14, జూన్ 2014, శనివారం

బాకీ తీర్చుకుంటున్న శపితయోగం

శపిత యోగం 24-12-2012 న మొదలైంది.

అప్పటినుంచీ ప్రపంచవ్యాప్తంగా జరిగిన దుర్ఘటనలను ఎవరైనా ఒకచోట పోగుచేసి చూస్తే ఎన్ని వేలమంది ఎన్నెన్ని విచిత్ర కారణాలతో లోకాన్ని వదలి వెళ్ళిపోయారో అర్ధమౌతుంది.ఆసంఖ్య లక్షలలో కూడా ఉండవచ్చు. ఆత్మహత్యలూ,యాక్సిడెంట్లూ,దుర్మరణాలూ,ప్రకృతివిలయాలూ ఇలా ఒకటి కాదు రకరకాలుగా శపితయోగం అనేది తన ప్రభావాన్ని చూపింది.ఎవరెవరు చేసుకున్న చెడుకర్మ వారిని వదలకుండా వెంటాడింది.ఫలితాలను అనుభవింపజేసింది.

ఇదంతా జరుగుతుందని నేను అప్పుడే హెచ్చరించాను.తమ తమ పద్దతులను వేగంగా మార్చుకోకపోతే భయానకమైన పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని అనేక పాత పోస్ట్ లలో సూచించాను.కావలసినవారు శపితయోగం మీద నేను వ్రాసిన పాత పోస్ట్ లు ఒక్కసారి చూడండి. అలాగే కాలజ్ఞానం పోస్ట్ లూ చూడండి.నిత్యనైమిత్తిక ప్రళయాలు అనేకం జరుగుతాయనీ ఎంతమందివో ప్రాణాలు ఈ క్రమంలో పోతాయనీ నేను సూచించాను.ఈ 19 నెలలలో అంతా ఊహించినట్లే జరిగింది.

ప్రస్తుతానికి త్వరలో శపితయోగం అయిపోవస్తున్నది.కనుక మిగిలిపోయిన బాకీలను అది వేగంగా తీర్చుకుంటున్నది.ప్రస్తుతం ఎక్కడ చూచినా జరుగుతున్న దుర్ఘటనలు దీని ప్రభావమే.

మొన్న 8 నుంచి 10 లోపు గనుక గమనిస్తే ఎన్నెన్నో దుర్ఘటనలు జరిగాయి.మచ్చుకి ఒకటి రెండు సంఘటనలు చెబుతాను.మీమీ జీవితాలలో మీ చుట్టుపక్కలవారి జీవితాలలో గమనిస్తే మీరుకూడా ఎన్నో సంఘటనలను చూడవచ్చు.

మా కొలీగ్ వాళ్ళ అన్నయ్య హైదరాబాద్ లో ఉంటాడు.పని ముగించుకుని ఆఫీస్ నుంచి ఇంటికి వస్తూ రోడ్డు అంచు దగ్గర టూ వీలర్ స్కిడ్ అయి కింద పడిపోయాడు.కణతకు రాయి కొట్టుకుని కోమాలోకి పోయి మరుసరిరోజు ఆస్పత్రిలో చనిపోయాడు.అతనికి 37 ఏళ్ళు.

మా ఫోటోగ్రాఫర్ భార్యకు ఉన్నట్టుండి బ్రెయిన్ లో రక్తం క్లాట్ అయ్యి అదే రోజున గుంటూరులో ఆస్పత్రిలో చేరింది.అప్పటినుంచీ కోమాలో ఉన్నది.పరిస్తితి ఇంకా ప్రమాదకరమే అంటున్నారు.

బియాస్ నది దుర్ఘటన కూడా అప్పుడే జరిగింది.

నిత్యజీవితంలో గమనిస్తే యాక్సిడెంట్లూ,ఉన్నట్టుండి రోగాలతో ఆస్పత్రిలో చేరడాలూ,విచిత్ర పరిస్తితులలో చనిపోవడాలూ ఎన్నో కేసులను ప్రతిరోజూ గమనించవచ్చు.ఇవన్నీ శపితయోగ ప్రభావాలే.

అందుకే చెడుకర్మను పోగుచేసుకోకూడదు అని మన పెద్దలు గట్టిగా చెప్పేవారు.పద్దతిగా బ్రతకాలి అనీ,ఎవరి హద్దులలో వారు ఉండాలనీ మరీమరీ అనేవారు.డబ్బు అహంకారంతోనో,పదవీ అహంకారంతోనో,ఇంకా రకరకాల అహంకారాలతో కన్నూ మిన్నూ గానక కర్మ పోగుచేసుకుంటారు. చేసేటప్పుడు నవ్వుతూ చేస్తారు.అనుభవించేటప్పుడు ఏడుస్తూ అనుభవిస్తారు.'అయ్యా బాబూ మమ్మల్ని రక్షించండి.సహాయం చెయ్యండి'- అంటారు.కాని అహంకారంతో కర్మను పోగుచేసుకునేటప్పుడు అదే బుద్ధి ఉండదు.మీరు ఇతరులను బాధపెట్టినపుడు వారుకూడా ఇలాగే రక్షించమని ఏడిచి ఉంటారన్న సంగతి గుర్తుంచుకోవాలి.

ప్రతివారూ తాము చాలా మంచివాళ్ళమని అనుకుంటారు.మేమేమీ తప్పులు చెయ్యలేదు.మాకిలా ఎందుకు జరుగుతున్నదో తెలియడం లేదు అనుకుంటారు.దేవుడు లేడు ఉంటె ఇలా ఎందుకు జరుగుతుంది? అనుకుంటారు.దేవుడు ఉండబట్టే ఇలా జరుగుతున్నది.ఎవరి తప్పులకు వారికి శిక్షలు పడుతున్నాయి.

గతం స్వచ్చంగా ఉంటె మనకు ఏ విధమైన చెడూ జరగదు.గతంలో ఎన్నో తప్పులు చేశాము గనుకనే ఇప్పుడు బాధలు పడుతున్నాము.గతజన్మలు గుర్తు తెచ్చుకునే సామర్ధ్యం అందరికీ ఉండదు. కానీ ఈజన్మలోనే వెనక్కు తిరిగి చూచుకుంటే మనం చేసిన అనేక తప్పులు స్పష్టంగా కనిపిస్తాయి.

మాటలతో ఇతరులను బాధించడం,నమ్మకద్రోహం చెయ్యడం,గురునింద చెయ్యడం,అనవసరంగా ఇతరులను నోరుపారేసుకుని దూషించడం,పొగరుగా మాట్లాడటం,నోరుతెరిస్తే అబద్ధాలు చెప్పడం,ఇతరులను మోసంచెయ్యడం, వారికి న్యాయంగా రావలసిన వాటిని మనం కాజేయ్యడం,ఇతరుల అవకాశాలను చెడగొట్టడం,మన స్వార్ధంకోసం ఇతరులను ఏడిపించడం ఇలా రకరకాలుగా మనం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాం.అవన్నీ ఎక్కడా రికార్డ్ కావని మనం అనుకుంటాం.అవేవీ వృధాగా పోవు.

మనం ఒకర్ని ఏడిపిస్తే మనమూ ఏడవక తప్పదు.మనం ఒకరిని మోసం చేస్తే మనమూ మోసపోక తప్పదు.మనం ఒకరి ప్రాణం తీసుకుంటే మన ప్రాణమూ అర్పించక తప్పదు.ప్రతి చర్యకూ ప్రతిచర్య తప్పకుండా ఉంటుంది.

మానవ న్యాయస్థానంలో మనకు శిక్ష పడకపోవచ్చు కాని కర్మస్థానంలో మనకు శిక్ష తప్పదు.ఆ సమయం వచ్చినపుడు మనం చేసిన ప్రతిదానికీ మనం జవాబు చెప్పవలసి ఉంటుంది.దీనిని ఎవరూ తప్పించలేరు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నది అదే.ఈ 19 నెలల శపితయోగం త్వరలో అంటే జూలై పదమూడు తో అయిపోతున్నది.కానీ సంధ్యాసమయం ఒక నెలపాటు ఉంటుంది.అంటే ఆగస్ట్ 15 వరకూ అది ఉంటుంది.ఈ లోపల ఇంకా ఎన్నో ఎన్నెన్నో దుర్ఘటనలు జరుగబోతున్నాయి.ఎవరెవరి కర్మానుసారం వారికి దైవన్యాయస్థానంలో శిక్ష పడబోతున్నది.

పెట్రోల్ కేంద్రాల ప్రమాదాలూ,రోడ్డు జల వాయుయాన ప్రమాదాలూ,అగ్ని ప్రమాదాలూ,ఆత్మహత్యలూ,హత్యలూ,దోపిడీలూ,తీవ్రవాదుల చర్యలూ,విద్రోహ చర్యలూ,సామూహిక దుర్మరణాలూ ఇలాంటివన్నీ రాహువు యొక్క పరిధిలోకే వస్తాయి.

వేచి చూడండి.రాబోయే రెండునెలలలో రోజుమార్చి రోజు జరిగే సంఘటనలు చూచి నామాటలు నిజమే అని మీరే ఒప్పుకుంటారు.
read more " బాకీ తీర్చుకుంటున్న శపితయోగం "

13, జూన్ 2014, శుక్రవారం

బ్యాస్ నది దుర్ఘటన-ఇతర ప్రమాదాలు - కారణం ఏమిటి?

రాహుకేతువుల ప్రభావాలు చాలా విచిత్రంగా హటాత్తుగా ఉంటాయి. హటాత్తుగా జరిగే దుర్ఘటనలలో వీరిపాత్ర తప్పకుండా ఉంటుంది.వీరితో పాటు యురేనస్ పాత్ర కూడా ఉంటుంది.

ప్రస్తుతం రాహుకేతువులు రాశిమారబోతున్నాయి.ప్రస్తుతం తులా,మేష రాశులలో ఉన్న వీరు త్వరలో కన్యా మీన రాశులలోకి రాబోతున్నారు.వీరు రాశులు మారేటప్పుడు ఇలాంటి దుర్ఘటనలు జరగడం చాలా సహజం.తాంత్రిక జ్యోతిష్యవిజ్ఞానంలో దీనిని "సంధికాలం" అంటారు.

ఇలాంటి 'సంధికాలం'లో దుడుకుపనులూ సాహసకృత్యాలూ చెయ్యరాదు.కానీ ఆ సమయానికే అలాంటి పనులు చెయ్యాలన్న 'ఊపు' చాలామందిలో వస్తుంది.ఆ 'ఊపే' యమలోకానికి దారి చూపుతుంది.అనుభవించవలసిన కర్మ ఉన్నవారు ఇలాంటి 'ఊపు' కు లోనౌతారు.ఇలాంటి సంధికాలంలో ఈ శక్తులకు చాలా బలం ఉంటుంది.కానీ అవి కొంతమందినే వేటాడతాయి.అందరి వెంటా అవి పడవు.ప్రశాంతంగా ఉన్నవారిని అవి ఏమీ చెయ్యవు.చాలా అస్థిరమైన,డోలాయమానమైన మానసికస్థితిలో ఒక విధమైన భావోద్రేకస్థితిలో ఉన్నవారినే అవి టార్గెట్ చేస్తాయి.

'ఎంతచెప్పినా వినకుండా వెళ్ళాడు ప్రమాదానికి గురయ్యాడు'- అని చాలామంది అనుకోవడం మనం వింటూ ఉంటాం.అలా ఎవరెంతగా చెప్పినా వినని పరిస్థితే కర్మానుభవానికి అసలైన కీలకం.అనుభవించవలసిన బలమైన కర్మ ఉన్నప్పుడు ఎవరు ఎంత చెప్పినా వినబుద్ధి కాదు.మనిషి జుట్టు పట్టుకుని పూర్వకర్మ అలా ఈడ్చుకుపోతుంది.ఇలా జరగటం ఎంతోమంది జీవితాలలో నేను చూచాను. నేటికీ చూస్తున్నాను.

ఉదాహరణకు మొన్న బ్యాస్ నదిలో జరిగిన సంఘటనలో ఒడ్డుమీద నిలబడి ఉన్నవారికి ఏమీ కాలేదు.దుడుకుగా నది లోలోపలకు వెళ్లి రాళ్ళమీద నిలబడి అదేదో గొప్పలాగా ఫీలౌతూ పోజులిచ్చినవారు జలసర్పానికి బలై పోయారు.ఈ వీడియోను గనుక బాగా జాగ్రత్తగా పరిశీలిస్తే పైనుంచి ఉరుకుతూ వచ్చిన నీరు అనేక తలలున్న ఒక మహాసర్పం లాగా కనిపిస్తుంది.నేను చెప్పిన కోణంలో మళ్ళీ ఇంకొకసారి ఆ వీడియోను చూడండి.నేను చెబుతున్నది నిజమే అని అర్ధమౌతుంది.జాగ్రత్తగా చూస్తె ఆ నీటిలో ఒక మహాసర్పం కనిపిస్తుంది.అదే రాహుప్రభావం. మార్మిక విషయాలు అన్నీ ఇలాగే ఉంటాయి.

మొన్న చనిపోయిన 25 మంది విద్యార్ధుల జాతకాలు పరిశీలిస్తే కొన్ని ఆశ్చర్యకరమైన కామన్ కాంబినేషన్స్ తప్పకుండా రిపీట్ అవుతూ మనకు ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి.కొన్ని వందల జాతకాలను పరిశీలించిన మీదట నేను ఈ మాటను చాలా నమ్మకంతో చెప్పగలుగుతున్నాను.జ్యోతిష్యం అనేది ఒక ఖచ్చితమైన డివైన్ సైన్స్ అని నా కేస్ ఫైల్స్ లోని అనేక ఉదాహరణలతో నిరూపించగలను.

ఇలాంటి సంఘటనలలో 'టైమింగ్' అనేది చాలా ఊహాతీతంగా సరిపెట్టబడుతుంది.కొన్ని ఉదాహరణలు చూద్దాం.

1.ఎక్కడినుంచో ఒక కారు వస్తుంటుంది.పెట్రోల్ పోయించుకుందాం అని ఒక బంక్ దగ్గర ఆగుదామని అనుకుంటారు.కానీ మళ్ళీ కొందరు 'తర్వాత వచ్చే పెట్రోల్ బంక్ లో పోయించుకుందాం.ఇక్కడ బాగుండదు.' అంటారు.సరే అని ఆగబోతున్నవారు కూడా మళ్ళీ బయలుదేరతారు.కొద్ది దూరం వెళ్ళేసరికి రైల్వేక్రాసింగ్ దగ్గర రైలును గుద్దుకుని కారులోని వారు అందరూ చనిపోతారు.

ఇది కల్పితం కాదు.ఇలాంటి సంఘటనలను నేను ఎన్నో చూచాను.కనుక చెబుతున్నాను.'పెట్రోల్ బంక్ దగ్గర ఒక్క క్షణం ఆగినా బాగుండేది ఈ ప్రమాదం తప్పేది' అని బ్రతికి బయటపడిన ఒకరో ఇద్దరో ఏడుస్తూ మొత్తుకోవడం చాలాసార్లు చూచాము.

2.దీనికి రివర్స్ గా కూడా జరుగుతుంది.టీ నొ లేదా కూల్ డ్రింక్సో  త్రాగుదామని దారిలో ఆగి ఆ తర్వాత బయలు దేరుతారు.సరిగ్గా ఒక రైల్వే గేట్ దగ్గర ప్రమాదానికి గురౌతారు.

