“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

31, మే 2017, బుధవారం

రెండవ అమెరికా యాత్ర -41 (చికాగో - షాంపేన్ లలో మూడు రోజులు)

శ్రీనివాస్ గారింట్లో ఉపాహారం సేవిస్తూ

స్వాగతం చెబుతూ వేచి ఉన్న ఆలయ కమిటీ వారు


ఆలయానికి చేరుకుంటూ

స్వాగతం చెబుతున్న బ్రహ్మాండం జగన్నాధరావు దంపతులు

ఆలయ మర్యాదలతో స్వాగతం











సరస్వతీ మాత


విఘ్నేశ్వరుడు


దుర్గాదేవి





ఈశ్వరుడు

























































షాంపేన్ అనేది చిన్న టౌన్. పదిహేను నిముషాలలో టౌన్ మొత్తం చుట్టెయ్యవచ్చు. అలా ఉంటుంది. కానీ టౌన్ మొత్తం కలిసి ఒకటిగా లేదు. మధ్యమధ్యలో పొలాలు చాలా ఖాళీగా ఉన్నాయి. ఆ తర్వాత మళ్ళీ టౌన్ పెరిగింది. ఆ లాండ్స్ అన్నీ ఒక చైనీస్ లేడీ కొనేసి వాటిలో మొక్కజొన్న సాగు చేస్తూ ఉంటుందిట. ఆమె ఇక్కడ పెద్ద భూస్వామి అనీ ఆమెను అందరూ డ్రాగన్ లేడీ అని పిలుస్తారనీ చెప్పారు. ఇక్కడ యూనివర్సిటీ ఉండటంతో, ల్యాండ్ రేట్లు చాలా ఎక్కువని తెలిసింది. ఇక్కడ రియల్టర్లుగా చైనీస్ అక్కడక్కడా కనిపిస్తున్నారు.

ఆస్ట్రేలియాలో కూడా ఇప్పుడు చైనీస్ ఎక్కువయ్యారు. పదేళ్ళ క్రితం కంటే ఇప్పుడు డబల్ అయిపోయారు. అక్కడ భూములు, వ్యాపారాలు మొత్తం వారే సాగిస్తున్నారు ఇప్పుడు. అలాగే అమెరికాలో కూడా వారి ప్రాబల్యం నెమ్మదిగా పెరిగిపోతున్నది. మనవాళ్ళు మాత్రం మామూలేగా ! కులసంఘాలు మతసంఘాలు పెట్టుకుని కొట్టుకుంటున్నారు. అదీ ఇక్కడి పరిస్థితి !!

సరస్వతీదేవిని తంత్రంలో తారాదేవిగా ఆరాధిస్తాము. ఆమె నా ఆరాధ్యదేవత. ఈ ఆలయం ఊరిబయటగా పొలాలలో ఉన్నది. సామాన్యంగా సరస్వతీ దేవికి ఆలయాలు ఎక్కువగా ఉండవు. ఎందుకని మీరిక్కడ ఈ ఆలయం కట్టారని శ్రీనివాస్ ను అడిగాను. ఇక్కడ ఇల్లినాయ్ (Illinois) యూనివర్సిటీ ఉన్నది. అది చాలా ఫేమస్ విద్యా సంస్థ. ఎకౌంటింగ్ లో నంబర్ వన్. అలాగే కంప్యూటర్స్ లో కూడా మంచి పేరుంది. ఇక్కడ మన ఇండియన్ ప్రోఫెసర్స్ చాలామంది ఉన్నారు. సరస్వతీ దేవి విద్యాదేవత గనుక వారు ఈ ప్లాన్ చేశారు. అలా ఈ ఆలయం వచ్చిందని ఆయన చెప్పారు.

మాటల్లోనే ఆలయానికి చేరుకున్నాం. అక్కడ ఒక ఆశ్చర్యం మాకోసం ఎదురుచూస్తున్నది.

