“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జూన్ 2009, శుక్రవారం

దశ మహావిద్యలు-2


దశ మహావిద్యలకు గ్రహములకు సంబంధము కలదు అని కొందరంటారు. కాని దీనికి ప్రమాణము లేదు.వీరికి విష్ణు భగవానుని దశావతారములకు సంబంధము కలదు అని కొన్ని తంత్రగ్రంధములలో ఉన్నది.కాని అది తరువాతి వారి కపోలకల్పనగా తోస్తుంది.సంధ్యావందన మంత్రములలో దిగ్దేవతా నమస్కారము అని వస్తుంది.పది దిక్కులలో ఉన్న దేవతలను స్మరించి నమస్కరించుట జరుగుతుంది.


దశదిశలు అనే మాట అందరికీ తెలుసు. అష్ట దిక్కులు, పైన, క్రింద కలిపి దశ దిశలు. తంత్ర గ్రంథములలో సతీదేవి పది రూపములు ధరించి దశ దిశలను ఆక్రమించిన గాధలు కలవు.వారే దశ మహావిద్యలు. దిక్కులకు గ్రహములకు ఆధిపత్య రీత్యా సంబంధము కలదు.ఆ విధముగా చూస్తె జ్యోతిషమునకు దశ మహా విద్యలకు సంబంధము కనిపిస్తుంది.

లగ్నము-లలితాత్రిపుర సుందరి ,
రవి-త్రిపుర భైరవి,
చంద్ర-భువనేశ్వరి,
కుజ-బగలా ముఖి ,
బుధ-మాతంగి,
గురు-తార,
శుక్ర-కమలాత్మిక,
శని-కాళి,
రాహు-ఛిన్నమస్త,
కేతు-ధూమవతి

దశ మహావిద్యలలో ఎవరికీ వారే గొప్పవారు. వీరు ప్రత్యెక దేవతలు కారు. జగన్మాత యగు ఆద్యాశక్తి యొక్క వివిధ రూపములు. కనుక ఎవరిని ఉపాసించినా భుక్తి ముక్తులను ఇవ్వగలరు. కాని వారివారి లక్షణములను బట్టి ఒక్కొక్క ప్రత్యెక వరమును అధికముగా ఇవ్వ గలరు. కనుక జాతకమున గల ఒక్కొక్క దోషమునకు ఒక్కొక్క మహావిద్య ఉపాసన శ్రేష్టము.

అన్నింటికీ లగ్నము మూలము. కనుక దేవీ ఉపాసనలలో లలితా ఉపాసన ముఖ్యము అని కొందరి అభిప్రాయము. లలితా ఉపాసన యగు శ్రీవిద్య సర్వశ్రేష్ట విద్య. దానిని ప్రక్కన ఉంచితే, జ్యోతిష పరంగా చూస్తె గ్రహములలో అత్యంత శుభ గ్రహములు గురు శుక్రులు. కనుక విద్యలలో సౌమ్యమైనవి, భయము గోలుపనివి తార మరియు కమల. వీరే సరస్వతి మరియు లక్ష్మి. వీరు సాత్విక దేవతలు.

రవి కుజులు రాజసిక గ్రహములు. కనుక త్రిపుర భైరవి, బగళాముఖి రాజసిక దేవతలు. వీరు ఉగ్రరూపులు. వీరి ఉపాసన కష్టతరము.ఇక బుధచంద్రులు మిశ్రమ గ్రహములు. అనగా వారి స్థితిని బట్టి మంచీ చెడూ రెండూ చేయ గలరు. కనుక మాతంగి, భువనేశ్వరి అనువారు వీరికి అధిదేవతలు. వీరి ఉపాసన సాత్వికమునకు, రాజసమునకు మధ్యస్తంగా ఉంటుంది.

ఇక మిగిలినది శనీశ్వరులు. వీరికి కాళి అధిదేవత. రాహుకేతువులకు ఛిన్నమస్త, ధూమావతులు అధిదేవతలు. వీరి ఉపాసన బహు కష్టతరము. వివిధ ఆటంకములు, భయమును గొలిపే పరీక్షలతో కూడి ఉంటుంది. అంత మాత్రాన వీరిని తామసిక దేవతలు అనుట తప్పు.

వీరందరికీ ప్రత్యెక యంత్రములు, మంత్రములు, తంత్రము ఉంటాయి. మంత్ర భేదములు కూడా కలవు. ఒక్క తారామంత్రములె దాదాపు పది వరకు కలవు. ఇక కాళీ మంత్రములు అనేకములు కలవు. వీటిలో చిన్నవైన బీజ మంత్రముల నుండి దండకముల వంటి మాలామంత్రముల వరకు అనేక రకములు కలవు.

ఏదైనా, సాధకుని స్థితిని బట్టి, అర్హతను బట్టి ఉపాసన ఉంటుంది.ఉపాసనా రహస్యములను గురుముఖతా గ్రహించుట మంచిది.

గురువు అనబడే వానికి కొన్ని అర్హతలు ఉండాలి.ఉపదేశింపబడే మంత్రములో ఆయన సిద్ధి పొంది ఉండాలి.అపుడే అది సిద్ధ మంత్రము అవుతుంది. మంత్ర ఉపాసనా విధానాన్ని శిష్యునకు ఉపదేశించగల జ్ఞానము కలిగి ఉండాలి. అప్పుడే ఆ మంత్రము సిద్ధిస్తుంది.గురువు పూర్తిగా నిస్వార్థ పూరితుడై ఉండాలి. బ్రహ్మ వేత్త అయి ఉండాలి.కోరికలకు అతీతుడై ఉండాలి.నియమ నిష్టాగరిష్టుడై ఉండాలి.అలాగే శిష్యుడు కూడా నిర్మలుడు, బ్రహ్మచర్య దక్షుడు, సాధన యందు పట్టుదల కలిగినవాడు, సత్యకాంక్షి అయి ఉండాలి. అప్పుడే తంత్రమైనా మంత్రమైనా సిద్ధిస్తుంది. లేకుంటే సిద్ధి కలుగదు.