25, ఫిబ్రవరి 2018, ఆదివారం

పాపం శ్రీదేవి !


13-8-1963
సినీనటి శ్రీదేవి చనిపోయింది. అందులోనూ అర్ధాంతరంగా 54 ఏళ్ళకే పోయింది. ఈ అంకె నిజమో కాదో నాకు తెలీదు. వికీ సోర్స్ నుంచి అనుకోడమే.

మరిప్పుడు ఈమె జాతకం చూడకపోతే మన పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లుతుంది గనుక చూడక తప్పదు. ఇష్టం లేకపోయినా కొన్ని కొన్ని పనులు నా అభిమానులకోసం చెయ్యాల్సి వస్తోంది. ఏం చేస్తాం ?

ఈమె అందచందాలకు ముగ్డులైపోయి ఈనాటికీ ఈమెను ఆరాధిస్తున్న పిచ్చోళ్ళు చాలామంది ఉన్నారు. వారికి ఈ వార్త బాధాకరమే గాని, వాస్తవాలను గమనిద్దాం. షావుకారు జానకి, కాంచన లాంటి పాత తరం హీరోయిన్లు ఈరోజుకూ చక్కగా హాయిగా ఉన్నారు. ఈ మధ్యతరం హీరోయిన్లు మాత్రం హటాత్తుగా హరీమంటున్నారు. కారణాలేమై ఉంటాయో?

25-2-2018
పాతకాలం వాళ్ళకు కొన్ని విలువలున్నాయి. జీవితంలో ఎంతసేపూ గ్లామర్ ఒక్కటే వాళ్లకు ప్రధానం కాదు. వయసుతో బాటు వచ్చిన మార్పులను హుందాగా స్వాగతిస్తూ, అనవసరమైన కాస్మెటిక్ ఆపరేషన్లూ గట్రాల జోలికి పోకుండా, ఆహార నియమాలు పాటిస్తూ, హైఫై జీవితం జోలికి పోకుండా, యోగాభ్యాసం చేస్తూ ఎనభైలు దాటినా వాళ్ళు హాయిగా జీవిస్తున్నారు. ఈకాలపు హీరోయిన్లేమో అనవసరమైన మందులు వాడుతూ, సర్జరీలు చేయించుకుంటూ, వయసు పైబడుతున్నా ఇంకా కుర్రపిల్లల్లా కనిపించాలన్న భ్రమలో మధ్యలోనే హరీమంటున్నారు.

కొన్ని నెలల క్రితం పెదిమలు కొంత బండగా కనిపించడం కోసం శ్రీదేవి ఏదో సర్జరీ చేయించుకుందని వార్తలొచ్చాయి. అది విన్నప్పుడు లైపో సక్షన్ చేయించుకుని చనిపోయిన ఆర్తీ అగర్వాల్ నాకు గుర్తొచ్చింది. ఇలాంటి సర్జరీల వల్ల ఇలాంటి ప్రమాదాలు చాలా ఉంటాయి. కానీ ఆ సర్జన్లు ఇవేవీ చెప్పరు. దానికీ దీనికీ సంబంధం లేదని అంటారు. అంతా సేఫ్ అని నమ్మిస్తారు. జనం కూడా వాళ్ళ మాటల్ని నమ్ముతారు.

ఆ తర్వాత ఇరవై ఏళ్ళకు ఒక సైన్స్ జర్నల్లో ఇలా వ్రాస్తారు.

' ఫలానా సర్జరీ తర్వాత వాడే ఫలానా మందు వల్ల గుండె దెబ్బతింటుంది అని ఈ మధ్యనే మా ఇరవైయేళ్ళ పరిశోధనల్లో తెలిసింది. అందుకని ఆ మందును యూరప్ అమెరికా మార్కెట్లో మాత్రం ప్రస్తుతానికి నిషేధిస్తున్నాం. మిగతావాళ్ళు ఏమైపోయినా మాకనవసరం.'

ఈ లోపల ఆ మందును విచ్చలవిడిగా వాడేసి మిగతా ఖండాలలో దేశాలలో జనం ఒళ్ళు గుల్ల చేసుకుని చనిపోతూనే ఉంటారు. హేతువాదులకూ సైన్సువాదులకూ ఇలాంటి విషయాలు కనిపించవు గాక కనిపించవు !

ఈ వీడియోని చూడండి మరి !
https://www.youtube.com/watch?v=0g201YThZJc

54 ఏళ్ళు వచ్చాక మూతి ఎలా ఉంటే ఏమైంది? ముక్కు ఎలా ఉంటే ఏమైంది? అని సామాన్యులమైన మనం అనుకోవచ్చు గాక. గ్లామర్ డాల్స్ అలా అనుకోవు కదా ! హిందీ నటుడు దేవానంద్ తన హెయిర్ స్టైల్ కుర్రవయసులో ఉన్నట్టే కనిపించడం కోసం చనిపోయే ముందు కూడా జుట్టుమీద ఏడాదికి లక్షల్లో ఖర్చు చేసేవాడుట. సినీ పక్షులందరూ అలాంటి వాళ్ళే. ఎందుకంటే వాళ్లకు శరీరమే కదా పెట్టుబడి ! అది గ్లామరస్ గా ఉన్నంతవరకే వాళ్ళ జీవితాలు ! అందుకని అలాంటి జాగ్రత్తలు తప్పవేమో మరి !

ఎన్ని మందులు వాడినా, ఎన్ని సర్జరీలు చేయించుకున్నా, చివరకు వాటి సైడ్ ఎఫెక్ట్స్ తో ఒళ్ళు గుల్ల అవడమే గాని ఉపయోగం అంటూ ఏమీ ఉండదు. బొటోక్స్ ఇంజెక్షన్లూ, సిలికాన్ ఇంప్లాంట్ లూ హైఫై సొసైటీలో మామూలే కావచ్చు. కానీ అవన్నీ సహజసిద్ధమైన ఆరోగ్యాన్ని గుల్లచేసి పారేస్తాయని చాలామందికి తెలీదు. ఆహార నియమం, యోగాభ్యాసం, నియమాలతో కూడిన జీవితంతో వచ్చే ఆరోగ్యం ఇలాంటి పిచ్చి పనులతో ఎప్పటికీ రాదు.

నానమ్మాళ్ చూడండి ! తొంభై ఏళ్ళ వయసులో కూడా ఎంత ఆరోగ్యంగా ఉందో? ఆమె ఏ మేకప్ చేసుకోకపోయినా ఆమెలో జీవకళ ఉంది. అదేమరి యోగాభ్యాస మహిమ అంటే ! నేటి హీరోయిన్లు ఎన్నెన్ని మేకప్ లు వేసుకున్నా వాళ్ళ మొహాల్లో జీవకళ ఉండదు. మామూలుగా వాళ్ళు అంత అందంగా ఏమీ ఉండరు. మేకప్ లేకపోతే వాళ్ళ ముఖాలు చాలా కళావిహీనంగా ఉంటాయి.

సరే ఎవరెలా పోతే మనకెందుకు గాని, శ్రీదేవి జాతకాన్ని ఒకసారి చూద్దాం, వికీ సోర్స్ నిజమే అయితే !

రెండు ముఖ్యమైన యోగాలు ఈమె మరణాన్ని సూచిస్తున్నాయి.

1. జననకాల సూర్య శుక్రులు ఈమెకు కర్కాటకంలో ఉన్నారు. వీరిమీదకు గోచార రాహువు ప్రస్తుతం సంచరిస్తున్నాడు. సూర్యునిపైన రాహువు సంచారం ప్రాణగండాన్ని సూచిస్తుంది. అంతేగాక, గ్లామర్ కూ, మేకప్ కూ, అందానికీ కారకుడైన శుక్రుని మీదకు రాహుసంచారం వల్ల సర్జరీ వల్ల ప్రమాదం అని సూచన ఉంది. అదీగాక ఆ శుక్రుడు ఆమె జాతకంలో అస్తంగతుడై ఉన్నాడు మరి !! 

2. గోచార యముడు (ప్లూటో) ధనుస్సు 26 డిగ్రీలలో ఉంటూ ఈమె జననకాల గ్రహాలలో చాలావాటితో ప్రస్తుతం చాలా దగ్గర దృష్టులలో ఉన్నాడు.

>కర్కాటకంలో ఉన్న జననకాలసూర్యునితో, ఖచ్చితమైన షష్టాష్టకదృష్టిలో ఉంటూ మరణాన్ని సూచిస్తున్నాడు.

> మీనంలో ఉన్న జననకాల గురువుతో ప్రతికూల కేంద్ర దృష్టిలో ఉన్నాడు.

> జననకాల శని మకరంలో 26 డిగ్రీలలో వక్రించి ఉన్నాడు. ఈయన్ను ధనుస్సులోకి స్వీకరిస్తే సరిగ్గా గోచార యముని (ప్లూటో) తో కలుస్తాడు. ఇది ఖచ్చితమైన మరణగండం. ఎందుకంటే శనీశ్వరుడూ ప్లూటో ఇద్దరూ మరణానికి కారకులే. ఒకే డిగ్రీమీద ప్రస్తుతం ఉన్నారు. ఇది మరణ గండమే.

> అంతేగాక, గోచార ప్లూటో, జననకాల కేతువుమీద సంచరిస్తూ రాహువు దృష్టికి లోనౌతున్నాడు. ఇవన్నీ మరణ సూచనలే.

అయితే, కర్కాటకం అనేది సహజ చతుర్ధంగా గుండెకు సూచిక. అక్కడ ఉన్న జననకాల సూర్యుడు కూడా గుండెకే సూచకుడు. అక్కడకు ప్రస్తుతం వచ్చిన రాహువు గుండెపోటును సూచిస్తున్నాడు. అందువల్లే మరణం జరిగి ఉండవచ్చు. కానీ ఆ గుండెపోటుకు దారితీసిన పరిస్థితులు మాత్రం, కాస్మెటిక్ సర్జరీలూ, వాటితో వాడిన మందులూ,వాటి సైడ్ ఎఫెక్ట్ లూ అని నా అభిప్రాయం.

