“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, ఆగస్టు 2009, శుక్రవారం

గీతా శ్లోకానికి యోగపరమైన వివరణ

క్రిందటి భాగంలో ఈ శ్లోకానికి వేదాంత పరమైన అర్థం తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ శ్లోకానికి యోగపరమైన అర్థం తెలుసుకుందాం.

శ్లోకం||బుద్ధి యుక్తో జహాతీహ/ఉభే సుకృత దుష్క్రుతౌ/
తస్మాద్ యోగయా యుజ్యస్వ/యోగః కర్మసు కౌశలం||

సుకృత దుష్క్రుతములనగా మంచి చెడు కర్మలు అని మనకు తెలుసు. కాని యోగ పరంగా చూస్తె ఈ మంచి చెడు కర్మలు వేరు. మామూలుగా మనం అనుకునే కర్మలు కావు. యోగపరంగా కర్మ అనగా శరీరంలో ప్రాణ సంచారం. యోగపరమైన అర్థం చెప్పేటపుడు సామాన్యార్థం వర్తించదు.

ఇడా పింగళా సుషుమ్నా నాడులు యోగమున సుప్రసిద్ధములు. కుండలినీ యోగములో, స్వర శాస్త్రములో వీటి వినియోగం ఉంటుంది. ఇడా నాడి చంద్ర నాడి, అనగా చల్లని ప్రభావం కలిగినట్టిది. ఇడా నాడినుంచి ప్రాణ సంచారం జరిగే టపుడు జరిగేది సౌమ్య కర్మ. దీనికే మంచి కర్మ అనిపేరు .

పింగలా నాడి సూర్య నాడి, అనగా ఉష్ణ తత్త్వం కలిగినట్టిది. పింగలా నాడినుంచి ప్రాణ సంచారం జరిగేటపుడు మనుష్యులు చేసేది క్రూర కర్మ. దీనికే చెడుకర్మ అని ఇంకొక పేరు. మనుష్యులకు ఎప్పుడూ ప్రాణ సంచారం ఈ రెండు నాడులలో ఏదో ఒక నాడి గుండా ప్రధానం గా జరుగుతుంది. కనుక వారు మంచిచెడూ కర్మలు చేస్తూ కర్మ బద్ధులై ఉంటారు.

కాని రెండింటియందు సమంగా ప్రాణసంచారం జరిగే సమయాలు కొన్ని ఉంటాయి. అప్పుడు సుషుమ్నా నాడిమేలుకొంటుంది. అటువంటి సమయంలో మానవుడు చేసే కర్మలు దగ్ద కర్మలుఅంటారు. అనగా అవి ఫలితాన్ని ఇవ్వవు. ఈ సుషుమ్నా సంచారం జరిగే సమయం ఒక్క ధ్యానానికి మాత్రమె అనుకూలం గా ఉంటుంది.

అటువంటిసమయంలో ధ్యానానికి కూర్చుంటే మనస్సు తేలికగా ఏకాగ్రమై భ్రూ మధ్యంలోకుదురుకుంటుంది. ఈ భ్రూ మద్యం బుద్ధి స్థానం. కనుక మనస్సు బుద్ధి స్థానమైన త్రికుటిలో ఏకాగ్రం అయినపుడు, మంచి చెడు కర్మలకు ప్రతిరూపాలైన ఇడా పింగలానాడుల ప్రవాహం అధిగమించబడి, సుషుమ్నలో ప్రాణ సంచారం కుదురుగాజరుగుతుంది.

ఇది గాక సూక్ష్మ సుషుమ్నా ప్రవాహం అని ఇంకొకటి కూడా ఉంది. అప్పుడు దాదాపు శ్వాస ఆగిపోతుంది. సుషుమ్నా నాడి మేలుకోనటమే మంచీ చెడు కర్మలను దాటి పోవుట. ఇదే ప్రాణాయామంలో కుశల కర్మ అన బడుతుంది. ఇట్టి స్థితిలో ఉన్నంత వరకు కర్మాతీత స్థితిలో మనిషి ఉండగలుగుతాడు. భగవంతుడు ఇట్టి కుశల కర్మను చెయ్యమని మానవునికి ఉద్బోధ చేస్తున్నాడు.