మేము కార్లు దిగడం తోనే, పూర్ణకుంభంతో ఆలయ మర్యాదలతో మాకు స్వాగతం చెప్పడానికి ఆలయ కమిటీ ప్రెసిడెంట్ బ్రహ్మాండం జగన్నాధరావుగారు,వారి ధర్మపత్ని, ఆలయపూజారి ఎదురుగా నిలబడి ఉన్నారు. సాంప్రదాయపూర్వకంగా కాళ్ళు కడిగి మరీ మమ్మల్ని సాదరంగా ఆహ్వానించి ఆలయంలోకి తీసుకెళ్ళారు. మాటల సందర్భంలో ఆయన జిల్లెల్లమూడి అమ్మగారికి బంధువు అవుతారనీ, నాన్నగారి (బ్రహ్మాండం నాగేశ్వరరావుగారు) వైపు నుంచి వారికి బంధుత్వం ఉన్నదనీ తెలిసింది. ఈ విషయం తెలిసి నా ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అమ్మ పేరు చెబితే మనకు ఒళ్ళు తెలీదు కదా మరి !!


విశ్వజనని శ్రీ అనసూయాదేవి (జిల్లెళ్ళమూడి అమ్మగారు)

ఎన్నో వేల మైళ్ళ దూరంలో ఉన్న ఈ ఆలయానికి నేను అనుకోకుండా వస్తే, ఇక్కడ అమ్మ బంధువులు ఉండటం, వారు నాకు స్వాగతం పలకడం మిరకిల్ కాకుంటే మరేమిటి? పైగా జగన్నాధరావుగారిలో అమ్మ పోలికలు ఉన్నాయి. ఆయన్ను చూస్తుంటే అమ్మను చూస్తున్నట్లే ఉన్నది !!

అమ్మే ఈ విధంగా నన్ను ఆదరిస్తున్నదనీ, స్వాగతం చెప్పిస్తున్నదనీ నాకర్ధమైంది. పొంగి వస్తున్న కన్నీటిని బలవంతంగా ఆపుకున్నాను. అమ్మ అనుక్షణం నాతో ఉన్నదనడానికి ఇలాంటి అద్భుతాలను ఇప్పటివరకూ ఎన్నో నా జీవితంలో చూచాను. ఈ కృపకు దూరంతో సంబంధం లేదు. ఎంత దూరంలోనైనా, ఎలాంటి పరిస్థితిలోనైనా ఈ విధంగా అమ్మ అనుగ్రహం నాపైన వర్షించడం నేను చాలాసార్లు గమనించాను.

ఈ ఆలయంలో విఘ్నేశ్వరుడు, పరమశివుడు, దుర్గాదేవి, సరస్వతీదేవి మూర్తులు ఉన్నాయి. వీరు గాక ఇతర దేవతలు ఒక వైపుగా వరుసగా ఉన్నారు. ఆలయ ముఖ్యదేవత మాత్రం సరస్వతీదేవి.

ఆలయ కమిటీ సభ్యులతో పరిచయం అయ్యాక, నా గురించి కొంత వివరిస్తూ సభికులకు నన్ను జగన్నాధరావుగారు పరిచయం చేశారు. తదుపరి ఉచితాసనం మీద ఆసీనుడనై, గురుస్మరణ, శ్రీమాతృస్మరణ, శ్రీరామకృష్ణ స్మరణ గావించి ఉపన్యాసం ప్రారంభించాను. ఏడు గంటల నుంచి ఎనిమిది గంటల వరకూ, లలితాసహస్రనామాల గురించి, శ్రీవిద్యోపాసన గురించి వివరిస్తూ ఉపన్యాసం సాగింది. పరాశక్తి ఆలయంలో చెప్పినట్లుగా కాకుండా, కొంచం మార్చి, ఇతర విషయాలను కొన్నింటిని సందర్భోచితంగా ఉటంకిస్తూ ఇంగ్లీషులో ఉపన్యాసం ఇచ్చాను.

ఆడియన్స్ లో కొందరు నార్త్ ఇండియన్స్ ఉండటమే ఇంగ్లీషులో ఉపన్యాసం ఇవ్వడానికి కారణం. ఉపన్యాసం తర్వాత సభ్యులతో ప్రశ్నలు - జవాబులు కార్యక్రమం జరిగింది. ఆ వివరాలు తర్వాతి పోస్ట్ లో ఇస్తాను.

