“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, మే 2023, ఆదివారం

ఏకనిష్ఠా లోపం

హిందువులలో ఏకనిష్టా లోపం అనేది చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ విషయంలో నేను ముస్లిములను చాలా మెచ్చుకుంటాను. ఖర్మమో ధర్మమో వాళ్ళు నమ్మినదాన్ని గట్టిగా పట్టుకుంటారు.. రెండోదాన్ని దగ్గరకు రానివ్వరు. అది మూర్ఖత్వం అయినప్పటికీ, వారి ఏకనిష్ఠ మాత్రం మెచ్చుకోదగినది.

ఇకపోతే, హిందువులలో విశాలభావనలు ఎక్కువ. 'పోన్లే పాపం' అని ప్రతిదాన్నీ ఒప్పుకుంటారు. అయితే, వారిలో ఉన్న ఈ అతి విశాలత్వమే వారికి శాపంగా మారి కూచుంది. ఎలాగో చెప్తా వినండి.

మొన్నొకరోజున ఒక దేవాలయ పూజారి ఇంటికి వెళ్ళవలసి వచ్చింది. ఆయన నరసింహాలయ పూజారి. కానీ వాళ్ళ ఇంటి పూజామందిరంలో హిందూ దేవతలతో బాటు షిరిడీ సాయిబాబా ఫోటో  కూడా పూజలందుకుంటోంది.

అది గమనించి మేము ముఖముఖాలు చూసుకున్నాం.

మా శ్రీమతైతే, 'ఏంటండీ మీరు ఈయన్ని పూజిస్తున్నారు? అని అడగనే అడిగింది.

దానికా ఇంటి ఆడవారు, 'ఏమైంది ఆయనకూడా దేవుడేగా?' అని జవాబు చెప్పారు. 

'ఏసుక్రీస్తు కూడా దేవుడని చాలామంది అమాయకులు నమ్ముతారు. ఆయన ఫోటో కూడా పెట్టుకోండి. రేపటినుంచీ చర్చికెళ్లి పార్ధన చెయ్యండి. ఆ తర్వాత మసీదుకు వెళ్లి నమాజ్ కూడా చెయ్యండి' అందామని నోటిదాకా వచ్చింది. 

పరిచయమైన మొదటిరోజునే వీళ్లకు విశ్వరూపసందర్శనం ఇవ్వడం ఎందుకని నవ్వేసి ఊరుకున్నాము 

సామాన్యంగా వైష్ణవ పూజారులు శివలింగాన్ని శివుని ఫోటోలను కూడా ఇంట్లో ఉంచుకోరు అలాంటిది వీళ్ళు ఏకంగా సాయిబాబా ఫొటోను పూజామందిరంలో పెట్టేశారు. బ్రాహ్మణ పూజారుల ఇంట్లో సాయిబాబా ఫోటోనా? ఖర్మరా దేవుడా అనిపించింది. వీళ్ళ అమాయకత్వానికి, దిగజారుడుతనానికి చాలా జాలేసింది.

'నరసింహస్వామి ఉపాసనలోని అద్భుతాలు అర్ధమైతే వీళ్ళు ఇలా ఎందుకుంటారు?' అనిపించింది. 

నేటి పూజారులు ఉద్యోగులయ్యారు. వ్యాపారులయ్యారు. దళారులయ్యారు. ఉపాసకులు మాత్రం కాలేకపోతున్నారు. అందుకే ఇలా ఉంది. వాళ్ళు పూజిస్తున్న దేవత వాళ్ళకు ప్రసన్నమై ఉండాలి. పిలిస్తే పలికేలాగా ఉండాలి. అప్పుడు ఇంతమందిని పూజించే పని ఉండదు.

పూజారులే ఇలా ఉంటే, ఇక సామాన్య హిందువులకు వీళ్ళేం చెప్పగలుగుతారు? పూజారులూ చెప్పక, స్వామీజీలూ చెప్పక,  గురువులూ చెప్పక, ఎవరూ చెప్పక, మరోపక్క పరాయి మతాల ప్రలోభాలు ప్రచారాలతో సామాన్య హిందువు ఏమవుతాడు? ఎవడేది చెబితే దానిని నిజమనుకుంటాడు. అందుకే పరిస్థితి ఇలా ఉంది.