గ్లామర్ వరల్డ్ లో మైకేల్ జాక్సన్ నుంచి నేటి శ్రీదేవి వరకూ అందరూ 'నేను ఇంకా అందంగా లోకానికి కనిపించాలి' అన్న ఒక్క ఆలోచనకు బలి అయినవారే అని నా ఊహ ! కుహనా సౌందర్యదేవత పాదాలదగ్గర ఎంతమంది ఇలా ప్రాణాలు అర్పించాలో?

అసలూ - నిజమైన సౌందర్యం అంటే ఏమిటి? అదెక్కడుంటుంది? అది మేకప్ లో ఉంటుందా? డ్రస్సులో ఉంటుందా? లేక స్వచ్చంగా వెలిగే అంతరంగంలోనూ అది బయటకు ప్రతిఫలించే కళ్ళలోనూ ఉంటుందా? జీవం లేని ప్లాస్టిక్ నవ్వులలో అది ఉంటుందా? లేకపోతే నిష్కల్మషంగా హృదయంలో నుంచి పొంగి వచ్చే సంతోషపు నవ్వులో ఉంటుందా? కృత్రిమంగా తెచ్చుకునే వంపుసొంపులలో అది ఉంటుందా? లేక సహజసిద్ధమైన వ్యాయామాల వల్ల వచ్చే ఫిట్నెస్ లో ఉంటుందా?

జీసస్ అన్న మాట ఒకటి గుర్తుకొస్తోంది.

'ప్రపంచంలో ఒకడు అన్నీ సంపాదించినా చివరకు తన ఆత్మను పోగొట్టుకుంటే అందువల్ల ఉపయోగం ఏముంది?'

కోరికలు తీరకుండా అర్ధాంతరంగా పోయినవాళ్ళు ప్రేతాత్మలౌతారని అంటారు. సిల్క్ స్మిత అలాగే దయ్యమైందని ఒక పుకారు చాలా బలంగా సినీ ఇండస్ట్రీలో ఉంది. ఇప్పుడు శ్రీదేవి కూడా అలాగే అర్ధాంతరంగా పోయింది. ఈమె ఏమౌతుందో చూడాలి మరి !!
read more " పాపం శ్రీదేవి ! "

23, ఫిబ్రవరి 2018, శుక్రవారం

Makkal Needi Mayyam Party - Astro analysis

21-2-2018 బుధవారం రాత్రి 7.35 ప్రాంతంలో మదురైలో నటుడు కమల్ హాసన్ తన రాజకీయ పార్టీని ప్రారంభించాడు. దానిపేరు 'మక్కల్ నీది మయ్యం' (ప్రజాన్యాయ కేంద్రం) అంటున్నాడు. చిరంజీవి పెట్టిన ప్రజారాజ్యం పార్టీ పేరులాగే ఇదీ ధ్వనిస్తోంది. దీని జాతకం ఎలా ఉందో చూద్దాం.

నాస్తికుడిని అని చెప్పుకునే కమల్ కూడా తన పార్టీని ప్రకటించే సమయాన్ని జాగ్రత్తగా జ్యోతిష్యపరంగా ఎంచుకోవడం ఈ కుండలిలో కనిపిస్తోంది. కనుక తను చెప్పేది ఒకటి చేసేది ఒకటి అనేది క్లియర్ గా తెలుస్తోంది. ఎలాగో చూద్దామా?

స్థిరలగ్నము, అధికార రాశీ అయిన అయిన సింహలగ్నంలో, సూర్య హోరలో, దశమాధిపతి శుక్రుడు నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండేటట్లు, అలాగే సింహలగ్నానికి యోగకారకుడైన కుజుడు కూడా నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉండేటట్లు చూచుకుని మరీ, పార్టీని సరిగ్గా ఆ సమయంలో ప్రకటించాడు. కనుక ఇతనికి జ్యోతిష్కుల సలహా ఉంది అని ఖచ్చితంగా అర్ధమౌతున్నది. మరి తను నాస్తికుడినని ఎలా చెప్పుకుంటాడో అర్ధం కాదు. బహుశా చెప్పేదొకటి చేసేదొకటి కావడమే రాజకీయాలలో ముఖ్యమైన అర్హతేమో?

అయితే 'తానొకటి తలచిన దైవమొకటి తలచును' అన్న సామెతకు అనుగుణంగా, ఈ ముహూర్త చక్రంలో లోపాలేంటో చెప్తా వినండి. ఎందుకంటే స్థూల ముహూర్తం వేరు, సూక్ష్మ ముహూర్తం వేరు. రెండోది ఎలా పెట్టాలో చాలామంది జ్యోతిష్కులకు తెలియదు. చివరకు, పంచాంగాలు వ్రాసే ఉద్దండులకు కూడా ఈ రహస్యాలు తెలియవు. మనిషి అలా ప్రతిదాన్నీ ముహూర్తంతో బాగుచేసుకునే పనైతే ఇక విధి ఎందుకు, కర్మ ఎందుకు?

మనిషి చేసేవన్నీ చేసేసి, మంచి ముహూర్తం పెట్టుకుని పాత కర్మను అధిగమిస్తాను అంటే కుదరదు. పూర్వకర్మ అనేది సూక్ష్మస్థాయిలలో ముహూర్తబలాన్ని అధిగమిస్తుంది. మహర్షి అయిన వశిష్టుడు శ్రీరామునికి పెట్టిన పట్టాభిషేక ముహూర్తం ఎందుకు విఫలం అయింది? ధౌమ్యుడు రాజగురువుగా ఉన్నప్పటికీ పాండవులు అన్ని కష్టాలు ఎందుకు పడ్డారు? అన్నింటికీ ముహూర్తాలు చూచుకుని మంచి జరిగేటట్లు చేసుకోవచ్చు కదా? మహారాజైన హరిశ్చంద్రుడి చేతిలో జ్యోతిష్కులు లేరా? ఆయన ఎందుకు అన్ని కష్టాలు పడ్డాడు? మొదలైన సందేహాలకు ఇదే సమాధానం.

ముహూర్తం కొంతవరకే పని చేస్తుంది. పూర్వకర్మను అది పూర్తిగా తీసెయ్యలేదు. అలా తీసేయ్యగలిగితే ప్రపంచంలో ఎక్కడా ఏ కష్టమూ ఉండదు. ప్రతిపనికీ అందరూ పంచాంగాలు చూచుకుని ముహూర్తాలు పెట్టుకుని హాయిగా మంచి ఫలితాలు పొందుతూ ఉండవచ్చు. కానీ, నూటికి నూరు శాతం మంచి ముహూర్తం అనేది ఎక్కడా ఉండదు. "అల్పదోషం గుణాధిక్యం సర్వేషాం సమ్మతం మతమ్" అనేదే ముహూర్త సమయంలో ఆచరించవలసిన సూత్రం. నూటికి నూరుపాళ్ళు మంచి మనిషి ఎలాగైతే ఉండడో, నూటికి నూరు పాళ్ళు మంచి ముహూర్తమూ ఎక్కడా ఉండదు. కాలంలోని ప్రతిక్షణంలో మంచీ చెడూ కలిసే ఉంటాయి. కొంతలో కొంత మంచి సమయాన్ని ఎంచుకోవడమే ముహూర్తం చేసే పని.

ఇప్పుడు విషయంలోకి వద్దాం.

లగ్నాధిపతి అయిన సూర్యుడు సప్తమంలో అస్తమిస్తూ ఉండటం మంచి సూచన కాదు. కనుక ఈ పార్టీ అధికారంలోకి రావడం చాలా కష్టం.

అంతేకాదు సప్తమంలో సూర్యుడు కాక రెండు గ్రహాలున్నాయి. అవి ఇప్పటికే రాజకీయంలో పండిపోయి ఉన్న రెండు పార్టీలైన DMK, ADMK పార్టీలకు సూచికలు. లగ్నాధిపతి సూర్యుడు వాటితో చేరడం, ఎన్ని మాటలు చెప్పినప్పటికీ MNM పార్టీ తన ప్రత్యర్ధులకు తలొగ్గలసిందే అనీ, స్వతంత్రంగా తనంత తానుగా మనుగడ సాగించలేదనీ సూచిస్తున్నది. 

ఈ లగ్నానికి కుజుడు యోగకారకుడే కాదు బాధకుడు కూడా. కనుక మిశ్రమ ఫలితాలు ఇస్తాడు. ప్రజలను సూచించే నాలుగింట అతని స్థితి మంచిది కాదు. ప్రజలలో ఇతనికి ఏకపక్ష మెజారిటీ రాదు. అంతేకాదు వృశ్చిక కుజుని వల్ల, ఈ పార్టీ వ్యూహరచనలో స్పష్టమైన కుట్రలు కుతంత్రాలు దర్శనమిస్తున్నాయి. రాజకీయాల్లో ఇవి మామూలే అనుకోవచ్చు. కానీ నోరు తెరిస్తే ఆదర్శాలు చెప్పే పార్టీలు అలా ఉండకూడదు మరి !

పంచమంలో శనీశ్వరుని స్థితివల్ల త్వరలోనే ఈ పార్టీ డిప్రెషన్ కు గురౌతుంది అని చెప్పవచ్చు. అంతేగాక, తన పార్టీలో ప్రముఖులతోనూ, తన అనుచరులతోనే ముందు ముందు తనకు వచ్చే విరోధాలను ఈ యోగం సూచిస్తోంది.

అన్నింటి కంటే ముఖ్యమైనది - ఈ పార్టీ క్రైస్తవ మాఫియాల ఫండింగ్ తో నడుస్తున్నది అని ఇప్పటికే వస్తున్న ఆరోపణలలో నిజం ఉందా లేదా గమనిద్దాం.

