“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, మార్చి 2015, గురువారం

మహావృక్షాలకు నీళ్ళు పోస్తున్న స్వామీజీలు

నేడు ఎక్కడ చూచినా స్వామీజీల క్లాసులు చాలా బిజీగా నడుస్తున్నాయి.

కొందరు స్వాములు కార్పోరేట్ ఉద్యోగులకూ,గవర్నమెంట్ ఉద్యోగులకూ కూడా క్లాసులు చెబుతున్నారు.జీవితమంతా అవినీతిలో గడిపిన ఈ ఉద్యోగులు ఏడాదికి ఒక మూడు రోజులు యోగా క్లాసులూ మెడిటేషన్ క్లాసులూ చేస్తున్నారు.

సరే వాళ్ళ అవస్థలు వాళ్ళు పడుతున్నారు.

అంతా బాగానే ఉంది.

మొన్నొక రోజున మా కొలీగ్ ఒకాయనా నేనూ ఏదో సందర్భంలో ఫీల్డ్ వర్క్ లో కలిశాం.

టీ ఆఫర్ చేశాను.

'ఒద్దు.మానేశాను' అన్నాడు.

'అదేంటి? మానేసేంత దురలవాటు కాదుగా ఇది?' అడిగాను.

'మొన్న మూడ్రోజుల పాటు కార్పోరేట్ మెడిటేషన్ ప్రోగ్రాం కి వెళ్లి వచ్చాను.అక్కడ ఒక్కొక్కరినీ ఏదో ఒకటి వదిలెయ్యమన్నారు.అందరూ వాళ్ళకిష్టమైనది ఏదో ఒకటి ఒదిలేస్తున్నారు.నేను టీ వదిలేశాను.' అన్నాడు.

జాలిగా చూశాను.

'వదిలెయ్యాల్సిన దుర్గుణాలన్నీ లోపలే ఉంచుకొని టీ ఒక్కటి వదిలేస్తే ఏమొస్తుంది?' అని నోటిదాకా వచ్చింది.

కానీ దానిని రిసీవ్ చేసుకునే పరిస్థితి అక్కడ లేకపోవడంతో మౌనంగా ఉండిపోయాను.

అతనికి నలభై- ఏభై మధ్యలో ఉంటుంది వయసు.

'మీ క్లాస్ కి వచ్చిన వాళ్ళలో ఎంత వయసు వాళ్ళున్నారు?' అడిగాను.

'అందరూ మన ఏజ్ గ్రూప్ వాళ్ళే'- చెప్పాడు.

కాసేపు టీ సిప్ చేస్తూ మౌనంగా ఉన్నాను.

తను బాటిల్లోంచి నీళ్ళు తాగుతూ ఉన్నాడు.

టీ త్రాగడం పూర్తి చేసి,- 'ఒక్కసారి బాటిల్ ఇవ్వు' - అని అడిగాను.

బాటిల్ నా చేతికిచ్చాడు.

అది తీసుకుని ట్రాక్ పక్కనే ఉన్న వేపచెట్టుకు నీళ్ళు పొయ్యడం మొదలుపెట్టాను.

'సార్!సార్! అది పెద్దచెట్టు.దాని వేర్లు భూమి లోపలదాకా ఉంటాయి.మనం నీళ్ళు పొయ్యనక్కరలేదు.మనం పొయ్యకపోయినా అది భూమిలోనుంచి నీళ్ళు గ్రహిస్తుంది.నీళ్ళు వేస్ట్ చెయ్యకండి.అసలే ఫీల్డ్ లో ఉన్నాం.నీళ్ళు జాగ్రత్తగా వాడుకోవాలి.' అన్నాడు.

'మరి ఏ చెట్టుకు పొయ్యాలి నీళ్ళు?' అడిగాను.

'మొక్కగా ఉన్నపుడు పొయ్యాలి.పెద్ద వృక్షంగా మారాక అక్కర్లేదు' అన్నాడు.

'మరి మెడిటేషన్ కూడా అంతే కదా? కాదా?' అన్నాను నవ్వుతూ.

అతను ఆలోచనలో పడ్డాడు.

ఈనాడు స్వామీజీలు నడుపుతున్న మెడిటేషన్ క్లాసులు కూడా ఇంతే.

