6, జనవరి 2021, బుధవారం

మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (తిరుగుప్రయాణం - రామతీర్ధం కబుర్లు)

జనవరి ఒకటో తేదీ పొద్దున్నే లేచి తిరుగు ప్రయాణం మొదలుపెట్టాము. ఉదయం ఎనిమిదికిన్నరకి గోండియాలో బయల్దేరి పదిన్నరకు నాగపూర్ చేరుకున్నాం. అక్కడ ఇంకో రైలు మారి అందులో సెటిలయ్యాక, సహచరులలో ఒకాయన చాలా ఆవేశపడుతూ మాటలు మొదలు పెట్టాడు.

'సార్ !  న్యూస్ చూచారా? రామతీర్థంలో రాముని విగ్రహం ధ్వంసం చేశారట. విగ్రహం తల దగ్గర్లోనే ఉన్న చెరువులో దొరికిందట' అన్నాడు.

గతంలో నేను విజయనగరం వెళ్ళినపుడు రామతీర్ధం ఆలయాన్ని దర్శించాను. అందుకని ఆ ఆలయం నాకు గుర్తుంది.

'ఎప్పుడు జరిగింది/?' అడిగాను.

'మూడ్రోజులైంది'

'గురువు నీచస్థితిలో ఉన్నపుడు ఇలాంటివి జరగక ఇంకేం జరుగుతాయి? మతపరమైన గొడవలు, సంఘటనలు జరుగుతాయని ముందే అనుకున్నాం కదా. జరుగుతున్నాయి' అన్నాను.

'దారుణం సార్ ! ఎవరూ మాట్లాడటం లేదు' అని బాధపడ్డాడు.

'ఎవరూ అంటే?' అడిగాను.

'అంటే, నాయకులు గాని, స్వామీజీలు గాని' అన్నాడు.

'మాట్లాడరు. అదంతే. అందరికీ కావలసింది డబ్బు అధికారం మాత్రమే. దేవుడు ఎవరికీ అక్కర్లేదని నేనెప్పటినుంచో చెబుతున్నాను. దేవుడనేది మనిషి ఆడుతున్న ఒక నాటకం. అవసరం మేరకు వాడిని వాడుకుంటారు. తర్వాత అంతే, వదిలేస్తారు. అవసరమే అసలైన దేవుడని మహనీయులు ఎప్పుడో చెప్పారు. గురువు ప్రస్తుతం నీచస్థితిలో ఉన్నాడు. గురువులూ అంతే ఉన్నారు. ఇంకేం జరుగుతుంది ఇంతకన్నా?' అన్నాను.

'మరీ ఇంత ఘోరమా?' అంటూ చాలాసేపు వాపోతూ వచ్చాడు సహచరుడు.

'చూడు నాయన. ఆంధ్రా తెలంగాణాలు విడిపోయినప్పుడే చెప్పా, ఆంధ్రా పని అయిపోయిందని. అప్పుడే ఏమైంది? ఇంకొక్క ఐదేళ్లు ఆగు. ఆంధ్రా పరిస్థితి  ఎలా ఉంటుందో చూద్దువుగాని. రాముడంటే ధర్మానికి ప్రతిరూపం. ధర్మదేవత.  అలాంటి రాముడి విగ్రహం ధ్వంసం అయిందంటే ఆ రాష్ట్రానికి అది మంచికి కాదు. ఆంధ్రా పాడైపోతుంది. దానికే ఇవి సూచనలు' అన్నాను.

'ఏ విధంగా నాశనం అవుతుంది?' అడిగాడు.

'ఏముంది? కరోనా లాంటి వైరస్ చాలదా? భూమ్మీద ఉన్న కోటానుకోట్ల వైరస్ లలో కరోనా చాలా చిన్నది. నిజం చెప్పాలంటే, వైరస్ ల మధ్యన మనం బ్రతుకుతున్నాం. అవి మన  బయటా ఉన్నాయి. మన లోపలా ఉన్నాయి. అంతటా ఉన్నాయి. అందులో ఒకటి కళ్ళు తెరిచిందంటే చాలు. లక్షలలో జనం రాలిపోతారు. అహంకారం, మదం తలకెక్కితే అదే జరుగుతుంది. అన్నీ తన చేతుల్లో ఉన్నాయని మనిషి అనుకుంటాడు. కానీ అది నిజంకాదు. జస్ట్ వెయిట్ అండ్ సీ' అన్నాను.

'కానీ ధర్మరక్షకులైన గురువులు స్వామీజీలు కిమ్మనకుండా ఉండటం బాధగా ఉంది' అన్నాడు.

నవ్వాను.

'వాళ్ళెక్కడున్నారసలు? ఈ స్వామీజీలందరూ ఏదో ఒక నాయకుడికి ఏజంట్లు. లేదా బాగా డబ్బున్న వ్యాపారస్తుల ఏజంట్లు. నాయకుల వ్యాపారాలు నాయకులవి. స్వాముల వ్యాపారాలు స్వాములవి. దేవుడెలా పోతే వారికెందుకు? వాళ్ళ పైరవీలు వాళ్ళు చేసుకుంటూ తిరుగుతూ ఉంటారు, వాళ్ళు ధర్మరక్షకులని అనుకోవడం మన భ్రమ' అన్నాను.

'అంతేనా? మనమేం చేయలేమా?' ఆక్రోశించాడు.

'ముందు నీ కులాన్ని దాటి ఆలోచించు. నీది ఫలానా కులం కదా. ఆ కులపు నాయకుడి పార్టీ అంటే నీకిష్టం. వాడు చేసేది మంచైనా చెడైనా నీనకవసరం. మనోడైతే చాలు నీకు. ఇదే ఆంధ్రాకు పట్టిన దరిద్రం. కులం, డబ్బు, అవినీతి, ఏదో రకంగా అధికారంలో ఉండాలి - ఈ నాలుగే ఆంధ్రా సర్వనాశనం కావడానికి కారణాలు. హిందువులలో ఐకమత్యం మొదట్నుంచీ లేదు. ఉంటే, వెయ్యేళ్లపాటు ప్రపంచంలోని ప్రతిజాతీ వచ్చి మనల్నెలా దోచుకుంటారు? మనలోనే కొంతమంది దొంగలున్నారు. స్వలాభం కోసం మన గుట్లు బయటివాళ్లకు చెప్పిన ద్రోహులు మనలోనే ఉన్నారు. నేడు వాళ్ళ సంఖ్య బాగా ఎక్కువైంది. వాళ్లకు స్వలాభమే ముఖ్యం. దేశం ఏమైపోయినా వారికనవసరం.  ఈలోపల విదేశీమతాలైన క్రైస్తవం, ఇస్లాంల జాతరొకటి. మన సమాజంలోని లొసుగులను వాడుకుని వాళ్ళ పబ్బం వాళ్ళు గడుపుకుంటున్నారు.  మనవాళ్లకు ధర్మనిష్ఠ చాలాచాలా తక్కువ. డబ్బుకు తేలికగా అమ్ముడుపోతారు. మతం మారుతారు. దీనిని అడ్డుకోవాల్సిన స్వామీజీలు చేతగానివాళ్ళయ్యారు. పంచాయితీలు, పైరవీలు చేసుకుంటూ కాలం గడుపుతున్నారు. కలియుగమంటే ఇదే. ముందుముందు ఇది ఇంకా ఘోరం అవుతుంది. ముందుముందు కొన్నికొన్ని రాష్ట్రాలకు రాష్ట్రాలే మతాలు మారిపోతాయి, సెవన్ సిస్టర్స్ లాగా. అపుడు సివిల్ వార్ తప్పదు. ఈ సంగతి నేను చెప్పడం లేదు. మేధావులకందరికీ ఈ విషయం తెలుసు. 32 ఏళ్ళక్రితం ఒక ఐఏఎస్ మేధావి నాతో ఈ మాటన్నాడు' అన్నాను.

'మనమేం చేయలేమా?' మళ్ళీ అడిగాడు.

'చెయ్యగలం. నేనిలా బెర్తుమీద పడుకునే ఉంటాను. నువ్వు మాత్రం రైల్లోంచి దూకు. ప్రస్తుతానికి మనం చెయ్యగలిగిన పని ఇదే' అన్నాను నవ్వుతూ.

'ఈ టైం లో  కూడా మీ జోకులేంటి సార్ ?' అన్నాడు

'మరేం చేయమంటావ్ చెప్పు? ప్రజలూ, నాయకులూ, స్వామీజీలూ అందరూ దొంగలైతే మనమేం చేయగలం చెప్పు' అన్నాను.

'ఏదో ఒకటిచెయ్యాలి కదా?'  వదిలేటట్టు లేడు.

వదలకుండా రెట్టిస్తుంటే నాకు మండింది.

'ఏంటి చేసేది? అది లా అండ్ ఆర్డర్ సమస్య. పట్టుకోడానికి పోలీసులున్నారు. వారిపైన అధికారులున్నారు. ప్రజలెన్నుకున్న నాయకులున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. రాజ్యాంగం ఉంది. సెంటర్లో 'జై శ్రీరామ్' అనే ప్రభుత్వం ఉంది. వాళ్ళెవరూ మాట్లాడకపోతే చైతన్యం లేని స్వార్ధపరుడైన సామాన్యుడు ఏం చెయ్యగలడు చెప్పు' అడిగాను.

'ఏంటో ఏమీ అర్ధం కావడంలేదు. నేనూ ఇవాళే చూచాను న్యూస్. మూడ్రోజులనుంచీ  మన తిరుగుడులో పడి ఏం జరుగుతోందో తెలీడం లేదు' అని వాపోయాడు.

