“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, జూన్ 2018, శనివారం

కుండలినీ ప్రేరేపణ ఎలా చెయ్యాలి?

నాకు చిరకాల మిత్రుడొకాయనున్నాడు. తనకి కూడా నేను వ్రాసిన పుస్తకాలు చదవమని ఇస్తూ ఉంటాను. కానీ వాటిని తను చదవడు. ఊరకే పక్కన పెడుతూ ఉంటాడు. తనకి నేనంటే నమ్మకం తక్కువ. ఒకరిని రోజూ చూస్తున్నపుడు అతనిలోని ప్రత్యేకతలు మనకు కన్పించవు. అతనంటే మనకు నమ్మకం కలగదు. చివరకు దేవుడైనా అంతే.

ప్రముఖ దేవాలయాలలో ఉండే పూజారులలో సరిగ్గా ఇదే జరుగుతుంది. దూరం నుంచి వచ్చే ప్రజలకు ఆ దేవుడు గొప్ప కావచ్చు. ఒక్క క్షణం ఆయన ఎదురుగా నిలబడితే చాలని వారు ఎంతో కష్టపడి ఎక్కడనుంచో వచ్చి దర్శనం చేసుకుంటూ ఉంటారు. కానీ అక్కడే నిత్యం ఉండే పూజారులకు మాత్రం ఆ దేవుడు ఒక విగ్రహం మాత్రమే. వారి దృష్టి డబ్బుమీద ఉంటుంది, భక్తుల స్టేటస్ మీద ఉంటుందిగాని ఆ దేవుని మీద ఉండదు. అందుకే ఆ దేవాలయాలలో రకరకాల రాజకీయాలు తలెత్తుతూ ఉంటాయి. నిజంగా దేవుని సమక్షంలో మనం ఉన్నామని స్పృహ వారికుంటే ఆ విభేదాలు గొడవలు ఎలా వస్తాయసలు? నేను చెప్పేది నిజం అనడానికి మన తిరుమలే ఒక క్లాసిక్ ఉదాహరణ.

పెద్దపెద్ద స్వామీజీల శిష్యులలో కూడా ఇదే జరుగుతుంది. వారు రోజూ ఆయన్ను చూస్తూ ఉంటారు గనుక ఆయన వారికి లోకువ అవుతాడు. చులకన అవుతాడు. ఎప్పుడో ఒకసారి కాసేపు వచ్చి పోయేవారికి ఆయనంటే ఏదో త్రిల్ గా ఉంటుంది గాని రోజూ చూసేవారికి ఉండదు. ఎప్పుడో వచ్చి చూచేవాళ్ళు కూడా ఒక వారం అక్కడే ఉంటే అప్పుడు వాళ్ళుకూడా చప్పబడి పోతారు. అప్పుడు ఆయనంటే వారికున్న మునుపటి గౌరవం పోతుంది. ఇదంతా మనసు చేసే మాయ. ఈ మాయలో చిక్కుకుంటే మోసపోవడమే గాని ఏమీ దక్కదు. ఈ మాయను దాటిన వారే మనిషిలోని మనిషిని చూడగలుగుతారు. మిగిలినవాళ్ళంతా బయట కనిపించేదాన్నే చూస్తారు. మోసపోతారు. 

అలాగే నా మిత్రుడికి కూడా నేను చెప్పేవాటి మీద పెద్దగా నమ్మకం లేదు. ఆ సంగతి నాకూ తెలుసు. అందుకే నేనూ తనతో సరదామాటలే మాట్లాడుతూ ఉంటానుగాని ఆధ్యాత్మిక విషయాలు మాట్లాడను. ఇదిలా ఉండగా ఉన్నట్టుండి ఈ మధ్యనే మాటల సందర్భంలో ఇలా అడిగాడు.

'నేను కుండలినిని ప్రేరేపించాలని అనుకుంటున్నాను. చెయ్యమంటావా?'

'దానిని ప్రేరేపించడం అనరు. జాగృతి అంటారు.' అన్నాను నేను నవ్వుకుంటూ.

'నాకీ మాటే బాగుంది.' అన్నాడు.

'పోనీ అలాగే అనుకో. ఉన్నట్టుండి కుండలిని మీదకు పోయిందేంటి నీ మనసు?' అడిగాను.

