21, సెప్టెంబర్ 2010, మంగళవారం

అడవులదీవి సరదాయాత్ర

రేపల్లె దగ్గర అడవులదీవి అని ఒక ఊరుంది. అది సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ఊరు. అక్కడనుంచి కృష్ణా కాలువలో ఒకగంటన్నర ప్రయాణం చేస్తే అది సముద్రం లో కలిసే చోట ఒక బీచ్ఉంది. మొన్నీమధ్యన బీచ్ కి సరదా ప్రయాణం చేశాము.

రేపల్లెలో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి సాయంత్రం ఆరుగంటలకు మళ్లీ సముద్రంలోనుంచి వెనక్కు వచ్చాము.మొత్తంఒక ఇరవై మందిమి బయలుదేరి సరదా యాత్రలోపాల్గొన్నాము. బీచ్ నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది.

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి లేకపోతే దారిన ఎవరినీ రానివ్వరు. డీఎఫ్వో గారికి ముందే చెప్పాముగనుక ఆయనరెండు పడవలు, సెక్యూరిటీ గార్డ్ లను ఏర్పాటు చేసాడు. అందరం కలిసి రేపల్లెనుంచి కార్లలో బయలుదేరి అక్కడికి ఏడుమైళ్ళ దూరంలోని ఒక పల్లెకు చేరాము. అక్కడనుంచి ముళ్లచెట్లలో, బురదలో కొద్దిదూరం నడచి కృష్ణా కాలువ ఒడ్డు చేరిపడవలెక్కాము.

రెండు మరపడవలలో బయలుదేరి వీఐపీ లందరూ ఒక బోట్ లో, ఇతరులు ఒక బోట్లో దాదాపు గంటన్నర కృష్ణాకాలువలో ప్రయాణించి సముద్రానికి చేరాము. సాయంత్రం మూడున్నర నుంచి నాలుగున్నరవరకు ఒక గంట బీచ్ లోసరదాగా గడిపి మళ్ళీ వెనక్కు వచ్చాము. ఆ రోజంతా మబ్బు పట్టి చాలా ఆహ్లాదంగా ఉంది.

బీచ్ లో చేరి కొంచెం కుదుటపడ్డాక, అందరిలోని చిన్నపిల్లలు బయటకొచ్చారు. ఆటలాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నీళ్ళలో దిగి కేరింతలు కొట్టేవాళ్ళు, నత్తగుల్లలు ఆల్చిప్పలు ఏరేవాళ్ళు - ఇలా రకరకాలుగా పెద్దవాళ్ళలోని చిన్నవాళ్ళుబయటకొచ్చారు.

ఇంతలో మా బాస్ ఒక గొప్ప విషయం కనిపెట్టాడు. అక్కడక్కడా నీళ్లలో బంక మట్టి ముద్దల్లాటివి పడి ఉన్నాయి. మెత్తటిఒండ్రు మట్టి అలల ప్రవాహానికి అలా ముద్దలుగా మారింది. బహుశా నది సముద్రం కలిసే చోటనే ఇలాటివిఉంటాయనుకుంటా. మామూలు బీచ్ లలో అవి కనపడవు. చాలా మెత్తగా పేస్ట్ లాగా ఉంది.

" ఇదే ముల్తానీ మట్టి. దీన్నే బ్యూటీ పార్లర్లలో మొహానికి పూసి వేలకు వేలు గుంజుతారు." అని గట్టిగా ఎనౌన్స్ చేశాడుమా బాస్. అంతే . ఎవరికి వారు ఒక కారీ బ్యాగ్ ఎక్కణ్ణించో బయటకు తీసి పేడముద్దలు ఏరుకున్నట్లు మట్టినిసంచుల్లో సేకరించటం మొదలు పెట్టారు. మా బాస్ గుంభనంగా నవ్వుతున్నాడు. నేను ప్రహసనాలన్నీ గమనిస్తూఅటూ ఇటూ తిరుగుతూ సరదాగా గడిపాను.

ఇంతలో మా పెద్ద బాస్ గారు వారి సతీమణి ధ్యానానికి కూచున్నారు. ఆయన వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. చాలామంచి వ్యక్తి. గట్టి మిలిటరీ డిసిప్లిన్ మనిషి. బీచ్ ఒడ్డున సముద్రానికి అభిముఖంగా కూచొని ధ్యానం చేస్తున్నారు. వారినిచూచి ఇంకొందరు కూడా పద్మాసనాలు వేసి వారూ బుద్దులవలె కూచున్నారు. కొందరు బాబా రామ్ దేవ్ గారి కపాలభాతి మొదలు పెట్టారు. నేను వారిని తమాషాగా చూస్తున్నాను.

ఇంతలో మా గ్రూపులోని ఒకాయన నన్ను అడిగాడు. " ఏమండీ మీరు ధ్యానం చెయ్యరా?"

నేను అడ్డంగా తలూపాను.

"ధ్యానం ఆరోగ్యానికి చాలా మంచిదండీ. నేర్చుకోండి." ఆయన ఉచిత సలహా ఇచ్చాడు.

నేను నవ్వుతూ "అలాగే" అన్నట్లు తలూపాను.

"చూడండి మన జీఎమ్ గారే వయసులో కూడా ధ్యానం చేస్తున్నారు. మనం చెయ్యకపోతే ఎలా?" ఆయన ఇంకొకప్రశ్న సంధించాడు.

"నిజమే. ఆయన చేస్తున్నపుడు మనం చెయ్యకపోతే ఎలా?" అన్నాను నేను నవ్వుతూ.

"మరి చేద్దాం రండి" ఆయన ఆహ్వానం.

"ధ్యానం చెయ్యటం నాకు రాదే. పైగా ధ్యానం ఎవరికి వాళ్లే చెయ్యాలనుకుంటా." అన్నాను.

నన్నొక వింత జంతువును చూచినట్టు చూచాడు ఆయన.

నేనది పట్టించుకోకుండా అలాగే చూస్తున్నాను.

నాతో అనవసరం అనుకున్నాడేమో, కళ్ళుమూసుకొని కాసేపు ఇసకలోనే చతికిల బడ్డాడు.

ఈలోపల తెచ్చిన బాక్సులు విప్పి కూల్ డ్రింకులు, బిస్కట్లు, పండ్లు బయటకు తీసి అందరికీ పంచుతున్నారు కొందరు. మాటలకు, చప్పుళ్లకు అందరి ధ్యానాలూ ఎగిరిపోయాయి. నాకు ధ్యానం నేర్పుతానన్న ఆయన గభాల్న కళ్ళు తెరిచి లేచి తన ప్లేట్ తీసుకుని స్నాక్స్ లాగించటం మొదలుపెట్టాడు.

"ఏమండీ ధ్యానం అయిందా" అడిగాన్నేను.

". అయింది." అంటూ తలాడించాడు ఆయన. "ధ్యానంలో చాలా ప్రశాంతంగా ఉంటుందండీ" అన్నాడు పైగా.

"మరి ప్రశాంతతలో అలాగే ఉండక, లేచారెందుకు?" అమాయకంగా అడిగాను నేను.

"ఆత్మారాముణ్ణి శాంతింపచేయాలిగా." అన్నాడాయన అది కూడా ఒక డ్యూటీ అయినట్లు.
ఇంతలో అటూ ఇటూ చూచిఏదో రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి "ధ్యానమంటే ఏమీ లేదండీ శ్వాస మీద ధ్యాస. అంతే." అన్నాడు.

"ఓస్ ఇంతేనా. నేనింకా ఏదో అనుకున్నాను కదండీ" అన్నాన్నేను నవ్వాపుకుంటూ.

"అదంత తేలికనుకోకండి మరి. చాలా కష్టం. కూచుంటే తెలుస్తుంది" ఆయన ఉవాచ.

ఇక లాభం లేదనుకుని "సరేగానండీ, నాకొక సందేహం ఎప్పటినుంచో పీడిస్తోంది. మీరే దీనికి జవాబు చెప్పాలి" అన్నా.

". అడగండీ. దాందేముంది" అన్నాడు గురూజీ.

" పెద్ద గొప్ప డౌటు కాదనుకోండి. చిన్నదే"

"పర్లేదు చెప్పండి సార్" స్నాక్స్ లాగించి కూల్ డ్రింక్ అందుకుంటూ అన్నాడు ఆయన.

"మనమంటే దాహానికి కూల్ డ్రింకులు తాగుతున్నాం కదా. మరి చేపకు దాహం వేస్తే ఎలా?.అదేంతాగుతుంది పాపం?" అన్నాను.

అదోరకంగా చూచాడు ఆయన. నాకు నవ్వాగడం లేదు.

"ఏంటండి? నేను ధ్యానం గురించి చెబుతుంటే మీకొచ్చిన డౌటు ఇదా?" అన్నాడు అసహ్యంగా మొహం పెట్టి.

"ఇది నా డౌటు కాదండీ కబీరుకు కూడా ఇదే డౌటొచ్చిందిట ఒకసారి" అన్నాన్నేను.

