28, నవంబర్ 2012, బుధవారం

కాలజ్ఞానం -17

మొదలు నందనమ్ము మార్గశీర్షమ్ములో   
తుదిని  జయము యాషాఢసీమ వరకు    
బాధలెన్నో రేగి తలకిందు చేసేను 
వేషాలు జనులలో హెచ్చు మీరేను 
ఎవరి గోతిని వారు తవ్వుకొబోతారు  

విప్లవం రేగేను రాజ్యాలు కూలేను 
యుద్ధాలు ముప్పులు ప్రకృతి భీభత్సాలు 
సాధారణమ్ముగా జరిగేను
ఏలికలు పయనమ్ము కట్టేరు

మార్గశిర ద్వాదశి మార్పులను తెచ్చేను 

కళ్ళు మూసినా గట్టి రుజువులగుపించేను  
పెంచుకున్నపాపమ్ము బద్దలై పగిలేను 
వికటాట్టహాసమ్ము కాళికయే చేసేను

రానున్న వత్సరమున  భూలోక స్వర్గమున 

గడ్డుకాలమ్మొకటి వచ్చేను కలి ప్రభావమ్ము చూపేను
విపరీత బుద్ధులే వెలిగేను విధ్వంసమే జూడ పెరిగేను 
మ్లేచ్చవర్గాలలో చిచ్చులే రేగేను మృత్యువే నాట్యమ్ము చేసేను  
   
విర్రవీగేవారు వెర్రివారౌతారు బుద్ధి నిలిచేవారు ఒడ్డెక్కి వస్తారు
తప్పదీ మాట తధ్యమింకను జూడ తెలివి తోడను జూచి తేటబడుము 
read more " కాలజ్ఞానం -17 "

23, నవంబర్ 2012, శుక్రవారం

కాలజ్ఞానం - 16

వాహనాలు రిపెర్లతో చికాకు పుట్టిస్తాయి
నటులకు కళాకారులకు సాహితీవేత్తలకు 
చెడుకాలంతో చుక్కెదురౌతుంది
ఒక ఆధ్యాత్మిక నేతకు గండం పొంచి ఉంది 
మేధావుల గోడు ఎవరికీ పట్టదు

అంతా తానే అని భావించే మనిషి 
తానొక అణువుననే సత్యం గ్రహించాలి
విశాల విశ్వపు కధలో తనదొక 
చిన్నపాత్ర మాత్రమేనని గుర్తించాలి


read more " కాలజ్ఞానం - 16 "

17, నవంబర్ 2012, శనివారం

మానవజీవిత గమ్యం -- వేమన పద్యం

తెలుగునాట పుట్టిన మహనీయుల్లో వేమన యోగి ఉత్తమ శ్రేణికి చెందినవాడు.ఆయనను చాలామంది ఒక సంఘసంస్కర్తగా భావిస్తున్నారు. ఇది పొరపాటు.ఆయనను ఒక కులానికి పరిమితం చెయ్యడమూ తప్పే.సాధారణ మానవ పరిమితులను దాటినవారే మహానీయులనబడతారు. వారు కులానికి మతానికి జాతికి అతీతులౌతారు. మానవత్వమూ దైవత్వమే వారి విధానాలు అవుతాయి.వేమన అటువంటి సద్గురువులలో ఒకడు.మానవాతీతులైనవారిని ఒకకులానికి మతానికి ప్రాంతానికి పరిమితం చెయ్యకూడదు.

ఆయన పద్యాలలో ఉత్తమమైన యోగసాధన రహస్యంగా చెప్పబడింది. వేదాంతమూ వైరాగ్యమూ యోగమూ ఆయన తన పద్యాలలో సరళంగా బోధించాడు.రసవాదం కూడా రహస్యంగా ఆయన పద్యాలలో చెప్పబడింది."తాళకంబెరుగరో తగరంబు నెరుగరో" అనే పద్యం రసవాద రహస్యమే.అలాంటి పద్యాలు ఇంకా ఉన్నాయి.క్షుద్రలోహాలను బంగారంగా మార్చే విధానాన్ని గుప్తంగా వాటిలో వేమన వివరించాడు.కాని వాటిని అర్ధంచేసుకున్నవారు తక్కువ.

రసవాదమూ మొదలైన ఇతర భావాలను అలా ఉంచితే,అసలు మానవజన్మకు ఏమి చేస్తే సార్ధకత వస్తుందో వేమన భావాలలో కొంచం పరిశీలిద్దాం.

పశు పక్ష్యాదులవలె ఆహారనిద్రాభయమైదునాలలో వృధాగా గడపడానికి ఉద్దేశించబడింది కాదు మానవజన్మ.మానవజన్మకు ఒక పరమార్ధం ఉన్నది. వృధాగా పుట్టి గిట్టుటకొరకు వచ్చినది కాదు మానవజన్మ. తిరిగి పుట్టనట్టి చదువును చదువుకోవటమే మనిషిజన్మకు పరమార్ధం. జననమరణచక్రం నుంచి విముక్తి పొందగలిగే మహత్తర అవకాశం మానవజన్మకు దైవంచేత ఇవ్వబడింది. కాని దానిని గ్రహించేవారెందరు? కొండొకచో కొందరు గ్రహించినా ఆ మార్గంలో నడిచేవారెందరు? నడిచినా గమ్యాన్ని చేరేవారెందరు? నిరంతరం ఆహార సముపార్జనకు, సుఖలాలసకు అంకితం అయిన మనిషి పరమార్ధాన్ని పొందేది ఎప్పుడు?

పగలు పొట్టకోరకు బహు ధనార్జనచింత
రాత్రి రమణి తోడ రతులచింత
మోక్షచింత ఇంక మూడాత్ముకెపుడురా
విశ్వదాభిరామ వినురవేమ

మోక్షచింత వైపు మనసు పోకుండా తిండి,సంపాదన,భోగలాలసలనే మాయతో మనిషిని కప్పింది జగన్మాత.ఈ మాయను గెలిచినవాడే పరమపదం వైపు అడుగులు వెయ్యగలడు.లేకుంటే ఆ ఊబిలో మునగక తప్పదు.అసువులు బాయక తప్పదు. నిరంతరం ఈషణాత్రయంలో ఈత కొట్టే వారికి ఒడ్డు దొరికేదేన్నడు? రాగద్వేషాలనే వలలో చిక్కినవానికి విముక్తి ఎట్లా దొరుకుతుంది?తమస్సుతో నిండిన మనస్సుకు మోక్షచింత ఎప్పుడు ఉద్భవిస్తుంది? ఎంతసేపూ తిండి,సుఖం వీటిగురించే ఆలోచించే మూర్ఖునికి మోక్షచింత ఎప్పుడు కలుగుతుంది?

వినవలె దశవిధ నాదము 
గనవలె నిర్భేద పదము గాంచిన పైపై 
గనవలె సోహంభావము 
మనవలె పరిపూర్ణమూని మదిలో వేమా      

యోగాభ్యాసపరుడై లోలోన వినిపించే పదిరకాల నాదాలను వినాలి. దానిని మించినట్టి చెక్కుచెదరని గట్టిదైన భూమిని చూడాలి. దానినికూడా దాటి సోహం భావమున ప్రతిష్టితుడై పరిపూర్ణమైన బ్రహ్మపదమును సాధకుడు చేరుకోవాలి. అప్పుడే అతని జన్మకు పరిపూర్ణత.సాధనాపరుడై పరమపదాన్ని అందుకున్నపుడే మనిషి జన్మకు ధన్యత.అది లేకుంటే ఎన్నెన్ని వేషాలు వేసినా అన్నీ చివరకు వృధా అవక తప్పదు.

వ్యాపించి యున్న లోకము 
ప్రాపించక గురుని వేడి బహుతంత్రముగా 
దీపించి మనసు నిల్పుము 
రూపంబగు బట్టబయలు రూఢము వేమా

చిత్ర విచిత్రమైన హంగులతో నిండిన ఈ లోకాన్ని లెక్కించక సద్గురువైనవాడిని  సమీపించి తంత్రోక్తమైన అతని ఉపదేశము పైన మనసు నిల్పితే అంతా తేటతెల్లముగా కనిపిస్తుంది. మనిషికి ప్రధమ కర్తవ్యం ఇదే. కాని మానవులు ఇదిమాత్రం వదిలిపెట్టి తక్కిన అన్నింటినీ చక్కగా ఆచరిస్తున్నారు.అందుకే సంసార సాగరంలో మునిగి మరణిస్తున్నారు గాని దరిచేరేవారు ఒక్కరూ లేరు. మాయామోహాలతో నిండిన ఈ లోకం మనిషిని ఎంతో ఆకర్షించి అతన్ని కాళ్ళూ చేతులూ కట్టి ఒక బానిసలా వాడుకుంటుంది. ఆ బానిసత్వమే ఆనందం అన్న భ్రమలో మనిషి గానుగెద్దులా జీవిస్తూ తన ఆయువు హరించుకు పోవడాన్ని గమనించడు. ఈ భ్రమ నుండి మనిషి బయటపడి సద్గురుప్రోక్తమైన  సాధనామార్గంలో నడక సాగించాలి. అప్పుడే అతనికి సత్యం సాక్షాత్కరిస్తుంది.

లోకము తను 'ఛీ' యనగా 
లోకము తా 'ఛీ' యనంగ లోకములోనే 
ఏ కర్మల నోనరింపక 
లోకములెంచంగ ముక్తిలోకము వేమా

లోకవిధానాలను తాను ఏవగించుకోవాలి. అనగా తనకు లోకవాసనలపైన విరక్తి కలగాలి. లోకమూ తనను అసహ్యించుకోవాలి. అంటే సమాజపు కుళ్ళుపోకడలకు విరుద్ధమైన సత్యమార్గంలో తాను నడవాలి. లోకాన్ని తాను  ఛీకోడితే లోకమూ తనను 'ఛీ' అంటుంది.అంటే లోకరీతికి భిన్నమైన మార్గంలో సాధకుడు నడవాలి.అటువంటి స్తితిలో ఉంటూ,కర్మను క్షయింపచేసుకునే రహస్యయోగమార్గాన్ని అనుసరించి,తద్వారా లభించినట్టి  యోగసిద్ధితో, సమస్త లోకాలను సాక్షిగా తిలకించగలిగితే అదే ముక్తి.

