10, ఏప్రిల్ 2026, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 57 (విశ్వాత్మ - దత్తాత్రేయుడి అవతారాలు)

'ఏం? పెద్దపెద్దవాళ్లకి పిచ్చి రాకూడదా? లేక పిచ్చోళ్ళు పెద్దవాళ్ళు కాకూడదా? నీ ఉద్దేశం ఏంటి?' అడిగాను.

'అలాకాదు చాలామంది వాళ్ళని నమ్ముతున్నారు కదా !' అన్నాడు

'ఒకప్పుడు ప్రపంచంలో చాలామంది భూమి బల్లపరుపుగా ఉందని నమ్మేవారు. ఈనాటికీ అలా నమ్మే సొసైటీలు కొన్ని ఉన్నాయి. మనం కూడా అదే నమ్మాలిగా నీ లాజిక్ ప్రకారం?' అన్నాను.

తనేమీ మాట్లాడలేదు.

'అందరూ నమ్ముతున్నారని నువ్వు నమ్ముతావా? లేక నీ బుద్ధితో నువ్వు ఆలోచించుకొని నమ్ముతావా? ప్రకృతి నీకు బుద్ధినిచ్చింది ఎందుకు?' అడిగాను.

'పుట్టపర్తిలో నాకొక డివైన్ ఎక్స్పీరియన్స్ కలిగింది. అందుకని నేను నమ్ముతున్నాను' అన్నాడు శ్రీనివాస్

నవ్వాను.

'అదేంటో నాకూ చెప్పు. విని తరిస్తాను. మనమనుకునే డివైన్ ఎక్స్పీరియెన్స్ లన్నీ చాలావరకూ మన భ్రమలే. మనకు కలిగే విజువల్, ఆడిటరీ, థాట్ లెవల్ ఇల్యూషన్స్ అన్నింటినీ డివైన్ ఎక్స్పీరియన్స్ లుగా అనుకోవడం మనలోని అహంకారానికి సూచన. "నాకంటే గొప్పవాడు ఇకలేడు. నాకు కాకపోతే ఇంకెవరికి ఇవి కలుగుతాయి? నేనొక అవతారపురుషుడిని" అనుకోవడమే ఒక పెద్ద మానసికరోగం' అన్నాను.

'విశ్వాత్మ గారు కూడా సత్యసాయిని నమ్మేవారు' అన్నాడు.

'దానికి నన్నేం చెయ్యమంటావు? చెప్పాగా, పెద్దపెద్దవాళ్ళకి పిచ్చి ఉండకూడదని రూలేమీ లేదని. విశ్వాత్మగారిని కొన్ని విషయాలలో నేను అభిమానిస్తాను. అంతమాత్రంచేత, ఆయన నమ్మేవన్నీ నేనెందుకు నమ్ముతాను?' అన్నాను.

'ఆయన తెలివిలేనివాడా?' అడిగాడు.

'అంతే ! కొన్నివిషయాలలో తెలివి ఉండవచ్చు. అన్నింటిలో ఉండాలని లేదు. అలా ఉండదు కూడా. ఉంటే, 1992 లో హైద్రాబాద్ మీటింగులో పళ్లెం కింద అంటించి ఉన్న బంగారుగొలుసును చేతులోకి తీసుకొని, దానిని తను సృష్టించినట్లు నటిస్తూ, టీవీ కెమెరాలకు బాబా దొరికిపోయిన విషయాన్ని విశ్వాత్మగారు ఎలా సమర్థిస్తారు?' అడిగాను.

మౌనం.

'పోనీ, 1993 లో పుట్టపర్తిలో జరిగిన విద్యార్థుల హత్యకేసును ఎలా సమర్థిస్తాడు? లేదా, బాబామీద ఉన్న హోమోసెక్స్ ఆరోపణలను ఎలా సమర్థిస్తాడు?' అడిగాను.

'అవేవీ రుజువు కాలేదుగా?' అన్నాడు.

'ఆధారాలన్నింటినీ మాయం చేస్తుంటే ఎలా అవుతాయి?' అన్నాను.

'అదేంటి?' అన్నాడు.