'నువ్వు చాలా నయం. నేను చూడు. పేపర్ చదవను. టీవీ చూడను. మొబైల్ న్యూస్ చూడను. ప్రపంచం ఏమైపోయినా పట్టించుకోను. ఇప్పుడు కూడా నువ్వు చెబితేనే కదా నాకు తెలిసింది? ఒక విషయం చెబుతా విను. ముందు తెలిసినా, వెనుక తెలిసినా నువ్వేమీ చెయ్యలేవు. కాలం ఒక్కటే దీనిని పరిష్కారం చేయగలుగుతుంది. సమాజం అంతలా కుళ్లిపోయింది. అధర్మం పెరిగినప్పుడు ప్రజలైనా పాలకులైనా వేటు పడుతుంది.

హిందువులు విగ్రహారాధకులని అందరూ అనుకుంటారు. అది తప్పు. దైవం  విగ్రహానికి పరిమితం కాడని వారికి బాగా తెలుసు. దైవం సర్వాంతర్యామి అని కూడా వారికి తెలుసు. అంతటా ఉన్న దేవుడినే విగ్రహంలో చూస్తారు. విగ్రహమనేది ఒక ఆధారం. అంతేగాని, అదే దేవుడు కాదని వారికి తెలుసు. విగ్రహాలను ధ్వంసం చెయ్యడం ద్వారా వారిని కొంత కలత పెట్టవచ్చు. కానీ హిందూమతాన్ని గాని, ధర్మాన్ని గాని నాశనం చెయ్యడం సాధ్యం కాదు. క్రైస్తవం, ఇస్లామ్ నిన్నగాక మొన్న పుట్టిన పిల్లమతాలు. మనం పోన్లే అని రానిస్తే ఇప్పుడవి పాలుత్రాగిన రొమ్మునే గుద్దుతున్నాయి. ఇలాంటి పనులవల్ల హిందూమతానికి ఎలాంటి హానీ జరుగదు. హిందూమతాన్ని లేకుండా చేస్తామని బీరాలు పలికిన ఔరంగజేబులాంటివాళ్లే ఈ మట్టిలో కలసిపోయారు. ఇది సనాతనధర్మం. దీనికేమీ కాదు. కంగారుపడకు.

కాకుంటే ఒకటి. ఇంకొక నూరేళ్లు బీజేపీ ప్రభుత్వమే ఈ దేశాన్ని పాలించాలి. అప్పుడే ఈ దేశం బాగుపడుతుంది. ఇంకోమాట విను. ఆంధ్రాలో కూడా బీజేపీ ప్రభుత్వం వచ్చినపుడు మాత్రమే ఇలాంటి దౌర్జన్యాలు మోసాలు అంతమౌతాయి. అంతవరకూ న్యూస్ చూసుకుంటూ ఉండటం తప్ప నువ్వేమీ చెయ్యలేవు. ఎక్కువ ఆవేశపడకు. నన్ను విసిగించకు. భోజనం వస్తే లేపు. అప్పుడు లేస్తాను' అని చెప్పి నిద్రకుపక్రమించాను.

సహచరుడు మొబైల్లో తలదూర్చాడు.

కం || మనుజుడు ధర్మము మరచిన 

కనివిని ఎరుగంగనట్టి కష్టము లెదురౌ

ఘనకలి ముదురుట ఇదియే

వినబోవరు మూర్ఖులెపుడు విజ్ఞుల మాటల్ !


కం || ధర్మము వీడిన లోకము

కర్మలలో జిక్కుకొనుచు కళదప్పునుగా 

మర్మముగా జేయు దొసగు

ఖర్మై వెంటాడు విధము గాంచర సత్యా !

అనిన పద్యములు ఆశువుగా నా నోటివెంట పలికాయి.

రైలు పోతూ ఉంది. మాకు వేరే పనేముంటుంది? ఆ రోజంతా అలాంటి చర్చలలోను, వేళకు తిని  పడుకోవడంలోను గడిచింది. రాత్రి తొమ్మిదికి సికింద్రాబాద్ స్టేషన్ వచ్చింది. దిగి ఎవరిళ్ళకు వాళ్ళం చేరుకున్నాం.

జై శ్రీరామ్ !

(అయిపోయింది)

read more " మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (తిరుగుప్రయాణం - రామతీర్ధం కబుర్లు) "

5, జనవరి 2021, మంగళవారం

మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (గోండియా నుంచి ఇంకా అడవులలోకి)







దుర్గ్, భిలాయ్ కలిసే ఉంటాయి. ఒకవైపు దుర్గ్ సిటీ. ఇంకొక వైపు భిలాయ్ కాలనీ. భిలాయ్ బాగా విశాలంగా విసేసినట్లుగా ఉన్న ఇళ్ళతో ప్లాన్డ్ గా కట్టబడి ఉండి. ఎక్కువగా స్టాఫ్ క్వార్టర్స్ లాంటి ఇళ్ళు కనిపించాయి. ఒకరకమైన స్లీపింగ్ సిటీ లా ఉంది.

దుర్గ్ చుట్టూ ఉన్న రిసామా, మరోదా, బలోద్ మొదలైన ఊర్లు చూసుకుంటూ ఒక రోజంతా తిరిగి రాత్రికి హోటల్ ఖాళీ చేసి, రైలెక్కి రెండు గంటల ప్రయాణం తర్వాత గోండియా లో దిగాను. రాత్రికి గొండియా గెస్ట్ హౌస్ లో బస. అది స్టేషన్ ఎదురుగానే ఉంటుంది. కుక్ ఉన్నాడు. వేళకు భోజనం గట్రా అతనే చూసుకుంటాడు.

దుర్గ్ లో కంటే గొండియాలో చలి ఇంకా ఎక్కువగా ఉంది. మధ్యాన్నం ఒంటిగంటకి కూడా లైట్ స్వెటర్స్ వేసుకుని ఎండలో తిరుగుతున్నారు జనం. ఉదయం పది వరకూ ఎండ లేదు. సాయంత్రం నాలుగుకి చీకటి పడుతున్నట్లుగా అయిపోతున్నది. రాత్రికి చలి బాగా ఎక్కువవుతున్నది.

గోండియాకు రైస్ సిటీ అని పేరుంది. ఇక్కడ వరి బాగా పండుతుంది. ఇక్కడి రైల్వే స్టేషన్ చాలా పాతది. 1888 లో ఇది కట్టబడింది. పాతకాలంలో ఇక్కడ గోండులనే ఆదివాసీలు ఉండేవారు. వారిపేరుమీదనే ఈ ఊరు గోండియా అయింది. 

సహచరులు ఉన్న రూంలో హీటర్ పనిచేయడం లేదు. ఐసు నీళ్లలా ఉన్న నీళ్ళతో గజగజా వణుకుతూ స్నానం చేశామని చెప్పారు. కానీ ఎవరికీ జలుబు చేయలేదు. దానికి కారణం అక్కడి తిండి. ఆవనూనె ప్రభావం. ఒకవేళ తప్పక చేయవలసి వస్తే, చన్నీళ్ళతో హాయిగా ఎలా స్నానం చేయాలో ఆ టెక్నిక్ ని వాళ్ళకు వివరించాను.

యోగసాధనలో మంచి ప్రావీణ్యం ఉంటే, కావలసినంత వేడిని శరీరంలో పుట్టించుకోగలుగుతాము. దానికి ఎన్నో కిటుకులు యోగశాస్త్రంలో ఉన్నాయి. అయితే, వాటికి సాధన అవసరం అవుతుంది. ఒక్కరోజులో అవి సిద్ధించవు. యోగసాధన అలవాటు లేని మామూలు మనుషులు ఏం చేయాలి? ఆ టెక్నిక్స్ వాళ్ళకు చెప్పాను.

నార్త్ ఇండియాలో ఉన్న పాతకాలపు సిటీలు నాకు బాగా నచ్చుతాయి. అక్కడున్న సందుగొందులలో గమ్యం లేకుండా నిదానంగా అలా నడుస్తూ పోతుంటే చాలా బాగుంటుంది. దారిలో కనిపించిన చాయ్ అంగడిలో చాయ్ త్రాగడం, లోకల్స్ మాట్లాడుకునే మాటలు వింటూ ఉండటం బాగుంటుంది. ఒక పనంటూ లేకుండా, vacant mind తో aimless గా తిరగడంలో భలే మజా ఉంటుంది.

మర్నాడు పొద్దున్నే బయలుదేరి తుంసార్, గోబర్ వాహి, డోంగ్రీబుజుర్గ్, తిరోడి ఊర్లలో తిరిగివచ్చాము. దీనికి రెండురోజులు పట్టింది. ఈ ఊర్లన్నీ దట్టమైన అడవులలో ఉన్నాయి. డోంగ్రీబుజుర్గ్ అనేది సరిగ్గా భండారా అడవి మధ్యలో ఉంది. ఇది మహారాష్ట్రలో ఉన్నప్పటికీ, ఛత్తీస్ ఘడ్, మధ్యప్రదేశ్ సరిహద్దులలో ఉంటుంది. ఇక్కడ MOIL factory ఉంది. ఈ ప్రాంతమంతా మేంగనీస్ ఖనిజం ఎక్కువ. తెల్లని సుద్దలాగా ఉంటుంది. ఇక్కడి నీళ్ళలో కూడా అది ఎక్కువే. కనుకనే ఇక్కడి మనుషులు కూడా అదోలా ఉంటారు. మన అలవాట్లు, రూపురేఖలు, ఆరోగ్యాలు చాలావరకు మనం ఉంటున్న నేలను బట్టి, దానిలో ఉండే పదార్ధాలను బట్టి, మనం త్రాగే నీళ్ళను బట్టి ఉంటాయి.




ఆ అడవి మధ్యలో తపోస్థల్ అనే ఒక కుటీరాన్ని చూచాను. ఎటుచూచినా ఇరవై కి. మీ ఉన్న అడవి మధ్యలో అది ఉంది. అక్కడే ఒక అతిధిగృహం కూడా ఉంది. అంత కీకారణ్యంలో అక్కడ ఎవరుంటారో తెలీలేదు. మనుషులెవరూ కనిపించలేదు. అప్పటికే చీకటి పడిపోవడంతో ఆగడానికి కుదరలేదు.