రానిది కోరిన రాదది
రానున్నది కోరకున్న రానేవచ్చున్ 
తానెంత చింత చేసిన 
కానున్నది కాకపోదు గదరా వేమా 

తనకు యోగం లేకపోతే ఎంత కోరుకున్నా అది దక్కదు.అలాగే,తనకు రాసిపెట్టి ఉంటే ఎంత వద్దనుకున్నా అది అనుభవించక తప్పదు.కనుక తానెంత చింతించినా కానున్నది కాకమానదు.రానున్నది రాకమానదు. జరుగనున్నది జరుగక మానదు.ఇది అంతిమ సత్యం.దీనిని గ్రహించి ఆచరించగలిగినవాడు ధన్యుడు.అటువంటివాడు ఒక రమణమహర్షిగా రూపు దిద్దుకుంటాడు. జిల్లెళ్ళమూడి అమ్మ కూడా ఇదే భావాన్ని"అనుకున్నది జరగదు.తనకున్నది తప్పదు"అని చెప్పారు.మహనీయులు ఎవ్వరైనా ఇదే సత్యాన్ని ఎన్నో మార్లు చెప్పారు.కాని మూడత్వంతో నిండియున్నవానికి ఇది తలకేక్కుతుందా? ఎక్కదు.అందుకే లోకంలో జ్ఞానులు కొందరే ఉంటారు.మిగిలినవారు మిడుతల దండులే.పుట్టలోని చెదలే.

మాయల సంసారముకై 
మాయలలో బొరలుచుండు మనుజుడు మరితా 
మాయను మదిలో దలచిన 
మాయలనే ముక్తి గలుగు మహిలో వేమా 

ఈ మాయదారి సంసారమోహంతో నిండిన మానవుడు మాయ అనే బురదగుంటలో పడిన పందిలాగా దొర్లుతున్నాడు. మాయాస్వరూపాన్ని తన మనసులో చింతనచేత చక్కగా అర్ధం చేసుకుంటే, ఆ మాయలో నుంచే ముక్తి అనే మార్గం చక్కగా కనిపిస్తుంది. కాని మాయను ఆనందిస్తున్న మనుజునికి మాయపై మనసు విరిగేదేన్నడు?సాధనామార్గంపైన మనసు నిలిచేది ఎప్పుడు? అసలలా జరిగే అవకాశం ఉన్నదా?

జ్ఞాననిష్ఠ బూని మేను మరచువాడు 
కామిగాడు మోక్షగామి గాని 
నియమ నిష్ఠలుడిపి నిర్గుణమ్మందురా
విశ్వదాభిరామ వినురవేమ 

జ్ఞానకాంక్షి యైనవాడు మొదటిలో నియమ నిష్టలను ఎన్నో ఏళ్ళు పాటించాలి. తర్వాత జ్ఞాననిష్టను బూని నియమనిష్టలకు అతీతుడై సర్వాతీతమైన నిర్గుణపదవిని అందుకోవాలి.ఇదే మనిషి యొక్క ప్రధమకర్తవ్యం.అంతే కాదు.ఇదే మానవ జీవితపు నిజమైన గమ్యం కూడా. దీనిని సాధించినవాడే నిజమైన మానవుడు. అతని జన్మ మాత్రమే సార్ధకమైన జన్మ.
read more " మానవజీవిత గమ్యం -- వేమన పద్యం "

7, నవంబర్ 2012, బుధవారం

ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి

ఆంద్రప్రదేశ్ లో ప్రతి నవంబర్ లోనూ తుఫాన్ రావడం మామూలైపోయింది. వాతావరణశాఖవారు దీనిని కనిపెట్టలేకపోయినా సామాన్యుడు చెప్పగలుగుతున్నాడు.అయితే, ప్రతి ఏడాదీ తుఫాను రావడమూ ఊళ్లు జలదిగ్బంధనం అవడమూ, లోతట్టు ప్రాంతాలు మునిగి పోవడమూ, ఊరిలోనే మనుషులు పడవలు వేసుకొని తిరగడమూ సర్వ సాధారణం అయిపోయింది. కానీ దీనికి తగిన శాశ్వతచర్యలు ప్రభుత్వం ఏమి తీసుకుంటున్నదో తెలియదు. పోనీ తనకు చేతనైనంతలో ప్రభుత్వం ఏవో కొన్ని చర్యలు చేపడుతున్నదీ అనుకుందాం.రాజకీయ నాయకులు పార్టీలూ మాత్రం ఏమి చేస్తున్నారో ఎవరికీ  తెలియదు.

స్వచ్చందసంస్థలూ,మానవతావాదులూ,వారి స్వల్పస్థాయిలో ఏవో చిన్నచిన్న సహాయశిబిరాలు పెట్టడమూ వరదబాధితులకు తమకు తోచిన సహాయం చెయ్యడమూ ప్రతి ఏడాదీ చూస్తున్నాం.కానీ రాజకీయపార్టీలు ఇలాంటి స్వచ్చందశిబిరాలు పెట్టడం ఎక్కడా చూడలేదు.వారు ఉత్తమాటలు చెప్పెబదులు ఆపని ఎందుకు చెయ్యరు అనేది నాప్రశ్న.ఈ మధ్య ఒక టీవీ చానల్ వారు తుఫాన్ బాధితులకు సహాయకార్యక్రమం ఒకటి చేశారు. అలాంటి పని రాజకీయ పార్టీలు ఎందుకు చెయ్యకూడదు?

రాజకీయ పార్టీల దగ్గర ఆడిట్ కాబడని డబ్బు వందలవేల కోట్లు మూలుగుతోంది. ఎలక్షన్ల సమయంలో ప్రజలకు సారాయీ డబ్బుసంచులూ  పంచేబదులు, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో సహాయశిబిరాలు నిర్వహించే పని రాజకీయపార్టీలు ఎందుకు చెయ్యవు? అనేది నాకెప్పటినుంచో ఒక సందేహం. బహుశా దానివల్ల వాళ్లకు ఉపయోగం ఏమీ ఉండదు గనుక ఆ పని చెయ్యరు. ఓట్లకోసం డబ్బులు పంచుతారు గాని ఇలాంటి విపత్కరస్తితిలో మాత్రం ప్రజలకు ఏ సాయమూ చెయ్యరు. ఊరకే ఊరూరూ తిరిగి హామీలు మాత్రం గుప్పిస్తారు.ఇక అధికారంలో ఉన్న పార్టీవారు,నివేదికలు పంపి కేంద్రం నుంచి నిధులు తెస్తారు.ఆ నిధుల్లో సింహభాగం ఎక్కడికి చేరుతుందో ఈరోజుల్లో అందరికీ తెలుసు.

రాజకీయపార్టీలకు మహిళావిభాగాలూ, యువసేనలూ ఇలా రకరకాల శాఖలు ఉన్నాయి. వారు ఇలాంటి సమయాల్లో రంగంలోకి దిగి మారుమూల మునిగిపోయిన పల్లెలకు వెళ్లి సహాయకార్యక్రమాలు చెయ్యవచ్చు కదా. అలాంటి చిత్తశుద్ధి మాత్రం ఎవరిలోనూ కనపడదు. 

ఇకపోతే సినిమానటులకు కూడా సేనలున్నాయి. ఈ సేనలు తాగి బజార్లో పడి రౌడీలలాగా వీరంగం చెయ్యడమే గాని ఇలాంటి ఆపత్సమయాల్లో మంచి సేవాకార్యక్రమం ఒక్కటి చేసిన దాఖలాలు ఎక్కడా కనపడవు.వాళ్ళ సంస్కారస్థాయి అలా ఉంటుంది.

నిన్న విజయవాడలో ఒక సంఘటన జరిగింది. ఊరిలో లోతట్టు ప్రాంతం కొంత భాగం వర్షాలకు మునిగిపోయింది. ఆ పేటలో నివసిస్తున్న ఒక గృహిణి మంచినీటి కోసం బిందె తీసుకుని మోకాలిలోతు నీళ్ళలో వెళుతూ రోడ్డుమీద ఉన్న ఒక గుంతలో కాలేసి మునిగి చనిపోయింది. నీటిలో మునిగిన రోడ్డులో ఎక్కడ గుంతలున్నాయో కనపడవు కదామరి. బజారుకెళ్ళిన భర్త ఇంటికి వచ్చేసరికి భార్యశవం వరద నీళ్ళలో తేలుతూ కనిపించింది.ఈ పాపం ఎవరిదీ?

స్వతంత్రం వచ్చి అరవైఏళ్ళైనా సిటీలలో కూడా ఇప్పటికీ మంచినీరు సప్లై చెయ్యలేని ప్రభుత్వానిదా? టౌన్ ప్లానింగ్ అనేది పేరుకే గాని అసలంటూ ఎక్కడా ఏ ప్లానింగూ లేని మునిసిపాలిటీ శాఖదా? వాడవలసిన పాళ్ళలో కంకరా సిమెంటూ వాడకుండా సగం పైగా బొక్కేసి పైపైన నాసిరకం రోడ్లు వేస్తున్న రాజకీయ కాంట్రాక్టర్లదా? దానిని చూచీ చూడనట్లు ఊరుకుంటూ మామూళ్ళతో జేబులు నింపుకుంటున్న అధికారులదా? ఒక ప్లానింగ్ అంటూ లేకుండా దేశాన్ని సర్వనాశనం చేస్తున్న రాజకీయులదా? సామాన్యుడి  ఉసురు వీరిలో ఎవరికి తగలాలి?

