27, నవంబర్ 2013, బుధవారం

మాగ్నస్ కాల్సన్ (ప్రపంచ చదరంగ చాంపియన్) జాతకం

మాగ్నస్ కాల్సన్ నేటి వరల్డ్ చెస్ చాంపియన్.చెన్నైలో జరిగిన పోటీలో విశ్వనాధన్ ఆనంద్ ని ఓడించి టైటిల్ గెలుచుకున్నాడు.ఇతని జాతకం ఒకసారి పరిశీలిద్దాం.

ఇతను 30-11-90 న నార్వేలో టాన్స్ బెర్గ్ అనే ఊళ్ళో పుట్టినాడు.జనన సమయం తెలియదు.కనుక విభిన్నములైన నాడీ విధానాలతో ఇతని జాతకాన్ని స్థూలంగా చూద్దాం.

ఇతను శుక్రనక్షత్రంలో శుక్రవారం రోజున పుట్టినాడు.కనుక శుక్రునికి ఇతని జీవితంలో మంచి ప్రాధాన్యత ఉండాలి.పైగా శుక్రుడు అమాత్యకారకుడయ్యాడు.కనుక ఇతని వృత్తిని కూడా శుక్రుడే నిర్ణయిస్తాడు.ఆ శుక్రుడు గూడత్వాన్ని సూచించే వృశ్చికంలో ఉంటూ,వెనుకవైపు సూర్యునీ,ముందు బుధునీ శనినీ కలిగి ఉన్నాడు.అంటే తండ్రి తోడ్పాటుతో,తెలివిని ఉపయోగించి ఆడేఆట అయిన చదరంగం వృత్తిగా కలిగిన వాడౌతాడని గ్రహములు సూచిస్తున్నాయి.

ఇతని జాతకంలో ఆత్మకారకుడు శని అయినాడు.ఆరోజున చంద్రునికి ఆత్మకారకత్వం రాదు.ఇతర గ్రహములు ఆ స్థానమును ఆక్రమించలేవు.కనుక కారకాంశ ధనుస్సు అవుతుంది.శనికి వర్గోత్తమాంశ కలిగింది.రవి కూడా వర్గోత్తమాంశలోనే ఉన్నాడు.ఈ రెంటివల్ల ఇతనికి వృత్తిపరమైన అదృష్టమూ,పేరుప్రఖ్యాతులూ తేలికగా వస్తాయని అర్ధమౌతుంది.చదరంగంలో బాలమేధావి అవడం ఈ రెండుగ్రహాల వరమే.

ధనుస్సులో శని,బుధుడు,యురేనస్,నెప్ట్యూన్ లున్నారు.వీరిలో యురేనస్సూ సూర్యుడూ ఖచ్చితమైన ద్విర్ద్వాదశస్థితిలో ఉన్నారు.దీనివల్ల ఉన్నట్టుండి సరియైన అంత:స్ఫురణ కలుగుతుంది.గురువూ నెప్త్యూనూ ఖచ్చితమైన షష్టాష్టక స్థితిలో ఉన్నారు.దీనివల్ల మతాభినివేశమూ అదృష్టమూ ఉంటాయి.

మేషరాశిలోని చంద్రమంగళయోగం వల్ల ఓటమిని అంగీకరించని పట్టుదల ఉంటుంది.శని బుధుల కలయిక వల్ల ఓర్పుగా ఆలోచించి ఆడగల నేర్పు వస్తుంది.గజకేసరీ యోగం అదృష్టాన్నిస్తుంది.

కర్మకారకుడైన శనితో బుధుని కలయికవల్ల ఆలోచనాశక్తితో కూడిన జీవిక ఉంటుందని సూచన ఉన్నది.చంద్రలగ్నాత్ తృతీయాధిపతి కూడా బుధుడే అవడం గమనార్హం.కనుక గంటలు గంటలపాటు స్థిరంగా ఆలోచించి ఓర్పుగా ఎత్తుకు పైఎత్తులు వేసి ఆడవలసిన చదరంగం లో ప్రావీణ్యం కలిగింది.

శనికి వచ్చిన ద్వితీయ తృతీయాధిపత్యములవల్ల,క్రీడలుగాని,రచనలుగాని, సమాజంతో కమ్యూనికేషన్ వల్లగాని ధనార్జన ఉంటుందని తెలుస్తుంది.ఈ మూడూ ఇతని జీవితంలో నిజాలయ్యాయి.

శని వెనుకగా వరుసగా సూర్య,శుక్ర,బుధులు ఉండటం వల్ల,ఇతని వృత్తిలో పేరు ప్రఖ్యాతులూ,విలాస జీవితమూ,తెలివితో కూడిన ఆలోచనాశక్తీ తోడుగా ఉంటాయన్న సూచన ఉన్నది.

శుక్రునికి వచ్చిన అమాత్యకారకత్వంవల్ల,చిన్నప్పుడే మోడలింగ్ చేసే అవకాశాలు వచ్చాయి.ఉత్పత్తులకు ప్రోమోటింగ్ మోడల్ గా అవకాశాలను చదరంగ విజయాలు కలిగించాయి.

ఎంత క్రీడాసామర్ధ్యం ఉన్నప్పటికీ చదరంగం వంటి ఆటలో స్ఫురణశక్తి చాలా ప్రధానం.అటువంటి అంత:స్ఫురణను ఇవ్వడంలో శన్యతీతగ్రహాలకు చాలా ప్రముఖపాత్ర ఉంటుంది.ఆ కోణంలో యురేనస్ నెప్త్యూన్ల పాత్ర స్పష్టంగా కనిపించే మరొక్క జాతకం ఇతనిది.

సరియైన జననసమయం లేకున్నా,నాడీజ్యోతిష్య విధానములు ఉపయోగించడం వల్ల జాతకాన్ని స్థూలంగా చదవవచ్చు.చాలావరకూ జీవిత దిశనూ దశనూ గ్రహించవచ్చు అనడానికి ఇలాంటి జాతకములే ఉదాహరణలు.
read more " మాగ్నస్ కాల్సన్ (ప్రపంచ చదరంగ చాంపియన్) జాతకం "

23, నవంబర్ 2013, శనివారం

సచిన్ టెండూల్కర్ జాతకం

సచిన్ టెండూల్కర్ మొన్న నవంబర్ 16 న క్రికెట్ నుంచి రిటైరయ్యాడు.ఆ సందర్భంగా అతని జాతకం చూద్దాం.ఇతని జననసమయం కూడా ఖచ్చితమైనది దొరకడం లేదు.ప్రముఖవ్యక్తులు వారి జనన సమయాన్ని దాచి ఉంచుతారు.దానికి రకరకాలైన కారణాలుంటాయి. ఇతను 24-4-1973 న ముంబైలో పుట్టినాడు. జనన సమయాలు మధ్యాన్నం 1 అనీ,2.47 అనీ సాయంత్రం 4.20 అనీ రకరకాలుగా దొరుకుతున్నాయి. వీటిలో ఏది సరియైన సమయమో తేలికగా కనిపెట్టవచ్చు.కొన్ని స్థూలమైన విషయాలద్వారా మాత్రమే దీనిని గమనిద్దాం.

సూర్యుడూ కుజుడూ ఇతని జాతకంలో ఉచ్ఛలో ఉన్నారు.కుజుడు క్రీడలకు దూకుడుతనానికి కారకుడు కనుక క్రికెట్ ఆటలో అంతపేరు సంపాదించాడు. కన్యాలగ్నం అయితే మాత్రమే ఇది సాధ్యం.ఎందుకంటే అప్పుడు మాత్రమే కుజుడు తృతీయాధిపతి అవుతాడు అనే వాదనతో నాకు కొన్ని సందేహాలున్నాయి.కనుక ప్రస్తుతం ఆ విషయం అలా ఉంచుదాం.

సూర్యునివల్ల సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులూ, ఆదరణా, విజయ పరంపరలూ కలిగాయి.గురువు నీచలో ఉన్నాడు.కనుక సత్యసాయిబాబాకు భక్తుడయ్యాడు.సత్యసాయిబాబా జాతకంలో కూడా గురువు నీచలో ఉండటం గమనార్హం.కార్మిక్ సిగ్నేచర్స్ ఆ విధంగా పనిచేస్తాయి.

ఇతనిది ప్రేమవివాహం.కర్కాటక కన్యాలగ్నాలకు ఈజాతకం ప్రకారం ప్రేమవివాహం సాధ్యమే.కనుక ఈరెంటిలో ఏదో ఒకటి అయి ఉండాలి.ఇతని భార్య ఇతనికంటె ఆరేళ్ళు పెద్దది.ఈ రెండు లగ్నాలకూ సప్తమదోషం ఉన్నప్పటికీ ఎక్కువగా కర్కాటక లగ్నమే సూచితం అవుతుంది.ఎందుకంటే అప్పుడే సప్తమానికి శని ఆధిపత్యం వస్తుంది.పైగా భార్య డాక్టర్ అయ్యే యోగం కర్కాటక లగ్నానికే ఎక్కువగా ఉన్నది.

కెరీర్ పరంగా చూచినా కన్యాలగ్నం అయితే దశమకేతువు వల్ల కెరీర్ అంత బాగుండదు.అదే కర్కాటకం అయితే దశమంలోని ఉచ్ఛసూర్యుని వల్ల బ్రహ్మాండంగా ఉంటుంది.కనుక కర్కాటకలగ్నమే సరియైనది అని అనిపిస్తున్నది.అలాంటప్పుడు జననసమయం మద్యాన్నం ఒంటిగంట ప్రాంతం అవుతుంది.అప్పుడు వివాహసమయానికి(24-5-1995) కుజ/గురు/బుధదశ జరిగింది.కుజగురులు సప్తమంలోనూ బుధుడు చంద్రలగ్నాత్ సుఖస్థానం లోనూ ఉండటం చూస్తే ఈ సంఘటన సరిగ్గా సరిపోతుంది.కనుక మధ్యాన్నం ఒంటిగంట సమయమే సరియైనది.

