“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, జులై 2014, శుక్రవారం

రాహు యజ్ఞగుండంలో ఇంకా ఎన్ని సమిధలు కాలాలో?

298 మంది ప్రయాణీకులతో పయనిస్తున్న MH-17 మలేషియా విమానం ఉక్రెయిన్ మీదుగా పోతున్నపుడు నిన్న గురువారం నాడు కూలిపోయింది.కూలిపోయింది అనడం కంటే కూల్చి వెయ్యబడింది అనడం సమంజసంగా ఉంటుంది. దాదాపు 30,000 అడుగుల ఎత్తున ఆకాశంలో ఎగురుతున్న విమానం అక్కడనుంచి నేలకు కూలిపోతే అందులో ఎవరైనా ఎలా మిగులుతారు? సగం మంది ఆ షాక్ తో ఆకాశంలోనే హరీమని ఉంటారు.ఏం జరుగుతున్నదో అర్ధం అయ్యీకాని ఒక్క క్షణంలో 298 మంది ఆత్మలుగా మారి ఆకాశంలో తేలిపోయారు.ఈ ఘోరం నిన్న జరిగింది.

చాలామంది గ్రహాలను చాలా తేలికగా నవ్వులాటగా తీసుకుంటారు.ఎగతాళి కామెంట్స్ కూడా చేస్తుంటారు.అది చాలా తప్పు.అలాంటి వారికి కనువిప్పు కలిగించేవే ఇలాంటి సంఘటనలు.ఎవరి జీవితాలలో వారికి జరిగినప్పుడు మాత్రమే గ్రహాలశక్తి ఏమిటో అర్ధమౌతుంది.అప్పటిదాకా అర్ధం కాదు.అయితే చాలాసార్లు అలా జరిగాక,ఏం జరిగిందో చూచుకోవడానికి మనమే ఉండము.

ఉగ్రవాదులు కూడా పాసెంజర్ ఫ్లైట్ ను కూల్చాలని అనుకోరని నా అభిప్రాయం.అమాయకులైన ప్రయాణీకులు ఏం చేశారు?వాళ్లకు దేశ రాజకీయాలతో ఏమి సంబంధం ఉంటుంది? కాకపోతే,ప్రస్తుతం జరుగుతున్న అంతర్జాతీయ సమావేశాలలో పాల్గొని తిరిగి తమతమ దేశాలకు వెళుతున్న ఏదో ఒక దేశాధినేతను టార్గెట్ చేసుకునే ఇది జరిగి ఉంటుందని నా ఊహ.ఆ క్రమంలో ఉగ్రవాదుల అంచనాలు తప్పిపోయి ప్రయాణీకుల విమానాన్ని కూల్చివేశారు.

ఇది ఉచ్ఛస్థితిలో ఉన్న గురువు యొక్క అనుగ్రహమే.లేకుంటే ఈ పాటికి మనం ఇంతకంటే ఏదో ఒక ఘోరమైన దుర్వార్తను వినవలసి వచ్చేది.

జరిగిన ఈ ఘోర సంఘటనకు నా విచారం వ్యక్తం చేస్తూ జ్యోతిష్యపరంగా దీనికి కారణాలేమిటో వివరించబోతున్నాను.

ప్రస్తుతం రాహువు కన్యారాశిలో ప్రవేశించాడు.అక్కడ తాను ఉచ్ఛస్థితిలో ఉన్న బుధుడిని సూచిస్తున్నాడు.కనుక తెలివితేటలు ఎక్కువైపోయి వక్రంగా మారిన ఉగ్రవాదులను రాహువు ప్రస్తుతం సూచిస్తున్నాడు.ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద దాడులూ యుద్ధాలూ జరుగుతూ ఉండటం దీని సూచనే.

ఇజ్రాయెల్ పాలస్తీనా యుద్ధం రోజురోజుకూ తారాస్థాయికి చేరుకుంటున్నది. రెండువైపులా ఎంతో నష్టం ప్రతిరోజూ జరుగుతున్నది.ఇది కూడా రాహువు చేస్తున్న మారణహోమమే.

ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద మూకలు చెలరేగిపోవడం కూడా రాహువు యొక్క ప్రభావమే.

ప్రస్తుతం అంగారకుడు,శని రాహువుల మధ్యన శనివైపుగా వేగంగా ప్రయాణిస్తున్నాడు.భూతత్వరాశి అయిన కన్యా,వాయుతత్వరాశి అయిన తులారాశులు ఇందులో పాలు పంచుకుంటున్నాయి.రాహువూ కుజుడూ ఉగ్రవాద దాడులకు సూచకులు.

ప్రస్తుతం జరిగిన దుర్ఘటనలో భూమినుంచి ఆకాశంలోకి ప్రయోగింపబడే surface to air missile ద్వారా ఈ విమానం కూల్చివేయ బడింది.రాహువూ కుజుడూ,భూ వాయు తత్వరాశులలో ఉండటం దీనిని ఎంత స్పష్టంగా సూచిస్తున్నదో గమనిస్తే అర్ధమౌతుంది.అంటే భూమి నుంచి ఆకాశంలోకి దూసుకెళ్ళే ఒక మిస్సైల్ వల్ల దాదాపు 300 మంది ప్రాణాలు క్షణంలో గాలిలో కలసిపోయాయి.ఇది రాహువు యొక్క ప్రభావం కాకపోతే ఇంకేమిటి?

MH 17 అనే విమానం లో ఉన్న మర్మం గమనిద్దాం.

M అనేది ఇంగ్లీష్ అక్షరాలలో 13 వది.

13=1+3=4 కేతువును సూచిస్తున్నది.

H అనేది 8 వ అక్షరం.8 శనీశ్వరునికి సూచిక.

ఇక పోతే 17=1+7=8 మళ్ళీ శనీశ్వరుడే ప్రత్యక్షం.

ఈ విమానం సంఖ్యను అంకెలలోకి మారిస్తే--

13-8-17 అవుతుంది.

అంటే 4(కేతువు)-8(శని)-8(శని)

దీనిని రూట్ నంబర్ గా మారిస్తే 2(రాహువు) అవుతున్నది.రూట్ నంబర్ లో రాహు ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నది.

కనుక మళ్ళీమళ్ళీ రాహు కేతువులూ శనీశ్వరుడూ ఈ నంబర్ లో కనిపిస్తున్నారు.వారి ప్రభావం ఏమిటో ఇంతకు ముందే వివరించాను కదా. 

ఇప్పుడు ఇంకొక కోణం గమనిద్దాం.

విమానంలో 298 మంది ప్రయాణీకులున్నారని అంటున్నారు.

ఇందులో 2 రాహువునూ,9 చంద్రుడినీ,8 మళ్ళీ శనీశ్వరుడినీ సూచిస్తున్నాయి.పాశ్చాత్య సంఖ్యా శాస్త్రం ప్రకారం అయితే 9 అంకె కుజునికి సూచిక.అప్పుడు చక్కగా రాహువూ కుజుడూ శనీ ఈ అంకెలో దర్శనం ఇస్తున్నారు.మనం ఇప్పటిదాకా మాట్లాడుకుంటున్నది ఈ ముగ్గురి గురించే అని అర్ధమైతే ఎంతో ఆశ్చర్యం కలుగుతుందా లేదా?

కనిపించే అంకెల వెనుక కనిపించని శక్తుల ప్రభావం ఎలా ఉంటుందో ఇప్పుడు అర్ధం అవుతున్నది కదా?

రాహువు యొక్క ఈ గోచారమార్పు వల్ల ఉగ్రవాద దాడులు పెరుగుతాయి అని నేను వ్రాసినది నిజం కావడం ప్రత్యక్షంగా మన కళ్ళముందే కనిపిస్తున్నది.

రాహువూ కుజుడూ శనీశ్వరుడూ కలసి చేస్తున్న ఈ మారణహోమంలో ఇంకా ఎంతమంది సమిధలుగా మాడిపోవాలో? చూద్దాం.