22, ఏప్రిల్ 2016, శుక్రవారం

మా అమెరికా యాత్ర -1

   
 





































మొదటి సారి అమెరికాలో అడుగు పెట్టాము.

విమానంలో అడుగుపెట్టిన దగ్గరనుంచి చాలా చాలా విషయాలు గమనిస్తూ వస్తున్నాను.వాటన్నిటినీ ఈ సీరీస్ లో అక్షరబద్ధం గావిస్తాను.

మొట్టమొదట విషయం విమానం గాల్లోకి లేచినప్పుడు గమనించాను. బయలుదేరింది రాత్రి కావడంతో పైనుంచి చూస్తే హైద్రాబాద్ గందరగోళపు లైట్ల సమాహారంగా కనిపించింది.దూరంనుంచి చూచిన గెలాక్సీ లాగా అనిపించింది. కానీ అసలు సంగతి అది కాదు.కొద్ది గంటలలో అబూదాబి వచ్చినపుడు దాన్ని చూస్తే అసలు విషయం అర్ధమైంది.హైదరాబాద్ కు భిన్నంగా అబూదాబి లైట్లు చాలా పొందికగా ప్లాన్ గా కనిపించాయి.స్కేల్ తో గీతలు గీచినట్లు, రోడ్లు గాని, భవనాలు గాని ఎంతో ఆర్డర్లీగా కనిపించి, అబూదాబీతో పోలిస్తే మన హైదరాబాద్ ఎంత దరిద్రంగా ఉందో అర్ధమైంది. దుబాయ్ అయితే ఇంకా ఎంతో ఆర్దర్లీగా ప్లాన్డ్ గా ఉంటుందని కొందరు చెప్పారు.

మన దేశంలో ఎంత పెద్ద సిటీ అయినా టౌన్ ప్లానింగ్ అనేది అస్సలు ఉండదు. ఏదో హాఫజార్డ్ గా గందరగోళంగా ఉంటాయి మన నగరాలు.సిటీలో తిరిగినా అదే అనిపిస్తుంది.ఆకాశంలోంచి రాత్రిపూట చూసినప్పుడు ఈ తేడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది.

అబూదాబీలోనే యూ.ఎస్ కౌంటర్లో ఇమ్మిగ్రేషన్ పూర్తయింది. అక్కడున్నప్పుడే ఈక్విడార్ భూకంపం సంగతి టీవీలో చూచాము.సరే పౌర్ణమి ఘడియలలో ఉన్నాము కదా ఇలాంటివి జరగడం సహజమే అని అనుకున్నాము.

అబూదాబీ నుంచి చికాగో కు దాదాపు 14 గంటల పైనే ప్రయాణం.కొంతసేపు ప్రయాణం అయ్యాక, చాలామంది తోటి ప్రయాణీకులను గమనిస్తే కొద్దిసేపు బాగానే ఉన్నప్పటికీ కాలం గడిచేకొద్దీ రెస్ట్ లెస్ గా ఉన్నట్లు కనిపించారు. అయితే సినిమాలు చూడటం, లేదా మ్యూజిక్ వినడం, ఎప్పుడెప్పుడు గమ్యస్థానం వస్తుందా అని విసుగ్గా ఎదురుచూడటం, లేదా వాళ్ళలో వాళ్ళు సోదికబుర్లు మాట్లాడుకోవడం - ఇవే కనిపించాయి.అంతకంటే ఔన్నత్యం ఎవరిలోనూ కనిపించలేదు.

విమానం ఎక్కబోయేముందు హైదరాబాదు ఎయిర్ పోర్టు కు దాదాపుగా 25 మంది నా శిష్యులు వచ్చి మాకు సెండాఫ్ ఇచ్చారు.అంతకు ముందు నాతో చాలామంది స్నేహితులు అభిమానులు అన్నారు - 15 గంటల విమాన ప్రయాణం చాలా బోరు కొడుతుంది.మీరు ఆ సమయంలో ఏం చేస్తారు? అని. నాకు నవ్వొంచ్చింది.

ధ్యానంలో మాస్టరీ ఉన్నవాడికి బోరు అనేది ఉండనే ఉండదు.జనంలో ఉన్నా ఒక్కడే ఉన్నా అతనికి బోరు అనేది అస్సలు అనిపించదు.ధ్యాని కానివాడికే అన్ని అవలక్షణాలూ ఉంటాయి.ధ్యానంలో మంచి పట్టు ఉంటే, అది మనకు ఎన్నో వరాలను ఇస్తుంది.ఇతరులు ఊహించను కూడా ఊహించలేని అనేక Inner advantages అప్పుడు మనకు కలుగుతాయి.Mastery in meditation అనేది జీవితాన్ని ఊహించలేనంత qualitative గా ఎలివేట్ చేస్తుంది.ఈ స్కిల్ లేని మామూలు మనుషులు వారి వారి జీవితాలలో ఎన్నో సున్నితమైన ఆనందాలను కోల్పోతూ ఉంటారు.వారికి తెలిసినవే అసలైన ఆనందాలు అనుకుంటూ భ్రమలో బ్రతుకుతూ ఉంటారు.కానీ వారికి తెలిసినవి చాలా చిన్నవైన స్వల్పమైన చీప్ ఆనందాలు.అసలైన ఆనందం అనేది ఒక ధ్యానికే తెలుస్తుంది.సమయాన్ని సరిగా ఎలా గడపాలనే time management కూడా అతనికి చాలా సహజంగా అలవడుతుంది.

భూమికి చాలా ఎత్తులో ప్రయాణం చేస్తున్నపుడు భూ సంబంధమైన మిగతా ఆలోచనలు మనసుకు రాకపోవడం గమనించాను.ఇది సహజమే.ఎందుకంటే భూమికి దూరం అయ్యేకొద్దీ మనిషికి భౌతికమైన ఆలోచనలు దూరం అవుతాయి.భూమి యొక్క గ్రావిటీ మనమీద తగ్గడమే దీనికి కారణం.ఈ ఎఫెక్ట్ ను సహజంగా రాబట్టుకోవడం కోసమే యోగులు ఋషులు ఎత్తైన కొండ ప్రాంతాలలో నివాసం ఉంటూ ఉంటారు.వారి సాధనా ఫలితంగా వారి దేహాలలో విపరీతమైన వేడి పుడుతూ ఉంటుంది.అందుకే వారికి చల్లని ప్రదేశాలు హాయిగా ఉంటాయి.వేడి ప్రదేశాలలో సాధన చెయ్యడం చాలా కష్టం.ఎందుకంటే ఆ ఎండకు వేడికి ఎనర్జీ లాస్ ఎక్కువగా ఉంటుంది.హిమాలయాలలో అయితే చల్లదనమూ ఉంటుంది భూమికి చాలా ఎత్తుగానూ ఉంటుంది.అక్కడ ఎనర్జీ లాసూ ఉండదు, భూమి మన మనసుల్ని క్రిందకు లాగడమూ ఉండదు.అందుకనే ఋషులు యోగులు చాలా ఎత్తైన హిమాలయాలను ఇష్టపడతారు.ఇందులోని రహస్యం ఇదే.