"చుట్టూ నీళ్ళుంటే దాహమెందుకండీ" అన్నాడాయన.

"నిజమే కదా. మర్చేపోయాను. చుట్టూతా ఉన్నదానికోసం వెతకటం ఎందుకు? కరెక్ట్ గా చెప్పారు మీరు" అన్నాన్నేను.

ఆయనకు అర్ధం అయిందని నాకనిపించలేదు.

ఇంతలో మా జీఎమ్ గారు వారి సతీమణి ధ్యానం లోంచి లేచారు. వారి స్నాక్స్ అయినాక అందరం కలిసి మళ్లీ పడవలెక్కి వెనక్కు ప్రయాణంకట్టారు. మా గురూజీకి ఇందాకటి చేపదాహం పజిల్ అర్ధం కాక నన్ను అనుమానంగా చూస్తున్నాడు. అందులో ఏదో కిటుకుందని మాత్రం అతనికి తెలుస్తోంది. అదేంటో అర్ధమై చావటం లేదు.

బయలుదేరి వస్తూ పడవలోనుంచి వెనక్కు చూస్తూ మౌనంగా కూచున్నాను. మేమొదిలేసిన బీచి ప్రశాంతంగా మాకువీడ్కోలు చెబుతున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తూనే ఒక్క క్షణం ఏకాగ్రతగా ఈగిల్ విజన్ మోడ్ లోకి వెళ్లాను. క్రమేణా మాకు దూరంగాజరుగుతున్న బీచ్, సముద్రం, ఆకాశం అన్నీ మౌనంగా ధ్యానంలో ఉన్నట్లుగా అకస్మాత్తుగా నాకు ఒక ఫీలింగ్ కలిగింది.
వెంటనే చాందోగ్యోపనిషత్తులోని మంత్రం నాకు స్ఫురించింది.

శ్లో|| ధ్యాయం వావ చిత్తాధ్బూయో ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీవాంతరిక్షమ్ ధ్యాయతీవ ద్యౌ ర్ధ్యాయన్తీవాపో ధ్యాయన్తీవపర్వతా...........||

ఆ ఉపనిషద్రుషికి అన్నీ ధ్యానంలో ఉన్నట్లుగా కనిపించాయి. భూమి, అంతరిక్షం, ఆకాశం, జలమూ, పర్వతాలూ అన్నీ ధ్యానంలో మునిగి ఉన్నట్లుగా
మంత్రద్రష్టకు కనిపించాయి. ఎంత అద్భుతమైన భావన? దీనిని భావన అనడం కంటే దర్శనం అనాలేమో? నిజమే. మనం ధ్యానంలో ఉంటే ప్రకృతికూడా ధ్యానంలో ఉన్నట్లే కనిపిస్తుంది. మన లోపలి స్థితి ఏదో అదే బయటకూడా దర్శనమిస్తుంది. లోపల మార్కెట్టును ఉంచుకొని కళ్ళుమూసుకుని బిగదీసుకుని కూచుంటే లాభంలేదు.

మనిషి గొడవ చెయ్యకుండా మౌనంగా ఉంటే చాలు. ప్రత్యేక ధ్యానాలు అక్కర్లేదు. సమస్తప్రకృతి ఎల్లపుడూ ధ్యానంలోనేఉంది. మనమే గందరగోళంలో ఉన్నాము. మన అంతరంగ కల్లోలాలు శాంతిస్తే చాలు. మన ఆవేశాలు చల్లారితే చాలు. ఎల్లప్పుడూ ఉన్నది ధ్యానమే.
తన్ను తాను మరచి ప్రకృతితో మౌనంగా మమేకం కాగిలిగితే చాలు. తాను అదృశ్యుడై ప్రకృతిని దానిమానాన ఉండనిస్తే చాలు. అదే ధ్యానం. అని ప్రకృతి నాతో చెబుతున్నట్లు అనిపించింది. భావాన్ని ఆస్వాదిస్తూ ఏకాగ్రతను చెదిరిపోనివ్వకుండా నిమిషనిమిషానికీ దూరమౌతున్న బీచ్ వైపు చిరునవ్వుతో చూస్తున్నాను.

బీచ్ చాలా దూరం వెళ్ళిపోయింది. చేప గురూజీ ఇంకా ఆ పజిల్ మీదే ఉన్నాడు.

"సారు బలే విచిత్రమైన మనిషండీ. చేపకు దాహం వేస్తే ఎలా అని ఆలోచిస్తున్నట్లున్నారు" అంటూ జోకేస్తున్నాడు గురూజీ.

అందరి నవ్వులతో నెనూ శృతి కలిపాను.
read more " అడవులదీవి సరదాయాత్ర "

18, సెప్టెంబర్ 2010, శనివారం

జైమినీయ కారకాంశ- ఒక పాత జ్ఞాపకం

1998 ప్రాంతాలలో నాకొక స్నేహితుడుండేవాడు. అతని పేరు శ్రీనివాస్ అప్పటికే అతను.మంచి జ్యోతిష్య జ్ఞానం ఉన్నవాడు. అప్పట్లోనే పదివేలు పెట్టి ఒక పామ్ టాప్ కంప్యూటర్ లాటిది కొని దాన్ని వాడుతూ జాతక చక్రాలు వేసి చూస్తుండేవాడు. ఒక రూం నిండా అతని లైబ్రరీ ఉండేది. వాళ్ళుబ్రాహ్మణులు కారు. పద్మ శాలీలని ఒకసారి చెప్పినట్లు లీలగా గుర్తుంది. రాత్రింబగళ్ళు జ్యోతిష్య శాస్త్రాన్ని శోధిస్తుండేవాడు. అతనికి జ్యోతిష్య శాస్త్రం మీద అంతటి నిమగ్నత ఎలా వచ్చిందో నాకు ఆశ్చర్యం వేసేది. నేను నా స్నేహితుల కులాలని ఎప్పుడూ అడగను. కొంతమంది నా కాలేజి స్నేహితుల కులాలు ఈ మధ్యనే నాకు ఒక వివాహ మూలకంగా తెలిశాయి. మా స్నేహాలు, ఆ విధంగా కులాలకు అతీతంగా సబ్జెక్ట్ పరంగా ఉండేవి.

అదలా ఉంచితే, అతను సాయంత్రానికి స్నానం చేసి గణపతి మంత్రం జపించేవాడు. ఎవరిదగ్గర ఉపదేశం పొందాడో నేనూ అడుగలేదు అతనూ చెప్పలేదు. అతను కృష్ణమూర్తి పద్దతి ఫాలో అయ్యేవాడు. కృష్ణమూర్తి గారు ఉచ్చిష్ట గణపతిఉపాసకుడు కనుక విధానం ఫాలో అయ్యేవారు చాలామంది మంత్రాన్ని జపిస్తారని నాకు తెలుసు. అందుకనినేనూ అడుగలేదు. కాని రాత్రి కాగానే మద్య మాంసాలు స్వీకరించేవాడు. అతనికి ఇలాటి అలవాట్లు ఉన్నాయని అప్పటిదాకా నాకు తెలియదు. కాని ఒక జ్యోతిష్య కాన్పరెన్స్ కు కలకత్తా వెళ్ళినపుడు అతనూ నేనూ ఒకే గదిలో ఉన్నాము. అప్పుడు ఇదంతా చూచాను. ఒకపక్క జ్యోతిష్య సాధన చేస్తూ, మంత్ర సాధన చేస్తూ, పనులేమిటి అని మాత్రం అడిగాను. దానికి సమాధానం చెప్పలేదు గాని "తాంత్రికసాధనలో మద్య మాంసాలు తీసుకోవచ్చుగా" అని చెప్పాడు. నాకప్పటికే తంత్రసాధనలో గట్టి అనుభవం ఉంది. చాలామంది తమ నిగ్రహలేమికి తంత్రం అని పేరుపెట్టుకుని సరిపుచ్చుకోవటం నాకు తెలుసు. అతను అర్ధం చేసుకునేస్థితిలో లేడని గ్రహించి, వాదనెందుకని నేను నవ్వి ఊరుకున్నాను. కాని ఒకటి మాత్రం చెప్పాను. "జ్యోతిష్య సాధన చేసేవారు నియమ నిష్టలు పాటించాలి. ఇలాటి అలవాట్లు ఉండరాదు.లేకపోతే ఈ జ్ఞానం పట్టుబడదు. ఒకవేళ పూర్వకర్మప్రభావం వల్ల గట్టి ఇంట్రెస్టు ఉన్నా సరిగా ఉపయోగపడదు. దానికి తోడు రెమెడీలు పని చెయ్యవు. ఇతరుల కర్మవిపాక విధానాలను చెప్పేమాట అటుంచి, తన కర్మ తానే తీర్చుకోలేడు " అన్నాను. అతను నవ్వి ఊరుకున్నాడు. అతను వినడని, అలవాట్లు మానుకునే స్థాయి దాటిపోయాడని నేను గ్రహించాను.