ప్రస్తుతం ఇతను కెరీర్ నుంచి విరమించుకున్నాడు.భారతరత్న బిరుదు కూడా ఇవ్వబడింది.దశాపరంగా పరిశీలిద్దాం.

ప్రస్తుతం ఇతని జాతకంలో రాహు/శుక్ర/గురు/కేతుదశ జరుగుతున్నది. శుక్రునితో కలిసి ఉన్న సూర్యుడు అత్యున్నత పురస్కారం ఇచ్చాడు.శుక్రుడు ఈ లగ్నానికి బాధకుడు,గురువు నీచలోఉండి కుజునికి దోషాన్ని ఆపాదిస్తున్నాడు,కేతువు విడిపోవడాన్ని సూచిస్తాడు.కనుక కెరీర్ ముగిసింది.

ఇతని జాతకంలో కూడా వ్యతిరేక కాలసర్పయోగం ఉందని కొందరు అంటారు. కాని అలాంటియోగం అంటూ అసలు ఏదీలేదని ఇతని అప్రతిహతమైన కెరీర్ వల్ల తెలుస్తున్నది.ఆ పదం కూడా కొందరిసృష్టి మాత్రమేగాని నిజం కాదన్న విషయం కూడా నిజమే.

తృతీయంలోని యురేనస్ ప్లూటోలు క్రీడలలో దూకుడును ఇస్తాయి.ఇతని జాతకంలో ఈ రెంటిలో యురేనస్ బాగా బలంగా ఉన్నది.ఎందుకంటే యురేనస్ కుజనక్షత్రంలో ఉండి ఖచ్చితమైన పంచమదృష్టితో ఉచ్ఛకుజుడిని చూస్తున్నది.కనుకనే డోనాల్డ్ బ్రాడ్మన్ కూడా ఇతన్ని మెచ్చుకునే విధంగా విచిత్రంగా టెక్నిక్ నూ దూకుడునూ కలగలిపి ఆడగలిగాడు.

పంచమంలో నెప్ట్యూన్ ప్రేమవివాహాన్ని ఇస్తుంది.ఇతని జాతకంలో ఇదికూడా నిజం కావడం చూడవచ్చు.నెప్ట్యూన్ శనినక్షత్రమైన అనూరాధలో ఉండటం వల్ల తనకంటే పెద్దదైన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

యురేనస్ నెప్ట్యూన్ ప్లూటోలను నేనుకూడా మొదట్లో పరిగణించేవాడిని కాను.కాని తర్వాత్తర్వాత నా అభిప్రాయాలు మార్చుకున్నాను.వాటిని కూడా జాతకంలో లెక్కలోకి తీసుకుంటేనే ఎక్కువ క్లారిటీ వస్తుంది అనేమాట నిజమే.

తృతీయంలోని ఘటికాలగ్నం కూడా క్రీడలవల్ల వచ్చే పేరుప్రఖ్యాతులను సూచిస్తున్నది.

ఈ రకంగా జాతకచక్రాన్నిబట్టే జీవితం జరగడం ఎవరి జీవితంలో చూచినా గమనించవచ్చు.ఏరంగంలో ఎంత గొప్పవారైనా గ్రహాలకూ జాతకానికి అతీతులు కారు.కాలేరు.
read more " సచిన్ టెండూల్కర్ జాతకం "

16, అక్టోబర్ 2013, బుధవారం

దేవరగట్టు-మక్కా

ఈ లోకంలో మానవులు అసలైన ఆధ్యాత్మికతను వదలి ఏవేవో వారికి తోచిన తంతులలో కాలం వెళ్ళబుచ్చుతూ అవే దైవానికి చేర్చే మార్గాలని భ్రమిస్తూ ఉంటారు.కళ్ళు తెరచి చూస్తే,మన చుట్టూఉన్న ప్రపంచంలో దీనికి నిదర్శనాలు ఎన్నైనా కనిపిస్తాయి.

ప్రస్తుతం భూమ్మీద రెండుచోట్ల రెండురకాలైన కార్యక్రమాలు జరుగుతున్నాయి.

ఒకటి - మక్కాలో సైతాన్ అంటూ రాతిస్తంభాన్ని లక్షలాదిమంది 'సాంప్రదాయబద్ధంగా' రాళ్ళతో కొట్ట్డడం.ఆతర్వాత లక్షలాది జంతువులను 'సాంప్రదాయబద్ధంగా' దేవుడికి బలివ్వడం.

రెండు - కర్నూల్ జిల్లా దేవరగట్టు గ్రామంలో దేవుడి ఊరేగింపు సందర్భంగా రెండు గ్రామాల ప్రజలు 'సాంప్రదాయబద్ధంగా' కర్రలతో తలలు పగలగొట్టుకోవడం.

నా దృష్టిలో ఈ రెండూకూడా మానవునిలోని సాంప్రదాయబద్ధమైన అజ్ఞానానికి సూచికలే.

ఎందుకని?

దైవానికి జంతువుల బలి ఎంతమాత్రం అవసరం లేదు.ఎందుకంటే అవికూడా దైవసృష్టిలో సృష్టించబడిన జీవాలే గనుక.మానవునికి మిగిలిన జంతువుల కంటె కొంచం తెలివి ఉన్నంతమాత్రాన వాటిని చంపే హక్కు అతనికి లేదు.'నీకోసమే వాటిని సృష్టించాను. వాటిని చంపి భుజించు' అంటూ దేవుడు చెప్పినట్లు కొన్ని మతగ్రంధాలలో ఉన్న మాటలకు వాస్తవికత లేదు.ఇవి జిహ్వచాపల్యాన్ని జయించలేని కొందరు మనుషులు వ్రాసిన మాటలేగాని దైవం చెప్పిన సూక్తులు కానేకావు.ఎందుకంటే దైవంనోట అలాంటి పక్షపాతంతో కూడిన మాటలు ఎన్నటికీ రావు.

సైతాన్ అనేది రాతిస్తంభంలో లేదు.అది మన చుట్టూ ఉన్నది.మన హృదయాలలో ఉన్నది.ఒక పక్క దేవుణ్ణి పూజిస్తున్నాం అని చెబుతూ ఇంకోపక్క సాటి మనుషులను చంపాలని ప్లానులు వేసే మనుషుల గుండెల్లో సైతాన్ ఉన్నది.ఆ సైతాన్ని చంపాలంటే మనమే చెక్కిన రాతిస్తంభాన్ని మనమే రాళ్ళతో కొట్టడం కాదు,మనల్ని మనమే రాళ్ళతో కొట్టుకోవాలి.

ఒక పక్కన ఉన్నతమైన భావనతో నిరాకార తేజోస్వరూపంగా దైవాన్ని కొలిచే ముస్లిములు ఇంకోపక్కన ఇలాంటి అనాగరిక ఆటవిక తంతులను ఎలా ఆచరిస్తారో నాకెప్పటికీ అర్ధం కాదు.

ఇక దేవరగట్టు విషయానికొస్తే,ఇది కూడా మక్కాలొ జరిగే తంతులాంటి అనాగరిక ఆచారమే.ఒక వర్గం దేవుణ్ణి ఊరేగిస్తుంటే ఇంకొక వర్గం దానిని అడ్డుకోవడం ఏమిటి?దానికోసం యుద్ధం ఏమిటి?కర్రలతో తలలు పగలగొట్టుకొని ఆనందించడం ఏమిటి?పైశాచికత్వం కాకపోతే దీనిని ఏమనాలి?

ఎప్పుడో కాలగతిలో ఏదో ఒక సందర్భంలో ఆయా ఘట్టాలు జరిగి ఉండవచ్చు. వాటిని శిలాశాసనాలుగా తీసుకొని తరతరాలుగా వాటిని గుడ్డిగా ఆచరించడానికి అవేమీ అంత ఆదర్శ సంఘటనలు కావు.వాటిలో ఉన్నత తాత్త్వికసత్యాలూ లేవు.

ఈ రెంటినీ విమర్శిస్తే ఆయా అనుయాయులకు పిచ్చికోపం వస్తుంది.ఈ రెంటినే కాదు.'సత్యం ఇదిరా బాబూ' అని చెప్పే ప్రతివాడిమీదా లోకానికి పిచ్చి కోపం వస్తూనే ఉంటుంది.ఎందుకంటే తరతరాలుగా తాము ఆచరిస్తున్న తర్కరహిత ఆచారాలలో సత్యం ఎంత? అని ప్రశ్నించుకోవడానికి చాలా గుండెధైర్యమూ సత్యనిష్ఠా ఉండాలి.దురదృష్టవశాత్తూ అవి మానవులలో ఎక్కడోకాని కనిపించవు.

దేవరగట్టులో జరుగుతున్న ఈ అనాగరిక తంతును ఆపడానికి వెళ్ళిన పోలీసులపై గ్రామస్తులు ఎదురుదాడి చెయ్యడం వారి అజ్ఞానానికి పరాకాష్ట అనుకోవచ్చు.పైపెచ్చు,ఈ అనాగరిక ఆచారం ఆపితే దేవుడికి కోపం వస్తుందనీ,ఆయా గ్రామాలకు ఏదో చెడు జరుగుతుందనీ గ్రామస్తులు ఇప్పటికీ నమ్ముతారు.రోదసీయుగంలో కూడా అడవి మనుషులలాగా బ్రతుకుతామంటే ఎవరేం చెయ్యగలరు?