'అక్కడ ఆగకపోయినా బాగుండేది.దీనిని తప్పుకొని ముందుకు పోయి ఉండేవాళ్ళు.అనవసరంగా ఆగి సరిగ్గా ఆ టైముకు చావు నోట్లో పడ్డారు.' అని వాపోవడం కూడా మనం చూస్తుంటాం.

ఇంతకీ నేను చెప్పేదేమంటే ఆగినా ఆగకపోయినా రాసిపెట్టి ఉన్నపుడు ఆ 'టైమింగ్' అనేది చాలా ఖచ్చితంగా కో ఆర్డినేట్ చెయ్యబడుతుంది.ఖచ్చితంగా అదే సమయానికి అక్కడకు చేరి ఆ ప్రమాదం నోట్లో పడతారు.ఒక్క అయిదారు సెకండ్లు తేడా వచ్చినా ఆ ప్రమాదం తప్పిపోతుంది.కానీ అలా జరగదు.చాలా ఖచ్చితంగా అదే సమయానికి వారు అక్కడకు చేరి ప్రమాదానికి గురౌతారు. 

ఇదంతా ఎలా జరుగుతుంది?ఈ టైమింగ్ సరిగ్గా ఆ సమయానికే ఎలా సరిపోతుంది?అనేది మానవ ఊహకు అందదు.ఇక్కడే మనకు కనబడని కొన్ని శక్తులు ఉన్నాయనీ మన ఆలోచన ఒక్కటే 'సుప్రీం' కాదన్న విషయం మనకు తడుతుంది.

చివరి క్షణంలో ప్రయాణం మానుకొని ప్రమాదాన్ని తప్పించుకున్న వారు ఉంటారు.అలాగే అనుకోకుండా చివరి క్షణంలో బయలుదేరి ప్రయాణం చేసి పరలోకానికి వెళ్ళేవారూ ఉంటారు.ఇదంతా అనూహ్యమైన కర్మప్రభావం వల్ల జరుగుతుంది.కర్మను నమ్మవలసిన తప్పనిసరి పరిస్థితి ఇలాంటి సంఘటనలు చూచినప్పుడు మనకు కలుగుతుంది.

ఇలాంటి ప్రమాదాలు జరగబోతున్నాయని వ్యక్తిగత జాతకాలు చూచి గ్రహించవచ్చు.అలాగే సామూహికంగా కూడా గ్రహించవచ్చు.అలాగే జ్యోతిష్య సహాయం లేకుండా కూడా యోగదృష్టితో తెలుసుకోవచ్చు.ఇవన్నీ సాధ్యమే.అయితే జరగబోయేదాన్ని తప్పించడం సాధ్యమేనా? అన్నది అసలైన ప్రశ్న.

దీనికి రెండు జవాబులున్నాయి.

తప్పించడం సాధ్యమే.

తప్పించడం సాధ్యం కాదు.

దృఢకర్మ అయినప్పుడు దానిని తప్పించడం సాధ్యం కాదు.ఒకవేళ సాధ్యం చెయ్యాలంటే ఆ జీవికి బదులు ఇంకొక జీవిని బలి ఇవ్వవలసి ఉంటుంది.'బలి' అనే కాన్సెప్ట్ దీనినుంచే పుట్టింది.కానీ అలా చెయ్యడం వల్ల ఆ కర్మ సమయానికి పోస్ట్ పోన్ అవుతుంది.ఆ తర్వాత ఇదీ అదీ కలిపి చక్రవడ్డీతో కట్టవలసి వస్తుంది.

దృఢకర్మ కానప్పుడు దానిని మనం తప్పించవచ్చు.అయితే దానికి అతీతదృష్టీ,యోగశక్తీ ఉండాలి.అప్పుడు కూడా ఆ కర్మలో కొంత మనం అనుభవించవలసి వస్తుంది.అలా అనుభవించకుండా దానిని పూర్తిగా కేన్సిల్ చెయ్యడమూ సాధ్యమే.అయితే ఇలా చెయ్యడానికి కొన్ని అర్హతలుండాలి.

కర్మపరిహారం చేయించుకునే వ్యక్తికి నూటికి నూరుశాతం నిజాయితీ ఉండాలి.తానుచేసిన పనులకు పశ్చాత్తాపం ఉండాలి.బాధ ఉండాలి.అలాగే, పరిహారం చేసేవారికి యోగశక్తిలో అత్యున్నత స్థాయులు అంది ఉండాలి.ఆ బాధలు పడే వారిమీద కరుణా జాలీ ఉండాలి.అప్పుడు మాత్రమే కర్మను పూర్తిగా కేన్సిల్ చెయ్యడం సాధ్యమౌతుంది.అయితే ఆ క్రమంలో కూడా ఆ కర్మను ఏదో ఒక దానిచేత అనుభవింపచెయ్యడం జరుగుతుంది.సాధారణంగా అటువంటి యోగులు అలా చెయ్యకుండా,ఆ బాధలు తామే పడి ఎదుటివారికి ఊరటను కలిగిస్తారు.ఎందుకంటే కర్మనియమాన్ని ఉల్లంఘించడం మంచిది కాదని వారికి తెలుసు.

ఇవన్నీ చాలా గుప్తమైన విషయాలు.మామూలు మనుషుల దృష్టికి దూరంగా అతీతంగా జరిగే పనులు.ఇవన్నీ ఎలా జరుగుతాయో సామాన్యజనానికి అర్ధం కావు.కనుక వారికి అర్ధమైన రీతిలో ఏదేదో ఊహించుకుని 'ఇది కారణం అంటే అది కారణం' అనుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూ ఉంటారు.

ఇలాంటి దుర్ఘటనలు జరిగే ప్రదేశంలో కొన్ని శక్తులు వచ్చి చేరుతాయి.లేదా అంతకు ముందు ఎంతోకాలం నుంచీ అక్కడ ఉంటాయి.వాటిని చూచే సామర్ధ్యం ఉంటే ఆ సమయానికి అవి చేసే గోల చాలా దారుణంగా ఉంటుంది. కొన్ని ఆనందంతో గంతులేస్తూ ఉంటాయి.ఇతరులకు హాని జరిగితే చూచి ఆనందించే శాడిస్ట్ మనుషులు ఉన్నట్లే ఈ శక్తులలో కూడా అలాంటివి ఉంటాయి.అవి కాసేపట్లో జరగబోయే దుర్ఘటనను చూస్తూ ఆనందంతో పిచ్చిగా గంతులేస్తూ ఉంటాయి.ఇంకొన్ని మంచిశక్తులు బాధపడుతూ,చుట్టూ ఉన్నవారికి కొన్ని సూచనలు చెయ్యాలని,ప్రమాదాన్ని తప్పించాలనీ ప్రయత్నిస్తూ ఉంటాయి.వాటి శక్తిమేరకు అవి కొన్ని సూచనలు చెయ్యగలుగుతాయి కూడా.కాని అక్కడ మూగిఉన్న జనంలో ఎవరూ సామాన్యంగా వాటిని పట్టించుకోరు.అంతటి అంతర్దృష్టి వారికి ఉండదు.

అలాంటి సన్నివేశాలలో ఆయా పరిసరాలలో ఏదో తెలియని ఒక విధమైన 'ఊపూ ఉత్సాహమూ'ఉంటాయి.ఎవరిమాటా ఎవరూ వినే పరిస్థితి అక్కడ ఉండదు.అంతా గోలగోలగా ఉంటుంది.ఇలాంటి శక్తులకు ఖచ్చితంగా అలాంటి పరిస్థితులే కావాలి.అలాంటి భావోద్రేక వాతావరణం వాటికి ఆహారంగా ఉపయోగపడుతుంది.ఇక అవి విజ్రుంభిస్తాయి.యోగదృష్టి ఉంటే నేను వర్ణించిన 'సీన్' అంతా ప్రత్యక్షంగా దర్శించవచ్చు.ఇది అబద్దమో అతిశయోక్తో ఎంతమాత్రం కాదు.ఇదంతా నిజమే.అయితే చూచే శక్తి మనకు ఉండాలి.

ఇలాంటి ప్రమాదాలలో చిక్కుకున్న వారిలో కొందరు ఇతరులను రక్షించి తాము బలైపోతారు.ఇది మరీ విచిత్రం.ఇలాంటి కర్మను అర్ధం చేసుకోవడంలో ఎన్నో లోతుపాతులు ఉంటాయి.ఎన్నో పెర్ముటేషన్స్ కాంబినేషన్స్ ఉంటాయి. ఆయా లోతులు గమనిస్తే దిగ్భ్రమ కలుగుతుంది.మానవజీవితం ఎంత విచిత్రమైనదో వెంటనే అర్ధమైపోతుంది.

సరే మార్మికకారణాలు అలా ఉంచుదాం.ఎవరో కొద్దిమంది తప్ప అందరూ వీటిని అర్ధం చేసుకోలేరు.అనుసరించలేరు.కనుక వాటిని కాసేపు పక్కన ఉంచి మనం మామూలుగా చెయ్యగలిగేవి ఎంతవరకూ చెయ్యగలమో చూద్దాం.

ఈరోజుల్లో విద్యార్ధులకు 'స్కిల్స్' అనేవి ఏమీ ఉండటం లేదు.కనీసం 'స్కౌటింగ్' మొదలైన నైపుణ్యాలూ, లైఫ్ సేవింగ్ స్కిల్సూ వారిలో శూన్యం.ఎంతసేపూ కోళ్ల ఫారంలో కోళ్ళను ఉంచి టైముకు గింజలువేసి వాటిచేత గుడ్లు పెట్టించినట్లుగా, కార్పోరేట్ కాలేజీలలో హాస్టళ్ళలో వారిని ఉంచి,రోజుకు ఇరవైనాలుగు గంటలూ చదివించి వాళ్ళచేత మార్కులు రాబడుతున్నారు గాని,జీవితంలో ఉపయోగపడే ఇతర నైపుణ్యాలు వారికీ ఏమీ నేర్పడం లేదు.పైగా ఎండ తగిలితే పిల్లలు కందిపోతారని ఏసీ క్లాస్ రూమ్స్ కూడా ఏర్పాటు చేస్తున్నారు.అలాంటి పిల్లలలో రోగనిరోధక శక్తి వేగంగా క్షీణించి కొంచంసేపు ఎండలోకొస్తే కూలబడి సెలైన్ పెట్టవలసిన పరిస్థితికి వారు వస్తున్నారు.

ఈ క్రమంలో విద్యార్ధులు విపరీతమైన మానసిక ఒత్తిడికి గురవడం ఒకటి.రెండోది చదువు తప్ప ఇంకేమీ చాతకాని దద్దమ్మలుగా వాళ్ళు తయారౌతున్నారు.ఎడిషనల్ స్కిల్స్ చాలా అవసరం అన్న విషయం వారికి తోచడం లేదు.మనమూ నేర్పడం లేదు.ఇది చాలా తప్పు.

పోతే,తల్లిదండ్రులు చేస్తున్న ఇంకొ ఘోరమైన తప్పు ఏమంటే,పదో తరగతికి ఇంకా రాకముందే స్మార్ట్ ఫోన్ కొని ఇవ్వడమూ ఒక స్పోర్ట్స్ బైక్ కొనివ్వడమూ అచ్చోసిన ఆంబోతులాగా ఊరిమీద వదిలేయ్యడమూ చేస్తున్నారు.దీనివల్ల ఎనిమిది తొమ్మిది తరగతులలోనే ప్రేమలు,ఇల్లు వదిలి లేచిపోవడాలు,పెళ్ళికి ముందే ఎబార్షన్లూ,నానా భ్రష్టత్వాలూ కలుగుతున్నాయి.నేర్పవలసిన అసలైన 'లైఫ్ సేవింగ్ స్కిల్స్' మాత్రం నేర్పకుండా ఇలాంటి దరిద్రాలు వాళ్లకు మనమే నేర్పిస్తున్నాం.ఏదన్నా జరిగితే మళ్ళీ మనమే ఏడుస్తున్నాం.ఇదీ మన వరస.

ఇలాంటి సంఘటనలకు వ్యవస్థా కారణమే,వారివారి కర్మా కారణమే.వ్యవస్థనూ దిద్దుకోవాలి.కర్మనూ బాగుచేసుకోవాలి.ఈ రెండు ప్రయత్నాలూ చెయ్యనంత కాలం ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉంటాయి.

ఇంకొక విషయం.

దాదాపు ఇంకొక నెల నెలన్నరవరకూ ఇలాంటి ఘోరాలూ ప్రమాదాలూ రోజుమార్చి రోజు వినక తప్పదు.ఎందుకంటే అప్పటివరకూ గ్రహస్తితి అలాంటి దుర్ఘటనలకు అనుకూలంగా ఉన్నది.రాహుకేతువులు రాశులు మారి "స్టేబుల్" అయ్యేవరకూ అన్ని రకాలుగా జాగ్రత్త అవసరం.
read more " బ్యాస్ నది దుర్ఘటన-ఇతర ప్రమాదాలు - కారణం ఏమిటి? "

9, జూన్ 2014, సోమవారం

చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్త విశ్లేషణ-2

ఇంకా దిగ్భ్రమ కలిగించే ఇంకొక్క రహస్యాన్ని ఇప్పుడు వెల్లడి చేస్తున్నాను.పోయినసారి చంద్రబాబు అధికారం కోల్పోయిన రోజు 13-5-2004.ఇంతకుముందు ఆరోజువరకూ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు. అప్పుడు ఆంధ్రాజాతకంలో ఏ దశ జరుగుతున్నదో ఇప్పుడు చెబుతాను.

ఊపిరి బిగబట్టి చదవండి.

అప్పుడు జరిగినది--

శని/బుధ/రాహు/శనిదశ.

అంటే మళ్ళీ శపితయోగమే ప్రత్యక్షమైంది.ఆంధ్రా జాతకానికి శనిమహాదశ 7-9-1999 నుంచి మొదలైంది.2018 వరకూ నడుస్తుంది.ఈ శనిమహాదశలోనే రాష్ట్రం రెండుముక్కలై పోయింది.విదశా సూక్ష్మదశలలో రాహు/శనుల విభాగం రావడంతోనే చంద్రబాబుకు అధికారం పోయింది.ఈ పదేళ్లలో రాష్ట్రం ఎంత వెనుకపడి పోయిందో ఎన్నెన్ని ఘోరమైన కుంభకోణాలు జరిగాయో అందరికీ తెలిసినదే.చూచారా శపితయోగవిచిత్రం!!!

కర్మ సంబంధాలు ఈ రకంగా ఎంతో విచిత్రంగా ఉంటాయి.

రాహువిదశా/శనిసూక్ష్మదశలో మొదలైన శపితయోగం ఈ రకంగా రాష్ట్రాన్ని పదేళ్ళపాటు పట్టి పీడించింది.పోతూపోతూ రాష్ట్రాన్ని రెండుముక్కలు చేసి శని/రాహుదశలోనే చంద్రబాబుకు మళ్ళీ పట్టం గట్టింది.