'ఎన్ని పూజలు చేసినా, ఎన్ని స్తోత్రాలు చదివినా, ఎన్ని గుళ్ళకు వెళ్ళినా చివరకు కుండలినిని ప్రేరేపించకపోతే ఏమీ ఉపయోగం లేదని పుస్తకాలలో చదివాను' అన్నాడు.

'అది నిజమే' అన్నాను.

'నీకు తెలుసా దానిని ఎలా ప్రేరేపించాలో?' అన్నాడు.

'తెలీదు. అది తెలిస్తే నేనిలా ఎందుకుంటాను. అది చాలా కష్టమైన పనని మాత్రం తెలుసు. దానిని మనలో మనం చెయ్యడమే చాలా కష్టం. ఇక ఇతరులలో దానిని చెయ్యాలంటే ఎవరో శ్రీరామకృష్ణుల వంటి అవతారపురుషుల వల్ల అవుతుంది గాని మామూలు మనుషుల వల్ల కాదు.' అన్నాను.

'మరి చాలామంది స్వామీజీలు గురువులు దానిని చాలా తేలికగా చేస్తామని చెబుతున్నారు కదా. ఇంటర్ నెట్లో అన్నీ అవే.' అన్నాడు.

'అవన్నీ నమ్మకు. అదంతా బోగస్. నేను నలభై ఏళ్ళ నుంచీ చూస్తున్నాను. తన కుండలినిని నిజంగా నిద్రలేపిన స్వామీజీ గాని, గురువుగాని ఇంతవరకూ నాకు కనిపించలేదు. ఇక ఇతరులలో దానిని నిద్రలేపగలిగే మొనగాడు ప్రపంచంలో ఎక్కడా ఉండడు. నెట్లో నువ్వు చూసేదంతా గ్యాస్. నమ్మకు.' అన్నాను.

మన వాడికి నా మాటమీద నమ్మకం కుదరలేదు.

'అందరూ అబద్దాలు ఎందుకు చెబుతారు? ఎక్కడో అలాంటివాడు ఉండే ఉంటాడు. అయితే ఈ స్వామీజీలకు ఎవ్వరికీ కుండలినీ ప్రేరేపణ కలగలేదంటావా?' అన్నాడు.

'లేదనే నా ఉద్దేశ్యం. ఒకవేళ అయితే వాళ్ళలో ఆ లక్షణాలు కన్పించాలి కదా? మరి కన్పించడం లేదుగా?' అన్నాను.

'ఏమో మరి? వెదుకుదాం. ఎక్కడో ఎవడో దొరక్కపోడు' అన్నాడు.

'సరే వెతుక్కో' అన్నాను నేను.

అలా కొన్ని నెలలు గడిచాక మళ్ళీ ఒకరోజున మాటల సందర్భంలో - 'ఫలానా స్వామీజీ నీకు తెలుసా?' అడిగాడు.

'తెలుసు. ఏంటి సంగతి?' అన్నాను.

'ఆయన్ను కలుద్దామని అనుకుంటున్నాను. త్వరలో హైదరాబాద్ వస్తున్నాడు. ఫోన్లో మాట్లాడాను. ఆశ్రమానికి వస్తే దర్శనం ఇస్తానన్నాడు.' అన్నాడు.

'ఏంటీ ఆయన వలలో పడ్డావ్?' అడిగాను నవ్వుతూ.

'ఆయన దగ్గర చాలా మహిమలున్నాయట. వాళ్ళ శిష్యుడు ఒకడు ఈ మధ్యనే పరిచయం అయ్యాడు. అతను చెప్పాడు.' అన్నాడు.

'ప్రతి శిష్యుడూ తన గురువు గురించి అలాగే చెబుతాడు. అవన్నీ నమ్మకు. అదంతా మార్కెటింగ్' అన్నాను.

'లేదు. నేనతన్ని అడిగాను. 'మీ గురువుగారు కుండలినిని ప్రేరేపించగలడా?' అని. దానికతను -' కుండలిని అనేది మా గురువుగారికి చాలా చిన్నపని సార్. మీకు ఏది కావాలంటే అది సునాయాసంగా ఆయన ఇవ్వగలడు' అన్నాడు.' అని చెప్పాడు మనవాడు.

'అంత సీన్ ఆయనకు లేదని నా ఉద్దేశ్యం' అన్నాను నేను నవ్వుతూ.