అలాగే, మక్కా వెళ్ళి సైతానంటూ రాతి స్తంభాన్ని రాళ్ళతో కొట్టి జంతువులను బలిచ్చి ఆనందంగా తిరిగివచ్చె సాధారణ ముస్లిం, తాను తిరిగివచ్చిన తర్వాత తనచుట్టూ ఉన్న సాటిమానవులనూ వారు పాటించే ఇతర మతాలనూ ద్వేషిస్తూ గుండెలనిండా కోపాన్ని కలిగిఉంటే దాని ప్రయోజనం ఏమిటి?సైతాన్ని అతడు ఏరకంగా చంపినట్లు?తాను ద్వేషించే సైతాన్ని తన గుండెల్లోనే పెట్టుకుని తిరిగివచ్చినట్లు కాదా?

ప్రతి మతంలోనూ ఇలాంటి పిచ్చిపిచ్చి ఆచారాలు చాలా కనిపిస్తాయి. అత్యున్నతములైన సత్యాలూ,అజ్ఞానపూరిత ఆచరణలూ ఒకేసారి రెండూ పక్కపక్కనే కనిపిస్తాయి.అసలైన సత్యాన్ని ఉన్నదున్నట్లు చెప్పిన బౌద్ధమూ అద్వైతమూ వంటి మతాలుమాత్రం కాలగర్భంలో కలసి ఎక్కడో నామమాత్రంగా మిణుకు మిణుకుమంటూ ఉండిపోతాయి.అవెవరికీ పట్టవు.

మనుష్యులు బయటకు ఎన్ని మాటలు చెప్పినా వారిస్వార్దాన్నీ,అజ్ఞానాన్నీ, హింసాప్రవృత్తినీ పెంచిపోషించే మతాచరణలే వారికి నచ్చుతాయి.లేదా ఆయా మతాలలో ఇలాటివాటిని ప్రేరేపించే తంతులనే వారు స్వీకరించి ఆచరిస్తూ ఉంటారు.మిగిలిన సత్యాలను వారు స్వీకరించరు.ఆచరించరు.అలాగే,సత్యాన్ని ఉన్నదున్నట్లుగా చెబితే కూడా ఎవరికీ ఎక్కదు.సాటి మానవులనూ సాటి జీవులనూ ప్రేమించలేనివారికి దైవత్వం ఎలా వస్తుందో నాకైతే ఎప్పటికీ అర్ధం కాదు.

మనుషులకు అసలైన మతమూ దైవాన్ని చేరే అసలైన మార్గమూ అక్కరలేదు.వీరికి కావలసినది అనవసరమైన తంతులూ,అజ్ఞానపూరిత ఆచారాలూ,వారి స్వార్ధాన్నీ భయాన్నీ అహంకారాన్నీ సంతృప్తిపరచే డొల్ల కార్యక్రమాలూ మాత్రమే.మనుషుల అజ్ఞానాన్నీ మొండితనాన్నీ ఆ దేవుడు కూడా మార్చలేడు.ఈ లోకం ఖర్మ ఇంతే.
read more " దేవరగట్టు-మక్కా "

21, సెప్టెంబర్ 2013, శనివారం

పంచవటి సంస్థ (Panchawati Inc.) అమెరికాలో మొదలైంది

"సాటి మానవుని బాధలను పట్టించుకోని వేదాంతం నాకక్కరలేదు" అన్నారు వివేకానందస్వామి.రామకృష్ణుని శిష్యులు మెట్టవేదాంతులు కారు.వారు ఉత్త ఊకదంపుడు ఉపన్యాసకులు కారు.వారు ఆచరణవాదులు.అసలు సిసలైన సాధకులు.అంతేకాదు వారు నిజమైన మానవతావాదులు.

"ఆత్మనో మోక్షార్ధం జగద్ధితాయచ(నీ మోక్షం కొరకు,జగత్తుకు మంచి చెయ్యడం కొరకు నీ జీవితాన్ని అర్పించు) అన్న మహత్తరమైన ఆశయంతో వివేకానందులు రామకృష్ణామిషన్ స్థాపించారు.ఇన్నేళ్ళలో ఈసంస్థ లెక్కలేనంతమంది మహర్షులను మహనీయులను మహాత్ములను సృష్టించింది.

వారందరూ శ్రీరామక్రిష్ణులు చూపిన 'శివభావే జీవసేవ (శివుడినే సేవిస్తున్నాను అన్నభావంతో జీవుడిని సేవించు.జీవుడిలో శివుడిని చూడు)' అన్నబాటలో నడిచి చరితార్దులై ప్రపంచ ఆధ్యాత్మికచరిత్రలో ధృవతారలై వెలుగుతున్నారు.వారి అడుగుజాడలలో నడిచే ప్రయత్నంతోనే ఇప్పుడు పంచవటి సంస్థ(Panchawati Inc.)అమెరికాలోని మిచిగాన్ రాష్ట్రంలో మొదలైంది.

రాయిలో భగవంతుడిని కొలవడం మంచిదే.మనం కొన్ని వేల ఏళ్ళుగా అదే చేస్తున్నాం.కాని జీవులలో ఉన్న భగవంతుడిని ఆరాధించడం ఇంకా ఉన్నతమైనది.ఈ భావన మన వేదాలలో ఉపనిషత్తులలో ఎప్పటినుంచో ఉన్నది.దానిని బయటకు తీసి ఆచరణాత్మకంగా మలచి కర్మనే యోగంగా చెక్కి,సేవద్వారానే మానవుడు ఆధ్యాత్మికంగా ఎదగగలడు అని చెప్పిన ఘనత వివేకానందస్వామిది.

మానవ జీవితగమ్యం భగవత్ సాక్షాత్కారం.మానవుడు లౌకిక జీవితంలో ఎన్ని సాధించినా సరే,ఇది సాధించకుండా మరణిస్తే అతని జన్మ వృధా అవుతుంది.అతడు అసంతృప్తితో చావవలసి వస్తుంది.తర్వాత ఏ జన్మ వస్తుందో తెలియదు.కనుక మానవజన్మను చాలా జాగ్రత్తగా ఉపయోగించుకో వలసి ఉంటుంది.ఈ విషయాన్ని మనగ్రంధాలు అన్నీ నొక్కిచెప్పాయి. దైవసాక్షాత్కారాన్ని పొందడానికి మన ధర్మంలో మతంలో అనేక మార్గాలున్నాయి.వీటిలో భక్తి,జ్ఞాన,రాజ,కర్మయోగాలు నాలుగూ రాజ మార్గాలవంటివి.మిగిలిన చిన్నచిన్న మార్గాలన్నీ ఈ నాలుగింటిలో కలసి వస్తాయి.వాటిలో ఒకటిగాని,కొన్నిగాని,అన్నీగాని  ఎవరి శక్తిని బట్టి వారు ఆచరించి జీవితగమ్యాన్ని చేరమని వివేకానందస్వామి మహోపదేశం ఇచ్చారు.

మహోన్నతమైన మన సనాతనధర్మం కులానికి మతానికి జాతికి వర్గానికి వర్ణానికి అతీతమైనది.కాని అనేక కారణాలవల్ల తరతరాలుగా ఇవే సంకెళ్ళలో అది చిక్కుకుపోయింది.ఎందరికో దూరమై పోయింది.ఆ సంకెళ్ళను తెంచి దానిలోని అమూల్యసంపదను అందరికీ అర్ధమయ్యేలా పంచి ఆర్తితో వెదుకుతున్న ఎందరికో సరైన దారిచూపి,దాని ఒడిలోనికి వారినందరినీ ఆహ్వానించి,వారి ఆర్తిని తీర్చాలని నేను నావంతుగా మూడేళ్లుగా నా బ్లాగ్ ద్వారా నిజమైన సనాతనధర్మాన్ని వివరిస్తూ ప్రయత్నిస్తున్నాను.

ఈ ప్రయత్నంలో చాలావరకూ సఫలీకృతుడనయ్యాను అనడానికి నేను అందుకున్న వేలాది మెయిల్స్, నేను తీర్చిన వేలాది ఆధ్యాత్మిక సందేహాలే రుజువులు.నా బ్లాగ్ లోని పోస్ట్ లు చదివి -- "నిజమైన సనాతనధర్మం అంటే,హిందూమతం అంటే ఇదా? మన మతంలో ఇంత గొప్పదనం ఉన్నదా?ఇన్ని మహోన్నత విషయాలూ రహస్యాలూ మన ధర్మంలో ఉన్నాయా? అన్న విషయాలు తెలుసుకున్నాము.మీ బ్లాగ్ చదివి ఎంతో నేర్చుకున్నాము.మా ఆలోచనాపరిధి ఎంతో పెరిగింది.మా జీవితాలలో ఊహించని మార్పు వచ్చింది.మీ వ్యాసాలు చదవకుంటే జీవితంలో ఎంతో కోల్పోయి ఉండేవారము" - అంటూ నాకు వచ్చిన మెయిల్స్ కొన్ని వందలున్నాయి.నా ఈ నిస్వార్ధ ప్రయత్నాన్ని చూచి ఈనాడు నాకు తోడుగా ఇంకొందరు వచ్చి నిలిచారు.ఇంకా ఎందఱో మాతో కలవడానికీ,కలసి నడవడానికీ సిద్ధంగా ఉన్నారు.వారందరికీ నా కృతజ్ఞతలు.