ద్వాదశాధిపతి ( రహస్య ఆలోచనలకు సూచకుడు) అయిన చంద్రుడు నవమంలో (మత సంస్థలను సూచిస్తూ) బలంగా ఉండటమూ, అదే ద్వాదశంలో కుట్రలకు సూచకుడైన రాహువు ఉండటమూ, చంద్రుని పైన మతసంస్థలకు సూచకుడైన గురువు దృష్టి ఉండటమూ, సప్తమాధిపతి (దూరదేశాలకు సూచకుడు) అయిన శనీశ్వరుని దృష్టి సహజ నవమమూ మతస్థానమూ అయిన ధనుస్సు నుంచి చంద్రునిపైన కోణదృష్టిగా ఉండటమూ గమనిస్తే ఈ ఆరోపణ నిజమే అని తెలుస్తున్నది. 

ఆర్ధిక ఫండింగ్ కు సూచకుడైన లాభస్థానాధిపతి బుధుడు సప్తమంలో (దూరదేశాలకు సూచిక) ఉండటమూ, దశమాదిపతి అయిన శుక్రునితో కలసి ఉండటమూ, వారితో బాటే లగ్నాధిపతి అయిన సూర్యుడు ఉండటమూ చూస్తుంటే - ఈ పార్టీ మొత్తం విదేశీ సంస్థల పెట్టుబడితో, వారి పర్యవేక్షణలోనే నడుస్తుంది అని అర్ధమై పోతున్నది.

కారకాంశ అయిన మిథునం నుంచి కూడా సూర్య బుధ శుక్రులు నవమ స్థానంలో ఉండటం గమనిస్తే ఈ పార్టీ మీద విదేశీ మతసంస్థల పెత్తనం బలంగా ఉందన్న విషయం అర్ధమౌతుంది.

ఈ పార్టీ పెట్టిన సమయంలో ఈ జాతకానికి శుక్ర-చంద్ర-రాహు-కేతు-బుధ దశ నడుస్తున్నది. శుక్రుడు దశమాదిపతిగా సప్తమంలో ఉంటూ, చంద్రుడు ద్వాదశాదిపతిగా నవమంలో ఉంటూ,రాహువు రహస్య ద్వాదశంలో ఉంటూ - ఈ పార్టీ కార్యరంగంలో విదేశీ మతసంస్థల పెత్తనాన్ని స్పష్టంగా సూచిస్తున్నారు.

ప్రస్తుతం నడుస్తున్న ఉచ్ఛశుక్ర మహర్దశ 2033 వరకూ నడుస్తుంది. ఈ దశ ఆరూఢ లగ్నమైన వృషభానికీ, కారకాంశ లగ్నమైన మిధునానికీ, సూర్యలగ్నమైన కుంభానికీ బాగానే యోగిస్తుంది. తిరుగులేని మెజారిటీ రాకపోయినా, రాజకీయ రంగంలో ఈ పార్టీ ఉంటూనే ఉంటుంది. తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంటుంది.

స్వతహాగా కమలహాసన్ జాతకం గట్టిది. అందులో ఒకటి మించి రాజయోగాలున్నాయి. ఇతను 7-11-1954 న తమిళనాడులోని పరమకుడిలో పుట్టాడు. ఆరోజున కుజుడు, గురువు, శని ఉచ్ఛస్థితిలో ఉన్నారు. నవాంశలో సూర్యుడు ఉచ్ఛ స్థితిలో ఉన్నాడు. ఇన్ని మంచి యోగాలున్నాయి గనుకనే ఇతని జీవితం సినిమారంగంలో ఎదురులేకుండా నడిచింది. కానీ దారాకారకుడైన శుక్రుడు వక్రించి, అందులోనూ వృశ్చికంలో శనినక్షత్రంలో ఉంటూ, నీచరాహువుకు అతి దగ్గరగా ఉండటం వల్లా పాపార్గళంలో చిక్కుకోవడంవల్లా ఇతని వివాహజీవితం అనేక ఒడుదుడుకులకు లోనౌతూ వచ్చింది. చివరకు విఫలం అయిందనే చెప్పవచ్చు. మొదటి భార్య వాణీగణపతి గతి ఏమైందో తెలియదు. రెండో భార్య సారిక ప్రస్తుతం ముంబైలో వేషాలు లేక ఆర్ధికంగా దయనీయ పరిస్థితిలో ఉంది.  అందుకేనేమో - 'ముందు నీ భార్యలిద్దరికీ న్యాయం చెయ్యి ఆ తర్వాత ప్రజలకు న్యాయం చేద్దువుగాని' - అంటూ ప్రజలు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.

వివాహ జీవితాన్ని అలా ఉంచితే, ముఖ్యమైన గ్రహాలు - గురువు, శని, కుజుడు, సూర్యుడు ఉచ్చస్థితిలో బలంగా ఉన్నారు గనుక రాజకీయాలలో ఇతను బాగానే నిలదొక్కుకోవచ్చు.

అయినా ఈరోజుల్లో 'తిను - తినిపించు' అన్న సూత్రమే ఇండియాలో పనిచేస్తున్నది గాని, ఆ పార్టీ ఫండింగ్ ఎక్కడనుంచి వస్తున్నది? ఎవరు దీనిని పెట్టారు? దీని వెనకాల ఏ మతం ఉన్నది? ఏ సంస్థలున్నాయి? అనే విషయాలు ఎవడికీ అవసరం లేదు. కనుక ఈ సూత్రాన్ని బాగా అమలు పరిస్తే కమల్ కు ఏమీ ధోకా ఉండబోదు.

కానీ కమల హాసన్ కు తినే అలవాటే గాని తినిపించే అలవాటు లేదనీ, తన జేబులోనుంచి ఒక్క రూపాయి కూడా ఎవడికీ ఏనాడూ పెట్టింది లేదనీ లోకాపవాదు ఉన్నది. కాకపోతే ఇప్పటి పరిస్థితి వేరు. తన జేబులో డబ్బులు పెట్టనక్కరలేదు. తనకు ఎవరైతే ఫండింగ్ చేస్తున్నారో వాళ్ళ అజెండాను మన సమాజంలో అమలు చేసి వాళ్ళిచ్చే డబ్బుల్లో కొంత ప్రజలకు పెడితే చాలు. అనుకున్న పనైపోతుంది.

ఎంతో ఆశలతో ప్రజలు ఓట్లేసిన పార్టీలు ఏం ఉద్ధరిస్తున్నాయో చూస్తున్నాం కదా! ఎన్ని కొత్త కొత్త పార్టీలోచ్చినా ఎన్నెన్ని నీతులు చెప్పినా అంతర్జాతీయ అవినీతి ఇండెక్స్ లో మన దేశం 81 స్థానంలో ఉందని మనం మర్చిపోరాదు.

మోసపూరిత సమాజంలో మోసపూరిత పార్టీలే సక్సెస్ అవుతాయి. అందులోనూ తమిళనాడులొ వ్యక్తిపూజ మరీ ఎక్కువ కదా! కమల్ హాసన్ పార్టీ కూడా అలాగే ఏదో ఒక రకంగా సక్సెస్ కావాలని కోరుకుందాం !! చెబుతున్న నీతులను త్రికరణశుద్ధిగా పాటించే లక్షణం అయితే ఈ ముహూర్త చక్రంలో ఏమీ కనిపించడం లేదు. కాబట్టి, ఈ పార్టీ కూడా మిగతా పార్టీల లాగే ఇంకొక అవకాశవాద పార్టీ మాత్రమే అని నిర్ద్వంద్వంగా చెప్పవచ్చు.
read more " Makkal Needi Mayyam Party - Astro analysis "

14, ఫిబ్రవరి 2018, బుధవారం

జగ్జీత్ సింగ్ జాతకం - విశ్లేషణ

ప్రఖ్యాత ఘజల్ గాయకుడు జగ్జీత్ సింగ్ జాతకాన్ని గమనిద్దాం. 'పోయినోళ్ళు అందరూ మంచోళ్ళు' అన్నట్లుగా, మనం మంచివాళ్ల జాతకాలే చూస్తాం గనుకా, అలాగే చూడాలి గనుకా, ఇప్పుడు ఈయన జాతకం చూస్తున్నామన్న మాట !

ఈయన 8-2-1941 న ప్రస్తుతం రాజస్థాన్ లోని శ్రీ గంగానగర్ లో జన్మించాడు. జనన సమయం తెలియదు గనుక ఇతర లగ్నాలనుంచి గమనిద్దాం.

చంద్రుడు ఆరోజున ఆర్ద్రా నక్షత్రం 1,2,3 పాదాలలో సంచరించాడు. ఇవి నవాంశలో అయితే ధనుస్సు, మకరం, కుంభం అవుతాయి. వీటిలో ఈయనది మకర నవాంశ అని నా అభిప్రాయం. అంటే ఈయన మధ్యాన్నం పన్నెండు నుంచి రాత్రి ఎనిమిదిలోపుగా పుట్టి ఉండాలి. అలా ఎందుకు? అనేది ముందుముందు విశ్లేషణలో చెబుతాను.

చంద్రలగ్నం నుంచి చూస్తే - నాలుగింట రాహువు ఉచ్ఛబుధుడిని సూచిస్తూ వీరి కుటుంబంలో ఉన్న సంగీత, సాహిత్య పరంపరను తెలుపుతున్నాడు. ఈయన తల్లిదండ్రులు సంగీతంలో నిష్ణాతులు కానప్పటికీ, వీరి పూర్వీకులలో ఈ జీన్స్ ఖచ్చితంగా ఉండి ఉండాలి.

కారకాంశ సింహం అయింది. అక్కణ్ణించి ఉచ్చబుధుడు రెండింటిలో ఉంటూ ప్రసిద్ధ గాయకుడిని సూచిస్తున్నాడు. నవమంలో బలీయమైన పూర్వకర్మను సూచించే నీచశని గురువుల డిగ్రీ సంయోగం ఉన్నది. ఇది మంచి యోగం కాదు. అందుకే, సంగీతంలో తన మొదటి గురువుగా చగన్ లాల్ శర్మ అనే గ్రుడ్డి గురువు దగ్గర చేరి విద్యను నేర్చుకున్నాడు. చంద్ర లగ్నం నుంచి కూడా నవమంలో బుధుడు అర్గల గ్రస్తుడై ఉండటం చూడవచ్చు.

