29, జూన్ 2012, శుక్రవారం

శని వక్రత్యాగం - ఆశ్చర్యకరఫలితాలు

మీలో ఎవరైనా మొన్న సోమవారం 25-6-2012 తర్వాత ఊహించని మార్పులను మీ జీవితంలో గమనించారా? అవి పెద్దపెద్ద మార్పులు కావచ్చు. లేదా అంత ముఖ్యమైనవి కాకపోవచ్చు. కానీ ఊహించనివీ అనుకోనివీ కొన్ని నెలలనుంచీ పెండింగ్ లో ఉన్నవీ ఖచ్చితంగా అయి ఉంటాయి. దానికి కారణం ఏమిటో ఊహించారా? ఏదో కాకతాళీయంగా ఇవి జరుగుతున్నాయి అనుకుంటున్నారా? కాదు. దీనికి కారణాలున్నాయి.

నాలుగు నెలలుగా వక్రస్తితిలో (retrograde motion) ఉన్న శని మొన్న సోమవారం (25-6-2012) నాడు తన వక్రగతిని వీడి రుజుగతి(direct movement) లోకి ప్రవేశించాడు. దాని కారణంగా మనుష్యుల జీవితాలలో ఎన్నో మార్పులు చోటు చేసుకుంటాయి. చేసుకుంటున్నాయి కూడా. మీమీ జీవితాలు గమనించుకుంటే నేను వ్రాస్తున్న ప్రతి అక్షరమూ సత్యమే అని మీకే తెలుస్తుంది.

ఏఏ మార్పులు మీమీ జీవితాలలో జరుగుతున్నాయో కొంచం వివరిస్తాను. వినండి. ఫిబ్రవరి ఏడో తేదీ ముందు మీ జీవితం ఎలా ఉందొ ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. అప్పుడు మొదలై ఇన్నాళ్ళూ మీ జీవితంలో సాగిన స్తితి ఇప్పుడు రివర్స్ అవుతుంది. అంతకు ముందటి స్తితి మళ్లీ ఇప్పుడు వస్తుంది. 

>>ఫిబ్రవరి తర్వాత మీ జీవితంలో ప్రవేశించిన వ్యక్తులు ఇప్పుడు హటాత్తుగా నిష్క్రమిస్తారు. లేదా వారితో సంబంధాలు దెబ్బతింటాయి.

>>అనుకోకుండా కొత్త వస్తువులు సమకూర్చుకుంటారు. లేదా ఇళ్ళు మారతారు. చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న పనులు సడన్ గా కదులుతాయి.  

>> మానసికంగా అనుకొని హటాత్తు మార్పులు కొందరిలో కలుగుతాయి. ఇప్పటివరకూ ఉన్న మూడ్స్ మారిపోయి దానికి పూర్తిగా వ్యతిరేకమైన మూడ్ లోకి వెళతారు. సన్నిహితులతో, అధికారులతో, సహోద్యోగులతో, స్నేహితులతో మాటామాటా పెరిగి గొడవలు అవుతాయి. ఈ వాదనల వెనుక పెద్ద పెద్ద రీజన్స్ ఏమీ ఉండవు. చాలా చిన్న విషయాలమీద ఈ గొడవలు అవుతాయి.

>>ఇప్పటి వరకూ ఒకరికి ఒకరుగా ఉన్నవారిలో కూడా గొడవలు జరిగి ఎడమొహం పెడమొహంగా అవుతారు. ఇప్పటి వరకూ చిన్నచిన్న కారణాలుగా కనిపించినవి ఒక్కసారి పెద్దవిగా కనిపించి మూడ్ ఆఫ్ అవుతుంది.

>>స్తబ్దుగా ఉన్న కొందరి ఉద్యోగ జీవితం ఉన్నట్లుంది చాలా చురుకుగా మారుతుంది. అనుకొని అధికారులతో పరిచయాలు కలుగుతాయి. స్తంభించిన వ్యాపారాలు మళ్లీ చురుకుగా కదులుతాయి.

>> నిత్యజీవితంలో జరుగుతున్న ఒక చిన్న విషయం చెప్తాను. నేను వ్రాసే అనేక విషయాలలాగే ఇదీ వినడానికి వింతగా ఉంటుంది. ఇసుక దొరకక భవన నిర్మాణాలు కొన్ని నేలలుగా మందకొండిగా సాగుతున్న విషయం మనకు తెలిసిందే. ఇప్పుడు ఆ ప్రతిష్టంభన తొలగిపోతుంది. మళ్లీ భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. ఇది శనీశ్వరుల ప్రభావమే.

>>కొందరికి శని వక్రించినప్పుడు మంచి జరుగుతుంది. అటువంటి వారికి ప్రస్తుతం మళ్లీ చెడుకాలం మొదలౌతుంది. జీవితంలో కోపాలు, చికాకులు, విసుగులు, డిప్రెషన్లు  మొదలౌతాయి. ఇవి వినడానికి విచిత్రంగా ఉంటాయి. కాని మనకు తెలియని శక్తులు మన జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయో ఇది గమనిస్తే బాగా అర్ధం అవుతుంది.

>> కొంతమందికి ఎప్పుడో మరచిపోయిన వారితో మళ్లీ సంబంధాలు నేరపాలని బలంగా అనిపిస్తుంది. దూరపు బంధువులు మళ్లీ తారసపడతారు. ఇన్నాళ్ళూ ఫోన్ చెయ్యని వారూ పలకరించని వారూ మళ్లీ పలకరిస్తారు.

>>కొందరు వాతరోగులుంటారు(rheumatic patients). వారికి కొన్ని నెలలుగా వాతనొప్పులు కాస్త ఉపశమనంగా ఉంటాయి. మొన్న సోమవారం నుంచీ అవి మళ్లీ తిరగబెట్టి ఊపందుకుంటాయి. తగ్గిన రోగాలు చాలామందిలో మళ్లీ తిరగబెడతాయి.

>>కొందరు తమతమ వాహనాలకు,వస్తువులకు రిపేర్లు చేయిద్దామని కొన్ని నెలలుగా అనుకుంటూ వాయిదా వేస్తూ ఉంటారు. అవి మొన్న సోమవారం తర్వాత సడన్ గా జరుగుతాయి.


ఇలాంటి విచిత్రాలు మానవ జీవితంలో చాలా జరుగుతాయి. గమనించండి. నేను వ్రాసింది ఎంత నిజమో మీకే తెలుస్తుంది. ఇప్పుడైనా మానవజీవితం మీద గ్రహప్రభావం నిజమేనని నమ్ముతారా? ఇంకా నమ్మకపోతే మీ ఇష్టం. మీరు నమ్మినా నమ్మకున్నా విశ్వశక్తుల చేతిలో మనిషి కీలుబొమ్మ అన్నది అక్షరసత్యం.


చిన్న సూచన:--రాబోయే కొద్దిరోజులలో శనికుజుల కన్జక్షన్ వల్ల  కొంతమంది జీవితంలో వాహనప్రమాదాలు జరుగుతాయి. రక్తదర్శనం , కుట్లు పడటం జరుగుతుంది. గమనించి జాగ్రత్తగా ఉండండి.
read more " శని వక్రత్యాగం - ఆశ్చర్యకరఫలితాలు "

25, జూన్ 2012, సోమవారం

అతీతలోకాలు - అదృశ్యశక్తులు

చాలామంది అతీతలోకాలు లేవని అనుకుంటారు. అదృశ్యశక్తులు కూడా లేవని అనుకుంటారు. అది నిజం కాదు. అవి ఉన్నాయి. మనకు కనిపించనంత మాత్రాన "లేదు" అనుకోవడం వెర్రితనం. రాత్రిళ్ళు మనకు సూర్యుడు కనిపించడు.అంతమాత్రాన సూర్యుడే లేడు అనుకోవడం ఎంత తెలివితక్కువతనమో ఇదీ అంతే. రాత్రి మాత్రమె తెలిసినవాడు సూర్యుడు లేడు అనుకోవచ్చు. కాని పగటిని చూచినవాన్ని అడిగితే సూర్యుడున్నాడు  అని అతను చెప్తాడు. అలాగే, మనకు కనిపిస్తున్నదే సత్యమనీ తక్కినది అబద్దమనీ అనుకోవడం పిచ్చితనం. గోడ అవతల ఏముందో మనం చూడలేం. అంతమాత్రాన గోడ అవతల ఏమీ లేదు అనుకోవడం తప్పే కదా.

మనిషి ఇంద్రియాలకున్న పరిధి అతి స్వల్పమైనది. మన మెదడులోనూ ఊపిరితిత్తులలోనూ ఉన్న శక్తిలో మనం నిత్యజీవితంలో వాడుకునేది చాలా స్వల్పం. సాధారణ మానవులలో పినియల్ గ్లాండూ, పిట్యూటరీ గ్లాండూ చాలావరకూ నిద్రాణంగా పడి ఉంటాయి.అలాగే మన పొటెన్షియల్ శక్తిలో ఎంతో భాగం నిరుపయోగంగా పడిఉంది. లేదా వృధాగా పోతూ ఉంటుంది. యోగులు ఆ మొత్తాన్నీ నిగ్రహించి దానిని సరియైన వాడుకలోనికి తెస్తారు. అందువల్ల వారి ఇంద్రియాల పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది. వారి దర్శనశక్తి కూడా అమితంగా వృద్ధి చెంది ఉంటుంది. అందుకే మామూలు మనుషులు చూడలేనివి వారు చూస్తారు. ఇతరులు వినలేనివి వారు వినగలరు. ఆ క్రమంలోనే అతీతలోకాలను వారు చూడగలుగుతారు. అదృశ్య శక్తులతో సంభాషించగలుగుతారు.

