘటన వెనుక ఉన్న శక్తి, ఉత్తస్తోత్రం కాదు. మానవత్వం యొక్క శక్తి దానివెనుక ఉంది !

'అయ్యో ! ఈ చిన్నపిల్లవాడు నా ఇంటిముందు నిలబడితే నేనేమీ ఇవ్వలేకపోయానే' అన్న ఆ పేదరాలి హృదయవేదనా, ఆమె దీనస్థితిని చూచి కరిగిన శంకరుని హృదయమూ, ఈ రెంటినీ చూచి కదిలిన జగన్మాతా - ఇవీ ఆ సంఘటన వెనుక ఉన్న శక్తులు. అంతేగాని ఆ స్తోత్రంలో ఏమీ లేదు. మనబోటి వాళ్ళు ఆ స్తోత్రం జీవితాంతం చదివినా ఏమీ జరగదు గాక జరగదు !

నిలువెల్లా స్వార్ధంతో నిండిపోయి, పక్కవాడు ఏమైపోతున్నా మనం పట్టించుకోకుండా, నా పొట్ట ఒక్కటే నిండితే నాకు చాలు అన్న నీచపు మనస్సుతో, ఎంతకీ చాలని దురాశతో కుళ్ళిపోతూ,  లోకంలోని డబ్బులన్నీ నాకే కావాలంటూ, ఈ స్తోత్రాన్ని చదివితే, అప్పుడెప్పుడో జరిగిన అద్భుతం ఇప్పుడెందుకు జరుగుతుంది? చస్తే జరగదు. అందుకే ఎంతమంది ఎన్నిసార్లు ఆ స్తోత్రాన్ని చదివినా ఏ వర్షమూ కురవడం లేదు !

ఊరకే స్తోత్రాలు చదివితే కరిగిపోవడానికి జగన్మాత పిచ్చిది కాదు మరి !

నిస్వార్ధంగా మనం ఒకరికి సహాయపడితే, దైవం మనకు సహాయపడుతుంది. ఇదీ అసలైన బంగారు సూత్రం ! దీనిని ఒదిలేసి రోజుకు వెయ్యి స్తోత్రాలు చదివినా అవన్నీ దండగమారి పనులే !

ధమ్మపదం లో బుద్ధభగవానుడు ఇలా అంటాడు.

న కహాపణస్సేన తిత్తి కామేసు విజ్జతి
అప్పస్సాదా దుఃఖా కామా ఇతి వింజాయ పండితో

'బంగారువర్షం కురిసినా మానవుని ఆశ చావదు. ఈ ఆశ వల్ల దు:ఖం తప్ప ఇంకేమీ రాదని పండితులు గ్రహిస్తారు'

(ధమ్మపదము - 14:8)

దానికి తెలుగులో ఈ పద్యాన్ని వ్రాశాను.

ఆ || కనకధారయైన కరుగదీ మోహమ్ము
శాంతి దొరుకదెపుడు సుంతయైన
దు:ఖభాజనమ్ము దుష్టమౌ కామమ్ము
అనుచు నేర్తురిలను ఆత్మవిదులు

కష్టంలో ఉన్న సాటిజీవికి సాయం చెయ్యడం, స్వార్ధమూ దురాశా తగ్గించుకుని సాటివారితో సహానుభూతితో బ్రతకడం, నీ మనస్సును పాడు చేసుకోకుండా, ప్రకృతిని పాడు చెయ్యకుండా ఉండటం - ఇవీ కనకధారాస్తోత్రం చదవడం కంటే, శక్తివంతమైన పనులు. మనిషనేవాడు చెయ్యవలసిన పనులు !