ఒకరోజు అతని జాతకం చూస్తూ చర్చిస్తుండగా జైమిని సూత్రాల ప్రకారం "ఆత్మాధిక కలాధిభి:" అని జైమిని మహర్షిచెప్పినదానిని బట్టి, " భవేద్రాశి కలయో రాధిక్యా దాత్మకారక:" అని పరాశరులు చెప్పినదానినిబట్టి అతని ఆత్మకారకుని నిర్ధారించి పరిశీలిస్తున్నాము. అతనికి జైమిని విధానం తెలియదు. కనుక దానిగురించి నన్ను అడిగేవాడు. అప్పట్లో మేము రకరకాల జ్యోతిషవిధానాలను తీవ్రంగా పరిశీలిస్తూ వాటిని వివిధ జాతకాలకు అప్లై చేసి చర్చిస్తూ ఉండేవాళ్లం. కాని అతను సాంప్రదాయ రెమెడీలు పాటించేవాడు కాదు. ఏవో పిరమిడ్స్ అని, డాలర్స్ అని, రుద్రాక్షలని ఇంకా ఏవేవో తనకు తోచిన వాటిని, బజారులోని పుస్తకాలలో వచ్చేవాటిని రోజుకొకటి చొప్పున రెమెడీల క్రింద ట్రై చేస్తుండేవాడు. మాయలో పడవద్దని నేను చెప్పేవాణ్ణి కాని అతను వినేవాడుకాదు. సాంప్రదాయం గా వస్తున్న రెమెడీలు పాటించేవాడు కాదు. అతని జాతకంలోని కారకాంశను చూడటం తోనే "సమే వాహనా దుచ్చాచ్చ క్రమాత్పతనం " అన్న జైమిని సూత్రం నాకు స్ఫురణకు వచ్చింది. కారకాంశ ధనుస్సుగనుక అయితే వాహనాలనుంచి పడటంవల్ల గాని ఎత్తైన ప్రదేశాలనుంచిపడటం వల్ల గాని ప్రమాదం ఉంటుంది. అతని జాతకంలో అదే కాంబినేషన్ కనిపించింది. వెంటనే జైమినీయ చరదశను, గోచారాన్ని పరిశీలించాము. అప్పుడు జరుగుతున్న దశ చూడగానే నా గుండె గుభిల్లుమంది. ఎలా చెప్పాలా అనిచాలాసేపు ఆలోచించి, " ఏది ఏమైనా సరే, వాహనాలు స్పీడుగా నడపకు" అని మాత్రం చెప్పాను. సరే అనితలూపాడు.

ఇది జరిగిన నెల రోజులకనుకుంటాను. రాత్రి పదకొండు గంటలకు విజయవాడ నుంచి మోటార్ సైకిల్ మీద తాడేపల్లికి వస్తుండగా, సాయిబాబా గుడి టర్నింగ్ వద్ద స్పీడు గా ఎదురునుంచి వస్తున్న ఒక కారు అదుపుతప్పి ఇతన్ని గుద్దేసింది. వాహనం మీదనుంచి పడి దొర్లుకుంటూ రోడ్డుపక్కన డౌన్ లో పడిపోయాడు. కాలుప్రాక్చర్ అయింది. ఒక వారం హాస్పటల్ లో ఉండి, ఆపరేషన్ టేబుల్ మీద హార్ట్ ఎటాక్ తో చనిపోయాడు. అప్పుడతనికి 33 సంవత్సరాలు మాత్రమే. "వాహనా దుచ్చాచ్చ క్రమాత్పతనం" --"వాహనం మీద నుంచి పడి ఎత్తునుండి కిందకు దొర్లుటద్వారా ప్రమాదం జరుగును" అని జైమిని మహర్షి వేల సంవత్సరాల క్రితం చెప్పిన సూత్రం అక్షరాలా అతని విషయం లో జరిగింది. కాని అన్ని వేల ఏళ్ళ క్రితమే ఇలాటి కాంబినేషన్స్ ను పరిశోధనలో నిగ్గు తేల్చి వాటిని సూత్రాలుగా వ్రాసిపెట్టిన మహర్షుల మేధాశక్తి ఎంతటిదో అల్పజ్ఞులమైన మన ఆలోచనకు అందదు. విషయం నన్ను చాలాఆశ్చర్యానికి గురిచేసింది. శాస్త్రంలో ఇంకా లోతైన పరిశీలన చెయ్యాలన్న ఆసక్తిని పురికొల్పింది. చాలా బాధాకరమైన విషయం అయినప్పటికీ, మరువలేని కొన్ని పాత ప్రిడిక్షన్స్ లో ఇదొకటి.
read more " జైమినీయ కారకాంశ- ఒక పాత జ్ఞాపకం "

10, సెప్టెంబర్ 2010, శుక్రవారం

నిజమైన ఇంకో జోస్యం (వ్యక్తి జాతకంలో)

రెండు రోజులనాడు ఒక స్నేహితుని జాతకం చూస్తూ ఇలా చెప్పాను.

"రాబోయే రెండురోజులలో నీకు ఒక ప్రమాదం జరుగబోతున్నది. కేతువు యొక్కసూక్ష్మ దశ జరుగుతున్నది కనుక ఏదో ఒక ఊహించని ప్రమాదంకలుగుతుంది. జాగ్రత్తగా ఉండు."

అతనికి జ్యోతిష్యాలంటే పెద్ద నమ్మకమూ లేదు. అలాగని అపనమ్మకమూలేదు. చాలామంది లాగే దానితో మనకెందుకు అనుకునే రకం మనిషి. మన పనిమనం చేసుకుంటే గ్రహమూ ఏమీ చెయ్యదు అని నమ్ముతాడు.

అతను నవ్వాడు.

"అంటే జాగ్రత్తగా ఉంటే జరిగే ప్రమాదం జరగదా? అలాగైతే జ్యోతిష్యం తప్పు అయినట్లే కదా" అన్నాడు.

నాకు ఇలాటి పిల్లకాకి వాదనలు వినీ వినీ విసుగొచ్చింది.

వీళ్ళకున్నపాటి అరికాలి మెదడు లేకుండానే మహర్షులు ఇన్నిన్ని శాస్త్రాలు వ్రాశారా? అని వీళ్ళు ఎందుకు ఆలోచించరోఅనిపిస్తుంది.

ఇంకొడైతే "నీ ఖర్మ" అని ఒదిలేసేవాణ్ని.కాని నాకు మంచి స్నేహితుడు. మా నమ్మకాలలో విభేదాలున్నప్పటికీమేమిద్దరం మంచి స్నేహితులం.

కనుక సరేరా "నీ నమ్మకాలు ప్రస్తుతానికి అలా ఉంచు. నే చెప్పిన మంత్రం స్మరిస్తూ ఉండు". అని చెప్పాను.

వాడు నాస్తికుడు కాదు గాని జాతకాలను గ్రహాలను నమ్మడు. దైవభక్తి ఉన్నవాడు.

గుణాన ఉన్నాడో "సరేరా" అన్నాడు. అంటూ " రకమైన ప్రమాదమో అదికూడా చెప్పుమరి" అన్నాడు. నీ జాతకంలోకేతువున్న స్థితిని బట్టి నీ తలకు బలమైన దెబ్బ తగులవచ్చు. జాగ్రత్త అని చెప్పాను.

తరువాత సంగతి మరిచిపోయాను. ఇద్దరం ఎవరి పనుల్లో వాళ్ళు నిమగ్నమయ్యాం.

రోజు ఏం జరిగిందో చూద్దామా?

ఇప్పుడే పనిమీద విజయవాడ వెళ్ళి తిరిగి వచ్చి అలా రిలాక్స్ అవుతున్నాను. ఇంతలో వార్త తెలిసింది. వెంటనే ఫోన్చేయగా తెలిసిన విషయాలివి.

రేపు వినాయక చవితి కనుక చవితి పందిళ్ళు అన్ని చోట్లా వేస్తున్నారు. మన వాడు రోడ్డుపక్కగా నిలబడి ఎవరితోనోమాట్లాడుతున్నాడు.

ఇంతలో మాట్లాడుతున్న
రెండవ వ్యక్తి " ఒరేయ్. వినాయక విగ్రహం చూడు ఎంత బాగుందో" అన్నాడు. రకరకాలరంగు రంగుల వినాయక విగ్రహాలు రిక్షాలమీదా, ఆటోలలోనూ తీసుకుపోతున్నారు.

మనవాడు తలతిప్పి చూడటం, పక్కనే కడుతున్న పందిరి నుంచి ఒక సర్వి గుంజ (సర్వి బాదు అని కూడా పిలుస్తారు) జారి, వీడి తల పక్కగా తాకుతూ వచ్చి భుజం మీద పడటం బలమైన దెబ్బ తగలటం ఒక్క క్షణం లో జరిగింది. ఇంకేముంది లబలబ మొత్తుకుంటూ దగ్గరలోని హాస్పటల్ కు పరిగెత్తి టెస్ట్ లూ, ఇంజక్షన్లూ అన్నీ మామూలుగాజరిగిపోయాయి.