'అవును. రూంలో దాక్కుని ఉన్న నలుగురు స్టూడెంట్స్ నీ కాల్చి చంపకుండా, పట్టుకొని ఉంటే నిజాలు బయటకొచ్చేవి. వాళ్ళ రూంకి బయట తాళంపెట్టిన తర్వాతనే కదా భక్తులు పోలీసులను పిలిచారు? వాళ్ళను షూట్ చేయవలసిన పనేముంది? ఇది ఆధారాలను మాయం చేయడమే కదా. అతీతశక్తులున్న బాబా, మెట్లదారి గుండా పై రూంకి పారిపోయి దాక్కోవలసిన పనేముంది?' అన్నాను.

మౌనం.

'పిచ్చివాడా ! నీకింకా చాలా విషయాలు తెలీవు. నా ప్రశ్నకు నువ్వెలా జవాబు చెప్పాలో కూడా నేనే చెబుతా విను.  "కాలయవనుడు తరుముతుంటే కృష్ణుడు కూడా పారిపోయి ముచికుందుని గుహలో దూరాడు కదా? పారిపోవడం కూడా ఒక లీలే" అని నువ్వు సమర్ధించుకోవాలి. ఇది కూడా తెలీదా? ఎప్పుడు ఎదుగుతార్రా మీరు?' అన్నాను నవ్వుతూ.

వింటున్నాడు.

'అసలు విశ్వాత్మగారి పేరు విశ్వాత్మేనా?'  అన్నాను.

నేను ఏ సెన్స్ లో అన్నానో అతనికి అర్ధం  కాలేదు. నిజంగా "విశ్వాత్మ" అయితే ఇలా ఎలా బొక్కబోర్లా పడతాడనేది నా ప్రశ్న.

'కాదు. ఆయన పేరు విశ్వాత్మ దిగంబర అవధూత' అన్నాడు.

'మరి ఆయన బట్టలు కట్టుకునేవాడుగా? మాతో బుక్ ఎగ్జిబిషన్ కి కూడా వచ్చాడు' అడిగాను నవ్వుతూ.

'ఆయన గదిలో విప్పేసే ఉండేవాడు' అన్నాడు.

'ఓహో ! దిగంబర అవధూత అంటే, తన గదిలోనో, బెడ్రూంలోనో, బాత్రూంలోనో మాత్రమే విప్పుకునేవాడా? అలా అయితే, లోకంలో అందరూ దిగంబర అవధూతలేగా. అక్కడిదాకా ఎందుకు? 2008-10 మధ్యలో నేను గుంతకల్లు రైల్వేక్వార్టర్స్ లో ఒక్కడినే ఉన్నాను. ఇంట్లో ఉన్నపుడు నేనుకూడా దిగంబరంగానే తిరిగేవాడిని. ఆఫీసుకెళ్లేటప్పుడు మాత్రం బట్టలేసుకుని వెళ్ళేవాడిని. మరి నేనూ అదేగా?' అన్నాను.

మౌనం.

'ఆయనది ఏ సాంప్రదాయం?' అడిగాను.

'దత్తసాంప్రదాయమే అనుకుంటా. ఆయన కడపలో అవధూతదీక్ష తీసుకున్నారు' అన్నాడు.

ఈసారి ఇంకా పెద్దగా నవ్వొచ్చింది.

'అవధూత దీక్షలా? అవేమైనా అయ్యప్పదీక్షలా నెలకొకసారి వేసుకొని, ఇంకోనెలకు విప్పెయ్యడానికి? వాటినసలు ఇచ్చేవాళ్లున్నారా? అలా తీసుకుంటే అవధూతలు   అయిపోతారా?' అడిగాను.

తను పుస్తకాలు బాగా చదివాడు. కానీ అన్వయం దొరకడం లేదు. అయితే, నేను చెబుతున్నదానిని కనీసం అర్ధం చేసుకోగలుగుతున్నాడు.

'దత్తాత్రేయులకు ఒక సాంప్రదాయము. అవతారాలు ఉన్నాయా అసలు?' అడిగాను.

'ఎందుకు లేవు? మహారాష్ట్రలో ఆయన అవతారాలు చాలామంది ఉన్నారు. షిరిడీబాబా కూడా ఆ అవతారాలలో ఒకరే' అన్నాడు.

