“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

26, సెప్టెంబర్ 2015, శనివారం

రేపే చంద్రగ్రహణం + సూపర్ మూన్

27-9-2015 ఆదివారం నాడు చంద్రగ్రహణం + సూపర్ మూన్ కలిసి రాబోతున్నాయి.దీనినే 'బ్లడ్ మూన్' అని కూడా అంటున్నారు.నాసావారి లెక్కల ప్రకారం ఈ దృశ్యం అమెరికా సంయుక్త రాష్ట్రాలు, యూరప్, ఆఫ్రికా, పశ్చిమ ఆశియా, తూర్పు ఫసిఫిక్ తీరాలలో కనిపిస్తుంది.అంటే దీని ఫలితాలు కూడా ఈ దేశాలలో ఎక్కువగా ఉండబోతున్నాయి.

భూమిచుట్టూ చంద్రుని కక్ష్య సరిగ్గా ఒక వృత్తం లాగా ఉండదు.అది దీర్ఘవృత్త కక్ష్యలాగా ఉంటుంది.కనుక చంద్రుడు ఎల్లప్పుడూ భూమికి సమానమైన దూరంలోనే ఉండడు.తన పయనంలో చంద్రుడు కొన్నిసార్లు భూమికి దూరంగా పోతాడు.కొన్నిసార్లు దగ్గరగా వస్తాడు.అలా దగ్గరగా రావడాన్నే ఖగోళ పరిభాషలో 'Perigee' అంటారు.అమావాస్య చంద్రుడు గానీ పౌర్ణమి చంద్రుడు గానీ అలా భూమికి దగ్గరగా రావడాన్నే "సూపర్ మూన్" అంటారు. సూపర్ మూన్ వచ్చినప్పుడు చంద్రుడు మామూలు కంటే చాలా పెద్దగా చాలా ప్రకాశవంతంగా కనిపిస్తాడు. ఇది గతంలో 1982 లో జరిగింది.33 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఇప్పుడు జరుగుతున్నది.

ఖగోళ శాస్త్రవేత్తలు మానవ జీవితం పైన గ్రహాల ప్రభావాన్ని ఒప్పుకోరు.కానీ జ్యోతిష్య శాస్త్రవేత్తలు అది ఉన్నదని అంటారు.దానికి నిదర్శనాలు కూడా నిజంగా జరుగుతూనే ఉంటాయి.ఆ కోణంలో గమనిస్తే అవి అర్ధమౌతాయి.

అమావాస్యకూ పౌర్ణమికీ భూమిపైన విలయాలు జరగడం మామూలే.కానీ ఈ సూపర్ మూన్ సమయంలో ఇంకా ఎక్కువగా అంటే 'లార్జ్ స్కేల్' లో జరుగుతాయి.ఎందుకంటే ఈ సమయంలో చంద్రుని కిరణాలు ఎక్కువ శక్తితో భూమిని తాకుతాయి.మనుష్యులను చాలా తీవ్రంగా ప్రభావితం చేస్తాయి.

ఈసారి సూపర్ మూన్ ను 'బ్లడ్ మూన్' అంటున్నారు.దానికి నిదర్శనంగా మూడురోజుల ముందే మక్కాలో రక్తపాతం జరిగిందా లేదా మరి?

నిన్నగాక మొన్న మక్కాలో జరిగిన తొక్కిసలాటలో 750+ మంది చనిపోవడం ఖచ్చితంగా ఈ పౌర్ణమి+సూపర్ మూన్+బ్లడ్ మూన్ ఫలితమే. ఇస్లాం చంద్రగమనాన్ని అనుసరిస్తుంది కనుక చంద్రుని ప్రభావం వారిమీద చాలా ఎక్కువగా ఉంటుంది.

ఈ దుర్ఘటన పౌర్ణమికి నాలుగు రోజుల ముందే జరిగిందన్నది వాస్తవం.రోహిణీ శకట భేదన కాలంలో మనం ఉన్నామన్న విషయం గుర్తుంటే ఇంత పెద్ద ఎత్తున జననష్టం ఎందుకు జరుగుతున్నదో అర్ధం అవుతుంది.ఈ సమయంలో  ఇవన్నీ జరుగుతాయని గత ఏడాదే వ్రాశాను.

