“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, సెప్టెంబర్ 2010, మంగళవారం

అడవులదీవి సరదాయాత్ర

రేపల్లె దగ్గర అడవులదీవి అని ఒక ఊరుంది. అది సముద్రానికి చాలా దగ్గరగా ఉన్న ఊరు. అక్కడనుంచి కృష్ణా కాలువలో ఒకగంటన్నర ప్రయాణం చేస్తే అది సముద్రం లో కలిసే చోట ఒక బీచ్ఉంది. మొన్నీమధ్యన బీచ్ కి సరదా ప్రయాణం చేశాము.

రేపల్లెలో మధ్యాహ్నం ఒకటిన్నరకు బయలుదేరి సాయంత్రం ఆరుగంటలకు మళ్లీ సముద్రంలోనుంచి వెనక్కు వచ్చాము.మొత్తంఒక ఇరవై మందిమి బయలుదేరి సరదా యాత్రలోపాల్గొన్నాము. బీచ్ నిర్మానుష్యంగా ప్రశాంతంగా ఉంటుంది.

ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి లేకపోతే దారిన ఎవరినీ రానివ్వరు. డీఎఫ్వో గారికి ముందే చెప్పాముగనుక ఆయనరెండు పడవలు, సెక్యూరిటీ గార్డ్ లను ఏర్పాటు చేసాడు. అందరం కలిసి రేపల్లెనుంచి కార్లలో బయలుదేరి అక్కడికి ఏడుమైళ్ళ దూరంలోని ఒక పల్లెకు చేరాము. అక్కడనుంచి ముళ్లచెట్లలో, బురదలో కొద్దిదూరం నడచి కృష్ణా కాలువ ఒడ్డు చేరిపడవలెక్కాము.

రెండు మరపడవలలో బయలుదేరి వీఐపీ లందరూ ఒక బోట్ లో, ఇతరులు ఒక బోట్లో దాదాపు గంటన్నర కృష్ణాకాలువలో ప్రయాణించి సముద్రానికి చేరాము. సాయంత్రం మూడున్నర నుంచి నాలుగున్నరవరకు ఒక గంట బీచ్ లోసరదాగా గడిపి మళ్ళీ వెనక్కు వచ్చాము. ఆ రోజంతా మబ్బు పట్టి చాలా ఆహ్లాదంగా ఉంది.

బీచ్ లో చేరి కొంచెం కుదుటపడ్డాక, అందరిలోని చిన్నపిల్లలు బయటకొచ్చారు. ఆటలాడేవాళ్ళు, పాటలు పాడేవాళ్ళు, నీళ్ళలో దిగి కేరింతలు కొట్టేవాళ్ళు, నత్తగుల్లలు ఆల్చిప్పలు ఏరేవాళ్ళు - ఇలా రకరకాలుగా పెద్దవాళ్ళలోని చిన్నవాళ్ళుబయటకొచ్చారు.

ఇంతలో మా బాస్ ఒక గొప్ప విషయం కనిపెట్టాడు. అక్కడక్కడా నీళ్లలో బంక మట్టి ముద్దల్లాటివి పడి ఉన్నాయి. మెత్తటిఒండ్రు మట్టి అలల ప్రవాహానికి అలా ముద్దలుగా మారింది. బహుశా నది సముద్రం కలిసే చోటనే ఇలాటివిఉంటాయనుకుంటా. మామూలు బీచ్ లలో అవి కనపడవు. చాలా మెత్తగా పేస్ట్ లాగా ఉంది.

" ఇదే ముల్తానీ మట్టి. దీన్నే బ్యూటీ పార్లర్లలో మొహానికి పూసి వేలకు వేలు గుంజుతారు." అని గట్టిగా ఎనౌన్స్ చేశాడుమా బాస్. అంతే . ఎవరికి వారు ఒక కారీ బ్యాగ్ ఎక్కణ్ణించో బయటకు తీసి పేడముద్దలు ఏరుకున్నట్లు మట్టినిసంచుల్లో సేకరించటం మొదలు పెట్టారు. మా బాస్ గుంభనంగా నవ్వుతున్నాడు. నేను ప్రహసనాలన్నీ గమనిస్తూఅటూ ఇటూ తిరుగుతూ సరదాగా గడిపాను.