తిరోది నుంచి మేం వెనక్కు బయలుదేరేసరికి సాయంత్రం ఆరయింది. అడవి కావడంతో అప్పటికే చీకటిపడిపోయి రాత్రి తొమ్మిదో పదో అయినట్లు ఫీలింగ్ వస్తోంది. మా డ్రైవర్ పేరు అభయ్. చిన్న కుర్రాడే కానీ ఆ దారులన్నీ బాగా తెలుసు. ఆ అడవిలో మెలికలు మెలికలున్న దారులలో డ్రైవింగ్ చేసుకుంటూ మూడు గంటలు ఇన్నోవాను తోలి రాత్రి తొమ్మిదికి గొండియా చేర్చాడు. ఎక్కడన్నా కారు బ్రేక్ డౌన్ అయి ఉంటే తెల్లవార్లూ ఆ దట్టమైన అడవిలో భజన చేస్తూ ఉండవలసి వచ్చేది. దురదృష్టవశాత్తూ అలాంటిదేమీ జరగలేదు. రాత్రికి అక్కడే ఉందామంటే సహచరులు ఒప్పుకోరు. అలా జరిగి ఉంటే బాగుండేదని ఎంత కోరుకున్నానో ! కానీ వాళ్ళ అదృష్టాలు బాగున్నాయి. కారు ఎక్కడా ఆగలేదు !

దారిలో అతన్ని ఇలా అడిగాను.

'అభయ్ ! ఇస్ జంగల్ మే క్యా క్యా జాన్వర్ హై?'

అతనిలా అన్నాడు.

'సబ్ హై సర్. షేర్ ( సింహం)  హై , బ్యాగ్ర్ (పులి) హై ఔర్ భాలా (ఎలుగుబంటి) భీ హై'

'కభీ దేఖా కిసీకో?' అడిగాను.

'నహీ దేఖా అభీ తక్. మగర్ కహానియా  బహుత్ సునా. ఈసీ రాస్తా మే ఏక్ బ్యాగ్ర్ కో మేరా దోస్త్ ఔర్ ఏక్ డ్రైవర్ నే దేఖా. ఉస్నే రికార్డ్ కియా. ఏ వీడియో కో దేఖో' అంటూ ఒక వీడియో నాకు పంపించాడు. మీరూ చూడండి ! అదే దారిలో ఉంది పులి !    


అడవిలో అక్కడక్కడా చిన్నచిన్న జననివాసాలున్నాయి. వాటిదగ్గర ఆంజనేయస్వామి గుడులు కనిపించాయి. చీకటి పడితే అక్కడ కరెంటు కూడా లేదు. గుడ్డిదీపాల వెలుతురులో ఎలా ఉంటున్నారో ఆ అడవిలో జనం? కానీ వాళ్ళలో అసంతృప్తి కనిపించలేదు. అమాయకత్వంతో కూడిన ఒకవిధమైన సంతృప్తికరమైన జీవితాన్ని వాళ్ళు గడుపుతున్నారు. 'మాకిది లేదు' అన్న బాధ వారిలో నాకు కనిపించలేదు. అన్నీ ఉండి కూడా ఇంకా ఏదో లేదని బాధపడే మనుషులు గుర్తొచ్చి నవ్వుకున్నాను.

ఈ అడవిలోకి క్రైస్తవవిషం ఇంకా వ్యాపించలేదు. అందుకే వీళ్ళు  ద్వేషం అనేది తెలీకుండా హాయిగా బ్రతుకుతున్నారని అనిపించింది.

31 రాత్రి గోండియాలో గడిచింది. పెద్దగా న్యూ యియర్ సంబరాలేమీ ఈ ఊర్లో కనిపించలేదు. దగ్గరలో ఏదో ఫంక్షన్ నుంచి ఎవరో కరావొకే సాంగ్స్ పాడుతున్నారు. 'ఏ షామ్ మస్తానీ..' అంటూ కిషోర్ కుమార్ పాట వినిపించింది. తర్వాత కొన్ని రఫీ సాంగ్స్ వినిపించాయి. పిచ్చి జనం ! పిచ్చి గోల ! నవ్వొచ్చింది.

రాత్రి పదికల్లా దుప్పటి ముసుగేసి నిద్రాధ్యానం మొదలుపెట్టాను.

(ఇంకా ఉంది)

read more " మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (గోండియా నుంచి ఇంకా అడవులలోకి) "

3, జనవరి 2021, ఆదివారం

మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (చండీమందిర్ - శివనాధ్ నది - ముక్తిక్షేత్రం)

 







దుర్గ్ లో ఎక్కడ చూచినా శివాలయాలు, ఆంజనేయస్వామి ఆలయాలు ఉన్నాయి.  అవి పెద్దపెద్దవేమీ కావు, కానీ సందుసందుకీ ఉన్నాయి.  అక్కడి మనుషులలో కూడా భక్తి ఎక్కువగా కనిపిస్తున్నది. VHP, RSS  ప్రభావం బాగా ఎక్కువగా ఉన్నట్లు, ఊర్లో  ఉన్న బ్యానర్స్,  పోస్టర్స్ ని  బట్టి కనిపించింది. మన ఆంధ్రాలో ఉన్నట్లు ప్రతిసందుకీ నాలుగు చర్చిలు, తెలంగాణలో ఉన్నట్లు ఊరూరికీ నాలుగు మసీదులు ఇక్కడ కనిపించలేదు. మన తెలుగురాష్ట్రాలలో ఉన్నట్లు మాంసంకొట్లు, బారుషాపులు విచ్చలవిడిగా ఎక్కడపడితే అక్కడ లేవు. అందుకేనేమో ఊరంతా పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్లు ఫీలయ్యాను. ఈ రెండు మతాలు మన దేశంలో అడుగుపెట్టి ఎక్కడలేని దరిద్రాన్ని కొనితెచ్చాయి.  కొన్నివేల సంవత్సరాల నుంచీ ఒక పద్ధతిగా ఉంటున్న మన సమాజానికి ఇవి చేసిన కీడు ఊహించడం చాలాకష్టం. శాంతి శాంతి అని పైకి చెప్పే ఈ మతాలు నిజానికి పెంచింది అశాంతిని మాత్రమే. ఇది ప్రపంచవ్యాప్తంగా ఏ దేశంలో చూచినా కనిపిస్తుంది.

ఉత్తరాదిన శుచి శుభ్రం, పద్ధతీ పాడూ ఉండవని, దక్షిణాదిలో సాంప్రదాయం ఎక్కువని మనం అనుకుంటూ ఉంటాం. కానీ అది నిజం కాదు. అక్కడి మనుషులు పల్లెటూరి వాళ్ళలాగా ఉండవచ్చు. వాళ్లలో కొంచం శుభ్రత తక్కువే ఉండవచ్చు. కానీ భక్తి ఎక్కువ. మంచితనం, మర్యాదలు కూడా ఎక్కువే. మనం డబ్బుకు అమ్ముడుపోయి, మన తాతముత్తాతల మతాలను అమ్ముకున్నంతగా వాళ్లింకా అమ్ముడుపోలేదని నాకనిపించింది. 

ఈ ఊర్లో చండీమందిర్ అనేది  ప్రసిద్ధి అని చెప్పారు. కాలినడకన అక్కడికి బయల్దేరాం. దారి తెలీదు.  గూగుల్ మాప్ లో ఉజ్జాయింపుగా చూసుకుని ఇక నడక మొదలుపెట్టాం. దారిలో అక్కడక్కడా అడుగుతూ మొత్తం మీద మూడ్నాలుగు కిలోమీటర్లు నడిచి గుడికి  చేరుకున్నాం.

దారిలో ఒక ఆంజనేయస్వామి గుడి కనిపిస్తే అక్కడున్న పూజారిని చండీమందిర్ కి దారి అడిగాం. అతనప్పుడే గుడిబయటున్న బంకులో గుట్కా కొనుక్కుంటున్నాడు. చిన్నకుర్రాడే కానీ గుట్కాకు బానిసయ్యాడు లాగుంది. మమ్మల్ని చూచి కొంచం షాకయ్యాడు. కానీ చాలా మర్యాదగా దారి వివరించి చెప్పాడు. అతనికా పాడు అలవాటు పోవాలని ఒక తాంత్రికక్రియను అక్కడికక్కడే చేశాను. కానీ పక్కనున్నవాళ్ళు కూడా గ్రహించలేనట్లుగా దానిని చేశాను. అతను చూపించిన దారిలో ఒక రెండువందల గజాలు నడిచి చండీమందిర్ చేరుకున్నాం. 

ఊరికి దాదాపుగా ఒకవైపున ఉన్నప్పటికీ మంచి సెంటర్లోనే ఉంది గుడి. జనం అస్సలు లేరు. పూజారి ఒక పక్కగా  వసారాలో కూచుని ఫోన్లో ఏదో చూసుకుంటూ తన లోకంలో తనున్నాడు. గుడిలో ముందుగా దుర్గాదేవి, వెనుకగా కాళికాదేవి విగ్రహాలున్నాయి. ఉదయం సాయంత్రం ఇచ్చే హారతికి చాలామంది వస్తారని తెలిసింది. గ్రహపీడలు, దయ్యాలు, భూతాలు పట్టినవాళ్లకు ఇక్కడ చేసే చండీపూజ బాగా పనిచేస్తుందని చెప్పారు. కాసేపు అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను. 