దేవుడనేవాడు, నువ్వు ఎలా బ్రతుకుతున్నావో చూస్తాడు గాని, ఆయన్ని నీ స్తోత్రాలతో ఎలా ఉబ్బెస్తున్నావో చూడడు.  సృష్టికర్తకు నువ్వు రాసుకున్న స్తోత్రాలెందుకు? ఎప్పుడర్ధం చేసుకుంటారో? ఎప్పుడు ఎదుగుతారో ఈ పిచ్చి జనాలు ?!!!
read more " కనకధారా స్తోత్రం ఎలా చదవాలి? "

5, మే 2019, ఆదివారం

ఆధ్యాత్మిక కులపిచ్చి

మన దేశంలో అంతా కులమయమే. వాడు ఎంత వెధవ అయినా సరే, 'మనోడు' అయితే చాలు, వాడిని చంకనెక్కించుకుంటాం. 'మనోడు' కాకపోతే వాడిలో ఎంత టాలెంట్ ఉన్నా పట్టించుకోం, లేదా వాడిని అణగదోక్కేస్తాం. ఇది చేదునిజం.

మన దేశమూ, మన సమాజమూ పెద్ద మేడిపండులని గతంలో నేనెన్నో సార్లు వ్రాశాను. ఇది అబద్దం కాదు. ఉద్యోగాల్లో, వ్యాపారాల్లో, రాజకీయాల్లో, సినిమాల్లో ఎక్కడ చూచినా ఈ 'కులపిచ్చి' మీదే అంతా నడుస్తూ ఉంటుంది. సినిమాలలో అయితే, 'మనోడు' కాకపోవడం వల్ల ఎందఱో టాలెంట్ ఉన్న ఆర్టిస్టులు అవకాశాలు రాక మట్టి కొట్టుకుపోయారు. అంత టాలెంట్ లేని నటులు కూడా 'మనోళ్ళు' అవ్వడంతో జనాల నెత్తిన రెండు మూడు దశాబ్దాల పాటు రుద్దబడ్డారు.

ఎమ్జీఆర్ ని చూచో, లేక తనకే బుద్ధి పుట్టిందో తెలీదు కాని, ఎన్టీఆర్ రాజకీయాలోకి వచ్చి పార్టీ పెట్టాక, సినీ పాపులారిటీని రాజకీయాలకు ఇలా కూడా వాడుకోవచ్చా అని సినీజీవులకు బాగా అర్ధమై, వాళ్ళు కూడా రాజకీయ షెల్టర్ తీసుకోవడమూ లేదా తమతమ కులాలను కూడగట్టుకుని పార్టీలు పెట్టడమూ చేసారు. దీనివల్ల ప్రజలు ఏమైపోయినా, కొందరు వ్యక్తిగతంగా బాగా సక్సెస్ అయ్యారు. ఇదంతా లోకవిదితమే.

మన దేశంలో రాజకీయ పార్టీలన్నీ కులపార్టీలే. కులం అనేది 'లేదు లేదు' అని ఎంతమంది ఎంతగా అరిచి 'గీ' పెట్టినా అది రోజురోజుకీ బలపడుతూనే ఉంది. గతంలో కంటే ఇప్పుడింకా బలపడింది.

ఇదంతా అలా ఉంచితే, ఆధ్యాత్మికరంగం కూడా దీనికి మినహాయింపు కాకపోవడం విచిత్రాతి విచిత్రం.

బ్రహ్మంగారు మా వాడని కంసలివారు ఆయన్ను తప్ప ఇంకొకరిని కొలవరు. కన్యకాపరమేశ్వరి మా అమ్మాయి అని కోమటివారు ఆమెను తప్ప ఇంకొకరిని కొలవరు. ఇకపోతే వెంకటేశ్వరస్వామి కమ్మవారి కులదైవం. వారు శివుడి జోలికే పోరు. ఎందుకంటే, శివుడు డబ్బులివ్వడని వారి ప్రగాఢవిశ్వాసం. వేమనయోగి రెడ్డివంశంలో పుట్టాడు కనుక ఆయన మా దేవుడని రెడ్లు అంటున్నారు. కాశినాయనను కూడా వాళ్ళే స్పాన్సర్ చేస్తున్నారు. మొన్నమొన్నటి దాకా జనాన్ని తన మాయలతో మెస్మరైజ్ చేసిన సత్యసాయిబాబా గారు రాజుల వంశంలో పుట్టాడు గనుక, రాజులలో ఆయన భక్తులు ఎక్కువని ఒక మిత్రుడు ఈ మధ్యనే నాకు చెప్పాడు. రాజులు ఎక్కువగా ఉన్న పశ్చిమ గోదావరి జిల్లాలలో అందుకనే ఆయనకు ప్రాబల్యం ఎక్కువట.