అంటే రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యవలసిన ఖర్మ చంద్రబాబు జాతకంలో ఉన్నదని స్పష్టంగా తెలుస్తున్నది.అంటే తెలుగునేలతో బలీయమైన పూర్వకర్మ చంద్రబాబుకు ఉన్నది.ఈకర్మ ఈనాటిది కాదు.రాష్ట్రంతో బలీయమైన కర్మ ముడిపడి ఉన్న ప్రాచీనజీవులు దానిని తీర్చుకోడానికి మళ్ళీ ఇక్కడే జన్మ ఎత్తడమూ తమకు ఇష్టం ఉన్నా లేకపోయినా చిన్ననాడే ఆ రంగంలోకి ఈడ్వబడటమూ అత్యంత సహజంగా జరుగుతుంది.చంద్రబాబు అందుకే కాలేజీ రోజులనుంచే రాజకీయాలలో ఉన్నాడు.అంతకు ముందునుంచే సేవాకార్యక్రమాలలో ఉన్నాడు.ఇంకో రంగంలోకి ఆయన అడుగుపెట్టాలన్నా పెట్టలేడు.పూర్వకర్మ సంబంధాలు అలా పెట్టనివ్వవు. అందుకనే చిన్నతనం నుంచీ నలుగురికీ ఏదో చెయ్యాలన్న తపన ఆయనలో ఉండేది.ఈ తపనకు కారణం పూర్వకర్మమే.

అతను పూర్వజన్మలలో ఎవరో ఇదంతా ఎందుకు జరుగుతున్నదో వ్రాస్తే,అది దైవరహస్యాన్ని ధిక్కరించడమే అవుతుంది.పైగా అటువంటి విషయాలను తేరగా చెబితే ఎగతాళి చెయ్యడం తప్ప ఈకాలపు మనుషులు ఎవరూ నమ్మరు కూడా.ఎందుకంటే ప్రతిదానినీ వెకిలిగా ఎగతాళి చెయ్యడం తప్ప వారికి ఇంకేమీ తెలియదు.ఇలాచేసే కదా పూర్వకాలంలో ఈ శాపాన్ని మూటకట్టుకున్నారు.కనుక ఇంతటితో ఈ టాపిక్ ఆపేస్తున్నాను.

ముందుముందు చంద్రబాబు జాతకాన్ని విశ్లేషించినపుడు ఆయన జాతకంలో కొన్ని రహస్యాలను పైపైన (కొన్నిమాత్రమే) వివరిస్తాను.అర్హులైన అతికొద్దిమంది సన్నిహితులతో మాత్రమే ఆ రహస్యాలు చర్చించడం జరుగుతుంది.

ఇకపోతే,ఆంధ్రరాష్ట్రకుండలిలో రాబోయే 5 ఏళ్ళలో ఏ దశలు జరుగుతాయో ఒకసారి పరికిద్దాం.

ఇప్పటినుంచీ ఫిబ్రవరి 2016 వరకూ శని/రాహుదశ జరుతున్నది.ఆ తర్వాత నుంచి సెప్టెంబర్ 2018 వరకూ శని/గురుదశ జరుగుతుంది. ఇక్కడితో శనిమహాదశ అయిపోతుంది.అప్పుడు బుధ మహాదశ మొదలౌతుంది. అక్కడనుంచి 2035 వరకూ బుధమహాదశ జరుగుతుంది.అందులో మొదటగా జనవరి 2021 వరకూ బుధ/బుధదశ జరుగుతుంది.

ఫిబ్రవరి 2016 వరకూ జరిగే శని/రాహుదశలో కష్టనష్టాలు ఎదురైనా పట్టుదలతో ముందుకు పోవడం జరుగుతుంది.కొత్త రాష్ట్రాన్ని అభివృద్ధి పధంలో నడిపించాలి గనుక ఏకదీక్ష అవసరం అవుతుంది.ఆ మార్గంలో చంద్రబాబు చిత్తశుద్ధితో పోరాడతాడని విశ్వసిస్తున్నాను.అంతటితో రాష్ట్రానికి పట్టిన శపితయోగ ప్రభావం ప్రస్తుతానికి శాంతిస్తుంది.

అక్కడనుంచి సెప్టెంబర్ 2018 వరకూ నడిచే శని/గురుదశ  చాలా కీలకమైనది.కష్టపడినదానికి ఫలితాలు కనిపించడం ఈ దశలోనే ప్రారంభం అవుతుంది.విజయాలనూ అపజయాలనూ బేరీజు వేసుకుంటూ అభివృద్ధి పధంలో ముందుకు పోవడం జరుగుతుంది.

మొత్తం మీద శని మహాదశలో జరిగే ఈ చివరి రెండుదశలూ చాలా కష్టకాలం అనే చెప్పాలి.పాతభవనం కూలిపోయి కొత్తది కట్టుకునే మధ్యన ఉండే సంధికాలం లాంటిది ఇది.

ఇప్పుడు ఆంద్రరాష్ట్ర కుండలిని కాసేపు పక్కనపెట్టి మళ్ళీ వెనక్కు వద్దాం. చంద్రబాబు ప్రమాణస్వీకార కుండలిని ఒక్కసారి తిలకిద్దాం.

ఆ క్రమంలో కొంత గణితభాగంలోకి తొంగిచూద్దాం.120 సంవత్సరాలుండే వింశోత్తరీ దశను ప్రభుత్వం సాధారణంగా ఉండే పదవీకాలమైన 5 ఏళ్ళతో సమానం చేసి చూడాలి.

120 years=5 years=60 months
1 year=5/120=1/24 years=1/2 months.

ప్రమాణ స్వీకార సమయానికి కుజమహాదశ 75 నెలలకాలం మిగిలి ఉన్నది.

అంటే 75/24=దాదాపు మూడు నెలల కాలం కుదించిన వింశోత్తరీ దశ మిగిలి ఉన్నది.

కనుక:
మిగిలిఉన్న కుజదశ     3.0 months 
రాహుదశ  18/2=9.0 months
గురుదశ    16/2=8.0 months
శనిదశ      19/2=9.5 months
బుధ దశ   17/2=8.5 months
కేతు దశ   7/2=3.5 months
శుక్రదశ   20/2=10.0 months
రవిదశ      6/2=3.0 months
చంద్రదశ    10/2=5.0 months
మొత్తం   59.5 నెలల కుదించిన వింశోత్తరీ దశాకాలం మిగిలి ఉన్నది.
  
ఇప్పుడు దశా ప్రభావాలు ఎలా ఉంటాయో చూద్దాం.

కుజదశ
ఇప్పటినుంచి రాబోయే మూడునెలల కాలం ఈ దశ జరుగుతుంది.ఇందులో పరిపాలనా సంబంధమైన వ్యవహారాలు ముఖ్యపాత్ర వహిస్తాయి.దుమ్ము దులపడం మొదలౌతుంది.పాత వ్యవస్థలనూ,స్తంభించిపోయిన అనేక పనులనూ ఈదశ కదిలిస్తుంది.అసలు మనం ఎక్కడున్నాం అని బేలెన్స్ షీట్ వేసుకుని పరిస్థితిని బేరీజు వేసుకునే కార్యక్రమం మొదలౌతుంది.చంద్రబాబు తీసుకునే అనేక చర్యలవల్ల బద్ధకస్తులైన ఉద్యోగులకు అనేకమందికి కంటగింపు మొదలౌతుంది.కానీ ఏమీ అనలేక ఊరుకుని ఉంటారు.అదే సమయంలో ఎవరి వర్గాలను వారు బాగుచేసుకునే క్రమంలో నాయకుల లోలోపలి ప్రయత్నాలు మొదలౌతాయి.

రాహుదశ:--సెప్టెంబర్ 2014 నుంచి మే 2015
శపితయోగం తన శక్తిని చూపడం మొదలౌతుంది.అయితే దీనిని లాభస్థానంలో ఉంచినందువల్ల సంస్థాగతమైన అనేక పనులు మొదలౌతాయి.విదేశీ ప్రయాణాలు ఉంటాయి.అక్కడివారు జరిపే సన్మాన కార్యక్రమాలకు హాజరు కావలసి ఉంటుంది.

ప్రమాణస్వీకార ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారో గాని వారు ఈ యోగాన్ని లాభస్థానంలో ఉంచి చాలా మంచిపని చేశారు. లేకుంటే దాని చెడుప్రభావాన్ని అరికట్టడం చాలా కష్టం అయ్యేది.

కేంద్రసహాయం చురుకుగా అందటం మొదలుపెడుతుంది.కేంద్రంలో ఉన్న మిత్రులూ మంత్రులూ సహాయం చెయ్యడం ప్రారంభిస్తారు.ప్రజలకిచ్చిన అనేక హామీలూ ప్లానులూ కార్యరూపాన్ని ధరించడం మొదలౌతుంది.రోడ్లు,సివిల్ పనులు,విద్యుత్తు పనులు,పెట్రోలియం కారిడార్,IT పార్కులకు సంబంధించిన పనులు మొదలౌతాయి.

అయితే సహచరుల రహస్యకార్యక్రమాలూ ఇప్పుడే మొదలౌతాయి.పెద్ద మొత్తంలో కేంద్రనిధులు అందటం మొదలౌతుంది గనుక ఇక ఎవరిష్టం వచ్చినట్లు వారు నిధులను వాడుకోవాలని ప్లానులు వేస్తారు. దీనిని చంద్రబాబు ఒక కంటితోకాదు పదికళ్ళతో కనిపెడుతూ కట్టడి చెయ్యకపోతే అవినీతి మళ్ళీ భయానకంగా విజ్రుంభించే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తున్నది. ఇదే గనుక జరిగితే ప్రజల్లో పార్టీ విశ్వాసాన్ని త్వరగా కోల్పోయే ప్రమాదం ఉన్నది.ఇది జరుగకుండా జాగ్రత్త వహించాలి.

గురుదశ:--మే 2015 నుంచి జనవరి 2016
ఇది చాలా కీలకమైన కాలం.రాష్ట్రాన్ని అభివృద్ధి చెయ్యడం కోసం కేంద్రంచుట్టూ బాగా తిరగవలసి వస్తుంది.చేసిన వాగ్దానాలు నెరవేర్చడానికి నిధుల సమీకరణ కోసం చాలా శ్రమపడవలసి వస్తుంది.సిఎంకు దూరప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి.విదేశీయాత్రలు ముఖ్యంగా అమెరికాయాత్ర చెయ్యవలసి వస్తుంది.అక్కడ ఎన్నారైల పెట్టుబడులు ఆకర్షించడానికి ప్రయత్నాలు చెయ్యవలసి వస్తుంది.అలాగే ప్రతిపక్షాల ఎదురుదాడులు ఎదుర్కొడానికి చాలా శ్రమపడవలసి వస్తుంది.వారికి సమాధానం చెప్పడానికి హోమ్ వర్క్ చెయ్యవలసి వస్తుంది.

శనిదశ:--జనవరి 2016 నుంచి అక్టోబర్ 2016 వరకు
శపితయోగం మళ్ళీ ముందుకొస్తుంది.అయితే ఈసారి క్రమశిక్షణా సమాజ పునర్నిర్మాణమూ పుంజుకుంటాయి.కేంద్రంలో ఉన్న మిత్రుల తోడ్పాటుతో నూతనరాజధాని నిర్మాణం మొదలౌతుంది.మీడియా కూడా బాగా సహకరిస్తుంది.ప్రజలలో ధైర్యం పెరుగుతుంది.ప్రభుత్వం చెప్పిన పనులు చేస్తున్నదన్న విశ్వాసం పెరుగుతుంది.పేదప్రజలకోసం అనేక కార్యక్రమాలు మొదలుపెట్టబడతాయి.అధికారులూ ప్రజలూ కష్టపడి పనిచెయ్యడం మొదలౌతుంది.అయితే అనుకున్నంత వేగంగా పనులు సాగవు.అనుకోని అవాంతరాలు ఎదురౌతాయి.

బుధదశ:--అక్టోబర్ 2016 నుంచి జూన్ 2017 వరకు
ఇది కూడా చాలా ముఖ్యమైన కాలం.ఫిబ్రవరి వరకూ అనేక నూతనప్రభుత్వ కార్యక్రమాలు మొదలు పెట్టబడతాయి.ఇంకొక రెండేళ్ళలో ఎన్నికలు మళ్ళీ వస్తున్న సందర్భంగా ప్రజావిశ్వాసాన్ని పొందటంకోసం ప్రజాకర్షక పధకాలు ముమ్మరంగా మొదలౌతాయి.అయితే ఫిబ్రవరినుంచి మొదలౌతున్న అర్ధాష్టమశని వల్ల అనేక అవాంతరాలు ఎదురౌతాయి.మొదలు పెట్టిన ప్రాజెక్ట్ లు సకాలంలో పూర్తవుతాయా లేదా అనుమానాలు ప్రారంభం అవుతాయి. సమయానికి నిధులు అందవు.పనులు పూర్తికావు.చాలా కష్టపడవలసి ఉంటుంది.ఇదే అదునుగా ప్రతిపక్షాలు తమదాడిని ముమ్మరం చేస్తాయి.

కేతుదశ:--జూన్ 2017 నుంచి సెప్టెంబర్ 2017 వరకు
ప్రభుత్వానికి ఆందోళన ఎక్కువౌతుంది.వాగ్దానాలు నెరవేర్చడం కష్టమౌతుంది. పనులు సగం అయ్యి ఆగిపోయే పరిస్థితి ఉంటుంది.నాయకులకు ఆదుర్దా గాభరా ఎక్కువౌతాయి.నిధులకు సంబంధించి కొన్ని కుంభకోణాలు జరిగే సూచనలున్నాయి.మిత్రులు విడిపోయే సూచనలున్నాయి.ఖర్చు విపరీతంగా అవుతుంది.

శుక్రదశ:--సెప్టెంబర్ 2017 నుంచి జూలై 2018 వరకు
ఇది చాలా ముఖ్యమైన కాలం.ఈ సమయంలో గనుక అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తికాకపోతే ప్రజావిశ్వాసం అతివేగంగా కుంటుపడే అవకాశం ఉన్నది.అలాగే మిత్రులూ దూరమయ్యే అవకాశం ఉన్నది.ఇలా జరుగకుండా ఉండాలంటే అష్టకష్టాలూ పడి గుజరాత్ తరహాలో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లవలసి ఉంటుంది.

ఈ క్రమంలో సక్సెస్ అయితే మాత్రం చంద్రబాబు ప్రభుత్వానికి ఈసారి కూడా ధోకా ఉండదు.విషయాన్ని అటోఇటో తేల్చే దశ ఇది.ఈ దశలో చంద్రబాబు కుటుంబంలో ఉన్న మిగిలిన నాయకులు ముందుకు వస్తారు.వారి భవిష్యత్ పునాదులు వెయ్యబడతాయి.పరిపాలనలో వారి భాగస్వామ్యం బాగా ఎక్కువౌతుంది.పార్టీని బలోపేతం చెయ్యడానికీ కార్యకర్తలలో ఉత్సాహం నింపడానికీ ప్రయత్నాలు జరుగుతాయి.సర్వశక్తులూ ఒడ్డి అభివృద్ధిపధంలో రాష్ట్రాన్ని నడపాలని చర్యలు మొదలౌతాయి.