మనిషి చూడలేని వేవ్ లెంగ్త్ లను కొన్ని జంతువులు చూడగలవు. కుక్కలకు ఆ శక్తి ఉంది. అవి ఒక్కొక్కసారి దయ్యాలను చూచి ఏడుస్తూ ఉంటాయి. అయితే కుక్క ఏడ్చిన ప్రతిసారీ అక్కడేదో దయ్యం ఉన్నట్లు అనుకోవడం కూడా తప్పే. దానికి ఆకలేసినా, సీజన్ వచ్చినా కూడా అలాగే ఏడుస్తుంది.  ప్రేతాత్మలను చూచినప్పుడు కుక్క ఏడవటం ఒక తీరులో ఉంటుంది. అనుభవంలో దానిని కనిపెట్టవచ్చు. గబ్బిలాలు సూక్ష్మ తరంగాల ఆధారంగానే దేనికీ తగలకుండా ఎగరగలుగుతాయి. పక్షులు తమలోని అయస్కాంత దిక్సూచి ఆధారంగానే వేలమైళ్ళు ప్రయానంచేసినా మళ్లీ తమ గూటికి చేరుకోగలుగుతాయి. పిల్లులు కూడా మనం చూడలేని వేవ్ లెంగ్త్ లో ఉన్న జీవులను చూడగలవు. పాములు ఈ విషయంలో మరీ శక్తివంతమైన జీవులు. మైళ్ళ దూరంలో ఉన్న మనిషి కదలికలను అవి గుర్తుపట్టగలవు. కొన్ని దేవతా సర్పాలకైతే అతీత శక్తులు ఉంటాయి. అవి మానవరూపం ధరించగలవు. మానవ భాషలో మాట్లాడగలవు కూడా.

నిద్రాణంగా ఉన్న మన  ఇంద్రియశక్తులను  యోగం ద్వారా నిద్రలేపినపుడు అద్భుతాలు చూడవచ్చు. ఇంతవరకూ మనం చూస్తున్న లోకం వెనుక ఎన్ని లోకాలున్నాయో గమనించవచ్చు. వాటిలో ఎన్నెన్ని జీవులున్నాయో చూడవచ్చు.  వారితో ఇంటరాక్ట్ కావచ్చు. కొందరు పాశ్చాత్య శాస్త్రజ్ఞులు చెప్పినదాని ప్రకారం మనం చూస్తున్న డైమెన్షన్ వెనుక కనీసం ఆరు ఇతర డైమెన్షన్ లు ఉన్నాయి. అంటే మొత్తం ఏడు లోకాలున్నాయి అని అర్ధం. మన ప్రాచీనులు చెప్పిన భువర్లోక సువర్లోకాది సప్త ఊర్ధ్వలోకాలు అవే. వీటికి నెగటివ్ పోల్స్ నే అతల వితలాది సప్త అధోలోకాలు అన్నారు.

ఒక్కొక్క డైమెన్షన్ లో ఒక్కొక్క రకమైన జీవులు ఉంటాయి. మళ్లీ వీటిలో విభిన్న తరగతుల వాళ్ళు ఉంటారు. మానవలోకంలో అందరూ మానవులే అయినప్పటికీ వాళ్ళలో మళ్లీ తేడాలున్నట్లుగా అక్కడ కూడా ఉంటుంది.వీరిలో కొందరు ఉన్నత స్థాయికి చెందిన జీవులు వారి ఇష్టానుసారం మనకు కనిపించి సూచనలు ఇవ్వగలవు. మన కర్మలో పాలుపంచుకోగలవు. సద్గురువులకు ఈ శక్తి ప్రస్ఫుటంగా ఉంటుంది. తమ శిష్యులను జన్మజన్మాన్తరాలవరకూ వారు గైడ్ చెయ్యగలరు. 

మనం ఆధ్యాత్మికంగా ఎదిగినప్పుడు, యోగసాధనా బలం తగినంత ఉన్నపుడు, సద్గురువులతో మనం కోరినప్పుడు సంభాషించవచ్చు. ఊర్ధ్వలోకాలలో ఉండే ఉత్తమ జీవులను దేవతలు అంటాము. వారు కాంతి శరీరాలను కలిగి ఉంటారు. అవి రకరకాల రంగులలో ఉంటాయి. ఆయా రంగులు వారి తత్వాన్నీ శక్తులనూ ప్రతిబింబిస్తూ ఉంటాయి. దేవతలనబడే ఈ ఉత్తమ జీవులను చూచి వారితో సంభాశించగలిగే శక్తి కొందరికి ఉంటుంది. శ్రీరామకృష్ణుల శిష్యుడైన బ్రహ్మానందస్వామికి ఈ శక్తి ఉండేది. ఆయన దేవతలను చూచి వారితో మాట్లాడగలిగేవారు. రాత్రిళ్ళు మూసి ఉన్న ఆయన గదితలుపుల వెనుక నుంచి రకరకాల కాంతులు బయటికి ప్రసరిస్తూ ఉండేవి. ఖాళీగా నిరాడంబరంగా ఉండే ఆయన గదినుంచి రకరకాల వాయిద్యాల ధ్వనులు ఒక్కొక్కసారి బయటికి వినవచ్చేవి. రకరకాల సువాసనలు అకస్మాత్తుగా ఆ గదినుంచి గుప్పుమనేవి.

ఇవన్నీ కూడా వినడానికి "ఫెయిరీ టేల్స్" లా ఉండవచ్చు. కానీ ఆ కధలవేనుక ఉన్న ప్రేరణకూడా కొన్ని వాస్తవాలమీద ఆధారపడినట్టిదే అని మరువరాదు. అతీతలోకాల దర్శనాన్ని పొందినవారు అన్నికాలాలలోనూ అన్నిదేశాలలోనూ ఉన్నారు. వారు చెప్పిన వివరాలనుంచి ఈ కధలు (fairy tales) పుట్టుకొచ్చాయి. అయితే ఈ అతీతశక్తులను పొందటం ఎలా అనేది ఒక సైన్స్ గా క్రోదీకరించబడినది మాత్రం మన దేశంలోనే.మన యోగులు మహర్షులు ఈ సైన్స్ కు సృష్టికర్తలు. ఇది ఇప్పటికీ సజీవంగా ఉన్న రహస్యవిద్య. అర్హత ఉన్నవారిని ఈ రంగంలో ఇప్పటికీ సద్గురువులు గైడ్ చేస్తూనే ఉంటారు. వారి కమ్యూనికేషన్ విధానాలు కూడా విచిత్రంగా ఉంటాయి. అదొక రహస్య ప్రపంచం అని చెప్పవచ్చు. బయటి వారికి దీనివివరాలు అస్సలు తెలియవు.

నిత్యజీవితంలో కూడా మనకు కొన్నికొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. కొంచం సెన్సిటివ్ గా ఉన్నవారికి ఇవి అనుభవం లోనే ఉంటాయి. ఉదాహరణకు, ఈరోజు ఒక స్నేహితున్ని చూస్తామేమో అనిపిస్తుంది. అదేరోజు అతను అనుకోకుండా ఊడిపడతాడు. అనుకోకుండా పని పడి వచ్చాను, సరే ఊళ్లోకి వచ్చాను కదాని నిన్ను కలిసిపోదామని వచ్చాను అంటాడు. ఒక ఫోన్ కాల్ వస్తుందని అనిపించిన కొద్ది నిముషాల లోనే ఆ కాల్ రావడం ఎన్నో సార్లు జరుగుతుంది. అలాగే ఈరోజు ఏదో చెడువార్త వింటాం అనిపిస్తుంది. మధ్యాన్నానికి ఎవరో పోయారనో,లేదా ఇంకేదో అయిందనో వార్త వింటాము. లేదా కలలో ఒక వ్యక్తీ కనపడి మూగగా చూస్తూ మాయం అవుతాడు. తర్వాత కొన్నాళ్ళకు అతను చనిపోయాడని వార్త వింటాము. ఇలాంటివి చాలా జరుగుతూ ఉంటాయి. మనుషుల మధ్య కంటికి కనిపించని బందాలుంటాయి. సరియైన రాపోర్ట్ ఉన్నప్పుడు అమెరికాలో ఉన్న వ్యక్తికి జ్వరం వస్తే మనకు ఇక్కడ తెలిసిపోతుంది. ఈ స్పందనకు కాలంతో దూరంతో పని ఉండదు. ఇది ఒక మాగ్నెటిక్ రేసోనేన్స్ లాగా పనిచేస్తుంది.

నిత్యజీవితంలో జరిగే ఇంకా కొన్ని ఉదాహరణలు చెప్తాను. చిన్నపిల్లల తల్లికి ఇవి బాగా అనుభవంలో ఉంటాయి. బిడ్డకు నలతగా ఉంటే తల్లికి వెంటనే తెలిసిపోతుంది. అలాగే తల్లి తమ మీదనుంచి దృష్టి తిప్పి వేరే విషయం మీద దృష్టి పెడితే బిడ్డ నిద్రపోతున్నా కూడా వెంటనే మేలుకొని ఏడవడం మొదలుపెడుతుంది. అబ్బబ్బ ఒక్క పని కూడా చేసుకోనివ్వడు. ఎటూ కదలనివ్వడు వీడికేలా తెలుస్తుందో అని విసుక్కునే తల్లులు లక్షల సంఖ్యలో ఉంటారు. ఇవన్నీ కూడా ఈ రేసోనేన్స్ వల్లనే జరుగుతాయి. ప్రేమికుల మధ్యన కూడా ఇలాంటి రేసోనేన్స్ ఉంటుంది. ఒకరికి ఏదైనా బాధ కలిగితే వెంటనే రెండో వారికి ఎందుకో తెలీని బాధ కలుగుతుంది. కానీ కారణం మాత్రం వారికి తెలియదు. ఇలాంటి రేసోనేన్స్ అనేది తల్లీ పిల్లలు కావచ్చు, ప్రాణ స్నేహితులు కావచ్చు, ప్రేయసీ ప్రియులు కావచ్చు, గురుశిష్యులు కావచ్చు వీరిలో ఎవరి మధ్యనైనా ఉండవచ్చు. దీనిలో ముఖ్యంగా ఉండవలసింది ఏకమనస్కత. అంటే ఒకే వేవ్ లెంగ్త్ లో వారిద్దరూ ఉండాలి. అలాంటప్పుడు కాలంతో దూరంతో సంబంధం లేకుండా ఇది ఏర్పడుతుంది. ఇది చాలామంది మామూలు మనుషులకు కూడా అనుభవంలో ఉండే విషయం. అయితే ఈ శక్తి వారి అదుపులో ఉండదు. కావలసినప్పుడల్లా దీనిని వారు ఫీల్ అవలేరు.