చెప్పే స్వామీజీలకు 60 లలో ఉంటుంది వయసు.వినే అనుచరులకు కూడా దాదాపు అంతే ఉంటుంది.స్వామీజీకి గడ్డం నెరిసిపోయి ఉంటుంది.వినే శిష్యులకు పళ్ళు ఊడిపోయి ఉంటాయి.స్వామీజీని కుర్చీలోనుంచి ఎవరన్నా లేపవలసిన పరిస్థితి ఉంటుంది.భక్తులను కూడా అంతే.అందుకే వారసలు నేలమీదనే కూర్చోరు.వారుకూడా స్వామీజీ పక్కనే కుర్చీలలో దిండ్లు వేసుకుని జారగిలబడి కూచుని ఉంటారు.

ఒక్కొక్కసారి స్వామీజీ కంటే అనుచరులకే పెద్దవయసు ఉంటుంది.స్వామీజీ ఉపన్యాసం ఇస్తూ ఉంటే,భక్తులలో చాలామంది నిద్రపోతూ ఉంటారు.అంత వయసులో అన్నీ ఉడిగిపోయాక ఇంక వారు నేర్చుకునేది ఏముంది? సాధన చేసేది ఏముంది? సాధించేది ఏముంది?

'మేముకూడా ఫలానా క్లాస్ చేశాము'-అని గొప్పలు చెప్పుకోడానికి తప్ప ఈ క్లాసులు ఎందుకూ పనిచెయ్యవు.

'మేము కూడా ఫలానా స్వామీజీ శిష్యులము'- అని చెప్పుకోడానికీ,తద్వారా వచ్చే డొల్ల ఆత్మసంతృప్తికీ తప్ప ఇంకెందుకూ ఇవి పనిచెయ్యవు.

ఇలాంటి క్లాసులు పిల్లలకు చెప్పాలి.

ఇంకా లేతగా ఉన్నపుడే ఇలాంటి సంస్కారాలు అలవాటు చెయ్యాలి.

అది నేడు ఎవ్వరూ చెయ్యడం లేదు.

వీళ్ళ పిల్లలేమో మొబైల్స్ లో కూరుకుపోయి, బైకుల్లో కార్లల్లో జల్సాగా తిరుగుతూ,పబ్బుల్లో కాలక్షేపం చేస్తుంటారు.లేదా అమ్మాయిలూ అబ్బాయిలూ కలసి ఎక్కడో సరదాగా పార్టీలలో అల్ట్రా మోడరన్ గా తిరుగుతుంటారు.వీరి పునాదులు తప్పుగా పడిపోతుంటాయి.

పెద్దలేమో, స్వామీజీ క్లాసులలో కూచుని బోధనలు వింటుంటారు.

వృక్షాలయ్యాక వీరికి నీళ్ళు పొయ్యబడుతూ ఉంటాయి.

లేత మొక్కలకేమో విషం ఎక్కించబడుతూ ఉంటుంది.

రెండూ తప్పులే.

ఎవరి వయసులో చెయ్యవలసిన పనులు వారు చెయ్యడం లేదు.ఎవరి వయసులో అందవలసినవి వారికి అందటం లేదు.

దీనికి కారణాలు అనేకం.

మారుతున్న విలువలు,టీవీ,సెల్ ఫోన్, ఇంటర్ నెట్ ప్రభావం.ఇవి గాక స్నేహాలు.ఇలా రకరకాలుగా యువత తప్పుదారిన పోతున్నది.ఈ తప్పు పునాదుల ఫలితాలు 35-40 మధ్యలో వారికి తెలుస్తున్నాయి.అక్కడకు వచ్చేసరికి వారు డైరెక్షన్ లెస్ అయిపోతున్నారు.డొల్ల జీవితాలు గడుపుతున్నారు.అప్పటికే రెండు మూడుసార్లు విడాకులు తీసుకుంటున్నారు.డిప్రెషన్ కు గురౌతున్నారు.లేదా ఆత్మహత్యకు పాల్పడుతున్నారు.

ఇకపోతే పెద్దవారు.

వారి జీవితమంతా ఏదో గాలివాటంగా పూర్తిగా డబ్బుకోసం బ్రతికేసి, చివరలో ఏదో స్వామీజీని ఆశ్రయించి,ఒకరకమైన డొల్ల ఆత్మసంతృప్తితో వాళ్ళు కాలం గడుపుతున్నారు.కానీ అదీ నిజమైన సంతృప్తి మాత్రం కాదు.నిజమైన సంతృప్తి కోసం మొదటినుంచీ ఒక తీరులో బ్రతకాలి.అప్పుడే అది సొంతం అవుతుంది.ఇప్పటికప్పుడు రమ్మంటే గాలిలోనుంచి అదెలా వస్తుంది?