నాకేమీ సాయిబాబా అంటే ద్వేషం లేదు  ఈ సంగతి ఇంతకు ముందు కూడా చాలాసార్లు వ్రాశాను. కానీ ఆయన్ని దేవుడిని చేసి కూచోబెట్టి గుడులు కట్టి పూజలు చెయ్యడం తప్పని అంటాను. ఆయనొక ముస్లిం సాధువు. ఇంకా చెప్పాలంటే, 'సాధువు' అనికూడా ఆయనను అనకూడదు.  ఆయనకు చాలా కోపం ఉండేది. కాబట్టి ఆయనొక ఫకీరు. అంతే. అంతవరకే ఆయన్ను గౌరవిద్దాం. దానికి మించి అవసరం లేదని నా అభిప్రాయం. నా ఈ అభిప్రాయానికి ధార్మిక, చారిత్రక, వాస్తవిక ఆధారాలున్నాయి.

హిందూమతం ఇలాగే రానురాను భ్రష్టు పడుతోంది.

ఇంతకీ సాయిబాబాను నమ్మేవాళ్లు చెప్పే కారణాలేంటి? 'అనుకున్న పనులు అవుతాయి. గురువారం గుడికెళ్తే చాలు అన్నీ బాబానే చూసుకుంటాడు' అంటారు. ఇంతకంటే పిచ్చిభ్రమ ఇంకోటి లేదని నేనంటాను.

పనులు కావడానికి పరాయి మతాల సాధువులను నువ్వు పూజించనక్కరలేదు. అలా ఆలోచిస్తున్నావంటే అసలు  హిందూమతపు మూలసిద్ధాంతాలే నీకర్ధం కాలేదని అర్ధం. పల్లెటూరిలో పోలేరమ్మను నమ్మినవాడికి కూడా పనులు అవుతాయి. ఎన్నో నిదర్శనాలు పల్లెటూర్లలో ఈనాటికీ ఉన్నాయి.  అసలు ఏ దేవుడిని నమ్మని నాస్తికుడికి కూడా పనులు అవుతాయి. తన మీద తన నమ్మకమే వాడికి రక్ష.

దేవుడి విలువ నీ పనులు కావడం మీద ఆధారపడి లేదు. అలా ఉందని భావించే చవకబారు మనుషులే రోజుకొక దేవుడిని మారుస్తుంటారు మతాలు మారుతుంటారు ఎన్ని చేసినా వాళ్ళు చివరకు 'అడుక్కునే వాళ్ళు' గానే ఉండిపోతారు గాని ఆధ్యాత్మికంగా ఎదగలేరు.

అడుక్కునేవాడు అంతేకదా? 'ఆ బజార్లో అడుక్కుంటే బాగా తిండి దొరుకుతుంది, ఈ బజార్లో దొరకదు' అనుకుని పదిబజార్లు తిరుగుతూ చివరకు బేజారై పోతూ ఉంటాడు. వాడు తినే రెండుముద్దల తిండికి ఏ బజారైనా ఒకటే అన్న సంగతి వాడికి అర్ధం కాదు. ఈలోపల వాడి ఆత్మగౌరవం హరీమంటుంది.. ఆఫ్ కోర్స్ ఆడుక్కునేవాడికి ఆత్మగౌరవం ఎక్కడేడుస్తుంది గనుక?

పరమతసహనం పట్లుతప్పి మరీ ఎక్కువైతే ఇలాగే ఉంటుంది. పరమత సహనం మంచిదే. కాదనను. కానీ పరాయిమతాల సాధువులను ఫకీర్లను మన దేవుళ్ళుగా చేసుకోవడం మాత్రం నా దృష్టిలో ఆత్మద్రోహమే కాదు, ధర్మద్రోహం కూడా. వాళ్ళను గౌరవిద్దాం. కానీ ఎంతలో ఉంచాలో అంతలోనే ఉంచుదాం. మన నమ్మకాలను, మన ధర్మాన్ని మనం వదలకుండా ఉందాం. అదీ అసలైన హిందుత్వమంటే !

