“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

16, ఆగస్టు 2009, ఆదివారం

స్వైన్ ఫ్లూ తో కూడా దోపిడీ యేనా?

నేను జూన్ 9 తేదీన స్వైన్ ఫ్లూ గురించి వ్రాశాను. రెండు నెలల తరువాత ఇప్పుడు గగ్గోలు మొదలైంది. అంటు వ్యాధిప్రమాద కరమైనదే. కాని దీన్ని బూతద్దంలో చూపిస్తూ ప్రజల భయ భ్రాంతులను ఆధారంగా చేసుకొని లక్షలలో అప్పుడేవ్యాపారాలు జరిగిపోతున్నాయి.

ప్రసార మాధ్యమాలు వాటికి సహజమైన రీతిలో గోరంతలు కొండంతలు చేసి చూపిస్తూ, ప్రజలలో సమాచారాన్ని, జాగరూకతను పెంచుతూ వాటిలో భాగంగా భయ భ్రాంతులను కూడా పెంచుతున్నాయి. నిన్న పని మీద తిరుపతిలోఉన్నాను. అసలే పుణ్య క్షేత్రం యాత్రా స్థలం. కృష్ణ జన్మాష్టమి, స్వాతంత్ర దినోత్సవం, ఆదివారం సెలవలు కలిశి రావటంతో
జనం విపరీతంగా ఉన్నారు. చాలా మంది మాస్కులు ధరించి కనిపించారు.

ప్రజలలో జాగరూకత ఎంత ఉందొ చూద్దామని పరిశీలిస్తూ నగరంలో కొన్ని మైళ్ళు నడిచాను. రోడ్ల పక్కన చిన్న చిన్నవ్యాపారాలు చేసుకునే స్థానికులు దీనిని పెద్దగా పట్టించుకోవటం లేదు. వారెవరూ మాస్కులు ధరించి లేరు. యాత్రికులేభయం భయం గా ఉన్నారు. ఇంతలొ ఒక వింత సంఘటన జరిగి నవ్వు తెప్పించింది. గుంపులుగా జనం ఉన్న ఒక చోట, దారిన పోతున్న ఒక వ్యక్తి బహుశా వాహనాల పొగ వల్లో లేక డస్ట్ అలెర్జీ వల్లో, నాలుగైదు తుమ్ములు వరుసగాతుమ్మాడు. అంతే. చుట్టూ ఉన్న జనం అతన్ని ఒక ఏయిడ్సు రోగిని చూచినట్లు చూస్తూ భయం భయం గా దూరం జరిగారు. ఆడాళ్ళు అయితే చీర కొంగులతో ముక్కులు కప్పుకుని భయం గా చూస్తున్నారు . నాకు నవ్వాగలేదు.

వినటానికి వింతగా ఉండవచ్చు. కాని కడప, అనంతపురం, కర్నూలు జిల్లాలలో గత రెండు రోజులుగా నీలగిరి తైలంసీసాలు కొన్ని లక్షలు అమ్ముడు పోయాయి. 5 రూపాయలు ఉండే సీసా ఒక్క సారి 15 రూపాయలై కూచుంది. ఇంతకంటే ఇంకో వింత జరుగుతున్నది. పాపం పల్లెటూరి జనాలు అజ్ఞానులు. టీవీలు చూచి భయ పడుతున్నారు అనుకుందాం. హైదరాబాదు లాటి సిటీలో కూడా కొందరు హోమియో మందులు విచ్చల విడిగా వాడమని అమ్ముతూప్రజలలో భయాన్ని సృష్టించటమే కాక ప్రజారోగ్యాన్ని తీవ్రం గా దెబ్బ తీస్తున్నారు. కాదేదీ దోపిడీకి అనర్హం అని నాకు అనిపించింది.

"Influenzinum" అనే నోసోడ్ ను రోజుకు మూడు మాత్రల చొప్పున వారం రోజులు వరుసగా వాడమని చెప్పి వాడిస్తు ప్రజల ఆరోగ్యాలతో చెలగాటం ఆడుతున్నారు. నోసోడ్ లు అనేవి వ్యాధికారక పదార్థాల నుండి తీసే మందులు. ఫ్లూవ్యాధితో బాధ పడుతున్న వ్యక్తి ముక్కు నుండి కారే స్రావాన్ని పోటేన్సీ లోకి మార్చి తయారు చేసేదే పైన చెప్పిన మందు. దానిని ఇలా రోజుకు మూడు డోసు లు చొప్పున వరుసగా వారం రోజులు వాడితే, స్వైన్ ఫ్లూ నుంచి రక్షించటం మాట అటుంచి, అసలు ఫ్లూ లక్షణాలను శరీరంలో కలిగిస్తుంది. దీనినే రేమేడీ ప్రూవింగ్ అంటారు. అప్పుడు ఆ బాధలు తగ్గటానికి మళ్ళీ ఒక విరుగుడు (anti dote) ను మళ్ళీ ఇవ్వ వలసి వస్తుంది .ఈ మందును విధంగాఎన్నటికీ వాడ కూడదు.

కాని చాలా మంది మెడికల్ షాపు వాళ్లు చెప్పి మరీ వాడిస్తున్నారు. నోసోడ్లు సాధారణంగా వాడకూడదు. మామూలుమందులు పనిచెయ్యని స్థితిలోనే వీటిని వాడాలి. కాని జనాల భయాన్ని ఆధారం గా తీసుకొని విచ్చల విడిగావాడిస్తున్నారు. దీనివల్ల మనిషి శరీరంలో దీర్ఘకాలిక తీవ్ర మార్పులు వస్తాయి. గమనించండి. కొండ నాలికకు మందిస్తేఉన్న నాలిక ఊడింది అన్నట్లు జరుగుతుంది. కాబట్టి నోసోడ్ లను ఇష్టానుసారం వాడకండి.

హోమియో ఔషధాలను చాలా జాగ్రత్తగా వాడాలి. కనుక తెలిసీ తెలియక వాడటం కంటే, తులసి, అశ్వగంధ, తిప్ప తీగ(అమృత లత) వంటి ఆయుర్వేద మందులు వాడటం మంచిది. ఎందుకంటే వీటి వాడకం వల్ల శరీరంలో సైడ్ ఎఫ్ఫెక్ట్స్ఉండవు. కాని హోమియో ఔషధాలు వైద్యుని పర్యవేక్షణ లేకుండా చాలా రోజులు వాడితే శరీరంలో కొత్త రోగాలు పుట్టేప్రమాదం ఉంది. సైడ్ ఎఫ్ఫెక్ట్ లు తీవ్రం గా వచ్చే అవకాసంఉంది.
హోమియో మందులతో సైడ్ ఎఫ్ఫెక్ట్స్ రావు అనేది చాలా తప్పు భావన. ఇవి జీన్ లెవెల్ లో పని చేసే పోటేన్సీలు. తెలిసీ తెలియక రోజూ వాడితే తీవ్రమైన సైడ్ ఎఫ్ఫెక్ట్స్ శరీరంలో తీసుకు వస్తాయి. వాటిని పోగొట్టటం చాలా కష్టం అవుతుంది. కనుక తస్మాత్ జాగ్రత్త.