పైన వివరించిన మహత్తరమైన ఆశయాలతో ఉత్తేజితులైన కొద్దిమందితో 'పంచవటి' సంస్థ ఈనాడు అమెరికాలో ప్రారంభమైంది.ఈ ఉన్నతమైన ఆశయం వెనుక విష్ణుభొట్ల రామన్నగారు,ఆకెళ్ళ పద్మజగారు,డాక్టర్ సావిత్రిగారు ప్రస్తుతానికి ఉన్నారు.వీరు ముగ్గురినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

త్వరలో మనదేశంలో ప్రారంభించబోతున్న 'పంచవటి ట్రస్ట్' లో చేరి దాని ఆశయాలలో పాలు పంచుకోవడానికి ఇప్పటికే ఉన్న మా 'పంచవటి' గ్రూప్ సభ్యులు సిద్ధంగా ఉన్నారు.వారికీ నా కృతజ్ఞతలు.

ముందుముందు ఈసంస్థ ఎంతో ఎత్తుకు ఎదిగి,కులమతాలకు అతీతంగా,ఒక మహావృక్షంగా మారి ఎందఱో వ్యదార్తులకు స్వాంతన కలిగిస్తుందనీ ఎందఱో నిస్వార్ధసాధకులకు నిజమైన ఆధ్యాత్మికమార్గం చూపి వారిని భగవదున్ముఖులను గావిస్తుందనీ,దారి తెలియక వెదుకుతున్నవారికి సరియైన మార్గదర్శనం చెయ్యగలదనీ నేను నమ్ముతున్నాను.

ఈ కల సాకారం కావడానికి వెనుక ఎంతో తపన ఉన్నది. ఎన్నో హృదయాల నిరంతర అన్వేషణ ఉన్నది.అమూల్యమైన ఈ మానవజన్మను వృధాగా గడిపి అందరిలాగా చావకూడదన్న ఒక ఆర్తి ఉన్నది. అదంతా నేను ఇక్కడ చెప్పబోవడం లెదు.ఈ మూడేళ్ళలో జరిగిన సంఘటనలను అన్నింటినీ నేను ఇక్కడ వివరించబోవడం లెదు.కానీ ఒక్క విషయాన్ని మాత్రం చెప్పాలనుకుంటున్నాను.

ఈ మార్గంలో మేము ఒంటరులం కాము.మా వెనుక భగవంతుని ఆశీస్సులున్నాయి.అంతేగాక పవిత్రాత్ములైన పరమపూజ్య స్వామి గంభీరానంద,స్వామినందానంద,స్వామిఉద్ధవానంద,స్వామి తపస్యానంద మొదలైన మహనీయుల,జగద్గురువుల,యోగేశ్వరుల ఆశీస్సులున్నాయి. ఇంకెందరో మహనీయుల కటాక్షం నిండుగా మావెంట ఉన్నది.స్వామి ఆత్మలోకానంద,గౌరీవ్రత్ మా మొదలైన ప్రస్తుత మహాత్ముల మార్గదర్శనం ఉన్నది.

'స్వామి ఆత్మలోకానంద','గౌరీవ్రత్ మా' - వీరిద్దరూ భారతీయులు కారు.శ్వేత జాతీయులు.వీరిలో 'గౌరీవ్రత్ మా' యూదు జాతీయురాలు.కాని భారతీయ సనాతనధర్మంతో ప్రభావితురాలై తన జీవితాన్ని రామకృష్ణ వివేకానందుల మహత్తర ఆశయాలకోసం త్యాగంచేసి సన్యాసం స్వీకరించి తపోమయజీవితం గడుపుతూ నలభైఏళ్ళ నుండి అమెరికాలో మనం ఊహించలేనంత గొప్ప సేవ చేస్తున్నారు.

చిన్నచిన్న ఆడపిల్లలను వ్యభిచార ఊబిలోకి దించి వారిచేత బలవంతంగా వ్యభిచారం చేయించే child trafficking అనేది ఆసియా దేశాల తర్వాత అమెరికాలోనే ఎక్కువ. గౌరీవ్రత్ మా నాలుగు దశాబ్దాల నుంచి ఈ చెడును ప్రతిఘటిస్తూ అమెరికాలో ఎందఱో ఆడపిల్లలను ఈ ఊబినుంచి రక్షించి వారికి నూతనజన్మను ఇచ్చే పనిని చేస్తూ ఉన్నారు.ఒంటరి స్త్రీని నేనేమి చెయ్యగలను అనుకోకుండా,మొక్కవోని ధైర్యంతో,రామకృష్ణ,శారదా వివేకానందుల మీద అమేయమైన నమ్మకంతో,అమెరికన్ మాఫియాకు ఎదురు నిలిచి,ప్రాణాలకు తెగించి,ఎందఱో పురుషులు చెయ్యలేని ఈ పనిని గౌరీవ్రత్ మా ఒక్కరే చేస్తున్నారు.

హిందూ మతంలో పుట్టకపోయినా,భారత దేశానికి ఎన్నో వేల మైళ్ల దూరంలో ఉన్నా,ఈ దేశాన్ని ఈ సంస్కృతిని ప్రేమిస్తూ,ఊరకే మాటలు చెప్పి ఊరుకోవడం కాకుండా అవిచూపిన బాటలో నడుస్తూ,జీవితాలను చరితార్దాలుగా మలచుకున్న విదేశీయులు ఎందఱో నేడు మన కళ్ళెదురుగా ఉన్నారు.

వీరికి mothers trust అనే సంస్థ ఉన్నది.ఆ సంస్థ వివరాలనూ, వారు ఎంతటి అద్భుతమైన సేవను చేస్తూ ఎంతటి ఉదాత్తమైన ఉన్నతమైన జీవితాలను గడుపుతున్నారో ఇక్కడ చూడండి.

స్వామివివేకానంద యొక్క అనేకమంది శిష్యులలో ఒకరు స్వామి విరజానంద.1938 లోనే ఆయన రామకృష్ణా మిషన్ కు ఆరవ సర్వాధ్యక్షులుగా పనిచెశారు.స్వామి వివేకానందుల స్వహస్తాల నుంచి సన్యాసం స్వీకరించిన అదృష్టశాలి విరజానందస్వామి.ఆ భాగ్యమే ఆయనను జగద్గురువును చేసింది.శ్రీరామకృష్ణుల ప్రత్యక్షశిష్యులైన వివేకానందాది మహనీయుల తర్వాత తరంలో మొట్టమొదటి వారు స్వామి విరజానంద.

ఆయన శిష్యులలో ఒకరు స్వామి భాష్యానంద.ఆయన 1960 లలో అమెరికాలో నివసించి వేదాంతప్రచారం గావించారు.సనాతనధర్మాన్ని విదేశీయులకు అర్ధమయ్యేలా చెబుతూ తన ఉదాత్తమైన జీవితంతో ఎందరినో ప్రభావితులను చేశారు.ఆ ప్రభావంతో ఇప్పుడు రామకృష్ణ వివేకానందుల మార్గంలో ఎందఱో విదేశీయులు నడుస్తూ ఉజ్జ్వలమైన ఋషిజీవితాలు గడుపుతూ,భారతీయులమైన మనం సిగ్గుతో తల దించుకునేలా చేస్తున్నారు.మన ధర్మాన్ని గురించి ఈనాడు వారు మనకు బోధిస్తున్నారు. మన వేదాలలో ఏముందో మనకు తెలీదు.దానిని వారు గ్రహించడమే కాదు. జీవితాలలో ఆచరించి చూపిస్తున్నారు.మనమో,డబ్బు వెంటా, ఇంద్రియ సుఖాలవెంటా పిచ్చిగా పరిగెత్తుతున్నాం.కనీసం వారిని చూచైనా మన నిజమైన ధర్మం ఏమిటో మనం నేర్చుకునే ప్రయత్నం చెయ్యకపోతే మనకు నిష్కృతి లేనే లేదు.

మహోన్నతులైన మన పూర్వఋషులు చూపిన మార్గంలో,శ్రీరామకృష్ణ శారదామాత వివేకానందుల అడుగుజాడలలో నడవాలనే మహోన్నత ఆశయంతో ఈనాడు అమెరికాలో 'పంచవటి' సంస్థ మొదలైంది.

"పంచవటి" - ఫలాపెక్ష లేని ఒక ఉదాత్తమైన సంస్థ.మాకు పేరు ప్రఖ్యాతులు అక్కర్లెదు.కిరీటాలు అక్కర్లేదు.ఆర్భాటాలు అక్కర్లెదు.పొగడ్తలు అక్కర్లెదు. ఏదో ఆశించి మేము ఈ పనిని చెయ్యడం లేదు.నిజమైన సనాతనధర్మాన్ని ఆచరించి జీవితాలను ధన్యములు చేసుకోవడమూ,ఆర్తి ఉన్న ఇతరులను కూడా ఈమార్గంలో నడిపించి వారిని కూడా ధన్యులను చెయ్యడమే మా ఆశయం.ఈ ఆశయానికి ఊతం శ్రీరామకృష్ణులు, శారదామాత, వివేకానంద స్వామి.కులమతాలకు అతీతంగా వారు చూపిన విశ్వజనీనమైన మార్గమే మా బాట.

భగవదవతారమైన శ్రీరామకృష్ణుని కరుణాకటాక్షాలతో ఈ జన్మలోనే మా గమ్యాన్ని చేరగలమన్న నమ్మకం మాకున్నది.మా ప్రయత్నానికి దైవం తన చేయూతనిచ్చుగాక.

మా వెబ్ సైట్ ఇక్కడ చూడవచ్చు.