'ఆయన పుస్తకాలు కొన్ని నేను చదివాను. తన పూర్వజన్మలు అన్నీ ఆయనకు తెలుసట. మన పూర్వజన్మలు కూడా చెబుతాడట. ఒక సీనియర్ IAS భక్తునితో - "పూర్వజన్మలో నువ్వే మైసూరు మహారాజావి. ఆ ప్యాలెస్ నీదే, ఆ జన్మలో నువ్వు రాజువి. మీ ఆవిడ రాణి. ఇప్పుడిలా పుట్టారు. వెళ్లి చూచుకోండి" అని ఈ స్వామీజీ చెబితే వాళ్ళు వెళ్లి మైసూరు ప్యాలెస్ చూచుకొని వచ్చారు.' అన్నాడు.

'ఇంకా నయం! ఆ స్వామీజీ మాటలు నమ్మి 'ఇది మా ఇల్లే ! అంటూ అక్కడే తిష్ట వేసుకుని కూచోలేదు. సంతోషం ! అలాంటి వాడు IAS గా సెలక్ట్ అవ్వడం ఉంది చూశావూ అదే ఈ దేశపు గొప్పదనం' - అన్నాను మళ్ళీ నవ్వుతూ.

'రెండు వేల సంవత్సరాల క్రితం తను ఎక్కడ పుట్టాడో కూడా ఆయన చెప్పాడు.' అన్నాడు.

'చాలా ఈజీ' అన్నాను.

'అదేంటి? అంత ఈజీ ఎలా అవుతుంది?' అడిగాడు.

'అవును. దానికి ప్రూఫ్ లేదుకదా? నేనూ చెబుతా. నాలుగు వేల ఏళ్ళ క్రితం నేనూ కృష్ణుడూ ఒకే బళ్ళో చదువుకున్నాం. కలిసి గోలీలాట ఆడుకున్నాం అని. దానికి ప్రూఫ్ ఏముంటుంది? నన్ను నమ్మేవాళ్ళు నమ్ముతారు. నమ్మని వాళ్ళు తిడతారు. తిడితే తిట్టుకోనీ. నమ్మేవాళ్లే నాతో ఉంటారుగాని నమ్మనివాళ్ళతో నాకేంటి? ఈ విధంగా మా స్వామీజీల బిజినెస్ సాగుతూ ఉంటుంది. అదంతే !' అన్నాను.

'అయితే ఈ స్వామీజీలో శక్తి లేదంటావా?' అడిగాడు అనుమానంగా.

'ఈ వయసులో ఇంకా శక్తి ఏం ఉంటుందిలే?' అన్నాను నవ్వుతూ.

'నేనడిగేది అది కాదు. నీకన్నీ జోకులే. స్పిరిట్యువల్ గా శక్తి లేదంటావా?' అడిగాడు.

'దివ్యశక్తి సంగతి డౌటేగాని, ఏదో ఒక క్షుద్రశక్తి అయితే తప్పకుండా ఉండే ఉంటుంది.' అన్నాను.

మా ఫ్రెండ్ నా మాటల్ని వింటాడుగాని తనకు నేనంటే నమ్మకం తక్కువ. మనకు కాషాయవస్త్రాలూ, శిష్యబృందమూ లేవుకదా మరి !

'ఏమో నేను స్వయంగా వెళ్లి చూస్తేగాని నీ మాటలను నమ్మలేను.' అన్నాడు.

'అలాగే కానీయ్' అన్నాను.

తర్వాత కొన్నాళ్ళకి ఒకరోజు రాత్రి ఎనిమిదిన్నరకి మళ్ళీ మావాడినుంచి ఫోనొచ్చింది.

ఫోనెత్తుతూనే - 'పోయొచ్చా ఆశ్రమానికి. ఇప్పుడే ఇంట్లోకి వస్తున్నా. ఫస్ట్ ఫోన్ నీకే.' అన్నాడు.

'చెప్పు విశేషాలు' అన్నాను.

'ఏముంది? ఏదో మామూలుగా అక్కడకు వెళ్ళా. అక్కడ దృశ్యం చూస్తే మతిపోయింది. తిరుమలలో ఉన్నంత క్యూ ఉందక్కడ.' అన్నాడు.

'మనుషులదా గొర్రెలదా?' అడిగాను.

'మనుషుల్లాంటి గొర్రెలది' అన్నాడు తనూ నవ్వుతూ.

'మరేమనుకున్నావ్? లోకంలో ఉన్న అజ్ఞానమంతా ఆ క్యూలోనే నీకు కన్పించి ఉండాలే? అప్పుడేమైంది?' అన్నాను.