సూర్యదశ:--జూలై 2018 నుంచి అక్టోబర్ 2018 వరకు
పాలనాపరంగా గట్టి నిర్ణయాలు తీసుకోబడతాయి.ఆ క్రమంలో డిల్లీ పెద్దలతో కూడా కొంత విరోధం తలెత్తే సూచనలున్నాయి.రాష్ట్రం బాగుకోసం డిల్లీ స్థాయిలో గట్టిగా పోరాడవలసిన పరిస్థితి తలెత్తుతుంది.అలాగే రాష్ట్రంలో క్రమశిక్షణతో కూడిన పాలన అందించబడుతుంది.

చంద్రదశ:--అక్టోబర్ 2018 నుంచి ఏప్రిల్ 2019 వరకు
రాబోయే ఎన్నికలకు ప్రచారం మొదలౌతుంది.చేసిన పనులు చెప్పుకోవడం సాధించిన విజయాలను ప్రజలకు వివరించే కార్యక్రమం మొదలౌతుంది. కొన్ని రంగాలలో పరిపాలన చాలా బాగుందని ప్రజలు మెచ్చుకునే తీరులో పరిపాలన ఉంటుంది.కానీ అనుకున్న పనులు అన్నీ చెయ్యలేకపోయిన పరిస్థితి కూడా ఉంటుంది.మళ్ళీ అధికారంలోకి వస్తే అప్పుడు మిగిలిపోయిన పనులను పూర్తిచేస్తాం అని చెప్పుకోవలసిన ఓవర్ లాప్ ఉండిపోతుంది.
read more " చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్త విశ్లేషణ-2 "

చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్తవిశ్లేషణ-కొత్త ప్రభుత్వం ఎదురుగా ఉన్న సవాళ్లు


నూతన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రమాణస్వీకారం నిన్నరాత్రి 7.27 కి జరిగింది.ఈ వేదిక మంగళగిరికి దగ్గర కనుక ఆ ఊరి కోఆర్డినేట్స్ ను తీసుకోవచ్చు.

ఈ సమయానికి గ్రహస్థితులు ఎలా ఉన్నాయో దానిని బట్టి నూతన ప్రభుత్వ పనితీరు ఎలా ఉంటుందో, రాష్ట్ర అభివృద్ధి ఎలా ఉండబోతున్నదో వారు ఎంతవరకు చెప్పిన పనులు చెయ్యగలుగుతారో ప్రజల మన్ననలను ఎంతవరకు ఎలా పొందగలుగుతారో లేదో చూద్దాం.

ఈరోజు జ్యేష్ట శుక్లఏకాదశి ఆదివారం.తిధి వారముల వరకూ మంచివాటినే  ఎంచుకున్నారు.

చిత్తానక్షత్ర ఒకటోపాదం కుజహోరలో వరీయాన్ యోగంలో వణిజకరణంలో ఈ కార్యక్రమం జరుగుతున్నది.

ముహూర్తం పెట్టినవారు చతుర్ధశుద్ధీ అష్టమశుద్ధీ ఉండేలా జాగ్రత్త పడ్డారు.అయితే నాకు తెలిసిన వరకూ ఆయనది మిథున లగ్నం 27' అనుకుంటాను.అప్పుడు ముహూర్త లగ్నం సప్తమం అయ్యింది.ఇది అంత మంచి సూచనకాదు.అంటే ఎదుర్కోనవలసిన సమస్యలు అడుగడుగునా ఉంటాయన్న సూచన ఉన్నది.అది నిజమే కదా.దీనిని గ్రహించడానికి జ్యోతిష్యం అక్కర్లేదు.కాని జ్యోతిష్య సూచనలు కూడా నిజానికి అనుగుణంగానే,జరుగుతున్న పరిస్థితులకు అనుగుణంగానే ఉండటం మాత్రమె మనం ఇక్కడ గమనించాలి.



చంద్రబాబు పుట్టిన తేదీ 20-4-1950 ఉదయం 11.28 అంటున్నారు.ఇది నిజమే అయితే ఆయన నక్షత్రం కృత్తిక అయింది.అప్పుడు విపత్తార అయిన చిత్తానక్షత్రం ఉన్న రోజున ఈ ముహూర్తం నిర్ణయించడం కరెక్ట్ కాదు.తను అనుకున్నది చెయ్యడంలో అనేక విపత్తులను ఆయన ఎదుర్కోవలసి ఉంటుంది.

ముందుగా శకున శాస్త్ర సహాయంతో కొన్ని విషయాలు పరికిద్దాం.

జాతీయగీతం ఇంకా పాడుతూ ఉండగానే చివరిలో మ్యూజిక్ లో ఒక చిన్న విరామం వచ్చినపుడు అయిపోయిందని భావించి ముఖ్యమంత్రీ గవర్నరూ ఇద్దరూ కూర్చుండి పోయారు.తప్పును గ్రహించి మళ్ళీలేచి నిలబడ్డారు. అధికారిక కార్యక్రమాలలో ఇది చాలా పొరపాటుగా భావిస్తారు.

శ్రీశ్రీ రవిశంకర్ ను ప్రస్తావిస్తూ చంద్రబాబు 'పండిట్ రవిశంకర్' అన్నారు. చాలామంది ఇలాగే పొరపాటు పడతారు;పండిట్ రవిశంకర్ దివంగత సితార్ విద్వాంసుడు.ఈయన శ్రీశ్రీ రవిశంకర్.ఇంతకు ముందు ఆయన పేరులో మూడు శ్రీలుండేవి ప్రస్తుతం రెండే ఉంటున్నాయి.

ఈ రెంటి సూచన ఏమంటే,

  • కొత్త ప్రభుత్వం కూడా చాలా హాస్యాస్పదమైన కొన్ని తప్పులు చేస్తుంది.కాని సరిదిద్దుకునే ప్రయత్నం కూడా వెంటనే జరుగుతుంది.
  • కొన్ని సరిదిద్దుకోలేని గ్రహించలేని తప్పులు కూడా జరుగుతాయి.
  • చూడటానికి చిన్నవిగా కనిపించినా అర్ధం చేసుకోగలిగితే వాటి పరిణామాలు పెద్దవిగా ఉంటాయి.

ఇప్పుడు పంచాగ వివరాలను పరికిద్దాం.

ఏకాదశి తిధి:
మంచి పనులు చెయ్యడంలోనూ,ధార్మిక కార్యక్రమాలలోనూ ఆసక్తినీ, దేవబ్రాహ్మణుల పట్ల గౌరవాన్నీ,ఉత్తమ సంకల్పాన్నీ ఈ ముహూర్తం ఇస్తుంది.

చిత్తా నక్షత్రం:
శత్రువిజయాన్నీ,నీతినీ,మంచి ప్లానింగునూ,పద్ధతిగా పనులు నెరవేర్చడాన్నీ ఈ నక్షత్రప్రభావం ఇస్తుంది.ఇది చంద్రబాబు జన్మతార అయిన కృత్తికకు విపత్తార అయింది.తను తలపెట్టిన పనిలో అనేక ఆటంకాలను ఆయన ఎదుర్కోవలసి వస్తుంది.అంత సులభంగా అనుకున్న పనులు జరగవు.నూతనరాజధానీ నిర్మాణమూ రాష్ట్రనిర్మాణమూ అనుకున్నంత తేలికపనులు కావు.

ఆదివారం:
మంచి కార్యనిర్వహణనూ,పరిపాలనా సమర్ధతనూ,శత్రుజయాన్నీ ఇస్తుంది.

వరీయాన్ యోగం:
ధనాన్నీ,భోగాన్నీ,వినయాన్నీ మంచిపనులకు ఖర్చు చేసే బుద్ధినీ,ధర్మకార్య నిర్వహణనూ,సౌజన్యాన్నీ ఇస్తుంది.

వణిజ కరణం:
హాస్యచతురతనూ,ప్రాజ్ఞత్వాన్నీ,సన్మానములు పొందటాన్నీ,వ్యాపార దక్షతనూ ఇస్తుంది.

నాడీజ్యోతిష్య రహస్యవేత్తలకు ఒక విషయం స్పష్టంగా తెలుసు.దశాప్రభావాలు పూర్వకర్మను సూచిస్తాయి.కనుక దశలలో శాపగ్రస్తసమయాలు వచ్చినపుడు బలీయమైన పూర్వశాపాలు బయటకు వస్తాయి.మన కర్మను అనుభవింప చేస్తాయి.ఇది సత్యం.దీనికి ఎవ్వరూ అతీతులు కారు.కాలేరు.తప్పించుకోలేరు.

దానిని తప్పించుకోవాలంటే మార్గాలున్నాయి.కాని వాటిని చెయ్యడానికి అంత త్వరగా మనకు బుద్ధిపుట్టదు.కర్మ అనేది అలాంటి బుద్ధిని పుట్టనివ్వదు. ఒకవేళ రేమెడీలు మొదలుపెట్టినా అనేక అవాంతరాలు మధ్యలో తలెత్తుతాయి.ఊరకే గుళ్ళలో పూజలు చెయ్యడం వల్లా యాగాలు చేయించడం వల్లా ఆ దోషాలు పోవు.ముల్లును ముల్లుతోనే తీయవలసి ఉంటుంది. అంతేగాని డబ్బులు పారేసి చేయించే పూజలు దానిని తొలగించలేవు.  

ఇక్కడ మనందరి కళ్ళూ గిర్రున తిరిగిపోయే ఒక నిజాన్ని గమనిద్దాం.ప్రస్తుతం ఈ కుండలికి ఏ దశ జరుగుతున్నదో తెలుసా??చెబితే మీరు నిర్ఘాంతపోతారు.

కుజ/రాహు/శనిదశ జరుగుతున్నది.అంటే శపితయోగం మళ్ళీ ప్రత్యక్షమైంది. అంతర్ధశా విదశానాధులైన రాహుశనుల వల్ల శపితయోగపు ఛాయ నేనున్నానంటూ వచ్చి మన ఎదురుగా నిలబడింది.కనుక నేను చెప్పిన శాపం విషయం నిజమే అని చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్త కుండలి ద్వారా కూడా మళ్ళీ రుజువైంది చూచారా?

ఎప్పుడో 56 ఏళ్ళ క్రితం ఆంద్రప్రదేశ్ మొదలైనప్పుడు ఉన్న శాపం నిన్నటి 2014 తెలంగాణా కుండలిలో కనిపించడం ఏమిటి? మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు ప్రమాణ స్వీకార కుండలిలో కూడా అది ప్రత్యక్షం కావడం ఏమిటి??కర్మ అనేది మనందరం అనుకునేటట్లు ఒక జడపదార్ధం కాదనీ అది చాలా తెలివైన ఒక "లివింగ్ ఇంటల్లిజెంట్ సాఫ్ట్వేర్ ప్రోగ్రాం" అనీ అర్ధం కావడం లేదూ??మనం ఎన్ని రకాలుగానైనా దానిని తప్పుకోవాలని ప్రయత్నాలు చెయ్యవచ్చు.కానీ అది ఏదో ఒక రకంగా మన అంచనాలను అధిగమిస్తూ మళ్ళీ ఏదో మూలనుంచి వచ్చి "నేనున్నాను.నిన్ను అంత సులభంగా వదలను" అంటూ ఎదురుగా నిలబడుతుంది.

రాజభవనాలు వదిలివేసి రైల్వే ట్రాక్ పక్కన చెట్లలో పుట్టల్లో గుడారాలు వేసుకుని ప్రమాణస్వీకారం చెయ్యవలసిన ఖర్మపట్టడం శాపం కాకపోతే మరేమిటి?

ఇక ముహూర్త కుండలిని కొంచం పరిశీలిద్దాం.

ఐదింట శుక్రకేతువులు
అనుచరులతో పార్టీ నేతలతో ఘర్షణను రేకెత్తిస్తుంది.చంద్రబాబు ఒకటి చెయ్యాలనుకుంటే ఆయన సహచరుల ఆలోచనలు ఇంకొక విధంగా ఉండవచ్చు.దానివల్ల తిరుగుబాటు దారులు పెరగడమూ దానివల్ల ఆయనకు తలనొప్పులు రావచ్చు.నేత భావాలను అనుచరులు సరిగ్గా అర్ధంచేసుకోలేకపోతే పరిపాలనా నిర్వహణలో ఇబ్బందులు తలెత్తుతాయి. 

ఉద్యోగులను కష్టపడి పనిచెయ్యమంటే వారికి కోపం రావచ్చు.అలా కష్టించి పనిచెయ్యకపోతే రాష్ట్ర అభివృద్ధి సాధ్యం కాదు.ఈ కోణంలో ఉద్యోగులకూ సిఎం కూ మళ్ళీ భేదాభిప్రాయాలు రావచ్చు.మంత్రి పదవులు వచ్చాయి హాయిగా ఎంజాయ్ చేద్దాం అనుకునేవారు కష్టపడి పనిచెయ్యాలి అని వెంటాడే ముఖ్యమంత్రిని చూచి ఇదేం గోలరా దేవుడా అని విసుక్కునే రోజులు వస్తాయి.అంచనాలకూ వాస్తవానికీ మధ్యన అంతరాలను అధిగమించలేక నిరాశ చెందడాన్ని ఇది సూచిస్తుంది.

ఆరింట సూర్యుడు
ఇది మంచియోగమే.పరిపాలన బాగుంటుంది.లా అండ్ ఆర్డర్ మళ్ళీ చక్కగా నడవడం మొదలు పెడుతుంది.నేరాలు అదుపులోకి వస్తాయి.దొంగలూ రౌడీలూ భయపడి కుక్కిన పేనుల్లా ఉండటం మొదలుపెడతారు. శత్రు విజయాన్ని ఈ యోగం ఇస్తుంది.

అయితే దీనిలో కొంత నెగటివిటీ కూడా లేకపోలేదు.మొదట్లో బాగా సాయం చేసిన కేంద్రం రాన్రాను కొంత అసహన ధోరణి ప్రదర్శించడం మొదలు పెడుతుంది.ఎంతసేపూ మాకు ఆంద్రరాష్ట్ర సమస్యలు ఒక్కటే కాదు.మేము దేశంలో ఉన్న అన్నిరాష్ట్రాలనూ చూచుకోవాలి.నిధులన్నీ మీకే కావాలంటే ఎలా?కొంచం మీరు స్పీడు తగ్గించండి అన్న ధోరణి కేంద్రంలో కాలక్రమేణా రావడం చూడవచ్చు.

ఏడింట గురుబుధులు:
శత్రువులమీదా సంఘవిద్రోహుల మీదా చంద్రబాబు కొరడా ఝుళిపిస్తాడు. దానితో వారు దిక్కుతోచక బెంబేలెత్తిపోయే పరిస్థితి ఉన్నది.లా అండ్ ఆర్డర్ చాలా బాగుపడుతుంది.క్రమశిక్షణ పెరుగుతుంది.ఇప్పటివరకూ ఉన్న అరాచకం చాలావరకూ తగ్గిపోతుంది.

ప్రతిపక్షాలు మాత్రం చాలా తెలివిగా చంద్రబాబు యొక్క ప్రతి వైఫల్యాన్నీ ప్రజల్లో బాగా ఎండగట్టడం మొదలు పెడతాయి.వారి పని అదేగా మరి.

పదింట చంద్రకుజులు:
పరిపాలన చాలా పట్టుదలతో క్రమశిక్షణతో సాగుతుంది. మంచి ప్లానింగ్ ఉంటుంది.అయితే,ఈ క్రమంలో కొన్నినష్టాలూ కష్టాలూ తప్పవు.