త్వరలో మా కార్యక్రమాలను పై వెబ్ సైట్ ద్వారానూ,ఈ బ్లాగ్ ద్వారానూ కూడా ఎప్పటికప్పుడు అప్ డేట్ చెయ్యడం జరుగుతుంది.
read more " పంచవటి సంస్థ (Panchawati Inc.) అమెరికాలో మొదలైంది "

19, సెప్టెంబర్ 2013, గురువారం

సద్గురు ప్రణవానంద ఆశ్రమం


సద్గురు ప్రణవానందస్వామి
నేను నంద్యాల పట్టణానికి పోతే అక్కడికి పోయిన పని ముగిసినాక వీలైనప్పుడల్లా దర్శించే స్థలాలు రెండున్నాయి.ఒకటి సద్గురు త్యాగరాజ స్వామి ఆలయం.రెండవది సద్గురు ప్రణవానందస్వామి సమాధి ఉన్న ఆశ్రమం.చాలామందికి తెలిసిన విషయం ఏమంటే తమిళనాడు లోని తిరువయ్యారు లో త్యాగరాజస్వామి సమాధీ ఆలయమూ ఉన్నవి.కాని మన ఆంధ్రదేశంలో త్యాగరాజస్వామికి ఆలయం ఒక్క నంద్యాలలోనే ఉన్నది.ఆ వివరాలు ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను. ప్రస్తుతానికి సద్గురు ప్రణవానందుల ఆశ్రమం గురించి.



నంద్యాల నుంచి మహానందికి వెళ్ళే దారిలో బుక్కాపురం అని ఒకగ్రామం వస్తుంది.ఆ గ్రామ పొలిమేరలలో దారిపక్కనే ఒక పెద్ద ఊడలు దిగిన మర్రిచెట్టూ దాని పక్కనే పాతకాలంనాటి ఒక ఆశ్రమమూ కనిపిస్తాయి. చాలామందికి తెలియని విషయం ఏమంటే,అది ఒక సద్గురుస్థానం అనీ,నిజమైన వేదాంతీ మహనీయుడూ అయిన ప్రణవానందస్వామి అక్కడే నివసించి సమాధి అయ్యారనీ ఎక్కువమందికి తెలియదు.


నేను గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగినప్పటికీ నాకు రాయలసీమ అంటేనే ఇష్టం.దానికి కారణం రాయలసీమలో ఉన్న ఆధ్యాత్మిక తరంగాలే. సర్కార్ జిల్లాల వాతావరణం కలుషితం అయినంతగా రాయలసీమ కాలేదు.పైగా, రాయలసీమలో ఆధ్యాత్మిక వాతావరణం సర్కార్ జిల్లాలలో కంటే చాలాహెచ్చు.ఇప్పటికీ ఎన్నో నిజమైన సాధు సాంప్రదాయాలు రాయలసీమలో ఉన్నాయి.వాటిలో ఒకటి శ్రీమదుమామహేశ్వర గురుపీఠం.ఎందఱో యోగులు,అవధూతలు, మహానీయులు ఇప్పటికీ రాయలసీమ మారుమూల పల్లెలలో కూడా మనకు కనిపిస్తారు.అయితే వారిని గుర్తించగలిగే ప్రజ్ఞ మనలో ఉండాలి.


ప్రణవానందస్వాములకు ముందు వీరి పరంపర నాకు తెలియదు.కాని ప్రణవానందస్వామి తమిళనాడు నుంచి వచ్చి ఇక్కడ రాయలసీమలో స్థిరపడి బుక్కాపురంలో సమాధి అయ్యారు.ఆయన శిష్యుడైన సద్గురు సదానందస్వామి గుంతకల్లు దగ్గర ఉన్న గంజిగుంట అనే గ్రామంలో ఆశ్రమం నిర్మించుకుని అందులోనే నిర్యాణం చెందారు.వారి సమాధి అక్కడ ఉన్నది. ఆయన శిష్యుడైన శంకరానందగిరి స్వామి ఉరవకొండ దగ్గర ఉన్న లత్తవరం అనేగ్రామంలో సమాధి చెందారు.వీరు ముగ్గురూ నిజమైన వేదాంతులు. మహనీయులు.సద్గురువులు.

వీరిలో శంకరానందగిరిస్వామిని దర్శించే భాగ్యం నాకు కలిగింది.1984 లో నేను గుంతకల్లులో ఉన్నప్పుడు తిలక్ నగర్లో ఉన్న వారి ఆశ్రమాన్ని తరచూ దర్శించేవాడిని.ఆయన అక్కడకు తరచుగా వచ్చేవారు.

ఒకసారి మా అమ్మగారితో స్వామి దర్శనానికి వెళ్లాను.అప్పుడు మా అమ్మగారు స్వామిని ఒక ప్రశ్న అడిగారు.

'పెద్దవయసు కావడంతో కాళ్ళనొప్పుల వల్ల స్థిరంగా ఆసనంలో కూర్చుని ఎక్కువసేపు జపధ్యానాలు చెయ్యలేకపోతున్నాను.దీనికి మార్గం ఏదైనా చెప్పండి స్వామీ' అన్నారు.

దానికి స్వామి వెంటనే పతంజలి యోగసూత్రాలలో నుంచి ఉదహరిస్తూ-' అమ్మా."స్థిర సుఖమాసనం" అని యోగసూత్రాలలో మహర్షి చెప్పినారు. కనుక పద్మాసనమే కానవసరం లేదు.నీకు శ్రమలేకుండా సుఖంగా ఎక్కువ సేపు కూర్చోనగలిగే ఆసనం ఏదైనా మంచిదే తల్లీ.మనస్సు ఏకాగ్రం కావడం ప్రధానం.'- అని సమాధానం ఇచ్చారు.

అప్పటికి నాకు 20 ఏళ్ళు.నేను అప్పటికే యోగసూత్రాలను అనేకసార్లు తిరగామరగా చదివి ఉండటంచేత వాటిలో చాలాభాగం నాకు కంఠతా వొచ్చు. మా గురువులు చెప్పినది కూడా అదే కావడంతో ఆయన చెప్పిన సమాధానం నాకు చాలా ఆనందాన్ని కలిగించింది.



శంకరానందగిరి స్వామి ప్రవచనాలను వినే అదృష్టం నాకు కొన్నిసార్లు కలిగింది.అనర్గళమైన ఆయన వాగ్ధాటికి ముగ్దులవని వారు అరుదు.ఆయన మాట్లాడటం మొదలుపెడితే మూడునాలుగు గంటలపాటు వేదాలనుంచీ, ఉపనిషత్తులనుంచీ,బ్రహ్మసూత్రాల నుంచీ,భగవద్గీత నుంచీ,యోగవాసిష్టం నుంచీ,యోగసూత్రాలనుంచీ,పురాణాల నుంచీ ఎన్నోశ్లోకాలను సందర్భానుసారంగా అప్పటికప్పుడు అనర్గళంగా ఉదాహరిస్తూ మధ్యమధ్యలో పిట్టకధలను చెబుతూ వేదాంతబోధ చేసేవారు.

ఆయన కన్నడప్రాంతంలో ఒక మంచి సంపన్నకుటుంబంలో జన్మించారు. చిన్నవయసులోనే వైరాగ్యసంపన్నుడై సన్యాసం స్వీకరించి తపస్సులో కాలం గడిపారు.దశనామీ సాంప్రదాయంలో వీరిది 'గిరి' సాంప్రదాయం.తెలుగు, కన్నడ,ఇంగ్లీషు,హిందీ,సంస్కృత భాషలలో ఆయన అనర్గళంగా మాట్లాడగలిగేవారు.సరస్వతీదేవి ఆయన నోటిలో నివాసం ఉన్నదా అనిపించేది.ఆయన ప్రవచనాలను వినినవారు నిజంగా అదృష్టవంతులే.అంత అద్భుతంగా spell binding గా ఉండేవి ఆయన ఉపన్యాసాలు.అప్పటికీ ఇప్పటికీ నేను ఎందఱో ఉపన్యాసకులను విన్నాను. కాని ఆయనతో సాటిరాగల అద్భుతవక్తలు నాకు ఇప్పటివరకూ కనిపించ లేదు.

ఆయనది ఉత్తపాండిత్యం అనుకుంటే పొరపాటు పడినట్లే.పాండిత్యానికి తోడు ఆయన గొప్పతపస్వి.ఆయనలో పాండిత్యమూ తపస్సూ కలసిమెలసి ఉండేవి.ఆయన మహాజ్ఞాని అని ఆయనను చూస్తేనే అర్ధం అవుతుంది. ఒకనిలో పాండిత్యమూ తపస్సూ కలగలసి ఉంటే అది బంగారానికి సువాసన అబ్బినట్లు అవుతుంది అని శారదామాత అనేవారు.శంకరానందస్వామి అట్టి మహనీయుడు.

అప్పట్లో శంకరానందస్వామీ,గండిక్షేత్రం రామక్రిష్ణానందస్వామీ కలసి ఇచ్చిన గీతోపన్యాసాలు ఆంద్రదేశాన్ని ఉర్రూతలూగించాయి.ఇద్దరు మహా పండితులూ మహావక్తలూ,మహాజ్ఞానులూ కలిస్తే ఎంత అద్భుతంగా ఉంటుందో వాటిని విన్నవారికే ఎరుక.అదృష్టం అంటే వారిదే.వారితో పోలిస్తే నేటి టీవీ ఉపన్యాసకులు చెల్లని రూపాయిలూ పంటికింద రాళ్ళూ అనే చెప్పాలి.



అప్పట్లో ఎన్టీ రామారావు తీసిన 'పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి' సినిమా రిలీజైంది.గుంతకల్లు ప్రసాద్ టాకీస్ లో అది విడుదలైంది.నేను ఆ సినిమా చూడటానికి పోయినరోజే స్వామి కూడా సినిమా చూడటానికి వచ్చారు. హాలు యజమానులు స్వామి శిష్యులు కావడంతో ఆయన్ను ప్రత్యేకంగా బాక్స్ లో కూచోబెట్టి సినిమా చూపించారు.సామాన్యంగా సాంప్రదాయ స్వాములు సినిమాలకు రారు.కొందరేమో 'నేను స్వామీజీని అయ్యుండి సినిమాకి పోవడం ఏమిటి?'అని నామోషీగా అనుకుంటారు.కాని స్వామి అలాంటి భేషజాలు ఏమీ లేకుండా ఒక చిన్నపిల్లవానిలాగా  హాలుకు వచ్చి మరీ ఆ సినిమాను చూచారు.ఆయన మామూలు జ్ఞాని కాదనీ జ్ఞాని స్థాయిని దాటిన విజ్ఞాని అనీ నాకు ఆరోజే అర్ధమైంది.