" మంచి దెబ్బ తగిలిందిరా. మనది ఎక్సర్ సైజ్ బాడీ గనుక తట్టుకున్నాను. అదృష్టం బాగుండి ఫ్రాక్ఛర్ కాలేదు. తలపక్కకి తిప్పక పోయి ఉంటే గుంజ తలమీద పడి తల పగిలి ఉండేది. నువ్వు చెప్పింది నిజం అయ్యిందిరా. వినాయకవిగ్రహం చూద్దామని తల తిప్పటం నన్ను రక్షించింది. కాదు కాదు వినాయకుడే రక్షించాడు." అని మూలుగుతూ మావాడుఫోన్ లో చెప్పాడు.

ఇలాటి ఘటనలు చాలా చూచాను గనుక, అనుభవంతో, "నిన్ను పక్కకు చూడమని చెప్పిన ఫ్రెండ్ పేరు ఏమిట్రా" అనిఅడిగాను.

"వాడిపేరు గణేశ్వర్రావు రా. నీకూ తెలుసుగా. మొన్న మీ ఆఫీస్ కు నాతో బాటు వచ్చాడే .అతనే" అని అవతల పక్కనుండి జవాబు.

నాకు అంతా అర్ధమైంది.

"మరి నేను చెప్పిన మంత్రం రెండు రోజులూ జపిస్తున్నావా?" అని అడిగాను.

"చేస్తున్నానురా బాబూ . లేకపోతే నువ్వు ఊరుకోవుగా." అని వాడి జవాబు

ఇంతకీ నేను మావాణ్ణి స్మరించమని చెప్పింది గణేశ మంత్రమే మరి.

మనం గనుక సరియైన రెమెడీ పాటిస్తే, అదే దేవత పేరుగల ఒక వ్యక్తి నుంచో, లేక సాకుతోనో ఏదో ఒక అనుకోనిసహాయం అంది మనం రక్షింపబడతాం. వీడి విషయం లో అదే జరిగింది. వినాయక విగ్రహం చూడమని గణేశ్వర్రావు అనేప్రెండ్ చెప్పటం వీడు తల తిప్పటం వల్ల తల పగలకుండా రక్షింపబడ్డాడు. కాని కర్మ ఫలితం తప్పదుగదా మరి. అందుకేభుజం మీద దెబ్బ తగిలింది. గొడ్డలి వేటు పడాల్సిన చోట గోటితో గీరుకుంటుంది అంటే ఇదేగా మరి.

జ్యోతిష్య విజ్ఞానం యొక్క మహత్వానికి ఆశ్చర్య పోవడం విన్నవారి వంతు అయింది. అభినందనలతో మిత్ర బృందం నుంచిఇంకా ఫోన్ కాల్స్ వస్తూనే ఉన్నాయి. నేను ఇలాటి సంఘటనలు చాలా చూచాను గనుక నాకేమీ ఆశ్చర్యం కలగలేదు.

ఇదీ జ్యోతిష్యం వల్ల ఉపయోగం.
read more " నిజమైన ఇంకో జోస్యం (వ్యక్తి జాతకంలో) "

4, సెప్టెంబర్ 2010, శనివారం

తొలగిన శుక్రుని కరుణ-2

నిన్న శుక్రవారం నాడు ప్రమాదాలు జరిగాయి.

పాకిస్తాన్ లోని క్వెట్టా నగరం లో షియాల ర్యాలీ గొడవల్లో మానవ బాంబు పేలుడు, తరువాత ఉగ్రవాదుల కాల్పుల వల్ల రక్తపాతం జరిగి కనీసం ఏభై మంది తుక్కు తుక్కుగా చనిపోయారు.

రష్యాలో షార్ట్ సర్క్యూట్ వల్ల అడవులు అంటుకుని కార్చిచ్చు వ్యాపించి కనీసం 500 ఇళ్ళు తగల బడ్డాయి. కనీసం 1000 మంది రోడ్ల పాలయ్యారు.

బ్రిటన్ లో హరే కృష్ణ ఆలయంలో గ్యాస్ సిలిండర్లు పేలి తీవ్ర అగ్ని ప్రమాదం జరిగి భవనం దాదాపు ద్వంస మైంది.

ఈ రోజు తెల్లవారు జామున న్యూజిలాండ్ లోని క్రీస్ట్ చర్చి సిటీలో పెద్ద భూకంపం వచ్చి సివిల్ ఎమర్జెన్సీ విధించారు. రిచ్టార్ స్కేల్ మీద 7.4 గా నమోదైంది. జన జీవనం అతలా కుతలం అయింది.

దుబాయి లో కార్గో విమానం ఒక బిజీ హైవె దగ్గర కూలింది. సిబ్బంది చనిపోయారు.

ఒకటో తేదీన మనం ఊహించినదే ఈనాడు జరుగుతున్నది. మానవ జీవితం మీద గ్రహ ప్రభావానికి ఇదొక నిదర్శనం.
read more " తొలగిన శుక్రుని కరుణ-2 "

1, సెప్టెంబర్ 2010, బుధవారం

తొలగిన శుక్రుని కరుణ

శుక్రుడు ఈ రోజు కన్యారాశిని వదలి తులా రాశిలో ప్రవేశించాడు.

దీనివల్ల కొన్ని సంఘటనలు జరుగుతాయి.

కుజుడు అగ్నితత్వ గ్రహం. శని వాయు తత్వ గ్రహం. వీరి కలయిక వల్ల అగ్నికి వాయువు తోడైనట్లుగా ఉంటుంది. కనుక కుజ శనుల కలయిక అగ్ని ప్రమాదాలకు పేలుళ్ళకు దారితీస్తుంది.
శుక్రుడు జలగ్రహం. కనుక శుక్రుని జలప్రభావం వల్ల ఆ ప్రమాదాలు జరుగవు. లేదా ఒకవేళ జరిగినా తక్కువ స్థాయిలో జరుగుతాయి. నిప్పును నీరు ఆర్పినట్లు శుక్రుని ప్రభావం పనిచేస్తుంది.

కాని నేడు శుక్రుడు, కన్యారాశిలో ఉన్న కుజశనులను వదలి తనదైన తులా రాశిలో ప్రవేశించాడు.

కనుక శుక్రుని జలప్రభావం వారిమీదనుంచి తొలగి పోతుంది. నీరు దూరమైతే అగ్ని మళ్లీ మండటం మొదలు పెడుతుంది. అప్పుడు మళ్లీ అగ్ని ప్రమాదాలు, వాహన ప్రమాదాలు, భవన ప్రమాదాలు, బాంబు పేలుళ్ళు విజృంభిస్తాయి.

చూద్దాం ఏం జరుగుతుందో?
read more " తొలగిన శుక్రుని కరుణ "

31, ఆగస్టు 2010, మంగళవారం

జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనం -వేదాంత చర్చలు

రోజు సాయంత్రం తమ్ముడు చంద్రశేఖర్ ఢిల్లీనుంచి వచ్చాడు. రాత్రికి హైదరాబాద్ పోయి రేపు ఢిల్లీ వెళతాడు.కనుక మిత్రుడు గిరిజా శంకర్ గారి షాపులో అర్జంటు సమావేశమయ్యాం. మాటల మధ్యలో మంచి ఆధ్యాత్మిక సంభాషణలుజరిగాయి.వాటిలో నుంచి కొన్ని మాటలు.

గిరిజా శంక్రర్ గారు మంచి వేదాంతి. బయటకు కనపడడు కాని మాట్లాడితే ఆణిముత్యాలు దొర్లుతాయి. ఆయన నృశింహానంద భారతీ స్వామి శిష్యుడు. గుంటూరులో నృశింహానంద భారతీస్వాములవారని ఒక స్వామి ఉండేవారు. ఆయన కళ్యాణానంద బారతీస్వామి సాంప్రదాయానికి చెందిన వారు. అచ్చమైన వేదాంతి.అసలైన స్వామి.అంతేగాక మంచి జ్యోతిష్య పండితుడు కూడా.

ఆయన ఒకసారి ఇలా అన్నారట.

జ్యోతిశ్శాస్త్ర ఉపయోగం ఏమిటో తెలుసా? నీ జీవితంలో ముందు ముళ్లదారి ఉందని ఆ శాస్త్రం చెబుతుంది. చీకటిపడబోతున్నదని చెబుతుంది. ఎండ ఎక్కువగా ఉంటుందని చెబుతుంది. నీవు చెప్పులు వేసుకుంటావు.టార్చ్ లైట్దగ్గర పెట్టుకుంటావు. గొడుగు వేసుకుంటావు. అంతే దాని ఉపయోగం. కాని ముళ్ళూ తప్పవు, చీకటీ తప్పదు,ఎండాతప్పదు. ప్రారబ్దాన్ని జ్యోతిష్యం తీసివెయ్యలేదు. కాని జాగ్రత్తపడమని ముందుగా సూచిస్తుంది.