'ఏం లేదు. ఆ క్యూలో నిల్చుంటే మనకు తెల్లారేలా ఉందని, నా కార్డ్ అక్కడ వాళ్లకు ఇప్పించా మా డ్రైవర్ చేత. వెంటనే అందర్నీ ఆపి నన్ను లోపలకు తీసికెళ్ళి సరాసరి స్వామీజీ ముందు నిలబెట్టారు' అన్నాడు.

'అదేమరి పవరంటే ! నువ్వేమో ప్రభుత్వంలో ఉన్నతాధికారివి. నీతో వాళ్లకు ముందుముందు చాలా పనులుంటాయి కదా! అందుకే నీకా స్పెషల్ ట్రీట్మెంట్. ఏమడిగావ్ స్వామీజీని?' అన్నాను.

'అదే ! పరిచయాలయ్యాక, కుండలిని గురించి అడిగాను. "అది తర్వాత చూద్దాం ముందు మంత్రం చెయ్యండి. మీ ఇష్టదైవం ఎవరు?" అని ఆయన అడిగాడు.

"ఇంతకుముందు చాలామంది ఉండేవారు. ప్రస్తుతం మాత్రం లలితాదేవిని ధ్యానిస్తున్నాను." అని చెప్పాను.

వెంటనే ఆయన పక్కనే ఉన్న మాతాజీ వైపు తిరిగి, ఏదో మంత్రం ఆశువుగా చెప్పేశాడు. ఆమె ఒక కాయితం మీద దాన్ని వ్రాసి నా చేతిలో పెట్టింది. 'దీన్ని జపం చెయ్యండి. కుండలిని సంగతి తర్వాత చూద్దామని అన్నాడు స్వామీజీ.' - చెప్పాడు మా ఫ్రెండ్.

'మధ్యలో ఈ మాతాజీ ఎవరు?' అడిగాను ఆశ్చర్యంగా.

'ఆయన ప్రధాన శిష్యురాలట. డాక్టరుగా మంచి ప్రాక్టీసు వదిలేసి ఈయన శిష్యురాలై సన్యాసం స్వీకరించిందట. పెన్నూ కాయితాల కట్టా తీసుకుని ఆయన పక్కనే కూచుని ఉంది. ఈయన మంత్రం చెప్పడం ఆమె వ్రాసి భక్తులకు ఇవ్వడం చకచకా జరిగిపోతున్నాయి.' అన్నాడు.

'ఆమె పేరు లలితా మాతాజీనా?' అడిగా నవ్వుతూ.

'కాదు. వేరే ఏదో పేరు చెప్పింది' అన్నాడు.

'అలాగా? ఇంతకు ముందు రోగులకు ప్రిస్క్రిప్షన్ వ్రాసేది. ఇప్పుడు మంత్రాలు వ్రాస్తోందా? మంచిదేలే. ఇదికూడా ఒకరకమైన ట్రీట్మెంటే. అది మెడికల్ ట్రీట్మెంటు. ఇది స్పిరిట్యువల్ ట్రీట్మెంట్. అయినా అదేంటి? మంత్రాలు కాయితాల మీద వ్రాసి ఇస్తున్నారా? ఉపదేశమంటే అదా? అలా చేస్తే అదేం ఉపదేశం అవుతుంది?' అన్నాను ఆశ్చర్యంగా.

'నువ్వెక్కడో ఇంకా రాతియుగంలో పూర్వజన్మ స్మృతులలో ఉన్నావ్ లాగుంది. ప్రపంచం చాలా ముందుకెళ్ళిపోతోంది. ప్రస్తుతం అంతా హైటెక్ నడుస్తోంది. అందుకే ఉపదేశాలు కూడా ఇలా హైటెక్ లో అయిపోతున్నాయ్ ' అన్నాడు.

'మరింకేం? నీ కుండలిని కూడా నెట్లోనే ప్రేరేపించబడుతుందేమో యూట్యూబ్ లో ప్రయత్నించలేదా?' అడిగాను నవ్వుతూ.

'అదెలా కుదురుతుంది? జోకులెయ్యకు' అన్నాడు.

'అయితే చివరకు నీ కుండలిని ప్రేరేపణ కలగానే మిగిలిపోయిందన్న మాట! నువ్వొక దానికోసం వెళితే ఆయన ఇంకొకటి అంటగట్టి పంపాడన్నమాట. ఇదంతా చిల్లరకొట్టు బేరంలా ఉంది. అసలు ఆ స్వామీజీకైనా అయిందా కుండలినీ ప్రేరేపణ?' అడిగాను నవ్వుతూ.