ఈ 14 గంటల ప్రయాణంలో భూమికి అంత ఎత్తులో వచ్చిన ఎడ్వాంటేజిని ఉపయోగించుకుని విమానంలో ఉన్నంతసేపూ, నేనూ రాజూ సాధ్యమైనంత సేపు ధ్యానంలోనే గడిపాము. పక్కన ఉన్న ప్రయాణీకుల దరిద్రపు వైబ్రేషన్స్ తప్ప మనస్సు చాలా సహజంగా ధ్యానాన్ని అందుకుంది.మిగతా సమయంలో 'The invincible golden staff' అనే ఒక థాయిలాండ్  మార్షల్ ఆర్ట్స్ సినిమా పూర్తిగా చూచాను.

చికాగోలో దిగి కనెక్టింగ్ ఫ్లైట్ కోసం మూడు గంటలు ఎయిర్ పోర్ట్ లో వేచి చూచాము.అక్కడ నుంచి అమెరికన్ ఎయిర్ లైన్స్ చిన్న విమానంలో ఎక్కి నలభై నిముషాల ప్రయాణంతో డెట్రాయిట్ లో దిగాము.

అరబ్స్ అమెరికన్స్ ఈ రెండు జాతులనూ గమనిస్తే - ఇద్దరిలోకీ అరబ్బులే మంచి అందంగా కనిపించారు.వారి ఒంటి రంగు చాలా ప్లెజంట్ గా ఉంటుంది. అమెరికన్స్ ఒంటి రంగు అంత హాయిగా ఉండదు. ఎక్కువ ఎర్రగా ఏదో చర్మరోగం వచ్చినవారిలా కొన్ని దద్దుర్లతో అదోరకమైన ఇబ్బందిగానే ఉంటుంది.బహుశా ఎండ తగలకపోవడం వల్ల అలా జరుగుతూ ఉండవచ్చు. అందుకే వారు స్కిన్ టానింగ్ కోసం అంత తాపత్రయపడుతూ ఉంటారు.

అరబ్బు అబ్బాయిలలాగే, అమ్మాయిలు కూడా బొద్దుగా అందంగా ఉన్నారు. అమెరికా అమ్మాయిలు కూడా బాగానే ఉన్నప్పటికీ అరబ్బులలో ఉన్న కళ వీళ్ళలో కనిపించదు.ఏదో పాలిపోయిన ముఖాలలా కళాకాంతీ లేకుండా కనిపిస్తున్నాయి.మన దేశంలో కాశ్మీరీలలో మళ్ళీ అరబ్బుల పోకడలు కనిపిస్తాయి.వాళ్ళు అక్కడనుంచి దిగుమతి అయినవారేగా?

డెట్రాయిట్ లో దిగేసరికి మధ్యాన్నం 2.30 అయింది.మా అబ్బాయి మాధవ్ ఎయిర్ పోర్ట్ కు వచ్చి రెడీగా ఉన్నాడు.తనతో పాటు ఆనంద్ గారు కూడా వచ్చారు.ఆయన వస్తారని నేను ఊహించలేదు.

'ప్రయాణం బాగా జరిగిందా?' - అంటూ ఇద్దరూ చక్కగా ప్రేమతో రిసీవ్ చేసుకోవటంతో ప్రయాణపు బడలిక క్షణంలో ఎగిరిపోయింది.లగేజి తీసుకుని ఒక గంట కారు ప్రయాణంతో ఇంటికి చేరుకున్నాము.

డెట్రాయిట్ లో నాకు వెంటనే నచ్చిన విషయం రోడ్లమీద మనుషులు కనిపించకపోవడం.మన దేశంలో నేల ఈనినట్లు ఎక్కడ చూచినా మనుషులే కనిపిస్తారు. స్వతహాగా, ఎక్కువ జనసమ్మర్దం ఉంటే నాకు నచ్చదు,జనాలు కన్పించని ఏకాంత ప్రదేశాలు నేను చాలా ఇష్టపడతాను.దానితో అక్కడ వాతావరణం నాకు చాలా బాగా నచ్చేసింది.పైగా చలిచలిగా ఉండి 10 డిగ్రీల టెంపరేచర్ ఉన్నది.ఇది కూడా నాకు బాగా నచ్చేసింది.జాకెట్, స్వెటర్ వేసుకోకుండా ఉత్త టీ షర్ట్ వేసుకుంటేనే హాయిగా అనిపించింది.

అదీగాక ఇక్కడ మనుషులు వారంతట వారే ట్రాఫిక్ రూల్స్ పాటిస్తూ ఉండటం నాకు చాలా నచ్చేసింది.దుమ్ము లేకపోవడం ఇంకా నచ్చేసింది.లిట్టరింగ్ లేకపోవడం ఇంకా బాగా నచ్చేసింది.ప్రకృతిని పాడు చెయ్యకపోవడం ఇంకా చాలా బాగా నచ్చేసింది.

రాజుకు కూడా నా భావాలే కావడంతో అతని పరిస్థితి కూడా అలాగే ఉన్నట్లుగా అనిపించింది.మొత్తం మీద మాకిద్దరికీ అమెరికా వాతావరణం బాగా నచ్చేసింది.We had love at first sight with this country and its vibes.Nature lovers కు ఎవరికైనా ఇలాగే అనిపిస్తుందేమో?

ఆబర్న్ హిల్స్ లో ఉన్న బసకు చేరుకొని సెటిల్ అయ్యాము.నాకేమీ జెట్ లాగ్ అనేది అనిపించనేలేదు.కాసేపు ఉండి ఫ్రెష్ అయ్యాక, అక్కడకు ఒక ముఖ్యమైన పనిమీద అరగంట దూరంలో తీసుకున్న ఇంకొక ఇంటికి వెళ్లి అక్కడి వాతావరణ తరంగాలను క్లీన్ చేసి తిరిగి వచ్చాను.

ఆ ఇంటిని మనకోసం టెంపరరీ ఆశ్రమంగా తీసుకున్నాము.అమెరికాలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే మనవారికోసం,వారితో సమావేశాలకోసం ఈ ఇంటిని కేటాయించాం. అది ఒక లేక్ పక్కనే ఉంది.ఈ ఇంటిలోకి అడుగు పెట్టి గమనిస్తే, అదొక డూప్లెక్స్ టూ బెడ్ రూమ్ హౌస్ గా ఉంది. ఇంటిని చాలా టేస్ట్ తో కళాత్మకంగా కట్టుకున్నాడు ఓనర్. ఇంటిలో చాలావరకూ మంచి వైబ్స్ ఉన్నాయి.కానీ కొన్నికొన్ని గదులలో మాత్రం కొన్ని unwanted vibes ఉన్నాయి. పైన మెట్లమీదనుంచి పై పోర్షన్ లోకి వెళ్ళే తలుపును లాక్ చేసి ఉంచారు.కింద సెల్లార్ లోకి కూడా వెళ్లి చూచాము.చుట్టూ నిర్మానుష్యంగా చల్లచల్లగా చాలా హాయిగా ఉంది.అక్కడ రెండుగంటల పాటు ఉండి ఆ ఇంటి వాతావరణపు ఆరా (unwaned vibes) ను క్లీన్ చేసి మళ్ళీ మా బసకు చేరుకున్నాను.