ఆయనను ఒకరు ఇలా అడిగారు.
ప్రశ్న: స్వామీ సన్యాసికి ప్రారబ్దం ఉండదు కదా?
స్వామి: ఎందుకలా అనుకుంటున్నావు?
ప్రశ్న: సన్యాసం అంటే రెండవ జన్మ కదా. అప్పుడు మొదటి జన్మ ప్రారబ్దం నశిస్తుంది కదా అందుకని అలా అడిగాను.
స్వామి: సన్యాసం తీసుకోవడం కూడా ప్రారబ్ద కర్మ ప్రకారమే జరుగుతుంది నాయనా. ఇక ప్రారబ్దం తప్పేదెక్కడ?

ఇంకొక సారి ఒకరు ఇలా అడిగారు:
ప్రశ్న: స్వామీ మీరు దండ కమండలాలు ధరించాలి కదా.వాటిని ఎందుకు వదిలేశారు?
స్వామి: అంటే నేనొక స్వామిని గురువును అని అందరికీ చాటింపు వేసుకోవాలా? ఖర్మ నాకెందుకు. అందుకే వాటినీవిసర్జించాను.

వింటున్న చంద్రశేఖర్ ఇలా అన్నాడు.
రమణమహర్షిని కూడా ఒకాయన ఇలాగే అడిగాడు."స్వామీ మీరు వివాహం ఎందుకు చేసుకోలేదు?" అని.
దానికాయన " అది నా ప్రారబ్దం కాదు కనుక చేసుకోలేదు" అని చెప్పాడు. ఇంకొకాయన అలాగే " స్వామీ మీరుసన్యాసం ఎందుకు తీసుకోలేదు" అని ఆయన్నె అడిగాడు. దానికాయన మళ్లీ అదే సమాధానం చెప్పాడు.

వింటున్న నేనిలా అన్నాను.

ఒకవేళ మహర్షి సన్యాసం తీసుకుని ఉంటె అదే ప్రశ్న అక్కడా ఎదురై ఉండేది. "స్వామీ మీరు ఆత్మ జ్ఞాని కదా మీరు సన్యాసం ఎందుకు తీసుకున్నారు. దాని ఆవశ్యకత ఏముంది?" అని. కనుక లోకుల మాటలు పట్టించుకోకుండా మన పని మనం చేయ్యటం ఉత్తమం.

సంభాషణ జప ధ్యానాల వైపు మళ్ళింది.మిత్రుడు గిరిజా శంకర్ చక్కని మాట ఒకటి చెప్పాడు.

కాయిక వాచిక మానసిక అని మూడు చెబుతారు కదా. మనసా వాచా కర్మణా అని కూడా అంటారు. మనిషికి మూడు స్థితులలోనూ ఏదో ఒక ఆధారం కావాలి.

బాహ్యంగా ఏదో ఒక విగ్రహం యొక్క ఆసరా కావాలి. వాక్కుకు స్తోత్రమో మంత్రమో ఏదో ఒకటి ఆసరాగా కావాలి. మనస్సుకు ఏదో ఒక ఆలంబన ధ్యానానికి కావాలి. మూడూ అధిగమిస్తే ఇక నిరాకారమే, నిరాధారమే.అటువంటి వానికి ఆసరా అక్కరలేదు. నిరాకార, నిశ్చల, నిరంజన స్థితి అంటే అదే.

త్యాగరాజు ఒక కీర్తనలో ఇలా అన్నారు. "మనసు స్వాధీనమైన మంత్ర తంత్రములేల?" ఆయన ఇంకా ఇలా అన్నారు."గ్రహబలమేమి రామానుగ్రహ బలముగాని".

ఇలా సంభాషణ చాలాసేపు జరిగింది.

చంద్రశేఖర్ ఇలా అన్నాడు.
అన్నగారూ నాకొకటి అనిపిస్తున్నది. ఆధ్యాత్మికంగా ఒక మనిషి ఎదిగాడా లేదా అని ఎలా చెప్పగలం అని చాలారోజులనుంచి నాకొక సందేహం ఉండేది. మధ్యనే నాకు జవాబు దొరికింది. మనిషికి ఎంతగా దేహస్పృహ (Body identification) తగ్గుతుందో అంతగా ఆధ్యాత్మికంగా ఎదిగినట్లు అని నా భావన. మీరేమంటారు?

నేను నిజమే అన్నట్లు తలాడించాను.

మనిషికి దేహవాసన,లోకవాసన, శాస్త్రవాసన అని మూడు ప్రతిబంధకాలుంటాయి. వీటిని ఎంతగా తగ్గించుకుంటే అంతగా అంతరిక జీవితంలో ముందుకు పోగలుగుతాడు. తన దేహాన్ని, తన చుట్టూ ఉన్న లోకాన్ని, తనదనుకునే జ్ఞానాన్ని మరచిపోగలిగినవాడు నిజంగా మహాత్ముడే. అట్టివాడే ఆత్మజ్ఞుడు.

మళ్లీ కలుద్దామని సమావేశం ముగించాము.
read more " జ్యోతిశ్శాస్త్ర ప్రయోజనం -వేదాంత చర్చలు "

25, ఆగస్టు 2010, బుధవారం

పౌర్ణమి ప్రభావం- విమాన ప్రమాదాలు

నేను ఇంతకు ముందు అనేక పోస్ట్ లలో వ్రాసిన మేదినీ జ్యోతిషసూత్రం మళ్ళీ పనిచేసింది.

నిన్న శ్రావణ పౌర్ణమి.

శుక్ర కుజ గ్రహాలు మళ్లీ డిగ్రీ కంజక్షన్ లో చాలా దగ్గరగా బుధునిదైన కన్యా రాశిలో ఉన్నాయి. శుక్రునకు ఇది నీచ రాశి. గురువూ బుధుడూ వక్ర స్థితిలో ఉన్నారు. బుధుడు, కుజ శుక్రుల కలయిక జరిగిన కన్యారాశికి అధిపతి.

ఈ గ్రహస్థితుల వల్ల ఏం జరిగిందో చూద్దామా?

నిన్న మంగళవారం నాడు విమానాలు కూలి చైనాలో 42 మంది, నేపాల్
లో14 మంది చనిపోయారు. చైనాలోని ఇచువాన్ ప్రావిన్స్ లోనూ నేపాల్లోని ఖాట్మండులోనూ ఆ సమయాలలో రవి హోర జరుగుతున్నది. రవి కేతు నక్షత్రంలో గ్రహణం పట్టి ఉన్నాడు. శని రవియొక్క ఉత్తరా నక్షత్రంలో ఉన్నాడు.

ఈ రోజున మళ్లీ తుఫాన్ వాతావరణాలు చాలా చోట్ల కనిపిస్తున్నాయి.

కనుక ఈ సూత్రం ఎప్పుడైనా వర్క్ అవుట్ అవుతుంది.

కాని ఏ ప్రదేశంలో ఈ ఘటనలు జరుగుతాయి అనేది ఒక్క విషయం కనుక కనుక్కోగలిగితే అప్పుడు కరెక్ట్ గా చెప్పగలగటం సాధ్యం అవుతుంది. గ్రహాల కో-ఆర్డినేట్స్ కు, ఏ ప్రాంతాల కో ఆర్డినేట్స్ సరిపోతాయో అక్కడ ఈ ఘటనలు జరుగుతున్నాయి. ఈ దిశలో నేను చేస్తున్న పరిశోధన లో కొన్ని లీడ్స్ ఇప్పటికే నాకు కనిపిస్తున్నాయి. ఇంకొంత కాలం లో ఈ సూత్రాలను కూడా అర్ధం చేసుకోగలం అని గట్టిగా భావిస్తున్నాను.

ఒక్కటి మాత్రం నిజం. గ్రహస్థితులు భూమిమీద., మానవ జీవితాల మీద ఖచ్చితంగా ప్రభావం చూపిస్తాయి. ఇందులో ఎంతమాత్రం అనుమానం అవసరం లేదు.
read more " పౌర్ణమి ప్రభావం- విమాన ప్రమాదాలు "

21, ఆగస్టు 2010, శనివారం

మా జిల్లెళ్ళమూడి యాత్ర-2

ఏడో మైలురాయి దగ్గర ఆర్చ్ పడిపోయి ఉంది. పనివాళ్లు కొందరు ఆ పనిలో ఉన్నారు. వానపడి ఉందేమో ఆప్రాంతం అంతా బురదగా ఉంది.

"ఆ రోజుల్లో ఇక్కడ రెండు కుక్కలు ఎప్పుడూ కాపలా ఉండెవి అన్నగారూ. వాటి పేరు రాముడు, భీముడు.ఎవరైనా భక్తులుఇక్కడ బస్సుదిగి అర్ధ రాత్రో అపరాత్రో నడుచుకుంటూ జిల్లెళ్లమూడికి వస్తుంటె అవి తోడుగా ఊరివరకూ వచ్చి వారినిదిగబెట్టి మళ్ళీ వెనక్కు వచ్చి ఏడో మైలు రాయివద్ద కాపలాగా ఉండేవి. అవి ఎవరో, ఏ పుణ్య జీవులో, వాటికిఅమ్మకు ఏం బంధం ఉండేదో? వాటి జీవితాంతం అలా భక్తులకు సేవలందించాయి." అన్నాడు చరణ్. చరణ్‍కు ఇలాటి సంఘటనలు ఎన్నో తెలుసు. గంటలు గంటలు అలా చెబుతూనే ఉంటాడు.