వారి వారి స్వార్ధపూరిత కోరికలు నెరవేరని వారు అడ్డంకులు సృష్టించే ప్రమాదం ఉన్నది.ఆ అడ్డంకులు నేరుగా కాకుండా లోపల్లోపల ఉంటాయి.అంటే కుట్రల రూపంలో ఉంటాయి.చివరకు వారు ఓడిపోక తప్పదు కానీ ఈ మధ్యలో వచ్చే చికాకులు మాత్రం ఉండనే ఉంటాయి.

నక్షత్రాధిపతీ హోరాదిపతీ అయిన కుజుడు దశమంలో చంద్రమంగళ యోగంలో బలంగా ఉండటం చాలా మంచి సూచన.మంచి పట్టుదలతో కూడిన పరిపాలనను ఇది సూచిస్తున్నది.అయితే చంద్రునికి అష్టమాధిపత్యం రావడం మంచిది కాదు.బయటకు చెప్పినంతగా పనులు జరగడం కష్టం అని సూచన ఉన్నది.

పదకొండింట రాహుశనులు:
అసలైన లాభమూ నష్టమూ కూడా ఈ యోగమే.దీనివల్ల కేంద్రంలోని మిత్రులతో మంచి సంబంధాలు ఉంటాయి.వారి సహాయం కూడా సమయానికి అందుతుంది.

కానీ,వచ్చిన నిధులు అవినీతిలో స్వాహా కాకుండా సక్రమంగా ప్రతి రూపాయీ ప్రజలకోసం రాష్ట్రనిర్మాణం కోసం శుద్ధంగా ఖర్చు చెయ్యడమే పెద్ద సమస్య అవుతుంది.ఎందుకంటే అవినీతి అధికారులూ అవినీతి ప్రజలూ ఉన్నట్టుండి పతివ్రతలు అవుతారా అంటే అనుమానమే.

అనుచరులలో అవినీతిపరులూ కుట్రదారులూ కూడా ఖచ్చితంగా బయలుదేరతారనే సూచనను ఈ యోగం ఇస్తున్నది.ఎందుకంటే శపితయోగం లాభస్థానం నుంచే ఆపరేట్ అవుతున్నది గనుక రాష్ట్ర పునర్నిర్మాణ నిధులు పెద్ద ఎత్తున గోల్ మాల్ అయ్యే అవకాశం బలంగా కనిపిస్తున్నది.ప్రజాధనం వృధా కాకూడదంటే నిత్య జాగరూకత చాలా అవసరం.ఒకవేళ ఇదే జరిగితే ఇప్పుడు మిత్రుడైన పవన్ కళ్యాణ్ అప్పుడు శత్రువుగా మారి విమర్శలకు దిగే ప్రమాదం ఉన్నది.ఈ క్రమంలో మూడేళ్ళ తర్వాత జనసేనపార్టీ బాగా బలపడే సూచనలూ ఉన్నాయి.

అనునిత్యం గమనిస్తూ ప్రతి చిన్నతప్పునూ కూడా పెద్దది చేసి విమర్శింఛి ఎండగట్టే కాంగ్రెస్ వారినీ జగన్ నూ కాచుకోవడం ప్రభుత్వానికి తలనొప్పిగా మారబోతున్నది.చేసిన వాగ్దానాలు నెరవేర్చకపోతే వారు ఊరుకోరు.ప్రజలూ ఊరుకోరు.చెయ్యాలంటే డబ్బులు లేవు.ఈ పరిస్థితిని లాభస్థానంలోని రాహుశనులు స్పష్టంగా సూచిస్తున్నారు.

ఈ యోగంవల్ల యధావిధిగా మొదటి మూడేళ్ళూ శంకుస్థాపనలూ కల్లబొల్లి కార్యక్రమాలూ చేసుకుంటూ పోవడమూ చివరి రెండేళ్లలో మళ్ళీవచ్చే ఎన్నికలలో ఓట్లకోసం హడావుడిగా కార్యక్రమాలు చేయ్యబోవడమే సూచనకు వస్తున్నది.కానీ అందరు రాజకీయులూ చేసే ఇదే ప్లాన్ ను చంద్రబాబు కూడా అమలుచేస్తే  ప్రజలలో విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదం గట్టిగా ఉన్నది. అప్పుడు వచ్చే ఎన్నికలలో గెలవడం సాధ్యంకాదు.కనుక మొదటినుంచీ నిజాయితీగా శుద్ధంగా పనిచెయ్యవలసిన అవసరం ఉన్నది.

దానికి రెండు అడ్డంకులు ఉన్నాయి.

ఒకటి -- సరిపోయినన్ని నిధులు.
రెండు--నిజాయితీతో కష్టపడి ప్రజలకోసమే నిజంగా పనిచేసే నాయకులు.

ఈ రెంటినీ గనుక చంద్రబాబు సాధించగలిగితే ఆయన చెప్పినవి నిజం అవుతాయి.ఈ రెంటిలో ఏది ఫెయిల్ అయినా ఆయన వాగ్దానాలు చెప్పినంత స్థాయిలో నెరవేరవు.

ఇప్పుడు నవాంశ ఏమంటున్నదో చూద్దాం.

నవాంశఫలితాలు:

యోగకారకుడైన శనీశ్వరుడు లగ్నంలో ఉండటం మంచిదే.కాని ఈయన ఈ లగ్నానికి బాధకుడు కూడా అని మరచిపోకూడదు.కనుక అనుకున్నంత త్వరగా పనులు జరగవు.పైగా రెండింట గురుకుజుల వల్ల 12 లో కేతువు వల్లా బాధలు తప్పవు.ఇవి రెండు విధాలుగా ఉంటాయి.

ఒకటి-ప్రతిపక్షాల నుంచి.
రెండు-సొంత పార్టీలోని అసమ్మతివాదుల నుంచి

ఈ రెండు ఫేక్టర్స్ వల్ల ముందుముందు అనేక సమస్యలు తలెత్తుతాయి.

నాలుగింట సూర్యచంద్రులవల్ల ప్రజలు ఆశించినంత అభివృద్ధి జరగడం కష్టం అని సూచన ఉన్నది.కేంద్ర సహాయం కూడా ఆశించినంత మేరకు అందకపోవచ్చు.

లగ్నాధిపతి శుక్రుడు అయిదింట నీచలో ఉన్నందువల్ల పాలకులు ప్రజలకు జవాబులు చెప్పలేని పరిస్థితి ఉంటుంది.అధికారులలో అవినీతి పెరుగుతుంది.

ఎనిమిదింట బుధుని వల్ల ఆర్ధికరంగం అనుకున్నంతగా ఎదగటం కష్టం అని అనిపిస్తున్నది.ఉన్నదానికంటే ప్రదర్శన ఎక్కువగా ఉంటుందని సూచన ఉన్నది.

ఈ ఫలితాలన్నీ ఆయా దశలలో అంతర్దశలలో జరుగుతాయి.

మొత్తంమీద ముందున్నది పూలబాట కాదు ముళ్ళబాట అనే విషయం స్పష్టంగా సూచన ఉన్నది.వెంటాడుతున్న శపితయోగాన్ని ఎదుర్కొంటూ అనుకున్నంత వేగంగా ముందుకు పోవడం ఎంతవరకూ సాధ్యమో ముందుముందు చూడవలసి ఉంటుంది.

మొత్తం మీద శపితయోగాన్ని లాభస్థానంలో ఉంచుతూ మంచి ముహూర్తాన్నే నిశ్చయించారని చెప్పవచ్చు.అంతకంటే దానిని హేండిల్ చెయ్యడం కష్టం. చతుర్ధ అష్టమశుద్ధులు ఉండటం మంచిసూచన.ఉన్నంతలో మంచి ముహూర్తాన్నే ఎంచుకున్నారని చెప్పాలి.

రెండో భాగంలో మరికొన్ని వివరాలు చూద్దాం.
read more " చంద్రబాబు ప్రమాణస్వీకార ముహూర్తవిశ్లేషణ-కొత్త ప్రభుత్వం ఎదురుగా ఉన్న సవాళ్లు "

6, జూన్ 2014, శుక్రవారం

తెలంగాణా ఆవిర్భావ కుండలి- ఫలితములు(2)-ఆంధ్రా తెలంగాణా కుండలుల తులనాత్మక పరిశీలన

ఇదే శీర్షికతో వ్రాసిన మొదటిభాగంలో తెలంగాణా ఆవిర్భావకుండలినీ ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావకుండలినీ పోల్చి తులనాత్మక పరిశీలన చేస్తానని అన్నాను.అది ఈ పోస్ట్ లో చూద్దాం.

మూడేళ్ళక్రితం నేను ఒకమాట అంటే చాలామంది నన్ను చాలా హేళన చేశారు.అదేమంటే -"ఆంధ్రరాష్ట్రానికి శాపం ఉన్నది ఇది శాపగ్రస్త రాష్ట్రం" అని నేనన్నాను.కావలసిన వారు పాత పోస్ట్ లలో చూడవచ్చు.

మూడేళ్లు తిరగకుండానే రాష్ట్రం మన కళ్ళముందే చాలా హీనంగా రెండు ముక్కలై పోయింది.కనీసం ఎవరి అభిప్రాయాన్నీ లెక్కలోకి తీసుకోకుండా బర్రెగొడ్లను విభజించి బందెల దొడ్డిలోకి తోసినట్లు రాష్ట్రాన్ని రెండు ముక్కలుగా విభజించి 'ఇక మీ చావు మీరు చావండి' అనేశారు.

కనీసం ఇక్కడ మనుషులనే వాళ్ళు ఉన్నారనీ వారి అభిప్రాయంకూడా కొంత లెక్కలోకి తీసుకోవాలనీ డిల్లీ ప్రభువులకు ఏమాత్రం తోచలేదు.పైగా మన ప్రజాద్రోహనాయకులు డిల్లీకి పోయి ఉన్నవీ లేనివీ వారికి నూరిపోసి ఇంకోపక్క ప్రజలను వంచించి నానా నాటకాలూ ఆడి శకుని పాత్రను చక్కగా పోషించారు.చివరకు రాష్ట్రం రెండుముక్కలై పోయింది.ఇది శాపఫలితం కాకుంటే మరేమిటి?

రామాయణ కాలంలోని ఆంధ్రులు తమప్రాంతంలో సంచరిస్తున్న విశ్వామిత్ర మహర్షిని తీవ్రంగా ఎగతాళి చేసి అవమానించి ఆయన కోపానికి గురయ్యారని ఒక గాధ ఉన్నది.అనవసరంగా ఆయన్ను విసిగించి అవమానించి బాధపెట్టిన పాపానికి ఆయన కోపించి ఆంధ్రజాతిని శపించాడట.విశ్వామిత్రమహర్షి సత్రయాగం చేసిన ప్రాంతం మాచర్ల దగ్గర ఉన్న 'సత్రశాల' అనే ఊరని ఒక నమ్మకం ఉన్నది.ఆయన ఆంద్రప్రాంతంలో సంచరించాడన్నదానికి చారిత్రిక ఆధారాలున్నాయి.ఎందుకంటే ఆయన యాగం చేస్తున్నపుడు రాక్షసులు వచ్చి దానిని చెడగొట్టాలని రకరకాలుగా ప్రయత్నాలు చేస్తుంటే ఆయన దశరధమహారాజును అడిగి యాగరక్షణకోసం యువరాజులైన రామలక్ష్మణులను తీసుకువస్తాడు.ఇది అందరికీ తెలుసు.అంటే విశ్వామిత్ర మహర్షి రాక్షసమూకలు ఉన్న అటవీ ప్రాంతంలో నివసించేవాడనీ అక్కడే యజ్ఞయాగాదులు చేసేవాడనీ తెలుస్తున్నది.

బహుశా యాగాన్ని చెడగొట్టాలని రకరకాల ప్రయత్నాలు చేసిన రాక్షసులు తెలుగువారి పూర్వీకులే కావచ్చు.ఎందుకంటే అతిప్రాచీనమైన 'శతపధబ్రాహ్మణం' లోనే తెలుగువారి ప్రస్తావన ఉన్నది.అప్పట్లో వింధ్యపర్వతాలకు దక్షిణప్రాంతం అంతా దండకారణ్యం అనేవారు.ఇప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అంతా అప్పట్లో దట్టమైన కీకారణ్యం.

పొగరుబట్టి తాగి తందనాలాడుతూ ఆర్ష సాంప్రదాయాలనూ యజ్ఞయాగాలనూ ఎగతాళి చేస్తూ వాటిని నాశనం చేసే అనాగరికులూ ఆటవికులూ అయిన దుర్మార్గులైన మనుష్యులనే రాక్షసులు అని అప్పట్లో అనేవారు. ఋషిపత్నులను కూడా వాళ్ళు చెరబట్టి అపహరించి బలాత్కారం చేసేవారు. రావణుడు సీతాదేవిని అపహరించడం కూడా ఇలాంటి చర్యే.ఇలాంటి పనులు సర్వసాధారణంగా వారు చేసేవారు.

'రాక్షసులు' అంటే వాళ్ళు కొమ్ములూ కోరలూ పెట్టుకొని సినిమాలలో చూపినట్లు ఉండరు.నాగరికత లేని మూర్ఖులనూ దుర్మార్గులనూ ఆటవికులనూ 'రాక్షసులు' అనేవారు.నాగరిక జీవనం గడుపుతూ సత్ప్రవర్తన కలిగిన మనుషులను 'దేవతలు' అనేవారు.    

పోతే విశ్వామిత్రమహర్షి శాపం ఎన్నిరకాలుగా మనల్ని వేధిస్తున్నదో చెప్పడానికి చాలా కొన్ని ఉదాహరణలు మాత్రం చాలు.ఋషిశాపం చాలా భయంకరంగా వెంటాడుతుంది.మన అల్పబుద్దితో దాని శక్తిని మనం అంచనా వెయ్యలేము.

చాలా పాతకాలం విషయాలు వదలిపెట్టి ఒక వెయ్యి ఏళ్ళనాటి విషయాల నుంచీ చెప్పుకుందాం.

ముస్లిం దండయాత్రలకు దూరంగా హాయిగా బ్రతుకుతున్న దక్షిణాదిలో ముసల్మానుల అరాచకాలకు తెర తీసినది మనవారే.మన గుట్టుమట్లన్నీ డిల్లీ సుల్తానులకు చేరవేసి కాకతీయ సామ్రాజ్యాన్ని కూలదోసినది మన ఘనత వహించిన తెలుగువారే.దాని ఫలితంగా మాలిక్ కాఫర్ దక్షిణాదిన అడుగుపెట్టడమే కాక మదురై వరకూ అడ్డువచ్చిన వారిని వచ్చినట్లు ఊచకోత కోసుకుంటూ రక్తపాతాన్ని సృష్టిస్తూ సాగిపోయాడు.అంటే తెలుగుసామ్రాజ్యం ఒకటి కూలిపోవడానికి మనం కారకులవడం మాత్రమెగాక మన సోదరులైన తమిళులను కూడా ఊచకోత కోయించిన ఘనత మన తెలుగువారిదే.దీనిని శాపం అనక ఇంకేమంటారు?

ముస్లింగా మారకముందు మాలిక్ కాఫర్ కూడా ఒక హిందువే అని తెలిస్తే అతను సాగించిన మారణకాండకు మనకు భయం కలగక మానదు.ఆ విషయం ప్రస్తుతానికి అలా ఉంచుదాం.