ఇకపోతే, శ్రీ రామకృష్ణులు, రమణమహర్షీ, జిల్లెళ్ళమూడి అమ్మగార్లు బ్రాహ్మణులు గనుక వారి భక్తులలో బ్రాహ్మలే ఎక్కువట. మిగతా కులాలవారు వీరిని ఎక్కువగా ఇష్టపడరట. అరవిందులది క్షత్రియవంశం గనుక ఆయన అనుచరుల్లో క్షత్రియులు ఎక్కువట, ఇక ఎస్సీ ఎస్టీలకు అగ్రవర్ణాలంటే కోపం గనుక ఈ దేవుళ్ళను ఎవరినీ వారు పూజించరట. అందుకే విదేశీప్రవక్త అయిన జీసస్ నే వాళ్ళు దేవుడిగా కొలుస్తారట.

ఈ గోలంతా వింటే, కులం అనేది మన రక్తంలో ఎంతగా జీర్ణించుకుపోయిందో, ప్రతివిషయాన్నీ కులం ఒక్కటే ఎలా డిసైడ్ చేస్తుందో, చివరకు దైవత్వాన్ని నిర్ణయించేది కూడా 'కులం' ఏ విధంగా అవుతున్నదో అని ఆశ్చర్యం వేసింది.

మొన్నీ మధ్యన రోడ్డుమీద వస్తుంటే, నెహ్రూనగర్లో ఎస్వీ రంగారావు విగ్రహం ఒకటి కనిపించింది. అది కీచకుని గెటప్ లో ఉంది. ఇదేం ఖర్మో నాకర్ధం కాలేదు. ఎన్టీఆర్ బొమ్మలు కూడా దుర్యోధనుడి వేషంలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. కీచకుడూ దుర్యోధనుడూ దుర్మార్గులు. మంచివాళ్ళు కారు. అన్యాయాలూ అక్రమాలూ రేపులూ చేసినవాళ్ళు. అలాంటి దుర్మార్గుల వేషాలలో తమ అభిమాననటులను చూచుకుని మురిసిపోవడం ఏం ఖర్మో నాకైతే అర్ధం కాలేదు. అన్యాయాలూ అధర్మాలూ చేసినవాళ్ళ వేషాలలో ఉన్న వారిని పూజించడం ఆరాధించడం దేనికి సంకేతమో నాకైతే అర్ధంకావడం లేదు. ఎన్టీఆర్ దుర్యోధనుడి వేషంలో ఉన్నాడు గనుక, కీచకుడి వేషంలో ఎస్వీఆర్ ను పెట్టారన్నమాట కాపులు? ఇంకే వేషమూ దొరకనట్లు? వెనకటికి ఒకడు ఒంటికి నిప్పు పెట్టుకుంటే, ఇంకొకడు ఇంటికి నిప్పు పెట్టుకున్నాడట. అలా ఉంది. ఏంటో ఈ వేలం వెర్రి? అని బాధేసింది.

ఒక కులంలో పుట్టినంత మాత్రాన 'టాలెంట్' అనేది రాదు. 'టాలెంట్' ఉన్నవాళ్ళు అన్ని కులాలలోనూ ఉంటారు. కులాలకు అతీతంగా 'టాలెంట్' అనేదాన్ని గుర్తించి దానికివ్వాల్సిన మెప్పును దానికి అందించే  పరిస్థితి మన సమాజంలో రావాలి.