ఈ సున్నితమైన విభజనరేఖను మర్చిపోతున్నంతవరకూ హిందువులలో ఆధ్యాత్మిక చైతన్యం గాని, ఔన్నత్యం గాని,  ఏనాటికీ రాదనేది నా నమ్మకం.

ఏకనిష్ఠ లేకపోవడమే దీనికంతటికీ గల ప్రధానమైన కారణం.

ఇతర మతస్తులు హిందువులను చూసి నవ్వుతున్నారంటే నవ్వరూ మరి !

నేడొకటి, రేపొకటి, ఎల్లుండి ఇంకొకటి. మీలో ఏకనిష్ఠ ఏదీ?

read more " ఏకనిష్ఠా లోపం "

12, మే 2023, శుక్రవారం

మన ఆశ్రమానికి విజిటర్స్ ని తీసుకురావచ్చా?

ఆశ్రమ నిర్మాణం నిరాడంబరంగా, చురుకుగా ముందుకు సాగుతోంది.

మొన్నీ మధ్యన ఒక శిష్యుడు ఆశ్రమ సందర్శనానికి వచ్చాడు అదీ ఇదీ మాట్లాడి వెళుతూ, 'అప్పుడప్పుడూ తెలిసినవాళ్ళని ఇక్కడికి తీసుకురావచ్చా?' అని అడిగాడు

'అంటే ఎవరు?' అడిగాను

'అంటే, దగ్గర్లో ఉన్న క్షేత్రాలు అవీ చూడటానికి వచ్చేవాళ్ళు. వాళ్ళని ఇటు కూడా తేవచ్చా?' అన్నాడు

తను కారు ఓనర్ కం డ్రైవర్ గా పని చేస్తుంటాడు అందుకని అలా అడిగాడు 

'నువ్వెవరినీ తేవద్దు, అలా తేవడానికి ఇదేమీ  పిక్నిక్ స్పాట్ కాదు. ఇక్కడికి వచ్చే అర్హతా అదృష్టమూ ఉన్నవాళ్లు వాళ్ళే వస్తారు. మనకు మార్కెటింగ్ అవసరం లేదు' అని చెప్పాను

మా ఆశ్రమం సీరియస్ గా సాధనామార్గంలో నడిచేవాళ్ళకోసం  ఉద్దేశించబడింది గాని, కాలక్షేపం కోసం పుణ్యక్షేత్రాలు, పిక్నిక్ స్పాట్లు తిరిగేవాళ్ళ కోసం, ఫేన్సీ దీక్షలు తీసుకుని ఉత్తమాటలు చెప్పేవాళ్ళ కోసం పెట్టబడింది కాదు.

వారం క్రితం ఇంకొకాయన హిమాలయాల నుంచి ఫోన్ చేశాడు

'నేను గణపతిముని గారి సంప్రదాయానికి చెందినవాడిని ఆయన ప్రశిష్యుల దగ్గర దీక్షలు తీసుకున్నాను. పాతంజల యోగశాస్త్రాన్ని బోధిస్తుంటాను.  మీరు రాసిన ఛిన్నమస్తా సీరీస్ చదివాను. చాలా బాగున్నాయి. వేదాన్ని తంత్రాన్ని సమన్వయం చెయ్యడం అపురూపం. అది మీ రాతలలో కనిపిస్తోంది. మీకు నమస్కారాలు చెబుదామని ఫోన్ చేస్తున్నాను' అన్నాడు

'మంచిది. ప్రస్తుతం మీరెక్కడనుంచి మాట్లాడుతున్నారు' అడిగాను

'హిమాచల్ ప్రదేశ్ లో మెక్లియోడ్ గంజ్ కు ఇంకా పైన బాక్స్ నాధ్ అనే ప్రదేశం ఉంది. ప్రతి ఏడాదీ కొన్ని నెలలపాటు నేనిక్కడ ఉంటూ  సాధన చేసుకుంటూ ఉంటాను మీరు అనుమతిస్తే ఆంధ్రాకు వచ్చినపుడు మీ  ఆశ్రమంలో ఉండి కొన్నాళ్లపాటు సాధన చేసుకోవచ్చా?' అడిగాడు

'నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. ఇది సాధనాశ్రమమే, సాధకుల కోసం ఉద్దేశించబడినదే' అని చెప్పాను 

'బ్రాహ్మణులలో మార్షల్ ఆర్ట్స్ తక్కువగా  కనిపిస్తాయి. మీకు అవి కూడా వచ్చని చదివాను. వేలాది ఏళ్ల క్రితం ద్రోణాచార్యుడు మొదలైన గురువులు వాటిని నేర్పించేవారు. కానీ ప్రస్తుతం అలాంటివారు లేరు. మీ గురించి చదివి సంతోషం వేసింది. ఎన్నాళ్ళుగా అభ్యాసం చేస్తున్నారు?' అడిగాడు.