ఈ సూపర్ మూన్ వల్ల వచ్చే వారంరోజులలో ఇంకా ఎన్నో నష్టాలు మానవజీవితంలో జరుగుతాయి.ముఖ్యంగా వాహన ప్రమాదాలు, పిక్నిక్కులు విహారయాత్రలలో దుర్ఘటనలు జరుగుతాయి.జలప్రమాదాలు జరుగుతాయి.అంటే ఈతలకు వెళ్లి చనిపోవడం,పడవ ప్రమాదాలు మొదలైనవి ఉంటాయి.ముఖ్యంగా జనం ఎక్కువగా ఎక్కడైతే గుమిగూడతారో అక్కడ ఈ ప్రమాదాలు జరుగుతాయి.అందుకే ఈ వారం రోజులూ విహారయాత్రలు,సాహసకార్యాలు పనికిరావన్న సంగతి గమనించాలి.

మీనరాశి ఉత్తరానికీ,చంద్రుడు వాయవ్యానికీ, కేతువు ఈశాన్యానికీ సూచకులు గనుక భూమిపైన ఉత్తర వాయవ్యం మరియు ఉత్తర ఈశాన్యాది ప్రాంతాలలో దీని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

దీని ఫలితంగా ఈ క్రింది ప్రభావాలు మనుషులలో కనిపిస్తాయి.

>మనసు తిక్కతిక్కగా ఉండటం.
>చిన్న చిన్న విషయాలకు కూడా అతిగా ఆవేశ పడటం
>అనవసరమైన మాటలు చేష్టలవల్ల తగాదాలు గొడవలు జరగడం
>కుటుంబ సభ్యుల మధ్యన మాటలు చిలికి చిలికి గాలివానగా మారి గొడవలు పెరగడం
>ఇంట్లో స్థిమితంగా ఉండలేక ఎటన్నా బయటకు పోయి తిరుగుదామని అనిపించడం
>ఏం చెయ్యాలో తెలియని అసహనంగా చికాకుగా ఉండటం
>హటాత్తుగా తలనొప్పి, బీపీ పెరగడం మొదలైన లక్షణాలు
>హిస్టీరియా, పిచ్చి,మానసిక రోగాలు ఉన్న వారిలో అవి ఉన్నట్టుండి ఎక్కువ కావడం
>ఆటిజం పిల్లలలో విపరీత ప్రవర్తన ఎక్కువ కావడం
>పాత నొప్పులు పాత రోగాలు తిరగబెట్టడం
>గుండె జబ్బులున్న వాళ్లకు రోగం ఎక్కువై,ముఖ్యంగా అర్ధరాత్రి నుంచి తెల్లవారు ఝాము లోపల సీరియస్ కావచ్చు.

ఈ లక్షణాలు చాలామందిలో గమనించుకోవచ్చు.

అయితే ఇందులో ఒక ఆధ్యాత్మిక కోణం కూడా ఉన్నది.చంద్ర కేతు యురేనస్ ల సంయోగం మీనరాశిలో జరుగబోతున్నది.వీరి కోణదృష్టి కర్కాటకంలో ఉన్న శుక్రుని మీద ఉన్నది.కనుక మంత్ర - తంత్ర - యోగసాధకులైనవారు సాత్వికాహారం తీసుకుంటూ శని,ఆదివారాలను పూర్తిగా ఆధ్యాత్మిక సాధనలో గడిపితే వారికి చాలా మంచిమంచి అలౌకిక అనుభవాలు కలుగుతాయి.

ముఖ్యంగా నా దగ్గర దీక్ష తీసుకున్న 1 level, 2nd level సాధకులు రేపు ఆదివారం రోజున గట్టిగా సాధన చెయ్యండి.ఆశ్చర్యకర ఫలితాలు ఉంటాయో లేవో మీ స్వానుభవంలో మీరే చూడండి.