సప్తమంలో కుజుని స్థితివల్ల వచ్చిన కుజదోషంతో డైవోర్సీ అయిన చిత్రా సింగ్ ను వివాహం చేసుకున్నాడు. కుజునికి దారా కారకత్వం రావడమూ ఆయన సున్నా డిగ్రీలలో బలహీనుడుగా ఉండటమూ గమనించాలి. పుత్రకారకుడైన గురువు నీచ శనితో కలసి ఉండటంతో జగ్జీత్ - చిత్ర లకు పుట్టిన వివేక్ అనే అబ్బాయి తన 18 ఏట ఒక కారు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటినుంచీ జగ్జీత్ బాగా కృంగిపోయాడు. ఆ తర్వాత, తన మొదటి భర్త ద్వారా పుట్టిన కూతురు కూడా 2009 లో ఆత్మహత్య చేసుకుని చనిపోవడంతో చిత్రా సింగ్ కూడా మానసికంగా చాలా క్రుంగిపోయింది.

అక్కడనుంచీ వారిద్దరూ పాటలు పాడటం తగ్గించారు. చిత్రా సింగ్ పూర్తిగా పాడటం మానేసింది. జగ్జీత్ మాత్రం కొన్నేళ్ళ డిప్రెషన్ తర్వాత నిదానంగా మళ్ళీ పాడటం మొదలు పెట్టాడు. కానీ ఆ తర్వాత కూడా అతను ఆ డిప్రెషన్ నుంచి బయటపడలేదని, చాలా విరక్తికి లోనయ్యాడని ఆయన పాడిన పాటలు, వాటి రాగాలు గమనిస్తే మనకు తెలుస్తుంది. ఎన్ని పాటలు పాడినా ఎన్ని ఎవార్డులు, ఎంత పేరు ప్రఖ్యాతులు వచ్చినా,  చివరకు నిరాశతోనే 10-10-2011 తేదీన ముంబాయిలో ఈయన చనిపోయాడు.

ఆ రోజున --

జననకాల సూర్యునితో, గోచార శని కేంద్ర దృష్టిలోనూ, జననకాల చంద్రుడు, గోచార గురువుతో అర్ధకోణ దృష్టిలోనూ, ముఖ్యంగా గోచార గురువు మళ్ళీ అదే జననకాల స్థానంలోనూ, గోచార ప్లూటో (యముడు) జననకాల రాహువుతో కేంద్రదృష్టి లోనూ ఉండటం గమనించవచ్చు.

కుజదోషం వివాహభావాన్ని ఖచ్చితంగా చెడగొడుతుంది. ఈ చెడిపోవడం అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఒక్కొక్కసారి ఇలా చెడిపోవడం వల్ల వారిలో ఇద్దరికీ గానీ ఒక్కరికి గానీ మంచి జరుగుతుంది కూడా. మనిషి జీవితం చాలా విచిత్రమైనది. ఇందులో ఎన్నెన్నో కోణాలుంటాయి. ఏ ఇద్దరి జీవితాలూ ఒకే విధంగా ఉండవు. మంచిలో చెడుంటుంది. చెడులో మంచీ ఉంటుంది. జీవితంలోని ఈ విభిన్న కోణాలను సూచిస్తూ జాతకంలోని గ్రహయోగాలు కూడా రకరకాలుగా ఉంటాయి.

బలీయమైన పూర్వకర్మను సూచించే శనిగురువుల సంయోగమూ అందులోనూ శని నీచలో ఉన్నప్పుడు ఆ జాతకంలో ఎన్ని ఉన్నా ఏమీ లేని స్థితి మానసికంగా ఉంటుందని ఈ జాతకం నిరూపిస్తుంది.

అయితే, రాశి చక్రంలో ఉచ్చబుధుడిని సూచిస్తున్న రాహువూ, నవాంశలో ఉచ్ఛస్థితిలో ఉన్న శుక్రుడూ ఈయనకు సినిమా రంగంలోనూ, ఘజల్స్ పాడటంలోనూ, ట్యూన్స్ కట్టడంలోనూ మంచి అంతర్జాతీయ సక్సెస్ ను ఇచ్చారు. ఆ శుక్రుడు కూడా మకర చంద్రుని నుంచి తృతీయస్థానంలో ఉండటంతో మంచి స్వరాన్ని ఇచ్చాడు.

ఈ విధంగా జాతకంలో యోగాలనేవి జీవితాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. వాటి ప్రకారమే మనిషి జీవితం నడుస్తుందనడానికీ, సామాన్యులైనా అసామాన్యులైనా ఎవ్వరూ గ్రహప్రభావానికి అతీతులు కారని  చెప్పడానికీ ఈయన జాతకం ఒక ఉదాహరణ.
read more " జగ్జీత్ సింగ్ జాతకం - విశ్లేషణ "

8, ఫిబ్రవరి 2018, గురువారం

పీడ కల

మంచి నిద్రలో ఉండగా
పీడ కలొచ్చి నిద్ర లేపేసింది
చిన్న పీడకల అంతమై
పెద్ద పీడకలలోకి మెలకువొచ్చింది...
read more " పీడ కల "

ఈ ఆత్మ...

ఈ ఆత్మ
ఎన్నోసార్లు గమ్యాన్ని చేజార్చుకుంది
కానీ, మళ్ళీ మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉంది

ఈ మనసు
ఎన్నో సార్లు మోసపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ ప్రేమిస్తూనే ఉంది

ఈ ప్రాణం
ఎన్నో సార్లు క్రుంగిపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పుంజుకుంటూనే ఉంది

ఈ దేహం
ఎన్నో సార్లు రాలిపోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పుడుతూనే ఉంది

ఈ స్వరం
ఎన్నో సార్లు మూగబోయింది
కానీ, మళ్ళీ మళ్ళీ పాడుతూనే ఉంది

ఈ నమ్మకం
ఎన్నో సార్లు వెన్నుపోట్లకు గురయింది
కానీ మళ్ళీ మళ్ళీ నమ్ముతూనే ఉంది

ఈ జీవితం
ఎన్నో సార్లు ముగిసింది
కానీ మళ్ళీ మళ్ళీ కొనసాగుతూనే ఉంది...
read more " ఈ ఆత్మ... "

23, జనవరి 2018, మంగళవారం

జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు

అప్పుడప్పుడు నాకు చాలా ఈ మెయిల్స్ వస్తూ ఉంటాయి.

'ఎవరో హేతువాద సంఘం వాళ్ళు ప్రైజ్ మనీ ఎనౌన్స్ చేశారు. జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు ఇస్తామని అంటున్నారు. మీరు నిరూపించి ఆ డబ్బులు తీసుకోవచ్చు కదా?' అని.

నేను నవ్వుకుని ఊరుకుంటూ ఉంటాను.

మన తెలుగురాష్ట్రంలో ఈ ప్రైజ్ మనీ ఇప్పుడు వచ్చిందేమో? అర్ధశతాబ్దం క్రితమే ఇలాంటి చాలెంజ్ లు విదేశాలలో చాలా ఉన్నాయి. ఇంటర్నేషనల్ ఎతీస్ట్ సెంటర్స్ ఇలాంటి చాలెంజ్ లు ఎన్నో చేశాయి. ఇప్పటికీ ఆ చాలెంజ్ లను ఎవరూ స్వీకరించలేదు.

ఎందఱో పేరు మోసిన జ్యోతిష్కులు విదేశాలలో కూడా ఉన్నారు. వారు వెస్టర్న్ ఎస్ట్రాలజీ ని అనుసరిస్తారు. కానీ వాళ్ళు కూడా ఈ చాలెంజ్ ని స్వీకరించరు. ఎందుకంటే ఆ చాలెంజ్ చేసినవాళ్ళు పెట్టే కండిషన్స్ ఎలా ఉంటాయంటే, ఒకవేళ జ్యోతిష్కులు గెలిచినా, గెలవలేదని నిరూపించేలా అవి డిజైన్ చెయ్యబడి ఉంటాయి. మూర్ఖంగా వాదించి 'మీరు గెలవలేదు' అని వాళ్ళే నిరూపిస్తారు. కనుక అలా గెలవడం జరిగేపని కాదని వీరికి బాగా తెలుసు. అందుకే ఆ చాలెంజ్ ని నిజమైన జ్యోతిష్కులు ఎవ్వరూ స్వీకరించరు. ఇక కుహనా జ్యోతిష్కుల సంగతి చెప్పనే అక్కర్లేదు. వారెలాగూ ఓడిపోక తప్పదు. అందుకని వారూ ఈ చాలెంజ్ ని స్వీకరించరు.

మొన్నీ మధ్యనే ఒక కొలీగ్ కీ నాకూ మధ్య దీనిమీద సంభాషణ నడిచింది.

"ఆ చాలెంజ్ స్వీకరించి 6 కోట్లు కొట్టెయ్యొచ్చుగా?" అడిగాడు కొలీగ్.

'ఫస్ట్ నువ్వు వాడుతున్న పదమే తప్పు. కొట్టెయ్యడం అనే దానిమీద నాకు ఇంటరెస్ట్ లేదు. నేను దొంగను కాను ఆ పని చెయ్యడానికి." అన్నాను నవ్వుతూ.

'అదికాదు. ఏదో మాటవరసకి వాడాన్లే ఆ పదాన్ని. జ్యోతిష్యం నిజమే అని నువ్వు ప్రూవ్ చెయ్యొచ్చు కదా?' అన్నాడు.

'ఒకరికి ప్రూవ్ చెయ్యవలసిన పని నాకు లేదు. అది నిజమైన శాస్త్రమే అని నాకు తెలుసు. ఇంకొకరిని ఒప్పించాల్సిన పని నాకు లేదు. వారు ఒప్పుకుంటే నాకు ఒరిగేది కూడా లేదు' అన్నాను.

'ఎందుకు ఒరగదు? ఆరు కోట్లు అంటే మామూలు విషయం కాదుగా?' అన్నాడు.

'తేరగా వచ్చే సొమ్మంటే నాకు నమ్మకం లేదు. కష్టం లేకుండా అలా తేరగా వచ్చే సొమ్ము ఒక్క రూపాయికూడా నాకక్కర్లేదు. దానితో చాలా కర్మకూడా వస్తుంది. దాన్ని మోసే ఖర్మ నాకెందుకు? ఇప్పటికున్న కర్మ చాలు.' అన్నాను.