ఆ విధంగా అమెరికాలో మా మొదటి రోజు గడచింది.

(ఇంకా ఉంది)
read more " మా అమెరికా యాత్ర -1 "

ఏప్రియల్ 2016 - పౌర్ణమి ప్రభావం

19 రాత్రి హైదరాబాద్ లో బయలుదేరి అబూదాబీ,చికాగోల మీదుగా డెట్రాయిట్ చేరుకున్నాము.ఈ ప్రయాణం అంతా పౌర్ణమి నీడలో జరిగింది. అబూదాబీ ఎయిర్ పోర్ట్ లో ఉండగా ఈక్వడార్ లో వచ్చిన భూకంపం గురించి టీవీ న్యూస్ లో చూడడం కాకతాళీయంగా జరిగింది.ఇందులో 570 మంది చనిపోయారు. ఇది పౌర్ణమి ప్రబావమేనని నేనూ రాజూ అనుకున్నాము.

అబూదాబీ నుంచి చికాగో 15 గంటల ఫ్లైట్ ప్రయాణంలో ఉన్నప్పుడు మెడిటరేనియన్ సముద్రంలో ఒక ఓడ మునిగి దాదాపు 500 మంది మునిగిపోయిన వార్తను న్యూస్ లో చూడడం జరిగింది.

మొత్తం మీద పౌర్ణమి ప్రభావం చాలా గట్టిగానే ఉందని మళ్ళీ అనుకున్నాము.

అలాగే బెంగుళూరులో అల్లర్లు జరగడం,తమ కోరిక తీర్చదానికి నిరాకరించిన 250 ఆడవారిని ఇస్లామిక్ తీవ్రవాదులు దారుణంగా తలలు నరికి చంపడం(ఇలాంటి సంఘటనలు చూచాక కూడా ఇస్లాం అంటే శాంతేనని మనం నమ్మాలి!!!) ఇంకా అనేక చెదురుమదురు సంఘటనలు ప్రపంచవ్యాప్తంగా అనేకం జరుగుతున్నాయి.

ఇవన్నీ ఈ పౌర్ణమి ప్రభావాలే. గమనించండి.
read more " ఏప్రియల్ 2016 - పౌర్ణమి ప్రభావం "

16, ఏప్రిల్ 2016, శనివారం

తేనె తుట్టెను కదిలించు

తేనె తుట్టెను కదిలిస్తేనే తేనె దొరుకుతుంది.దానిని ఎలా కదిలించాలో మనకు తెలియాలి. తుట్టె పక్కన కూచుని నేలమీద దుమ్ము రేపుతుంటే మనకు దుమ్మే మిగులుతుంది. దానిని కదిలిస్తే మాత్రం తేనె దొరుకుతుంది.

చాలామంది నన్ను ఎన్నో అడుగుతూ ఉంటారు.ఎవరి ప్రశ్నను బట్టి ఎవరి టాపిక్ ను బట్టి వారికి ఆయా స్థాయులలో జవాబులు వస్తూ ఉంటాయి. ఎవరికి తోచిన విషయాలతో వాళ్ళు నన్ను కదిలిస్తూ ఉంటారు. సంభాషణలు నడుస్తూ ఉంటాయి.వాళ్ళతో విసుక్కోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటాను.కానీ నా మనస్సుకు నచ్చిన స్థాయిలో మాట్లాడేవాళ్ళు మాత్రం అతి కొద్దిమంది మాత్రమే ఉంటారు.అలాంటి వారిలో చరణ్ ఒకడని చెప్పనవసరం లేదుగా?

నిన్న చరణ్ వచ్చాడు.తనొచ్చిన పని గురించి మాట్లాడిన తర్వాత అసలు మాటలు మొదలయ్యాయి.

'అమెరికా ప్రోగ్రాం ఏమిటి అన్నగారు?' అడిగాడు చరణ్.

'అంతా ఫిక్స్ అయింది చరణ్.మే ఆరో తేదీన డెట్రాయిట్ పరాశక్తి టెంపుల్ లో 'శ్రీవిద్య' గురించి మాట్లాడబోతున్నాను.ఇది చాలా శక్తివంతమైన క్షేత్రం. అమ్మ అనుగ్రహంతోనే ఇది సాధ్యమౌతోంది.తను ఇచ్చిన శక్తితో తనగురించి చెప్పబోతున్నాను.' అన్నాను.

'అవునన్నగారు - "నువ్వు కోరితే కోరినది మాత్రమె ఇస్తాను. ఏదీ కోరకపోతే నీకు అవసరమైనది ఇస్తాను" - అని అమ్మ అన్నారు కదా.అది అక్షరాలా నిజం - అంటూ గోడకు ఉన్న జిల్లెళ్ళమూడి అమ్మ ఫోటో వంక చూచాడు చరణ్.

'అవును తమ్ముడూ మనకు ఎప్పుడేది అవసరమో అమ్మకు తెలిసినంతగా మనకు కూడా తెలియదు.ప్రస్తుతం ఈ విధంగా నాచేత చేయిస్తున్నది.తన అనుగ్రహం కాకుంటే ఎక్కడ డెట్రాయిట్ పరాశక్తి టెంపుల్?ఎక్కడ గుంటూరు? అక్కడ "శ్రీవిద్యాతంత్రం" గురించి నేను మాట్లాడటం ఏమిటి?అమ్మ అనుగ్రహం కాకుంటే ఇది మరేమిటి?' అన్నాను.

అవునన్నట్లు తలాడించాడు చరణ్.

'రికార్డ్ చెయ్యండి అన్నగారు.మేమందరం కూడా వినాలి మీ స్పీచ్,' అన్నాడు.

'అలాగే చేయిస్తాలే' -  అన్నాను.

'ఆ తర్వాత ఏమిటి ప్రోగ్రాం?' అడిగాడు.

'మే 13 నుంచి 16 వరకూ అక్కడ దగ్గరలోనే ఉన్న 'గాంగెస్' రామకృష్ణా ఆశ్రమంలో స్పిరిచ్యువల్ రిట్రీట్ చేస్తున్నాము. మనవాళ్ళంతా అక్కడకు వస్తున్నారు. ఆ నాలుగు రోజులూ అక్కడే మనతో ఉంటారు.నాలుగు రోజులూ పూర్తిగా ఆధ్యాత్మిక వ్యాసంగాలలో జరపాలని ప్లాన్ చేస్తున్నాము.' అన్నాను.

'గాంగెస్' అంటే ఎక్కడుంది అన్నగారు?' అడిగాడు చరణ్.

'అది డెట్రాయిట్ కు దాదాపు మూడు గంటల డ్రైవ్ దూరంలో ఉన్నది.అక్కడొక విశాలమైన మంచినీటి సరస్సు ఉంది. వివేకానంద స్వామి అమెరికాకు వెళ్ళినపుడు అక్కడకు వెళ్ళారు.ఈ మంచినీటి సరస్సు దగ్గరే స్వామికి మళ్ళీ నిర్వికల్ప సమాధి స్థితి కలిగింది.ఆ సరస్సును చూచిన స్వామి, దానికి 'గాంగెస్' అని నామకరణం చేశారు.భవిష్యత్తులో ఇది 'వారణాసి' అంత పుణ్యక్షేత్రం అవుతుంది అని అన్నారట.