సహచరులు పూజారితో ఏదో మాట్లాడారు. పూజారి వాలకం నాకు నచ్చింది. మన ఆంధ్రా తెలంగాణాలలో ఉన్నట్లు అనవసరమైన పోజు లేదు అతనిలో. మనవైపు పూజారులలో రెండు రకాలుంటారు. అయితే, దీనంగా డబ్బుల్లేకుండా ఉంటారు.  లేకపోతే, మహా దురహంకారంగా ధనమదంతో కూడి, 'నన్ను ముట్టుకోకు' అన్నట్లుగా ఉంటారు. మధ్యస్థంగా మాత్రం ఉండరు. ఇటువైపు పూజారులు అలా లేరు. నేలబారుగా మామూలుగా ఉన్నారు. వాళ్లలో పాండిత్యపు పోజు లేదు. జనంతో కలసిపోయి ఉన్నారు. అది నాకు నచ్చింది.

అక్కడనుంచి బయటకొచ్చి శివనాధ్ నదివైపు బయలుదేరాం. అదెక్కడుందో తెలీదు. ఒకవైపు పోతే నది వస్తుంది అనిపించింది. అటువైపు నడక ప్రారంభించాం. నాతోపెట్టుకుంటే ఎలా ఉంటుందో తెలుసు గనుక నోర్మూసుకుని నా వెనుకగా నడుస్తున్నారు సహచరులు. దారిలో ఒకచోట గంగరేగుకాయలు నేలమీద గుట్టగా పోసి  అమ్ముతున్నారు. కొన్ని కొనుక్కుని తింటూ నడవసాగాను.

'సార్ ! అలా తినకండి. అవి నేలమీద బురదనీళ్ళ పక్కన పోసి ఉన్నాయి. కనీసం కడుక్కొని తినండి. అసలే కరోనా ఉంది' అని సహచరులతో  ఒకాయన అన్నాడు. 

అతనివైపు ఒకసారి చూసి, అప్పటిదాకా ఒక్క కాయ తింటున్నవాడిని, రెండుకాయలు ఒకేసారి నోట్లో పెట్టుకుని నమలడం మొదలుపెట్టాను. అతను తలకొట్టుకుని ఇక మారు మాట్లాడలేదు.

అలా కొద్దిదూరం నడిచాం. ఎంతదూరం నడిచినా బజార్లు వస్తూనే ఉన్నాయిగాని నది రావడం లేదు. నా సహచరులకు కాళ్ళు నొప్పులు మొదలయ్యాయి. నేను మాత్రం వెనక్కు చూడకుండా ఏదో ధ్యాసలో నడుస్తూనే ఉన్నాను. సహచరులు ఎప్పుడు ఆటో మాట్లాడారో తెలీదుగానీ దాంట్లో ఎక్కికూచుని నా పక్కనే వచ్చి  ఆగారు. ఏంటా ప్రక్కనే ఆటో ఆగింది? అని చూస్తే దాంట్లో వాళ్ళున్నారు. నేనూ ఆటో ఎక్కాను.

ఆటో పోతోంది. దారిలో ఇళ్లమధ్యనే పెద్దపెద్ద చెరువులు కనిపించాయి. బెంగాల్ లో ఉన్నట్లుగా. కానీ ఎవరూ వాటిని శుభ్రంగా ఉంచడం లేదు. అవి మురుగు గుంటల్లాగా ఉన్నాయి. స్నానాలు, బట్టలు ఉతకడాలు, గిన్నెలు తోమడాలు అన్నీ అందులోనే చేస్తున్నారు. ఏదైనా ఎపిడెమిక్ వచ్చిందంటే వేలాదిగా జనం లేచిపోతారు. అలా ఉంది ఆ లొకాలిటీ. మున్సిపల్ అధికారులు, నాయకులు ఏం చేస్తున్నారా? అని సందేహం కలిగింది. ఉన్నంతలో శుభ్రంగానే ఉన్నారు. కానీ వాళ్లకున్న వాటర్ సోర్స్ ను అలా పాడు చేసుకుంటున్నారు. అలా కొద్దిసేపు ప్రయాణం తర్వాత శివనాధ్ నది పక్కనే ఉన్న శివాలయం దగ్గర ఆటో ఆగింది.

నది పెద్దదే. రెండుప్రక్కలా శివాలయాలున్నాయి. వీటిలో ఏది ప్రాచీనమైనది? అని అక్కడివారిని అడిగాం. నది అవతలప్రక్కన ఉన్నదానిని చూపించారు. ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డువరకూ ఒక సిమెంట్ దారిలాంటిది ఉన్నది. దానిమీద నడుస్తూ అవతలి ఒడ్డుకు చేరుకున్నాం.





ఆ రోజున మార్గశిర పౌర్ణమి కావడంతో చాలామంది నదిలో  స్నానాలు చేస్తూ కనిపించారు. ఆడవాళ్లకూ, మగవాళ్లకూ స్నానఘట్టాలు విడివిడిగా ఉన్నాయి. వాళ్లలో చాలామంది సబ్బు రాసుకుని నదిలో స్నానాలు చేస్తున్నారు. మరికొందరేమో అక్కడే బట్టలు ఉతుకుతున్నారు. ప్లాస్టిక్ కవర్లు దానిలోనే పారేస్తున్నారు. మొత్తం మీద నదంతా చాలా మురికిగా ఉంది. బాధేసింది. ఎలాంటి సాంప్రదాయం మనది? వెయ్యి సంవత్సరాల ముస్లిం, క్రైస్తవ పాలనలవల్ల చివరకు ఎలా దరిద్రంగా తయారైంది? ఇప్పుడేమో చెప్పేవాడూ లేడు, చెప్పినా వినేవాడూ లేడు. మన జనాలలో నిజమైన సాంప్రదాయం ఎప్పుడు వస్తుంది? ప్రకృతిలో దైవాన్ని చూడటం ఈ మూర్ఖపు మనుషులు ఎప్పుడు నేర్చుకుంటారో అని చాలా జాలి కలిగింది.

నదికి అవతలి ఒడ్డున పాతకాలంనాటి ఒక చిన్న శివాలయం ఉంది. పూజారి లేడు. పూజలు జరుగుతున్న సూచనలు కూడా అక్కడ లేవు. కానీ, రోజూ గుడిని శుభ్రం చేస్తున్నట్లు మాత్రం కనిపించింది. చుట్టూ మామిడితోటలు, చెట్లతో అడవిలాగా ఉంది. దానిపేరు ముక్తిక్షేత్రం అని చెప్పారు. ఎప్పుడో పాతకాలంలో అక్కడ ఋషులు తపస్సు చేశారట. అక్కడకూడా కాసేపు మౌనంగా కూచున్నాను.  శివానుగ్రహం వల్ల ఈ స్థలంలో నాకొక ప్రత్యేకమైన అనుభూతి కలిగింది. ఎప్పటినుంచో నన్ను బాధపెడుతున్న ఒక సమస్య ఆ ప్రదేశంలో క్షణంలో మాయమైంది.

పరమేశ్వరుడు యోగులకు ఆరాధ్యదైవం. పరమవైరాగ్యమూర్తిగా ధ్యానసమాధిలో ఉండే శివుడే వారికి ఇష్టం. ఆయన భోళాశంకరుడు. తేలికగా ప్రసన్నమౌతాడు. కానీ మనలో హృదయశుద్ధి ఉండాలి. విష్ణువూ శివుడూ వేర్వేరు కాదు. తెలిసినవారికి ఇద్దరూ ఒకటే. తెలియకపోతే భేదం. తెలిస్తే ఏకం.

పెద్దపెద్ద ప్రఖ్యాత ఆలయాలలో హంగూ ఆర్భాటమూ తప్ప ఏమీ ఉండదు. ప్రకృతి ఒడిలో జనసంచారానికి దూరంగా మౌనంగా ఉండే ఆలయాలలోనే ఆధ్యాత్మికశక్తి ఎక్కువగా ఉంటుంది. చవకబారు వెకిలిజనానికి ఎంత దూరంగా ఉంటె అంత అసలైన ఆధ్యాత్మికత అనుభవంలోకి వస్తుంది. ఈ విషయాన్ని నేను కొన్ని వందలసార్లు గమనించాను. ఆలయాలకు తండోపతండాలుగా వెళ్లి అక్కడి ప్రశాంతతను పాడుచేస్తున్నది మనమే.

An ancient disease
A medieval medicine
A modern cure
Along with me, the river also
saw a flash of light !

ఒక ప్రాచీన రోగం
మధ్యకాలపు మందు
రోగం ఇప్పుడు నయమైంది
నాతోపాటు ఈ నదికూడా 
ఒక కాంతిపుంజాన్ని చూచింది



అక్కడనుంచి లేచి చూస్తే, సహచరులు కనిపించలేదు. ఎక్కడున్నారా అని చూస్తే, కొద్దిదూరంలో ఉన్న పాకా హోటల్లో కూచుని హోటలువాడితో మాట్లాడుతూ కనిపించారు. మాకోసం వేడివేడి సమోసాలు, టీ రెడీ చేయిస్తున్నారు. అక్కడికెళ్లి కూచోగానే ఎక్కడనుంచో ఒక కుక్కపిల్ల వచ్చి  నా కాళ్లదగ్గర కూచుంది. సహచరులు అప్పటికే సమోసాలు తింటున్నారు. కానీ వాళ్ళదగ్గరకు అది పోలేదు. నా దగ్గర తినే పదార్ధాలు ఏమీ లేవు. అప్పుడే వచ్చి అక్కడ కూచుంటున్నాను. 
కానీ అది సరాసరి వచ్చి నా కాళ్లదగ్గర కూచుని  ముఖంలోకి చూస్తోంది. ముందు దానికొక సమోసా ఇవ్వమని షాపువాడికి చెప్పాను. అది ఆ సమోసాను తీసుకుని చెట్లలోకి వెళ్ళిపోయింది. మళ్ళీ కనిపించలేదు.