తుఫాన్ వొచ్చినా దానిని తమ జేబులు నింపుకోడానికి మాత్రమె నాయకులూ అధికారులూ ఉపయోగించుకుంటున్నారు అన్నది ఒక చేదునిజం. నిన్న ఒక రాష్ట్ర ప్రభుత్వోద్యోగి ఒక మాట చెబితే విని నివ్వెరపోయాను."పోయినేడాది ఒచ్చినట్లే ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి దేవుడా"--అని మొక్కుకునే ఉద్యోగులు రాష్ట్రప్రభుత్వంలో ఉన్నారట.రాజకీయ నాయకులు కూడా కొందరు ఇలా మొక్కుకుంటారట.ఎందుకంటే,తుఫాన్ వస్తే మళ్ళీ కేంద్రనిధులు వస్తాయి.కాంట్రాక్టులు వస్తాయి.రోడ్లు వేసుకోవచ్చు,గుంటలు పూడ్చుకోవచ్చు, అసలే వెయ్యని కొన్ని రోడ్లను తుఫాన్ ఎకౌంట్లో కొట్టుకు పోయినట్లు చూపించవచ్చు,అసలు పంటేవెయ్యని పొలాలలో కూడా పంట మునిగి నష్టపోయినట్లు చూపించి పరిహారం బొక్కేయ్యవచ్చు, ఇలా ఎన్నో ఇంకేన్నో రకాలుగా ఈ తుఫాన్ను వాడుకుని నిధులు రాజమార్గంలో స్వాహా చెయ్యవచ్చు.అందుకని అలా మొక్కుకుంటారట. తుఫాన్ ను నమ్ముకుని కోటీశ్వరులైనవారు ఎందఱో ఉన్నారట.

మనుషుల రూపంలో సమాజంలో తిరుగుతున్నది జంతువులే అని నేను ఎప్పుడూ అనుకుంటాను. అది నిజమే అని రోజురోజుకూ రుజువులు లభిస్తుంటాయి.నాది పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అని కొందరు నాతో అన్నారు. కాని నా ఈ అభిప్రాయం వెనుక బలమైన అనుభవాలున్నాయి.ఆ మధ్య నేను లక్నో వెళ్లి ఒస్తున్నపుడు ఒక సంఘటన జరిగింది. మధ్యలో భోపాల్ లోనో ఏదో ఒక పెద్ద స్టేషన్లో ట్రెయిన్ ఆగినపుడు టిఫిన్ తిందామని దిగినప్పుడు ఒక హృదయ విదారకమైన సంఘటన చూచాను. ఆ ప్లాట్ఫారం మీద ఒక బట్టలు లేని స్త్రీశవం పడి ఉంది. సన్నగా స్కెలిటన్ లాగా అయిపోయి ఉంది ఆమె. ఈగలు భయంకరంగా ముసురుతున్నాయి. అన్ని వేలమందీ ఆ ప్లాట్ఫారం మీద బిజీగా తిరుగుతూ కూడా ఆ శవాన్ని  చూడనట్లుగా నటిస్తూ వెళ్లి టిఫిన్లు కొనుక్కోచ్చుకుని తింటున్నారు గాని ఒక్కరూ ఆ శవాన్ని పట్టించుకోవడం లేదు.ఆ శవాన్ని చూడలేక వెనక్కితిరిగి నా బోగీ దగ్గరికి వచ్చి, సూట్కేస్ లోని దుప్పటి తీసి ట్రెయిన్ దిగి ఆ శవానికి కప్పివస్తుంటే  నన్నొక పిచ్చివాణ్ని చూసినట్లు చూచారు జనమంతా. పైగా ఒక ప్రయాణీకుడు " ఆమెకు ఎయిడ్స్ ఉందేమో ఎందుకు అలా రిస్క్ తీసుకున్నారు? అది రైల్వే పోలీసుల పని. మన పని కాదు" అని ఇంగ్లీషులో చాలా గొప్ప సలహా ఇచ్చాడు. అప్పటిదాకా దేశసమస్యల గురించీ రాజకీయాల గురించీ అనర్గళంగా చర్చిస్తున్న పెద్దమనిషి అతగాడు.ఆపైన వాడితో మాట్లాడాలంటేనే నాకు అసహ్యం కలిగింది. ఈ సంఘటన చూచాక, ట్రెయిన్ విజయవాడ చేరేవరకూ నేను మామూలు మనిషిని కాలేకపోయాను. 

ఇలాంటి వెధవలతో నిండిఉన్న దేశం మనది.శవాలమీద డబ్బులేరుకునే నాయకులూ అధికారులూ ప్రజలూ ఉన్న ఈ దేశం అసలు బాగుపడుతుందని ఊహించడమే తప్పు.మంచివాళ్ళు అసలు లేరా?మీకేవరూ ఎక్కడా కనిపించలేదా అని అనుమానం చదివేవారికి రావచ్చు. కనిపించారు. మన చుట్టూ ఎందఱో మంచివాళ్ళు ఉన్నారు. కానీ వారి సంఖ్య అతిస్వల్పం. సముద్రంలో కాకిరెట్ట లాగా, నల్లటి బ్లాక్ బోర్డ్ మీద చిన్న తెల్లటిచుక్కలాగా ఉంది మన సమాజంలో హృదయమున్న మంచివాళ్ళ సంఖ్య.ఉన్న కొద్దిమందీ 'ఆ మనకెందుకులే' అనుకుంటూ సజీవశవాలుగా బతుకుతున్నారు.

పై సంఘటనకు పూర్తి కాంట్రాస్ట్ గా నేను చూచిన ఇంకొక సంఘటన చెప్తాను. కొన్నేళ్ళ క్రితం అరుణాచలం వెళ్ళాను.లేచి నడవలేక రోడ్డుమీద ఈడ్చుకుంటూ వెళుతున్న ఒక అడుక్కుతినే స్త్రీని అక్కడ చూచాను. ఆమెకు నడుములు పడిపోయినట్లు ఉన్నాయి. ఆమె కొంత దూరం అలా పాకి,చివరకు  పాకడానికి కూడా శక్తి లేక రోడ్డుపక్కనే పడిపోయింది. మొఖం చూస్తే,తిండి తిని కనీసం రెండు మూడు రోజులైనట్లు ఉన్నది. మర్యాదస్తులైన భక్తులూ  నగరపౌరులూ షరా మామూలుగా ఏమీ పట్టనట్లు వారిదారిన వారు అలా పోతూనే ఉన్నారు. ఇంతలో ఇంకొక సాధువు ఆ దారిన పోతున్నాడు. అతనూ అడుక్కు తినేవాడే. తన దగ్గరున్న చిల్లర పోగేసి రోడ్డుపక్క బండి దగ్గర అప్పుడే ఇడ్లీ కొనుక్కున్నాడు.నేనూ అదే బండి దగ్గర ఒక బల్లమీద కూచుని ఉన్నాను. ఇడ్లీని నోటి దగ్గర పెట్టుకోబోతూ ఈ దృశ్యాన్ని అతను చూచాడు.వెంటనే చెమర్చిన కళ్ళతో "భగవంతుడా ఏమిటి నీ సృష్టి" అని తమిళంలో అంటూ తన చేతిలోని ఇడ్లీలు ఆమెకు ఇచ్చి తనదారిన తాను వెళ్ళిపోయాడు. ఇది నేను కళ్ళారా చూచిన సంఘటన.

మన ఎడ్యుకేటెడ్ యానిమల్స్ కంటే, రాజకీయ కుష్టురోగులకంటే, అవినీతి కేన్సర్ ముదిరిన ఉద్యోగులకంటే, ఒక పూట డిన్నర్ కు పదివేలు ఖర్చుపెట్టే మనుషుల కంటే, ఎంతో ఉన్నతంగా ఎదిగిపోయిన ఒక మహర్షిలా ఆ బిచ్చగాడు నా కంటికి కనిపించాడు.ఎందుకంటే, ఎందరిలోనో లేని స్పందించే హృదయం అతనిలో ఉంది. తానూ అడుక్కుతినేవాడై ఉండీ, తన నోటి దగ్గర తిండిని ఆకలితో ఉన్న ఇంకొక జీవికోసం ఇవ్వగలిగాడంటే మనలాంటి జంతువుల మధ్యన అతనే అసలైన మానవుడు అని నాకనిపించింది. భగవంతుని కరుణకు అతనే అసలైన పాత్రుడు అనిపించింది.

అవసరం ఉన్నా లేకున్నా వేల కోట్లు పోగేసి, అదీ చాలక 'ఇంకా ఇంకా' అని దాహంతో కొట్టుకుంటున్న నేటి నాయకులు, అవినీతి అధికారులు,వ్యాపారుల కంటే తన నోటిదగ్గర ఆహారం ఇంకొకరికి ఇచ్చిన ఆ బిచ్చగాడు ఎంతో ఉన్నతమైన 'మహా మనీషి' అని నేనంటాను. ప్రతి ఏడాదీ తుఫాన్ రావాలని మొక్కుకునే మన ఆంధ్రాజంతువులతో పోలిస్తే ఆ అడుక్కుతినేవాడు ఒక మహర్షి అని నా అభిప్రాయం. "ఆ శవాన్ని ఎందుకు తాకావు? ఆమెకు ఎయిడ్స్ ఉందేమో?" అని నన్ను ప్రశ్నించిన 'ఏసీక్లాస్ ఎడ్యుకేటెడ్ బ్రూట్' కంటే అరుణాచలం బిచ్చగాడు ఎన్నో వేలరెట్లు ఉన్నతుడే.కాదని ఎవరైనా అనగలరా? 

ప్రకృతి విలయాన్ని కూడా తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా మలచుకుని,పక్కవాడి నోటి దగ్గర కూడు లాగేసుకుంటున్న నేటి మనుషుల కంటే , తాను ఆకలితో ఉండి కూడా తన తిండిని ఇంకొక జీవికి ఇచ్చిన అతను నిశ్చయంగా ఉత్తమోత్తముడే. ఇందులో ఏమీ అనుమానం లేదు.'మంచి మనుషులు సమాజంలో ఉన్నారు అని నాకు తెలుసు' అని చెప్పడానికే ఈ ఉదాహరణ ఇచ్చాను. కానీ వారి సంఖ్య చాలడం లేదు. వారికున్న వనరులూ స్వల్పమే. కానీ ఒక మంచిపని చెయ్యడానికి ఆర్ధిక స్తోమతతోనూ వనరులతోనూ పని లేదు. స్పందించే హృదయం ఒక్కటే కావలసింది. అదుంటే,ఆపదలో ఉన్న మనిషికి తమ పరిధిలో తాము సాయం చెయ్యవచ్చు. ఈ ఆలోచన మన రాజకీయ పార్టీలకూ, సోది సంఘాలకూ ఎందుకు రాదు? అన్నదే నా ప్రశ్న.