కనుక మన ఇంటికి మనమే నిప్పు పెట్టుకోవడమే గాక పక్కవాడి ఇంటికి కూడా నిప్పుపెట్టడమూ రెండూ తగలబడుతుంటే చూచి ఆనందించే శాడిస్ట్ మనస్తత్వం మన తెలుగువారికి మొదట్నించీ అలవాటే అని రుజువౌతున్నది. దీనిని శాపం అనక ఇంకేమంటారు?

నేడుకూడా మన ప్రజలూ నాయకులూ ఎవరి ఇష్టం వచ్చినట్లు వారు అర్ధంపర్ధం లేకుండా ఎలా వాగుతున్నారో చూస్తె ఒక విషయం అర్ధమౌతుంది. ఇంత నాగరికత పెరిగి, చదువూసంధ్యలు పెరిగిన ఈ రోజుల్లోనే పరిస్థితి ఇలా ఉంటె, పదివేల ఏళ్ళ క్రితం రామాయణ కాలంలో మన మనుషులు ఇంకెంత ఆటవికంగా దుర్మార్గంగా ఉండేవారో ఊహించవచ్చు.కనుక విశ్వామిత్ర మహర్షినీ ఇంకొంతమంది మహర్షులనూ అప్పట్లో నానాహింసా పెట్టి వాళ్ళ యజ్ఞగుండాలలో రక్తాన్నీ మాంసాన్నీ గుమ్మరించి హీనంగా ప్రవర్తించడం నిజమే అనడానికి ఎటువంటి అనుమానమూ అక్కర్లేదు.

కడప జిల్లాలోని 'ఒంటిమిట్ట' కు నేను పోయినప్పుడు అక్కడి కోదండ రామాలయంలో ధ్యానంలో ఉన్నపుడు ఆ ప్రదేశంలో ఋషులనూ ఋషిపత్నులనూ అప్పట్లో దండకారణ్యవాసులైన రాక్షసులు ఎలా నానా హింసలు పెట్టి చెప్పరాని పనులు చేశారో నేను ఫీల్ అవగలిగాను.వారు పడిన మానసికక్షోభ తరంగాలు తరంగాలుగా నా హృదయాన్ని తాకింది.'ఒంటిమిట్ట' మీద నేను వ్రాసిన పాత పోస్ట్ లలో ఈ విషయం ప్రస్తావించాను.కావలసిన వారు నాలుగేళ్ల క్రిందటి పాత పోస్ట్ లు ఒకసారి చూడవచ్చు. 

నేడు మన రాష్ట్రాన్ని రెండుగా చీల్చుకోవడం ద్వారా,డిల్లీ ప్రభువులకు బానిసలుగా సలాం చెయ్యడం ద్వారా మళ్ళీ మన శాపగ్రస్త జీవితాలను ఇంకోసారి రుజువు చేసుకున్నాం.తెలుగుజాతికి వెన్నెముక లేదని రుజువు చేసుకున్నాం.దీనిని కూడా శాపం అనక ఇంకేమంటారు?

ఇదంతా జరిగిపోయిన గతం గనుక ఇప్పుడు ఎంత మొత్తుకున్నా ఏమీ ఉపయోగం లేదు.కాని ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే "ఆంధ్రరాష్ట్రానికి ఋషిశాపం ఉన్నది.ఇది శాపగ్రస్తరాష్ట్రం" అని నూటికి నూరుపాళ్ళు ఘంటాపధంగా నేను ఇంతకుముందూ చెప్పిఉన్నాను.ఇప్పుడూ చెప్పగలను.నేనన్న మాటకు జ్యోతిష్యశాస్త్రపరంగా ఋజువులు ఎలా లభిస్తున్నాయో ఈ పోస్ట్ లోనే నిరూపిస్తాను.

దానికంటే ముందు ఇంకో విషయం చెప్పాలి.మొన్న ఒక మిత్రుడు 'తెలంగాణాకు శాపం ఉన్నదని మీరు ఎప్పుడో వ్రాశారట కదా?" అంటూ అడిగాడు.అప్పటికి ఇంకా పుట్టని తెలంగాణాకు శాపం ఉన్నదని మూడేళ్ళ క్రితమే నేనెలా అనగలను?

నేనన్నది అదికాదు.ఆంధ్రరాష్ట్రం గురించే నేనలా అన్నాను.ఇప్పటికీ అదే అంటున్నాను.తెలంగాణాకు ఋషిశాపం లేదు.శపితయోగం ఉన్నపుడు అది ఉద్భవించింది అంతే.ఆంధ్రరాష్ట్రానికి మాత్రం ఋషిశాపం ఉన్నది.ఇది నిజం.ఋషిశాపానికీ శపితయోగానికీ చాలా భేదం ఉన్నది.

మిగిలిన విషయాలు మాట్లాడుకునే ముందు ఆంధ్రరాష్ట్ర కుండలిని ఒక్కసారి తిలకిద్దాం.




తల్లిదండ్రుల జాతకాలనూ పిల్లల జాతకాలనూ పోల్చి చూస్తే కొన్ని గ్రహయోగాలు అవేఅవే రిపీట్ అవుతూ కనిపిస్తాయి.అవే జెనెటిక్ లక్షణాలుగా అనుకోవచ్చు. తల్లిదండ్రుల పోలికలు జీన్స్ లో ఎలాగైతే పిల్లలకు వస్తాయో అలాగే తల్లిదండ్రుల జాతకాలకూ పిల్లల జాతకాలకూ మధ్యన పోలికలు కూడా ఉంటాయి.దివంగత జ్యోతిష్కులు బీజేరావుగారు నన్ను ఈ కోణంలోనే రీసెర్చి చెయ్యమనీ 'జెనెటిక్ ఆస్ట్రాలజీ' సూత్రాలను కనుక్కోమనీ పదేళ్ళక్రితం చెప్పారు.ఆ విషయం ఇంకోసారి మాట్లాడుతాను.

ప్రస్తుతానికి వస్తే ఇప్పుడు ఆంద్రరాష్ట్రం నుంచి తెలంగాణా విడిపోయింది గనుక ఇంతకు ముందటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తల్లిగానూ తెలంగాణాను పిల్లగానూ అనుకోవచ్చు.కనుక ఈ రెంటిజాతకాల మధ్యన పోలికలు ఉండాలి.ఇంకా చెప్పాలంటే 'జెనెటిక్ సిగ్నేచర్స్' వాటిమధ్యన ఉండాలి.

ఆంద్రప్రదేశ్ రాష్ట్రానిది కర్కాటక లగ్నం.తెలంగాణాది కుంభలగ్నం. కర్కాటక కుంభలగ్నాల మధ్యన షష్టాష్టకం ఉన్నది గనుక పరస్పర శత్రుత్వభావనతో రాష్ట్రం విడిపోయిందని క్లియర్గా కనిపిస్తున్నది.ఇప్పుడైతే అంతా చల్లబడింది గాని మొన్నటివరకూ ప్రజలమధ్యన ఎంత విద్వేష భావాలను సోకాల్డ్ నాయకులు రెచ్చగొట్టారో మనకు తెలుసు.  


ఇప్పుడు ఈ రెండురాష్ట్రాల కుండలుల మధ్యన కొన్ని సామ్యాలను గమనిద్దాం.

1.రెండు చక్రాలకూ మూడింట శుక్రుడున్నాడు.
2.రెండు చక్రాలకూ నాలుగింట సూర్యుడున్నాడు.
3.అంతకంటే ముఖ్యంగా రెండు చక్రాలకూ అష్టమంలో కుజుడున్నాడు.ఇది గొడవలతో ఏర్పడిన రాష్ట్రాలను సూచిస్తున్నది.మొదట్లో ఆంద్రరాష్ట్రం కూడా అల్లర్లతోనే ఏర్పడింది.
4.రెండు చక్రాలకూ నవాంశలో ధనుస్సులో బుధుడున్నాడు.
5.రెండు చక్రాలకూ నవాంశలో అయిదింట కేతువున్నాడు.అలాగే పదకొండులో రాహువున్నాడు.
6.రెండు చక్రాలకూ నవాంశలో ఆరింట కుజుడున్నాడు.
7.హస్తా నక్షత్రంలో ఆంధ్రా ఏర్పడింది.పునర్వసులో తెలంగాణా వచ్చింది.వీటికి అధిపతులు చంద్రుడు గురువు.వీరిద్దరూ ఆంధ్రప్రదేశచక్రంలో కలిసి ఉండటం చూడవచ్చు.అదే తెలంగాణాకుండలిలో వీరిద్దరూ విడిపోయి ఉండటం చూడవచ్చు.అదేగాక చంద్రునికి వెనుకగా గురువు ఉండటం చూడవచ్చు.అంటే ముందున్న ఆంధ్రానుండి వెనుక ఉన్న తెలంగాణా విడిపోయిందని అర్ధం.

చూచారా తల్లీపిల్లల మధ్యన ఉన్నట్లుగా 1956 లో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ జాతకానికీ 2014 లో ఏర్పడిన తెలంగాణారాష్ట్రానికీ ఎన్ని పోలికలూ సామ్యాలూ ఉన్నాయో?అంటే 58 ఏళ్ళు గడిచిన తర్వాత నేటికికూడా మళ్ళీ తెలంగాణా రాష్ట్రం విడిపోయే సమయానికి ఆ కర్మసంబంధాలు ఆయా గ్రహచక్రాలలో ఖచ్చితంగా ప్రతిఫలించాయంటే  జ్యోతిష్యశాస్త్రం ఎంత ఖచ్చితమైన డివైన్ సైన్సో అర్ధం చేసుకోవచ్చు.

ప్రస్తుతం ముఖ్యంగా చూడవలసినది ఋషిశాపాన్ని గురించి.ఆంద్రరాష్ట్ర నవాంశలో గురువు నీచస్తితిలో ఉండటం స్పష్టంగా కనిపిస్తున్నది.ఇది గురుశాపం.కనుక ప్రాచీనగాధలలో వినవచ్చేటట్లు ఆంద్రరాష్ట్రానికి గురుశాపం ఉన్నదన్న విషయం నిజమే అని ఋజువౌతున్నది.నేను మూడేళ్ళ క్రితం చెప్పినది ఇదే.

వృశ్చికలగ్నానికి తృతీయంలో గురువు నీచలో ఉండటమూ లాభస్థానం నుంచి రాహుశనుల దృష్టి గురువు మీద ఉండటమూ ధర్మస్థానం నుంచి ధర్మాధిపతి అయిన పూర్ణచంద్రుని దృష్టికూడా గురువు మీద ఉండటమూ ఏమి సూచిస్తున్నది?

11 లో రాహుశనులు ఆకతాయితనంతో కూడిన గుంపును సూచిస్తారు.నవమంలో పూర్ణచంద్రుడు ఒక మహర్షిని సూచిస్తాడు.తృతీయం పోసుకోలు మాటలకూ ఎగతాళి చెయ్యడానికీ నోరుపారేసుకోడానికీ సూచిక. నీచగురువువల్ల ఒక మహర్షిని అనవసరంగా నిందించి పాపం మూటగట్టుకున్న ఆకతాయి గుంపు యొక్క ఆగడం కనిపిస్తున్నది.ఇదే మన రాష్ట్రానికున్న ఋషిశాపం.

ఆంద్రరాష్ట్ర అవతరణ కుండలి యొక్క నవాంశచక్రంలో ఋషిశాపం స్పష్టంగా దర్శనమిస్తున్నది. నేను చెబుతున్న విషయం మామూలు మనుషులకు అర్ధం కాకపోయినా జ్యోతిష్యవేత్తలకు చక్కగా అర్ధమౌతుంది.మూడేళ్ళ క్రితం నేను చెప్పిన మాటకు ఇంతకంటే ఋజువు అవసరం లేదనుకుంటాను.

అయితే అప్పట్లో నేను జ్యోతిష్యకుండలిని చూచి ఈ విషయాన్ని చెప్పలేదు. నేను ఆ నిర్ధారణకు రావడానికి అప్పట్లో బలమైన మార్మికకారణాలు కొన్నున్నాయి.తంత్రశాస్త్రజ్ఞానంతో ఆమాటను అప్పట్లో చెప్పాను.వాటిని ఇక్కడ చెప్పినా ఎవరికీ అర్ధంచేసుకునే స్థాయిలేదు గనుక అదెలా చెప్పానో ప్రస్తుతం వివరించబోవడం లేదు.

ఇకపోతే,తెలంగాణా కుండలిలో ఎక్కడా గురుశాపాన్ని సూచించే యోగంలేదు. కనుక ఆ రాష్ట్రానికి ఎలాంటి శాపమూ లేదంటున్నాను.శపితయోగ ప్రభావం మాత్రమె ఆ రాష్ట్రానికి ఉన్నది.ఋషిశాపానికీ శపితయోగానికీ భేదం ఉన్నదని పైనే చెప్పాను.

రెండు చక్రాలకూ అష్టమంలో ఉన్న అంగారకుని వల్ల ఒక బలమైన సూచన ఉన్నది.ఈ రెండు రాష్ట్రాలూ శాంతిగా ఏర్పడిన రాష్ట్రాలు కావు.ఎంతోమంది బలి అయ్యి రక్తతర్పణం చేస్తేగాని ఈ రాష్ట్రాలు ఏర్పడలేదనీ గొడవలూ అల్లర్లతోనే ఈ రాష్ట్రాలు ఏర్పడ్డాయన్న సూచనను ఈ గ్రహయోగం ఇస్తున్నది.అది నిజమే కదా?

ఆంధ్రరాష్ట్ర రాజధానిని హైదరాబాద్ లాగా అన్నిహంగులతో నిర్మించుకోవడం ఇప్పట్లో సాధ్యంకాదు.హైదరాబాద్ నిర్మాణానికి 60 ఏళ్ళు పట్టింది. ఆంద్రరాజధానిని ఆస్థాయిలో అయిదేళ్ళలో నిర్మించడం అసాధ్యం.అది ఎవరివల్లా కాదు.నాయకులు చెబుతున్నంత త్వరగా అన్నీ అయిపోవడానికి ఇది 'మాయాబజార్' సినిమా కాదు.ఇప్పుడు ముప్పైఏళ్ళ పైవయసు ఉన్నవారు ఇంకొక ఏభైఏళ్ళలో అలాంటి రాజధానిని ఆంధ్రాప్రాంతంలో చూడలేరు.ఎందుకంటే అది పూర్తిస్థాయిలో నిర్మితమయ్యే సమయానికి ఇప్పుడు ముప్పైపైన వయసు ఉన్నవారు ఎవరూ బ్రతికి ఉండరు.దీనిని శాపం అనక ఇంకేం అనాలి?

తుక్కునుంచి మళ్ళీ అంతా నిర్మించుకోవాలని నాయకులే అంటున్నారు. టెంట్లు వేసుకుని అడ్మినిస్ట్రేషన్ నడిపే పరిస్థితి ఉందని వాళ్ళే అంటున్నారు. చెట్లకింద కూచుని ఉద్యోగులు పనిచేయ్యవలసి వస్తుందనీ వాళ్ళే చెబుతున్నారు.దీనిని శాపం అనక ఇంకేం అనాలి?