ఈ శక్తినే యోగం ద్వారా విపరీతంగా వృద్ధి చేసుకోవచ్చు. అప్పుడు అది వారి స్వాధీనం అవుతుంది. సంకల్ప శక్తితో మనస్సును ఫ్లడ్ లైట్ లా కేంద్రీకరించగలిగితే  ఆ లైట్ పడిన చోట ఏముందో స్పష్టంగా కనిపిస్తుంది. పతంజలి మహర్షి ఈ శక్తుల గురించి తన యోగసూత్రాలలోని "విభూతిపాదం"(Chapter on Powers) అనే అధ్యాయంలో చెప్పారు. ఏ ఏ విషయాల పైన సంయమం చేస్తే యోగిలో ఏఏ శక్తులు ఎలా వృద్ధి చెందుతాయో అందులో వివరించారు.


ఉదాహరణకు మహర్షి ఒకచోట ఈ సూత్రాన్ని ఇచ్చారు "సమాన జయాత్ ప్రజ్వలనం". శరీరంలో ఉన్న సమానవాయువు అనేదాన్ని అదుపులోనికి తెచ్చుకుంటే యోగి తన శరీరం నుంచి జ్వలించే కాంతిని వెదజల్లగలడు. దీనిని సాధించిన యోగులు చాలామంది నేటికీ ఉన్నారు. ఈ విషయాన్ని గురించి నేనొకసారి మాట్లాడుతున్నపుడు నా స్నేహితుడొకడు ఒప్పుకోలేదు. "ప్రకృతిలో సాధ్యం కాని విషయాలను ఏదో పుస్తకంలో రాసినంత మాత్రాన ఎలా నమ్మాలి?" అని వాదించాడు. అతనితో ఇలా చెప్పాను. "ప్రకృతిలో లేవని నీవు ఎలా అనుకుంటున్నావు? ఉన్నాయి. చూచే దృష్టి నీకు లేదు. నీకు తెలియనంత మాత్రాన ప్రకృతిలోనే ఇవి లేవు అని ఎలా నిర్ధారణకు వస్తున్నావు? మిణుగురు పురుగును చూచావుకదా. రాత్రిపూట అది తనలోనుంచి కాంతిని ఎలా వెదజల్లుతుంది? అలాంటి శక్తి ఈ టెక్నిక్ వల్ల మనిషికి కూడా వస్తుంది." అని చెప్పాను. అతను మళ్లీ మాట్లాడలేదు. 


అలాగే "కంటకూపే క్షుత్పిపాసా నివృత్తి:" అనేది ఇంకొక సూత్రం. తన గొంతులో ఉన్న విశుద్ధ చక్రంమీద సంయమం చెయ్యగలిగిన యోగి ఆకలి దప్పులచేత పీడింపబడడు అనేది దీని అర్ధం. ఇది కూడా చాలామంది యోగులకు అనుభవైక వేద్యమే. ఆహారం దొరకని హిమాలయ సానువుల్లో రోజుల తరబడి ధ్యానసమాధిలో ఉండే యోగులు ఈ టెక్నిక్ ద్వారానే ఆకలిదప్పులకు అతీతులుగా ఉండగలుగుతారు.
  
మనం చూస్తున్న లోకం వెనుకే, మనం చూడలేని లోకం ఒకటుంది. ఆ లోకం, మనం చూస్తున్న లోకంకంటే అనేక వేలరెట్లు పెద్దదీ, విభిన్నమైనదీ, అనేక రంగులతో కూడినదీ. మనిషి ఒక చిన్న బురదగుంతలో బతుకుతున్న ఛిరుకప్ప లాంటివాడు. ఈ గుంతనే అతను గొప్ప ప్రపంచం అనుకొని, అందులో సాధ్యమైనంత దోచుకొని దాచుకోవడానికి రకరకాల మోసాలు చేస్తూ నీచమైన బతుకు బతుకుతున్నాడు. అతీతలోకాలను ఒక్కసారి దర్శిస్తే  మన బ్రతుకు ఎంత అల్పమైనదో ఎంత నీచమైనదో అర్ధమౌతుంది. అప్పుడు మన జీవితం మీద మనకే అసహ్యం కలుగుతుంది. ఉన్నతజీవితం మీద అభిలాష తీవ్రమౌతుంది.

ఒక ఉపన్యాసంలో వివేకానందస్వామి ఇలా అంటారు. "ఏమీ చూడని వానికంటే ఒక దెయ్యాన్ని చూచినవాడైనా ఉత్తముడే. ఎందుకంటే మనం చూడని ఇంకొక లోకం ఉందన్న సత్యం అతనికి అలాగైనా అర్ధమౌతుంది." తద్వారా అంతరిక జీవితం మీద అతనికి ఆసక్తి మొదలౌతుంది.క్రమేనా అదే అతన్ని ఉన్నత స్థాయిలకు చేర్చే అవకాశం ఉంది.

మనం చూస్తున్న ఈలోకం వెనుక, ఎన్నో లోకాలున్న మాట వాస్తవం. వాటిలో మన స్థాయికి మించిన అనేకరకాల జీవులున్న మాట కూడా వాస్తవమే. సరైన ట్రెయినింగ్ తో ఆలోకాలను చూడవచ్చు . ఆ జీవులతో సంభాషించవచ్చు. మనం నమ్మినా నమ్మకపోయినా ఇది సత్యం.
read more " అతీతలోకాలు - అదృశ్యశక్తులు "

22, జూన్ 2012, శుక్రవారం

వృషభరాశిలో గురుకేతువుల సంయోగం -- ఫలితాలు

ప్రస్తుతం బృహస్పతి వృషభరాశిలో సంచరిస్తూ నీచకేతువుతో కలిసి ఉన్నాడు. ఈయన దాదాపు ఒక సంవత్సరం పాటు ఈ రాశిలో ఉండబోతున్నాడు. ఈ గ్రహయుతి ఫలితాలు ఎలా ఉంటున్నాయో కొంచం గమనిద్దాం. వృషభరాశి నవీన భారతదేశాన్ని సూచిస్తుంది. కనుక ఈ గ్రహ ఫలితాలు మన దేశంమీద ఎక్కువగా ఉంటున్నాయి. 

గురువు న్యాయవాదులకూ, న్యాయమూర్తులకూ సూచకుడు. ఈయన కేతుగ్రస్తుడవడం వల్ల న్యాయరంగానికి మలినం పట్టింది. ఈ మధ్యన న్యాయమూర్తులు కూడా అవినీతికేసుల్లో ఇరుక్కుని అరెష్టవడం దీని ప్రభావమే. న్యాయం కూడా ఒంటి కాలిమీద నడుస్తూ ఉండటం చూడవచ్చు.   

గురువు ఆధ్యాత్మిక గురువులకు సూచకుడు కూడా. కనుక నకిలీ గురువులు కొందరు వివాదాస్పద అంశాలలో ఇరుక్కుని జైలు పాలవడం, రాజకీయాలలో తలదూర్చి నాయకులతో విరోధాలు పెంచుకోవడం, విమర్శలు చెయ్యడం, వార్తలకేక్కడం జరుగుతోంది.

గురువు నాయకులకూ, ఉన్నత అధికారులకూ సూచకుడు. ఈ మధ్యన నాయకులందరూ అరెష్టు కాబడటం, ఇన్నాళ్ళూ ఇతరులకు ఆదేశాలు ఇచ్చిన అయ్యేఎస్ అధికారులు కటకటాల వెనక్కు వెళ్లడం కూడా ఈ గ్రహయుతి ప్రభావమే.

ఇంకా చూస్తె, గురువు వృద్ధనాయకులకు సూచకుడు. కనుక త్వరలో కొందరు వృద్ధ నాయకులు అకస్మాత్తుగా పరలోక ప్రయాణం కట్టే సూచనలున్నాయి.

గురువు ధర్మానికీ సూచకుడే. అందుకే ఈ మధ్యలో ధర్మం దారి తప్పినంతగా ఎన్నడూ జరుగలేదు. ప్రజలలో ధర్మం అనేది పూర్తిగా లోపించి స్వార్ధం కరాలనృత్యం చేస్తున్న మాట నిజం. ప్రస్తుతం ఎవరిలోనూ ధార్మిక చింతన లేదు అని చెప్పవచ్చు. ధర్మం పేరుతో మతం పేరుతో జరుగుతున్నది అంతా కూడా చాలావరకూ మోసమే.

అయితే దీనిలో ఇంకొక కోణం కూడా ఉన్నది. గురు కేతువుల యుతి వల్ల నిజమైన ఆధ్యాత్మిక పరులకు సహాయపడే స్పందనలు ఇప్పుడు అధికం అవుతాయి. వీటిని సక్రమంగా ఉపయోగించుకుంటే అటువంటి వారికి మంచి పురోగతి ఉంటుంది. ఈ పరిస్తితి ఒక ఏడాది పాటు ఉంటుంది కనుక ఆ మార్గంలో ప్రయత్నాలు చేస్తున్నవారు ఈ గ్రహ ప్రభావాన్ని సరిగ్గా వాడుకుంటే బాగుంటుంది.