అదేవిధంగా, ఒక కులంలో పుట్టినంత మాత్రాన ఎవడూ మహనీయుడు అవడు. కులాన్నీ మతాన్నీ ప్రాంతాన్నీ దేశాన్నీ, ఈ లిమిట్స్ అన్నింటినీ దాటిన భూమికను అందుకున్నవాడే ఆధ్యాత్మికంగా మహనీయుడౌతాడు. మహనీయులకు ఏ కులమూ ఉండదు. ఏ మతమూ ఉండదు. మానవసంబంధమైన పరిమితులను అన్నింటినీ వారు దాటిపోతారు. ఈ సింపుల్ విషయాన్ని అర్ధం చేసుకోకుండా, 'మన కులంలో పుట్టాడు గనుక వీడే మన దేవుడు' అంటూ, మిగతా దేవుళ్ళకు పోటీగా వీరికి కూడా గుళ్ళు కట్టించి ఆర్భాటాలు చెయ్యడం చూస్తుంటే మన జనాలు ఎప్పటికీ ఎదగరేమో అని నాకు గట్టి నమ్మకం ఏర్పడిపోయింది.

నిజమైన మహనీయుడెవడూ 'నీ ఇష్టం వచ్చినట్లు బ్రతుకు, ఊరకే నన్ను నమ్ము చాలు. నిన్ను నేను రక్షిస్తాను. నీదంతా నేనే చూసుకుంటాను.' అని ఎన్నడూ చెప్పడు. అలా చెప్పేవాడు అసలు మహనీయుడే   కాడు. 'ముందు నువ్వు ధర్మంగా బ్రతుకు. ఆ తర్వాత నా దగ్గరకు రా. అప్పుడు చూద్దాం' అనే అంటాడు. బుద్ధుడు కూడా ఇదే  స్పష్టంగా   చెప్పాడు గనుక ఆయన్ను మన దేశం నుంచే బయటకు తరిమేశాం. అంత గొప్ప సమాజం మనది !

మొన్నొక మిత్రుడు ఇలా అన్నాడు.

'మా ఏరియాలో రామాలయానికి ఎవరూ పోవడం లేదు. ఎప్పుడు చూచినా అది నిర్మానుష్యంగా ఉంటోంది. కానీ షిర్డీ సాయిబాబా గుడి మాత్రం కిటకిటలాడుతోంది. ఏంటీ వింత?'

అతనికిలా చెప్పాను.

'మనుషులలో పెరుగుతున్న అధర్మానికి, స్వార్ధానికి ఇది గుర్తు. శ్రీరాముడు ధర్మానికి ప్రతీక. నీ కోరికలు అప్పనంగా ఆయన తీర్చడు. నువ్వు ధర్మంగా ఉన్నప్పుడే ఆయన మెచ్చుతాడు. లేకుంటే మెచ్చడు. సాయిబాబా అయినా అంతే. కాకపోతే, శ్రీరాముడు దేవుని అవతారం. సాయిబాబా కాదు. ఆయనొక ముస్లిం సాధువు. కానీ కొందరు కుహనా గురువులు ఆయనను ఒక దేవుడిని చేశారు. అన్ని కోరికలూ అప్పనంగా తీరుస్తాడని ప్రచారం చేసారు. గొర్రెజనం నమ్ముతున్నారు. ఎగబడుతున్నారు. రాముడినీ, ధర్మాన్నీ వదిలేశారు. స్వార్ధంతో కొట్టుకుంటున్నారు. అందుకే సాయిబాబా గుడి కిటకిట లాడుతోంది. రామాలయంలో ఎవరూ ఉండటం లేదు. అంతే ! వెరీ సింపుల్ !' అన్నాను.

మనిషి - కులానికి, స్వార్ధానికి, మోసానికి పెద్ద పీట వేసుకుని, తమకు నచ్చినవారిని దేవుళ్ళుగా మార్చుకుని, గుడులు కట్టుకుని, వారిని పూజిస్తూ, ఆరాధిస్తూ, అదే పెద్ద ఆధ్యాత్మికత అనుకుంటూ భ్రమిస్తూ ఉన్నంతకాలం ఈ సమాజం ఇలాగే అఘోరిస్తూ ఉంటుంది.

కులపిచ్చితో, స్వార్ధంతో, అధర్మంతో, కుళ్ళిపోతున్న ఇలాంటి సమాజానికి నిజమైన ఆధ్యాత్మిక ఔన్నత్యం కలుగుతుందని ఆశించడం ఒక పెద్ద భ్రమ. అంతే !
read more " ఆధ్యాత్మిక కులపిచ్చి "