'గత నలభై ఏళ్లుగా' అన్నాను

'మీ మార్గాన్ని గురించి ఇంకా వివరంగా తెలుసుకోవచ్చా?' అడిగాడు.

'దానికేమి? నా పుస్తకాలలో ఉంది, చదవండి, అర్ధమౌతుంది లేకపోతే, ఇక్కడకు వచ్చి నాతో ముఖాముఖీ మాట్లాడి తెలుసుకోవచ్చు' అన్నాను

'తప్పకుండా త్వరలో వస్తాను' అన్నాడు

'ముందుగా ఫోన్ చేసి రండి, నేను ఎటన్నా వెళ్లి ఉంటే మీరు నిరాశపడతారు' అని చెప్పాను

నిజమైన సాధకులకు మా ఆశ్రమద్వారాలు  ఎప్పుడూ తెరిచే ఉంటాయి. కుతూహలపరులకు, కాలక్షేపరాయుళ్లకు మాత్రం తెరుచుకోవు.

మాది సాధనాశ్రమమే గాని సరదా ఆశ్రమం కాదు. అదే మాటను వాళ్ళతో చెప్పాను.

read more " మన ఆశ్రమానికి విజిటర్స్ ని తీసుకురావచ్చా? "

1, మే 2023, సోమవారం

శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన

నిన్న వైశాఖ శుద్ధ దశమి.

శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామిగా పిలువబడే బ్రహ్మంగారు సజీవ సమాధిలో ప్రవేశించిన రోజు. ఈ సంఘటన 1693 CE లో జరిగింది. ఈ సంఘటనను స్మరిస్తూ బ్రహ్మంగారి భక్తులు ప్రతి ఏడాదీ ఈ రోజున బ్రహ్మంగారి ఆరాధనను చేస్తారు. 

ఇక్కడ దొడ్డవరం గ్రామంలో బ్రహ్మం గారి భక్తులు చాలామంది ఉన్నారు. బ్రహ్మం గారి గుళ్ళు రెండు మూడున్నాయి. వాటిలో పాత గుడిలో నిన్నంతా ఆరాధనలు జరిగాయి. మొన్న రాత్రి బ్రహ్మంగారి పద్యనాటకం వేశారు. కుల మత భేదం లేకుండా, ఊరి జనాభా మొత్తానికీ రెండుపూటలు అన్నసంతర్పణ చేశారు.

ప్రసుతం మేము అద్దెకుంటున్న ఇంటివాళ్ళ పెద్దబ్బాయి ఈ కార్యక్రమాన్ని గత 20 ఏళ్ళ నుంచీ జరిపిస్తున్నాడు. ఇది ఎంతో మంచి విషయం. నాకు బాగా నచ్చింది.

ఒక మహాయోగిగా బ్రహ్మంగారిని నా చిన్నప్పటి నుంచీ నేను ఎంతో గౌరవిస్తాను. బ్రహ్మంగారి గురించి నేను మొదటిసారిగా 1976 లో తెలుసుకున్నాను. అప్పటికి ఒక ఏడాది ముందు 1975 లో రాజమండ్రిలో కొన్ని యోగాసనాలను 12 ఏళ్ళ వయసులో నేర్చుకున్నప్పటికీ, మొదటిసారిగా అన్ని ఆసనాలను ‘శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర‘ అనే పుస్తకంలోనే 1976 లో చూశాను. అభ్యాసం మొదలుపెట్టాను. అప్పట్లోనే పల్లెటూర్లలో రాత్రంతా ప్రదర్శించే బ్రహ్మంగారి నాటకాన్ని చూడటం, ఆయన జీవితచరిత్రను చదవడం జరిగింది. యోగసాంప్రదాయంతో నా పరిచయం అలా మొదలైంది. అప్పటికీ ఇప్పటికీ 45 ఏళ్ళు గడిచాయి. నా యోగసాధన అనేక పుంతలు తొక్కుతూ ముందుకు సాగింది. బ్రహ్మంగారి పైన నా గౌరవం  కాలంతో బాటు పెరుగుతూ వచ్చింది.

