“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, జూన్ 2009, బుధవారం

కాళికా తత్త్వం-1


కాళీ ఉపాసన మన ఆంద్రదేశంలో అంతగా కనిపించదు. కాని బెంగాలు రాష్ట్రంలో కాళి ప్రతి ఇంటిలో ఇలవేలుపుగా ఆరాధించ బడుతూ ఉంటుంది.వారికి కాళి ముద్దులపట్టి.దశరా నవరాత్రులు వచ్చాయంటే  బెంగాలు రాష్ట్రంలో పండుగ వాతావరణం నెలకొంటుంది.

ప్రతిఇంటిలో కాళిని సొంతకూతురుగా భావించి అల్లుని ఇంటినుంచి పండుగకు పుట్టింటికి వచ్చినట్లు భావించి ఉత్సవాలు చేస్తారు.దశరా తరువాత తిరిగి ఆమె అల్లుని ఇంటికి పోయేటపుడు ఆకుటుంబం బాధ వర్ణనాతీతం.నిజంగా బాధను తట్టుకోలేక భోరున ఏడిచేవాళ్లు ఎందఱో ఉన్నారు.అట్టి భక్తి ఉన్నది కనుకనే బెంగాలురాష్ట్రంలో కాళీసిద్ధులు ఎందఱో ఈనాటికీ మనకు కనిపిస్తారు.

కాళికాతత్వాన్ని తెలుసుకోవలేనంటే శ్రీరామకృష్ణుని మాటల్లోనే తెలుసుకో గలము.సాక్షాత్ అవతారమూర్తి చెప్పినమాటల కంటే అధికారిక వివరణ ఇంకొకటి ఉండబోదు.కాళీ అంటే వెంటనే గుర్తుకు వచ్చేది శ్రీరామకృష్ణుడే. దక్షినేశ్వర కాళికాలయంలో ఉన్న కాళీమూర్తి ఆయన మాటలకు స్పందించింది.నైవేద్యం పెడితే తిన్నది.సందేహాలకు తల్లిగా సమాధానం చెప్పింది.నిరాశలో ఓదార్చింది.సమస్త దివ్యానుభవాలను అలవోకగా ప్రసాదించింది.గొప్ప గురువులను రప్పించింది.ఆయా సాధనామర్మాలు తానె చెప్పి చేయించింది. సిద్ధిదాత్రియై అనుభూతులను ఇచ్చింది.

వివేకానందుడు కల్లోలస్థితిలో ఉన్నపుడు శ్రీ రామకృష్ణులు ఆయన్ను దేవాలయానికి పోయి కాళీమాతనే ఏమికావాలో అడుగమని చెబుతారు. నరేంద్రుడు ఆలయంలో ప్రవేశించి కాళీవిగ్రహం ఎదుట నిలువగానే ఆయనకు కాళీమాత సజీవంగా పీఠంపై నిలబడి దర్శనం ఇచ్చింది. ఆ ప్రేమమయ తెజోమూర్తిని చూచిన నరేంద్రుడు తన లౌకికసమస్యలను మరచి శుద్ధభక్తిని వైరాగ్యాన్ని మాత్రమె కోరి తిరిగి వెనుకకు వస్తాడు.

ఒకరోజు రాఖాల్ను కాళీమాతమందిరం ఎదురుగా ఉన్న నాట్యమంటపంలో ధ్యానం చేయమని శ్రీ రామకృష్ణులు రాత్రిపూట ఒంటరిగా పంపిస్తారు.రాఖాల్ ధ్యానానికి కూర్చోనగానే తనకు కలిగిన దివ్యానుభవానికి చకితుడై పోయాడు.గర్భగుడిలోనుంచి కళ్లు మిరమిట్లు గొలిపే తెజోరాశి బయలుదేరి లోకాన్నంతా తన తేజస్సులో ముంచుతూ రాఖాల్ వైపు వచ్చి అతన్ని కూడా ముంచెత్తుతుంది. ఆ అనుభవంలో తన వ్యక్తిత్వం అదృశ్యం అయి సమాధిస్థితిని అందుకొంటాడు రాఖాల్. తరువాతి కాలంలో ఈయనే బ్రహ్మానందస్వామిగా లోకపూజ్యుడైనాడు. రాఖాల్ మాకందరికీ రాజు అని వివేకానందస్వామి స్వయంగా అనేవారు.

రాఖాల్ మరియు నరేంద్ర ఇద్దరూ యువకులుగా ఉన్నపుడు బ్రహ్మసమాజ భావనలకు ప్రభావితులై విగ్రహారాధనను నిరసించేవారు.అదే వివేకానందుడు జ్ఞానమూర్తిగా అమెరికాలో పర్యటించినపుడు విగ్రహారాధనలోని రహస్యాలను చెప్పి పాశ్చాత్యులను చకితులను చేసాడు. తాను సాధించిన లోకప్రసిద్ధిని విజయాలను కాళీమాత తన ద్వారా చేయించినదని తాను ఒక పనిముట్టును మాత్రమె అని ఆయన విశ్వసించేవాడు.