'పోనీ నీకు అవసరం లేకుంటే, తీసుకుని చారిటీకి ఇచ్చేయ్' అన్నాడు.

'ఎవరున్నారు మంచిగా చారిటీ చేసేవాళ్ళు? ఒక్కరిని చూపించు. అన్నీ రాజకీయాలే. అన్నీ స్వార్ధాలే. అన్నీ కుట్రలూ కుతంత్రాలే. అంత డబ్బు వాళ్లకిచ్చి ఆ కర్మను మోసే పని నాకెందుకు? నీకంత దురదగా ఉంటే నీ చేతనైనంతలో ఆ పని నువ్వే చెయ్యి' అన్నా.

'మరి ఇంత నేర్చుకుని, ఎవడికీ ఉపయోగం లేకపోతే, నీ టైం అంతా వేస్ట్ కాలేదా?' అన్నాడు తెలివిగా.

'ఇక్కడ ఎవడి టైం వేస్ట్ కావడం లేదో కాస్త చెప్పు? బిలియన్స్ సంపాదించిన వాడి టైం కూడా చివరికి వేస్టే. అది వాడికి అర్ధం కావడానికి 'టైం' పడుతుంది. అంతే. ఈ లోకంలో ప్రతివాడూ చేస్తున్నది ఒకటే పని - టైం వేస్ట్ - చెయ్యడమే. అది తప్ప ఎవరూ ఏమీ చెయ్యడం లేదు.' అన్నాను.

'కనీసం నీకైనా ఈ శాస్త్రం ఉపయోగపడుతోందా" అన్నాడు విసుగొచ్చి.

ఇక వీడితో ఇలా కాదని - 'ఉపయోగపడటం కోసం కాదు నేను దీనిని నేర్చుకుంది?' అన్నాను.

అది వాడికి అర్ధం కాలేదు.

'మరెందుకు?' అన్నాడు అయోమయంగా.

'టైం పాస్ కోసం నేర్చుకున్నాను. టైం వేస్ట్ చేస్తూ పోస్టులు వ్రాస్తున్నాను. సింపుల్ గా చెప్పాలంటే అంతే.' అన్నాను.

'అదేంటి?' అన్నాడు మళ్ళీ అయోమయంగా.

'అదంతే ! జ్యోతిష్యం ఒకరికి ప్రూవ్ చెయ్యాల్సిన సబ్జెక్ట్ కాదని తెలుసుకోవడం కోసమే దీనిని నేర్చుకున్నాను.నావరకూ నాకు బాగానే ఉపయోగపడుతోంది.' అన్నా నవ్వుతూ.

'ఓహో! చాలెంజ్ స్వీకరిస్తే ఓడిపోతానని భయంతో ఈ కబుర్లు చెబుతున్నావా?' అన్నాడు నవ్వుతూ.

'అవును. 'యుద్ధం చెయ్యనివాడు యుద్ధంలో గెలిచినట్లే' అన్నాడు లావోజు. ముందిది అర్ధం చేసుకో. ఆ తర్వాత తీరిగ్గా నాతో వాదిద్దువు గాని' అన్నా.

'ఏమో. నాకైతే కళ్ళు మూసినా తెరిచినా ఆరు కోట్లే కనిపిస్తున్నాయి' అన్నాడు శూన్యంలోకి చూస్తూ.

'సరే ఒకపని చెయ్యి. రేపట్నించీ నా దగ్గర జ్యోతిష్యశాస్త్రం నేర్చుకో. రెండు మూడేళ్ళలో ఆ చాలెంజ్ నువ్వే స్వీకరించే స్థాయికి ఎదుగుతావు. ఈ లోపల ప్రముఖ జ్యోతిష్కులు ఎవరూ ఆ పనిని చెయ్యరు గాక చెయ్యరు. అంతవరకూ నీకు గ్యారంటీ ఇస్తా.' అన్నా సీరియస్ గా.

'ఫీజు ఎంతేంటి?' అన్నాడు వాడూ నవ్వుతూ.

'వెరీ సింపుల్. నీ దగ్గర ఎక్కువ తీసుకోనులే. రోజుకు ఆరు కోట్లు. అంతే !' అన్నా నేనూ నవ్వుతూ.

'సర్లే పద ! నాకు చాలా పనుంది అవతల' అన్నాడు నీరసంగా.

' నాకూ పనుంది. వస్తా ! ఇంకో సంగతి ! జ్యోతిష్యం వాస్తు నిజాలు కావని నిరూపిస్తే నేను కూడా ఆరు కోట్లు ఇస్తానని ప్రెస్ మీట్ పెట్టబోతున్నా త్వరలో.' అన్నా.

'నీ దగ్గర ఆరు కోట్లు ఎక్కడివి?' అన్నాడు సీరియస్ గా.

'పాత జోకేలే. మళ్ళీ చెబుతున్నా. నేను లా చదివినప్పుడు కుట్టించుకున్న నల్లకోటు ఒకటుంది. రైల్వే టీసీలు వేసుకునే కోట్లు అయిదు దానికి కలిపి ఆరు కోట్లు చేస్తా. అవి ప్రైజుగా ఇస్తా.' అన్నా నవ్వుతూ.

'ఇది ప్రూవ్ చెయ్యడం చాలా తేలిక. నువ్వు ఓడిపోతావ్' అన్నాడు.

'అదీ జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళు ఎన్నెన్ని చెప్పినా నేను కన్విన్స్ కాను కదా ! కన్విన్స్ కాకూడదు అని ముందే డిసైడ్ అయిపోతానన్నమాట - వాళ్ళలాగానే. కనుక వాళ్ళూ ఈ చాలెంజ్ లో గెలవలేరు. ఒకవేళ గెలిచినా మనకు పోయేదేముంది పాత కోట్లు తప్ప? దరిద్రం పోతుంది.' అన్నాను నవ్వుతూ.

వాడి దారిన వాడు చక్కా పోయాడు.

కధ కంచికి మనం ఇంటికి !
read more " జ్యోతిష్యం వాస్తు నిజమని నిరూపిస్తే 6 కోట్లు "

18, జనవరి 2018, గురువారం

నిత్య జీవితంలో ప్రశ్నశాస్త్రం - మొబైల్ చార్జర్ ఏమైంది?

ఈరోజుల్లో ఏది మర్చిపోయినా అంత కంగారు రాదుగాని, మొబైలు గాని, దాని చార్జర్ గాని మర్చిపోతే మాత్రం చాలా కంగారు పుడుతుంది. ఎందుకంటే పనులన్నీ వాటితోనే జరుగుతున్నాయి గనుక.

నిన్న అర్ధరాత్రిదాకా ఒక ఫంక్షన్ లో కల్చరల్ ప్రోగ్రాం నిర్వహిస్తూ చాలా బిజీగా ఉండవలసి వచ్చింది. ఆ తర్వాత ఇంటికి వచ్చి నిద్రపోయే ముందు చూస్తే, మొబైల్ చార్జర్ కనిపించలేదు. ఈ ఫోన్ పిన్ కు అన్ని చార్జర్లూ సరిపోవు. ఆ మోడల్ ను అలా డిజైన్ చేశాడు లెనోవో గాడు. చార్జ్ చూద్దామంటే, 5% ఉంది. మనకేమో అఫీషియల్ కాల్స్ ఏ సమయంలోనైనా రావచ్చు. ఇక్కడ చార్జ్ చూస్తే తెల్లవార్లూ వచ్చేలా లేదు. ఏం చెయ్యాలి? దానిని ఉంచిన బ్యాగ్ మొత్తం వెదికినా అది కనిపించలేదని తెలిసింది. ఎక్కడ పోయిందబ్బా? అని కొంత ఆలోచన చేసి, ఆ ప్రోగ్రాం హడావిడిలో ఎక్కడో పోయి ఉంటుందిలే, సర్లే పోతే పోయిందిలే ఇంకోటి కొందాం అనుకుంటూ, ఎందుకైనా మంచిదని ఒక్కసారి ప్రశ్న చార్ట్ ని గమనించడం జరిగింది.

ప్రశ్న స్థలం -- గుంటూరు.
తేదీ -- 18-1-2018
ప్రశ్న సమయం -- రాత్రి 12.30

చూడగానే కుండలిలో కాలగ్రస్తయోగం చక్కగా కన్పిస్తోంది. ఆ పైన లగ్నానికి కాలార్గళం పట్టింది. ఒక మనిషిని విసిగించడానికి ఇవి చాలా ఎక్కువ. ఇవి చాలవన్నట్లు, లగ్నాధిపతి చతుర్దంలో తీవ్ర అస్తంగత్వంలో ఉండి మానసిక భ్రమను సూచిస్తున్నాడు. అంతేగాక, చతుర్ధం వల్ల ఆ వస్తువు ఇంట్లోనే ఉంది కానీ కన్పించడం లేదని సూచిస్తున్నాడు. మన: కారకుడైన చంద్రుడు కూడా అక్కడే ఉంటూ వస్తువు ఇంట్లోనే ఉందని, కానీ తప్పుదోవ పట్టిస్తోందనీ సూచిస్తున్నాడు. లగ్నంలో గురువుగారు ఉండి వస్తువు త్వరలోనే దొరుకుతుందని సూచిస్తున్నాడు. ద్వితీయాధిపతిగా విలువైన వస్తువులకు కారకుడు కుజుడు రాశిసంధిలో ఉంటూ వస్తువుల అనిశ్చిత పరిస్థితిని సూచిస్తున్నాడు. కానీ స్వక్షేత్ర స్థితి వల్ల, అది పోలేదని సూచిస్తున్నాడు. లగ్నం మొదటి ద్రేక్కాణంలో ఉంటూ వస్తువు ఇంటి మొదటిభాగంలోనే ఉందని సూచిస్తున్నది. దానిని ఉంచిన బ్యాగ్ హాల్లోనే ఉంచబడింది.