వృషభ రాశి భూతత్వ రాశి కనుక ఈ గ్రహయుతి వల్ల భారతదేశంలో భూకంపాలు వస్తున్నాయి. శనీశ్వరుడు కూడా భూతత్వ రాశి అయిన కన్య లో ఉండటం గమనిస్తే ఇదెంత ఖచ్చితంగా జరుగుతున్నదో అర్ధం అవుతుంది. మొన్న అమావాశ్య ప్రభావంతో సత్తెనపల్లి కేంద్రంగా భూకంపం వచ్చిన విషయం గుర్తుంచుకోవాలి. దీని ఫలితంగా గుంటూరులో కూడా ఇళ్ళు ఇంట్లోని వస్తువులు రెండు మూడు సెకన్లు ఊగినట్లు అనిపించింది.


ప్రస్తుతం గురుకేతువులు ఒకరికొకరు ఒక డిగ్రీ దగ్గరలో ఉన్నారు. నిన్న గురువారం నాడు ముంబాయిలోని మహారాష్ట్ర సెక్రెటేరియట్ కు నిప్పంటుకుని ఘోరప్రమాదం జరిగింది.ఇద్దరు ముగ్గురు చనిపోయారని అంటున్నారు. మంత్రులు కొద్దిలో బయటపడ్డారు. కేతువు కారకత్వాలలో ఒకటైన షార్ట్ సర్క్యూట్ కారణం అని అంటున్నారు. అధికారకేంద్రం అయిన విధానసౌధంలో ఇది జరగటం గురువు కేతువుల సంయోగ ఫలితమే. ఆర్ధిక రాజధానిలో ఇది జరగడం శుక్రుని రాశి అయిన వృషభంలో  కేతువు ఉన్న ఫలితమే. ఇది అగ్ని ప్రమాదాలకు కారకుడైన కుజ హోరలో జరిగింది. కుజుడు ప్రస్తుతం సున్నా డిగ్రీలలో ఉండి తన శత్రువైన శనిని సమీపిస్తూ చాలా అసౌకర్యంగా ఉన్నాడు.

డిసెంబర్ 23 వరకూ కేతువు వృషభరాశిలోనే ఉంటాడు. అప్పటివరకూ  ఇలాంటి ఫలితాలు మనదేశంలో కనిపిస్తూనే ఉంటాయి. తమతమ జాతకాలకు సరిపోయే రేమేడీలు పాటించడం వల్ల ఈ దుష్ప్రభావాల నుండి బయట పడవచ్చు.
read more " వృషభరాశిలో గురుకేతువుల సంయోగం -- ఫలితాలు "

13, జూన్ 2012, బుధవారం

పంచవటి సాధనా సమ్మేళనం - 4

జూన్ 11,12 తేదీలలో పంచవటి నాలుగో సాధనాసమ్మేళనం హైదరాబాద్ లో ఒక సభ్యురాలి ఇంటిలో జరిగింది. ఈ రెండురోజులూ పంచవటి సభ్యులు దాదాపు 25 మంది హాజరై ఉదయం నుంచి సాయంత్రంవరకూ ఎన్నో ఆధ్యాత్మికవిషయాల మీద చర్చించి వారివారి సందేహాలు తీర్చుకుని జ్ఞానలబ్దిని పొందారు. ప్రాణాయామ ధ్యానాది సాధనలు కొన్ని ప్రాక్టికల్ గా చేసి ప్రత్యక్షంగా సాధనామార్గం ఎలా ఉంటుందో తెలుసుకున్నారు. 

వేదోపనిషత్తుల సారాన్ని, మహనీయుల జీవిత ఘట్టాలనూ, వివిధ సాధనా మార్గాలనూ, వాటిలోని లోతుపాతులనూ, నిత్యజీవితంలో వాటిని ఏ విధంగా అన్వయించుకోవాలి,ఎలా ఆచరించాలి అన్న విషయాలనూ, సాధనా మార్గంలో ఎలా ఎదగాలి, నిజమైన ఆధ్యాత్మికత ఎలా ఉంటుంది అన్న విషయాలనూ కూలంకషంగా చర్చించి అర్ధం చేసుకోవడానికి ఈ సమ్మేళనం ఒక వేదికగా ఉపయోగపడింది. సమావేశంలో పాల్గొన్న వారికి ఎన్నో కొత్త విషయాలు తెలుసుకునే వీలు కల్పించబడి ఆనందాన్ని కలిగించింది.

ఈ సమావేశానికి హాజరైనవారందరూ నిష్కల్మషమైన విశాలమైన భావాలు కలిగినవారే.ఆధ్యాత్మికంగా కొంత సాధన చేసినవారే. ఇంకా చేస్తూ ఉన్నవారే కావడంతో వారికి కలిగిన కలుగుతున్న సందేహాలు చర్చించి సమాధానాలు పొందటానికి అనువైన వాతావరణం ఈ సమ్మేళనంలో కల్పించబడింది. స్వచ్చమైన,నిజమైన ఆధ్యాత్మికతను కొంతైనా అర్ధం చేసుకున్నామన్న ఆనందాన్ని ఈ సమ్మేళనం వారిలో నింపింది. జీవితసాఫల్యతా సాధనలో ముందడుగు వేస్తామన్న నమ్మకాన్ని పెంచింది. జీవన పోరాటాన్ని దైవబలంతో ధైర్యంగా నిజాయితీగా ఎదుర్కోగలమన్న విశ్వాసాన్ని కలిగించింది.

నా ఆహ్వానాన్ని మన్నించి ఈ సమ్మేళనంలో పాల్గొన్న పంచవటి సభ్యులకు అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
read more " పంచవటి సాధనా సమ్మేళనం - 4 "

9, జూన్ 2012, శనివారం

మనిషి జీవితంలో మౌలిక ప్రశ్నలు

ప్రతి మనిషీ జీవితంలో తనను తాను ఏదో ఒకరోజు ప్రశ్నించుకోవలసిన మౌలికమైన ప్రశ్నలు కొన్నున్నాయి. కాని ప్రతి వాడూ వీటిని వాయిదా వేస్తూ పోతుంటాడు.ఈ వాయిదా వెయ్యడానికి కారణాలు ఎన్నున్నా అన్నింటి వెనకా ఒకటే మూలకారణం కనిపిస్తుంది. దానిని తృష్ణ అనవచ్చు, లేదా ఇంద్రియాకర్షణ అనవచ్చు లేదా మాయ అనవచ్చు. దీనికి లోబడే లోకంలో ప్రతి మనిషీ జీవిస్తున్నాడు.

ప్రతి మనిషీ తన జీవితంలో, తానెంత సంపాదిస్తున్నాడు, ఎంత ఆస్తి ఇప్పటి దాకా  కూడబెట్టాడు, ముందు ఇంకా ఎంత కూడబెట్టాలి, దానితో ఎన్ని సుఖాలు అనుభవించాలి అన్న ఆలోచనలే చేస్తుంటాడు. కాని అతను ఆలోచించని విషయం ఒకటుంది. ఈ తాపత్రయంలో పడి విలువైన జీవితాన్ని అతను కోల్పోతున్నాడు. ఆయుస్సు అనుక్షణం తగ్గుతూ వస్తున్నది. మరణం అనుక్షణం దగ్గర అవుతున్నది. ఈ జీవన పోరాటంలో శాంతి అనేది కనుచూపు మేరలో ఎక్కడా కనిపించదు. మనిషి తాపత్రయానికి అంతం కూడా ఎప్పటికీ ఉండదు. కానీ, ఎంతకాలం ఈ అర్ధం లేని పరుగు? అన్న విషయం మాత్రం ఎవరూ ఆలోచించరు. అదే మాయ.

తాను సంపాదించిన దానికంటే తాను ఖచ్చితంగా  ముఖ్యమైనవాడు. సంపాదన తనకోసమే గాని తాను సంపాదన కోసం పుట్టలేదు. సంపాదన కోసం ఎవడూ సంపాదించడం లేదు. సంపాదించిన దానితో తను తన కుటుంబమూ సుఖంగా ఉండాలనే ప్రతివారూ ఆశిస్తారు. అంతేగాని అవసరం ఉన్నా లేకున్నా లక్షల కోట్లూ, కోట్ల కోట్లూ పోగేయ్యాలని ఎవరైనా ఆశించి ఆ కోణంలో ప్రయత్నం చేస్తుంటే వారి వ్యక్తిత్వంలో మౌలికంగా ఏదో దారుణమైన లోపం ఉన్నదని భావించాలి. సుఖం కోరుకోవడం తప్పు కాదు. కాని దానికి అంతెక్కడ అన్న విషయం గ్రహించలేకపోవడమే తప్పు. ఇక చాలు అని ఒక గిరి గీసుకోలేక పోవడమే తప్పు. దీని తరువాత ఏమిటి? అన్న విషయం ఆలోచించలేకపోవడమే తప్పు.