ఆయన పాదాలు సోకిన మహత్యమేమో గాని, ఇప్పుడక్కడ ఒక ఆశ్రమం వచ్చింది. గౌరీ మా, స్వామి ఆత్మలోకానంద అనే ఇద్దరు అమెరికన్స్ అక్కడ ఆశ్రమాన్ని స్థాపించి సాధుజీవితాన్ని గడుపుతున్నారు.వారిలో గౌరీమా చాలా అద్భుతమైన వ్యక్తిత్వం కలిగిన స్త్రీ.పాశ్చాత్యురాలు అయి ఉండి కూడా శ్రీ రామకృష్ణ భక్తురాలై సన్యాసం స్వీకరించింది.అమెరికాలో చైల్డ్ ప్రాస్టిస్త్యూషన్ చేయిస్తున్న మాఫియాతో ప్రాణాలకు తెగించి పోరాడి అనేకమంది బాలబాలికలను ఆ నరకం నుంచి విముక్తుల్ని గావించింది. ఇంకా ఆ మాఫియాతో ఇప్పటికీ ఫైట్ చేస్తూనే ఉన్నది.అంత గొప్ప వ్యక్తిత్వం ఆమెది.

అసలా ఆశ్రమ పునాదులే అత్యద్భుతమైనవి. శ్రీ రామకృష్ణుల చితాభస్మం, శారదామాత చితాభస్మం, గౌరీమా(శ్రీ రామకృష్ణుల శిష్యురాలు) చితాభస్మాలను ఫౌండేషన్ లో ఉంచి ఆ ఆశ్రమం కట్టారు.ఇక అక్కడ అద్భుతమైన ఆధ్యాత్మిక తరంగాలు ఉండక ఏం చేస్తాయి? ప్రస్తుతం ఈ ప్రదేశాన్ని 'వారణాశి ఆఫ్ ది వెస్ట్' అంటున్నారు.అన్ని మతాలవాళ్ళూ అన్ని దేశాలవాళ్ళూ అక్కడకు వచ్చి శ్రీరామకృష్ణుల పాదాలను పూజిస్తున్నారు.' అన్నాను.

(ఆశ్రమం వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు)
http://www.motherstrust.org

వింటున్న చరణ్ నిర్ఘాంత పోయాడు - 'ఎంత గొప్ప విషయం అన్నగారు?' అన్నాడు.

'అవును చరణ్.అలాంటి చోట మనం రిట్రీట్ చెయ్యబోతున్నాం.ఈ రిట్రీట్ సందర్భంగా అక్కడ మనవాళ్ళకు దీక్ష ఇవ్వబోతున్నాను.ఇది కూడా అమ్మ అనుగ్రహమేగా?అసలు మనకేం అర్హత ఉంది చరణ్? అయినా సరే, అమ్మ మనచేత ఇవన్నీ చేయిస్తున్నది చూడు.' అన్నాను.

'ఒకసారి ఎవరో ఇలాగే అర్హతల గురించి మాట్లాడుతుంటే, అమ్మ విని - 'అర్హత చూచేది, ఇచ్చేది,మీరు కాదురా. నేను. ఎవరి అర్హత ఏమిటో నాకు బాగా తెలుసు.ఎవరికి ఏమివ్వాలో కూడా నాకు బాగా తెలుసు. ' అని అన్నది అన్నగారు" అన్నాడు చరణ్.

నాకు కళ్ళలో నీళ్ళు వచ్చేశాయి.తమాయించుకుంటూ చాలాసేపు మౌనంగా ఉన్నాను.

'అవును చరణ్. మహనీయులు అంతరంగాన్నే చూస్తారు.అది స్వచ్చంగా ఉంటే వారు తప్పకుండా దగ్గరకు తీసుకుంటారు. నాకు ఒక సంఘటన గుర్తుకు వస్తున్నది.స్వామి తురీయానంద గారి జీవితంలో చరమదశలో ఇది జరిగింది. ఒకసారి ఒక భక్తుడు ఆయన దగ్గరకు వచ్చి ఇలా అన్నాడు.

'స్వామీ నేను చాలా ఘోరమైన తప్పు చేశాను.చెప్పలేను.మీకు ముఖం కూడా చూపించలేను.మీ పాదాలు పట్టుకోడానికి కూడా నాకు అర్హత లేదు.నేను పతనం అయిపోయాను. పడిపోయాను. నన్ను క్షమించండి' అని ఏడ్చాడు.

తన చివరి రోజులలో,దయకు కరుణకు సాక్షాత్తూ ప్రతిరూపంలా స్వామి ఉండేవారు.శ్రీరామకృష్ణుల కరుణాస్వరూపం ఆయనలో ప్రత్యక్షంగా కనిపించేది.

'నువ్వేం తప్పు చేశావు?' అని కనీసం ఒక్కమాట కూడా స్వామి అతన్ని అడగలేదు.

చాలా సేపు మౌనంగా ఉన్న స్వామి చివరకు ఆ భక్తుడిని దగ్గరకు తీసుకుని ఇలా అన్నారు.

'ఎక్కడకు పడతావు? ఎక్కడకు పడగలవు? నువ్వు అమ్మ ఒడిలోనే పడ్డావు.ఆ ఒడిని దాటి బయటకు ఎలా పోగలవు?ఎక్కడకు పోగలవు?' అన్నారాయన.

అంతకు మించి ఇంకేమీ అనలేదు.

ఎంత అద్భుతమైన క్షమాగుణమో చూడు !! ఎంత అద్భుతమైన దయాస్వభావమో చూడు !! కనుకనే వారు శ్రీరామకృష్ణుల ప్రత్యక్ష శిష్యులైనారు.ఆయన అనుగ్రహపాత్రులైనారు.ఆయన స్పర్శను పొందే అదృష్టానికి నోచుకోగలిగారు.

ప్రపంచమంతా అమ్మయొక్క శక్తివిలాసమే అయినప్పుడు ఇంక మనం దానిని దాటి ఎక్కడకు పోగలం?మనమేం చేసినా అందులో చెయ్యవలసిందే.ఎన్ని ఆటలు ఆడినా ఆ ఒడిలో ఆడుకోవలసిందే.

అమ్మ కూడా ఇదే అనేవారు.'అందరూ ఈ ఒడిలోనే ఉన్నార్రా. ఈ ఒడి దాటి ఎవరూ లేరు.' అని అమ్మ తరచూ అనేవారు.అదే నిజం కాకుంటే నేనేంటి? ఈ పనులు నాద్వారా జరగడమేంటి?ఈ రకంగా అమ్మ మనల్ని అనుక్షణం చూస్తున్నదని మళ్ళీ మళ్ళీ రుజువు అవుతూనే ఉన్నది.' -  అన్నాను.

'అవునన్నగారు అది నిజం.నాకూ ఇది ఎన్నో సార్లు అనుభవం అయింది.అయితే అమెరికాకు వెళ్ళినా మన ఆధ్యాత్మికతనే అక్కడకు తీసుకెళుతున్నారన్న మాట.' అన్నాడు చరణ్.