ఇవన్నీ గమనించిన మీదట అది ఎక్కడికీ పోలేదని, అదే బ్యాగ్ లోనే ఇంకో అరలో ఉంటుందని, సరిగ్గా వెదికితే దొరుకుతుందనీ అర్ధమై, నిద్రకు ఉపక్రమించాను.

పొద్దున్నే లేచి అదే బ్యాగ్ లో సైడ్ జిప్ పాకెట్ లో చూడగా అందులో మొబైల్ చార్జర్ చక్కగా దర్శనమిచ్చింది. నిత్యజీవితంలో ప్రశ్నశాస్త్రం ఎలా ఉపయోగపడుతుంది? అనడానికి ఇది ఇంకొక ఉదాహరణ.

అయితే, చార్ట్ ని సరియైన దృష్టితో అర్ధం చేసుకోవాలి. విషయమంతా ఈ అర్ధం చేసుకోవడంలోనే ఉంది. చార్ట్ అనేది అలా అర్ధం కావాలంటే, జ్యోతిష్య శాస్త్ర సూత్రాలు బాగా వంటబట్టి ఉండాలి, ఆ తర్వాత స్ఫురణ (ఇంట్యూషన్) ఉండాలి. వీటికి తోడుగా వందలాది చార్టులను విశ్లేషణ చేసిన అనుభవం ఉండాలి. ఈ మూడూ కలసినప్పుడు ప్రశ్నశాస్త్రం చక్కని ఫలితాలను తప్పకుండా ఇస్తుంది.
read more " నిత్య జీవితంలో ప్రశ్నశాస్త్రం - మొబైల్ చార్జర్ ఏమైంది? "

14, జనవరి 2018, ఆదివారం

త్వరలో రాబోతున్న మా పుస్తకం "మహాసౌరమ్" నుంచి కొన్నిపద్యాలు

సూర్యోపాసన మన మతంలో ఒక విశిష్టమైన అంశం. సూర్యుడు ప్రత్యక్షదైవం. అంటే ప్రతిరోజూ మనకు కళ్ళెదురుగా కనిపించే దైవం. సూర్యుని సకల దేవతాస్వరూపునిగా స్తుతించింది వేదం.

భౌతికవాదులకూ నాస్తికులకూ సూర్యుడు ఒక మండుతున్న నిప్పుల ముద్ద కావచ్చు. కానీ అదే అగ్నిగోళం ఇచ్చే వేడితోనే వాళ్ళూ బ్రతుకుతున్నారన్న స్పృహ కొంచెం ఉంటే, దానినుంచి కృతజ్ఞత పుడుతుంది. ఆ కృతజ్ఞతకు మరో పేరే భక్తి. వారు నిత్యం పొందుతున్న సహాయం పట్ల కృతజ్ఞత లేకుండా నాస్తికులూ భౌతికవాదులూ ఉంటారని నేనైతే అనుకోను. అలా ఉండేవారు అసలు 'మనుషులు' అనే పదానికే అర్హులు కారు మరి.

దేవుడు సృష్టించిన సూర్యుడిని దేవుడిగా పూజించడం ఘోరమైన తప్పని క్రైస్తవమూ ఇస్లామూ వంటి కొన్ని మతాలంటాయి. ఈ మాట విన్నప్పుడు మనకు నవ్వొస్తుంది. దేవుని కంటే దేవుని సృష్టి వేరు కాదు. సృష్టిలో దైవపు వెలుగే ప్రకాశిస్తున్నది. కనుక తేజోవంతములైన వాటిల్లో దైవపు వెలుగును దర్శించి పూజించడం తప్పు కాదు. విషయం మీకు సరిగ్గా అర్ధం కావడం లేదని మనమంటాం.

మనకు కనిపించే వెలుగులలో అతిపెద్ద వెలుగు సూర్యుడే గనుక, "జ్యోతిషామపి తజ్జ్యోతి:" అంటూ ఆయన్ను దైవంగా భావించి పూజించడం చాలా సరియైన పని. ఈ విధమైన ఉపాసనను వేదం సమ్మతించింది. వేదంలో ఉన్న అరుణం, మహాసౌరం వంటి మంత్రభాగాలే దీనికి నిదర్శనాలు. సూర్యోపాసకులకు ఇవి చిరపరిచితములే. స్తోత్రాలలో అయితే రామాయణంలో మనకు లభిస్తున్న 'ఆదిత్య హృదయం' చాలా మంచి స్తోత్రం. లక్షలాది మంది చేత ఇది నిత్యమూ పారాయణం గావింపబడుతున్న స్తోత్రమే.

పంచవటి పబ్లికేషన్స్ నుంచి అతి త్వరలో రాబోతున్న మరో పుస్తకం 'మహాసౌరమ్' నుంచి నేను వ్రాసిన కొన్ని పద్యాలను మకర సంక్రాన్తి రోజున మీకోసం ఇక్కడ ముందుగానే ఇస్తున్నాను. ఇది ఋగ్వేదం లోని మహా ప్రభావవంతములైన మంత్ర సమాహారములలో ఒకటి.

చదవండి.
--------------------------------------------
ఓమ్ !
ఉదుత్యం జాతవేదసం దేవం వహంతి కేతవ:
దృశే విశ్వాయ సూర్యమ్

తే||కాంచు మల్లదె సూర్యుని గుర్రములను
విశ్వమెల్లను జూచెడి వెలుగురేని
సర్వవేత్తను శాసకు సర్వవిభుని
ఆకసంబున నిల్పవె; యవని కొరకు

సూర్యుడు భూమిపైన జరుగుతున్న సమస్తమునూ గ్రహిస్తున్నవాడు. సర్వమునూ శాసిస్తున్నవాడు. సర్వమానవాళికీ ఆయన ప్రభువు. ఎందుకంటే ఆయన ఇచ్చే వేడిమితోనే మనుషులు జంతువులు పక్షులు చెట్లు ఇతర జీవులు బ్రతుకుతున్నాయి. ఆ సూర్యునికి ఏడు గుర్రములున్నాయి. అవే ఆయన కాంతిలోని ఏడు రంగులు. ఆ గుర్రముల రధంపైన అధిరోహించి ఆయన ఆకాశంలో కనిపిస్తున్నాడు. మానవులారా చూడండి !

తే||ఏడు గుఱ్ఱము లెక్కుచు నెంతగాను
లోకమంతయు నింపెడు లాస్యమొదవ
ప్రభుత నేలగ విశ్వపు పారమంత
శూన్యమండల వీధుల సూర్యుడేగు

ఏడు గుర్రముల రధం మీద అధిరోహించి, లోకాన్నంతా విలాసంగా దర్శిస్తూ, దానిని పరిపాలిస్తూ, శూన్యమండలంలో సూర్యుడు విహరిస్తున్నాడు. మానవులారా ! ఆ వెలుగును దర్శించండి ! 

||విశ్వమెల్ల నేలు విఖ్యాత పురుషుండు
ఏడు హయములెక్కి ఏగు దెంచు
నియమమందు నిల్పి నిఖిల లోకతతుల
కాంతిపధము నందు గానవచ్చు

విశ్వం మొత్తాన్నీ పరిపాలిస్తున్న ప్రాచీన పురుషుడు ఏడు రంగుల గుర్రములు లాగే రధంలో వచ్చుచున్నాడు. ఈ భూమిపైన సమస్తమూ ఆయన అధీనంలోనిదే. అన్నింటినీ ఆయన నియమిస్తున్నాడు. కాంతిమార్గంలో ఆయన ప్రయాణిస్తున్నాడు. చూడండి !

తే||ఏడు రంగుల గుఱ్ఱములెక్కి నీవు
చేరబోవలె నాతని సర్వ విభుని
జ్ఞానరూపిని ప్రభువును చేతనమున
యోగమార్గము నందుచు వేగమొప్ప

ఈ ఏడు గుర్రములూ మనిషిలోని సప్తచక్రములకు సూచికలు. ఈ సప్తచక్రములనూ జాగృతం చెయ్యడం ద్వారా మీరు సమస్తానికీ ప్రభువైన సూర్యుని తేజస్సును అందుకోవాలి. ఓ మానవులారా ! ఈ యోగమార్గంలో ప్రయాణించడం నేర్చుకోండి.
read more " త్వరలో రాబోతున్న మా పుస్తకం "మహాసౌరమ్" నుంచి కొన్నిపద్యాలు "

9, జనవరి 2018, మంగళవారం

నేనెవర్ని మరి?

వేదన నా తల్లి - వేడుక నా తండ్రి
బాధ నా తల్లి - భ్రమ నా తండ్రి
నేనెవర్ని మరి?


విషాదం నా తల్లి - విలాసం నా తండ్రి
విలాపం నా తల్లి - వినోదం నా తండ్రి
నేనెవర్ని మరి?

ఆచారం నా తల్లి - అనాచారం నా తండ్రి
గుట్టుదనం నా తల్లి - కట్టులేనితనం నా తండ్రి
నేనెవర్ని మరి?

అవమానం నా తల్లి - అహంకారం నా తండ్రి
ఆప్యాయత నా తల్లి - అవకాశవాదం నా తండ్రి
నేనెవర్ని మరి?

కారుణ్యం నా తల్లి - కాఠిన్యం నా తండ్రి
పాతివ్రత్యం నా తల్లి - పరగమనం నా తండ్రి
నేనెవర్ని మరి?

కళామతల్లి నా తల్లి - కళంకితుడు నా తండ్రి
ఉదారచరిత నా తల్లి - స్వార్ధపరత నా తండ్రి
నేనెవర్ని మరి?

అనురాగం నా తల్లి - అసహాయత నా తండ్రి
బాంధవ్యం నా తల్లి - భ్రష్టత్వం నా తండ్రి
నేనెవర్ని మరి?

త్యాగం నా తల్లి - భోగం నా తండ్రి
యోగం నా తల్లి - రోగం నా తండ్రి
నేనెవర్ని మరి?

ఆధ్యాత్మికం నా తల్లి - అమానుషం నా తండ్రి
ఆకాశం నా తల్లి - అగాధం నా తండ్రి
నేనెవర్ని మరి?