ప్రతివాడూ సుఖాభిలాషతోనే జీవితాన్ని వెళ్ళబుచ్చుతున్నాడు.మనిషి మాత్రమె కాదు. లోకంలో ప్రతిప్రాణీ సుఖాన్ని కోరుతూ దు:ఖాన్ని వద్దనుకుంటుంది. కాని ఇక్కడే ఒక మెలికను ప్రకృతి ఉంచింది. ఏ సుఖమూ శాశ్వతంగా ఎల్లకాలమూ నిలిచి ఉండదు. తిన్న కాసేపు ఆకలి తీరినట్లు అనిపిస్తుంది. కాసేపటికి మళ్ళీ తలెత్తుతుంది. అలాగే, ఏ ఆనందమూ స్తిరంగా  ఉండదు. నిజానికి ఆనందాన్ని అనుభవిస్తున్న క్షణంలోనే అది ఆవిరైపోతూ ఉంటుంది. ఇది ప్రకృతిలోని అత్యంత కీలకమైన అమరిక. జారిపోతున్న సుఖాన్ని నిలిపి ఉంచడం కోసం మనిషి నిరంతరం పరుగులు తీస్తూ ఉంటాడు. ప్రయత్నిస్తూ ఉంటాడు. అయితే బాహ్యప్రపంచంలో మనకు దొరికే ఏ సుఖమూ శాశ్వతం కాదు. అది క్షణికం మాత్రమె.అందుకే క్షణికాన్ని శాశ్వతం చేసుకుందామన్న భ్రమలోనే మనిషి జీవితం వెళ్ళిపోతున్నది. మళ్ళీ మళ్ళీ అదే ఆనందాన్ని పొందుదాం అన్న భ్రమలోనే మనిషి జీవితం ఆవిరై పోతున్నది. అతని ఆయుస్సు తరిగి పోతున్నది. కాని అదేన్నటికీ జరిగే పని కాదు. బాహ్య విషయాలు ఇచ్చే ఆనందం ఎన్నటికీ శాశ్వతంగా ఉండదు. ఈ విషయం మనిషికి జీవిత చరమాంకంలోనే అర్ధమౌతుంది. చాలామందికి అప్పుడు కూడా విషయం అర్ధంకాదు. అప్పటికే మరణం వచ్చి తలుపు తడుతూ ఉంటుంది. ఇక అప్పుడు చెయ్యగలిగింది ఏమీ ఉండదు. కానీ, చాలా కొద్ది మందికి మాత్రం ఈ మెలిక చిన్నతనంలోనే అర్ధమౌతుంది.

ప్రపంచంలో ఏ వస్తువైనా తనకంటే ఎక్కువ కాదు. వస్తువులు తనకోసం ఉన్నాయి గాని, తాను వాటికోసం లేడు. ఈ సత్యాన్ని మరచి మనిషి వస్తువులకోసం, వాటిని కొనగలిగే ధనంకోసం, విలువైన తన జీవితాన్ని వృధాగా వెచ్చిస్తున్నాడు. కాని అన్నింటికంటే విలువైన తనకోసం మనిషి ఏమీ చెయ్యడం లేదు. తనను తాను తెలుసుకుందామని ప్రయత్నం చెయ్యడం లేదు. 

మనలో ప్రతివారికీ భౌతికమైన తన అడ్రస్ తెలుసు. కాని తానెవరో తెలియదు. ప్రతివారికీ డ్రస్ ఎలా వేసుకోవాలో తెలుసు. కాని ఇప్పటికే మనల్ని ఆవరించి ఎన్ని డ్రస్సులు ఉన్నాయో వాటిని ఎలా వదిలించుకోవాలో ఎవరికీ తెలియదు.  ప్రస్తుతం తాను ఎక్కడ ఉన్నాడో ప్రతివానికీ తెలుసు. కాని ఎక్కడినుంచి ఈ లోకంలోకి వచ్చాడో తెలియదు. ఎలా వచ్చాడో తెలియదు. ఎందుకు వచ్చాడో తెలియదు. ఎన్నాళ్ళు ఉండాలో తెలియదు.ఎప్పుడు పోతాడో తెలియదు. ఎక్కడికి పోతాడో తెలియదు. ఆ తర్వాత ఏమౌతుందో తెలియదు. మళ్ళీ పుట్టుక ఉందొ లేదో తెలియదు. ఈ చక్రభ్రమణం ఎన్నాళ్ళో అసలే తెలియదు. ఇవీ అసలైన మౌలికప్రశ్నలు. మనిషి తనను తాను ప్రశ్నించుకోవలసిన ప్రశ్నలూ, జవాబులు వెదకవలసిన ప్రశ్నలూ ఇవే. కానీ జీవితంలో ఇవి ముఖ్యం కాదులే అనుకుంటూ  ప్రతిసారీ వాయిదా వేస్తూ పోయే ప్రశ్నలు  కూడా ఇవే. 

ఈ ప్రశ్నలు మనిషి వేసుకున్నప్పుడు, అతనిలో ఒక జిజ్ఞాస మొదలౌతుంది. నిరంతరమైన ఆ జిజ్ఞాస క్రమేణా ఒక తపనగా మారుతుంది. ఆ తపన అతనికి ఒక దారిని చూపిస్తుంది. అదే అతన్ని ఒక వివేకానందునిగా మారుస్తుంది. ఒక రమణమహర్షిగా మారుస్తుంది. అప్పుడే అతనికి జీవితంలో ఏది ముఖ్యమో ఏది కాదో తెలుస్తుంది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో తెలుస్తుంది. జీవితంలో దేనివిలువ ఏమిటో అప్పుడే తెలుస్తుంది. ఇప్పటి వరకూ నిరర్ధకంగా గడుపుతున్న జీవితాన్ని ఎలా సార్ధకం చేసుకోవాలో తెలుస్తుంది. ఆ రోజునుంచే అతను నిజంగా జీవించడం మొదలు పెడతాడు. ఎప్పటికీ జారిపోని, శాశ్వతమైన సుఖం కోసం,ఆనందం కోసం ప్రయత్నం చేస్తాడు. చివరికి దానిని అందుకుంటాడు. ఆ క్రమంలో వ్యామోహాన్నీ తృష్ణనూ మాయనూ అధిగమిస్తాడు.

ప్రతి మనిషీ తన జీవితంలో ఏదోనాడు వేసుకోవలసిన మౌలికమైన ప్రశ్నలు ఇవే. వీటికి సమాధానాలను పుస్తకాలనుంచి కాకుండా, అనుభవపూర్వకంగా తెలుసుకున్నప్పుడే మనిషి పరుగు ఆగుతుంది.అప్పుడే అతని జన్మజన్మల దాహం తీరుతుంది. అప్పుడే అతని అన్వేషణ అంతమౌతుంది. అప్పుడు మాత్రమె అతనికి అత్యన్తికమైన శాంతి దొరుకుతుంది. కాని ఆ పనిని ఎందరు చెయ్యగలరు? కోటికి ఒక్కరైనా ఉంటారా? మనిషిని నిరంతరం వెంటాడే కర్మఫలం ఆ పనిని సజావుగా చేయ్యనిస్తుందా? ఆ అనుభవాన్ని పొందటం  అంత సులభం అయితే సందుకొక రమణమహర్షీ, గొందికొక వివేకానందుడూ, ఊరికొక అరవిందుడూ ఉండకపోయారా?

కానీ ఒక్క విషయం చెప్తాను. ఎంత కష్టమైనా సరే ఏదోనాడు ప్రతివారూ ఈ ప్రశ్నలకు జవాబులు వెదుకక తప్పదు. కొందరు ముందూ కొందరు వెనుకా అంతే తేడా. ఎందుకంటే పరిణామక్రమం ప్రకృతిలోని అంతస్సూత్రం. ప్రతివారూ ఏదోనాటికి ఎదిగి పరమ గమ్యాన్ని చెరక తప్పదు. కనుక ఈ ప్రశ్నలు ఎవరికీ వారు వేసుకుని, వాటికి జవాబులు తమ స్వానుభవంనుంచి గ్రహించే ప్రయత్నం ఎంత త్వరగాచేస్తే అంతమంచిది. ఎక్కువ సమయం వృధా అవకుండా ప్రకృతి నిర్దేశించిన గమ్యాన్ని చేరుకోవడం అప్పుడు సులభం అవుతుంది. అప్పుడే మనిషి జీవితం ధన్యం అవుతుంది. లేకుంటే జన్మ తరువాత ఇంకొక జన్మ ఇలా ప్రతిజన్మా వృధా అవుతూనే ఉంటుంది. మనిషి జీవితం నిరర్ధకంగా ఈషణాత్రయంలో గడుస్తూనే ఉంటుంది.


మౌలికమైన ఈ ప్రశ్నలకు ఏదో ఒకనాడు ప్రతి మనిషీ సమాధానాలు వెదకక తప్పదు.
read more " మనిషి జీవితంలో మౌలిక ప్రశ్నలు "

27, మే 2012, ఆదివారం

నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం - "బోర్ వెల్ లో నీళ్ళు ఎన్ని అడుగులలో పడతాయి?"


భవిష్యత్తులో మానవాళిని కబళించబోతున్న అనేక భూతాలలో నీటి ఎద్దడి ఒకటి. మనం చేస్తున్న అనేక పిచ్చిపనుల వల్ల ఇప్పటికే భూమిలో వాటర్ టేబిల్ అడుగంటి పోతున్నది. చంద్రబాబు హయాంలో ఇంకుడుగుంటలు ప్రతి ఇంటికీ ఉండాలని ఒక మంచిప్రయత్నం మొదలు పెట్టారు.దానివల్ల వర్షపు నీరు వృధాగా కాలవల్లో కలిసి పోకుండా భూమిలోకి ఇంకి భూనీటి మట్టం పెరుగుతుంది. కాని దానికి ప్రజలలో సరియైన స్పందన రాలేదు. దానిని అమలు చెయ్యడంలో అధికారులలో చిత్తశుద్దీ లేదు. కాంక్రీట్ రోడ్లు మాత్రం ఎక్కడికక్కడ వేసేసి నగరాలలో మట్టి నేల అనేది కనపడకుండా చేస్తున్నారు. దానితో భూమి నీటితో తడవక వేడి పెరిగి పోతున్నది. భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి.