ఆ బిచ్చగాడికి ఉన్న మానవతా హృదయం మనకు కూడా కలిగే అదృష్టం ఆ దేవుడు కలిగిస్తే ఎంత బాగుంటుంది? అప్పుడీ భూమి స్వర్గంగా మారదూ? ఒక నిరాడంబరమైన పర్ణశాలలో ఉండే ప్రశాంతత, సంపన్నుల విలాస భవనాలలో కూడా ఉండాలని ఆశించడం నాదే పొరపాటంటారా? సరే అలాగే కానివ్వండి. కాదని నేను మాత్రం ఎలా అనగలను?
read more " ఈ ఏడాది కూడా తుఫాన్ రావాలి "

1, నవంబర్ 2012, గురువారం

వింతదేశంలో ఎన్నో వింతలు

మన దేశాన్ని ఇప్పటివరకూ నాశనం చేసిన,ఇంకా చేస్తున్న,రెండు ప్రధానశక్తులు ఏవంటే- ఒకటి రాజకీయాలు, రెండు సినిమాలు అని చెప్పచ్చు. ఇది నా ఒక్కడి అభిప్రాయం మాత్రమె కాదు.నిష్పక్షపాతంగా ఆలోచించగలిగిన ఎవరైనా ఇదే అంటారు. ప్రస్తుతం అందరు మేధావులూ ఇదే అంటున్నారు.

నీతిలేని రాజకీయరంగం వల్ల మనదేశం ఎదగవలసినంత ఎదగలేక పోయింది అన్నది సత్యం. ఒకప్పుడు మనలాంటి దేశమైన చైనావైపు ప్రస్తుతం మనం కనీసం కన్నెత్తి చూడలేని స్తితిలో ఉన్నామంటే మొదటి కారణం మన దేశపు నీతిలేని,స్వార్ధపూరిత రాజకీయాలు.వ్యక్తిగత స్వార్ధం కోసం దేశ ప్రయోజనాన్ని అమ్ముకోడానికి ఏమాత్రం వెనుదీయని నాయకులే కారణం. చైనాలో వారికి దేశం ముఖ్యం.మనకో,గ్రూపులు కట్టి ఎవడికి చిక్కినంత వాడు దోచుకోవడం ముఖ్యం.అందుకే మన దేశం ఇలా అఘోరిస్తోంది.

సగటు భారతీయుడు తన గురించే ఆలోచిస్తాడు.పక్కవాడి గురించి కొంచం కూడా ఆలోచించడు.దేశం గురించి అసలే ఆలోచించడు.ఇదికూడా నేను చెబుతున్న మాట కాదు. అంతర్జాతీయసంస్థలు సర్వే చేసి చెబుతున్న నిజం.సగటు భారతీయుడు పచ్చి స్వార్ధపరుడు అనేది నగ్నసత్యం. తన స్వార్ధంకోసం ఏ రూల్ నైనా తుంగలో తొక్కడానికి వెనుదియ్యడు అనేది ఇంకో సత్యం.

కానీ ఒకప్పుడు పరిస్తితి ఇలా ఉండేది కాదు.ప్రాచీన భారతీయుడు ఇలా ఉండేవాడు కాదు.నిలువెల్లా నిఖార్సైన విలువలతో నిండి ఉండేవాడు.మరి నేటి దిగజారుడుతనానికి కారణం ఏమిటి? అంటే రాజకీయాలదే ప్రధానపాత్ర అని చెప్పాలి.రాజకీయ పార్టీలన్నీ కులపార్టీలూ,మతపార్టీలే.మళ్ళీ మనదేశం కులానికీ మతానికీ చెందని సెక్యులర్ దేశం అని చెబుతాం.కానీ ఇక్కడ ఉన్నవి ఆరెండే.చెప్పెదోకటీ చేసేదోకటీ కావడమూ,డబ్బే దైవం కావడమూ,విలువలను తుంగలో తోక్కడమే మన సమాజపు ప్రధాన సమస్యలు.ఈ జాడ్యాలను పెంచి పోషిస్తున్నవి దారితప్పిన రాజకీయాలూ సినిమాలే.

ప్రజాస్వామ్యంలో మౌలిక విలువలను కాపాడవలసిన వ్యవస్థలను అన్నింటినీ రాజకీయ జోక్యం నిర్వీర్యం చెయ్యడమే కాక,తమ స్వార్ధానికి ఉపయోగపడే తొత్తులుగా వాటిని మార్చుకుంది.కనుక సమాజం క్రమేణా భ్రష్టుపట్టింది.నేడు సమాజంలో పోలీస్ వ్యవస్థపైనా,న్యాయవ్యవస్థ పైనా, ఇంకా అనేక మూలస్తంభాల్లాంటి వ్యవస్థలపైన ప్రజలకు నమ్మకం సడలిపోయిందంటే దానికి కారణం నీతితప్పిన రాజకీయవ్యవస్థ యొక్క అనవసర జోక్యం మాత్రమే.

నన్ను సరిగ్గా పనిచేసుకోనివ్వడం లేదు అని ఒక సెన్సార్ బోర్డు సభ్యురాలు ఈ మధ్యన మొత్తుకున్నా, రాజకీయ వేధింపులు ఎక్కువయ్యాయని దేవాదాయ శాఖలోని ఒక అసిస్టెంట్ కమీషనర్ స్థాయి అధికారిణి ఈమధ్యనే ఆత్మహత్య చేసుకున్నా,నిజాయితీగా వ్యవహరిస్తున్నందుకు అయ్యేఎస్ ఐపీఎస్ అధికారులు వేధింపులకు గురైనా -- ఇవన్నీ కూడా దేశాన్ని నాశనం చేస్తున్న రాజకీయం యొక్క వివిధ రూపాలే.బడా వ్యాపారవేత్తలతో కుమ్మక్కై రాజకీయులు దేశాన్ని ఎలా సర్వనాశనం చేస్తున్నారో ఈదేశపు సామాన్యుడికి ఈ జన్మకి అర్ధం కాదు.అసలు ఆ స్థాయిలో ఏమేం జరుగుతున్నాయో సగటు పౌరుడు ఊహించను కూడా ఊహించలేడు.

ఇకపోతే సమాజంలో విలువలూ,మంచిభాషా,మంచిప్రవర్తనా దిగజారి పోవడానికి ప్రధానపాత్ర సినిమాలదే.సినిమా అనేది సమాజాన్ని చాలా ప్రభావితం చేస్తుంది.సమాజానికి చవకలో వినోదాన్ని పంచేవి సినిమాలే.అవి స్లో పాయిజన్ ఎక్కించడం మొదలుపెడితే కొన్నేళ్ళకు తెలీకుండానే సమాజం మొత్తం నాశనం అవుతుంది.ప్రస్తుతం జరుగుతున్నది అదే.ఎంతసేపూ హింసనూ,అశ్లీలభాషనూ,అశ్లీలదృశ్యాలనూ చూపించి,వివాదాస్పద అంశాలను రెచ్చగొట్టి,సొమ్ము చేసుకునే సినిమారంగంవల్ల గత ఇరవై ముప్పైఏళ్లలో సమాజం దారుణంగా దిగజారింది అన్నమాట ఇంకో నగ్నసత్యం.నాసిరకం వినోదాన్ని సమాజానికి ఒక వ్యసనంలా అంటగడుతూ సినిమారంగం అప్రతిహతంగా వర్దిల్లుతున్నది. దానిని సగటుపౌరుడు ఎంజాయ్ చెయ్యడం వెకిలివింత.  

సినిమావాళ్లకు ఒంట్లో శక్తితగ్గి మొహంలో ముసలితనం కన్పించేసరికి అక్కడ రిటైరై, ప్రజల్లో తమకున్న క్రేజ్ ను పెట్టుబడిగా పెట్టి,  రాజకీయాలలోకి రావడం భలేవింత.ప్రపంచంలోని ఏరంగానికైనా ట్రైనింగ్ అవసరం. కానీ రాజకీయానికి ట్రెయినింగ్ అవసరం లేదు.నిన్నటివరకూ అతడు ఎవరైనాసరే పర్లేదు,ఈరోజు నుంచి రాజకీయనాయకుడు కావచ్చు.దేశాన్ని ఎటో తీసుకుపోవచ్చు. పొలిటికల్ సైన్స్ లో ఓనమాలు తెలియని నాయకులకు జనం ఓట్లేసి వాళ్ళను అధికారంలోకి తేవడం అతిపెద్దవింత. సినిమానటులూ రాజకీయులూ వ్యాపారులూ వియ్యం కలుపుకుని ఒకరినొకరు పరస్పరం కాపాడుకుంటూ వారివారి అవినీతి సామ్రాజ్యాలు విస్తరించుకుంటూ సమాజం భ్రష్టు పట్టడానికి స్పీడుగా దోహదం చెయ్యడం ఇంకో అసలైన వింత.

ఇకపోతే ఎడాపెడా సమాజధనాన్ని దోచుకున్న రాజకీయులూ సినిమావాళ్ళూ దొంగవ్యాపారులూ ఆ డబ్బును విదేశాలలో హోటళ్ళకూ ఇతర ప్రాజెక్టులకూ పెట్టుబడి పెడుతూ ఈ దేశపు సంపదను ఇతర దేశాలకు దోచిపెట్టడం తెలివైనవింత.ఇవన్నీ తెలియని సగటు సామాన్యుడు,తన కులపార్టీకి కిమ్మనకుండా  కొమ్ముకాస్తూ ఆ నాయకుడు ఏమి చేసినా గుడ్డిగా సమర్ధించడం బానిసత్వపు వింత. మన కులంవాడైతే చాలు వాడేం చేసినా కరెక్టే అనే భావజాలం నీచమైన వింత. 