నాకు వెంటనే శ్రీరామకృష్ణుని శిష్యుడైన స్వామి అద్భుతానంద జీవితంలో ఒక ఘట్టం మదిలో తళుక్కుమని మెరిసింది. శ్రీరామకృష్ణుల కాలంలో పంచవటి ఒక దట్టమైన అడవి. ఆ అడవి పక్కనే ఆనుకొని గంగానది ప్రవహిస్తూ ఉండేది.అక్కడఉన్న వటవృక్షం దగ్గర రాత్రుళ్ళు ధ్యానం చెయ్యమని శ్రీరామకృష్ణులు తన అంతరంగ శిష్యులను పంపేవారు. ఒక్కొక్కరికిఒక్కొక్క విధమైన ధ్యాన విధానాలు చెప్పి పంపేవారు. స్వామి అద్భుతానంద పేరు అప్పట్లో లాటూ అని ఉండేది. ఒకరోజునలాటూ అర్ధరాత్రి సమయంలో పంచవటిలో వటవృక్షం క్రింద ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. దాదాపు అయిదారు గంటలపాటు అనగా దాదాపుగా తెలతెలవారేవరకు అలా ఆయన ధ్యానంలో ఉన్నాడు. అంతసేపూ ఆయనకు కొద్ది దూరంలోనాలుగు కుక్కలు కాపలాగా మౌనంగా కూర్చోని ఉన్నాయి. అవికూడా ధ్యానంలో ఉన్నట్లు మౌనంగా కిక్కురుమనకుండాఉన్నాయి. శ్రీరామకృష్ణులు అది చూచారు. తెల్లవారిన తరువాత తన ప్రియశిష్యుని ప్రేమగా చూస్తూ, " లాటూకు ధ్యానభంగం కలుగకుండా భైరవుడు కాపలాగా ఉన్నాడు". అన్నారు.పంచవటిలోని వటవృక్షం మీద ఒక భైరవుడుఉండేవాడు. ఆయన దర్శనం తొతాపురికి కలిగింది. దత్తాత్రేయుని కాళ్లవద్ద కూడా నాలుగు కుక్కలుంటాయి. అవి నాలుగు వేదాలని అంటారు.

శరణాగత భావంతో భగవంతుని చేరాలని ప్రయత్నించేవారికి, తీవ్ర ధ్యాన సాధకులకు, ప్రకృతి శక్తులు, జంతువులు, సాయపడటం నిజమే. నా అనుభవంలో ఇది చాలా సార్లు నేనూ గమనించాను.

కారు జిల్లెళ్లమూడిలోకి ప్రవేశించి అమ్మగారి ఇంటి ఆవరణలోకి తిరిగింది. ముఖద్వారం ఆర్చి మీద పేరు చూచి పిల్లలు ఆశ్చర్యపోయారు. కారణం? దానిపైన ఇతర ఆశ్రమాలవలె రకరకాలైన పేరులు లేవు. "అందరిల్లు" అని సింపుల్ గా ఆర్చిమీద వ్రాసి ఉండటమే దానికి కారణం. అలా వ్రాసి ఉందేమిటి అని వారికి సందేహం వచ్చింది. నేను నవ్విఊరుకున్నాను. చరణ్ కూడా మాట్లాడలేదు.

అందరం దిగి ఆశ్రమంలో షెడ్డు దగ్గర ఆగాము. నా చిన్నప్పుడు అమ్మగారి దర్శనం చేసుకున్న రోజు గుర్తొచ్చింది. అదిబహుశా 1976 కావచ్చు. నేను తొమ్మిదో తరగతి చదువుతున్నాను. కొందరు మా పెద్దవాళ్లతో కలసి అమ్మగారి దర్శనానికి నేనూ వెళ్లాను. అమ్మగారు స్టేజి మీద ఇప్పుడున్న పెద్ద పొటోప్రాంతంలో ఒక పెద్ద కుర్చీలో కూర్చొని ఉన్నారు. దాదాపు ఒక రెండువందలమంది దూరంగా నిలబడి ఉన్నాము.మేమూ వారిలో ఉండి చూస్తున్నాము. మౌనంగా అందరినీ చూస్తున్నారు.ఆ చూపు ఇంకా నాకు గుర్తుంది. పూర్తిగా నిరామయంగా ఉంది ఆ చూపు. ఒక గాలి తెమ్మెర మాదిరి అందరినీ అలా స్పృశిస్తూ వెళ్ళిపోయింది.ఎవరినీ ప్రత్యేకంగా చూస్తున్నట్లుగా లేదు.కాని మా వద్దకు వచ్చినపుడు ఆ దృష్టి ఒక్క సెకను అలా ఆగినట్లు అనిపించింది. అది నా భ్రమ అయి ఉండవచ్చు అనుకున్నాను. 


జిల్లెళ్లమూడిలో అదే ప్రదేశంలో మళ్ళీ నిలబడి చూచాను. అదే సంఘటన నా కళ్లముందు మళ్ళీ ఆవిష్కృతమైంది. అప్పుడు జనంతో కిటకిట లాడేది. ప్రస్తుతం స్టేజి ఖాళీగా ఉంది. జిళ్లెళ్లమూడి కెళితే నన్ను నేను చాలా నిగ్రహించుకోవలసి వస్తుంది. కళ్ళు ధారాపాతం గా వర్షిస్తాయి. ఇది ఎందుకో నాకెప్పుడూ అర్ధంకాదు. చరణ్ పరిస్థితీ అదే. అక్కడి వాళ్లకు ఇలాటి సీన్లు మామూలే గనుక వాళ్లు పట్టించుకోరు.

అవ్యాజమైన మాతృప్రేమ అక్కడ వాతావరణంలో గూడుకట్టుకుని ఉండటం కొద్దిగా సేన్సిటివిటి ఉన్నవాళ్ళకు వెంటనే అనుభవంలోకి వస్తుంది. ఎల్లలు లేని, తప్పులు చూడని, కారణాలు అడగని మహా ప్రేమ అది. ఒక వరద లాగా అది మనల్ని ముంచెత్తుతుంది. జన్మ జన్మల మన తప్పొప్పులు మొత్తం తెలిసి కూడా వాటిని అస్సలు లెక్కించకుండా, పట్టించుకోకుండా అవ్యాజమైన మాతృప్రేమను నిష్కారణంగా మనపైన వర్షిస్తుంది. అటువంటి ప్రేమముందు కరగని రాతిగుండె ఉంటుందా?

"మిమ్మల్నందరినీ నేనే కని మీ తల్లులకు పెంచమని ఇచ్చానురా". అని అమ్మగారు అనేవారు. ఏమి ప్రేమ? అటువంటి ప్రేమతత్వాన్ని మళ్లీ శారదామాతలోనే చూస్తాము. మానవులు, యోగులు, ఋషులు, దేవతలు, పశు పక్ష్యాదులు, కీటకాలతో సహా సర్వంసృష్టి మొత్తం నా సంతానమే అని చెప్పిన ఆ ఆధ్యాత్మిక స్థాయి ప్రపంచమంతా వెతికినా ఇంకెక్కడా కనిపించదు. ఎవరిలోనూ చూడలేము.

ఆ రోజులలో అమ్మగారిని ఒకరు అడిగారట.

అమ్మా నీవు బ్రాహ్మణ కుటుంబంలో పుట్టికూడా కులాలు పాటించవెందుకూ? అని.

"గుణభేదమే లేని నాకు కులభేదమేమిటి నాన్నా?" అని అమ్మ సమాధానం.

"శుక్ల శోణితాలదే కులమో అందరిదీ అదేకులం" అన్నది అమ్మ. ఇక దానికి జవాబేముంది?

అక్కడకు వచ్చిన వారిలో చాలామంది అమ్మ సమక్షంలోకి రాగానే ధారాపాతంగా ఏడ్చేవారు.అమ్మ మౌనంగా చూస్తూ ఉండేది. "ఎందుకమ్మా వాళ్ళు అలా నిష్కారణంగా ఎక్కిళ్ళు పెట్టి ఏడుస్తున్నారు? "అని పక్కన ఉన్నవారు అడిగితే నవ్వి " వాళ్ళు ఏడవటానికే వచ్చారురా ఏడవనివ్వు" అనేది కాని కారణాలు చెప్పేది కాదు.

