Spiritual ignorance is harder to break than ordinary ignorance

23, మార్చి 2016, బుధవారం

బ్రసెల్స్ దుర్ఘటన - పౌర్ణమి ప్రభావం

రాహు కేతువులు రాశులు మారినప్పుడు వ్రాస్తూ --

తీవ్రవాద చర్యలు పెరుగుతాయనీ దానివల్ల దేశాల మధ్యన యుద్ధ వాతావరణం వస్తుందనీ వ్రాశాను.అది అక్షరాలా నిజం అవుతూ ఉండటం ఇప్పుడు చూడవచ్చు.

అంతేగాక అమావాస్య పౌర్ణములకున్న ప్రభావాల గురించీ యాక్సిడెంట్లు ఇతర దుర్ఘటనలు కల్పించగల వాటి శక్తిని గురించీ ఇంతకు పూర్వం చాలాసార్లు ఉదాహరణలతో సహా వ్రాసి ఉన్నాను.

మనుషుల మీద ఉన్న గ్రహప్రభావానికి ఇప్పుడు జరిగిన బ్రసెల్స్ సంఘటన మళ్ళీ ఒక ఉదాహరణ.

ఈ సంఘటన ఖచ్చితంగా పౌర్ణమి ఘడియలలో జరిగింది.ఎప్పుడో ఒకసారి జరిగితే అది కాకతాళీయంలే అనుకోవచ్చు.కానీ మళ్ళీ మళ్ళీ అవే అవే సంఘటనలు అవే అవే సమయాలలో రిపీట్ అవుతుంటే దానర్ధం ఏమిటి? అందులో ఏదో మర్మం ఉన్నట్లేగా? మనకు అర్ధం కాని ప్రకృతి నియమాలు అక్కడ ఉన్నట్లే కదా?

నిన్నటి కుండలి గమనిస్తే --

బుధుడు నీచస్థితిలో అస్తంగతుడై ఉండి కుట్రలనూ కుతంత్రాలనూ సూచిస్తున్నాడు.శుక్రుడు కేతువుతో కలసి ముస్లింల రహస్య ఉగ్రవాదాన్ని సూచిస్తున్నాడు.శని కుజుల కలయిక దుర్ఘటనను స్పష్టంగా సూచిస్తున్నది.గురు చంద్ర రాహువుల కలయిక మతపరమైన ఉగ్రవాదానికి సూచికగా ఉన్నది.వెరసి బ్రసెల్స్ లో ఇస్లామిక్ స్టేట్ దుర్మార్గుల ఘాతుకం జరిగింది.

మీలో ఎవరైనా గమనించారో లేదో?

గత మూడు రోజులుగా ఎక్కడ చూచినా చిన్నా పెద్దా యాక్సిడెంట్లూ,దెబ్బలు తగలడమూ జరుగుతున్నాయి. చాలాచోట్ల ప్రమాదాలలో మరణాలూ సంభవిస్తున్నాయి. ఖచ్చితంగా ఈరోజున మనం పౌర్ణమి ప్రభావంలో ఉన్నాం.

కర్మ సత్యం.
జ్యోతిష్యం సత్యం.
మనుషుల మీద గ్రహప్రభావం సత్యం.
ప్రకృతి ముందు మనిషి అల్పత్వం సత్యం.
సృష్టిని మనిషి నాశనం చేసుకోవడం సత్యం.
దురాశతో తన మూలాన్ని తనే నరుక్కోవడం సత్యం.
సమాజాన్ని చేతులారా పాడుచేసుకోవడం సత్యం.
చివరికి అంతా సర్వనాశనం కావడం సత్యం.

మనుషుల మీద గ్రహాల ప్రభావం ఖచ్చితంగా ఉంటుందనదానికి ఇంకా రుజువులు కావాలా?