కొంతమంది చేతగానితనం వల్ల ఇప్పుడు ఇన్ని కోట్లమంది ప్రజలు బాధలు పడవలసిన పరిస్థితి వచ్చింది.దీనిని శాపం అనక మరేం అనాలి?

ఇప్పటికీ అర్ధం చేసుకోలేని గుడ్డి చెవిటివాళ్ళకు ఎవరు మాత్రం ఇంతకంటే విపులంగా అర్ధమయ్యేలా చెప్పగలరు?

మన విశ్లేషణకు మళ్ళీ వద్దాం.

ఆంధ్రాకుండలిలో కూడా రాహుశనులు పంచమంలో కలసి ఉండటం చూడవచ్చు.ఇదీ శపితయోగమే.కనుక దీనినుంచి ఏర్పడిన తెలంగాణా కుండలిలో కూడా శపితయోగం ఉన్నది.అందులో కూడా రాహుశనులు కలసి తులా రాశిలో ప్రస్తుతం ఉండటం చూడవచ్చు.ఆంధ్రా రాష్ట్రంలో వృశ్చికరాశిలో అది ఉంటే తెలంగాణా ఆవిర్భావ కుండలిలో దానికి అనుచర (12) రాశి అయిన తులలో ఆయోగం దర్శనమిస్తున్నది.కనుక ఆంధ్రప్రదేశ్ కుండలి నుంచి తెలంగాణాకుండలికి ఈ శపితయోగం బదిలీ అయిందని స్పష్టంగా కనిపిస్తున్నది.శపితయోగం గురించి వివరంగా తెలుసుకోవాలనుకునే వారు నేను వ్రాసిన పాత పోస్ట్ లు ఒకసారి తిరగెయ్యండి.విషయం అర్ధమౌతుంది. 

అంటే తల్లినుంచి పిల్లలకు కొన్ని పోలికలు వచ్చినట్లుగా ఆంధ్రరాష్ట్రం నుంచి శపితయోగం తెలంగాణాకు కూడా బదిలీ అయింది. 

కాకపోతే నీచగురువు రూపంలో ఆంధ్రాకుండలికి ఋషిశాపం ఉన్నది. తెలంగాణాకు అదిలేదు.ఇప్పటివరకూ మనతో కలసి ఉన్నందుకు తెలంగాణాకు కూడా ఆ శాపం వర్తిస్తుంది.కాని ఇప్పుడు విడిపోయినందువల్ల ఆ శాపం నుంచి వారికి విముక్తి లభించింది.కాని ఆంధ్రాకు మాత్రం ఆ శాపం కొనసాగుతూనే ఉన్నది.ఇకముందు కూడా ఉంటుంది.

దీనికి ఇంకొక ఋజువు ఏమిటంటే ఆంధ్రాకుండలిలో ఆత్మకారకుడైన కుజుడు అష్టమంలో ఉన్నాడు.తెలంగాణా కుండలిలో ఆత్మకారకుడైన గురువు పంచమంలో ఉన్నాడు.దీనిని బట్టే ఏ రాష్ట్రానికి ఎలా ఉన్నదో తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా ఆంధ్రాకంటే తెలంగాణాకు మంచి భవిష్యత్తు ఉన్నది అని చెప్పవచ్చు.

రాష్ట్రం ముక్కలు కావడానికి శాపమే కారణం అన్న మాటకు ఒకే ఒక్క తిరుగులేని ఋజువు ఉన్నది.ఆంధ్రా కుండలిలో ప్రస్తుతం నడుస్తున్న దశలు శాపాన్ని స్పష్టంగా సూచించాలి.ప్రస్తుతం ఆంద్ర ప్రదేశ్ జాతకంలో ఏదశ జరుగుతున్నదో తెలుసా? శని/రాహు/శని/కుజదశ జరుగుతున్నది!!!

ఆంద్రరాష్ట్ర అవతరణ కుండలి ప్రకారం ప్రస్తుతం నడుస్తున్న శని/రాహు/శని/కుజ దశలో తెలంగాణారాష్ట్రం విడిపోయింది.శని/రాహుదశ అంటే శపితయోగమే.కుజుడు నష్టాన్ని సూచించే అష్టమంలో ఉన్నాడు.శనికుజులు కలిస్తే ఘోరమైన యాక్సిడెంట్ జరుగుతుంది.ప్రస్తుతం జరిగింది అదేగా??చూచారా దశాఫలితం ఎంత ఖచ్చితంగా సరిపోయిందో?ఋషిశాపానికి ఇంతకంటే అద్భుతమైన ఋజువు ఇంకేం  ఉంటుంది???

ఖచ్చితంగా శపితయోగ సూచితదశలోనే ఆంధ్రానుంచి తెలంగాణా రాష్ట్రం విడిపోయింది.అంటే ఇలా రాష్ట్రం ముక్కలైపోవడం కూడా ఋషిశాప ప్రభావమే అని ఖచ్చితమైన రుజువును దశలు చూపిస్తున్నాయి.

ఇంకొన్ని ఋజువులు చూపిస్తాను.

తెలంగాణా విడిపోయిన సమయానికి ఆంద్రరాష్ట్ర కుండలిలో లగ్నాత్ చతుర్దంలో రాహుశనులు ఉన్నారు.చంద్రునినుంచి కుటుంబస్థానంలో వారున్నారు.అంటే ఇల్లు చీలిపోయిందనీ కుటుంబం విడిపోయిందనీ దానికి కారణం శపితయోగం అనీ స్పష్టమైన సూచన కనిపిస్తున్నది.

ఇంకా చూడండి.

ఆంద్ర ప్రదేశ్ జాతకంలో తులారాశిలో సర్వాష్టకవర్గులో 23 బిందువులు వచ్చాయి.ఇది ఏమాత్రం మంచిసూచన కాదు.ఇది సుఖస్థానం.సొంత ఇంటిని సూచించే స్థానం.ప్రజలను సూచించే స్థానం.అక్కడే శపితయోగ సూచకులైన రాహుశనులు ప్రస్తుతం నెలకొని ఉన్నారు.ఇక ప్రజలలో చీలిక రాకా రాష్ట్రం విడిపోకా ఏమౌతుంది???

కనుక ఎవరు ఏ కారణాలు సూచించినా రాష్ట్రం చీలిపోవడం వెనుక బలీయమైన మార్మిక కారణాలున్నాయన్నది స్పష్టం.నాయకులందరూ కర్మచేతిలో కీలుబొమ్మలు మాత్రమే.అలాగే ప్రజలూ కర్మచేతిలో కీలుబోమ్మలే.అందుకే మహర్షులనూ మహానీయులనూ అనవసరంగా తూలనాడి వారి మనస్సును నొప్పించకూడదని ప్రాచీనులు గట్టిగా చెప్పారు.ధనగర్వంతో పొగరెక్కి అలా ఒక ఋషిని ఎగతాళి చేసినందుకేగా శ్రీకృష్ణునివంటి అవతారపురుషుని రక్షణలో సర్వసంపదలతో తులతూగుతున్న యాదవరాజ్యం కూడా ముసలం పుట్టి సర్వనాశనమై పోయింది??ఇప్పుడు తెలుగుజాతికి కూడా అదే శాస్తి జరిగింది.

ఒక మనిషి మాటకు ఇంత శక్తి ఉంటుందా? కోట్లాదిమంది జీవితాలను ఇంతకాలం పాటు శాసించే శక్తి ఉంటుందా? అని అనుమానం రావచ్చు.ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అవినీతితో కుళ్ళిపోయిన రాజకీయనాయకులకే కోట్లాదిమందిని సమ్మోహనపరిచే శక్తి ఉంటె,ఇక జీవితాంతం సత్యమూ, బ్రహ్మచర్యమూ,ధర్మపరమైన జీవితమూ గడిపి,దేవతాసాక్షాత్కారం పొందిన మహర్షులకూ,బ్రహ్మవేత్తలకూ ఎంతటి శక్తి ఉంటుందో ఊహించవచ్చు.వారి మాట అమోఘంగా పనిచేస్తుంది.అది మనుషుల తలరాతలనే మారుస్తుంది. అదే వారి శాపమైతే కాలాన్ని అధిగమించి తరతరాలుగా వెంటాడుతుంది.

ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని,ధర్మాన్ని సక్రమంగా అనుసరించడం సాంప్రదాయాన్ని మహానీయులనూ సరిగ్గా గౌరవించడం నేర్చుకుంటే మనం ఇప్పటికైనా అదృష్టవంతులమే.లేకుంటే ముందుముందు మనం పడబోయే బాధలు ఊహించడమే కష్టమని నేను గట్టిగా చెప్పగలను.
read more " తెలంగాణా ఆవిర్భావ కుండలి- ఫలితములు(2)-ఆంధ్రా తెలంగాణా కుండలుల తులనాత్మక పరిశీలన "

4, జూన్ 2014, బుధవారం

కేంద్రమంత్రి గోపీనాద్ ముండే జాతకం-ఒక పరిశీలన

మొన్న మనం చూచిన ప్రమాణస్వీకార కుండలి నిన్న జరిగిన గోపీనాద్ ముండే దుర్మరణాల దృష్ట్యా ఆయన జాతకాన్ని ఒకసారి పరిశీలిద్దాం.

ఇలాంటి దుర్మరణాల జాతకాలను చూడకముందే కొన్నికొన్ని విషయాలు మనం చూచాయగా తెలుసుకోవచ్చు.నిత్యజీవితంలో చాలాసార్లు ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉండటం మనం చూస్తుంటాం.ఉదాహరణకు కొన్ని సంఘటనలను చెప్పుకుందాం.

1.ఆనందంగా పెళ్లి జరిగాక తిరుగు ప్రయాణంలో యాక్సిడెంట్ జరిగి పెళ్ళికొడుకో పెళ్ళికూతురో లేదా ఇద్దరూనో చనిపోతారు.

2.చేతికి ఎదిగివచ్చిన సంతానం ఉన్నట్టుండి కన్నుమూస్తారు.

3.ఇంటర్వ్యూలో నెగ్గి ఉద్యోగంలో చేరదామని వెళుతున్న వ్యక్తి ప్రమాదంలో దారిలోనే మరణిస్తాడు.

3.అన్నీ సక్రమంగా జరిగాయి అని ఆనందంగా ఉన్న కుటుంబంలో ఉన్నట్టుండి ఒక ఘోర విషాద సంఘటన జరుగుతుంది.

ఇలా చెప్పుకుంటూ పోతే నిత్యజీవితంలో నుంచి చాలా సంఘటనలు చెప్పుకోవచ్చు.

ఇలాంటి జాతకాలు చూడకుండానే ఒక విషయం గ్రహించవచ్చు.అదేమంటే వీరి జాతకాలలో ఘోరమైన శాపమో లేదా ఏదో ఒక ఘోరమైన దోషమో ఖచ్చితంగా ఉండి తీరుతుంది.చాలాసార్లు అది గురుశాపం గాని లేదా నాగదోషం గాని పితృశాపంగాని ప్రేతశాపంగాని అయి ఉంటుంది.

జాతకంలో గల శాపాలనూ దోషాలను గుర్తించడం ఒక ప్రత్యేకవిద్య.వాటిని నివారించడం తొలగించడం తపశ్శక్తితో కూడుకున్న పని.ఆయా కాంబినేషన్స్ గురించి ఇంకొక్కసారి వివరంగా చర్చిద్దాం.

ప్రస్తుతానికి గోపీనాద్ ముండే జాతకాన్ని గనుక గమనిస్తే చూడగానే ఒక విషయం ప్రస్ఫుటంగా కనిపిస్తుంది.అదేమంటే ఈ జాతకానికి ప్రబలదోషి అయిన గురువు చతుర్ధంలో నీచస్తితిలో ఉండటం.అంటే ఇది ప్రబల గురుదోషం ఉన్న జాతకం అని చూడగానే తెలిసిపోతున్నది.ఇది ప్రబలదోషం అని ఎందుకన్నానంటే ఆ గురువు సున్నా డిగ్రీలలో రాశిసంధిలో పడి ఉండటమే గాక నవాంశలోకూడా మకరంలోనే నీచస్థితిలో ఉన్నాడు. అంతేగాక ద్రేక్కాణ,చతుర్దాంశ,ద్వాదశాంశ చక్రాలలో కూడా మకరంలోనే నీచస్థితిలో ఉన్నాడు.కనుక ఇది ప్రబలమైన గురుశాపం ఉన్న జాతకం అని తెలిసిపోతున్నది.

ప్రబల గురుదోషం ఉన్నవారి జాతకాల్లో గురుదశ మొదలు కావడం తోనే ఘోరాలు జరుగుతాయి.ఏ గ్రహమైనా తన దశలోనో అంతర్దశలోనో ఫలితాన్ని ఇవ్వడం మొదలుపెడుతుంది అన్నది జగమెరిగిన జ్యోతిష్యసూత్రం.అంటే ఆ కర్మఫలం ఆ దశలో ఆ సమయానికి పరిపక్వానికి వస్తుందన్నమాట.

ఈ జాతకంలో గురుదశ 23-4-2013 న ప్రారంభమైంది.ప్రస్తుతం గురు/గురు/శుక్ర/శుక్ర దశ జరుగుతున్నది.

గురువు ఈ జాతకానికి ప్రబలదోషి అనీ గురుశాపం ఉన్నదనీ వ్రాశాను.ఇకపోతే శుక్రుడు లగ్నాదిపతీ అమాత్యకారకుడూ అయి ద్వితీయ మారకస్థానంలో చతుర్దాదిపతి అయిన శని నక్షత్రంలో ఉన్నాడు.గురువు చతుర్ధంలోనే ఉంటూ గురుశాపాన్నిస్తున్నాడని మరువరాదు.శుక్రుడు విలాసవాహనాలకు కారకుడు.పైగా చతుర్దాదిపతి అయిన శని నక్షత్రంలో ఉన్నాడు.అంటే వాహనకారకత్వం బలాన్ని పుంజుకుందని అర్ధం అవుతున్నది.అందుకనే ప్రస్తుతం వేగంగా దూసుకొచ్చిన కారు రూపంలో శుక్రుడు ప్రమాదం కలిగించాడు.

ఇకపోతే ఈ లగ్నానికి బాధకుడైన సూర్యుడు ప్రత్యక్తార అయిన చిత్తా నక్షత్రంలో ఉంటూ లగ్నంలోనే వచ్చి ఉన్నాడు.

ఇక్కడ ఒక విచిత్రమైన జ్యోతిష్యసూచనను గమనించాలి.

ఇక్కడ లగ్నంలో ఉన్న బాధకాధిపతి సూర్యుడు నీచస్థితిలో ఉన్నాడు. మొన్నటి ముహూర్తకుండలిలో ఆయన అష్టమం(మరణం)లో కూర్చుని ఉన్నాడు.అంతేగాక జన్మలగ్నమైన తుల మొన్నటి ముహూర్తలగ్నం కూడా అయింది.

నవాంశలో గురువు రాహువుతో కూడి యున్నాడు.అంటే గురుచండాల యోగం ఉన్నదన్నమాట.ఈ యోగం గురించి నిన్ననే ఒక పోస్ట్ లో వ్రాసి ఉన్నాను.రాశితుల్య నవాంశ విధానం ప్రకారం ఈ గ్రహయోగం లగ్నాత్ చతుర్దంలో అంటే వాహన సంబంధమైన రాశిలో అది కూడా చరరాశిలో ఉన్నది.అంటే వేగంగా ప్రయాణించే వాహనం వల్ల ప్రమాదం సూచన స్పష్టంగా ఉన్నది.