శ్రీరామకృష్ణుని ప్రత్యక్ష శిష్యులూ నాకు పరమ గురువులూ అయిన స్వామి శివానంద మహరాజ్ గారి జీవితంలో (అప్పట్లో ఆయన పేరు తారక్) ఒకసారి ఇలాటి సన్నివేశం జరిగింది. తారక్ యువకునిగా ఉన్నపుడు శ్రీరామకృష్ణుని సన్నిదికి చేరాడు. వివేకానంద స్వామితో సహా చాలామంది అలాగే వచ్చారు. తారక్ ఒక రోజున పంచవటిలో ధ్యాననిమగ్నుడై ఉన్నాడు.శ్రీరామకృష్ణులు ఆ దారిగా వెళుతూ తారక్ ను చూచి ఆగారు. వెంటనే తారక్‍కు ఒళ్లంతా కరింట్ షాక్ కొట్టినట్లుగా జలదరించి దు:ఖం పొర్లుకొచ్చి ధారగా ఏడుస్తున్నాడు అలా ఒక గంట సేపు గడిచాక శ్రీరామకృష్ణులు మౌనంగా అక్కడ నుంచి వెళ్లిపోయారు. ఆ రోజున తారక్‍కు చాలా అగాధమైన ధ్యానస్థితి కలిగింది. తరువాత చాలా సేపటికి ధ్యానం ముగించుకొని తారక్ శ్రీరామకృష్ణుల గదికి వచ్చి నమస్కరించి కూర్చున్నాడు. శ్రీరామకృష్ణులు ప్రేమగా ఆయనతో "చూడు తారక్. భగవంతుని స్మరిస్తున్నపుడు, ధ్యానంలోనూ. కన్నీరు ధారగా రావడం చాలా మంచి సూచన. దానివల్ల పూర్వ జన్మల పాపాలు కడిగివేయబడతాయి.అంతరంగం శుద్దమౌతుంది. అటువంటి వారిని భగవంతుడు అమితంగా ప్రేమిస్తాడు" అన్నారు.

అయితే అది బలవంతాన తెప్పించుకొని ఏడవడం కాకూడదు. కొందరు ఆడవారు ఇలా కూడా చేస్తారు. పాపం అది కూడా మంచిదే.

చైతన్య మహాప్రభు జీవితంలో ఒక సంఘటన జరిగింది. ఆయన భక్తులకు సంకీర్తనా సమయంలో పారవశ్య స్థితులు కలగటం,కళ్లవెంట నీళ్ళు ధారలు కట్టడం, సమాధి నిమగ్నత, దివ్య దర్శనాలు సర్వ సాధారణంగా ఉండేవి. కాని ఒకనికి మాత్రం కనీసం ఏడుపుకూడా వచ్చేది కాదు. అతను సిగ్గుతో "నేనెంత పాపాత్ముణ్ణై ఉండాలి? వీరందరికీ ఇటువంటి స్థితులు కలుగుతున్నాయి. నాకు ఏ అనుభూతీ కలగటం లేదు. ఇటువంటి మహనీయుని సమక్షంలో కూడా కరగని నా గుండె ఎంత రాతిబండో కదా" అనుకుని కన్నీరు రావడం కోసం కళ్లలో కారం పెట్టుకున్నాడు. అది చూచి చైతన్యమహాప్రభు ఆ భక్తుని కౌగలించుకొని "ఈ పని చెయ్యటానికి ఎంతటి మానసిక క్షోభ అనుబవించావో కదా నీవు. భగవంతునిపై నీ కెంతటి ప్రేమ లేకపోతే ఈ పని చేస్తావు?" అంటూ పారవశ్యంలో సమాధి స్థితిని పొందాడు.

ఇలా ఆలోచిస్తూ, ఏదో లోకంలో ఉన్నవాళ్ళలాగా అమ్మ ఆలయానికి దారి తీశాము. నా పరిస్థితి తెలుసు కనుక మా కుటుంబ సభ్యులూ, చరణూ, నన్ను పలుకరించకుండా మౌనంగా వాళ్ల లోకంలో వాళ్ళు ఉన్నారు.

(ఇంకా ఉంది)

read more " మా జిల్లెళ్ళమూడి యాత్ర-2 "

15, ఆగస్టు 2010, ఆదివారం

నిజమైన స్వాతంత్ర్యం

ఈ రోజుతో మనం స్వాతంత్ర్యాన్ని పొంది 63 ఏళ్ళు గడిచాయి. దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం వచ్చింది. కాని ఎన్నోరకాలైన ఇతర స్వాతంత్ర్యాలు ఇంకా రాలేదు. ఇది లౌకికజీవిత నిజం.

అంతరిక జీవితంలో కూడా స్వాతంత్ర్యమే అత్యున్నత ఆదర్శం. దీన్నే ముక్తి లేదా మోక్షం అని మన ప్రాచీనులు చెప్పారు. ముక్తి గురించి తెలియాలంటే దేనిచేత బంధింపబడి ఉన్నామో ముందుగా తెలుసుకోవాలి. అప్పుడే ఆ బంధం నుంచి ముక్తి ఎలా సాధ్యమో తెలుసుకోవచ్చు. దానికి తగిన ప్రయత్నం చెయ్యవచ్చు.

బాహ్యంగా ప్రతివాడూ స్వతంత్రుడననే భావించవచ్చు గాక. కాని అంతరికముగా ప్రతివాడూ బానిసే. అతడు రాజు కావచ్చు. పేద కావచ్చు. విద్యావంతుడు కావచ్చు. నిరక్షరాస్యుడు కావచ్చు. ఉన్నత పదవులలో ఉండి భోగభాగ్యాల మధ్యన విలాస జీవితం గడిపేవాడు కావచ్చు. తిండికి లేక కటిక దరిద్రంలో బతుకు వెళ్ల దీస్తున్నవాడు కావచ్చు. వీరందరూ అంతరిక జీవితంలో కట్టు బానిసలే. గానుగెద్దులకూ వీరికీ ఏమీ భేదం లేదు.

ఏ విధంగా మనం బానిసలమో తెలుసుకుందామా?

మొదటి రకం: మనం ఎదుటివారి ఊహలకు బానిసలం. మన జీవితంలో ఎక్కువభాగం ఎదుటివారిని మెప్పించడానికే సరిపోతున్నది. మనం బట్టలు వేసుకొనేది మన కోసం కాదు. ఎదుటివారు ఏమైనా అనుకుంటారేమో అని మంచి బట్టలు ధరిస్తాం. ఎదుటివారి దృష్టిలో మంచిగా కనపడాలని లేని మంచిని నటిస్తాం. ఎదుటివాని హంగులు చూచి మనకు అవసరం లేకున్నా వాటిని అనుకరిస్తాం. వారివద్ద ఉన్న వస్తువులు మనమూ సంపాదించడానికి అమూల్య జీవితాన్ని, సమయాన్ని ఆహుతి చేసుకుంటాం. వారు అనే ఆహా ఓహో ల కోసం మన అమూల్యమైన జీవితాన్ని వృధా వ్యాపకాలలో వెచ్చిస్తున్నాం. ఎదుటివారికి గొప్ప ఉపన్యాసాలిచ్చి వారి మెచ్చుకోళ్ల కోసం అర్రులు చాస్తూ అదే గొప్ప పాండిత్యం అనుకుంటున్నాం. మనకేమి కావాలో మనకు తెలియదు. మన జీవితం ఎటుపోతున్నదో మనకు తెలియదు. ఎదుటివాని చేతిలో మనం కీలుబొమ్మలం. పరాయివారి మెప్పుకోసం బతికే జీతగాళ్లం. సమాజం చేతిలో మనం కీలుబొమ్మలం. ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది?

ఇక రెండవ రకం: మన ఇంద్రియాలకు మనం బానిసలం. పంచేద్రియాలు మన స్వాధీనం లో లేవు. వాటి ఆధీనంలో మనం ఉన్నాం. అవి చెప్పినట్లు మనం ఆడుతున్నాం. ఒక మంచి సుందరమైన దృశ్యమో, మనిషో కనిపిస్తె చూడకుండా ఉండలేం. మంచి మసాలా వాసన వస్తే నోటిలో నీళ్ళు మనకు తెలీకుండానే ఊరుతుంటాయి. ఒక వస్తువు కనిపిస్తే కొనకుండా ఉండలేము. ఆకలిని ఆపుకోలేము, దాహాన్ని ఆపుకోలేము. నిద్రను ఆపుకోలేము, కోరికలను ఆపుకోలేము. ఆవేశాలను ఆపుకోలేము. వెరసి మన ఇంద్రియాలకు మనం బానిసలం. అవి నడిపినట్లు మనం నడుస్తున్నాం. అవి ఈడ్చుకుపోయిన చోటికి మనం పోతున్నాం. ఇది స్వాతంత్ర్యం ఎలా అవుతుంది?

ఇక మూడవ రకం: మన మనస్సుకు మనం బానిసలం. మనస్సు మనం చెప్పినట్లుగా వినదు. అది చెప్పినట్లు మనం ఆడుతున్నాం. ఒక్క క్షణం కదలకుండా ఉండు అంటే ఆ క్షణంలోనే ఎక్కడలేని అనవసర విషయాలన్నీ నాకే కావాలి అంటుంది మనసు. ఆలోచన మనలను లాక్కుపోతున్నది కాని మనం ఆలోచనను నడిపించడం లేదు. మన ఆలోచనలు మన స్వాధీనంలో లేవు. మనసు మన స్వాధీనంలో లేదు. ఇది స్వాతంత్యం ఎలా అవుతుంది?