ఇదిలా ఉంటే, వీరి ఎదుగుదలకు కారకుడైన సగటుపౌరుడు మాత్రం సీసాకీ, నోటుకీ అమ్ముడుపోతూ విచక్షణ లేకుండా ఓటును అమ్ముకోవడం చాలా చీపైన వింత. అలాగే సినిమాల వల్ల విలువలపరంగా తానెంత నష్టపోతున్నాడో తెలుసుకోలేని సగటు ప్రేక్షకుడు టికెట్టుకొని అదే సినిమా చూస్తూ, తాగుడుకు బానిసై చావుకు చేరువౌతున్న తాగుబోతులాగా,ఆ హీరోల గురించీ,పాటల గురించీ,సినిమా కథల గురించీ,హీరోయిన్ల వెకిలివేషాల గురించీ మాట్లాడుకుంటూ ఇంకాఇంకా హీనమైన ప్రవర్తనకు అలవాటు పడుతూ దిగజారుతూ ఉండటం 'తన గొయ్యి తానే తవ్వుకునే'  తెలివిలేని వింత.

నిరంతర జాగరూకతతో కూడిన,జ్ఞానపూరితమైన,ప్రజాభిప్రాయమే ప్రజాస్వామ్యానికి శ్రీరామరక్ష. మరి అలాంటి జాగరూకత వైపూ, జ్ఞానంవైపూ పోకుండా పాలకులే ప్రజలను అడ్డుకుంటూ,పౌరులను నైతికంగా నిర్వీర్య్లులను చేస్తూ, తమ పబ్బం గడుపుకుంటూ,దేశాన్ని దోచుకుంటూ ఉంటే అలాంటి దేశానికి ఏది దారి?

తాగుడునీ,చవకబారు సినిమాలనూ,వ్యసనాలనూ ప్రోత్సహిస్తూ,వాటిని ఆదాయవనరులలాగా పెంచిపోషిస్తూ,కులమతాలతోనూ,అడుగడుగునా అవినీతితోనూ నిండి,అవకాశవాదమే అసలైన రాజ్యాంగంగా వెలుగుతున్న   దేశానికి ఔన్నత్యం ఎటునుంచి వస్తుందో ఎలా వస్తుందో ఆ దేవునికే తెలియాలి.ఒకవేళ ఆ ఔన్నత్యం అంటూ వస్తేమాత్రం ప్రస్తుత పరిస్థితుల్లో దానినే అతిపెద్ద వింతగా చెప్పుకోవాలి.
read more " వింతదేశంలో ఎన్నో వింతలు "

25, అక్టోబర్ 2012, గురువారం

దేశజాతకం -- రవిశని దశ

మన దేశజాతకాన్ని చూచి చాలా నెలలైంది.ఎప్పుడో రవిలో రాహుదశలో స్కాములు వెల్లువెత్తుతున్న సమయంలో ఈ విషయాన్ని చర్చించాను.మధ్యలో గురుదశ గడిచిపోయింది.ఇప్పుడు శని అంతర్దశ వచ్చింది.వచ్చి కూడా మూడు నెలలైంది. ఒకసారి మళ్ళీ అటువైపు దృష్టి సారిద్దాం.

ప్రస్తుతం జూలై 2012 నుంచి జూన్ 2013 వరకూ రవిదశలో శని అంతర్దశ నడుస్తున్నది.ప్రస్తుతం గోచారంలో కూడా రవిశనులిద్దరూ కలిసి ఉన్నారు.దీని ప్రభావంతో ఈ దశాకాలంలో ఏమి జరుగనుందో చూద్దాం.

**దేశ ప్రతిష్ట దిగజారుతుంది. 
**నాయకులపైన నీలినీడలు పడతాయి.
**పాలకులలో ధైర్యం సన్నగిల్లుతుంది.
**కానీ మేకపోతు గాంభీర్యం మాత్రం తగ్గదు.
**పాలకులకూ సామాన్యులకూ గొడవలు జరుగుతాయి. 
**ప్రజాపోరాటాలు తలెత్తుతాయి.
**ఆర్ధికరంగం సంక్షోభంలో పడుతుంది.
**అంతా బాగుంది అనుకోవడం భ్రమ అని తెలిసొస్తుంది.
**తాగునీటివల్ల,గాలివల్ల వచ్చే రోగాలు విజ్రుంభిస్తాయి.
**ప్రతి రాష్ట్రంలోనూ అశాంతికర పరిస్థితులు ఉంటాయి.
**నవంబర్ 1నుంచి 18 వరకూ హటాత్ పరిణామాలు చోటు చేసుకుంటాయి.
**ప్రముఖులమరణం సంభవిస్తుంది.అది సంగీత సాహిత్య రంగంలోనో, క్రీడారంగంలోనో, రాజకీయరంగంలోనో లేక అన్నింటా కావచ్చు.
**నాయకుల పరువు పోతుంది, లేదా సంకటస్తితిలో పడుతుంది (ఇప్పుడు ఉంటేగా కొత్తగా పోవడానికి అంటే చెప్పేదేమీ లేదు)
**మన దేశాన్ని మన పాలసీలు కాకుండా విదేశాలు నడిపిస్తాయి.
**పశ్చిమాన ప్రజావిజయం తొంగిచూస్తుంది.
**పాలకులు ప్రజలకు మేలు చెయ్యడంతప్ప ఇతర గోలంతా చేస్తారు.
**ప్రస్తుతం దేశానికి అర్ధాష్టమ శని జరుగుతున్నందువల్ల మంచి జరగదు.
read more " దేశజాతకం -- రవిశని దశ "

21, అక్టోబర్ 2012, ఆదివారం

విలువైన జీవితం

మనిషి జీవితం చాలా విలువైనది. ఎంత విలువైనది? అంటే, దాని విలువ ఎంతో మనం గ్రహించలేనంత విలువైనది. తేరగా వచ్చిన వాటి విలువ మనకు తెలీదు.అలాగే మన జీవితాన్నికూడా మనం తేలికగా తీసుకుంటున్నాం. అందుకే దానివిలువ మనకు తెలీదు. విలువ తెలీదు గాబట్టి దాన్ని ఇష్టం వచ్చిన పిచ్చిపనులలో వృధా చేసుకుంటున్నాం.

ఈ విలువతెలీనితనానికి కారణం ఒకటుంది. జననానికి ముందు ఈ జన్మ కోసం మనం ఎంత బాధపడ్డామో,సూక్ష్మలోకాలలో ఎంత వేచి చూచామో, మానవ జన్మఎత్తే ఒక్క అవకాశం ఇమ్మని దైవాన్ని ఎంతగా ప్రాధేయపడి వేడుకున్నామో మనకు గుర్తు లేదు. అదంతా గుర్తొస్తే అప్పుడు మనకు ఈ జన్మ విలువ తెలుస్తుంది. మన తెలివితక్కువతనానికి మన మతిమరుపుకు అప్పుడు మనమీద మనకే అసహ్యం కలుగుతుంది.

లక్షమంది లాటరీ టికెట్లు కొంటే ఒకడికి మాత్రమె లాటరీ తగులుతుంది.ఈ మానవజన్మకూడా అలాంటిదే అని చెప్పవచ్చు.అయితే లాటరీలాగా ఇది తేలికగా తేరగా వచ్చినది కాదు. గత జన్మలో మరణం తర్వాత, ఈ జన్మలో భూమిమీదకు అడుగుపెట్టే మధ్యకాలంలో జీవి పడిన బాధలు గుర్తువస్తే,ఆ వ్యక్తికి మాత్రమె మానవజన్మ యొక్క విలువ తెలుస్తుంది. మిగతావాళ్ళకు తెలియదు. ప్రకృతి ఏర్పరచే మరుపే దానికి కారణం.

నిజానికి మానవులందరూ దైవద్రోహులే. తనకు ఈ జన్మ ఎలా వచ్చిందో మరచిపోయి, సూక్ష్మశరీరంలో ఉన్నపుడు దైవానికి తాను చేసిన ప్రమాణాలు ఒప్పందాలు అన్నీ మరచిపోయి, ఒక్కసారి ఈలోకంలో అడుగు పెట్టిన తర్వాత విజ్రుంభించి ఇంద్రియలౌల్యంలో మునిగే మనుషులను దైవద్రోహులు అనడం చాలా చిన్నమాట అనిపిస్తుంది. కానీ దైవం మనల్ని మళ్ళీమళ్ళీ క్షమిస్తూనే ఉంటుంది. ప్రతిసారీ మరొక్క అవకాశం ఇస్తూనే ఉంటుంది. అదే దైవం యొక్క క్షమ.

మానవ జీవితం వస్తుసంపాదన కోసమూ, ఇంద్రియభోగాల కోసమూ ఉద్దేశించబడింది కాదు. అనంతమైన ఈ సృష్టిలో మానవజన్మకు ఒక ప్రత్యెకమైన అర్హతా విలువా ఉన్నాయి.మానవజన్మ అనేది త్రిశంకుస్వర్గం లాంటిది. త్రిశంకువు పైకీ వెళ్ళలేడు కిందకూ రాలేడు.కాని మనిషి రెండూ చెయ్యగలడు.తెలివితక్కువగా జీవిస్తే జంతువులూ,పక్షులూ,క్రిమికీటకాదుల వంటి నీచజన్మలకు పోగలడు.తెలివితో అంతరిక సాధనలో నడిస్తే దేవతాలోకాలను అందుకోగలడు.చివరికి తానే దైవంగా మారగలడు.అంతటి మహత్తరమైన అవకాశం మానవ జన్మలో ఉన్నది.

