“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

2, మార్చి 2009, సోమవారం

నాడీ జ్యోతిషం- భ్రుగు సంహితలో శ్రీ రామకృష్ణుని జాతకం


ఎన్నో వేలఏళ్లనాడు వ్రాయబడిన భ్రుగుసంహితలో, పంతొమ్మిదవశతాబ్దంలో జన్మించిన అవతారమూర్తి శ్రీరామకృష్ణుని జాతకం ఉందా? అవును. ఇది ఆశ్చర్యం గొలిపే నిజం. భ్రుగుమహర్షి దివ్యదృష్టి ఎటువంటిదో దీనిని పరికిస్తే మనకు తెలుస్తూంది. చరిత్రకందని రోజులలో జ్యోతిషంవంటి శాస్త్రాలలో ఎంతటి రీసెర్చి జరిగిందో మనకు అర్థంఅవుతుంది. మనది అనుకుంటున్న జ్ఞానం ఎంతటి అల్పమో తెలుస్తూంది. అవతారమూర్తి శ్రీరామకృష్ణుని జాతకం ఇక్కడ చూడవచ్చు.

భ్రుగుసంహితలో ఈ జాతకం గురించి ఏముంది?  

శ్లో || ధర్మస్థానాధిపే తుంగే ధర్మస్తే తుంగఖేచరే 
గురుణా దృష్టిసంయోగే లగ్నేశే ధర్మసంస్థితే 
కేంద్రస్థానగతే సౌమ్యే గురౌ చైవతు కోణభే  
స్థిరలగ్నే యదాజన్మ సంప్రదాయ ప్రభుర్హి సః 
ధర్మ విన్మాననీయస్తు పుణ్యకర్మరతసదా 
దేవమందిరవాసీ బహుశిష్యసమన్వితః 
మహాపురుషసంజ్ఞోయం నారాయణాంశసంభవః 
సర్వత్ర జనపూజ్యశ్చ భవిష్యతి సంశయః 
ఇతి భ్రుగుసంహితాయాం సంప్రదాయప్రభుయోగం 
తత్ఫలం ||

తాత్పర్యం || నవమాధిపతి ఉచ్ఛస్థితిలో ఉన్నప్పుడు, నవమమున ఉచ్ఛగ్రహము కలిగి, గురుగ్రహముచే చూడబడినప్పుడు, లగ్నాధిపతి ధర్మస్థానగతుడై, బుధుడు కేంద్రమున, గురువు కోణమున ఉన్న గ్రహస్తితిలో స్థిర లగ్నమున గనుక జన్మజరిగితే, ఈజాతకుడు ఒక నూతనసంప్రదాయమునకు ప్రభువు అగును. ధర్మమూర్తియు, సదా పుణ్యకర్మరతుడు అగును. దేవతామందిరమున నివశించును. బహుశిష్యులను కలిగి ఉండును. ఆయన శరీరమున మహాపురుషసంజ్ఞలుండును (లేదా లోకులచేత మహాపురుషుడనబడును).ఈయన నారాయణుని అవతారము. సర్వత్ర జనులచే పూజించబడును. ఇది తప్పక జరుగును. సంశయము లేదు.

ధర్మస్థానాధిపే తుంగే = నవమాదిపతి అయిన శుక్రుడు మీనంలో ఉచ్ఛస్తితిలో ఉన్నాడు.

ధర్మస్తే తుంగఖేచరే = నవమస్థానంలో లగ్నాధిపతి శని ఉచ్ఛస్తితిలో ఉన్నాడు. 

గురుణా దృష్టిసంయోగే లగ్నేశేధర్మసంస్థితే = నవమ స్థానంలోఉన్న లగ్నాధిపతి శని గురువుచేత చూడబడుతూ ఉన్నాడు.

కేంద్రస్థానగతే సౌమ్యే = బుధుడు లగ్నకేంద్రంలో ఉన్నాడు.

గురౌచైవతు కోణభే = గురువు పంచమకోణస్థానంలో ఉన్నాడు. 


స్థిరలగ్నే యదాజన్మ = స్థిరలగ్నమైన కుంభం లగ్నమైంది.

ఈ ఆరుయోగాలనుబట్టి ఆయన జీవితం యొక్క దిశ మొత్తాన్నీ భ్రుగుమహర్షి చూడగలిగాడు. నేటి జ్యోతిష్కులు పేజీలకు పేజీలు  వ్రాసినా ఒక్కటీ సరిగ్గా చెప్పలేకపోతున్నారు. దీనికి కారణం నేటి జ్యోతిష్యం అంతా వ్యాపారం కావడమే. నేటి జ్యోతిష్కులలో రుషితుల్యులు ఒక్కరూ లేరు. కనుకనే అసలైన జ్యోతిష్యవిద్య వీరికి పట్టుబడటం లేదు.

అదలా ఉంచితే, భ్రుగుసంహితలో వ్రాయబడినవి తు. చ. తప్పక జరిగినట్లు శ్రీ రామకృష్ణుని జీవితం చూస్తె అర్థం అవుతుంది. కర్మ, భక్తి, జ్ఞాన, రాజయోగముల సమన్వయము, సర్వధర్మ,మత సమన్వయములను సునాయాసముగా తనజీవితములో ప్రదర్శించిచూపి ఒక నూతనసంప్రదాయమునకు ఆయన ఆద్యుడైనాడు. ఆయన జీవితం అంతా ధర్మస్థాపనమే దర్శనమిస్తుంది. ధర్మస్వరూపుడు, సదాపుణ్యకర్మరతుడు అన్న వాక్యాలు ఆయన జీవితానికి సరిగ్గా సరిపోయాయి. అందుకనే శ్రీరామకృష్ణస్తోత్రంలో  వివేకానందులు "స్థాపకాయచ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే" అన్నారు. ఆయన జీవితంలో ఎక్కువభాగం దక్షిణేశ్వరకాళీమందిరం లోనే గడిచింది. ఆయనకు వివేకానందాది బహుశిష్యగణం ఉన్నమాట లోకవిదితమే. తాను విష్ణువుయొక్క అవతారాన్నని అనేక మంది అంతరంగశిష్యులతో ఆయనే స్వయంగా చెప్పాడు. అంతరంగభక్తుడైన బలరాంబోస్ కు చతుర్భుజాలతో విష్ణువుగా దర్శనం ఇచ్చినట్లు ఆయన జీవితంలో మనం చదవవచ్చు. ఇంకా అనేకమంది భక్తుల అనుభవాలు ఈ విషయాన్ని నిరూపిస్తూ ఉన్నాయి. దేశవిదేశాలలో కోట్లాదిమంది నేడు ఆయనను భగవంతుని అవతారంగా  పూజిస్తున్నారు. 

నాడీజ్యోతిషంలోని అద్భుతాలకు  ఇది మరొక్క నిదర్శనం. భ్రుగుసంహితలో వాడబడిన విధానానికి ఇదొక మచ్చుతునక. అంశచక్రముల జోలికి పోకుండా, విపరీతమైన లెక్కలు, దశలు, గోచారాలు, కారకత్వాలు,   ఇత్యాది గందరగోళం లేకుండా, కేవలం రాశిచక్రంలోని కొన్ని యోగములద్వారా ఒకరి జీవితమంతా ఏ విధంగా తెలుసుకొనవచ్చునో  ఈ ఉదాహరణద్వారా చూడవచ్చు. ఈ ప్రాచీన రుషిప్రోక్తవిధానమును ఇప్పటి జ్యోతిష్కులు ఎవరూ అధ్యయనం చేయకపోవటం శోచనీయం.