గంజిగుంటలో స్వామి గురువులైన సదానందయోగీంద్రుల ఆరాధన జరుగుతుంది.1988లో జరిగిన ఆరాధనకు మేము అక్కడున్నాము.ఆరోజున తన గురువుగారి పాదుకలను తలమీద పెట్టుకుని ఎంత భక్తిగా స్వామి మేడమీద తన గదినుంచి కిందకు దిగివచ్చారో ఆ దృశ్యం నాకింకా ఇప్పటికీ కళ్ళముందు మెదులుతుంది.తాను స్వయంగా ఒక జ్ఞాని అయి ఉండీ తన గురువును ఎంతగా గౌరవించేవారో? ఆ దృశ్యం నిజంగా అద్భుతం.



గుంతకల్లులో ఒకసారి బహిరంగసభ జరిగింది.ఎందఱో స్వాములు మహనీయులు ఆసభకు వచ్చినారు.ఎన్నో గొప్ప వేదాన్తోపన్యాసాలు ఇవ్వబడ్డాయి.ఇంతలో ఎక్కడనుంచి వచ్చినదో సభామధ్యంలోకి ఒక ఊరకుక్క ప్రవేశించింది.అందరూ దానిని తరిమి కొడుతున్నారు.అప్పటివరకూ అంతా బ్రహ్మమే అంటూ ఉపన్యాసాలు వినిన భక్తులు అవన్నీ మరచి కుక్కను 'ఛీఛీ' అని అదిలిస్తున్నారు.

శంకరానందస్వామి వేదికపైనుంచి దానిని గమనించి మైకు తీసుకున్నారు. కుక్కవైపు చూస్తూ చేతులు జోడించి 'స్వామీ! మీ దారిన మీరు పోతుంటే వారికి తెలియక మిమ్మల్ని అదిలిస్తున్నారు.వారి అజ్ఞానాన్ని మన్నించి మీదారిన మీరు సుఖంగా వెళ్ళండి' అని మైకులో చెప్పారు.సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దం ఆవహించింది.అందరూ తొలగి దారి ఇచ్చారు.ఆ కుక్క తన దారిన తాను బయటకి వెళ్ళిపోయింది.ఈ సంఘటనకు నేనే ప్రత్యక్ష సాక్షిని.

వేదాంతాన్ని చెప్పడమే కాదు ఆచరించి చూపించిన మహాజ్ఞాని శంకరానందగిరిస్వామి.ఆయన గురువు సదానందయోగీంద్రులు.ఆయన గురువు ప్రణవానందస్వామి.



వీరి సాంప్రదాయంలో నాకు నచ్చిన ఇంకొక ముఖ్యవిషయం.వీరి ఆశ్రమాలలోని ఆలయాలలో దేవాలయద్వారానికి పైగా ఇరువైపులా శ్రీరామకృష్ణ వివేకానందుల చిత్రాలు తప్పకుండా ఉంటాయి.స్వామి తన ఉపన్యాసాలలో వీరిని గురించి చెప్పకుండా ఉండరు.వివేకానందులనూ రామకృష్ణులనూ చెప్పకుండా వారి ఉపన్యాసం ముగియదు.



అటువంటి మహనీయులను స్మరిస్తే చాలు.మన పాపాలు పటాపంచలై పోతాయి.మన మనస్సులు పవిత్రమైన భావాలతో నిండిపోతాయి.మనకు కూడా బ్రహ్మావలోకన ధిషణ కలుగుతుంది.

ఈ మధ్య నేను బుక్కాపురం ఆశ్రమానికి వెళ్ళినప్పుడు తీసిన ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.ఆశ్రమం నిర్మానుష్యంగా ఉంటుంది.కాపలాగా ఒక్క మనిషి(అతను కూడా భక్తుడే అయి ఉంటాడు) తప్ప అక్కడ సామాన్యంగా ఎవరూ ఉండరు.నిరాడంబరంగా నిశ్శబ్దంగా నిర్మానుష్యంగా ఉండే నిజమైన ఆశ్రమం అది.ధ్యానానికి చాలా అనువైన ప్రశాంతమైన ప్రదేశం.
read more " సద్గురు ప్రణవానంద ఆశ్రమం "

9, ఆగస్టు 2013, శుక్రవారం

శ్రావణ శుక్ల పాడ్యమి-దేశజాతకం

కొన్ని ముఖ్యమైన పనులలో ఉండటం వల్ల పాడ్యమి ముందే వ్రాయవలసిన దేశజాతకం తృతీయనాడు వ్రాస్తున్నాను.

ఈ మాసంలో దేశ పరిస్తితి,రాష్ట్ర పరిస్తితి ఎలా ఉందో జ్యోతిష్య పరంగా గమనిద్దాం.పాడ్యమి నాటి కుండలి ఇక్కడ చూడవచ్చు.

లగ్నం దేశలగ్నమే అయిన వృషభం అయింది.చక్రంలో గ్రహాలు మొత్తం కాలసర్ప యోగపరిధిలో ఉన్నవి.

దాదాపు పదహైదు వందల ఏండ్ల క్రితం వరాహమిహిరాచార్యుడు కాలసర్ప యోగాన్ని గురించి చెబుతూ "కాలసర్పాఖ్య యోగోయం రాజా రాష్ట్ర వినాశనం" అన్నాడు. ఈ యోగం పట్టినపుడు రాజూ రాష్ట్రమూ ఈ రెండికీ కీడు మూడుతుంది.అన్నాడు.అది అక్షరాలా జరుగుతూ ఉండటం మన కళ్ళెదురుగా చూస్తున్నాం.

తృతీయంలో అమావాస్య వల్ల కమ్యూనికేషన్ చాలా ఘోరంగా దెబ్బ తింటుంది.ఎవరు ఏమి చెబుతున్నారో ఏమి మాట్లాడుతున్నారో ఎవరికీ అర్ధం కాదు పట్టదు.ఎవరి స్వార్ధం మేరకు వారు మాట్లాడుతూ ఉంటారు.బయటకు చెప్పేది వేరు.లోపల ఉండే ఉద్దేశాలు వేరుగా ఉంటాయి.

వీరితో బుధుని కలయికవల్ల ఎవరి వాదనను వారు సమర్ధవంతంగా వినిపిస్తారు.తెలివిగా మాట్లాడతారు.కాని అంతర్లీనంగా రాష్ట్ర ప్రయోజనం కంటే ఎవరికి వారికి వ్యక్తిగత స్వార్ధమే బలమైన అంశంగా పనిచేస్తుంది.

రాహుకేతు ఇరుసు  6-12 భావాలలో పడింది గనుక రాష్ట్రానికి శత్రుపీడ ఎక్కువగా ఉంటుంది.కొందరు బహిరంగ శత్రువులు,మరికొందరు రహస్య శత్రువుల మధ్యన రాష్ట్రం విలవిలలాడుతుంది.గొడవలు గందరగోళాలు జరగడం ప్రతిరోజూ మనం చూస్తూనే ఉన్నాం.12 నుంచి 18 వరకూ,మళ్ళీ 24,25 తేదీలలోనూ ఈ గొడవలు బాగా ఎక్కువగా ఉంటాయి.జనానికి చాలా విసుగూ చికాకూ కలుగుతాయి.

చతుర్దంలో శుక్రస్తితి వల్ల జనజీవనంలో పెద్దగా విధ్వంసం ఏమీ జరుగదు.కానీ ఆందోళనలు జరుగుతాయి.ప్రజలకు ఇబ్బందులు ఉంటాయి.

రెండింట గురుకుజుల వల్ల నాయకులు ఒకరినొకరు ఇష్టం వచ్చినట్లు తీవ్రంగా తిట్టుకుంటారు.ఆర్ధికరంగం అతలాకుతలం అవుతుంది.ఇక్కడ నాలుగు ఆరూడాలు కలవడం వల్ల అనవసరమైన వాగ్వాదాలూ పరస్పర దూషణలూ సర్వసాధారణంగా ఉంటాయి.కాని చివరకు వీరి వాగుడుని బట్టి జరిగేది ఏమీ ఉండదు.

  • 7 నుంచి 9 వరకు గొడవలు గోలా ఉంటాయి;దూషణల పర్వం సాగుతుంది.
  • 10 నుంచి 13 లోపల ఒక నష్టం జరుగుతుంది.ప్రజలూ నాయకులూ పిచ్చేక్కినట్లు తిట్టుకుంటారు.
  • 14 నుంచి 19 వరకూ జనాభిప్రాయానికి బలం వస్తుంది.
  • 20 నుంచి 23 వరకూ దూషణల పర్వం మళ్ళీ పుంజుకుంటుంది.
  • 24-25 తేదీలలో ప్రగల్భాలు ఎక్కువౌతాయి.
  • 26 నుంచి 30 వరకూ శత్రుపీడ ఎక్కువౌతుంది.
  • 31 నుంచి 3 వరకూ చర్చలవల్ల కొంత మేలు జరుగుతుంది.
  • 4 నుంచి 6 వరకూ మళ్ళీ శత్రుపీడా,స్తంభనా  ఉంటాయి.
read more " శ్రావణ శుక్ల పాడ్యమి-దేశజాతకం "

11, జులై 2013, గురువారం

మానవుని అహంకారం-మరికొన్ని పద్యములు

ఈరోజు ఆశువుగా వచ్చిన కొన్ని పద్యాలు ఇక్కడ ఇస్తున్నాను.'కందం చెప్పగలవాడే కవి' అన్న సామెత వల్లనో ఏమో చాలావరకూ కందపద్యాలే పలికాయి.చివరలో రెండు మాత్రం ఆటవెలది పద్యాలు.అర్ధం సులభగ్రాహ్యమే అయినప్పటికీ ఒక మిత్రురాలి విజ్ఞప్తి మేరకు దానిని కూడా వ్రాశాను.