మానవజన్మ కోసం అర్రులు చాచే కోటానుకోట్లు జీవులు  సూక్ష్మలోకాలలో ఎన్ని ఉన్నాయో దర్శిస్తే దిగ్భ్రాంతి కలుగుతుంది. ఆ దర్శనం పొందినవానికి నోటమాట రాదు.అటువంటి వాటిల్లో అన్నింటికీ రాని అవకాశం కొన్నిజీవులకు మాత్రమె వస్తున్నది. అలాంటి మానవజన్మను ఎత్తిన జీవి, ఆ జన్మను వృధాగా ఈషణాత్రయంలో గడిపి మళ్ళీ ఏడుస్తూ వృధాగా మరణిస్తే దానికి విలువేముంది? ప్రకృతి ఇచ్చిన మహదవకాశాన్ని కాలదన్నుకోవడం తెలివి ఎలా అవుతుంది?

మానవజన్మను ఎత్తినందుకు జీవితానికి ఒక సార్ధకత ఉండాలి.అలాటి సార్ధకతలలో అత్యంత ఉన్నతమైనది ఆత్మసాక్షాత్కారాన్ని, దైవసాక్షాత్కారాన్ని పొందటం మాత్రమే.మనిషి పెట్టుకునే గమ్యాలలో అత్యున్నతమైనవి ఇవి రెండే. మిగతావన్నీ ఉత్త కాలక్షేపం చేష్టలు. అయితే దీనిని ఒప్పుకోడానికి, కోరికలతో అహంకారంతో నిండిన మనిషి మనసు ఏ మాత్రం అంగీకరించదు. ఒకవేళ పైపైకి తలూపినా అంతరాంతరాలలో ఏ మనిషీ ఈ స్టేట్మెంట్ ను ఒప్పుకోలేడు.

సంపాదించడం, సుఖాలను అనుభవించడం, పెళ్లి చేసుకుని పిల్లలను కని వారిని పెంచి పెద్దచేసి ఆస్తులు వారికి అప్పగించడం, లేదా తనకంటే వారు ఇంకా ఎక్కువగా ఆస్తులు సంపాదించేలా చెయ్యడం, తర్వాత తాను మరణించడం -- చాలా మంది వీటినే ఏదో గొప్ప ఘనకార్యాలుగా భావిస్తారు. నిజానికి జంతువులు కూడా ఇవే పనులు చేస్తాయి. జీవితాదర్శాలు ఇవే అయ్యే పనైతే మనిషికీ జంతువుకీ ఏమీ భేదం లేదు. వీటన్నిటికీ భిన్నమైన ఉన్నతమైన ఆత్మావలోకనా ప్రయత్నం చేసిననాడే మానవజన్మకు నిజమైన సార్ధకత. లేకుంటే జంతుజన్మకూ మనజన్మకూ ఏమీ భేదం లేదు. జంతువులు బట్టలు వేసుకోవు, చదువుకోవు, ఉద్యోగాలు వ్యాపారాలు చెయ్యవు. మనం చేస్తాం. అంతే వాటికీ మనకూ తేడా. ఇంద్రియానుభవంలో మనిషికీ జంతువుకూ ఏమీ తేడా లేదు.

బ్రతకడం కోసమూ,తన అహాన్ని తృప్తిపరచుకోవడం కోసమూ,చేసే ప్రయత్నంలోనే మనిషి జీవితంలో మూడుమ్ముప్పాతిక వంతులు వృధాగా గడిచిపోతుంది. అయితే అదే ఏదో ఘనకార్యంగా మనిషి భావిస్తాడు. ఏవో గోల్స్ పెట్టుకుని వాటిని సాధించడం కోసం కష్టపడి అదేదో గొప్ప ఘనకార్యంగా భావిస్తాడు. ఏ గమ్యమూ లేని జీవితంకంటే ఏదోఒక గమ్యం పెట్టుకుని దానికోసం ప్రయత్నం చేసే జీవితం ఉన్నతమైనదే. కాదనలేము. కాని ఆ గమ్యాలలో కూడా అత్యున్నతమైన గమ్యం ఆత్మసాక్షాత్కారమే. కనుక దానికోసం ప్రయత్నం చేసే మనిషి జీవితం మాత్రమే అత్యుత్తమమైనది.

లౌకికగమ్యాలు ఏవీకూడా మనిషికి నిజమైన తృప్తిని ఇవ్వలేవు.అవి ఎండమావులవంటివి. ఎండమావి కనిపిస్తూ ఊరిస్తూ ఉంటుంది. అక్కడకు పోయి చూస్తే ఏమీ ఉండదు. మరికొంత దూరంలో ఇంకొక ఎండమావి కనిపిస్తూ ఉంటుంది. మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ మనిషి అక్కడికి పయనం సాగిస్తాడు.ఈ క్రమంలో ఏదో ఒకచోట ప్రాణాలు పోగొట్టుకుని శవంలా నేలరాలిపోతాడు. ఇది జీవితసత్యం.

మనం ఎవరికోసమైతే జీవితమంతా మన విలువైన సమయాన్ని వెచ్సిస్తున్నామో వారికి మనమీద నిజమైన ప్రేమ ఉందనుకోవడం పిచ్చిభ్రమ.ఈ ప్రపంచంలో ప్రేమ అనేది లేనేలేదు.ఇక్కడ ఉన్నదంతా స్వార్ధం మాత్రమే.ఈ స్టేట్మెంట్ కూడా అందరికీ నచ్చదు.కానీ ఒకరికి నచ్చినా నచ్చకున్నా ఇదే అంతిమ సత్యం అని నేను గట్టిగా చెప్పగలను.నాది  పెస్సిమిస్టిక్ యాటిట్యూడ్ అని కొందరు అనుకోవచ్చు.వారి అజ్ఞానానికి జాలిపడటం తప్ప ప్రస్తుతం ఏమీ చెయ్యలేను.ఒకవిషయం మాత్రం చెబుతాను.జీవితసత్యాలన్నీ చేదుగానే ఉంటాయి. అయితే ఈ సత్యం అర్ధం కావడానికి మనిషికి ఒక జీవితకాలం పడుతుంది. ఇదంత త్వరగా అర్ధం కాదు. ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నతర్వాత గానీ,ఎన్నో ఆశాభంగాలు పొందిన తర్వాతగానీ ఈ చేదునిజం మనిషికి మింగుడు పడదు.అయితే చాలామందికి అప్పటికే జీవితం అయిపోతుంది.ఇక అప్పుడు ఈ సత్యం అర్ధమయ్యీ చేసేదేమీ ఉండదు.

ఈలోకంలో ఇద్దరు మనుషుల మధ్యన బైండింగ్ ఫోర్స్ అనేది రకరకాలుగా ఉంటుంది.అది శారీరిక అవసరం కావచ్చు,ఆర్ధిక అవసరం  కావచ్చు,తప్పని బాధ్యత కావచ్చు,అహంతృప్తి కావచ్చు,సోషల్ సెక్యూరిటీ కావచ్చు, ఎమోషనల్ సపోర్ట్ కావచ్చు,ఇంకేదైనా కావచ్చు..కానీ ప్రేమ మాత్రం ఉండనే ఉండదు.చాలామంది మనుషులు ప్రేమని నటిస్తారు అంతేగాని నిజంగా ప్రేమించలేరు.నిజమైన ప్రేమ అనేది మానవులలో చాలామందికి  అనుభవంలో ఉండదని నా ప్రగాఢవిశ్వాసం. నా ఈ విశ్వాసం వెనుక దాదాపు నలభైఏళ్ల జీవిత పరిశీలన ఉన్నది. ప్రేమికులమని భావించే వారి మధ్యన కూడా ప్రేమ ఉండదనేది నా అనుభవంలో తేలిన నగ్నసత్యం.ఈలోకంలో రాజ్యమేలే రారాజు స్వార్ధం మాత్రమే. స్వార్ధం, ఈర్ష్యా, ద్వేషం, కోపం, కోరికలతో నిండి ఉన్న మనసుకు 'ప్రేమ' అన్న భావం అందనే అందదు. అందుకే మనుషుల్లో చాలామందికి ప్రేమ అనేది తెలియదని నేను బలంగా నమ్ముతాను.

అదలా ఉంచితే,చిన్నతనంలో పిల్లచేష్టలలోనూ,యౌవ్వనంలో చిలిపిచేష్టలలోనూ,నడివయస్సులో బాధ్యతల బరువులోనూ,ముసలి వయసులో మౌనవేదనలోనూ మనిషి జీవితం గడిచి వృధాగా మట్టిలో కలిసిపోతుంది.దీనిని ఎంతోమంది జీవితాలలో గమనించాను.కానీ, ఎందుకోసం ఈ మానవజన్మ వచ్చిందో ఎవరికీ అర్ధం కాదు. ఏమి చేస్తే జన్మకు సాఫల్యత కలుగుతుందో కూడా ఎవరికీ తెలీదు.ఈలోపు కాలం ఎవరికోసమూ ఆగదు. కాలగతిలో ఎందరి కుత్తుకలో అలా నిర్దాక్షిణ్యంగా తెగిపోతూనే ఉంటాయి. అయోమయంలో మనిషి జీవితం తెల్లవారిపోతూనే ఉంటుంది.

అసలు సింపుల్ గా బ్రతకడం కోసం మనిషి ఇంత కష్టపడాలా? అని ఆలోచిస్తే అక్కర్లేదు అని జవాబు వస్తుంది.నిరాడంబరంగా జీవింఛడానికి మనిషి ఇంతగా శ్రమించనక్కరలేదు.ఇప్పుడు చేస్తున్న శ్రమలో వందో వంతు చాలు. అప్పుడు మిగిలిన సమయాన్ని ఆత్మసాధనకు ఉపయోగించవచ్చు. కాని అలా చేస్తే మనిషికి విలాసాలు దొరకవు. జల్సాలూ ఇంద్రియభోగాలూ  లభించవు. కానీ అలా జీవించాలంటే తెగింపు కావాలి. ఆ తెగింపు ఎందరిలో ఉంటుంది?ఎవరికీ ఉండదు.అందరూ ఈపరుగుపందెంలో పరిగెత్తుతున్నారు. పక్కవాడు పరుగేడుతున్నాడు కనుక తానూ పరిగెత్తాలి.అంతేగాని తాను  ఎందుకు పరిగేడుతున్నాడో ఎవరికీ తెలియదు.