శివాలయంలో నాకు కలిగిన అనుభవం దృష్ట్యా శివనాధ్ నది, ముక్తిక్షేత్రం నా మనస్సులో ఎప్పటికీ నిలిచి ఉంటాయి.

అలా కాసేపు అక్కడ ఉండి, మళ్ళీ చప్టా మీదుగా నడుస్తూ నది ఇవతలిఒడ్డుకు వచ్చి, ఆటో మాట్లాడుకుని హోటల్ కు చేరుకున్నాం.

(ఇంకా ఉంది)

read more " మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (చండీమందిర్ - శివనాధ్ నది - ముక్తిక్షేత్రం) "

2, జనవరి 2021, శనివారం

మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (చెట్లు - పైరు)


26-12-2020 రాత్రి బయల్దేరి మధ్యప్రదేశ్, ఛత్తీస్ ఘడ్ రాష్ట్రాలకు వెళ్లాను. కారణం? అక్కడ మనకంటే చలి విపరీతంగా ఉండటమే. హైదరాబాద్ చలి మనకు చాలడం లేదు. ఇంకా చలి కావాలి. ఇంకా ఏకాంతం కావాలి. నార్త్ ఇండియాలో కోల్డ్ వేవ్ రాబోతోందని ముందే తెలియడం వల్ల, ఈ సంవత్సరాంతాన్ని మధ్యప్రదేశ్ అడవులలో గడుపుదామని నిశ్చయించుకున్నాను. మన సంకల్పాన్ని ప్రకృతి తప్పక ఆమోదిస్తుంది గనుక  పరిస్థితులు అలా రూపొందించబడ్డాయి. అదలా అయిపోయింది ! 

27 ఉదయం దుర్గ్ లో దిగేసరికి దాదాపు పదకొండైంది. మిట్టమధ్యాన్నమైనా ఎండ ఉండీ లేనట్లుగా ఉంది. చలి విపరీతంగా ఉంది. ఊర్లో జనసంచారం పెద్దగా లేదు. అలాంటి వాతావరణం మనకు బాగా నచ్చుతుంది గనుక హాయిగా అనిపించింది. స్టేషన్ కి ఎదురుగా ఉన్న ఇండియా కాఫీ హౌస్ హోటల్లో బస. అదొక సొసైటీ. దానికి జబల్ పూర్ కేంద్రం. కానీ పనివాళ్ళందరూ మళయాళీలున్నారు. కొంతమంది కన్నడిగులున్నారు. మనకా రెండు భాషలూ అరకొరగా వస్తాయి గనుక, వాటిల్లో కొంచం మాట్లాడేసరికి వాళ్ళ ముఖాలు వెలిగిపోయాయి.

రూమ్ నంబర్  209 రెండో ఫ్లోర్లో ఉంది. ఫ్లోర్ మొత్తానికీ ఉన్న 20 రూములలో నేనొక్కడినే ఉన్నా. మలుపులు తిరుగుతున్న పొడుగాటి కారిడార్లు, వాటిల్లో మసకలైట్లు, ఫ్లోర్ మొత్తానికీ ఎవరూ లేకపోవడం భలే నచ్చేశాయి. రాహువును కాసేపు ధ్యానించి రూంలో సెటిలయ్యాను. లగేజి తెచ్చిన బాయ్ అలవాటు ప్రకారం టీవీ ఆన్ చేస్తుంటే ' ఉస్కో బంద్ కర్ కె రిమోట్ కో అప్నే సాథ్ రఖో కౌంటర్ మే. ముజ్కో కోయీ జరూరత్ నహీ'  అని చెప్పాను. అతను హిందీవాడే. విచిత్రంగా చూసి, దాన్నక్కడే పెట్టి వెళ్ళిపోయాడు.

వెళుతున్న అతని ముఖంలోకి చూశాను.

'ఈ చానల్స్ చాలడం లేదు. ఇంకా కావాలి. అనే వాళ్లనే చూశా ఇప్పటిదాకా. అసలు టీవీనే ఇక్కడొద్దు. తీసేయ్. అనేవాడిని నిన్నే చూస్తున్నా' అన్న భావం కనిపించింది. నవ్వుకున్నా.

స్నానం కానిచ్చి  క్రిందకు దిగాను. రెస్టారెంట్లో కూచుని వేచిచూస్తూ ఉండగా సహచరులు కొంతమంది వచ్చి కలిశారు. వాళ్ళతో కలసి నార్త్ ఇండియన్ భోజనం కానిచ్చి, ఒక కార్ మాట్లాడుకుని దగ్గర్లో ఉన్న 'మరోదా' అనే ఊరికి వెళ్లి కాసేపు అక్కడ  అటూఇటూ తిరిగి వెనక్కు వచ్చేశాము.

వెనక్కు వస్తుండగా అన్నీ పంట నూర్చిన పొలాలు కనిపించాయి. గట్లమీద చెట్లు మాత్రం కదలకుండా నిలబడి ఉన్నాయి. వాటిని వదిలేశారు రైతులు. పంటను మాత్రం కోసేశారు. ఆ పొలాలమధ్యన ఉన్న రోడ్డు గుండా కారు పోతోంది. ఆ పొలాలనే చూస్తున్న నాతో సహచరులతో ఒకడిలా అన్నాడు.

'పోయినసారి వచ్చినపుడు ఇవన్నీ పైరుతో పచ్చగా ఉన్నాయి. ఇప్పుడు ఇలా ఉన్నాయి'.

నవ్వాను.

'ఏదైనా ఎన్నాళ్లుంటుంది?' అడిగానతన్ని

అకస్మాత్తుగా  నా మనసులో ఈ పద్యం పుట్టింది.

ఆ || గట్లమీద చెట్లు గట్టిగా నిలుచుండె 
పంటపైరు కయ్యె పచ్చికోత 
అవసరమ్ము గాదె? అవనిలో జూడంగ
ఏకదైవమగుచు ఏలుచుండు

మనుషులు ఎన్ని మాటలు చెప్పినా, ఎన్ని వేషాలు వేసినా, అవన్నీ 'అవసరం' కోసం మాత్రమే. పైరు తనకవసరం గనుక కోసుకుని దాచుకుంటాడు మనిషి. గట్టుమీదున్న చెట్లనీడ కూడా తనకు అవసరం గనుక వాటిని కొట్టకుండా వదిలేస్తాడు.

ఈ లోకంలో ఉన్నది అవసరం ఒక్కటే ! దానికే రకరకాల పేర్లు పెట్టుకుంటాడు మనిషి. ప్రేమ, జాలి,  దయ, అభిమానం, స్నేహం, బంధుత్వం, గౌరవం, భయం, భక్తి, ముక్తి - ఏదైనా అవసరమే. దానికే ఇవన్నీ రకరకాల ముసుగులు. దేవుడికి సహస్రనామాలున్నాయి. కానీ నిజానికి అన్ని నామాలూ అవసరానివే. నిజమైన దేవుడికి పేరు లేదు. అవసరానికి మాత్రం సహస్రనామాలున్నాయి.  

ఎవడి మతాన్నిబట్టి దేవుడికి వాడు పేర్లు పెట్టుకున్నప్పటికీ ఆ దేవుళ్ళు 'అవసరం' అనే దేవుడిముందు ఎందుకూ పనికిరారు. ఈ లోకంలో ఉన్నదీ, లోకాన్ని ఏలుతున్నదీ 'అవసరం' అనే ఏకైకదైవం మాత్రమే. ఆ దేవుడిముందు అందరు దేవుళ్ళూ పారిపోతారు.

ఇదే భావాన్ని హైకూ గా చెప్పమని మనసును అడిగా. వెంటనే ఇలా చెప్పింది.

పైరు కోతకు గురై ఇంటికి చేరింది
గట్లమీద చెట్లు మూగగా చూస్తున్నాయి
తమ సమయం ఎప్పుడా అని

స్వార్ధం కాక ఈ ప్రపంచంలో ఎటుచూసినా ఏముంది?

తన స్వార్ధం కోసం మనిషి ధర్మశాస్త్రాలు రాసుకున్నాడు. దేవుళ్ళని సృష్టించాడు. మతాలను కల్పించాడు.  కానీ అవన్నీ ఉత్త సోది. వీటన్నిటి అంతరాత్మ 'అవసరం' ఒక్కటే. అవసరం ఉంటే అణకువ ప్రదర్శించబడుతుంది. అవసరం తీరాక అహంకారం అలలై పొంగుతుంది. ఇదీ మానవనైజం. దీనినే నేను 'కపటం' అంటాను. ఈ కపటాన్ని దాటనిదే ఆధ్యాత్మికత అందదు. అవసరం కోసం నటించే స్వభావాన్ని అధిగమించడమే ఆధ్యాత్మికతలో మొదటిమెట్టు. కానీ ఈ మొదటిమెట్టునే ఎవరూ ఎక్కలేరు. ఇక్కడే అందరూ బోర్లా పడుతూ ఉంటారు.

అణకువను నమ్మకు
దానివెనుకనున్న అవసరాన్ని చూడు
అసలు నిజం చెప్పనా సత్యా !
అణకువ అసలురూపం అహంకారం
దానిని దాటినవాడే నీ మిత్రుడు

అందుకనే, ఈ లోకంలో మతాలు ఉండొచ్చు, దేవుళ్ళు ఉండొచ్చు, ఎవరి పూజావిధానాలు వారికి ఉండొచ్చు. ధర్మశాస్త్రాలు ఉండొచ్చు. వీళ్లెవరికీ అసలైన ఆధ్యాత్మికత మాత్రం అందదు.

మతాన్ని అధిగమించడమే ఆధ్యాత్మికత. మతం నాటకం. ఆధ్యాత్మికత నిజం. ఆధ్యాత్మికతను బోధించడానికి పుట్టిన మతం నాటకంగా మిగిలింది. అవసరార్ధం పుట్టిన దేవుళ్ళు అవసరం ముందు దిక్కులకొకరు పారిపోతున్నారు. ఎంత విచిత్రం?