ఈస్థితిలో మనస్సు అత్యంత ప్రశాంతం అవుతుంది, నాడి మందగిస్తుంది, గుండెకొట్టుకునే వేగం చాలా వరకు తగ్గుతుంది. శరీర స్పృహ చాలా తక్కువగా, అంటే ఒకభావనా మాత్రంగా ఉంటుంది. మానసిక ఆలోచనలు పూర్తిగా ఆగిపోతాయి. ప్రాణసంచారం శరీరం నుంచి తిరోహితమై వీణా దండం అనబడే వెన్నెముకలోని సుషుమ్నా నాడిలో మాత్రమె జరుగుతూ ఉంటుంది. ఇది అకర్మ స్థితి.

అంటేమనస్సులోని ఆలోచనలే గాక, శరీరం లోని ప్రాణ వ్యవస్థ కూడా విశ్రాంత స్థితిలోకివస్తుంది. ఇట్టి స్థితిలో పది నిమిషాలు ఉండగలిగితే ఎనిమిది గంటలు గాఢ నిద్రపోయినంత విశ్రాంతి అనుభవంలోకి వస్తుంది. తరువాత నిద్ర రమ్మన్నా రాదు. కాని అలసట ఉండదు. ఈ కోణంలో కుశల కర్మ అనగా ఇడా పింగలా నాడుల నుంచి ప్రాణసంచారం తిరోహితం చేసి దానిని సుషుమ్నాన్తర్గతం చేసి భ్రూ మధ్య స్థితిలోనిలకడగా ఉంచగలిగే సామర్ధ్యం.

ఇట్టి కుశల కర్మ చెయ్య గలగటమే యోగం. దీనివల్ల యోగి మంచి చెడులను అధిగమించి ఆత్మ స్థితిలో కుదురుగా ఉండగలుగుతాడు. అట్టి వాడు పుణ్య పాపాలకు అతీతుడు అవుతాడు. ఎందుకంటే ఆత్మ పాప పుణ్యాలకు అతీతమైనది. కనుక ఆత్మ స్థితిలో ఉన్నవాడుకూడా కర్మాతీతుడు అవుతాడు. శుద్ధ బుద్ధి మరియు శుద్ధ ఆత్మ ఒక్కటే అని శ్రీ రామక్రుష్ణులంటారు.

మనస్సులో ఆలోచనలు ఆగిపోయి, శరీరంలో ప్రాణ సంచారం నామ మాత్రం గా ఉన్నపుడు, శుద్ధ బుద్ధి మేలుకొంటుంది. అనగా బుద్ధి స్థాయి అనుభవంలోకి వస్తుంది. ఆ శుద్ధ మైన బుద్ధిలో ఆత్మ జ్యోతి ప్రకాశం దర్శనం ఇస్తుంది. ఇది కర్మాతీతం కనుక ఇట్టి స్థితిలో నిలకడగా ఉన్నటువంటి యోగి ఆత్మానుభావంలో మునిగి కర్మాతీత స్థితిలో ఉండగలుగుతాడు.

కనుక యోగ పరంగా చూచినపుడు,
జహాతీహ ఉభే సుకృత దుష్క్రుతౌ= ఇక్కడనే ఇడా పింగలా నాడులను అధిగమించి,
బుద్ధియుక్తో= బుద్ధి స్థానమగు భ్రూ మధ్యమున స్థితుడవై,
తస్మాద్ యోగయా యుజ్యస్వ= ఈ విధమగు యోగమును చెయ్యి,
యోగః కర్మసు కౌశలం= ఇదే కుశల కర్మ, ఇదే యోగం.
అనే నిగూఢమైన అర్థం ఈ శ్లోకంలో ఉంది.

ఈ స్థితిలో హృదయంలో ఉన్న కామములు అన్నీ శమిస్తాయి. రాగ ద్వేషాలనే బంధాలు విడిపోతాయి. కనుక కర్మాతీత స్థితిని మానవుడు అందుకొంటాడు. శరీరం ప్రాణం పూర్తిగా విశ్రాంత స్థితిలో ఉన్నవానికి కర్మ ఎక్కడిది? ఇంద్రియ తాదాత్మ్యత లేనివాడికి కర్మ ఫలం ఎలా అంటుతుంది?

||యదా సర్వే ప్రముచ్యన్తె కామా యస్య హృది స్థితాః||
అథ మర్త్యో అమృతో భవతి యెతావద్యనుశాసనమ్|| (కఠోపనిషత్ )

||యదా సర్వే ప్రభిద్యన్తె హృదయస్యేహ గ్రంధయః||
అథ మర్త్యో అమృతో భవతి యెతావద్యనుశాసనమ్||
(కఠోపనిషత్ )