కాబట్టి దీనినిబట్టి ఏమి అర్ధమౌతున్నది?మనిషి వేస్తున్న వేషాలు,పొద్దుట్నించీ రాత్రివరకూ క్షణం తీరిక లేకుండా పరుగులెత్తడం, అవసరాలు తీరినా కూడా ఇంకాఇంకా సంపాదించడం ఇదంతా దేనికోసం?అంటే ఇదంతా విలాసాలు పొందడం కోసం మనిషిచేస్తున్న ప్రయత్నం మాత్రమే అన్నవిషయం చక్కగా కనిపిస్తున్నది. ఇంద్రియలౌల్యతలో మనిషి కొట్టుకుపోతూ దానికి స్వధర్మం అనో,బాధ్యతనో,తప్పదనో ఇంకోటనో ముసుగు తగిలించి ఆత్మవంచనలో కాలం వెళ్లదీస్తున్నాడు.సాయంతానికి నిద్రమాత్రలో ఆల్కహాలో తీసుకుంటే తప్ప రాత్రికి నిద్రపట్టనంత టెన్షన్ పడాల్సిన అవసరం మనిషి జన్మకు లేనేలేదు.ఇదంతా స్వయంకృతాపరాధమే. ఈ పరుగుపందెంలో తలమునకలై ఉన్న మనిషికి అంతరిక సాధన చెయ్యడానికి తీరిక ఏదీ?

ఏది ఎంతవరకు? అన్న విఛక్షణ మనిషికి కలగాలి. దేనికి ఎంత విలువ ఇవ్వాలో మనిషికి తెలియాలి. జీవితంలో ప్రయారిటీస్ అనేవి మనిషికి ఉండాలి.అవి లౌకిక జీవితంలోనో ఉద్యోగంలోనో ఆస్తులు సంపాదించడంలోనో డబ్బు కూడబెట్ట్టడంలోనో మాత్రమే ఉంటే చాలదు.వాటిని మనిషి జీవితం మొత్తానికీ వర్తింపచేసుకోవాలి.అతి ముఖ్యమైన అంతరికసాధనకు అతితక్కువ ప్రయారిటీని మనిషి ఇస్తున్నంతకాలం మనిషిజన్మ వృధా అవుతూనే ఉంటుంది.

రామకృష్ణులు ఒక కధ చెప్పారు.ఒక మనిషి రాజకార్యం నిమిత్తమై రాజధానికి వెళ్లాడు. అక్కడకు వెళ్లిన తర్వాత ఆ నగరం హంగులూ అక్కడి విలాసాలూ చూస్తూ ఊరంతా తిరుగుతూ తానోచ్చిన పని మరిచిపోయాడు.ఇంతలో చీకటి పడింది. తనకు ఉండటానికి బస లేదు. చీకటిలో చలిలో రాత్రంతా ఆరుబయట ఉండవలసి వచ్చింది.రోజంతా నగరశోభ చూస్తూ బససంగతే మరచిపోయాడు.అంతే గాదు.తను ఏపని మీద అక్కడికి వచ్చాడో కూడా మర్చిపోయి రోజంతా తిరుగుతూ ఉండటం వల్ల, మర్నాడు రాజదండనకు గురయ్యాడు. 

మనిషి జీవితం కూడా ఇంతే.ఏ మనిషి జీవితమైనా అంతిమంగా ఇంతే. జీవిత సాఫల్యతనూ, అంతిమతృప్తినీ ఇచ్చే అంతరిక సాధనను వదిలిపెట్ట్టి మనిషి వృధాగా ఈలోకంలో రకరకాల పనుల్లో తిరుగుతున్నాడు. మానవజన్మ అనేది ఒక మహత్తరమైన అవకాశంగా దైవం చేత మనిషికి ఇవ్వబడింది. ఈ లోకంలోకి మనిషి ఒక ముఖ్యమైన పనిమీద వస్తున్నాడు. కాని వచ్చిన తర్వాత ఆ పనిని మరచిపోయి వృధాగా కాలక్షేపం చేసి నిష్క్రమిస్తున్నాడు. కళ్ళు తెరిచి ఈ విషయాన్ని మొదటగా అతను గ్రహించాలి. 

అనవసరమైన జంజాటనలో మనిషి తన జీవితాన్ని వృధాగా గడుపుతున్నాడుగాని తాను చెయ్యవలసి అసలైన పనిని ఎప్పటికీ వాయిదా వేస్తూ పోతున్నాడు. ఇదే ప్రాధమికంగా మనిషి చేస్తున్న మొదటి తప్పు.ఈ తప్పును గ్రహించి సరిదిద్దుకున్నప్పుడే మనిషి జీవితం సాఫల్యతా మార్గంలో మొదటిఅడుగు వేస్తుంది.అలా చేయ్యనంతవరకూ మనిషి జన్మకూ జంతుజన్మకూ పెద్దగా తేడాలేదు.చేతులో ఉన్న సమయాన్ని వృధా చేసుకొని ముసలివయసులోనో మరణ సమయంలోనో బాధపడితే అప్పుడు ఏమీ ఉపయోగం ఉండదు.

ఆత్మసాక్షాత్కారాన్ని పొందడమే మనిషి జన్మకు సాఫల్యత. ఆ దిశగా ప్రయత్నం చేయ్యనప్పుడు, మనిషి తన జీవితాన్ని ఇంకెలా గడిపినా అది పూర్తి వృధానే అని చెప్పాలి.
read more " విలువైన జీవితం "

17, అక్టోబర్ 2012, బుధవారం

కాలజ్ఞానం -15

సప్తమిలోపు కదుల్తాయి పీఠాలు 
ప్రజాగ్రహం ముందు తలవంచాలి చీకటిరాజులు 
దశమీ ఏకాదశి చేస్తాయి విచిత్రాలు
మసకబారునింక మహిళా ప్రతిష్టలు

కళ్ళుతెరిచిన ధర్మం నోరుమూసుకోక తప్పదు 
అన్యాయపు పంచన తలదాచుకోక తప్పదు
ప్రజలే అవినీతిపరులైతే ఇంకేం చెయ్యగలం మనం?
ప్రకృతే కన్నుతెరిస్తే తప్పదుగా జనహననం?

ఎన్ని గొంతులు నినదించినా ఎన్ని చేతులు ప్రశ్నించినా
బానిసలకెలా వస్తుంది విముక్తి? పేడిజాతికెలా వస్తుంది శక్తి?
దోచుకోబడటం గొప్పనుకుంటే జనం
అమ్ముడుపోవడమే నీతనుకుంటే జనం   
అలాంటి దేశంలో ఎన్నున్నా ఏం ప్రయోజనం?
read more " కాలజ్ఞానం -15 "

16, అక్టోబర్ 2012, మంగళవారం

తులారాశిలో శని సంచారఫలితాలు

శనీశ్వరుడు 15 నవంబర్ 2011  న తులారాశిలో ప్రవేశించాడు.దాదాపు మూడేళ్ళు అంటే 3 నవంబర్ 2014 వరకూ ఈ రాశిలో ఉండబోయే కాలంలో ఆయన గమనస్తితులు ఇలా ఉంటాయి.

I.ఋజుగమనం
(1)15-11-2011 నుండి 7-2-2012 వరకు,  
(2)25-6-2012 నుండి 18-2-2013 వరకు,
(3)8-7-2013 నుండి 2-3-2014 వరకు
(4)21-7-2014 నుండి 3-11-2014 వరకు   
II.వక్రగమనం
(1)8-2-2012 నుండి 24-6-2012 వరకు,
(2)19-2-2013 నుండి 7-7-2013 వరకు,  
(3)3-3-2014 నుండి 20-7-2014 వరకు 
III.నక్షత్రపాద సంచారం
15-11-2011 -- 18-12-2011(చిత్త -3 తులా నవాంశ)
19-12-2011 -- 30-3-2012(చిత్త -4 వృశ్చిక నవాంశ)
31-3-2012 -- 15-5-2012(చిత్త -3 తులా నవాంశ)
16-5-2012 -- 3-8-2012(చిత్త -2 కన్యా నవాంశ)
04-8-2012 -- 11-9-2012(చిత్త -3 తులా నవాంశ)
12-9-2012 -- 11-10-2012(చిత్త -4 వృశ్చిక నవాంశ)
12-10-2012 -- 8-11-2012(స్వాతి -1 ధనుర్నవాంశ)
08-11-2012 -- 7-12-2012(స్వాతి -2 మకరనవాంశ)
08-12-2012 -- 18-1-2013(స్వాతి -3 కుంభనవాంశ)
19-1-2013 -- 21-3-2013(స్వాతి -4 మీననవాంశ)
22-3-2013 -- 9-5-2013(స్వాతి -3 కుంభనవాంశ)
10-5-2013 -- 3-9-2013(స్వాతి -2 మకరనవాంశ)
4-9-2013 -- 7-10-2013(స్వాతి -3 కుంభనవాంశ)
8-10-2013 -- 4-11-2013(స్వాతి -4 మీననవాంశ)
5-11-2013 -- 2-12-2013(విశాఖ -1 మేషనవాంశ)
3-12-2013 -- 4-1-2014(విశాఖ -2 వృషభనవాంశ)
5-1-2014 -- 30-4-2014(విశాఖ -3 మిధుననవాంశ) 
1-5-2014 -- 19-6-2014(విశాఖ -2 వృషభనవాంశ)
20-6-2014 -- 20-8-2014(విశాఖ -1 మేషనవాంశ)
21-8-2014 -- 2-10-2014(విశాఖ -2 వృషభనవాంశ)
3-10-2014 -- 2-11-2014(విశాఖ -3 మిధుననవాంశ)

వివిధ రాశులలో జన్మించినవారికి ఈ శనిగోచారం ఎలా ఫలితాలు ఇస్తుందో వచ్చే పోస్ట్ లలో చూద్దాం.
read more " తులారాశిలో శని సంచారఫలితాలు "