అవసరం ఉండేదాకా అన్నీ బాగుంటాయి
అవసరం తీరాక అవే రోత పుట్టిస్తాయి 
అవసరమే ఈ లోకంలో
అసలైన దేవుడు
గుడిలేని దేవుడు

లోకమంతా కోతకు తయారౌతున్న పంటపొలమే. ఎవరి సమయం వచ్చినపుడు వారికి కోత పడుతుంది. కానీ ప్రతిమొక్కా తనకేమీ కాదని అనుకుంటుంది, కాలపుకత్తి తన మెడమీద పడేదాకా !

కోతను తప్పించుకోవాలంటే ఏం చెయ్యాలి. గట్టెక్కాలి. ఎక్కడుంది ఆ గట్టు? ఎవరికీ తెలీదు. 'మా దేవుడే  ఈ గట్టు' అని ప్రతిమతమూ అంటుంది. కానీ అది నిజం కాదు. అది అవసరార్ధం కల్పింపబడిన అబద్దం.

అకస్మాత్తుగా కఠోపనిషత్తు నుండి ఈ మంత్రం నా మనస్సులో మెరిసింది.

|| అనుపశ్య యధాపూర్వే ప్రతిపశ్య తథాపరే
సస్యమివ మర్త్య: పచ్యతే సస్యమివాజాయతే పునః ||

'చూడు ! మనకు ముందటివారూ గతించారు. మన తర్వాత పుట్టబోయేవారూ గతిస్తారు. ధాన్యపుమొక్క లాగా మనిషి పుడతాడు, పెరుగుతాడు, నశిస్తాడు, మళ్ళీ పుడతాడు'

నాలుగురోజుల ఈ లోకంలో అవసరాన్ని, స్వార్ధాన్ని దాటి చూడగలిగిన మనుషులు ఎక్కడున్నారు? అలాంటివాళ్ళు మాత్రమే నాకు కావాలి. ఈ చెత్త మనుషులు, చెత్త లోకం నాకొద్దు.   

ఆలోచనలు సాగుతున్నాయి. కారు దుర్గ్ చేరుకుంది.

(ఇంకా ఉంది)
read more " మధ్యప్రదేశ్ అడవులలో గడచిన 2020 చివరిరోజులు (చెట్లు - పైరు) "

26, డిసెంబర్ 2020, శనివారం

క్రిస్మస్ ప్రార్ధన

హే ప్రభువా !

ఈ క్షమాప్రార్ధనను ఆలకించుడి


నువ్వు మమ్మల్ని హిందువులుగా పుట్టించినా

నీ ఆలోచనకు విరుద్ధంగా మతం మారుతున్నాం

మమ్మల్ని క్షమించుడి


ప్రేమను సహనాన్ని నువ్వు బోధించినా

ద్వేషాన్ని మేము ప్రచారం చేస్తున్నాం

మమ్మల్ని క్షమించుడి


కొండమీద ప్రసంగాన్ని కొండమీదే వదిలేసి 

దండిగా సంపాదిస్తూ నిండుగా బ్రతుకుతున్నాం 

మమ్మల్ని క్షమించుడి


నీ విప్లవభావాలకు రోమన్లు నిన్ను శిలువేసినా 

మనుషులందరూ బాధ్యులేనని అబద్దాలు చెబుతున్నాం 

మమ్మల్ని క్షమించుడి


ప్రార్థనలతో కరోనా పోతుందని నమ్మిస్తూ

ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుకుంటున్నాం 

మమ్మల్ని క్షమించుడి


నువ్వు పుట్టింది డిసెంబర్ 25 కాకపోయినా

అదేనని అబద్దాలు చెబుతూ లోకాన్ని నమ్మిస్తున్నాం

మమ్మల్ని క్షమించుడి


పాపాలు చెయ్యడానికే మేము పుట్టాం 
మమ్మల్ని క్షమిస్తూ ఉండటానికి నువ్వు పుట్టావ్ 
ఈ మాటన్నామని కోపమొచ్చిందా?
అయితే మళ్ళీ క్షమించుడి
నీకంతకంటే ఇంకేం పనుంది గనుక?

ఈ ఏడాదంతా మరిన్ని పాపాలు చేసి
మళ్ళీ క్రిస్మస్ ప్రార్ధనలో కలుస్తాం
అంతవరకూ మమ్మల్ని క్షమిస్తూ
రెస్టు తీసుకొనుడి
 
టాటా....
read more " క్రిస్మస్ ప్రార్ధన "

24, డిసెంబర్ 2020, గురువారం

సంవత్సరాంత వేడుకలు

పొద్దున్న రవి మళ్ళీ ఫోన్ చేశాడు. తను రోజూ ఫోన్ చేస్తూనే ఉంటాడు. కానీ నేను ఎత్తను. ఆ టైంకి  నేనేదో పనిలో ఉంటాను.  ఎన్నిసార్లు ఎత్తకపోయినా పాపం విసుక్కోకుండా రోజూ ఒకే టైం కి చేస్తూనే ఉంటాడు.

అలాగే పొద్దున్న కూడా ఫోన్ మ్రోగింది. అప్పుడుకూడా ఏదో పనిలో ఉన్నాను. ఇక బాగోదని ఫోనెత్తాను. మనలని తలచుకునేవాళ్ళని మనం నిర్లక్ష్యం చెయ్యకూడదనేది మొదట్నుంచీ నా సిద్ధాంతం. అందులోనూ మా స్నేహం ఇప్పటిది కాదు. దీనికి ముప్పై ఏళ్ల చరిత్ర ఉంది.

'ఇవాళకూడా అమితాబ్ బచ్చన్ని వినేసి ఫోన్ పెట్టెయ్యాలేమో అనుకున్నా. మొత్తమ్మీద ఫోనెత్తావు' అన్నాడు కించిత్ నిష్టూరంగా.

'లేదులే. రోజూ నిన్ను డిజప్పాయింట్ చేయడం నాకూ బాలేదు. అందుకే కాసేపు' అన్నా.

అలా కాసేపు  అవీఇవీ మాట్లాడాక ' సంవత్సరాంత  వేడుకలు ఏం ప్లాను చేస్తున్నావ్ ?' అడిగాడు.

'ఏ ప్లానూ లేకుండా ఎలా ఉండాలా అని ప్లాన్ చేస్తున్నా' అన్నా. 

'అంటే?' అన్నాడు

'ఎవరికీ తెలీని, ఎవరూ రాలేని ప్రాంతానికి వెళదామనుకుంటున్నా' అన్నా.

'ఏదైనా ఐలెండ్ కి పోతున్నావా?' అన్నాడు.

'అవును. నా మనసే ఆ ఐలెండ్' అన్నా.

నవ్వేసి 'మన జోసెఫ్ పాండిచ్చేరి వెళుతున్నాడు జనవరి ఫస్ట్ దాకా రాడు.' అన్నాడు.

'అదేంటి? అరబిందో తీర్ధం పుచ్చుకున్నాడా?' అడిగా.    

'కాదు. అక్కడేదో పురాతన చర్చిలున్నాయిట. వాటిలో ప్రార్ధనలు చేసి ఆ బీచుల్లో తిరిగి వస్తానని పేమిలీతో కలసి వెళుతున్నాడు' అన్నాడు.

'మంచిదే. పొమ్మను. అక్కడే చర్చిలో శేషజీవితం గడపమని చెప్పు. వెనక్కి రావద్దను' అన్నా.

'చర్చిలో ఒక్కరోజే. మిగతా రోజులు బీచ్లో తిరుగుతాట్ట. అంటే ప్లెజర్ ట్రిప్పన్నమాట' అన్నాడు.

'ఓహో. ప్రభుత్వం సొమ్ముతో ప్రభువు దర్శనం చేసుకుని చివర్లో ప్రజలవద్దకు పాలన అన్నమాట' అన్నా.

'అలాటిందేలే. ఎవడి టేస్ట్ వాడిది. నువ్వూ వెళ్లచ్చుగా. ఎప్పుడో ఫిబ్రవరిలో వెళ్ళొచ్చావ్. కావాలంటే చెప్పు మన మూర్తితో చెప్పి ఏర్పాట్లు చేస్తా' అడిగాడు.

'అనుకున్నా. కానీ వద్దన్నాడు' అన్నా.

'ఎవరూ?' అడిగాడు అనుమానంగా.

'ప్రభువు' అన్నా.

'ఛా..' అన్నాడు నవ్వుతూ.

'అవును. మొన్నరాత్రి ఫోన్ చేశాడు. ముందు నువ్వనుకుని ఎత్తలా. తర్వాత చూస్తే ప్రభువు. 'పోయినసారి పాండిచ్చేరి వచ్చి చాలా డిజప్పాయింట్ అయ్యావు. ఈసారి అలా ఎవరితో పడితే వారితో రాకు.' అని తనే చెప్పాడు. సర్లే ఆయనమాట కాదనడం ఎందుకులే అని కాన్సిల్ చేశా ట్రిప్' అన్నా సీరియస్ గా.

'సర్లే నీ గోల నాకర్ధం కాదులే గాని, మన ఇంకో ఫ్రెండ్ ప్రసాద్ చూడు హాయిగా తిరుమల వెళ్లి చక్కగా మూడురోజులు కొండమీద ఉండేలా ప్లాన్ చేసుకుని వెళ్ళాడు. అదన్నా చెయ్యి కనీసం' అన్నాడు కోపంగా.

'అడుసు త్రొక్కనేల కాలు కడుగనేల?' అన్నా.

'అదేంటి/' అన్నాడు.

