“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

27, నవంబర్ 2011, ఆదివారం

తిరుపతి ప్రయాణంలో -2

మర్నాడు ఉదయమే లేచి VIP break లో దర్శనం చేసుకోవడం జరిగింది. దేవాలయంలోనుంచి బయటకు వచ్చి, పడుతున్న వాన తుంపరలో నడుస్తూ,పిల్లలు అడిగిన కొన్ని సందేహాలకు సమాధానాలు చెప్తూ,గెస్ట్ హౌస్ కు చేరుకున్నాం. 

"నాన్నా. రామానుజులు విశిష్టాద్వైత సిద్ధాంతప్రవర్తకుడు అని నిన్న చెప్పావు కదా. అసలు త్రిమతాలైన ద్వైతాద్వైత విశిష్టాద్వైత సిద్ధాంతాల యొక్క మౌలిక బోధనలు ఏమిటి? అసలు ఇన్ని రకాల సాంప్రదాయాలు ఎందుకు?"అని పిల్లలు అడిగారు. వారి వయసుకు మించిన జిజ్ఞాసకు ముచ్చట అనిపించింది.

" చెప్తాను. శ్రద్ధగా విని అర్ధం చేసుకోండి" అంటూ ఇలా చెప్పాను.

"వేదాంతము ముఖ్యంగా జీవుడు, జగత్తు, బ్రహ్మము అనే మూడు విషయాలను చర్చిస్తుంది. ఈ మూడింటి మధ్య ఉన్న సంబంధాన్ని త్రిమతాచార్యులు దర్శించిన భేదాలవల్ల ఆయా సిద్ధాంతాలు ఒకదానికొకటి భిన్నములుగా దర్శనం ఇస్తాయి.

జీవుడు అంటే జీవాత్మ. ఈ జీవాత్మలు కోటానుకోట్లు ఉన్నాయి. పెద్ద అగ్నిగుండం లోనుంచి బయటకు వచ్చే నిప్పురవ్వలలాగా ఇవి ఉంటాయి. జగత్తు అంటే మనకు కనిపించే ప్రపంచం. వేదాంతంలో చెప్పబడే బ్రహ్మాన్నే మనం భగవంతుడు అనీ, దేవుడు అనీ, సామాన్యభాషలో పిలుస్తాం.

జీవుడూ, జగత్తూ, బ్రహ్మమూ వేరువేరుగా అనాదిగా ఉంటున్నాయి. ఇవి మూడూ ఎప్పటికీ విడివిడిగానే ఉంటాయి. వీటికి మూడింటికీ ఎప్పటికీ నాశనం లేదు. జీవుడు ఈ జగత్తులో భక్తిభావంతో ఉంటూ పూజ, అర్చన, జప తపాదులద్వారా బ్రహ్మాన్ని ఉపాసించాలి. ఇది ద్వైతవాదం. దీన్ని మధ్వాచార్యులు ప్రతిపాదించారు. పాపులర్ హిందూమతం అంతా ఈ స్థాయికి చెందినదే. అంతేకాక దాదాపుగా సామాన్యజనాలు అనుసరించే  అన్ని మతాలూ, ఆచరణలూ, ఈ స్థాయిలోనో ఇంకా తక్కువ స్థాయిలోనూ  ఉంటాయి. 

జీవునిలో బ్రహ్మముయొక్క అంశ ఉంటుంది. జగత్తుకూడా బ్రహ్మము యొక్క అంశమే. బ్రహ్మము చేత సృష్టించబడిన ఈ జగత్తులో, జీవుడు శరణాగతతత్వంతో భక్తిమార్గంలో నడుస్తూ, చివరకు బ్రహ్మములోని ఒకఅంశముగా మారాలి.ఇది విశిష్టాద్వైత తత్త్వం. ఇది రామానుజాచార్యుల మతం.   

జగత్తు అనేది నిజానికి ఒక భ్రమ. అది ఎప్పుడూ లేదు. జీవుడూ బ్రహ్మమూ ఒకదానికొకటి వేరువేరు కాదు. జగత్తు ఉంది అనుకోవడమూ,జీవుడూ బ్రహ్మమూ వేరు అనుకోవడమూ మాయ. సాధనవల్ల ఈ మాయ తొలగినప్పుడు  సత్యం బోధపడుతుంది. ఇది అద్వైతవాదం. దీనిని శంకరాచార్యులు ప్రతిపాదించారు.

కొన్ని శతాబ్దాలుగా వీరి అనుచరుల మధ్య, ఈ సిద్ధాంతాల మీద రాద్ధాంతాలు జరుగుతున్నాయి. ఒకరిని చూస్తె ఒకరికి పడకపోవడమూ, ఒకరి కుటుంబాలలో ఇంకొకరు పెళ్ళిళ్ళు చేసుకోకపోవడమూ, బంధుత్వాలు ఉండకపోవడమూ ఇత్యాదులు తరతరాలుగా ఉంటున్నాయి. నా దృష్టిలో ఇదొక పనికిమాలిన పిచ్చితనం. 

