“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, డిసెంబర్ 2014, మంగళవారం

పుస్తకావిష్కరణ సభ జయప్రదంగా ముగిసింది- ఒక నూతనాధ్యాయం మొదలైంది

28.12.2014 న తలపెట్టిన 'శ్రీవిద్యా రహస్యం' పుస్తకావిష్కరణ సభ దిగ్విజయంగా ముగిసింది.

జగన్మాత అనుగ్రహంతో వెలుగుచూచిన ఈ పుస్తకం అమ్మ(దుర్గమ్మ) పాదాల చెంత,కృష్ణాతీరంలో విజయవాడలో ఆవిష్కరింప బడటం చాలా సంతోషాన్ని ఇచ్చింది.

ఉదయం 10.30 ప్రాంతంలో మొదలైన సభ దాదాపు మధ్యాన్నం 1.30 ప్రాంతంలో వందన సమర్పణతో ముగిసింది.

దాదాపుగా 60 మంది ఈ సభకు వచ్చారు.వారిలో విజయవాడ వాస్తవ్యులే గాక,హైదరాబాద్,అనంతపూర్,బెంగుళూరు,ఒంగోలు,తిరుపతి,విజయనగరం,విశాఖపట్నం మొదలైన దూరప్రాంతాల నుంచి వచ్చినవారు కూడా ఉన్నారు.అమెరికా నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారు.

ఆహూతులందరూ దాదాపు 3 గంటలపాటు కదలకుండా నిశ్శబ్దంగా ఉండి కార్యక్రమాన్ని ఆసాంతమూ ఆస్వాదించారు.

మహాలక్ష్మీ పబ్లికేషన్స్ విశ్వమోహన్ గారి మాటల్లో చెప్పాలంటే -' ఇంత క్రమశిక్షణతో జరిగిన పుస్తకావిష్కరణ సభను నేను ఇంతవరకూ చూడలేదు.ఎన్నో ఫంక్షన్స్ నేను చూచాను.పుస్తకావిష్కరణ అయిపోవటం తోనే అందరూ లేచి వెళ్ళిపోతారు.కానీ మీ ఫంక్షన్ లో మాత్రం పుస్తకావిష్కరణ తర్వాత కూడా ఇంకొక రెండుగంటల పాటు అంత శ్రద్ధగా కూచుని మీ ఉపన్యాసం విన్నారంటే  చాలా వింతగా ఉన్నది.మిగిలిన ఫంక్షన్స్ లో వాలంటీర్స్ ను పెట్టి చెప్పిస్తాము మొబైల్స్ ఆఫ్ చెయ్యండి.మౌనంగా ఉండండి.అని.కానీ ఈ కార్యక్రయంలో ఎవరికీ ఏమీ చెప్పవలసిన పని లేకపోయింది.ఎవరికి వారే ఎంతో సెల్ఫ్ డిసిప్లిండ్ గా ఉన్నారు." అని ఆయన అన్నారు.

'వీళ్ళు మామూలు ఆడియన్స్ కారు.ఈ సబ్జెక్ట్ మీద ఎంతో శ్రద్దతో,ఆధ్యాత్మికత అంటే తపనతో,అమ్మ మీద నమ్మకంతో వచ్చినవారు.అందుకే వారు అంత ఓపికగా అన్ని గంటలు కూర్చున్నారు.అంత డిసిప్లిన్ గా ఉన్నారు.' అని నేను చెప్పాను.

నేను దాదాపు ఒక గంటన్నర పైనే మాట్లాడాను.నా ఉపన్యాసంలో 'శ్రీవిద్యోపాసన' గురించీ ఈ పుస్తకం ఎలా ఉద్భవించింది అన్న విషయం గురించీ వివరంగా మాట్లాడాను.

శ్రోతలను నా ఉపన్యాసం రంజంపచేయగలిగింది అనే నేను అనుకుంటున్నాను.

ఫంక్షన్ అయిపోయిన తర్వాత,వచ్చిన వారందరూ నన్ను కలిసి మాట్లాడారు. వేదాంతం గురించి,తంత్రసాధన గురించి అడిగిన వారు కొందరైతే,జ్యోతిష్యం గురించి,ఈతిబాధల గురించి,రోగబాధల గురించి అడిగినవారు కొందరు.ఎవరికి కావలసిన పరిష్కారం వారికి చూపబడింది.అక్కడ మాట్లాడలేని వ్యక్తిగత విషయాలు మాట్లాడాలి అనుకున్న వారికి నా ఫోన్ నంబర్ ఇవ్వడం జరిగింది.

కార్యక్రమంలో పాల్గోన్నవారివి చాలామందివి అడ్రసులూ ఫోన్ నంబర్లూ సేకరించడం జరిగింది.కానీ ఇంకా కొందరి వివరాలు దొరకలేదు.కనుక వారందరికీ నా అభ్యర్ధన ఏమంటే,పుస్తకం మీద నా ఫోన్ నంబర్ ఉన్నది,ఇక్కడ కూడా ఇస్తున్నాను గనుక,ఈ పుస్తకం మీద మీమీ అభిప్రాయాలనూ సూచనలనూ,అలాగే ఈ ఫంక్షన్ ఎలా జరిగింది అన్నదానిమీద మీమీ అభిప్రాయాలనూ,ఇంకా మీమీ వ్యక్తిగత సమస్యలనూ,మీరు అడగాలనుకుని అడగలేక పోయిన విషయాలనూ,తరువాత మీకు గుర్తొచ్చిన విషయాలనూ, నాకు ఫోన్ ద్వారా తెలియజెయ్యండి.