రాశిచక్రంలో గురువుకు మూడింట రాహువుతోనూ పదకొండింట శుక్రునితోనూ పట్టిన అర్గలం కూడా దీనినే బలపరుస్తున్నది.అంటే రాహువు పెట్రోల్ నూ,శుక్రుడు వాహనాన్నీ వెరసి ఈ ఇద్దరూ కలసి పెట్రోల్ తో నడిచే ఒక కారునూ సూచిస్తున్నారు.అంటే గురుశాపంవల్ల వేగంగా దూసుకొచ్చే పెట్రోల్ వాహనంతో ఈ ప్రమాదం జరగాలని రాసిపెట్టి ఉన్నదని స్పష్టంగా దర్శనమిస్తున్నది.

ఇంకొక్క సూక్ష్మమైన విషయాన్ని ఇక్కడ బహిర్గత పరుస్తాను.కాలేయానికి కూడా గురువే అధిపతి అని జ్యోతిష్యజ్ఞానం ఉన్న వారికి అందరికీ తెలుసు.ఈ ప్రమాదంలో గోపీనాద్ ముండేకు తగిలిన దెబ్బతో అతని కాలేయం రెండు మూడు ముక్కలుగా చితికి పోయిందని తెలుస్తున్నది.బలీయమైన గురుశాపాన్ని ఈ సంఘటన స్పష్టంగా నిరూపిస్తున్నది.


మరణాన్నీ మరణ కారణాన్నీ స్పష్టంగా చూపించే అష్టాంశ ఏమంటున్నదో చూద్దాం.

అష్టాంశ లగ్నం రాశిచక్రానికి ద్వాదశం కావడమూ అక్కడనుంచి గురుశుక్రులు అష్టమంలో ఉచ్చరవితో కలసి చరరాశిలో ఉండటమూ చూస్తే ఏం కనిపిస్తున్నది?

గురువులో శుక్రదశలో నడిచే వాహనంలో మరణం సంభవిస్తుందని స్పష్టంగా కనిపిస్తున్నది.గురువులో/గురువులో/శుక్రదశలోనే ప్రస్తుతం ఆయన మరణం సంభవించింది.

ఇక్కడ ఉచ్చరవి కలవడం వల్ల ఏం అర్ధమౌతున్నది?అధికారికమైన విషయ సంబంధంగా ఉన్నతమైన పదవిలో ఉన్నపుడు ప్రయాణ సందర్భంలో మరణం సంభవిస్తుందని సూచన స్పష్టంగా ఉన్నది.జరిగింది అదేగా మరి.

ఈ చక్రానికి ప్రబల దోషీ మారకుడూ అష్టమాదిపతీ అయిన కుజుడు వాహనాలకు సూచకం అయిన చతుర్దంలో ఉంటూ దాని అధిపతి అయిన గురుదశలో వాహనప్రమాదం మరణకారణం అవుతుందని సూచిస్తున్నాడు.

బలవన్మరణ జాతకాలలో నేను ఎన్నోసార్లు నిరూపించిన జైమిని మహర్షి ప్రతిపాదిత సూత్రం ఇక్కడ కూడా మళ్ళీ రుజువు కావడం గమనించవచ్చు.కావలసిన వాళ్ళు పాత పోస్ట్ లు ఒక్కసారి తిరగెయ్యండి.

ఈ జాతకానికి ఆత్మకారకుడు శనీశ్వరుడయ్యాడు.కారకాంశలగ్నం తులా అయింది.అదే రాశిలగ్నం కూడా అయింది.అక్కడనుండి మూడింట ఉన్న గుళికుడు ఈ జాతకునికి కలగబోయే బలవన్మరణాన్ని సూచిస్తున్నాడు. ఆత్మకారకుడున్న సింహరాశి నుంచి మూడింట అంటే లగ్నంలో నీచస్థితిలో ఉన్న సూర్యుడు కూడా అధికారసంబంధమైన బలవన్మరణాన్ని సూచిస్తున్నాడు.ఇంతకంటే రుజువు ఇంకేం కావాలి?

యాక్సిడెంట్ అయిన రోజున గోచార కుజుడు ద్వాదశంలో ఉన్న జననకాల బుధునికి చాలా దగ్గరగా సంచరించాడు.ఇద్దరూ హస్తానక్షత్రంలోనే ఉన్నారు.

గోచారరాహువు జననకాల లగ్ననీచసూర్యునిపైన ఖచ్చితమైన డిగ్రీ సంయోగంతో చిత్తానక్షత్రంలో సంచరిస్తున్నాడు.ఇది యాక్సిడెంట్ నూ దుర్మరణాన్నీ సూచించే ఖచ్చితమైన కార్మిక్ సిగ్నేచర్.చిత్తానక్షత్రం కుజుని అధీనంలో ఉంటుందనీ అది ఆయనకు ప్రత్యక్తార అనీ గుర్తుంచుకుంటే ఈ ప్రమాదం అంత ఖచ్చితంగా అదే రోజున ఎందుకు జరిగిందో అర్ధమైపోతుంది.

ఇంతకీ ఇలాంటి మరణం పొందటానికి ఆయన చేసిన పూర్వకర్మ ఏమై ఉంటుంది?తేలికగా దీనిని అర్ధం చేసుకోవచ్చు.కాని అది వ్యక్తిగతం గనుకా ఆ జాతకునికి మాత్రమె చెప్పవలసిన విషయం గనుకా దానిని ఇక్కడ పబ్లిగ్గా చర్చించడం సంస్కారం కాదు.అలా చర్చించడం వలన ఇప్పుడు ఒరిగేదీ లేదు.కనుక ఆ విషయం మాత్రం దాచి ఉంచుతున్నాను.

అందుకే మనపెద్దవాళ్ళు అంటారు.మనం చాలా జాగ్రత్తగా బ్రతకాలి. డబ్బుల్లేకపోయినా పరవాలేదు.ఎవరి ఉసురునూ మనం పోసుకోకూడదు.ఏ శాపానికీ గురికాకూడదు.అవి ఊరకే పోవు అని.

ఈ రోజులలో అలా హెచ్చరించేవారూ లేరు.చెప్పినా వినేవారూ లేరు.కర్మను నమ్మేవారూ లేరు.ప్రతిచోటా దూకుడూ దురుసుతనమూ ఎక్కువయ్యాయి. స్వార్ధమే పరమార్ధం అవుతున్నది.వీటివల్ల ఎంతటి చెడుకర్మ పోగవుతున్నదో ఎన్ని శాపాలకు మనకు తెలియకుండానే గురవుతున్నామో ఆ దేవుడికే ఎరుక.భవిష్యత్తులో ఆ కర్మ అనుభవించేటప్పుడు ఎన్ని బాధలు పడాలో కూడా ఆ దేవుడికే ఎరుక.

ఏది ఏమైనా ఒక్క విషయం దీనివల్ల రుజువౌతున్నది.ఎంతటివారైనా కర్మను తప్పించుకోలేరు.ఒకరికి బాధకలిగిస్తే మన సమయం వచ్చినపుడు దానిని అనుభవించక తప్పదు అన్న విషయం దీనివల్ల రుజువౌతున్నది.అందుకే సాధ్యమైనంతవరకూ ఎవరికీ హానిచేయ్యకుండా అందులోనూ మహనీయులైన వారికి అసలంటూ ఎటువంటి హాని చెయ్యకుండా బ్రతకాలని తెలుస్తున్నది.

జ్యోతిష్యం అనేది చాలా ఖచ్చితమైన సైన్స్ అనీ ఆ సూత్రాలు ఎన్నిసార్లైనా ఎంతమంది జీవితాలలోనైనా మళ్ళీమళ్ళీ తూచా తప్పకుండా రుజువౌతూనే ఉంటాయని కూడా ఇంకోసారి స్పష్టంగా దర్శనమిస్తున్నది.
read more " కేంద్రమంత్రి గోపీనాద్ ముండే జాతకం-ఒక పరిశీలన "

గోపీనాద్ ముండే దుర్మరణం-ప్రమాణస్వీకార ముహూర్త ప్రభావం మొదలైందా?

నరేంద్ర మోడీ మంత్రివర్గ ప్రమాణస్వీకార ముహూర్తం అనేక దోషాలతో కూడి ఉన్నదని గత పోస్ట్ లో వ్రాశాను.అందులో ఉన్న గ్రహస్థితులు అప్పుడే ప్రభావం చూపించడం మొదలుపెట్టాయా?అన్న ప్రశ్నకు కేంద్రమంత్రి గోపీనాద్ ముండే దుర్మరణం అవుననే అంటున్నది.

అష్టమంలో రవి ఉండటం ఆ ముహూర్తంలోని కొన్ని దోషాలలో ఒకటి.మన ముహూర్తాలలో అష్టమశుద్ధిని ప్రధానంగా చూస్తాం.కాని మరి ఆరోజున ఆ ముహూర్తాన్ని ఎవరు నిర్ణయించారో ఎలా నిర్ణయించారోగాని ఈ దోషాన్ని వాళ్ళు లెక్కచెయ్యకుండా ముందుకు వెళ్లారు.అదేం చేస్తుందిలే అని వారు అనుకొని ఉండవచ్చు.ఏ ముహూర్తానికైనా అష్టమశుద్ధి ప్రధానంగా చూడాలి అని మన పూర్వీకులు మొత్తుకొని మరీ చెప్పారు.మనం వారిమాట వింటే కదా?

ముహూర్తభాగంలో అష్టమలగ్నదోషం అనేదీ,అష్టమశుద్ధి అనేదీ ప్రధానంగా చూడాలి.అంటే,ముహూర్తలగ్నం అనేది జాతకుని లగ్నానికి అష్టమం కాకూడదు.అలాగే ముహూర్తలగ్నంనుంచి అష్టమంలో ఏ గ్రహమూ ఉండకూడదు.ఎందుకంటే అష్టమం అనేది ఆయుష్యస్థానం గనుకా ప్రబల దోషపూరితమైన స్థానం గనుకా అక్కడ ఉండే గ్రహమూ దాని కారకత్వాలూ మొత్తం సర్వనాశనం అవుతాయి.అక్కడ గనుక క్రూరగ్రహాలుంటే ఆయుష్షును హరిస్తాయి.

జ్యోతిష్యం వంటి విద్యలతో వచ్చిన సమస్య ఇదే.ముందు దానిని ఎవ్వరూ నమ్మరు.పైగా రకరకాల మాటలతో హేళన చేస్తారు.జరిగిన తర్వాత మాత్రం బాధపడతారు.కాని అప్పుడు ఎంత విచారించినా ఉపయోగం ఏమీ ఉండదు.

అష్టమ రవివల్ల అధికారులకు గండమనీ,అకస్మాత్తుగా ప్రమాదాలు ముంచుకొస్తాయనీ,ఆయుర్హీనమనీ జ్యోతిర్విద్యలో గట్టిలోతులు తెలియని మామూలు పురోహితుడు కూడా చెప్పగలడు.అలాంటిది వారికి ఈ విషయం తెలియకపోవడం వింతగా ఉన్నది.

మంగళవారం ఉదయం ఆరున్నర ప్రాంతంలో ఈ సంఘటన జరిగింది.అంటే ఆ సమయంలో కుజహోర నడుస్తున్నది.ముహూర్తలగ్నంలో కుజుడు ద్వాదశంలో ఉండటం గమనించవచ్చు.ముహూర్తలగ్నం చరలగ్నం కావడమూ,కదులుతూ ఉన్న వాహనం మరణకారణం అవడమూ గమనించాలి.మంగళవారం కుజహోరలో సంఘటన జరగడం గమనార్హం.ప్రమాదాలూ దుర్మరణాలలో అంగారకగ్రహం యొక్క పాత్ర ఎన్నోసార్లు నిరూపితం అయిన సత్యం. 

అయితే సందేహ సుందరాలకు ఒక అనుమానం రావచ్చు.ఆ సమయానికి చాలామంది ప్రమాణ స్వీకారం చేశారు కదా? మరి గోపీనాద్ ముండే ఒక్కడికే ఇలా ఎందుకు జరిగింది? అని.

వారు ఒక్క విషయాన్ని గమనించాలి.ఆ నిముషంలో అతనొక్కడే ప్రమాణ స్వీకారం చేశాడు.అందరూ గుట్టగా ఒకే నిముషంలో ప్రమాణస్వీకారం చేయలేరు.కొన్ని సూక్ష్మచక్రాలు నిముషనిముషానికీ మారిపోతూ ఉంటాయి.ఇంకా సూక్ష్మచక్రాలు కొన్నైతే సెకన్లతేడాలో మొత్తం మారిపోతాయి.మొన్న కేసీఆర్ ప్రమాణ స్వీకారసమయంలో ఒక్క నిముషంలో నవాంశచక్రం మారిపోయింది.ఆ సంగతి చదువరులు గుర్తుంచుకోవాలి.

ఇంకొక ముఖ్యమైన సంగతి ఏమంటే,ఆ సమయానికి ప్రమాణస్వీకారం చేసిన అందరిలో ఎవరి జాతకంలో చెడుదశలు నడుస్తూ ఉంటాయో,సామాన్య భాషలో చెప్పాలంటే ఎవరి టైం బాగాలేదో,వారికే ఆ ముహూర్తదోషాలు ప్రబలంగా చుట్టుకుంటాయి.జాతకబలం గట్టిగా ఉన్నవారు రక్షింపబడతారు. లేదంటే వారివరకూ అవి పోస్ట్ పోన్ చెయ్యబడతాయి.

మరి టైం బాగాలేకపోతే మంత్రిపదవి ఎలా వచ్చింది? అన్న ప్రశ్న తలెత్తవచ్చు.జరుగుతున్న మహాదశ మంచిదే కావచ్చు.కాని ప్రబలదోషపూరితమైన అంతర్దశ గనుక ఆ తర్వాత మొదలైతే అది చెడుప్రభావాన్ని తప్పకుండా చూపించడం మొదలుపెడుతుంది.మహాదశా ఫలితాలను అది మార్చివెయ్యగలదు.గోపీనాద్ ముండే జాతకం దొరికితే దీనిని స్పష్టంగా గమనించవచ్చు.మంచిలో చెడూ,చెడులో మంచీ అంటే ఇదే.జాతకాన్ని చాలా సూక్ష్మంగా గమనిస్తే గాని ఈ విషయాలు బోధపడవు.

జ్యోతిష్యశాస్త్రంలో ముహూర్తభాగం అనేది ఎన్నో వందల వేల ఏళ్ళ పరిశోధనా ఫలితం.నిత్యజీవితంలో ఎన్నోసార్లు గమనింపబడి నిగ్గుతేలిన సత్యాలు అవి.వాటిని మనం తిరస్కారధోరణితో చూడటం వల్ల పరిణామాలు ఎలా ఉంటాయో ఇది ఒక ఉదాహరణ మాత్రమే.

ఏదేమైనా ఈ సంఘటన విచారకరం.నా సంతాపాన్ని తెలియజేస్తున్నాను.
read more " గోపీనాద్ ముండే దుర్మరణం-ప్రమాణస్వీకార ముహూర్త ప్రభావం మొదలైందా? "