ఈ సిద్ధాంతాలలో ద్వైతం అనేది చాలా సులభంగా అందరికీ అర్ధం అవుతుంది. అనుసరించడానికి కూడా సులభంగా ఉంటుంది. ఎందుకంటే, దేవుడు సర్వశక్తివంతుడు.మనిషి అల్పుడు.మన కష్టాలు తీర్చమని మనం దేవుణ్ణి ప్రార్దిస్తాం. వరాల కోసం అర్దిస్తాం. పూజా పునస్కారాలు చేస్తాం. ద్వైతం ఇంతవరకే అర్ధం చేసుకుంటుంది. మామూలుస్థాయిలో ఉండే సామాన్యజనానికి ద్వైతం బాగా నప్పుతుంది. నిజానికి ప్రపంచంలో ఉన్న అన్నిమతాలూ, అవి దేవుణ్ణి నమ్మేవైతే, ద్వైతసిద్ధాంతం క్రిందకే వస్తాయి. దీనికంటే ఇంకొంచం పైది విశిష్టాద్వైతం. ఇందులో జీవుడు భగవంతుని అంశగా మారగలడు అని భావిస్తారు. ఇదీ చాలామందికి బాగానే నచ్చుతుంది. శరణాగత భావంతో, భగవత్ ప్రసాదంగా ప్రపంచాన్ని అనుభవించవచ్చు అని వీరు భావిస్తారు. ఇదీ మంచిదే. ఇకపోతే అద్వైతం ఇంతకంటే పై స్థాయికి చెందినది. అందులో జీవుడూ దేవుడూ అన్న భేదానికి తావే లేదు. జగత్తుకు అసలు ఉనికే లేదు. ఇది చాలా కష్టసాధ్యం. ఊహక్కూడా దుర్లభం. అందుకే ఈ స్థాయిని అందరూ అందుకోలేరు. అద్వైతులమని చెప్పుకునేవారుకూడా ఈ స్థాయిని అందుకోలేరు. కాని ఇది అత్యున్నతమైన ఒక అనుభవస్తితిని ప్రతిపాదిస్తున్నది. కనుక ఇదీ సత్యమే.

నిజంగా చూస్తే, ఈ మతానుయాయుల మధ్యన ఉన్న స్పర్ధలు అసలు అనవసరమైనవి. వీరితో వచ్చిన చిక్కేమిటంటే వీరిలో ప్రతిఒక్కరూ వారి సిద్ధాంతమే అంతిమసత్యం అనుకున్నారు. జీవుడు దేవునితో ఏ నాటికీ సమానుడు కాలేడని మొదటి రెండు వర్గాలూ భావిస్తాయి. అసలు అలా భావించడమే మహాతప్పుగా వారు తలుస్తారు. అద్వైతంలో అలాటి అపరాధభావన ఏమీ ఉండదు. జీవబ్రహ్మైక్యాన్ని తెలుసుకోవడమే సార్ధకత అని వారు తలుస్తారు.

శ్రీరామకృష్ణులు ఈ మూడుమతాల మధ్యనా ఉన్న గొడవలను చాలా సులభంగా పరిష్కరించారు. ఇవి మూడూ సాధనామార్గంలో మూడుమెట్లని ఆయన చెప్పారు. ఇవి మూడూ పాక్షికసత్యాలే. ఏ మెట్టులో ఉన్నవారికి ఆ మెట్టే చివరిమెట్టుగా అనిపిస్తుంది. కాని నిజానికి ప్రయాణంలో అదొక మజిలీ మాత్రమే. ఈ మూడుస్తాయిలే కాకుండా వీటిని మించిన ఇంకా అనేక పై స్తాయిలున్నాయని శ్రీరామకృష్ణులు చెప్పారు. నిజానికి ఈ మూడు సిద్ధాంతాలూ, వాదాలకు ప్రతివాదాలకు పనికొచ్చే సిద్ధాంతచర్చా విషయాలు కానేకావు. ఇవి సాధనలో అనుభవంలోకి తెచ్చుకోవలసిన విషయాలు. సాధన చేసేవారికి ఇవి అనుభవంలోకి వస్తాయి. అలాకాకుండా ఊరకే సిద్ధాంతాలు చదివి, చర్చలు చేసి, గొడవలు పడే పండితులకు ఉత్త అహంకారమే మిగులుతుంది. 