వాస్తవం నా తల్లి  - స్వప్నం నా తండ్రి
ఎరుక నా తల్లి - మరపు నా తండ్రి
నేనెవర్ని మరి?
read more " నేనెవర్ని మరి? "

2, జనవరి 2018, మంగళవారం

హిందూ దేవాలయాలు ఎందుకు ధ్వంసం చెయ్యబడ్డాయి?

మొన్నొకాయన నాతో మాట్లాడుతూ ఈ పోస్టును వ్రాయడానికి నాంది పలికాడు.

'అమెరికాలో ఎక్కడ బడితే అక్కడ హిందూ దేవాలయాలు వెలుస్తున్నాయి. చూచారా ఇదెంత మంచి శుభ పరిణామమో?' అన్నాడు.

'ఆ విషయం నీకెలా తెలుసు?' అడిగాను.

'ఈ మధ్యనే అమెరికాలో ఆర్నెల్లు ఉండి వచ్చాను. అప్పుడు చూచాను. ప్రతి స్టేట్ లోనూ మన గుళ్ళున్నాయి. అంతేకాదు. ఒక్కో ఊరిలోనైతే అయిదారు దేవాలయాలున్నాయి. ఇంకా కడుతున్నారు.' అని ఆనందంతో ఉప్పొంగిపోయాడు.

'సరే మంచి విషయమేలే గాని, ఇది శుభ పరిణామం ఎలా అవుతుందో కాస్త చెప్పు వింటాను' అన్నాను.

'అదేంటి? మన సంస్కృతి అమెరికాలో కూడా విస్తరిస్తోంది. ఇది మంచిదేగా?' అన్నాడు.

'అవును. అదే సమయంలో మన సంస్కృతి మన దగ్గర మాయమౌతోంది. వాళ్ళ సంస్కృతి ఇక్కడ విస్తరిస్తోంది. దీనికేమంటావు?' అడిగాను.

'నిజమే. కాకపోతే కొంతలో కొంత మంచిదేగా?' అన్నాడు.

నేను నవ్వేసి ఊరుకున్నాను.

'అసలూ, నవాబుల కాలంలో మన గుళ్ళు ఎన్ని నాశనం అయ్యాయో లెక్కేలేదు. అవన్నీ ఉంటె ఇప్పుడు ఇంకెంత బాగుండేదో? అందుకే నాకు ముస్లిమ్స్ అంటే పరమమంట !' అన్నాడు కోపంగా.

'ఇప్పటి ముస్లిమ్స్ కాదుగా అప్పుడు మీ గుళ్ళు ధ్వంసం చేసింది? వాళ్ళంతా చనిపోయారు. ఇప్పుడున్న వీళ్ళమీద ఎందుకు నీకు కోపం?' అన్నాను నవ్వుతూ.

'అవుననుకోండి. కానీ వీళ్ళ తాతముత్తాతలేగా ఆ పనులు చేసింది?' అన్నాడు ఇంకా బుసలు కొడుతూ.

'ఓహో అదా ! అలా అయితే మీ తాతముత్తాతలు చేసిన పనులకు నీకూ శిక్ష పడాలిగా మరి?' అన్నాను.

'మా వాళ్ళేం గుళ్ళూ గోపురాలూ నాశనం చెయ్యలేదే?' అన్నాడు వాదనలోకి దిగుతూ.

'సరిగ్గా అవే పనులు చేసి ఉండకపోవచ్చు. కానీ అంటరానివాళ్ళు అంటూ సాటి మనుషులను దూరం పెట్టడాలూ, పల్లెల్లో పెత్తనం చెలాయించడాలూ, భూములన్నీ మీ చేతుల్లోనే ఉంచుకోడాలూ, రెలిజియస్ గా ఎన్నో బయటకురాని నేరాలూ దౌర్జన్యాలూ చెయ్యడాలూ - ఇవన్నీ చేశారు కదా మీ పెద్దలు? మరి వాటికి నీకూ శిక్ష పడాలిగా ఇప్పుడు. ఒప్పుకుంటావా?' అన్నాను సూటిగా.

'ఆ ! అదీ ఇదీ ఒకటే ఇలా అవుతుంది? మీరు చెప్పినట్లుగా మావాళ్ళు చేసిన నేరాలకు దౌర్జన్యాలకు సాక్ష్యాలు లేవు. కానీ దేవాలయాలు ధ్వంసం చెయ్యబడి మన కళ్ళ ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి కదా? దీనికేమంటారు?' అన్నాడు తెలివిగా.

'ఇప్పుడు కరెక్ట్ గా సబ్జెక్ట్ లోకి వస్తున్నవురా బిడ్డా' - అని మనస్సులో అనుకుని - 'అలా ధ్వంసం చెయ్యబడిన గుళ్ళూ గోపురాలే మీ నేరాలకు నిదర్శనాలు' అన్నాను.

అతనికి అర్ధం కాలేదు.

'ఏంటి మీరు చెబుతున్నది?' అన్నాడు అయోమయంగా.

'శివుని ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదు' అని ఒప్పుకుంటావా? అడిగాను.

'అవును. నిజమే.' అన్నాడు తప్పదన్నట్టు.

'మరి ముస్లిమ్స్ మీ దేవాలయాలను ధ్వంసం చెయ్యడం వెనుక కూడా శివుని ఆజ్ఞ ఉండే ఉంటుంది' అన్నా నవ్వుతూ.

'అదేంటి? శివుడు తన గుడిని తనే ధ్వంసం చేయించుకుంటాడా?' అన్నాడు ఎగతాళిగా.

'తప్పకపోతే మరేం చేస్తాడు?' అన్నా.

'అదేంటి? కొంచం అర్ధమయ్యేట్లు చెప్పండి' అన్నాడు అయోమయంగా.

'నీ దృష్టిలో నీ గుడి గొప్ప కావచ్చు. కానీ విశ్వమంతా వ్యాపించి ఉన్న శక్తికి, ఆ విశ్వంలోని ఒక భూమి ఎంత? ఆ భూమిమీద ఉన్న అనేక దేశాలలో నీ దేశం ఎంత? ఆ దేశంలో మారుమూలన ఉన్న ఒక గుడి ఎంత? శివుడికి నువ్వు కట్టించిన గుడి తప్ప ఇంకేదీ లేదా ఈ ప్రపంచంలో ఉంటానికి? అయినా, విశ్వవ్యాప్తశక్తి అయిన విశ్వనాధుడికి నువ్వు గుడి కట్టించగలవా? ఆలోచించి చెప్పు.' అన్నాను.

'మీరిలా మాట్లాడితే నేనేమీ చెప్పలేను.' అన్నాడు ఇంకేమీ అనలేక.

'చెప్పకు. నిన్ను చెప్పమని నేను అడగలేదు. నువ్వడిగితేనే నేను చెబుతున్నాను. నువ్వేమీ చెప్పద్దు. నాకూ వినాలని లేదు.' అన్నాను.

కాసేపు మౌనంగా ఉన్నాడు గాని, లోపల ఏదో పురుగు తొలుస్తోంది.

చివరకు మెల్లిగా - 'సరే మీరే చెప్పండి. మన గుళ్ళు ఎందుకు ధ్వంసం అయ్యాయో?' అన్నాడు.

'అలా  రా దారికి' అనుకుని చెప్పడం మొదలు పెట్టాను.

'ఏ గుడైనా మొదట్లో బాగానే ఉంటుంది. మంచి ఉద్దేశ్యంతోనే దాన్ని కడతారు. కాలక్రమేణా దానిలో లేనిపోని రాజకీయాలు చోటుచేసుకోవడం మొదలు పెడతాయి. అధికార దాహాలు, అక్రమాలు, నేరాలు, దౌర్జన్యాలు మొదలౌతాయి. లోపల్లోపల ఎన్నో లుకలుకలు సాగుతాయి కాని రెలిజియస్ ముసుగులో అవన్నీ బయటకు రాకుండా ఉండిపోతాయి. మతానికి రాజుల సహకారం తోడైతే ఇక అక్కడ జరిగే అక్రమాలు అన్నీఇన్నీ కావు. సామాన్యులను పురుగుల్లా చూడటమూ, తమకు తాము దైవాంశ సంభూతులలాగా భావించుకొని అడ్డమైన నేరాలు అక్రమాలు దౌర్జన్యాలు చెయ్యడమూ మొదలౌతాయి. ఆ అరాచకానికి అడ్డూఆపూ ఉండకుండా పోతుంది. ఈ క్రమంలో ఎంతోమంది ఆ ఇనుప చక్రాలక్రింద పడి నలిగిపోతారు. అప్పుడేం జరుగుతుంది? ' అన్నాను.

'ఏం జరుగుతుందో మీరే చెప్పండి' అన్నాడు.

'ఆ గుడిలోని దేవుడు కూడా భరించలేనంత మత దురహంకారం అక్కడివారిలో పెరుగుతుంది. అప్పుడు ఆ దేవుడే, బయట నుంచి కొంతమందిని సృష్టించి, వాళ్ళ చేత తన గుడిని తానే ఎటాక్ చేయించుకుని, దాన్ని కూలగొట్టిస్తాడు. మీ గుళ్ళలో జరిగింది కూడా అదే. ఇది అసలైన వాస్తవం.' అన్నాను.

' మీ లాజిక్ నాకు సమ్మతంగా లేదు.' అన్నాడు.

'అది నీ ఖర్మ. దానికి నేనేం చేసేది? పోనీ ఒక విషయం చెప్పు. వందల వేల సంవత్సరాల నుంచీ మంత్రాలతో, నియమాలతో, పూజలూ, పునస్కారాలూ క్రమం తప్పకుండా జరుగుతున్న ఒక గుడిలో శక్తి ఉంటుందా ఉండదా?' అడిగాను.

'తప్పకుండా ఉంటుంది' అన్నాడు.