ఇక నాలుగవ రకం: మన అహానికి మనం బానిసలం. నేను ప్రతివానికన్నా భిన్నంగా కనపడాలి. నేను అందరికంటే అధికుణ్ణి. నేను అందరికంటే ముందుండాలి. నేను చెప్పినట్లు ఇతరులు వినాలి. నా ప్రత్యేకతను నేను కాపాడుకోవాలి. నేను సుఖంగా ఉండాలి. దానికోసం ఎందరు ఏమై పోయినా పరవాలేదు. నా పని నాకు ముఖ్యం. ఇలా నా, నా, నా అనుకుంటూ నా అహానికి నేను బానిసగా మిగులుతున్నాను. నా అహం తృప్తి పడటం కోసం నేను ఏపనైనా చేస్తున్నాను. జీవితమంతా దాస్యం చేయించుకున్న ఈ అహం మరణంలో ఏమౌతుంది. ఎక్కడికి పోతుంది. అన్న ఆలోచన మనకు రాదు. ఒక్కసారిగా పేలిపోయి అదృశ్యమై పోయే ఒక నీటి బుడగకోసం నా జీవితమంతా దానికి దాసోహం అంటూ ఊడిగం చేస్తున్నానా? నన్ను నేను తెలుసుకునే అవకాశం ఇచ్చిన ఈ జన్మను వృధాగా గడిపి పరీక్షలో ఓడిపోయినవానిగా నిష్క్రమిస్తున్నానా? ఏమిటీ విచిత్రం? ఏమిటీ బానిసత్వం? అన్న ఆలోచన మనకు రాదు.

మనకు స్వాతంత్ర్యం వచ్చిందా? ఎక్కడొచ్చింది? రాజకీయ స్వాతంత్ర్యం దేశానికి వచ్చి ఉండవచ్చు. సమాజాన్ని దోచుకునే వారికి వచ్చి ఉండవచ్చు. రాజకీయ స్వాతంత్ర్యం మన ఆశయం కాదు. మన జీవిత గమ్యం ఇది కాదు.

ఎదుటివారికీ, వారి ఆలోచనలకూ, నేను చేస్తున్న ఊడిగం నుంచి బయట పడినప్పుడే అది నిజమైన స్వాతంత్ర్యం.

నా ఆలోచనలకూ, నా అహానికీ కట్టుబడి ఉన్న నా బానిసత్వం నుండి నేను బయటపడి నప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఇంద్రియాలకూ, ప్రకృతికీ నేను చేస్తున్న ఊడిగం నుంచి నేను బయటపడినప్పుడే నిజమైన స్వాతంత్ర్యం.

ఇటువంటి స్వాతంత్ర్యాన్ని పొందటమే ముక్తి, అదే మోక్షం. ఈ ముక్తి అనేది ఎవరినుంచో నాకు వచ్చేది కాదు. నన్నెవరూ బంధించలేదు. ఇది నేను నా చుట్టూ నిర్మించుకున్న బోను. దీనినుంచి నేనే బయట పడాలి. ఇది నానుంచి నాకు మోక్షం. ప్రకృతినుంచి నాకు మోక్షం. జన్మ జన్మల నుంచీ నన్ను వెంటాడుతున్న సంస్కారాలనుంచి, కర్మ బంధాలనుంచి, జనన మరణాలనుంచి నాకు కలిగే మోక్షం.

ఇటువంటి స్వాతంత్ర్యమే యోగులకు అభిమతం. దీనికి తక్కువ దైన ఏ స్వాతంత్ర్యమైనా వారికి అవసరం లేదు. దానిని వారు ఉత్తమమైన స్వాతంత్ర్యంగా పరిగణించరు.

దీనిని పొందాలంటే అచంచలమైన, అకుంఠితమైన దీక్ష కావాలి. సాధన కావాలి. నాయమాత్మా బలహీనేన లభ్య: ఆత్మానుభవం బలహీనులకు లభించదు అన్న ఉపనిషద్వాణి మనలను తట్టి లేపటం లేదా? మన పూర్వీకులైన మహర్షుల ఉత్తేజపూరిత సందేశాన్ని మనం వినలేక పోతున్నామా? చేతకాని వాళ్లలా జీవితాన్ని ముగించడం అభిలషణీయమేనా?

మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 63 ఏళ్ళు అయింది అంటున్నాం. ఎన్ని వేల జన్మల నుంచి మన ప్రయాణం సాగుతున్నదో మనకు తెలుసా? ఎన్ని కాలాలలో, ఎన్ని దేశాలలో, ఎన్ని ప్రాంతాలలో, ఎన్ని వేషాలు ఇప్ప’టికి ఈ జీవుడు వేశాడో మనకు తెలుసా? స్వాతంత్ర్యం రాకుండా ఎన్ని వేల సంవత్సరాలు గడిచాయో మనకు జ్ఞాపకం ఉన్నదా?

ఆలోచించండి. మన పూర్వీకులైన మహర్షులు మనలను చూచి ఇటువంటివారా మా వారసులు" అని సిగ్గుపడుతున్నారు గమనించండి. సాధనా పరులు కండి. మహత్తరమైన యోగాన్ని అనుష్టించండి. జన్మ జన్మల కర్మ బందాల నుంచి విముక్తి కలిగించే భరతదేశపు దివ్యసంపద అయిన యోగాన్ని ఈ రోజునుంచే ప్రారంభించండి.

అప్పుడే స్వాతంత్ర్య దినోత్సవం నిజంగా జరుపుకున్నట్లు లెక్క. లేకపోతే అన్ని పార్టీల లాగే ఇదీ ఒక పార్టీ. ఒక గెట్ టుగెదర్. అంతే.

read more " నిజమైన స్వాతంత్ర్యం "

29, జులై 2010, గురువారం

మార్స్ ఎఫెక్ట్

గత వారం రోజులనుంచీ కుజ శనుల మధ్యన దూరం తగ్గుతూ వస్తున్నది. దీనివల్ల అనేక దుస్సంఘటనలు జరుగుతాయి అని ముందే వ్రాశాను. దానికి నిదర్శనంగా వరుసగా రోజుకొక సంఘటనను వింటున్నాం.

నిన్న రాత్రి ముంబైలోని "కుర్లా" లో భవనం కూలి చాలా మంది దానికింద చిక్కుకుపోయారు. ఇదికూడా ముందే వ్రాసినట్లు "మ", "క" అనే అక్షరాలతో మొదలు కావడం గమనార్హం.

అసలు వింత ఇది కాదు. ఇండోనేషియా భూకంపం గాని, మర్గలా కొండల్లో కూలిన విమానం కాని, కుర్లాలో కూలిన భవనం కాని అన్నీ కుజ హోర లోనే జరిగాయి. ప్రతిరోజు ఈ ఒక్క గంట కాలం కుజుని ఆధీనంలో ఉంటుంది. ఆ సమయంలోనే ఈ ప్రమాదాలు జరగటం కూడా గమనించదగిన విషయం.

అంతే కాదు.గత కొద్ది రోజులుగా జరుగుతున్న కుజ శనుల కలయిక వల్ల అనేక మంది జీవితాలలో అనేక బాధలు కలుగుతూ ఉంటాయి. అవి ఈ క్రింది విధంగా ఉండవచ్చు.

౧. అనుకోకుండా వస్తువులు పాడైపోవటం, ముఖ్యంగా వాహనాలు, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ పరికరాలు, రిపేర్లు రావటం. అనవసరంగా డబ్బు ఖర్చు చేయవలసి రావటం.

౨.యాక్సిడెంట్లు, ప్రమాదాలు జరగటం. ఈ సందర్భంగా, చిన్న చిన్న దెబ్బలు తగలటం కూడా యాక్సిడెంట్లేనని మరచిపోకండి.


౩.అనుకోకుండా కోపాలు పెరిగి చిన్న విషయానికి ఇతరులతో గొడవలు కావడం. తరువాత బాధ పడటం.


౪. అనారోగ్యాల వల్ల బాధలు రావటం. డాక్టర్ల చుట్టూ ప్రదక్షిణలు.


౫. సంతానంతో చికాకులు


ఇవన్నీ కుజ శనుల కలయిక వల్లనే జరుగుతున్నాయి. ఎవరి జీవితాలలో వారు పరిశీలించుకోవచ్చు. తెలివైన వారు రెమెడీస్ పాటించి ఈ బాధలనుంచి విముక్తులు కావచ్చు. ఇదే జ్యోతిర్విజ్ఞానంలోని పరమ ప్రయోజనం.

సూచన: లగ్నము లేదా రాశి కన్యా, కుంభ,మేషములలో ఏదో ఒకటి అయిన వారికి ఈ ఫలితాలు జరుగుతాయి. ఒకటి లగ్నము ఒకటి రాశి అయినవారికి నూటికి నూరుపాళ్ళు జరుగుతాయి. చెడు దశలు జరుగుతున్న వారికి ఈ ఫలితాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని మరచిపోకండి.
read more " మార్స్ ఎఫెక్ట్ "