'ఏమో మరి? తెలీదు. కాకపోతే అంత గొప్పవాడు ఎలా అవుతాడు?' అన్నాడు మావాడు ఆలోచనగా.

'గొప్పవాడిని మీరు చేశారా? ఆయన అయ్యాడా?' అడిగాను కుతూహలంగా.

'ఏమోలే అదంతా నాకెందుకు గాని? ఆయనిచ్చిన మంత్రం రోజుకు పదివేలసార్లు జపించడమే ప్రస్తుతం నా కర్తవ్యం' అన్నాడు.

'అలాచేస్తే కుండలిని లేస్తుందని చెప్పాడా ఆయన?' అన్నాను.

'అవును. అన్నీ మంత్రబలంతోనే జరుగుతాయని, మంత్రాలతో అన్నీ సాధ్యమే అనీ ఆయనన్నాడు.'

'సరే నీ ఓపిక. చేసుకో. ఒక సంగతి చెప్పు. అక్కడ క్యూలో ఉన్నవారిలో నిజమైన ఆధ్యాత్మికత కోసం వచ్చినవాళ్ళు ఎవరైనా ఉన్నారా అసలు?' అలా ఉండరని నాకు ముందే తెలిసినా అడిగాను.

'ఎవ్వరూ లేరు. నేను కొంతమందికి కదిలించాను. మీరెందుకొచ్చారు? అని. ఒకాయనకేదో తీరని రోగం ఉందట. బహుశా ఎయిడ్స్ ఏమో తెలీదు. స్వామీజీ తన మంత్రశక్తితో దాన్ని తగ్గిస్తాడని ఆ భక్తుడు వచ్చాడట.' అన్నాడు.

'అవును. మాతాజీ డాక్టరేగా. ఆమెదగ్గర మెడికల్ ట్రీట్మెంట్ కోసం వచ్చుంటాడు. రోగంతో బాధపడేవాడికి మంత్రదీక్ష ఎందుకు? దానికోసం వచ్చుండడు. నువ్వు సరిగ్గా వినలేదేమో?' అన్నాను.

'లేదు. నేను సరిగానే విన్నాను. క్యూలో ఉన్న ఒకాయన, జగిత్యాలలో చాలా సీరియస్ కండిషన్లో ఉన్న ఒక పేషంట్ ను అర్జెంట్ గా అంబులెన్స్ లో స్వామీజీ దగ్గరకు తెమ్మని ఫోన్లో వాళ్ళవాళ్ళతో చెబుతూ ఉండగా నేను విన్నాను. అందరూ రకరకాల పనులు కావడంకోసం వచ్చినవాళ్ళే. వాళ్ళలో ఆధ్యాత్మికం ఎక్కడా లేదు. ఇంకోటి చెప్పనా? స్వామీజీ ముందు ఒక పెద్ద పళ్ళెం ఉంది. క్యూలో వస్తున్నవాళ్ళంతా ఆ పళ్ళెంలో డబ్బులేస్తున్నారు. అందులో అన్నీ రెండువేలు, ఐదొందల నోట్లే ఉన్నాయి. ఎవరైనా వందనోటు వేస్తే వెంటనే అక్కడున్న అసిస్టెంట్ ఆ వందనోటు లోపల దాచేస్తోంది.' అన్నాడు.

'అవున్లే ! ప్రస్తుతం మార్కెట్లో వంద నోట్లు దొరకడం లేదు కదా? అందుకని "సమాజ శ్రేయస్సు" కోసం వెంటనే దాన్ని తీసి మార్కెట్ సర్కులేషన్ లోకి పంపిస్తోందన్న మాట' అన్నాను.

'అది కాదు. ఆ పళ్ళెంలో వంద నోటు కన్పిస్తే క్యూలో వెనక వచ్చేవాడు కూడా వందే వేస్తాడు కదా? అలా కాకుండా అన్నీ పెద్ద నోట్లే ఉంచితే ఆ వెనుక వాడు కూడా పెద్ద నోట్లే వేస్తాడన్నది మార్కెటింగ్ రహస్యం' అన్నాడు తను.