ఈ నేపధ్యాన్ని అలా ఉంచితే, ఈ మధ్య మా ఫ్లాట్స్ లో భూగర్భ జలం అడుగంటి, ఉన్న బోర్ వెల్ పనిచెయ్యడం ఆగిపోయింది. కొత్త బోర్ వెల్ వేయించవలసి వచ్చింది. ఆ సందర్భంలో, నీళ్ళు ఎంత లోతులో పడతాయి? అని ఒకరు ప్రశ్నించారు. ఆ ప్రశ్న అడిగినప్పుడు నేను ఆఫీస్ కి బయలుదేరుతూ ఉన్నాను. మనసులో ప్రశ్న చక్రం వేసి చూచాను. ఇలా మనసులోనే చక్రం వేసి చూడటానికి ప్రతిరోజూ గ్రహగతిని పరిశీలించే అలవాటు ఉండాలి. పాతకాలంలో ఉదయాన్నే లేచి గ్రహస్తితిని గమనించి పంచాంగ పూర్వక సంకల్పాన్ని నిత్యానుష్టానంలో చెప్పుకునేవారు. కనుక ఆరోజు ఏ ఏ గ్రహాలు ఎక్కడున్నాయి అన్నది వారికి తెలిసేది. నేడు మనకా అలవాటు తప్పింది గనుక పంచాంగం చూచో లేకపోతే ఏదో సాఫ్ట్ వేర్ మీద ఆధారపడో గ్రహగతులను పరిశీలిస్తున్నాము. అలా కాకుండా కొంత అభ్యాసం చేస్తే, అప్పుడు ఏ లగ్నం నడుతున్నది ఏ హోర నడుస్తున్నది ఏ గ్రహం ఎప్పుడు ఏ నక్షత్ర పాదంలోకి మారుతుంది అన్న విషయాలు  మనసులోనే తెలుసుకోవచ్చు.

ఈ ప్రశ్న అడిగినవారికి జవాబుగా - "అనుకున్నట్లు వెంటనే నీరు పడదు. ఆలస్యం అవుతుంది. బోర్ వెల్ మిషన్ చెడిపోతుంది. మళ్ళీ ప్రయత్నిస్తే దాదాపు 300 అడుగుల లోతులో నీరు పడుతుంది." అని చెప్పి నేను నా పనిమీద బయలుదేరి వెళ్లాను.ఇక ఆ విషయం పట్టించుకోలేదు.

అదేరోజు రాత్రి బోర్ వెల్ వెయ్యడం మొదలు పెట్టారు. మామూలుగా పది పన్నెండు గంటలలో అయిపోయే పని పూర్తి కావడానికి దాదాపు ఇరవై నాలుగు గంటలు పట్టింది. తర్వాత తెలిసిన విషయం ఏమిటంటే,మధ్యలో డ్రిల్లింగ్ బిట్ చెడిపోయి ఆరుగంటల పాటు దాన్ని రిపేర్ చేసుకోవడమే సరిపోయిందిట. దాని తర్వాత మళ్ళీ ప్రయత్నించగా వీళ్ళు అనుకున్నట్లు 250 అడుగులలో నీళ్ళు పడకపోతే ఇంకా లోపలి పోగా 300 అడుగులలో నీళ్ళు పడ్డాయి. ఎందుకైనా మంచిదని 350 అడుగులవరకూ వెళ్లడం జరిగింది. 

ఇదంతా గమనిస్తున్న మా అమ్మాయి," ఎలా చెప్పగలిగావు నాన్నా?" అని అడిగింది.తనకూ జ్యోతిష్య విద్యలో కొంత ఆసక్తి ఉండటంతో ఆరోజు నేను మనసులో గుణించిన ప్రశ్న చక్రాన్ని వేసి చూపించి వివరించాను. 

ప్రశ్న సమయంలో శీర్శోదయ రాశి అయిన కన్యా లగ్నం ఉదయిస్తున్నది.   లగ్నాధిపతి అయిన బుధుడు నవమకోణంలో మంచిస్తితిలో ఉన్నాడు. కనుక పని జరుగుతుంది. కాని అతడు నపుంసక గ్రహం కనుక పరిస్తితి ఆశాజనకంగా లేదు. జలసంబంధ ప్రశ్నలలో జల కారక గ్రహాలైన చంద్రుడూ శుక్రుడూ బాగుండాలి.వీరిలో శుక్రుడు వక్ర స్తితిలో ఉన్నాడు. కనుక అనుకున్న పని వెంటనే జరగదు. పైగా లగ్నంలో వక్ర శని కూచుని ఉన్నాడు. కనుక ఖచ్చితంగా అనుకున్న దానికంటే ఆలస్యం అవుతుంది. శని చిత్తా నక్షత్రంలో ఉండటంతో మెషినరీ రిపేర్ వస్తుంది. కాని చంద్రుడు ఆర్ద్రా నక్షత్రంలో ఉండటం వల్ల నీరు పడక తప్పదు. ఆర్ద్ర అంటేనే చెమ్మ, తడి అని అర్ధం కదా. కాని చంద్రుని మీద శని దృష్టి వల్ల అనుకున్న దానికంటే ఆలస్యం కాక తప్పదు.

ఇప్పుడు, అసలు ప్రశ్న విషయం అయిన - "ఎంత లోతులో నీరు పడుతుంది?" అన్నది చూడాలి. చతుర్దానికి పాతాళం అని ఇంకొక పేరు. నీరు ఉండేది పాతాళం లోనే. దానికి అధిపతి గురువు అయ్యాడు. ప్రస్తుతం గోచార రీత్యా బలమైన ఫలితాలు చూపిస్తున్న గ్రహం గురువే. ఆ గురువు జలకారక గ్రహమైన శుక్రుని యొక్క  నవమంలో ఉంటూ మంచిని సూచిస్తున్నాడు. అంతే కాక లగ్నాన్ని చూస్తున్నాడు. కనుక ఆటంకాలు తొలగిస్తాడు.వృషభం భూతత్వ రాశి. కన్య కూడా భూతత్వ రాశే. కనుక భూమికి సంబంధించిన పని  జరుగుతున్నది. సంఖ్యా శాస్త్ర రీత్యా గురువు అంకె 3 కనుక 300 అడుగుల లోతులో నీరు పడవచ్చు. ఎందుకంటే చీరాల మొదలైన సముద్ర తీరాలలో పడేటట్లు గుంటూరులో 30 అడుగులలో నీరు పడే ప్రసక్తే లేదు. కనుక 300 కావచ్చు అని ఊహించాను.

అడిగిన ప్రశ్నకు జవాబు చెప్పబోయే ముందు, ఇంత విశ్లేషణ చెయ్యవలసి ఉంటుందా అని మా అమ్మాయి ఆశ్చర్యపోయింది. అవునంటూ తలాడించాను. "నీవూ నేర్చుకోవచ్చు కదా" అంటే, "ఎందుకూ? ఏదైనా సందేహం వస్తే చెప్పడానికి నీవున్నావుగా" అని నవ్వేసింది.  నేర్చుకుందామని వెతికే వాళ్లకేమో నేర్పేవాళ్ళు దొరకరు. నేర్పుతాను అంటే శ్రద్దగా నేర్చుకునే వాళ్ళూ దొరకరు. అనేక ప్రాచీన విద్యలు ఇలాగే కాలగర్భంలో కలిసిపోయాయి.

ప్రశ్న శాస్త్రం ద్వారా ఇలాంటి విషయాలు కూడా గ్రహించవచ్చు అనడానికి ఇదొక ఉదాహరణ.
read more " నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం - "బోర్ వెల్ లో నీళ్ళు ఎన్ని అడుగులలో పడతాయి?" "

20, మే 2012, ఆదివారం

వృషభరాశిలో గురుసంచారం - ఫలితాలు

17-5-2012 న బృహస్పతి మేషరాశిని వీడి వృషభరాశిలో ప్రవేశించాడు. ఆ రోజునుంచే నర్మదా పుష్కరాలు మొదలయ్యాయి. బృహస్పతి ప్రతిరాశిలో ఏడాది పాటు ఉంటాడు. వృషభ రాశిలో ఆయన 30-5-2013 వరకూ సంచరిస్తాడు. మధ్యలో అక్టోబర్ 4 నుంచి జనవరి 29 వరకూ వక్ర స్తితిలో ప్రవేశిస్తాడు.

ఈ ఏడాది మొత్తంలో గురుగ్రహ సంచార ఫలితాలు పన్నెండు రాశులకూ స్థూలంగా చూద్దాం. సూక్ష్మ వివరాలు వ్యక్తిగత జాతకాలను బట్టి ఉంటాయని గ్రహించాలి. ఎవరి జాతకంలోనైనా రాశీ లగ్నమూ ఒకటే అయితే దానినుంచి ఫలితాలు గ్రహించాలి. అవి వేర్వేరు అయితే రెంటినుంచీ విడివిడిగా చూచి ఆయా ఫలితాలను కలుపుకొని గ్రహించాలి.

మేష రాశి

దూర ప్రాంతాలలో నివాసం ఉంటుంది. త్రిప్పటా, విసుగూ ఉంటాయి. కాని, కష్టపడిన దానికి ఫలితం దక్కుతుంది. ధనసంపాదన మెరుగౌతుంది. గురు అనుగ్రహం పెంచుకుంటే శత్రుబాద తగ్గుతుంది. ఆరోగ్యం బాగుంటుంది.వృత్తిలో పురోగతి ఉంటుంది.

వృషభ రాశి 

జీవితంలో ఎదుగుదల ఉంటుంది.పరిచయాలు పెరుగుతాయి. అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి.గురునింద అనుకొని తీవ్ర ప్రభావాలు చూపిస్తుంది. కనుక మాటమీద అదుపు ఉండాలి. సంతానం వృద్ధిలోకి వస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. కళత్ర సౌఖ్యం బాగుంటుంది.

మిధున రాశి 

ఊహించని ఖర్చులు పెరుగుతాయి.రహస్య శత్రువులు ఎక్కువౌతారు. అయితే ఇంటిలో మనశ్శాంతి దొరుకుతుంది. దీర్ఘ రోగాలతో బాధ పడేవారికి కొంచం ఊరట కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన ఎక్కువౌతుంది. మంత్ర సాధన చేసేవారికి ఫలితాలు త్వరగా కనిపిస్తాయి.