'అంతేకదా చరణ్? ఎక్కడకు పోయినా మనమేదో అదే మనతో ఉంటుంది.కొత్తది ఎలా వస్తుంది?' అన్నాను.

వాతావరణం ఆధ్యాత్మిక స్పందనలతో చాలా భారంగా తయారైంది.ఇద్దరమూ మౌనంగా ఉండిపోయాము.ఎవ్వరమూ చాలాసేపు మాట్లాడలేదు.

తేరుకున్న చరణ్ లేచి ' వస్తానన్నగారు.హ్యాపీ జర్నీ.అక్కడకు వెళ్ళాక మాట్లాడండి.మనవాళ్ళందరినీ అడిగానని చెప్పండి. ముఖ్యంగా పద్మజక్కయ్యగారికి నా నమస్కారాలు తెలియ జేయండి.' అన్నాడు.

'అలాగే చరణ్.తప్పకుండా చెబుతాను.' అన్నాను.

చరణ్ శలవు తీసుకుని వెళ్ళిపోయాడు.

నేను, అతను వెళ్ళినవైపు చూస్తూ ఉండిపోయాను.
read more " తేనె తుట్టెను కదిలించు "

15, ఏప్రిల్ 2016, శుక్రవారం

రామా మా మధ్యకు రాకు...

రామా మా మధ్యకు రాకు
నవ్వులాటకు గురికాకు
నీ అయోధ్య ఇప్పుడిక్కడ లేదు
ఏ సయోధ్యా నీకిక్కడ దొరకదు

ఒకవేళ నామాట వినకుండా
ప్రేమా దోమా అంటూ
మా మధ్యకు వచ్చావో
తీవ్రమైన ఆశాభంగం చెందుతావు

ఎందుకంటే ప్రస్తుతం ఇక్కడ
నిన్నెవరూ గుర్తించరు
ఒకవేళ గుర్తించినా
గౌరవించరు

ఎందుకంటే ఇప్పటికే జనం
నిన్ను బాగా వాడేసుకున్నారు
ఇక నీ అవసరం మనుషులకు
ఎంతమాత్రమూ లేదు

అప్పుడు పిచ్చికాలం గనుక
అది రామరాజ్యం గనుక
కిడ్నాపైన సీత తిరిగి దొరికింది
ఇప్పుడైతే ఆమె అడ్రసు కూడా దొరకదు

ఒకప్పుడు సీతను 
రాక్షసులు కిడ్నాప్ చేశారు
ఇప్పుడు నిన్ను
మనుషులే కిడ్నాప్ చేస్తారు

ఒకప్పుడు కోతులు
నీకు సాయం చేశాయి
ఇప్పుడు మనుషులే
నిన్ను కోతిని చేసి ఆడిస్తారు

ముందు నీ నగలు కాజేసి
అమ్ముకుంటారు
ఆ తర్వాత నిన్నే ఎవరికో
బానిసగా అమ్మేస్తారు

నీకు తెలిసిన దండకారణ్యం
నీ రాజ్యంలో కొంత భాగమే
ఇప్పుడు భూమి నిండుగా
ఎక్కడ చూచినా అదే

ఒకప్పుడు రాక్షసులు
అడవిలోనే ఉండేవారు
ఇప్పుడు ప్రతి ఇంట్లోనూ
ఎంతోమంది ఉన్నారు

ఇప్పుడు ఇంటికొక రావణుడు
ఇంటికొక శూర్పణఖ
సందుకొక మారీచుడు
గొందికొక సుబాహుడు ఉన్నారు

ఎంతమందితో నీవు పోరాడగలవు?
ఎంతమందితో నీవు వేగగలవు?
ప్రస్తుతం వారి శక్తి ముందు
నీ శక్తి ఏమాత్రమూ చాలదు

పైగా వాళ్ళే నీకు గుళ్ళు కట్టి
పూజలు చేస్తున్నారు
ఉత్సవాలూ కల్యాణాలూ
అట్టహాసంగా చేస్తున్నారు

అసలు నీవారెవరో
రాక్షసులెవరో
ఈ ప్రపంచంలో నీవే
ఇప్పుడు గుర్తించలేవు

నీ వేషం వేసి లాభపడేవారే గాని
నీలా బ్రతికే వారు ఎవ్వరూ లేరు
నీ బొమ్మ పెట్టి బ్రతికేవారే గాని
నిన్ను నమ్మినవారు ఎక్కడా లేరు

పందిళ్ళు వేసి మైకులు పెట్టి 
చేతులు దులుపుకోవడమే గాని
నిజంగా నీ పండుగ చేసేవారు
ఒక్కరూ లేరు

నీ నామంతో పానకం త్రాగి
సేదదీరేవారే గాని
నీ ధ్యానంతో పూనకం తెచ్చుకునేవారు
ఎవ్వరూ లేరు

ఎందుకు నీకు అనవసర శ్రమ?
నీలోకంలో నువ్వు హాయిగా ఉండు
ఎవరి ఖర్మే వారిని అంతం చేస్తుంది
ప్రస్తుతం నీవు రానవసరం లేదు
నీ అవసరం మాకెంత మాత్రమూ లేదు

అందుకే

రామా మా మధ్యకు రాకు
నవ్వులాటకు గురికాకు
నీ అయోధ్య ఇప్పుడిక్కడ లేదు
ఏ సయోధ్యా నీకిక్కడ దొరకదు
read more " రామా మా మధ్యకు రాకు... "

12, ఏప్రిల్ 2016, మంగళవారం

ఈ హృదయం...

















ఎన్నో కట్టుబాట్లను
దాటిందీ హృదయం
ఎన్నో కత్తిపోట్లను
సైచిందీ హృదయం

ఎన్నో శిలువలు
మోసిందీ హృదయం
ఎన్నో విలువలు
పూచిందీ హృదయం

ఎన్నో జన్మలు
వేచిందీ హృదయం
ఎన్నో మనసులు
దోచిందీ హృదయం

ఎన్నో మలుపులు
చూచిందీ హృదయం
ఎన్నో తలుపులు
తెరిచిందీ హృదయం

ఎన్నో వలువలు
విడచినదీ హృదయం
ఎన్నో కలువలు
తలచినదీ హృదయం

ఎంతో స్నేహం
నేర్చిందీ హృదయం
ఎంతో మోహం
పేర్చిందీ హృదయం

ఎంతో ఓర్పుకు
నిలయమీ హృదయం
ఎన్నో తీర్పుల
వలయమీ హృదయం

ఎన్నో మార్పులు
తట్టుకుందీ హృదయం
ఎన్నో కూర్పులు
పట్టుకుందీ హృదయం

ఎన్నో ముంగిళ్ళలో
కృంగిందీ హృదయం
ఎన్నో ఎక్కిళ్ళను
మ్రింగిందీ హృదయం

ఎన్నో శిశిరాలలో 
పాలు మాలిందీ హృదయం
ఎన్నో శిబిరాలలో
కాలు మోపిందీ హృదయం

ఎన్నో వసంతాల
వన్నె ఈ హృదయం
ఎన్నో సుగంధాల
దిన్నె ఈ హృదయం

శ్రామిక నేస్తం
ఈ హృదయం
ప్రేమకు బానిస
ఈ హృదయం

కల్లను ఎరుగదు
ఈ హృదయం
ఎల్లలు లేనిది
ఈ హృదయం

కుసుమ కోమలం
ఈ హృదయం
పరమ పావనం
ఈ హృదయం

ఈ హృదయం
ప్రేమమయం
ఈ హృదయం
దైవమయం...
read more " ఈ హృదయం... "

11, ఏప్రిల్ 2016, సోమవారం

లయనాద సుయోగం...