చిన్నప్పుడు ఆధ్యాత్మికంగా మంచి పునాది పడాలి.పెద్దయ్యాక దాని ఫలాలు అందుకోవాలి.అంతేగాని చిన్నప్పుడు గాలికి తిరిగి,పెద్దయ్యాక యోగా క్లాసులు చేస్తే ఉపయోగం ఏమీ లేదు.చదువుకోవలసిన వయసులో నిర్లక్ష్యం చేసి పెద్ద వయసులో 'అ ఆ' లు నేర్చుకోడానికి వయోజన విద్య నైట్ క్లాసులకు వెళ్ళినట్లుగా ఉంటుంది ఈ పరిస్థితి.

టీ మానేసినంత మాత్రాన ఏమీ ఒరగదు.ఈ రకంగా కాశీలో కూరగాయలు ఒదిలి పెట్టినవారినీ,రామేశ్వరంలో పచ్చళ్ళు ఒదిలిపెట్టిన వారినీ,యోగా క్లాసులలో టీ కాఫీలు ఒదిలేసినవారినీ చాలామందిని నేను చూచాను.కానీ వారి నిత్యజీవితంలో పెద్దగా ఆత్మౌన్నత్యం ఎక్కడా కనిపించదు.

దీనికి విభిన్నంగా అప్పుడప్పుడూ ఆల్కహాల్ త్రాగే సోషల్ డ్రింకర్స్ కూడా కొందరు నా స్నేహితులలో ఉన్నారు.అలాంటి వారిలో కొన్ని గొప్ప లక్షణాలను నేను గమనించాను.అవి మన సోకాల్డ్ ఆధ్యాత్మిక క్లాసులు అటెండ్ అయ్యేవారిలో ఉండకపోవడాన్నీ గమనించాను.

'వీరిద్దరిలో ఎవరికి ఎక్కువ మార్కులు పడతాయి?'- అని ఆలోచిస్తే రెండవ గ్రూపు వాళ్ళకే అని అర్ధమౌతుంది.

కనుక కావలసింది ఏమిటి? అని ఆలోచిస్తే ఒక్క విషయం కనిపిస్తుంది.

'మనం దేనిని బలవంతంగా,మొక్కుబడిగా, వదిలిపెట్టాం?' అన్నది ముఖ్యం కాదు.

'నిత్యజీవితంలో మనం ఎలా ఉంటున్నాం? మన సాటి మనుషులతో ఎలా ప్రవర్తిస్తున్నాం?'- అన్నదే అతిముఖ్యం.

ఒక వ్యక్తి నిత్యజీవితంలో పరమ స్వార్ధపరుడిగా ఉంటూ,మహా దురహంకారిగా ఉంటూ- కాఫీ టీలు మానేసి యోగా చేసినంత మాత్రాన అక్కడ ఏమీ ఒరగదు.కాకపోతే ఆరోగ్యం కొంత బాగుపడవచ్చునేమో?ఆ ఆరోగ్యం వల్ల,దురహంకారం ఇంకా పెరిగి సాటివారికి ఇంకా చెడు చేస్తాడు.

అదే సమయంలో ఇంకొకడు ఇవేవీ చెయ్యకపోయినా,కొన్ని సోకాల్డ్ దురలవాట్లు ఉన్నాకూడా, నిత్యజీవితంలో స్వచ్చంగా ఉంటే-- ఈ రెండో వాడికే నేను ఎక్కువ మార్కులు వేస్తాను.

నిజమైన ఆధ్యాత్మికత కాఫీ టీ లలో లేదు.మన అంతరిక పరిపక్వతలో ఉంది.ఆ పరిపక్వత మన నిత్యజీవితంలో మన చుట్టూ ప్రతిఫలించడంలో ఉంటుంది.

దానికి కావలసిన పునాదులు చిన్నవయసులోనే పడాలి.ఆ పునాదులు జీవితం అంతా గట్టిగా ఉండిపోతాయి.దానికి భిన్నంగా పెద్దవయసులో నేర్చుకునే ఆధ్యాత్మికత అనేది కూలిపోయే ఇంటికి రంగులు వేసినట్లుగా ఉంటుంది.దానిలో సహజత్వం రాదు.కృత్రిమంగా ఉంటుంది.

మొక్క చిన్నగా ఉన్నప్పుడే దానికి నీళ్ళు పొయ్యాలి.మహావృక్షంగా మారాక ఇంకా దానికి నీళ్ళెందుకు?

"ఒక పిల్లవాడు ఆలయానికి వెళ్ళకపోతే అది తప్పు.ఒక ముసలివాడు ఆలయానికి ఇంకా వెళుతూ ఉంటే అదీ తప్పే"- అన్నారు వివేకానంద స్వామి.

ఎంత గొప్ప నిజమో కదా??