నేడు, మా ఆశ్రమం వచ్చిన దొడ్డవరం గ్రామంలో చూస్తే, బ్రహ్మంగారి గుడులు  మూడున్నాయి. ఆయన ఆరాధనను నిష్ఠగా చేసే గ్రామస్తులున్నారు. బ్రహ్మంగారి గుడి ఉన్న బొడ్డురాయి ప్రక్కనుంచే మా ఆశ్రమానికి పోయే దారి ఉంటుంది. ఇదంతా కాకతాళీయం కాదని నేను నమ్ముతున్నాను. 

బ్రహ్మంగారి చరిత్రను పరిశీలిస్తే, ఆయన తన సంచారంలో భాగంగా అద్దంకి, ధేనువకొండలకు వచ్చినట్లు తెలుస్తున్నది. ధేనువకొండ గ్రామం మాకు కేవలం పది నిముషాల దూరం మాత్రమే.

NTR తీసిన బ్రహ్మంగారి చరిత్ర సినిమాను నేను 1984 లో గుంతకల్ లో చూశాను. ఆ సినిమా షూటింగ్ రాయలసీమలోనే జరిగింది. ఆ షూటింగ్ లో నా తోటి ఉద్యోగులు కొంతమంది నటించారు కూడా. షూటింగ్ చూద్దామని వాళ్ళు కందిమల్లాయపల్లి వెళితే, నటులు తక్కువయ్యారని గ్రామస్తులుగా వేషాలు వీళ్ళకే వేయించి వీళ్ళనే  సినిమాలో పెట్టాడు NTR. ఆ సినిమాకు నేను పోయిన రోజున, గుంతకల్ లో ఉండే శ్రీ శంకరానందగిరి స్వాములవారు కూడా సినిమాహాలుకు వచ్చి బాక్స్ లో కూచుని ఆ సినిమాను చూచారు. నేను దర్శించిన బ్రహ్మజ్ఞానులలో ఆయన ఒకరు.

అయితే ఆ సినిమా నన్ను నిరాశపరచింది. NTR కు తోచిన రీతిలో ఆ సినిమా వాస్తవ వక్రీకరణకు గురయింది. అది నాకు నచ్చలేదు. జనాకర్షణ కోసం చరిత్రను మార్చాడాయన. 'అతి'నటన కూడా చేశాడు. అందుకే ఆ సినిమాను రెండవసారి నేను చూడలేదు. ఆ సినిమాను ఇంకా బాగా, వాస్తవాలకు దగ్గరగా తీసి ఉండవచ్చుననేది నా అభిప్రాయం. 

తరువాత నేను గుంటూరు డివిజన్ లో పనిచేసినప్పుడు, నంద్యాల యర్రగుంట్ల లైన్ వేస్తున్న సమయంలో, బనగానపల్లెలో బ్రహ్మంగారి సమాధిని దర్శించాను. వారి వంశస్తులను చూచి నిరాశ చెందాను. కారణం? ఆయన శక్తి వారిలో కనిపించకపోవడం.

వేదాంత, యోగ, తంత్ర సంప్రదాయాలను సమన్వయం చేసి  ఆచరణాత్మకమైన సిద్ధమార్గాన్ని రాయలసీమలోను, ఒంగోలు, నెల్లూరు ప్రాంతాల లోని పల్లెపట్టులలోను బహుళ ప్రచారం చేసిన మహాయోగిగా బ్రహ్మంగారిని నేను అమితంగా గౌరవిస్తాను. హిందూమతం యొక్క ఆచరణాత్మక యోగవిధానాలు గ్రామ్యప్రాంతాలలో ఇంకా బ్రతికి ఉన్నాయంటే అది బ్రహ్మంగారి చలవే. మా మార్గం కూడా అదే కాబట్టి మా ఆశ్రమంలోని ధ్యానమందిరంలో బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచబోతున్నాను. 