ఉన్నతమైన అద్వైతస్తితిలో ఒక మనిషి ఎల్లకాలమూ ఉండటం అందరికీ సాధ్యం కాదు. కనుక అద్వైతానుభవాన్ని పొందినతర్వాత కూడా చాలామంది మానవులు క్రిందిస్తాయిలలోకి దిగివచ్చి విశిష్టాద్వైత స్తాయిలోనో, లేక ద్వైతస్తాయిలోనో ఉంటూ ఈ జగత్తు తోనూ అందులోని జీవులతోనూ వ్యవహరించాల్సి వస్తుంది. ఇంతకంటే వేరే మార్గం ఉండదు. కాని అద్వైతానుభవాన్ని నిత్యజీవితంలో అనుసంధానం చేసుకుంటూ వ్యవహరించే స్తితి  చాలా పరిపక్వస్థితి. దీనిలో, ఈ మూడుస్తాయిలలోని పరిపూర్ణజ్ఞానం అనుభవరూపంలో ఆవ్యక్తిలో ఉంటుంది. దీనినే శ్రీ రామకృష్ణులు "విజ్ఞానం" అన్నారు. భక్తునిస్తితి కంటే, జ్ఞానిస్తితి కంటే, ఈ విజ్ఞానిస్తితి చాలా గొప్పది. పరిపక్వమైనది.

ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఇదీ శ్రీరామక్రిష్ణులు చెప్పినదే. ఒక మనిషి ఇంటిలో, డాబామీదకు వెళ్ళడానికి మెట్లుంటాయి. ఆ మెట్లు ద్వైతం విశిష్టాద్వైతం అనుకోవచ్చు. డాబా మీది కప్పుని అద్వైతం అనుకోవచ్చు. మనిషి మెట్లమీదుగా పైకెక్కి కప్పుమీదకి చేరుతాడు. కాని డాబామీదికెక్కిన తర్వాత ఎల్లకాలం అక్కడే ఉండలేడు. కాసేపు అక్కడఉండి, తర్వాత కిందికిదిగి, ఇంటిలోకి రావలసిందే. కాని కొందరుమాత్రం, ఎప్పుడూ డాబా మీదే ఉండిపోతారు. ఇక కిందికి రారు. వారు ప్రపంచపు వాసన సోకని నిత్యసిద్ధులు. సనక సనందనాది మహర్షులు ఈ కోవకు చెందినవారు. వారు ఎప్పుడూ ఈ ప్రపంచానికి అతీతమైన భూమికలో ఉండే మహనీయులు. 

మనిషి మెట్లెక్కి ఇంటిమీదకి చేరాలి. మళ్ళీ మెట్లు దిగి ఇంటిలోకి రావాలి. ఒకసారి పైకెక్కి దిగిన తర్వాత ఇంతకు ముందున్న మానసిక స్తితి అతనికి ఉండదు. కారణమేమిటంటే పై కప్పుమీద నుంచి చూస్తే, ఇంతకు ముందు తనకు తెలియని ఎన్నో కొత్తవిషయాలు అతను చూస్తాడు, గ్రహిస్తాడు. కనుక అతని మనస్తత్వమూ స్వభావమూ తదనుగుణంగా మారిపోతాయి. అతని దృక్కోణంలో మౌలికమైన అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. కప్పు ఏ పదార్ధంతో తయారైందో మెట్లూ ఇల్లూ కూడా అదే పదార్ధంతో నిండి ఉన్నాయని అతడు గ్రహిస్తాడు. తనకు వివిధమెట్లమీదా, పైకప్పుమీదా కలిగిన అనుభవాలదృష్ట్యా ఇప్పుడతని ప్రవర్తన ఉంటుంది. అందుకే ఆ అనుభవాలు లేని లోకులకు అతని భావాలూ ప్రవర్తనా అర్ధం కావు".

"ఈ ప్రపంచంలో ఎవరైనా సరే ఈ దారిలో నడవక తప్పదు. ఈ రోజు కాకపోతే రేపైనా, ప్రతివారూ ఈ దారిలో నడవాలి. ఇది ప్రకృతినియమం. దీనికి ఎవ్వరూ మినహాయింపు కారు. అందుకే ప్రతిమనిషికి అంతర్లీనంగా ఏదో సాధించాలన్న తపన ఉంటుంది. కాని తెలీక, దాన్ని భౌతికరంగాలలో ఉపయోగిస్తాడు. లోకంలో ఎంతో సంపాదించాననీ, ఎన్నో విజయాలు సాధించానని అనుకుంటాడు. ఎన్ని సాధించినా జీవితచరమాంకంలో వెనక్కి తిరిగి చూచుకుని తానేమీ సాధించలేదని, జీవితం వృధాగా గడిపాననీ గ్రహిస్తాడు. ఎందుకంటే జీవుడు, జగత్తు, బ్రహ్మము అనే మూడూ అతి మౌలికమైన సమస్యలు. వీటిని తెలుసుకోకుండా మనిషి జీవితంలో ఎన్నటికీ అంతిమమైన తృప్తి కలగదు. ఎన్ని బాహ్యవస్తువులు పొందినా అవి అంతరికమైన ఈ మౌలిక విషయాలను స్పర్శించలేవు కనుక అంతిమతృప్తి అనేది మనిషికి ఎన్నటికీ కలుగదు. లోపల వెలితి అలాగే మిగిలిపోతుంది.