29, సెప్టెంబర్ 2012, శనివారం

కర్మయోగి మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) జాతకం

లోకంలో ఒక విచిత్రం మనకు ప్రతిరోజూ కనిపిస్తుంది. చాలామంది యోగం గురించి సనాతనధర్మం గురించి లెక్చర్లు ఇస్తారు.కాని వాటిని నిత్యజీవితంలో ఆచరించేవారు బహుతక్కువ   ఉంటారు.ఎందుకంటే వాటిని గురించి చెప్పడం చాలా తేలిక.ఆచరించడం మాత్రం బహుకష్టం. అందులో కర్మయోగం మరీ కష్టం.లోకంలో ఉంటూ,సమాజంతో మెలుగుతూ నిత్యజీవితంలో అనుక్షణం యోగస్తితిలో నిలిచి ఉండటమే  కర్మయోగం.స్వార్ధంతో నిండిన మనుషుల మధ్య నిస్వార్ధంగా జీవించడమే కర్మయోగం.దీనిని అనుష్టించిన వారు పురాణకథల్లో మాత్రమె మనకు కనిపిస్తారు.అలాంటివాళ్ళు ప్రస్తుతం మన మధ్యన ఉంటారా?అనుకుంటాం.ఉన్నారు.నవీనకాలంలో ఈ కుళ్ళుసమాజపు మధ్యన నివసిస్తూ కూడా ఆదర్శమయమైన జీవితాన్ని గడపి కర్మయోగాన్ని నిత్యజీవితంలో అనుష్టించిన మహనీయుల్లో ఒకరు మాధవసదాశివ గోల్వాల్కర్.రాష్ట్రీయ స్వయంసేవకసంఘ్ కు ఒక దిశనూ దశనూ కల్పించిన మహనీయుడు గురూజీ.

ఈయనను 'గురూజీ' అంటూ గౌరవంతో అభిమానంతో ప్రతి ఒక్క RSS కార్యకర్తా పిలుచుకుంటాడు. మనమూ అలాగే పిలుద్దాం. ఆ పేరుకు ఆయన నూటికి నూరుపాళ్ళూ అర్హుడు. చాలామందికి RSS అనగానే అదేదో మత సంస్థ అని అనిపిస్తుంది. ఆ సంస్థ యొక్క ముఖ్యనాయకుల గురించి వారి దేశభక్తిపూరిత జీవితాల గురించి మనకు అవగాహన లేక అలాంటి భావనలు కలుగుతాయి. అందుకే గురూజీ వంటి మహనీయుల జీవితాన్ని తెలుసుకోవలసిన అవసరం ఉన్నది. ఆయన యొక్క విశిష్ట జాతకాన్నీ, ఉత్తేజకర జీవితాన్నీ పరిశీలిద్దాం.


19-2-1906 ఉదయం 4.30 గంటలకు  నాగపూర్ లో గురూజీ జన్మించారు. ఆయన జాతకచక్రాన్ని ఇక్కడ చూడవచ్చు. విశిష్టవ్యక్తుల జాతకాలు విశిష్టంగానే ఉంటాయి.ఒక తపోమయుడైన కర్మయోగి యొక్క జాతకంలో ఉండే గ్రహస్తితులు ఇందులో మనకు కనిపిస్తున్నాయి.

లగ్నం ధనుస్సుకూ మకరానికీ మధ్య లగ్నసంధిలో పడింది. సహజ నవమస్తానానికీ కర్మస్తానానికీ మధ్యలో పడటంతో ఒక ప్రబలమైన సంకేతం వెలువడింది. కర్మరంగంలో ఉంటూ ధార్మికమైన బలంతో జీవించే వ్యక్తి జాతకం ఇక్కడ కనిపిస్తున్నది. 

కుటుంబస్థానంలోని సన్యాసయోగం వల్ల ఈయనకు సంసారపు ఖర్మ లేదని అర్ధమౌతున్నది. సప్తమాధిపతి చంద్రుడు ద్వాదశంలో చేరడం కూడా దీనికి బలం చేకూరుస్తున్నది. సుఖస్థానాధిపతి కుజుడు దానికి ద్వాదశంలో చేరడం కూడా ఇదే సూచిస్తున్నది. సప్తమంలో రాహువు యొక్క స్తితికూడా దీనినే సూచిస్తున్నది.మకరంలోని లగ్నకేతువువల్ల వైరాగ్యంతో కూడిన ఆధ్యాత్మికత సూచింపబడుతున్నది.

మంత్రస్థానంలో గురువుయొక్క స్తితితో ఉత్తమగురువువద్ద మంత్రోపదేశం పొందగలడు అని సూచన ఉన్నది.గురూజీ స్వయానా అఖండానందస్వామికి ప్రియశిష్యుడు మాత్రమేగాక స్వామియొక్క చివరిరోజులలో ఆయన దగ్గర ఉండి నిరంతరమూ ఆయనకు సేవచేసిన పవిత్రాత్ముడు.ఆయన వద్ద మంత్రోపదేశాన్ని పొందిన అదృష్టవంతుడు.  

అఖండానందస్వామి శ్రీరామకృష్ణుల ప్రధాన శిష్యులలో ఒకరని,శ్రీరామకృష్ణ సంప్రదాయపు తృతీయఅధ్యక్షుడని, ఆత్మజ్ఞానాన్ని పొందిన సద్గురువని చాలామందికి తెలియదు.అత్యున్నత బ్రహ్మానుభూతిలో నిరంతరం నిమగ్నమైన తన వైరాగ్యపూరిత మనస్సును, సోదరుడైన వివేకానందస్వామి ఆజ్ఞమేరకు కిందకు దించి, 'శివభావే జీవసేవ' అన్న మహత్తరమైన రామకృష్ణుని ఉపదేశం మేరకు తన జీవితాన్ని భరతదేశ సమాజోద్ధరణకు సమిధలా అర్పించిన మహనీయుడు అఖండానందస్వామి.ఆయన శిష్యుడవడం వల్ల గురూజీకూడా రామకృష్ణ సంప్రదాయ పరంపరలోని మహనీయుడయ్యాడు. శ్రీరామకృష్ణుని అనుగ్రహాన్ని పొందిన ధన్యుడయ్యాడు అని నిస్సందేహంగా చెప్పవచ్చు. తానువాడే కమండలాన్ని తన అంత్యసమయంలో ఆశీర్వాదపూర్వకంగా గురూజీ కిచ్చారు అఖండానందస్వామి.అది చివరివరకూ గురూజీవద్ద ఉండేది. అఖండానందస్వామి గురించి మరిన్ని వివరాలకు ఇక్కడ చూడవచ్చు.తర్వాతి పోస్ట్ లో స్వామి యొక్క మహత్తరమైన జీవితాన్ని స్పర్శిద్దాం.

గురూజీ జాతకంలో పంచమంలో ఉన్న గురువు నవమాన్నీ లగ్నాన్నీ తన ప్రత్యెక ద్రుష్టులతో వీక్షించడమే కాక, సప్తమ దృష్టితో సహజాష్టమమైన వృశ్చికాన్ని చూస్తున్నాడు. ఈ వీక్షణ కూడా గురూజీ యొక్క నిగూఢమైన ఆధ్యాత్మిక ఔన్నత్యాన్ని సూచిస్తున్నది.

యువకునిగా ఉన్నపుడే తీవ్రవైరాగ్యభావాలతో నిండి రామకృష్ణమఠంలో చేరుదామని గురూజీ తలపోశారు. కాని అఖండానందుల దివ్యదృష్టికి గురూజీ భవిష్యత్తు విభిన్నంగా స్పష్టంగా గోచరించింది.భారతదేశ సమాజోద్ధరణకు తన జీవితాన్ని సమర్పించమనీ, సౌశీల్యపూరిత జీవనాన్ని గడుపుతూ,దేశభక్తిని భారతపౌరులలో నింపుతూ,ఉన్నతమైన భారతదేశాన్ని నిర్మించే దిశగా మార్గనిర్దేశనం చేస్తూ ఒక కర్మయోగిగా జీవించమనీ ఆయన ఆదేశాన్నిచ్చారు. ఆ ఆదేశాన్ని తూచా తప్పకుండా తన జీవితమంతా గురూజీ పాటించారు.వివాహం చేసుకోకుండా ఉండిపోయి అత్యున్నత సన్యాసధర్మాలకు అనుగుణంగా ఒక కర్మయోగిగా ప్రపంచంలో జీవించారు.గురువుకు తగిన శిష్యుడనిపించుకున్నారు.

లగ్నారూడం అయిన మీనంలో నవమాదిపతి అయిన కుజుని స్థితీ, పంచమంలో రాహువుయొక్క స్తితీ ఈయనకున్న ఆధ్యాత్మికస్థాయిని సూచిస్తున్నాయి.ధార్మికమైన బలాన్ని పునాదిగా ఇచ్చి,అదేసమయంలో మాతృదేశ పునరుద్ధరణకోసం బహుముఖమైన ప్రణాళికలో   జీవితమంతా విశ్రాంతిలేని కర్మరంగంలో ఆయన్ను నడిపించింది ఈ గ్రహయోగం.

శనిబుధుల కలయిక వల్ల గురూజీ జాతకంలో వైరాగ్యపూరితభావాలు దర్శనమిస్తున్నాయి.చంద్రగురువుల షష్టాష్టకంవల్ల తన జీవితమంతా అతినిరాడంబర జీవితాన్ని గడుపుతాడు అన్న సూచన కనిపిస్తున్నది. ఆయనయొక్క గొప్ప వ్యక్తిత్వాన్ని  కళ్ళకు కట్టినట్లు చూపించే ముఖ్య ఘట్టాలనూ, గురువైన అఖండానందస్వామి యొక్క భావాలు ఆయనకు ఎలా మార్గనిర్దేశనం చేశాయో వివరించే ప్రయత్నాన్ని వచ్చే పోస్ట్ లో చేస్తాను.

(సశేషం)  
read more " కర్మయోగి మాధవ సదాశివ గోల్వాల్కర్ (గురూజీ) జాతకం "