'మరి నువ్వేం చేశావ్? ఆ పళ్ళెంలో ఉన్న రెండువేల నోట్లు ఒక పది జేబులో వేసుకుని రాకపోయావా? మంది సొమ్మేగదా? పళ్ళెంలో పదివేలు తగ్గితే స్వామీజీ నష్టపోయేది ఏముంటుంది?' అన్నా నేను నవ్వుతూ.

'అదే చేద్దామని ముందు అనుకున్నా. మళ్ళీ అలా చేస్తే మన స్టేటస్ కి బాగోదని చెయ్యలేదు' అన్నాడు తనూ నవ్వుతూ.

'మరి నీ కుండలిని సంగతేంటి?' అడిగాను.

'ఏమో? ఆయన చెప్పినట్లు చేస్తాను. అయితే అవుతుంది. లేకపోతే లేదు. అవ్వకపోతే మళ్ళీ ఇంకో గురువును నెట్లో వెదుకుతా' అన్నాడు.

'అలా కాదు. ఒకవేళ స్వామీజీ ఫెయిలయితే, నెక్స్ట్ మాతాజీ దగ్గర ఉపదేశం తీసుకో. అప్పుడు నీ కుండలినిలో కదలిక తప్పకుండా వస్తుందని నా నమ్మకం.' అన్నాను సీరియస్ గా.

'ఏమో తెలీదు. అయినా స్వామీజీ దగ్గర లేని పవర్ మాతాజీ దగ్గర ఉందంటావా?' అడిగాడు అనుమానంగా.

'ఏమో? ప్రయత్నించు. అయితే కుండలినిలో కదలిక వస్తుంది. లేకుంటే నీకు యూట్యూబ్ ఎలాగూ ఉండనే ఉంది. గుడ్ లక్' అన్నా.

తనకు కొంచం విసుగొచ్చింది.

'ఇదంతా ఎందుకు? అసలు నువ్వే స్వామీజీగా మారచ్చుకదా ! నీకున్న నాలెడ్జినంతా ఇలా వృధా చేసుకోకపోతే?' అన్నాడు.

'దానికి టైముంది. ఒక రెండేళ్ళు ఆగు. నీ కోరిక తీరుతుంది. కానీ ఒక్క షరతు. నీ విజిటింగ్ కార్డ్ చూపిస్తే నిన్ను డైరెక్ట్ గా నా దగ్గరకు రానివ్వను. నువ్వెంత ఉన్నతాధికారివైనా సరే, నా దగ్గర క్యూలో బుద్ధిగా రావాల్సిందే.' అన్నాను.

'ఎందుకు? నేను నీ పక్కనే కూచుని నువ్వు చెప్పే మంత్రాలను ప్రిస్క్రిప్షన్ వ్రాస్తాను. ఆపనిని నాకివ్వు.' అన్నాడు.

'నేనలా చెయ్యను. మన విధానాలు డిఫరెంట్ గా ఉంటాయి. పనుల కోసం వచ్చేవారిని నేనసలు దగ్గరకే రానివ్వను. నీకు తెలుసుగా మన సంగతి?' అడిగాను నవ్వుతూ.

'అలా అయితే నీదగ్గరకెవరొస్తారు? నీ దగ్గర అస్సలు క్యూనే ఉండదు. తాపీగా నడుచుకుంటూ స్ట్రెయిట్ గా నీ దగ్గరకు రావచ్చు. పోనీలే నాకు ప్రిస్క్రిప్షన్ రాసే పని తప్పింది.' అన్నాడు నవ్వుతూ.

'పనులకోసం వచ్చేవాళ్ళు నాకెందుకు? నిజమైన తత్త్వచింతన ఉండి, ఆధ్యాత్మికంగా నిజంగా ఎదగాలని చూచేవాళ్ళు నాదగ్గరుంటారు. అయినా నిన్ను నా అసిస్టెంట్ గా ఎందుకు పెట్టుకుంటాను? ఎవరైనా మంచి లేడీడాక్టర్ని చూచి పెట్టుకుంటాగాని?' అన్నా నేనూ నవ్వుతూ.

'తెలుసు. అందుకే నా బాధ ! ఇలా లేట్ చేస్తూ ఉంటే నువ్వెప్పుడు ఎదుగుతావో ఏంటో? త్వరగా నీ అవతారం మార్చు. అంతవరకూ నేనీ స్వామీజీ చెప్పిన మంత్రాన్ని జపిస్తూ ఉంటా. సరేమరి. జపానికి టైమౌతోంది. జై కుండలినీ !' అంటూ తను ఫోన్ పెట్టేశాడు.