జగత్తును తెలుసుకుందామని సైన్సు ప్రయత్నం చేస్తున్నది. (సైకాలజీ మనస్సును తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నది) పేరాసైకాలజీ ఆత్మను గురించి తెలుసుకుందామని ప్రయత్నం సాగిస్తున్నది. సాధకులు దైవాన్ని తెలుసుకుందామని చూస్తున్నారు. కాని ఎవరైతే ఈ మూడింటినీ పూర్తిగా సమగ్రంగా తెలుసుకుంటారో వారి జీవితమే ధన్యం. లేకపోతే ఆ జీవితం వ్యర్ధం. మనిషి ఎంత సంపాదించినా చివరకు అది వ్యర్థమే. అది ఏమాత్రమూ లెక్కలోకి రాదు. అంతిమమైన సంతృప్తిని ఇవ్వలేదు. ఈ మౌలిక సమస్యలను సాల్వ్ చెయ్యగలిగిన వారి జీవితం మాత్రమే ధన్యం అవుతుంది. లేకపోతే మానవజన్మ వ్యర్ధమే.

"ఒకరు ఈ సమస్యలను సాల్వ్ చేస్తే అది అందరికీ ఉపయోగపడదా? ఎందుకంటే సైన్స్ లో ఒక ఆవిష్కరణ జరిగితే అది అందరికీ అందుబాటులోకి వస్తుంది కదా? అలాగే ఈ రంగంలో కూడా జరగడానికి ఆస్కారం లేదా?" మా అమ్మాయి అడిగింది.

నాకు నవ్వొచ్చింది.

"అలా కుదరదమ్మా.అంతరిక జీవితంలో ఎవరి ఆవిష్కరణ వారిదే. కాకపోతే నేను నడిచినదారిని మీకు చూపించగలను. మార్గంలో ఎత్తుపల్లాలు ఎక్కడున్నాయో చెప్పగలను. ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలో చెప్పగలను. కాని మిమ్మల్ని భుజాలపైన ఎత్తుకొని నేను నడవలేను. ఆ దారిలో నడక మాత్రం మీరు నడవాల్సిందే. మీ అనుభవం మీదే. ఇంకొకరి అనుభవం మనకు అంతవరకే ఉపయోగపడుతుంది. 

సైన్స్ కూ ఆధ్యాత్మికతకూ ఉన్న భేదం గురించి చెప్తాను విను. సైన్స్ అనేది ఆబ్జెక్టివ్ ప్రయోగం. అది బయట వస్తువులతో చేసేది. అక్కడ ప్రయోగం చేసేవాని సబ్జెక్టివ్ స్తితితో, అతను చేసే ప్రయోగానికి సంబంధం ఉండదు. కాని సాధన అలా కాదు. ఇది పూర్తిగా సబ్జెక్టివ్ వ్యవహారం. ఇక్కడ ప్రయోగశాలా తనే. ప్రయోగమూ తనమీదే. చేసేదీ తానే. కనుక కలిగే అనుభవమూ తనతోనే ఉంటుంది. దాని ఛాయ కొంతవరకూ బయటకి కనిపిస్తుంది. కాని పూర్తిగా బయటివారికి అర్ధంకాదు. అదీ తేడా." అని చెప్పాను.

వింటున్న వారి ముఖాలలో సంభ్రమంతో కూడిన ఏదో ఆనందం కనిపించింది. జీవితంలో మౌలికసమస్యల  పరిష్కారం కనుగొన్న బుద్ధుని ముఖంలో కనిపించే నిర్మలత్వం వారిముఖాలలో చూచాయగా దర్శనమిచ్చింది.

తర్వాత ప్రయాణం మామూలుగానే సాగింది. కొండ కిందకు దిగి, తిరుపతిలో పద్మావతీ అమ్మవారి ఆలయమూ, కపిల తీర్ధమూ దర్శించి, కొద్దిపాటి విశ్రాంతి తర్వాత, సాయంత్రానికి బండెక్కి ఊరికి చేరాము. ప్రయాణమంతా వింటున్న ఈవిషయాలు మౌనంగా నెమరు వేసుకుంటున్నట్లుగా దారిలో పిల్లలముఖాలు చూస్తే నాకనిపించింది.