'పాపాలు చేసినవాడికే దేవుడి అవసరం. నాకు తెలిసి నేనే పాపమూ చెయ్యలేదు. కాబట్టి నాకు ప్రభువూ అవసరం లేదు. ఎవరూ అవసరం లేదు. నేనే అడుసూ  తొక్కలేదు. కాబట్టి కాళ్ళు కడుక్కునే పని లేదు' అన్నా.

'పోనీ డిసెంబర్ 31 రాత్రి మన ఫ్రెండ్స్ గెట్ టుగెదర్ ఉంటుంది. అక్కడికైనా రా' అన్నాడు.

'నేన్రాను. ఏముందక్కడ? తాగుడు, వాగుడు, తినుడు, ఎగురుడు అంతేగా. పనికిమాలిన చెత్త ! అదీగాక, అదే సమయంలో నాకోసం చాలామంది ఫ్రెండ్స్ వస్తారు నన్ను కలవడానికి' అన్నా. 

'ఎవరు వాళ్ళు?' అడిగాడు.

'వాళ్లంతా గతించి చాలా కాలమైందిలే. నా బ్లెస్సింగ్స్ కోసం ఆరోజు రాత్రికి వచ్చిపోతారు. నీక్కనిపించరు' అన్నా.

'ఓహో ! వాళ్ళక్కూడా న్యూ ఇయర్ ఉంటుందా?' అడిగాడు.

'ఎందుకుండదు? వాళ్ళు బ్రతికున్నపుడు మనలాంటివాళ్లే కదా ! అందుకే మన అలవాట్లు వాళ్లకూ ఉంటాయి. కావాలంటే నువ్వే మా ఇంటికి రా ఆరోజు రాత్రికి . పరిచయం చేస్తా' అన్నా.

'బాబోయ్ వద్దులే. మా పార్టీలేవో మేం చేసుకుంటాం. ఏదైనా నీ దారి వేరులే. 'అంతర్ముఖ సమారాధ్యా బహిర్ముఖ సుదుర్లభా' అంతేగా?' అడిగాడు ఈసారి సీరియస్ గా.

ముప్పై ఏళ్ల క్రితం మేము ట్రెయినింగ్ లో రెండేళ్లపాటు కలసి ఉన్నపుడు, నా పరధ్యానపు ఎపిసోడ్స్ ని దగ్గరనుంచి తను చాలాసార్లు గమనించాడు.  అందుకే అలా అడిగాడని నాకర్షమైంది.

'అంతే. చెప్పడం చాలా తేలిక. చెయ్యడం బహు కష్టం' అన్నా.

'అదేంటి' అన్నాడు.

'బహూనాం జన్మనామంతే జ్ఞానవాన్ మాం ప్రపద్యతే' అన్నా.

'ఏంటో నీ గోల! సరే ఉంటామరి. ఆ టైంకి కనీసం ఫోన్ చేసి విషెస్ చెప్పచ్ఛా నీకు?' అడిగాడు.

'నీ అదృష్టం ! పరీక్షించుకో. ఆ టైంకి నేనేదో పనిలో ఉన్నాననుకో, వాళ్లలో ఎవరైనా ఫోనెత్తితే ఆ స్వరం విని కంగారుపడకు' అన్నా నవ్వుతూ.

'ఎందుకు పడతాను? ముందే చెప్పి రక్షించావ్ కదా?' అన్నాడు

'అదికాదు. నాతోలాగా వాళ్ళతో కూడా ముచ్చట్లు పెట్టుకున్నావనుకో. ఆ తర్వాత వాళ్ళు మీ ఇంటికి కూడా వస్తే అప్పుడుంటుంది నీకు' అన్నా నవ్వుతూ.

'బాబోయ్ ! అంతపని చెయ్యకు. ఉంటా మరి" అని ఫోన్ పెట్టేశాడు రవి.

నేనూ నవ్వుకుంటూ ఫోన్ పెట్టేశా.

ఇయర్ ఎండింగ్ సెలబ్రేషన్ ట ! మతిలేకపోతే సరి ! పిచ్చిలోకమూ పిచ్చి పనులూనూ ! తాగడానికి తందనాలాడటానికి ఏదో ఒక సాకు !

మన సెలబ్రేషన్ అలా ఉంటుంది !

read more " సంవత్సరాంత వేడుకలు "

23, డిసెంబర్ 2020, బుధవారం

Our E Books available from Amazon and Google Play Books

మా E Books ఇకనుంచీ Amazon నుంచి, Google Play Books నుంచి లభిస్తున్నాయి. కావలసినవారు సైడ్ బార్ లో ఉన్న బటన్  నుంచి mapanchawati.org కు వెళ్లిచూడవచ్చు.

































read more " Our E Books available from Amazon and Google Play Books "

15, డిసెంబర్ 2020, మంగళవారం

వైద్య జ్యోతిష్యం (మొదటి భాగం) ప్రింట్ పుస్తకం విడుదలైంది


ఇంగ్లీషులో చదవడం రానివారికోసం, లేదా ఇంగ్లీషును అంతగా ఇష్టపడనివారి కోసం 'వైద్యజ్యోతిష్యం' (మొదటి భాగం) తెలుగు ప్రింట్ పుస్తకాన్ని విడుదల చేశాము. ఈ కార్యక్రమం జిల్లెళ్ళమూడిలో అమ్మపాదాల దగ్గర నిరాడంబరంగా జరిగింది. రెండేళ్ళ క్రితం బుద్ధపౌర్ణిమ రోజున జిల్లెళ్ళమూడి నుంచి 'ధర్మపదం' పుస్తకాన్ని విడుదల చేశాం. ఇప్పుడు వైద్యజ్యోతిష్యం. ఈ విధంగా జిల్లెళ్ళమూడి నుంచి ఇపటికి రెండు పుస్తకాలను విడుదల చేశాము.

అతి త్వరలో ఈ పుస్తకం మా వెబ్ సైట్ mapanchawati.org నుంచి లభిస్తుంది.

read more " వైద్య జ్యోతిష్యం (మొదటి భాగం) ప్రింట్ పుస్తకం విడుదలైంది "

8, డిసెంబర్ 2020, మంగళవారం

అంతములేని ఈ భువనమంత .....

'అంతములేని ఈ భువనమంత పురాతన పాంధశాల..' అనే పద్యాన్ని వ్రాసింది దువ్వూరి రామిరెడ్డిగారు కదూ. పానశాలనుంచి నేను కంఠస్ఠం పట్టిన పద్యాలలో అదీ ఒకటి ! ఉమర్ ఖయాం వ్రాసిన రుబాయత్ కి అది తెలుగు. లోకమంతా ఒక పెద్దసత్రం లాగా కన్పించింది ఉమర్ ఖయాం కళ్ళకి. కానీ నాకు మాత్రం లోకమంతా ఒక పెద్ద పిచ్చాసుపత్రిలాగా కనిపిస్తోంది.

పిచ్చాసుపత్రి వార్దుల్లో ఉన్న పిచ్చోళ్ళు నా కళ్ళకి పిచ్చోళ్ళలాగా ఆనడం లేదు. మూమూలు మనుషుల లాగే కన్పిస్తునారు. ఎందుకంటే, లోకంలో ఉన్న జనాల్లో పిచ్చి లేనిదెవరికి? మరి వాళ్లనేమో లోకంలో వదిలేసి, వీళ్ళని ఆస్పత్రిలో చేరుస్తున్నారు. పిచ్చోళ్ళు హాయిగా సొసైటీ అంతా ఉన్నారు. ఎక్కడపడితే అక్కడ రోడ్లమీద తిరుగుతున్నారు. వాళ్ళచేత పిచ్చోళ్ళుగా ముద్ర వెయ్యబదిన కొందరు పిచ్చోళ్ళు మాత్రం పిచ్చాసుపత్రిలో ఇన్ పేషంట్లుగా చేర్చబడ్డారు. పిచ్చి జనమూ పిచ్చి లోకమూనూ !

నా దృష్టిలో లోకంలోని జనమందరూ పిచ్చోళ్ళే. ఒక్కొక్కడికి ఒక్కొక్క రకమైన పిచ్చి. కొందరికి మొదట్లో ఉంటే, మరికొందరికి కొద్దిగా ముదిరితే, ఇంకొందరికి పూర్తిగా ముదిరింది. అంతే ! 

కొందరికి డబ్బుపిచ్చి. వారి బ్రతుకంతా డబ్బు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది.వారికి మానవసంబంధాలు ఏమాత్రం పట్టవు. డబ్బు సంపాదించడం ఒక్కటే జీవితంలో సక్సెస్ కి కొలబద్ద అనుకుంటారు. ప్రతిదానినీ డబ్బుతోనే కొలుస్తారు. ఆ డబ్బును సంపాదించడంలో ఎంతో పాపఖర్మను మూట గట్టుకుంటారు.'డబ్బు డబ్బు' అని కలవరిస్తూనే వాళ్ళు కన్నుమూస్తారు. కానీ ఆ డబ్బు ఇక్కడే ఉంటుంది. వాళ్లు మాత్రం పోతారు. వాళ్ళ ఖర్మ మాత్రం వాళ్ళతో వెంటనంటి ఉంటుంది.

మరికొందరికి దురహంకారపు పిచ్చి. 'అంతా మాకే తెలుసు, అన్నీ మాకే తెలుసు, ఎదుటివారికి ఏమీ తెలియద'ని అనుకుంటూ భ్రమల్లో బ్రతుకుతూ ఉంటారు. ప్రతిదానికీ ఎదుటివారికి పాఠాలు నేర్పబోతారు. 'అదలా చెయ్యాలి, ఇదిలా చెయ్యాలి. దాన్నలా చెయ్యకూడదు. దీన్నిలా చెయ్యకూడదు. అని నోరు తెరిస్తే చాలు అనవసరమైన పెద్దరికం తీసుకుని అందరికీ లెక్చర్లు ఇస్తూ ఉంటారు. వీరి అదృష్టం బాగుంటే తమకేమీ తెలియదని, అన్నీ తెలుసని అనుకుంటూ ఏమీ తెలియకుండా బ్రతికామని వారికి చివరిఘడియలలో తెలుస్తుంది. అంతదృష్టం లేకపోతే అదీ తెలియదు. ఈ లోపల జీవితమంతా వాళ్ళు చేసిన గోలతో పక్కవాళ్ళు నలిగిపోతారు.