బ్రహ్మంగారిని ఆరాధించినంత వరకూ, SC, ST, BC లను క్రైస్తవం తాకలేకపోయింది. ఆయనను మరచిన తర్వాతనే పల్లెల్లో అది ఎక్కువైంది. ఇది వాస్తవం.

బ్రహ్మంగారి తత్త్వాలన్నా, బ్రహ్మంగారి నాటకమన్నా నాకు చాలా ఇష్టం. అందుకే మొన్న రాత్రి తెల్లవారుజాము 4 వరకూ, ఎద్దులబండి వేదికగా  ఇక్కడ సాగిన ఆ పద్యనాటకం నాకు చాలా ఆనందాన్ని కలిగించి, నా చిన్నతనాన్ని గుర్తుకు తెచ్చింది. తెలుగునాట పల్లెటూర్ల జీవితాన్ని మళ్ళీ ఆస్వాదించే అవకాశం ఇన్నాళ్ళకు మళ్ళీ నాకు ఈ విధంగా లభించింది.

పండితులలాగా ఉత్తమాటలు ఉపన్యాసాలు చెప్పడం కాకుండా, దైవశక్తిని, అమానుష యోగశక్తులను ప్రత్యక్షంగా ప్రదర్శించి చూపి, కుల మతాలకు అతీతమైన వేదాంతతత్త్వాన్ని ఆచరణలో నిరూపించిన మహాయోగి - బ్రహ్మంగారు. అసలైన హిందూమతాన్ని నిలబెట్టినది ఇటువంటి మహనీయులే. సాంఖ్యము, తారక రాజయోగము, అమనస్కము, కుండలినీ యోగములకు ఆయన జీవితమే ప్రత్యక్ష నిదర్శనం.

అయితే, ఉత్తగా ఏడాదికొకసారి ఆయన ఆరాధనను చేసి ఊరుకోవడమో, లేదా ఆయనను తమ కులానికే పరిమితమైన మహనీయునిగా భావించి ఒక గుడి కట్టి ఒదిలేయడమో నేను హర్షించను. ఆయన చూపిన సమగ్రమైన యోగమార్గంలో నడచి ఆయా సమాధిస్థితులను డైరెక్ట్ గా అందుకోవడము, ఆయా అమానుష యోగశక్తులను సాధించి, అవసరమైతే ప్రదర్శించి చూపగలగడమే ఆయనకు మనం చేయగల అసలైన ఆరాధన అని నేను నమ్ముతాను. దానినే మా ఆశ్రమంలో అనుసరిస్తున్నాము. బోధిస్తున్నాము.  

ఆయన చూపిన యోగమార్గంలో నడుస్తున్న మేము, ఆయన ఆరాధింపబడుతున్న గ్రామానికి, ఆయన సంచరించిన ప్రాంతానికి చేరుకోవడం ఆయన అనుగ్రహం గానే భావిస్తున్నాను.

అందరూ నమ్ముతున్నట్లు వేమనయోగి రెడ్డికులానికి ప్రతీక అని, బ్రహ్మంగారు విశ్వబ్రాహ్మణ కులానికి ప్రతీక అని నేను నమ్మను. వారిది యోగికులం. అది కులమతాలకు అతీతమైన ఋషికులం. నిజమైన మహనీయులందరిదీ అదే కులం.

అందుకనే, ఆచరణాత్మక యోగసాధనకు పెద్దపీటను వేసే మా ఆశ్రమంలో, శ్రీ రామకృష్ణులవారు, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగార్లతో బాటు, బ్రహ్మంగారి చిత్రపటాన్ని కూడా ఉంచి పూజించబోతున్నాము. 

ఇదే మేము చేయబోతున్న బ్రహ్మంగారి ఆరాధన. ఈ ఆరాధన ఏడాది కొకసారి జరిగేది కాదు. అనుక్షణం జరిగేది. ఇదే అసలైన ఆరాధన అనేది మా నమ్మకం.

read more " శ్రీ మద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి ఆరాధన "