1.
అహమున జిక్కిన మనుజుల
బహుపూజల ఫలితమెల్ల బూదిని గలియున్  
ఇహపరముల జెడిపోదురు
మహనీయత నందబోరు మహిలో సత్యా

అహంతో విర్రవీగే మనుషులు ఎన్నెన్ని పూజలు చేసినా వారికి ఫలితం అంటూ ఏమీ ఉండదు.వాటి ఫలితం అంతా బూడిదలో కలిసిపోతుంది. అహంకారులు ఇహంలోనూ పరంలోనూ కూడా ఏమీ సాధించలేరు. మహనీయులు కాలేరు.

2.
యాత్రలు కల్లలు వినుమా
పాత్రత లేనట్టి పాట్లు పాడగు వెతలున్
గాత్రమ్మున శుద్ధి మరచి
ఆత్రమ్ముగ పాడబోవు యాతన సత్యా

అహంకారంతో యాత్రలు చెయ్యడం వృధాప్రయాస.పాత్రతను బట్టి మనకు ఫలం దక్కుతుంది గాని,అది లేకపోతే మనం పడే పాట్లన్నీ చివరికి ఏమీ ఫలితాన్ని ఇవ్వలేక అగచాట్లుగా మారతాయి.పాత్రత లేకుండా యాత్రలు చేసేవారు గాత్రశుద్ది లేకుండా గానం చెయ్యాలని ఆశపడే ఆత్రగాళ్ళ మాదిరి ఉంటారు.

3.
సతులందరు మాయయనెడి
సుతులందరు ఋణము లనెడి సత్యము వినుమా
మితిమీరిన యాశ విడచి
మతిచెదరని యోగనిష్ట మరుగర సత్యా

భార్యాపిల్లలు బంధువులు స్నేహితులు ఋణానుబంధాలన్న సంగతి గ్రహించు.ఆశను బొత్తిగా విడచిపెట్టు.స్థిరమైన మనస్సుతో యోగనిష్టుడవై ఉండు.

4.
ఆశల రుచులను మరగుచు
పాశంబుల బద్ధుడౌచు పడియుండు నరున్
ఆశల బాపును కర్మము 
పాశంబుల దీర్చు మిత్తి పరుగున సత్యా

ఆశల రుచిని మరగి,అష్టపాశములలో చిక్కి కదలలేని మనుష్యులకు వారివారి కర్మమే బుద్ధి గరపుతుంది.చివరకు మరణమే వారి బంధాలను విడదీస్తుంది.

5.
అహమున జిక్కెను సర్వము
అహరహమును నందులోనె యమరుచు నడచున్ 
అహమన్న మిధ్య జూడగ 
ఇహమందున నిదియె వింత నెరుగర సత్యా 

లోకం మొత్తం 'అహం' అనే ఉచ్చులో చిక్కి నిత్యమూ అందులోనే అఘోరిస్తూ ఉన్నది.ఇంతా చూస్తె 'అహం' అనేది అసలు లేనేలేదు.అదొక ఎండమావి. ప్రపంచంలో ఇదే పెద్ద వింత.దీనిని మించిన వింత లేనేలేదు.

6.
ఇహమందున పరమందున
అహమే యసలైన శత్రువనుటను వినుమా
అహమంత విచ్చిపోవగ
అహమే మిగులును జివరకు ననువుగ సత్యా

ఈలోకంలోగాని పరలోకంలోగాని మనిషికి అహంకారమే అతి పెద్ద శత్రువు. ఈ అహంకారం మొత్తం నాశనమైతే చివరికి సత్యమైన తానే మిగులుతాడు.

7.
ఒరులెవ్వరు లేరిచ్చట 
పరులను మదినెంచి జూడ పాపము గలుగున్ 
గురిగా జూచెడి చూపున 
సరియగు యాత్మగనె దోచు సర్వము సత్యా

ఈ ప్రపంచంలో పరాయివారంటూ ఎవ్వరూ లేరు.పరులు అనుకోవడం పాపమే.గురిగా సరిగా చూచితే సర్వం ఆత్మమయంగానే కనిపిస్తుంది.

8.
యమ నియమపు నీమమ్ముల
సమయోచితముగ దెలియుచు సాధన రీతుల్
అమనస్కపు మార్గమ్మున
విమలాత్మను బొంది జూడు వింతను సత్యా

యమనియమాది విధులను చక్కగా పాటిస్తూ,సాధనా రీతులను సరిగ్గా అనుసరిస్తూ, అమనస్క యోగాన్ని సాధించి,కల్మషం లేని ఆత్మను అనుభవంలో పొంది, అప్పుడు కనిపించే అసలైన వింతను చూడాలి.

9.
ఒడలంతయు బూదినలది 
మడిగట్టుక బూజ సేయు మనుజుని మదిలో .
దడవుచు వాసనలుండిన
అడుగున బురదల చెరువగు నతడిక సత్యా

ఒకడు ఒళ్లంతా బూడిద పూసుకుని మడి కట్టుకుని పూజలు చేసినా,అతని అంతరంగంలో వాసనలు ఉంటే ఆ పూజల ఫలితం సున్నాయే.అడుగున బురద ఉంచుకుని పైపైన మాత్రం మంచి నీరు కలిగిఉండే చెరువు మాదిరి ఈ వ్యవహారం ఉంటుంది.

10.
లోకాచారము లెల్లను
నాకటముగ మీరవలయు నీభువి యందున్
లోకుల మాటలు జూడగ
వాకిట దివ్వెలు కడమను జీకటి సత్యా 

సాధకులు లోకాన్ని ఎప్పుడూ లెక్క చెయ్యకూడదు.దానిని సునాయాసంగా అధిగమించాలి.కారణం ఏమంటే,వాకిటిలో మాత్రం దీపం ఉండి,ఇంటి లోపల అంతా చీకటి ఉన్నట్లుగా లోకుల మాటలు ఉంటాయి.అవి పైపై పూతలు. కనుక వాటిని లెక్కించ పనిలేదు.

11.
వదరుబోతులెల్ల నొకచోట గుమిగూడి 
శాస్త్ర చర్చయనుచు సాగదీయ 
ఎవనికైనగాని యనుభవమ్మది లేక
రచ్చ యగును గాని రక్తి నిడదు

అనుభవం లేని వాగుడుకాయలందరూ ఒకచోట చేరి శాస్త్రచర్చ చెయ్యబోతే అది చివరికి రచ్చ అవడమే గాని ఫలితం ఉండదు.ఏకాభిప్రాయమూ రాదు.

12.
తిండి కొరకు నేల దిరిగేటి జీవుండు
మూడునాళ్ళ కొరకు మోహమంది
తానె ఘనుడ నంచు తైతక్క లాడంగ
పంచభూత చయము పక్కుమనియె

ప్రపంచంలో ఎంతటి మానవుడైనా విర్రవీగవలసిన అవసరం ఏమాత్రమూ  లేదు.ఎందుకంటే,ప్రతి మనిషీ బతుకుతున్నది తిండికోసం మాత్రమే.తినితిని చివరికి చావడం తప్ప ఇక్కడ ఎవరైనా ఉద్దరిస్తున్నది ఏమీలేదు. ఒకవేళ ఎవడైనా అలా అహంకరిస్తే పంచభూతాలు వాడిని చూచి పక్కుమని నవ్వుతాయి.ఎందుకంటే,వాటి కళ్ళముందు ఇలాంటి అల్పులైన నరులు కోటానుకోట్లు గతించారు.అవి శాశ్వతములు.మానవులు కాదు.
read more " మానవుని అహంకారం-మరికొన్ని పద్యములు "

9, జులై 2013, మంగళవారం

హస్త సాముద్రికం-2

జ్యోతిష్యాది రహస్యవిద్యలలో బాగా ప్రావీణ్యం వస్తే ఒక విచిత్రం జరుగుతుంది. ఒక మనిషిని కొద్దిసేపు గమనిస్తే అతని మనస్తత్వమే గాక,ఆ మనిషి ఏమి చేస్తాడు? అతని నిజస్వరూపం ఏమిటి? అతను ఇంతకు ముందు ఏమేం నేరాలు గట్రా చేసాడు? అసలితన్ని నమ్మవచ్చా? ఒకవేళ నమ్మితే ఎంతవరకు నమ్మవచ్చు? మొదలైన విషయాలు కూడా వెంటనే తెలుస్తాయి. అయితే తెలిసిన ప్రతి విషయమూ వెంటనే బయటకు చెప్పడం కూడదు.అలా చెబితే గొడవలు జరుగుతాయి.కొన్ని సార్లు సంసారాలు విచ్చిన్నం అవుతాయి. జీవితాలే నాశనం అవుతాయి.అందుకే తెలిసినా తెలియనట్లు ఊరుకోవడం జరుగుతుంది.