మరికొందరికి ఐడెంటిటీ క్రైసిస్ పిచ్చి. నోరు తెరిస్తే బడాయిలు తప్ప ఇంకేమీ ఉండవు వీళ్దదగ్గర. ఇక ప్రతిదానికీ - 'మాకింత ఉంది. నేనింత చేశాను. ఇంత సంపాదించాను. ఇంతమందికి ఇంత చేశాను. నేనంత నేనింత' అని చెప్పుకుంటూ ఒక భ్రమపూరిత లోకంలో బ్రతుకుతూ ఉంటారు.

మరికొంతమందికి రెలిజియస్ పిచ్చి. నోరు తెరిస్తే రెలిజియస్ బడాయిలు. 'నేను గొప్ప భక్తుడిని, నేను పుట్టినప్పటినుంచీ అసలు తిండే తినలేదు. ఉపవాసాలే ఉంటున్నాను. నా జీవితమంతా పూజగదిలోనే గడిపాను. నేను జోలపాడకపోతే దేవుళ్ళు నిద్రే పోరు' ఇలాంటి బడాయిలు చెప్పుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళు పుట్టకముందు కూడా దేవుడున్నాడనీ, తర్వాతా కూడా ఉంటాడనీ మర్చిపోతారు. వీళ్ళది కూడా ఐడెంటిటీ క్రైసిస్సే. అందులో ఇదొక షేడ్. అంతే.

మరికొంతమంది పూజలని, పునస్కారాలని నాలుగు మాయమాటలు, మంత్రాలు,  వచ్చీరాని జ్యోతిష్యాలు నేర్చుకుని జనాన్ని మోసం చేస్తూ బ్రతుకుతూ ఉంటారు. వీళ్ళ మాయరంగులు రెండు మూడు రోజులలోనే బయటపడుతూ ఉంటాయి.

కదిలిస్తే డిల్లీ రాజకీయాల నుంచి, పల్లెటూరి పంచాయితీల వరకూ అన్నీ మాకే తెలుసనీ ఇంకొందరు. వీళ్ళ బ్రతుకంతా 'మేము మేము' అని అరవడం లోను, 'వాళ్ళు అలాగ, వీళ్ళు ఇలాగ' అని తీర్పులు తీర్చడంలోనూ అయిపోతుంది. చివరికా దురహంకారపు మాయలో పడి జీవితాన్ని ఎంత కోల్పోయామో తెలియని స్థితిలో చనిపోతారు వీళ్ళు.

ఇంకొందరికి అభద్రతాభావం పిచ్చి. ఎప్పుడూ ఏదో ఒక భయంతో పీక్కుంటూ ఉంటారు. ఎవరో ఒకరు వీరికి ఆసరాగా అండగా ఉండాలి. కానీ వారిమీద మళ్ళీ ఆధిపత్యం చెలాయించాలని చూస్తుంటారు. వాళ్ళని తొక్కి పెడతారు. మళ్ళీ వాళ్ళు లేకపోతే క్షణం కూడా శాంతిగా సుఖంగా బ్రతకలేరు. వీళ్ళ జీవితం కూడా  ఈ మాయలోనే గడిచిపోతుంది. వీరిది ద్వంద్వమనస్తత్వం.

దీనిలో ఇంకొక షేడ్ ఏంటంటే, ఒక మనిషి మన చేతిలోనుంచి జారిపోతున్నాడని లేదా జారిపోతోందని భయపడి తమ గుప్పిట్లోనే పెట్టుకోవాలని నానా రకాల ప్లాన్స్ వేయడం. ఈ క్రమంలో గోలగోల  చేయడం. ఎంత విచిత్రం? అంతిమంగా చూస్తే ఈ లోకంలో ఎవరికెవరు? ఇక్కడ మనమే శాశ్వతం కాదు. మళ్ళీ ఇంకొకరు మన గుప్పిట్లో లేరని మనం భయపడటం! ఫన్నీ గా లేదూ?  

మరికొందరికి అతితెలివిపిచ్చి. ఎత్తులతో జిత్తులతో అందరినీ బోల్తా కొట్టించగలమని అనుకుంటారు. వాళ్ళ ప్లాన్లకు ఎవరైనా పడిపోతారని అనుకుంటారు. అవసరం ఉన్నంతవరకూ నక్కవినయాలు నటిస్తారు. అవసరం తీరాక అసలు స్వరూపాలు బయటపెడతారు. ఈ క్రమంలో ఎదుటివారిని భలే మేనేజ్ చేసామని అనుకుంటూ బ్రతుకుతూ ఉంటారు. కానీ చివరకు వాళ్ళే బొక్కబోర్లా పడ్డామన్న విషయాన్ని గ్రహిస్తారు. అదికూడా వాళ్ళ అదృష్టం బాగుంటే. లేకపోతే అదీ తెలియదు. అలాగే నక్కజిత్తులు వేసుకుంటూ, అదే పెద్ద తెలివి అనుకుంటూ బ్రతికి, చివరకు అలాగే పోతారు.

వెరసి వీళ్ళందరికీ స్వార్ధం పిచ్చి. 'ముందు నేను నాది. ఆ తర్వాతే ఇంకెవరైనా, చివరికి దేవుడైనా సరే' - అనే సిద్ధాంతం అందరిదీనూ. కానీ అది చాలా నీచమైన మనస్తత్వమన్న సంగతి వాళ్లకు చావుమంచం మీద కూడా తెలియదు.

ఈ విధంగా అహంకారం (సుపీరియారిటీ కాంప్లెక్స్), భయం (ఇంఫీరియారిటీ కాంప్లెక్స్), అభద్రతాభావం (ఫియర్ కాంప్లెక్స్), అతితెలివి (ఇంటలెక్చువల్  కాంప్లెక్స్), అతిస్వార్ధం (సెల్ఫిష్ కాంప్లెక్స్), మతపిచ్చి (రెలిజియస్ మానియా) - వీటి ఊబిలోనే మనిషి జీవితమంతా మునిగిపోతూ ఉంటుంది. ఇవే సర్వస్వమనీ ఇదే అంతా అనీ భావిస్తూ కోట్లాదిమంది బ్రతికేస్తూ ఉంటారు. చనిపోతూ ఉంటారు. కానీ ఎలా బ్రతకాలో ఎవరికీ ఏమాత్రమూ తెలియదు. వీళ్ళంతా జీవితాన్ని కోల్పోతూ ఉంటారు. కానీ తెలుసుకోలేరు. మనిషి జీవితం ఎంత విలువైనదో దానిని ఎలా బ్రతకాలో వీళ్ళలో ఎవరికీ తెలియదు.

ఇవేవీ లేకుండా కూడా చక్కగా బ్రతకవచ్చు. ఆ బ్రతుకు చాలా హాయిగా ఉంటుంది. చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా ఉన్నతంగా ఉంటుంది. చాలా గొప్పగా ఉంటుంది. అలా ఉంటే కోల్పోయేది ఏమీ ఉండదు. పోగొట్టుకునేదీ ఏమీ ఉండదు. హీనంగా బ్రతికేదీ ఏమీ ఉండదు. ఇంకా చెప్పాలంటే, దేవుడు మనల్ని ఎందుకు సృష్టించి ఈ భూమ్మీద పడేశాడో, ఖచ్చితంగా దానికి అనుగుణంగా బ్రతకవచ్చు. అదే అసలైన జీవితం. కానీ ఎవరూ అలా బ్రతకరు.

ప్రతివాళ్ళూ 'దేవుడు దేవుడు' అంటారు. ఏ మతం దేవుడు ఆ మతానికి ఉంటాడు. అందరూ దేవుడిని కొలుస్తారు. కానీ ఆ దేవుడు ఎలా బ్రతకమని చెప్పాడో అలా మాత్రం బ్రతకరు. ఎలా వద్దని చెప్పాడో అలాగే ఉంటారు. మళ్ళీ అదే దేవుడిని కొలుస్తూ ఉంటారు. దేవుడు వద్దన్నదానిని చేస్తూ, మళ్ళీ ఆయన సహాయం కోసం ప్రార్ధిస్తారు. ప్రతి మతంలోనూ ఇదే తంతు !

నిజమైన గురువులు 'నువ్వెలా బ్రతకాలి?' అనేదే నేర్పిస్తారు. అది తప్ప మిగతా సోది చెప్పేవాడు నిజమైన గురువు కానేకాడు. పై కాంప్లెక్స్ లు ఏవీ లేకుండా బ్రతకడమే అసలైన జీవితం. కానీ వాళ్ళమాటలు ఎవరు వింటారు? ఎవరు అనుసరిస్తారు? ఎవరు ఆచరిస్తారు? ఎవరూ ఉండరు. చెప్పినా ఎవరూ వినరు.

చెత్త మనుషులు ! చెత్త లోకం !

ఈ ప్రపంచం ఇంతే ! ఈ మనుషులింతే ! ఎవరి కాంప్లెక్స్ లు వారివి. ఎవరి పిచ్చి వారిది. ఇవి నయమయ్యే పిచ్చులు కావు.  

ఏంటీ వింత? ఇంత వింతలోకం ఇంకెక్కడా ఉండదేమో?

అంతములేని ఈ భువనమంత ఒక పురాతన పిచ్చాస్పత్రి....

read more " అంతములేని ఈ భువనమంత ..... "