'మరి అంతటి శక్తి ఉన్న ఆలయాలను, బయటనుంచి ఎవడో వచ్చి ఎలా ధ్వంసం చెయ్యగలడు? అంటే దీనిలో రెండే మార్గాలున్నాయి. ఒకటి - మీ గుళ్ళలో శక్తి తగ్గిపోయన్నా ఉండాలి. రెండు - వాటిని కూల్చేసిన ముస్లిమ్స్ లో మీకంటే ఎక్కువ భక్తీ శక్తీ ఉండి ఉండాలి. అంతేనా కాదా?' అడిగాను సీరియస్ గా.

జవాబు చెప్పలేక నీళ్ళు నములుతూ - 'ఆచారమూ పాడూ లేని వాళ్ళలో శక్తి ఉందంటే నేను నమ్మలేను. మాలోనే శక్తి తగ్గిపోయి ఉంటుంది.' అన్నాడు అయిష్టంగా.

'నేను చెప్పేదీ అదే. మీ గుళ్ళలో శక్తి తగ్గినప్పుడే ఇలాంటివి జరిగాయి. ఆ శక్తి ఎలా తగ్గిందంటావు? ఆలోచించు. నేను చెప్పినవే కారణాలు. మీలో దురహంకారం పెరిగిపోయింది, అక్రమాలు పెరిగాయి, రెలిజియస్ ముసుగులో నేరాలు చెయ్యడం మొదలైంది. సాటి మనుషుల మీద దౌర్జన్యాలు మొదలుపెట్టారు. ఆ అక్రమాలను దేవుడు కూడా భరించలేనంత స్థాయికి అవి చేరాయి. ఎంతోమంది ఉసురును మీరు పోసుకున్నారు. అందుకే ఒక మాలిక్ కాఫరో, ఒక అలాఉద్దీన్ ఖిల్జీనో, ఒక మహమ్మద్ గజనీనో, ఒక ఔరంగజేబో పుట్టుకొచ్చారు. వరుసగా మీ గుళ్ళమీద పడి వాటిని ధ్వంసం చేశారు. ఇంతకంటే ఇంకే కారణమూ లేదు. అనవసరంగా ముస్లిమ్స్ మీద ద్వేషం పెంచుకోకు. వాళ్ళలో మంచివాళ్ళు చాలామంది ఉన్నారు.' అని చెప్పాను.

'ఇదంతా మీ ఊహ కావచ్చుగా' అన్నాడు మళ్ళీ మొదటికొస్తూ.

'కావచ్చు. కానీ ఇంతకంటే లాజికల్ గా వేరే ఏదైనా ఉంటే చెప్పు. నేను వింటాను.' అన్నాను.

చాలాసేపు ఆలోచించాడు కానీ ఏమీ తట్టలేదు లాగుంది. ఏమీ మాట్లాడలేదు.

చివరకు నేనే ఇలా చెప్పాను.

'వివేకానందస్వామి జీవితంలో ఒక సంఘటన జరిగింది. కాశ్మీర్ లోని క్షీర్ భవాని ఆలయంలో జగన్మాత స్వరం ఆయనకు వినిపించింది. సాక్షాత్తూ అమ్మవారే ఆయనతో మాట్లాడింది. తన ఇష్టప్రకారమే తన ఆలయం ధ్వంసం కాబడిందనీ, అలా పాడుబడిన ఆలయంలో ఉండటమే తనకిష్టమనీ ఆ స్వరం చెప్పింది.' అన్నాను.

'అది ఆయన భ్రమ అయ్యి ఉండవచ్చు కదా?' అన్నాడు.

'ఆయన శిష్యుడు శరచ్చంద్ర చక్రవర్తి కూడా ఇదే సందేహాన్ని ఆయనదగ్గరే వెలిబుచ్చాడు. దానికి స్వామి చెప్పిన సమాధానం చదువు. 'స్వామి శిష్య సంవాదము' అనే తెలుగు పుస్తకంలో ఉంటుంది. ఇంగ్లీషులో అయితే Talks with Swami Vivekananda అని ఉంటుంది చూడు.

సామాన్యంగా భ్రమ అనేది మనకిష్టమైన రీతిలో ఉంటుంది గానీ మనకు నచ్చని రీతిలో ఉండదు. కనుక అది భ్రమ కాదు. పోనీ నువ్వన్నట్లే అది భ్రమ అనుకుందాం కాసేపు. అంటే - మహనీయులైన సిద్ధపురుషులతో సహా ప్రపంచంలో అందరిదీనేమో భ్రమనా?  నీదొక్కడిదీనేమో సరైన దృష్టీనా? నువ్వనుకున్నట్లుగా నీకు ఆన్సర్ వస్తే అది నిజమా? లేకపోతే భ్రమనా? ఇదేనా నీ తెలివి?' అన్నాను సీరియస్ గా.

ఏమో? నువ్వెన్ని చెప్పినా దీన్ని నేను అంగీకరించలేక పోతున్నాను' అన్నాడు చివరికి.

'దానినే మూర్ఖత్వం అంటారు మరి' అన్నాను నవ్వుతూ.

'అయితే ఇంతకీ నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావ్? అన్నాడు నసుగుతూ.

'ఏం లేదు. అమెరికాలో గుళ్ళు కట్టినంత మాత్రాన అదేదో గొప్ప విజయం అనుకోకండి. మన సంస్కృతి ఏదో గొప్పగా విస్తరిస్తోంది అని భ్రమా పడకండి. సంస్కృతి గుళ్ళలో ఉండదు. మనలో ఉంటుంది. మీలో అది లేకపోతే మీరు కట్టిన గుడి ఎక్కువ కాలం ఉండదు. కూలిపోతుంది. ఆ కూలిపోవడం ఏ రకంగానైనా కావచ్చు. అదే కూలిపోవచ్చు లేదా బయటనుంచి ఎవడైనా వచ్చి కూలగొట్టవచ్చు.

ఒక పండు లోపలనుంచి కుళ్ళడం ఎప్పుడైతే మొదలౌతుందో, బయటనుంచి అనేక పురుగులు దాన్ని ఎటాక్ చెయ్యడానికి వస్తాయి. అలాగే ఇదీ జరుగుతుంది. ముందు మీలో కుళ్ళు ఏర్పడింది. అప్పుడు బయటనుంచి ముస్లిమ్స్ వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. మీలో నీతీ, నిజాయితీ, ఐకమత్యమూ ఉంటే బయటవాళ్ళు ఎవరూ మిమ్మల్ని ఏమీ చెయ్యలేకపోదురు. లోపం మీలో ఉంది. వాళ్ళలో లేదు. తప్పులన్నీ మీ దగ్గరుంచుకుని బయటవాళ్ళను అనడం దేనికి?

ఎక్కడైనా సరే, ఒక పవర్ సెంటర్ ఎప్పుడైతే ఏర్పడిందో అక్కడ నానా అక్రమాలూ మొదలౌతాయి. గుడి కూడా ఒక పవర్ సెంటరే. పైగా అదొక రెలిజియస్ పవర్ సెంటర్. అక్కడ జరిగే అన్యాయాలకు అంతూ పొంతూ ఉండదు. ప్రస్తుతం మన తిరుమలనే చూడు. అక్కడున్నంత అవినీతి ఎక్కడా ఉండదని ప్రతివాడికీ తెలుసు. అక్కడ అందరూ భక్తులే. అందరూ దొంగలే. సాక్షాత్తూ శ్రీమహావిష్ణువే అక్కడ ఉన్నాడని నమ్ముతూ, మళ్ళీ చెయ్యకూడని అడ్డమైన పనులన్నీ చేస్తూనే ఉంటారు. దీనినేమనాలి?

కనుక దేవాలయ వ్యవస్థ మాటున అహాలూ, అక్రమాలూ, దౌర్జన్యాలూ, అవినీతీ పెరగకుండా చూచుకోవడం ముఖ్యం. అంతేగాని ఎన్ని గుళ్ళు ఏ దేశంలో కట్టామన్నది ముఖ్యం కాదు. ఎన్ని కార్యక్రమాలు అక్కడ జరుగుతున్నాయన్నదీ ముఖ్యం కాదు. మన గుళ్ళు దేవుడికి అక్కర్లేదని గ్రహించు. విశ్వమే ఆయన దేవాలయం. మీరు మళ్ళీ ఒక రాతి గుడిని కట్టక్కరలేదు. అక్కడ అడ్డమైన అక్రమాలూ చెయ్యనక్కర్లేదు.

నువ్వు చేప్పే దేవాలయ కమిటీలలో ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు. వాటిల్లో ఒకరంటే ఒకరికి పడదు. అనేక ఈగో ప్రాబ్లంస్ ఉంటాయి. ఇంటర్నల్ గొడవలు ఉంటాయి. బయటకు మాత్రం గుడి అనే ముసుగులో అన్నీ కప్పేసి మహా పవిత్రులలాగా ఫోజు కొడుతూ ఉంటారు. ఎవడికి దొరికినది వాడు మెక్కుతూ ఉంటారు. ఇక ఆ గుడిలో దైవత్వం ఎక్కడేడుస్తుంది? వాళ్ళలో వాళ్లకు రాజకీయాలు లేని ఒక కమిటీని నాకు చూపించు. చూపలేవు.

నా దృష్టిలో ఇదేమీ పెద్ద గొప్ప 'ఎచీవ్ మెంట్' కాదు. ఇలాంటి గుళ్ళు కట్టడం వల్ల నా దృష్టిలో ఎలాంటి ఉపయోగమూ లేదు. కనుక అమెరికాలో మన సంస్కృతి, గుళ్ళు కట్టడం ద్వారా విస్తరిస్తోందని నువ్వు చంకలు చరుచుకోవలసి అవసరం లేదు. ఒకవేళ చరుచుకుంటే చరుచుకో. ఇది నీ ఇష్టం. కానీ అదొక భ్రమ మాత్రమే' అని ముగించాను.

అతను చాలా విసుగ్గా ముఖం పెట్టుకుని అక్కణ్ణించి నిష్క్రమించాడు.

యధావిధిగా - నేను చెప్పినది అతనికే మాత్రమూ నచ్చలేదని మళ్ళీ చెప్పనక్కర్లేదు కదూ !
read more " హిందూ దేవాలయాలు ఎందుకు ధ్వంసం చెయ్యబడ్డాయి? "