కర్కాటక రాశి 

అనుకోని లాభాలు కలుగుతాయి. ఊరట కలుగుతుంది. పీడిస్తున్న బాధలు తగ్గుతాయి. సమాజంతో సంబంధాలు మెరుగు పడతాయి. సంతానానికి వృద్ధి ఉంటుంది. కళత్ర సౌఖ్యం బాగుంటుంది. అయితే స్వయంకృతాపరాదాల వల్ల ఇంట్లో మనశ్శాంతి కరువౌతుంది.

సింహ రాశి 

చదువూ, వృత్తులలో ఎదుగుదలా గుర్తింపూ వస్తాయి. ధన వృద్ధి ఉంటుంది. కుటుంబ సౌఖ్యం, గృహ సౌఖ్యం ఉంటాయి. శత్రువులు అదుపులో ఉంటారు. ఒకప్పటి శత్రువులు మళ్ళీ మిత్రులౌతారు. కాని వారితో జాగ్రత్తగా ఉండాలి.

కన్యా రాశి 

ఆధ్యాత్మిక చింతనా వైరాగ్యమూ పెరుగుతాయి. తీర్ధయాత్రలు చేస్తారు.ప్రసంగాలూ బోధలూ ఆకర్షిస్తాయి. సంతాన సౌఖ్యం బాగుంటుంది. ధన వృద్ధి ఉంటుంది. అయితే దైవదూషణ గురుదూషణ చేస్తే ఫలితాలు వక్రిస్తాయి.

తులా రాశి 

ఆరోగ్యం మందగిస్తుంది. జీర్ణకోశ బాధలు, పునరుత్పత్తి వ్యవస్థ బాధలూ ఎక్కువౌతాయి. ఖర్చులు పెరుగుతాయి.అయితే సమయానికి ధనం అందుతుంది.ఇంటిలోని వారి ఆసరా ఉంటుంది. సమాజంలో గౌరవం బాగా ఇనుమడిస్తుంది.

వృశ్చిక రాశి 

స్నేహితుల సహాయం ఉంటుంది. సమాజంతో సంబంధాలు పెరుగుతాయి. లాభాలు అందుతాయి. అనుకున్న పనులు నెరవేరతాయి. అయితే భారీ ఖర్చులు పెట్టవలసి వస్తుంది. గురుదృష్టి వీరిపైన పడుతుంది. ఎన్నాళ్ళ నుంచో ఎదురు చూస్తున్న సాధనా మార్గంలో అడుగు పెడతారు. అంతచ్చేతనలో దాగిఉన్న భావాలు కదలికకు లోనౌతాయి.తీవ్ర భావోద్వేగాలకు గురవుతారు.

దనూ రాశి 

ధైర్యం పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. సమయానికి తిండీ నిద్రా ఉండేట్లు చూచుకోవాలి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఉద్యోగం లేనివారికి ఈ సమయంలో ఉద్యోగం దొరుకుతుంది. ఖర్చులు పరుగుతాయి. కుటుంబ సౌఖ్యం ఆదాయం బాగుంటాయి. అనుకున్నవి  జరుగుతాయి. జీవితం లాభయుతంగా ఉంటుంది. 

మకర రాశి 

ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. మంత్ర సాధన ఫలిస్తుంది. తీర్ధయాత్రలు చేస్తారు. గురువులను సేవిస్తారు.లాభాలు కలుగుతాయి.గురు అనుగ్రహం దైవానుగ్రహం వీరి పైన పడుతుంది. వృత్తిలో,ఉద్యోగంలో అభివృద్ధి వస్తుంది. అయితే వీరు గురునిందకు దూరంగా ఉండాలి.

కుంభ రాశి 

ఊహించని ఖర్చులు పెరుగుతాయి. అయితే గృహసౌఖ్యం ఉంటుంది. ఆరోగ్య ఇబ్బందులు ఎదురైనా చికిత్సతో అవి తగ్గుముఖం పడతాయి. వృత్తిలో పురోగతి ఉంటుంది. ఆధ్యాత్మిక చింతనా తీర్ధ యాత్రలూ ఎక్కువౌతాయి.

మీన రాశి 

సమాజంతో సత్సంబంధాలు వృద్ధి అవుతాయి. ఇతరులతో వ్యాపారాలు కలిసొస్తాయి.ఆధ్యాత్మిక చింతన,మహనీయుల దర్శనం కలుగుతాయి. అయితే దీర్ఘరోగాలు, గుహ్యరోగాలు పీడిస్తాయి.

గురు అనుగ్రహాన్ని పెంచుకుంటే ఇవన్నీ పూర్తిగా జరుగుతాయి. దానికి ప్రతిగా తెలిసో తెలియకో గురుదోషాన్ని పెంచుకుంటే మంచి జరగవలసిన చోట కూడా చెడు ఎదురౌతుంది. 

ఇవి స్థూల ఫలితాలు మాత్రమె. సూక్ష్మ ఫలితాలు వారి వారి వ్యక్తిగత జాతకాలను బట్టి జరుగుతాయి. ఆయా జాతక వివరాలతో ఈ గోచార ఫలితాలు మిళితం చేసుకొని వివరాలు అర్ధం చేసుకోవాలి.
read more " వృషభరాశిలో గురుసంచారం - ఫలితాలు "

18, మే 2012, శుక్రవారం

సాధన

ఈ మధ్య ఒక పెద్దాయన కలిశాడు. మంచి పండితుడు. సంస్కృతం బాగా చదువుకున్నాడు.మంత్ర శాస్త్రం మీద పరిశోధన చేస్తున్నాను అని చెప్పుకుంటాడు.

"ఏం నాయనా. ఏమిటి విషయం? ఏదో సాధన అంటూ మాట్లాడుతున్నావుట ఈ మధ్యన?" అన్నాడు.

ఆయన నాకు స్వల్ప పరిచయస్తుడే కాని సరాసరి నాతో బాగా పరిచయం ఉన్నవాడు కాదు. వారి ద్వారా వీరిద్వారా నా గురించి ఏదో విన్నాడు. 

"నేను నా చిన్నప్పటి నుంచీ ఇదే మాట్లాడుతున్నాను. మీరు ఈ మధ్యనే విన్నట్లు ఉన్నారు" అన్నాను.

"ఇంతకీ నీవు చేసేది ఏ సాధన? ఏ మహామంత్రాన్ని నీవు ఉపాసించావు? తెలుసుకోవచ్చా?" అడిగాడు. సాధన అంటే ఏదో ఒక మంత్రాన్ని ఉపాసించడమే అనుకునే  బాపతు మనుషులు కొందరు ఉంటారు. ఈయనా ఆ కోవకు చెందినవాడే.

"తెలుసుకోకూడదు" చెప్పాను.

"పోనీ  అసలు సాధన అంటే నీ అభిప్రాయం ఏమిటి? అదైనా చెప్పు" 

"మొదట్లో పోగుచేసుకోవటం, తర్వాత ఊడ్చి పారేయ్యటం, ఈ సారి ఇంకా  ఎక్కువగా పోగు చేసుకోవటం, ఇదే నాకు తెలిసిన సాధన" చెప్పాను.

నాకు కొంచం పిచ్చేమో అన్న భావం ఆయన ముఖంలో కదలాడింది. కాని సంస్కారం అడ్డొచ్చి  మాట బయటికి రాలేదు.

"కొంచేమేమీ కాదు. బాగానే ఉంది" మళ్ళీ నేనే అన్నా. 

"ఏమిటి?" అన్నాడు ఆయన అయోమయంగా. 

"అదే. పిచ్చి." అన్నాను.

"నీవు సాధన గురించి చెప్పినది నాకు అర్ధం కాలేదు. కొంచం వివరిస్తావా?" అడిగాడు.

"వివరించే సాధన నాకు తెలీదు" అన్నాను.

మా సంభాషణ అంతటితో ముగిసింది.
read more " సాధన "

12, మే 2012, శనివారం

చీకటి -- వెలుతురు


ప్రాచీనకాలంలో ఇద్దరు స్నేహితులుండేవారు. 
చర్చలు చెయ్యడం అంటే వారికి భలే ఇష్టంగా ఉండేది.
అందులోనూ తత్వశాస్త్రాన్ని గురించి వాళ్ళు తరచుగా చర్చిస్తూ ఉండేవారు.
"చీకటి అంటే ఏమిటి" అన్న విషయాన్ని గురించి ఒకరోజు చర్చ మొదలు పెట్టారు.

అసలు చీకటి ఎలా వస్తుంది? 
దానివల్ల నష్టాలేమిటి? 
వెలుగుకీ చీకటికీ ఉన్న సంబంధం ఏమిటి? 
వెలుగు లేకపోవడమే చీకటా? 
లేక దానికి ఒక ప్రత్యెక ఉనికి ఉందా? 
చీకటి లేకపోవడం వెలుగా?
చీకటి మనుషుల్ని ఎంత బాధ పెడుతుంది? 
ఎలా బాధ పెడుతుంది?
ఇత్యాది విషయాలపైన ఉదయం మొదలైన చర్చ సాయంత్రం అయినా అలాగే సాగుతోంది. ఎటూ తేలడం లేదు. 
ఇంతలో చీకటి పడింది.
వీళ్ళు దానిని పట్టించుకోకుండా అలాగే చీకట్లోనే కూచుని వాదించుకుంటూ ఉన్నారు.

ఇదంతా ఇంకొక వ్యక్తి మౌనంగా వింటున్నాడు.
చాలాసేపు వినీవినీ ఆ వ్యక్తి ఒక పని చేశాడు.
ఒక కొవ్వొత్తిని వెలిగించి వారివద్ద పెట్టి, మౌనంగా అక్కడనుంచి నిష్క్రమించాడు.
--------------------------------------------------
లోకం అంతా చీకటితో నిండి ఉందన్న విషయం సత్యం. ఇది భౌతికమైన చీకటి కాదు. భౌతికంగా చూస్తె రాత్రిని పగలుగా మార్చే పరిజ్ఞానం మనకు తెలుసు. కాని మనిషి లోపల ఉన్న చీకటిని వెలుతురుగా మార్చే పరిజ్ఞానం మనకు తెలియదు.