'ఇది నీ అనుభవమా? లేక బల్లపరుపు బ్యాచ్ ఎక్కించిన వైరసా?' అడిగాను.

'భరద్వాజ గారికి కూడా షిరిడీలో అనుభవం అయిన తర్వాతనే మారిపోయారు' అన్నాడు.

'చెప్పాగా, మన అనుభవాలన్నీ మన భ్రమలే అని' అన్నాను.

'మరి ఆయన అనుభవం అబద్దమా?' అడిగాడు.

'అని అనడానికి నేనెవర్ని? ఎవరి అనుభవం వారిదే. కానీ అది సత్యానుభవం కావాలని రూలేమీ లేదనే నేనంటున్నాను. ఆరోజున్న గ్రహస్తితులను బట్టి సెన్సిటివ్ మనుషులకు ఏవేవో అనిపిస్తాయి. వాటిని నువ్వు డివైన్ ఎక్స్పీరియన్స్ అని పేరు పెట్టుకుంటే నేనేం చేసేది? భరద్వాజగారి జాతకం చూడు. దానిలో బలమైన గురుదోషం ఉంది. అందుకే ఆయన సాంప్రదాయ వైష్ణవకుటుంబంలో పుట్టికూడా, ముస్లిం అయిన షిరిడీసాయి భక్తుడయ్యాడు. ఇది నా అవగాహన' అన్నాను.

'సాయిలిద్దరినీ అమ్మ కూడా ఒప్పుకున్నారు. "వాళ్ళూ నా పిల్లలే" అని అమ్మ అన్నారు' అన్నాడు.

'అమ్మ ఎవర్ని కాదన్నది? 'తల్లికి తప్పే కనిపించదు' అనిన మహాతల్లి ఆమె. అమ్మ పిల్లలు కానివారెవరు? నువ్వూ నేనూ కూడా అమ్మ పిల్లలమే. మరి నేను చెబుతున్నది నువ్వెందుకు ఒప్పుకోవడం లేదు?' అన్నాను.

'భరద్వాజగారు సివిల్స్ పాసయ్యారు. మహా తెలివైనవాడు' అన్నాడు.

'కావచ్చు. సివిల్స్ నేనూ పాసయ్యాను. ఒక తెలివైన వ్యక్తి, ఆర్నెల్లు కష్టపడితే సివిల్స్ క్లియర్ చేయడం పెద్ద కష్టమేమీ కాదు. స్వానుభవంతో నేనీమాట చెబుతున్నాను. ఆయన కూడా అదే ప్రూవ్ చేశాడు. నిజానికి వేదవ్యాస విసిరిన ఛాలెంజ్ ని స్వీకరించి ఆయన ఆ పనిని చేశాడుగాని, సివిల్స్ పాసవ్వాలని ఆయనకేమీ లేదు' అన్నాను.

మౌనం.

'అకాడెమిక్ తెలివికి, ఆధ్యాత్మికతెలివికీ సంబంధం లేదు. ముందే చెప్పాగదా, పెద్దవాళ్ళకి పిచ్చి ఉండకూడదని రూలేమీ లేదని. అందుకే, పెద్దపెద్ద బ్యూరోక్రాట్లు, మేధావులు, సయింటిష్టులు, దేశాధినేతలు కూడా చిన్న బూడిదట్రిక్కుకు పడిపోతూ ఉంటారు. అక్కడ వాళ్ళ తెలివేమైంది మరి?' అన్నాను.

'ఇంతకీ దత్తాత్రేయుడికి అవతారాలు లేవా?' అడిగాడు.

'ఖచ్చితంగా లేవు' అన్నాను.

'ఈ మాట ఎవరు చెప్పారు?' అన్నాడు.

'నేనే చెబుతున్నాను' అన్నాను.

'మీరు చెబితే ఎలా సరిపోతుంది?' అన్నాడు.

'మరి ఎవరు చెబితే సరిపోతుంది?' అడిగాను.

'ఉన్నాయని అందరూ అంటున్నారు' అన్నాడు.

'కధ మళ్ళీ మొదటికొచ్చింది' అన్నాను.

(ఇంకా ఉంది)