నేను ఒకసారి ఇలాగే కలకత్తాకు వెళ్ళినప్పుడు కాళీఘాట్ లో జరుగుతున్న జంతుబలులను చూచి తట్టుకోలేక తీసుకుపోయిన కొబ్బరికాయను కొట్టకుండా విసురుగా అక్కడనుంచి బయటకు వచ్చేసాను. అక్కణ్ణించి దక్షినేశ్వర్ కాళీదేవాలయానికి పోయేదారిలో ఆ కొబ్బరికాయ నా చేతిలోనే ఎప్పుడు పగిలిపోయిందో తెలియదు. చూస్తె పగిలిపోయి నా చేతిలోనే నీరు కారుతూ ఉంది.ఇది నేను నాతో ఉన్నమిత్రులూ చూచి నోటమాట రాక నిశ్చేష్టులమైనాము. సైన్స్ స్టూడెంట్ ను అయిన నేను దీనికి ఎలా వివరణ ఇచ్చుకోవాలో తెలియక ఊరుకున్నాను.

ఈ సంఘటన 31 డిసెంబర్ 1998 నాడు జరిగింది.

మాకు తెలిసిన ఒకరి సోదరుడిని గంధపుచెక్కల దొంగ వీరప్పన్ బంధించాడు. అతని విడుదలను కోరుతూ కాళీఘాట్ ఆలయంలో హోమం జరిపించారు. అక్కడ కలకత్తాలో హోమం పూర్ణాహుతి అయిన రోజునే ఇక్కడ వీరప్పన్ అతన్నివిడుదల చేసాడు.ఇది నిజంగా జరిగిన నమ్మలేని నిజం. ఇది నేను చూడలేదు కాని విన్నాను.ఇది చెప్పిన వ్యక్తి అబద్దాలు చెప్పే మనిషి కాదు. ఆమె ఉన్నత విద్యావంతురాలు. శారదామఠంలో సన్యాసినిగా పవిత్ర నియమపూరిత జీవితాన్ని గడుపుతున్న వ్యక్తి. కనుక ఇది నిజమే అని విశ్వసిస్తున్నాను.

కలకత్తా కాళీఘాట్లో ఉన్న కాళీమాత మరియు దక్షినేశ్వర్లో ఉన్న కాళీమాత విగ్రహాలు సజీవమూర్తులు. అనగా జాగృత దేవతలు. ధ్యానములో కొంత సాధన ఉన్నవారికి ఇది అనుభవంలోకి వస్తుంది.

'Autobiography of a Yogi' అనే తన పుస్తకంలో పరమహంస యోగానందగారు దక్షినేశ్వరంలో తనకు కలిగిన కాళీమాత దర్శనాన్ని 'The heart of a stone image'  అనే అధ్యాయంలో అద్భుతంగా వర్ణించారు.

హలదారి అని ఒక కజిన్ శ్రీ రామకృష్ణులకు ఉంటాడు.కాళి తామసిక దేవత ఆమెను పూజింపరాదు అని అతను అంటాడు.అది విని శ్రీరామకృష్ణులు ఏడుస్తూ అమ్మ ఎదురుగా కూలబడి 'ఏమిటమ్మా ఇది? ఈ విషయం నిజమేనా?నీవు తామసిక దేవతవా?' అని అడుగుతారు.

అప్పుడు అమ్మ సమస్త ప్రపంచాన్నీ మిరుమిట్లు గొలిపే తన దివ్యరూపంతో కనిపించి 'వాడి ముఖం.వాడొక అల్పుడు.నా నిజతత్త్వం వాడికేమి తెలుస్తుంది నాయనా?ఒక్క తామసిక గుణమేం ఖర్మ?రాజసికమూ నేనే.సాత్వికమూ నేనే.మూడు గుణాలూ నాలోనే ఉన్నాయి.అవి నేనే.వాటికి అతీతంగా కూడా నేనే ఉన్నాను.చూడు' అంటూ ఆ దర్శనాలను ప్రసాదిస్తుంది.

అప్పుడు శ్రీరామక్రిష్ణులు సంతోషంతో కాళికాలయం నుంచి బయటకు వస్తూ 'ఒరే మూర్ఖుడా!!నువ్వొక తెలివిలేని దద్దమ్మవని అమ్మ చెప్పింది. ఇంకెప్పుడూ కాళి తామసిక దేవత అని అనకు.' అని చీవాట్లు పెడతారు.

తెలియని వారికి కాళి ఒక భయంకర దేవత.

తెలిసిన వారికి ఆమె ప్రేమమయి.సమస్త జగత్తులకూ తల్లి.ఆపదలో రక్షించే దివ్యజనని.నవ్వుతూ వరాలిచ్చే దేవత.

కాళీ అనుగ్రహాన్ని పొందితే తంత్ర రహస్యాలన్నీ అరచేతిలో వచ్చి నిలుస్తాయి.