మనుషులందరూ చీకటిలో కూచుని చీకటి గురించి చర్చిస్తూ ఉన్నారు. దానిని ఎలా పోగొట్టాలి అని వాదప్రతివాదాలు చేస్తున్నారు.కాని ఒక్కరు
కూడా లేచి దీపం వెలిగిద్దామని ప్రయత్నం చెయ్యటం లేదు. వాదాలతో చీకటి పోదు. దీపం వెలిగిస్తేనే అది మాయం  అవుతుంది. దీపం వెలిగించడం అంటే సాధన  చెయ్యడం. జ్ఞానజ్యోతిని వెలిగించడం.

మనిషికి కావలసింది వాదన కాదు. ఆచరణ కావాలి. 
మనిషి చెయ్యవలసింది విషయసేకరణా, బోధనా కాదు. 
స్వీయసాధన  చేయాలి.
చీకటిని గురించిన చర్చ ముఖ్యం కాదు.
దీపాన్ని వెలిగించడమే ముఖ్యం. 
అది చెయ్యనంతవరకూ చీకటి పోదు.

చర్చలు జోరుగా సాగవచ్చు. ఆనందాన్ని ఇవ్వవచ్చు.
కాని చర్చలు చేసేవారు చీకటిలోనే ఉంటారు.
తత్వచింతన ముఖ్యం కాదు.
నిత్యశోధన  ఉండాలి. 
సత్యసాధన  కావాలి.
అప్పుడే  చీకటి మాయం అవుతుంది. 
అప్పుడే మనిషి జీవితం ధన్యం అవుతుంది.
read more " చీకటి -- వెలుతురు "

10, మే 2012, గురువారం

మహావీరుల జాతకాలలో కుజకేతువుల ప్రభావం

యుద్ధ విద్యలకు కారకుడు అంగారకుడు లేదా కుజుడు.ఒక వ్యక్తి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోవాలన్నా వాటిలో ప్రావీణ్యం సంపాదించాలన్నా అతనికి కుజుని అనుగ్రహం ఉండాలి.కుజునికి అధిదేవత అయిన సుబ్రమణ్యస్వామిని దేవసేనాపతి అంటారని మనకు తెలుసు.దివ్యశక్తుల సైన్యానికి ఆయన సేనాపతి.కనుక యుద్ధవిద్యలు నేర్వాలంటే ఆయన అనుగ్రహం తప్పక ఉండాలి.కుజుడు ఆత్మకారకునిగా ఉన్న జాతకాల్లో ఇతర కాంబినేషన్స్ కలిస్తే ఆ జాతకునికి వీరవిద్యలు ఖచ్చితంగా వస్తాయి.

ఆయా యోగాలవల్ల ఏ విధమైన మార్షల్ఆర్ట్ ఆజాతకునికి వస్తుందో,అతనికి  ఆ విద్య ఎలా ఉపయోగపడుతుందో తెలుసుకోవచ్చు."కుజవత్ కేతు" అనే సూత్రం ప్రకారం, కేతువు కుజుని లక్షణాలు కలిగి ఉంటాడు. ఇక కుజ కేతువులు ఒక జాతకంలో కలిస్తే ఆ జాతకునికి మార్షల్ ఆర్స్ లో నైపుణ్యాన్ని తప్పక ఇస్తారు. ఒకరకంగా మార్షల్ ఆర్ట్స్ అనేవి హింసకు సంబంధం ఉన్న విద్యలే కనుక కుజ కేతువుల హింసా ప్రవృత్తి వీటిలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. ఈ జాతకులలో అమితమైన శక్తి ఉంటుంది. ఇప్పుడు కొందరు ప్రముఖ వీరుల జాతకాల్లో కుజకేతువులను పరిశీలిద్దాం.

మొదటగా టైగర్ క్రేన్ కుంగ్ ఫూ లో ఉద్దండుడైన "వాంగ్ ఫే హంగ్" జాతకాన్ని చూద్దాం. ఈయన 9-7-1847 న చైనాలోని ఫోషాన్ లో జన్మించాడు.ఈయన కుంగ్ఫూ విద్యలో మహావీరుడే కాక, ఆక్యుపంచర్ లో మంచి ప్రజ్ఞాశాలి. ప్రముఖ వైద్యుడు,విప్లవవీరుడు. అయిదేళ్ళ వయసులో ఈయన కుంగ్ఫూ నేర్చుకోవడం మొదలుపెట్టాడు. పదమూడేళ్ళు వచ్చేసరికి ఒక మాస్టర్ గా ఎదిగాడు. ఈయన "షాడో లెస్ కిక్" అనే ఒక కిక్ ను కనిపెట్టాడు. ఈయన రకరకాల ఆయుధాలను వాడటంలో కూడా మంచి నైపుణ్యం కలవాడు. ఒకసారి చేతికర్రను ఆయుధంగా వాడి ముప్పైమంది బందిపోట్లను తరిమికోట్టాడు.   ఈయన మీద వందకు పైగా సినిమాలు వచ్చాయి. జెట్ లీ హీరో గా నటించిన "Once upon a time in China" సీరీస్ అన్నీ ఈయన జీవితాన్ని ఆధారంగా తీసుకొని నిర్మించినవే. జాకీ చాన్ హీరోగా ఇరవై ఏళ్ల క్రితం వచ్చిన "The young master" సినిమా కూడా ఆయన జీవిత గాధ ఆధారంగా తీసినదే. ఈయన జాతకంలో కుజకేతువులు ఖచ్చితమైన డిగ్రీ కంజంక్షన్ లో ఉండటం చూడవచ్చు. వారిద్దరూ మీనరాశి 22 డిగ్రీల మీద రేవతీ నక్షత్రంలో ఉన్నారు. బుధుడు కర్కాటకరాశిలో స్వనక్షత్రం లో ఉండటం, చంద్రుడు ఉచ్చ స్తితిలో ఉండటం చూడవచ్చు. అందుకే ఈయనకు వీరవిద్యలతో బాటు మంచి వైద్యుడు అన్న పేరూ ఉంది. చైనీస్ మిలిటరీకి ఈయన మార్షల్ ఆర్ట్స్ శిక్షకుడిగా,వైద్యుడిగా ఉండేవాడు. ఈయన 70 ఏళ్ళు పైన బతికాడు. నాలుగు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు.

రెండవ జాతకానికి మనం మూడుసార్లు ప్రపంచ వూషూ చాంపియన్ అయిన గోల్డెన్ గర్ల్ "జు హుయిహుయి"జాతకాన్ని తీసుకుందాం. ఈమె 2008 ఒలింపిక్స్ లో "వూషూ" లో ప్రధమ స్థానంలో నిలిచింది. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరంగా ఎక్కడో పెరిగి తన తల్లి అడుగుజాడలలో నడిచి వీరవిద్యలు అభ్యాసం చేసింది. ఏళ్ల తరబడి అభ్యాసం తర్వాత తిరుగులేని వీరవనితగా రాటుదేలింది. తర్వాత ఈ అమ్మాయి అనేక సినిమాలలో నటించింది. ఈమె చేసే విన్యాసాలు చూస్తె అసలు ఈమె శరీరంలో ఎముకలు ఉన్నాయా లేవా అని అనుమానం కలుగుతుంది. వెపన్స్ ను ప్రయోగించడం లోనూ, వెపన్ లెస్ ఫామ్స్ చెయ్యడం లోనూ ఈమె వేగం అనితర సాధ్యం. ఈమె జాతకంలో కూడా కుజ కేతువులు 10 డిగ్రీల మీద ఉన్నప్పటికీ, వేర్వేరు రాశులలో ఉన్నారు. కుజుడు శనితో కలసి శని నక్షత్రంలో స్వరాశిలో ఉంటూ అమిత శ్రమకు ఓర్చి చెమటలు కార్చి నేర్చుకున్న వీరవిద్యలను సూచిస్తున్నాడు. కేతువు కుజునికి ద్వాదశంలో రాహు నక్షత్రంలో ఉన్నాడు. 

వాంగ్ ఫే హంగ్ జాతకానికీ ఈమె జాతకానికీ తేడా ఏమిటంటే, వాంగ్ ఫే హంగ్ నిజజీవితంలో వీరుడు. ఈమె ప్రదర్శన కళ అయిన వూషూ లో నిపుణురాలు. నిజజీవితంలో ఈమె వీరవిద్యలను వాడే అవసరం రాలేదు. కాని వాంగ్ ఫే హంగ్ నిజజీవితంలో వీరుడే గాక మిలిటరీకి శిక్షకుడు. అందుకే ఆయన జాతకంలో కుజకేతువులు ఒకే డిగ్రీ మీద కలిసి ఉన్నారు. కాని ఈమె జాతకంలో అలా లేరు. సినిమారంగానికీ వినోదరంగానికీ చెందిన తులారాశిలో కేతువు ఉంటూ,శుక్రున్ని సూచిస్తూ ఈమెకు ఆయా వినోదరంగాలలో ప్రవేశం ఇచ్చాడు. అందుకే ఈమె సినిమాలకూ క్రీడలకూ అంకితం అయ్యింది. వాంగ్ ఫే హుంగ్ జాతకంలో కేతువు గురువును సూచిస్తున్నాడు. అందుకే ఆయన ఒక సాంప్రదాయబద్దమైన  మార్షల్    ఆర్ట్స్  గురువు అయ్యాడు.

ఈ విధంగా రకరకాల తేడాలున్న కాంబినేషన్స్ ద్వారా కుజకేతువులు వివిధ రకాలైన మార్షల్ ఆర్ట్స్ నైపుణ్యాన్ని ఇస్తారని మనం ఒక జాతకంలో గమనించవచ్చు.
read more " మహావీరుల జాతకాలలో కుజకేతువుల ప్రభావం "