నేనేదో బిజీగా ఉంటానని,మీరు ఫోన్ చేసి నన్ను డిస్టర్బ్ చేస్తున్నామనీ అనుకోకండి.సిన్సియర్ గా మీరు అడిగితే మీమీ సందేహాలను తీర్చడానికి (అది అర్ధరాత్రి అయినా,అపరాత్రి అయినా సరే) నేను ఎప్పుడూ సిద్ధంగానే ఉంటానన్న విషయం గమనించండి.

ఇంకొక్క ముఖ్య విషయం:--

ఈ కార్యక్రమంలో పాల్గొని 'శ్రీవిద్య' మీద నా ఉపన్యాసాన్ని విన్న చాలామంది దీక్ష ఇవ్వమనీ వారికి మార్గనిర్దేశనం చెయ్యమనీ వారిని ఆధ్యాత్మిక పధంలో ప్రాక్టికల్ గా నడిపించమనీ అడిగారు.

ఈ అభ్యర్ధనకు మనస్ఫూర్తిగా అంగీకరిస్తున్నాను.

నావద్ద దీక్ష తీసుకోవాలని అనుకునేవారు ఎటువంటి సంకోచాలూ పెట్టుకోకుండా నన్ను సంప్రదించండి.ఎవరెవరి కోరికలను బట్టి,సంస్కారాలను బట్టి,అంతరిక శక్తిని బట్టి,అర్హతను బట్టి వారివారికి దీక్ష ఇవ్వబడుతుంది.నా వద్ద దీక్షాస్వీకారం చేసిన,చెయ్యబోతున్న గ్రూపు సభ్యులతో కలసి అతిత్వరలో 'సాధనా సమ్మేళనాలు' జరుపబడతాయి.

ఆ సమ్మేళనాలలో -- శుద్దమైన నిజమైన ఆధ్యాత్మిక సాధనను వారిచేత దగ్గరుండి చేయించడం, వారి సందేహాలను తీర్చడం,వారిని సత్యమైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా ముందుకు నడిపించడం జరుగుతుంది.దీనికి కులంతోనూ మతంతోనూ వయస్సుతోనూ ప్రాంతంతోనూ సంబంధం లేదు.

హృదయపూర్వకమైన 'తపన' ఒక్కటే నిజమైన అర్హత.

ఇన్నాళ్ళూ విషయాలను స్థూలంగా వివరించడం మాత్రమే జరిగింది. ఇకనుంచి వాటిని ప్రాక్టికల్ గా ఎట్లా అనుభవంలోకి తెచ్చుకోవాలి?అంతరిక యోగసాధన ఎలా చెయ్యాలి?జీవితాన్ని ఎలా సఫలం చేసుకోవాలి? అనే విషయాన్ని ప్రాక్టికల్ గా నేర్పించడం జరుగుతుంది.

అంతేగాక,జ్యోతిష్యవిద్యార్ధులకు ఆసక్తి ఉన్నవారికి Astrology workshops నిర్వహించి రెండు దశాబ్దాల సాధనా ఫలితంగా నేను తయారు చేసుకున్న నా ప్రత్యేక జ్యోతిష్య విశ్లేషణా విధానాన్ని నేర్పించడం కూడా ముందు ముందు జరుగుతుంది.

నా ఫోన్ నంబర్ - 9700076750.

ఇది పుస్తకం మీద కూడా ఉన్నది.సాధనా మార్గంలో నా మార్గనిర్దేశనం కావలసినవారు,శ్రద్ధ ఉన్నవారు సంప్రదించవచ్చు.

ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎన్నెన్నో పనులను మానుకొని దూరాభారాన్ని లెక్కచెయ్యకుండా వచ్చి దీనిని జయప్రదం చేసిన అందరికీ మళ్ళీ ఈ బ్లాగుముఖంగా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మీరు చూపించిన గౌరవానికీ మీ అభిమానానికీ నా ప్రతిస్పందనను నేను మాటలలో చెప్పలేను.

నాతో వ్యక్తిగత పరిచయాన్ని పెంచుకోవాలనీ,నిజమైన ఆధ్యాత్మిక రహస్యాలను గ్రహించాలనీ,ఆ మార్గంలో ముందుకు నడవాలనీ అనుకునేవారిని "పంచవటి గ్రూపు" లోకి రమ్మని ఆహ్వానిస్తున్నాను. 

కావలసినవారు నాకు 'ఈ మెయిల్' చేస్తే వారికి గ్రూప్ యాక్సెస్ ఇస్తాను.

మరొక్క విషయం:--

కార్యక్రమానికి వచ్చిన వారందరికీ భోజనం ఏర్పాటు చెయ్యాలన్న మా కోరిక పూర్తిగా తీరలేదు.దానికి కారణం ఆ ఫంక్షన్ హాలు వారు అక్కడ భోజనాలు చెయ్యడానికి అనుమతించకపోవడమే.కనుక దూరంగా ఉన్న శ్రీ మైథిలీ రాం గారి ఇంటిలో భోజన కార్యక్రమాన్ని పెట్టుకోవడం జరిగింది.దూరం గనుక అక్కడకు రాలేక పోయినవారిని, మమ్మల్ని మన్నించమని  ఈ సందర్భంగా కోరుతున్నాను.

ముందు ముందు రాబోయే మరిన్ని పుస్తకావిష్కరణ సభలలో ఈ లోపాన్ని దిద్దుకునే ప్రయత్నం జరుగుతుంది.

ధన్యవాదాలతో,

మీ 

సత్యనారాయణ శర్మ