ఉపన్యాసాన్ని అందరూ చాలా శ్రద్దగా విన్నారు. ఆడియన్స్ అందరూ బాగా చదువుకున్నవాళ్ళు. సంస్కార వంతులు. వారికి నా ఉపన్యాసం బాగా నచ్చిందని వేరే చెప్పనవసరం లేదు కదా. ఆడియన్స్ లో ఒకరైన డా|| కోయిలీ మరుసటి రోజున తమ అభిప్రాయాన్ని శ్రీనివాస్ గారికి ఈ విధంగా ఈ మెయిల్ చేశారు.

Dear Dr. Rao,

I just want to thank you for bringing the speaker yesterday to our temple.

I was very impressed and happy to be part of the group yesterday. It is not only because he is dikshit from the Ramkrishna Mission school of thought or is a follower of our revered saint Ramkrishna Paramhansa Dev, but his delivery was awesome and he touched upon some very very pertinent issues which we come across, when people question us on Hinduism. 

We were truly fortunate to have him in our temple, and I could see that his knowledge was deep, his mind crystal clear. 

Please know that I will be happy to promote a larger and more widely circulated talk by him on general Hinduism - if possible in the distant future. 

We have much to learn from him. Our thanks should be conveyed to Mr. Srinivas.

Regards,

Koeli M. Goel   
Research Post Doctoral Fellow,
Institute of Communications Research
University of Illinois at Urbana-Champaign


ఉపన్యాసం తర్వాత అమ్మ సమక్షంలో వేదమంత్రాలతో నాకు సత్కారం జరిగింది. ఆ ఫోటోలన్నీ పైన చూడవచ్చు. ఇదంతా అమ్మే స్వయంగా చేస్తున్నట్లు నాకనిపించింది.

అదే మాటను వారితో అన్నాను.

శ్రీనివాస్ నవ్వుతూ ఇలా అన్నారు.

' ఇంకో సర్ప్రైజ్ మీకోసం రెడీగా ఉంది. ఇదే ఊరిలో ఒకామె ఉన్నారు. ఆమె పేరు మంజు ఆంటీ. ఆమె నాన్నగారు 'గోకుల్ దాస్ డే' స్వయానా శ్రీ శారదామాతను చూచి ఆమె ఆశీస్సులు పొందిన ధన్యుడు. ఆమె ఇక్కడే నివసిస్తుంటారు. ఇవాళ ఎందుకనో ఆలయానికి రాలేదు. కానీ ఆమె మాతోనే ఇక్కడే ఉంటారు.'

నేను సంభ్రమంగా ఇలా అన్నాను.

'నేనామెను కలవాలి. రేపు మనం వెళ్లి ఆమెను కలుద్దాం. ఆమెకు వీలవుతుందో లేదో ఫోన్ చేసి అడగండి'

'అలాగే' అంటూ శ్రీనివాస్ ఆమెకు ఫోన్ చేశారు.

'రేపు ఉదయం పదిన్నరకు ఆమే మన ఇంటికి వస్తానని చెప్పారు' ఫోన్ కట్ చేస్తూ అన్నారు శ్రీనివాస్.

నాకు ఆనందం ఇంకా ఎక్కువై పోయింది. ఏం మాట్లాడాలో అర్ధం కాలేదు.

ఒక వారం రోజుల పాటు వారితో కలసి ఉండమని వారందరూ నన్ను చాలా కోరారు. వేరే పనులు ఉన్నందున సున్నితంగా వారి అభ్యర్ధనను తిరస్కరించాను. కనీసం ఈసారి వచ్చినప్పుడైనా అక్కడకు తప్పకుండా రావాలని కమిటీ సభ్యులు కోరారు. తప్పకుండా వస్తానని వారికి మాటిచ్చాను. ఆ తర్వాత డిన్నర్ కార్యక్రమం జరిగింది. ఆ తదుపరి కాసేపు వారితో మాట్లాడి వారినుంచి సెలవు తీసుకుని శ్రీనివాస్ గారింటికి వచ్చేశాము.