విన్యాసం అంతమైతే
సన్యాసం సొంతమౌతుంది
విడ్డూరం విసుగు పుడితే
వడ్డాణం వదలి పోతుంది

ఆకాశం అడుగు పెడితే
అమరత్వం ఆక్రమిస్తుంది
అవరోధపు అడ్డు తెగితే
ఆహ్లాదం ఆశ్రయిస్తుంది

అనురాగం అంజలిస్తే
ఆనందపు అవధి తెగుతుంది
అహమన్నది ఆవిరైతే
అలుపన్నది అంతమౌతుంది

ఆమోదపు తలుపు తెరిస్తే
అనుభూతే అల్లుకుంటుంది
ప్రేమోదయ కాంతి విరిస్తే
అనుదినమూ వెన్నెలౌతుంది

ఆనందపు జల్లు కురిస్తే
అణువణువూ పల్లవిస్తుంది
అలుపెరుగని ఈ పయనం
అమరత్వపు అంచునిస్తుంది

మెచ్చిన నెచ్చెలి స్నేహం
మదివీణను పలికిస్తుంది
ఎన్నడు ముగియని రాగం
ఎదలోతుల వినవస్తుంది

హృదయపు లోతుల ఎగసే
నవజీవన వేదం
మదితలుపుల మాటున మెరసే
అతి కోమల నాదం

మెలమెల్లని సడులను రేపే
ప్రియపాద పరాగం
పసి మనసును గుడిగా చేసే
లయనాద సుయోగం...
read more " లయనాద సుయోగం... "

చెండుతున్న మండువేసవి

చెండుతున్న మండు వేసవి
ఎంతో ఆహ్లాదంగా ఉంది
ఎండుతున్న కృష్ణానది లాగే
నా తృష్ణానది కూడా...

ఈడ్చి కొడుతున్న గాడ్పు
పూడ్చి పెట్టిన వాసనల్ని
పుచ్చె పగలగొడుతోంది
నా మనసు గది కూడా...

పురుగులేని వీధి
పులకింతలు రేపుతోంది
శూన్యపు వసారాలాంటి
నా ఎద కూడా...

మంటల్లో కాలుతున్న గుడిసె
మనోహరంగా ఉంది
భస్మపు కాసారం లాంటి
నా మది కూడా...

బీటలు చీలుతున్న నేల
మహోల్లాసంగా ఉంది
ఇక ఏమాత్రం మెత్తబడని
నా హృది కూడా...

నిప్పులు చెరుగుతున్న ఎండ
మహోజ్జ్వలంగా ఉంది
మదిలో కళ్ళు తెరిచిన
మహాజ్ఞానం కూడా...

వడగాడ్పులు తీసే ప్రాణాలు
ఎక్కడో లయమౌతున్నాయి
వింతగా ఎగసే 
నా ధ్యానాలు కూడా...

గతిలేక దాక్కున్న ప్రజలు
బిక్కు బిక్కుమంటున్నారు
మతిలేని ఈ లోకంలో
నేను కూడా....
read more " చెండుతున్న మండువేసవి "

వరుస ప్రమాదాలు - అమావాస్య ప్రభావం

గ్రహస్థితులు బాగాలేనప్పుడు అమావాస్య పౌర్ణమి పరిధులలో భయంకర ప్రమాదాలు జరుగుతాయని నేను గతంలో లెక్కలేనన్ని సార్లు వ్రాశాను. ఉదాహరణలతో స్టాటిస్టికల్ గా నిరూపించాను కూడా.ఈ సూత్రం మళ్ళీ నిన్న రుజువైంది.

మీకు గుర్తుందో లేదో? ఏడాదిన్నర క్రితం నేను రోహిణీ శకట భేదనం గురించి వ్రాస్తూ - శనీశ్వరుడు వృశ్చికరాశిలోకి వచ్చినపుడు ప్రపంచవ్యాప్తంగా రకరకాలైన ఘోరాలు ప్రమాదాలు జరుగుతాయని వ్రాశాను.ప్రస్తుతం అదే గ్రహస్థితి నడుస్తున్నది.అవే ఘోరాలు జరుగుతున్నాయి. గమనించండి. జ్యోతిశ్శాస్త్రం ఎంత సత్యమైనదో అర్ధమౌతుంది.

మొన్న రాత్రి+నిన్న రోజంతా - అమావాస్యకు సరిగ్గా మూడవరోజు.అంటే అమావాస్య పరిధిలోనే ఉన్నది. వృశ్చికరాశిలో శనీశ్వరుడు కుజుడు కలసి ఉన్నారు.ఈ యోగం ఘోరమైన ప్రమాదాలకు యాక్సిడెంట్లకూ సూచిక అని కూడా ఎన్నో సార్లు గతంలో నేను చెప్పి ఉన్నాను.

మొన్న శనివారం రాత్రినుంచీ నిన్న ఆదివారం సాయంత్రం లోపు జరిగిన ప్రమాదాలు చూస్తే నేను చెబుతున్న జ్యోతిష్య సూత్రాలు పచ్చి వాస్తవాలే అన్నది స్పష్టంగా రుజువౌతున్నది.

కేరళలో ఘోర అగ్నిప్రమాదం
కేరళలోని కొల్లం జిల్లాలో పరపూర్ గ్రామంలోని పట్టింగల్ శక్తి ఆలయ ప్రాంగణంలో ఘోర అగ్నిప్రమాదం జరిగి మందుగుండు సామగ్రి పేలి కనీసం నూట యాభై మంది చనిపోయారు.నాలుగు వందలమంది గాయపడ్డారు.ఈ ప్రమాదంలో కూడా Initial spark చిన్నదే.కానీ అదే పెద్ద ప్రమాదానికి కారణం అయింది.ఇదీ కర్మ ప్రభావమే.

నాలుగు దేశాలలో భూకంపాలు
ఆఫ్ఘనిస్తాన్ లో నిన్న వచ్చిన భూకంపం నాలుగు దేశాలను వణికించింది.అవి ఆఫ్ఘనిస్తాన్,పాకిస్తాన్,ఇండియా,చైనా.ఉత్తరభారతంలో ప్రజలు ఇళ్ళు వదలిపెట్టి బయటకు పరుగులు తీశారు.అనేక లక్షలమంది భయభ్రాంతులయ్యారు.