నాకు ఎదురైన వ్యక్తుల హస్తరేఖలను చూచీ చూడనట్లుగా పరిశీలించడం నా అలవాటు.అదికూడా 'ఏదీ మీ చెయ్యి ఒకసారి చూపించండి' అని అడిగి చూడను.వారితో మాట్లాడే సమయంలో వారివారి హావభావ విన్యాసాలలో చేతులు అటూఇటూ తిప్పే సమయంలో ఆయారేఖలు ఇతరగుర్తులు కనిపిస్తాయి.దానినిబట్టి పైన ఉదహరించిన విషయాలన్నీ సునాయాసంగా  తెలిసిపోతాయి.లోలోపల నవ్వుకుని బయటకు మాత్రం  మామూలుగా ఊరుకుంటాను.

మామూలుగా అందరి చేతుల్లో కనిపించే రేఖలు కాకుండా కొందరి చేతులలో కొన్ని ప్రత్యెక గుర్తులు,రేఖలు ఉంటాయి.అలాంటివి ఎన్నాళ్ళైనా సరే అలా  గుర్తుండిపోతాయి.

ఉదాహరణగా అలాంటివి మూడు కేసులు చెబుతాను.

ఒకసారి ఒకాయన చేతిలో ఒక విచిత్రమైన రేఖను చూచాను.దాని ప్రకారం అతను మేకవన్నె పులి అనీ,పరమ స్వార్ధపరుడనీ,తన కుటుంబం అంటే కూడా ఏమాత్రం ప్రేమ లేనివాడనీ,ఏమాత్రం నమ్మదగిన వ్యక్తి కాదనీ వెంటనే గ్రహించాను.

ఆ తర్వాత విచారిస్తే,అతనికి సెకండ్ ఫామిలీ ఉందనీ,తనను అమితంగా ప్రేమించిన భార్యను మోసం చేసి ఇంకొక ఆమెను ఉంచుకున్నాడనీ,నోరు తెరిస్తే అబద్దాలు చెబుతాడనీ,తన స్వార్ధం కోసం ఎవరినైనా బలి చెయ్యడానికి వెనుకాడడనీ తెలిసింది.

ఈ సంఘటన జరిగి ఇరవై ఏళ్ళయింది.ఈ మధ్యనే జరిగిన ఇంకొక రెండు సంఘటనలు చెబుతాను.

ఒకామెతో కాజువల్ గా మాట్లాడే సమయంలో ఆమె చేతిలో ఒక విచిత్రమైన గుర్తు కనిపించింది.దానిప్రకారం ఆమెకు అనేకమందితో శారీరిక సంబంధాలు ఉండాలి.కాని ఆమెను చూస్తె చాలా పద్దతిగా సంసారపక్షంగా  కనిపించింది. చాలా మర్యాదగా మాట్లాడుతుంది కూడా.వాళ్ళ ఆయన కూడా సమాజంలో మంచి వ్యాపారస్తుడు.ఈమె చేతిలో ఈ గుర్తు ఉందేమిటా అని తెలిసిన వారిని విచారిస్తే,ఆమె ఒక హైక్లాస్ కాల్ గర్ల్ అనీ,పెద్దపెద్ద వాళ్ళతో మొబైల్ ద్వారా పరిచయాలు కలిగి ఉందనీ,మొబైల్ లోనే అప్పాయింట్మెంట్ తీసుకుని అక్కడకు వెళ్లి వస్తూ ఉంటుందనీ,మొగుడూ పిల్లలూ ఉన్నాకూడా ఈమెకు ఇదొక సరదా అనీ,కానీ వ్యక్తిగతంగా మంచివ్యక్తి అనీ,మిగిలిన అన్ని విషయాలలో చాలా పద్దతిగా ఉంటుందనీ తెలిసింది.

ఇంకొక వ్యక్తితో యదాలాపంగా మాట్లాడుతున్నపుడు అతని చేతిలో ఇంకొక  విచిత్రమైన గుర్తు కనిపించింది.దానిప్రకారం అతనొక క్రిమినల్ అయి ఉండాలి.నేరచరిత్ర కలిగినవాడై ఉండాలి.కాని ప్రస్తుతం అతను చాలా మర్యాదగా మాట్లాడుతూ ఉన్నాడు.సమాజంలో గౌరవప్రదమైన స్థానంలో కూడా ఉన్నాడు.ఇదేమిటో అర్ధం కాలేదు.తర్వాత విచారిస్తే,ఈ స్థాయికి రాకముందు కొన్ని సంవత్సరాల క్రితం అతను రెండు హత్యలు చేశాడనీ ఆ సంగతి సంఘంలో అందరికీ తెలుసనీ,కాని ఎవిడెన్స్ లేకుండా చేసి తప్పించుకున్నాడనీ,ప్రస్తుతం అతనున్న రాజకీయస్థాయిలో అతన్ని ఎవరూ ఏమీ చెయ్యలేరనీ అర్ధమైంది. 

ఇలాంటివి ఎన్నో కేసులు నేను గమనించాను.ప్రతిసారీ ఈ పరిశీలనవల్ల నాకు కొన్ని నిజాలు తెలిశాయి.సాముద్రికం ఎంత గొప్ప సైన్సో అర్ధమైంది.

మన వ్యక్తిత్వమూ,మన అలవాట్లూ మన చేతిలోని రేఖలలో గుర్తులలో ప్రతిబింబిస్తూ ఉంటాయి.సంఘానికి తెలియని మనలోని చీకటి కోణాలు కూడా వాటివల్ల స్పష్టంగా కనిపిస్తాయి.అంతేకాదు మన ఆరోగ్య స్థితీ,మన జీవితంలో జరగబోయే సంఘటనలూ కూడా చేతిలో ప్రతిఫలిస్తూ ఉంటాయి.ప్రతి మనిషీ తన జాతకాన్ని తన చేతిలోనే ఉంచుకుని తిరుగుతూ ఉంటాడు.

సాముద్రికశాస్త్రం ఒక అద్భుతమైన విద్య అని పై సంఘటనలను బట్టి నాకు గట్టి నమ్మకం ఏర్పడింది.అంతేకాదు,సరిగ్గా చదవగలిగితే హస్తరేఖలు మన బంధువుల,పిల్లల జాతకాలను కూడా ప్రతిబింబిస్తాయనీ,అంతేగాక మన భవిష్యత్తునూ,మన గతజన్మలను కూడా వాటివల్ల తెలుసుకోవచ్చనీ నాకు విశ్వాసం కలిగింది.
read more " హస్త సాముద్రికం-2 "

7, జులై 2013, ఆదివారం

ఆషాఢ శుక్ల పాడ్యమి - దేశజాతకం



ఆషాఢమాసంలో మన దేశ జాతకం ఎలా ఉందో చూద్దాం.

సోమవారం పునర్వసు నక్షత్రంలో వ్యాఘాతయోగంలో కింస్తుఘ్న కరణంలో చంద్రహోరలో ఆషాఢ మాసం మొదలైంది.

ఈ నెలలో కాలసర్పయోగం దేశాన్ని కాటేస్తున్నది.కనుక ఒక సంక్షోభాన్ని దేశం ఎదుర్కోబోతున్నది.

రాజకీయాలూ,పరిపాలనా తీవ్ర ఒడుదుడుకులకు లోనౌతాయి.అనేక రకాలైన ప్రభావాలకు లోనై అడ్మినిస్ట్రేషన్ గందరగోళం అవుతుంది.

ఆర్ధికరంగం అద్వాన్నంగా ఉంటుంది.షేర్ మార్కెట్లు మొదట్లో బాగున్నట్లు ఉంటాయి.మధ్యలో ఊగులాడుతూ ఉంటాయి.చివరకు మళ్ళీ నిలదొక్కు కుంటాయి.

ఎదుటివారు ఏమైపోతే నాకేమిటి అనుకుంటూ నాయకులూ ప్రజలూ ఎవరికివారు అబద్ధాలు చెబుతూ స్వలాభం కోసం సిగ్గులేకుండా ప్రయత్నిస్తారు.

నాయకుల మధ్య అభిప్రాయభేదాలు,విమర్శలు తీవ్రస్థాయికి చేరుతాయి.మాఫియా కార్యకలాపాలూ,నల్లధనపు లావాదేవీలూ బాగా జరుగుతాయి. 

ధర్మాధర్మాల భేదం తెలియకుండా,మంచీ చెడూ అన్న విచక్షణ లేకుండా ఎవరికి వారు స్వార్ధపరతతో ప్రవర్తిస్తారు.

జూలై 16,17,18 తేదీలలో ఆర్ధిక ఒడుదుడుకులు ఉంటాయి.ప్రజాజీవితం కల్లోలానికి గురవుతుంది.

28,29 తేదీలలో దేశం ఒక నష్టాన్ని ఎదుర్కొంటుంది.జూలై 14 నుంచి 28 వరకూ నవాంశలో మకరరాశిలో శనిగురుల సంయోగం వల్ల భారతదేశం చాలా చెడు పరిస్తితిని ఎదుర్కొంటుంది.

క్రమేణా పరిస్థితులు చక్కబడతాయి.ఎన్ని జరిగినా సర్దుకొనిపోయే మనస్తత్వం మన జనానికి అంతర్లీనంగా ఉండటంవల్ల చివరికి అంతా సర్దుకుని గాడిలో పడుతుంది.
read more " ఆషాఢ శుక్ల పాడ్యమి - దేశజాతకం "

4, జులై 2013, గురువారం

కాలజ్ఞానం-20

ప్రముఖులకేమో గండాలు 
పెద్దవారికే ప్రమాదాలు 
అందే పైలోక పిలుపులు 
ఒకటీ రెండు రోజుల్లో 

కర్మ ప్రభావం దురూహ్యం 
తప్పుకోవడం అసాధ్యం 
విర్రవీగితే ఫలితం శూన్యం 
లయమే కాలపు మలుపుల్లో
read more " కాలజ్ఞానం-20 "