వరుస రోడ్డు ప్రమాదాలు
నిన్న లెక్కలేనన్ని రోడ్డు ప్రమాదాలు జరిగాయి.ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు.గాయాల పాలయ్యారు.Final Destination అనే సినిమాలో జరిగినట్లు ఒక చిన్న తప్పు వల్ల అనేక పెద్ద తప్పులు ఒక చెయిన్ రియాక్షన్ లాగా జరిగాయి.చివరకు ఎంతోమంది ప్రాణాలను బలిగొన్నాయి.ఇదంతా కర్మప్రభావమే. 

ఇవన్నీ ఖచ్చితంగా అమావాస్య పరిధిలోనే జరిగాయి.

ఇవిగాక ముస్లిం ఉగ్రవాదం పెచ్చుమీరుతుందనీ, దానివల్ల దేశాలమధ్యన యుద్ధ వాతావరణం వస్తుందనీ కూడా వ్రాశాను.ప్రస్తుతం ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదులతో జరుగుతున్న కొన్ని దేశాల యుద్ధం అదికాక మరేమిటి?

అయితే - ముందే అన్నీ తెలుసుకొని నివారణ చెయ్యవచ్చు కదా అనేది అజ్ఞానులు వేసే అజ్ఞానప్రశ్న.సామూహిక కర్మను తప్పించలేము. తప్పించకూడదు కూడా.కారణం ఏమంటే - అసలెందుకు తప్పించాలి? ఎవర్ని రక్షించడం కోసం చెయ్యాలి? మంచి చెబితే వినేవారు ఇప్పుడెవరున్నారు?ఎవరూ లేరు.అందరూ స్వార్ధపరులే,అందరూ అవినీతిపరులే,అందరూ అవకాశవాదులే.అందరూ దొంగలే.

కనుక వారి ఖర్మ వారిని అలా వెంటాడటమే కరెక్ట్.వాళ్ళు అలా చావడమే కరెక్ట్.కనుక ఈ ఖర్మను తప్పించాలని దైవజ్ఞులు ప్రయత్నించకూడదు.ఎవరైతే వారివారి వ్యక్తిగత కర్మను పోగొట్టుకోవాలని చూస్తారో,అలాంటి వారి నిజాయితీని గమనించి వారికి మాత్రమే సాయం చెయ్యాలి.అంతేగాని లోకకర్మలో సామూహిక కర్మలో ఎన్నడూ మనం జోక్యం చేసుకోకూడదు.

అందుకనే - లోకకల్యాణం కోసం హోమాలు యజ్ఞయాగాలు చేసేవారిని చూస్తే నాకు చచ్చే నవ్వొస్తుంది.వాళ్ళది వాళ్ళు కడుక్కుంటే చాలు లోకులది కడగక్కర్లేదు.అలా కడగడం వాళ్ళ వల్ల కాదు కూడా. 

"ఎవరు చేసిన ఖర్మ వారనుభవించకా ఎవరికైనా తప్పదన్నా
అలనాడు శూర్పణఖ ముక్కుచెవులూ పోయి అడవిలో పడి ఏడ్చెనన్నా"

"చేసేటప్పుడు నవ్వుతూ చేస్తారు.పడేటప్పుడు ఏడుస్తూ పడతారు"-- అనేది చాలా పాత సామెత.అది అక్షరాలా నిజం. 

ఎవరి ఖర్మను వారు అనుభవిస్తారు.మనకనవసరం.ఏది జరిగినా స్థితప్రజ్ఞతతో నవ్వుతూ శ్రీకృష్ణభగవానుడిలా చూస్తూ ఉండటమే మన చెయ్యవలసిన అసలైన పని.ఆయన కళ్ళముందే ముసలం పుట్టి తనవాళ్ళంతా తప్పత్రాగి ఒకరినొకరు కొట్టుకుని చస్తూ ఉంటే ఆయన ఏమాత్రం చలించకుండా నవ్వుతూ చూస్తూ నిలుచోలా? ఇదీ అంతే.

నడుస్తున్న మనుషులు నడుస్తున్నవారే పిట్టల్లా రాలిపోయే రోజులొస్తాయి అని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో అయిదువందల సంవత్సరాల క్రితమే చెప్పారు.అప్పట్లోనే పెరుగుతున్న అధర్మాన్ని చూచే ఆయన ఆ మాటను వ్రాశారు.అది జరిగే రోజు కూడా దగ్గరలోనే ఉన్నది.ధర్మాచరణ తీవ్రస్థాయిలో లోపించడమే ఈ విలయాలకు కారణం.అందరూ ధర్మాన్ని పాటించండి పాటించండి అని చెప్పేవారే గాని ఆచరించేవారు ఎక్కడా కనపడటం లేదు.కనీసం అలా చెబుతున్నవారు కూడా పాటించడం లేదు.అందుకే ఇలాంటి విలయాలు జరుగుతున్నాయి. ముందు ముందు ఇంకా తీవ్రస్థాయిలో జరుగుతాయి కూడా.

ప్రజలలో పాలకులలో ఎవరిలో కూడా నీతీ నిజాయితీ ధర్మాచరణా లేనప్పుడు ఇలా జరగక ఇంకెలా జరుగుతుంది? ఇలా జరగడమే కరెక్ట్.

జ్యోతిశ్శాస్త్రం ఎంత గొప్ప విజ్ఞానమో అని చెప్పడానికి ఇంకా ఇంకా వేరే రుజువులు ఏం కావాలి?
read more " వరుస ప్రమాదాలు - అమావాస్య ప్రభావం "

10, ఏప్రిల్ 2016, ఆదివారం

ఈరోజు ఒక మహనీయుని జన్మదినం

ఏప్రియల్ 10 డాక్టర్ శామ్యూల్ హన్నేమాన్ జన్మదినం. నేటికి ఆయన పుట్టి 261 సంవత్సరాలు గడిచాయి. హోమియోపతి సిద్ధాంతాన్ని కనిపెట్టడమే గాక దాదాపు 100 నూతన ఔషధాలను ప్రపంచానికి ఇచ్చిన మహనీయుడాయన.

సరిగ్గా చెప్పాలంటే ఆయన కనుక్కున్న ఆవిష్కరణలకు పది నోబుల్ ప్రైజులు ఇచ్చినా తక్కువే అవుతుంది.

ప్రపంచానికి నిజమైన మేలును చేసిన ఒక పదిమంది పేర్లను చెప్పమంటే వారిలో హన్నేమాన్ పేరును నేను చెబుతాను.ఒక అయిదుగురి పేర్లను చెప్పమన్నా కూడా వాటిలో ఆయన పేరును చెబుతాను.

కానీ ఖర్మేంటంటే ఈ లోకం ఈనాటికీ హోమియో వైద్యవిధానాన్ని నమ్మడం లేదు.ఈ లోకం సైతాన్(మాయ) గుప్పిట్లోనే ఉన్నదనీ అది దైవపు అదుపులో లేదనీ చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నైనా ఇవ్వవచ్చు.

నిర్మొహమాటంగా చెప్పాలంటే హోమియో వైద్య విధానం ఒక్కటే అసలైన వైద్య విధానం అని నేను విశ్వసిస్తాను.నేను ఇంగ్లీషు వైద్యాన్ని నమ్మను.నా దృష్టిలో అదొక వైద్యమే కాదు.ఎంతో పరిశీలన మీదా వ్యక్తిగత అనుభవం మీదా నేనీ నిశ్చయానికి వచ్చాను.

ఎన్నో ఎక్యూట్ కేసుల్లోనూ క్రానిక్ కేసుల్లోనూ ఇంగ్లీషు వైద్యం కంటే హోమియో వైద్యం అత్యంత అద్భుతంగా పనిచెయ్యడం నేను ప్రత్యక్షంగా చూచాను.

మరి అది అంత గొప్పదైతే దానికి లోకంలో పేరు ఎందుకు రాలేదు? అని మీకు అనుమానం రావచ్చు.దానికి నా సమాధానం ఒక్కటే.

లోకంలో పేరు ప్రఖ్యాతులు వచ్చినంత మాత్రాన అది నిజమైనది కావాలని ఎక్కడా లేదు.చాలావరకూ లోకంలో గొప్పపేరు వచ్చినవన్నీ మాయసరుకులే అయి ఉంటాయి.నిజమైన అసలైన విషయాలు శాస్త్రాలు లోకంలో ఎప్పుడూ మైనారిటీలే.కారణం ఏమంటే లోకం మొత్తం మాయ యొక్క గుప్పిట్లో ఉన్నది.అది సత్యపు నీడలో లేదు.సైతాన్ నీడలోనే ప్రపంచం మొత్తం బ్రతుకుతున్నది.ఇది నా దృఢవిశ్వాసం.

అంతేకాదు.స్వార్ధంతో అవినీతితో బ్రతికేవాళ్ళు హోమియోపతిని వాడటానికి ఖచ్చితంగా ఇష్టపడరు.వారు ఆ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రులకు పోవాల్సిందే.లక్షలు చెల్లించుకోవాల్సిందే,అయినా సరే సరియైన వైద్యం దొరక్క అల్లాడాల్సిందే.కెమికల్ డ్రగ్స్ వాడి ఒళ్ళు గుల్ల చేసుకోవాల్సిందే. మోసపోవాల్సిందే.వారి ఖర్మే వారిని అలా నడిపిస్తుంది.స్వచ్చమైన బ్రతుకులు బ్రతకందే వారు ఎన్నటికీ హోమియోపతి వంటి సత్యశాస్త్రాల ప్రయోజనాలను పొందలేరు గాక పొందలేరు.

ఇంకో అసలైన విషయం ఇప్పుడు చెబుతాను.మనుషుల రోగాలనూ ఆరోగ్యాలనూ నిర్ణయిస్తున్నది ఎవరో తెలుసా? బడా బడా ఫార్మా కంపెనీలు ఆ విషయాన్ని నిర్ణయిస్తాయి.మీరేం మందులు వాడాలో అవే నిర్ణయిస్తాయి. మీకు ఆ చాయిస్ లేదు.అంతేకాదు.హోమియోపతి వంటి విధానాలు బూటకాలని ఈ కంపెనీలే ఏజెంట్లను పెట్టి మరీ ప్రచారం చేస్తాయి.డబ్బులిచ్చి ప్రభుత్వాలను కొని ఆయా దేశాలలో హోమియోపతిని బ్యాన్ చేయిస్తాయి.రాజకీయ పార్టీలకు లంచాలిచ్చి మరీ హోమియోపతి మీద విషప్రచారం చేయిస్తాయి. ఈ ప్రచారం నిజమని మిమ్మల్ని నమ్మిస్తాయి.ఇదీ మీ ఖర్మే.

లోకాన్ని సృష్టించిన దేవుడిని అదేలోకం నుంచి సైతాన్ తరిమేసినట్లే, ఈలోకం నుంచి సత్యాన్ని కూడా అసత్యం తరిమేసింది.అందుకే హోమియోపతిని ఎవరూ నమ్మడం లేదు.అది ప్రజల చెడుఖర్మ తప్ప ఇంకేమీ కాదు.

ఏ వేదకాలపు మహర్షో ఇలా జెర్మనీలో శామ్యూల్ హన్నేమాన్ గా జన్మించాడని నా నమ్మకం.ఆయన వల్ల ఈ 261 ఏళ్ళలో ఎన్ని లక్షలమంది రోగాల నుంచి పరిపూర్ణంగా విముక్తులైనారో ఆలోచిస్తే ఆయనది ఎంత గొప్ప జన్మో అర్ధమౌతుంది.

అసలైన బ్రతుకులంటే అవి.అంతేగాని పొద్దున్న లేచిన దగ్గరనుంచీ మోసంతో నటనతో స్వార్ధంతో కృత్రిమంగా జంతువుల్లా బ్రతికే బ్రతుకులు ఆ పేరుకు అసలు తగవని నా విశ్వాసం.

ఆయన జన్మదినం రోజున ఆ మహనీయునికి నా నమోవాకాలు అర్పిస్తున్నాను.
read more " ఈరోజు ఒక మహనీయుని జన్మదినం "

8, ఏప్రిల్ 2016, శుక్రవారం

రండు మిత్రులార...

రండు మిత్రులార
మిమ్ము దోడ్కొని పోదు
దుమ్ము ధూళి లేని
లోకమునకు

రండు ప్రేమికులార
మిమ్ము దోడ్కొని పోదు
శోకమంతమైన
లోకమునకు

ఎచటి కేగినంత
ఏకత్వ ముదయించి
సకల ద్వంద్వ భ్రమలు
సద్దు మణగు

ఎచట కాలుమోప
మీరు నేనను భావ
మంతయును మాయమై
ముద్దు గొలుపు

ఎచటి నీరు ద్రావ
దాహంబు శాంతించి
తిరిగి దోచకుండ
మాయమౌను

ఎచటి గాలి సేవ
గాయంబు లన్నింటి
తత్క్షణమె మాన్పించి
స్వాస్థ్యమొసగు

ఎచట మిమ్ము గోరి
ఎల్ల ధన్యాత్ములును
వేచిచూచుచుందు
రాత్రమొప్ప

ఎచటి సీమలోన
దుఃఖమన్నది లేక
నిత్యసంతసంబు
రాజ్యమేలు

ఎచట జూచినంత
ఆకలియు దప్పియున్
ఎంతమాత్రమేని
దోచకుండు

ఎచట నాకమందు
సూర్యుండు చంద్రుండు
నితర కాంతులు లేక
వెలుగు నిండు

ఎచట జేరినంత
ఎన్నడును విడిపోని
ప్రేమ యందు మీరు
పవ్వళింత్రు

ఎచట నిత్యమెపుడు
హెచ్చు తగ్గులు లేని
ఆనంద ఝరి యొకటి
ఆర్ణవించు

ఎచటి సీమలోన
వారు వీరను భావ
మంతయును అంతమై
ఉజ్జ్వలించు

ఎచట జూడబోవ
కాలమంతయు సుంత
మంతమై కనరాని
తావుజేరు

రండు మిత్రులార
మిమ్ము దోడ్కొని పోదు
దుమ్ము ధూళి లేని
లోకమునకు

రండు ప్రేమికులార
మిమ్ము దోడ్కొని పోదు
శోకమంతమైన
లోకమునకు
read more " రండు మిత్రులార... "