ఇంతలో మా పెద్ద బాస్ గారు వారి సతీమణి ధ్యానానికి కూచున్నారు. ఆయన వచ్చే నెలలో రిటైర్ కాబోతున్నారు. చాలామంచి వ్యక్తి. గట్టి మిలిటరీ డిసిప్లిన్ మనిషి. బీచ్ ఒడ్డున సముద్రానికి అభిముఖంగా కూచొని ధ్యానం చేస్తున్నారు. వారినిచూచి ఇంకొందరు కూడా పద్మాసనాలు వేసి వారూ బుద్దులవలె కూచున్నారు. కొందరు బాబా రామ్ దేవ్ గారి కపాలభాతి మొదలు పెట్టారు. నేను వారిని తమాషాగా చూస్తున్నాను.

ఇంతలో మా గ్రూపులోని ఒకాయన నన్ను అడిగాడు. " ఏమండీ మీరు ధ్యానం చెయ్యరా?"

నేను అడ్డంగా తలూపాను.

"ధ్యానం ఆరోగ్యానికి చాలా మంచిదండీ. నేర్చుకోండి." ఆయన ఉచిత సలహా ఇచ్చాడు.

నేను నవ్వుతూ "అలాగే" అన్నట్లు తలూపాను.

"చూడండి మన జీఎమ్ గారే వయసులో కూడా ధ్యానం చేస్తున్నారు. మనం చెయ్యకపోతే ఎలా?" ఆయన ఇంకొకప్రశ్న సంధించాడు.

"నిజమే. ఆయన చేస్తున్నపుడు మనం చెయ్యకపోతే ఎలా?" అన్నాను నేను నవ్వుతూ.

"మరి చేద్దాం రండి" ఆయన ఆహ్వానం.

"ధ్యానం చెయ్యటం నాకు రాదే. పైగా ధ్యానం ఎవరికి వాళ్లే చెయ్యాలనుకుంటా." అన్నాను.

నన్నొక వింత జంతువును చూచినట్టు చూచాడు ఆయన.

నేనది పట్టించుకోకుండా అలాగే చూస్తున్నాను.

నాతో అనవసరం అనుకున్నాడేమో, కళ్ళుమూసుకొని కాసేపు ఇసకలోనే చతికిల బడ్డాడు.

ఈలోపల తెచ్చిన బాక్సులు విప్పి కూల్ డ్రింకులు, బిస్కట్లు, పండ్లు బయటకు తీసి అందరికీ పంచుతున్నారు కొందరు. మాటలకు, చప్పుళ్లకు అందరి ధ్యానాలూ ఎగిరిపోయాయి. నాకు ధ్యానం నేర్పుతానన్న ఆయన గభాల్న కళ్ళు తెరిచి లేచి తన ప్లేట్ తీసుకుని స్నాక్స్ లాగించటం మొదలుపెట్టాడు.

"ఏమండీ ధ్యానం అయిందా" అడిగాన్నేను.

". అయింది." అంటూ తలాడించాడు ఆయన. "ధ్యానంలో చాలా ప్రశాంతంగా ఉంటుందండీ" అన్నాడు పైగా.

"మరి ప్రశాంతతలో అలాగే ఉండక, లేచారెందుకు?" అమాయకంగా అడిగాను నేను.

"ఆత్మారాముణ్ణి శాంతింపచేయాలిగా." అన్నాడాయన అది కూడా ఒక డ్యూటీ అయినట్లు.
ఇంతలో అటూ ఇటూ చూచిఏదో రహస్యం చెబుతున్నట్లు గొంతు తగ్గించి "ధ్యానమంటే ఏమీ లేదండీ శ్వాస మీద ధ్యాస. అంతే." అన్నాడు.

"ఓస్ ఇంతేనా. నేనింకా ఏదో అనుకున్నాను కదండీ" అన్నాన్నేను నవ్వాపుకుంటూ.

"అదంత తేలికనుకోకండి మరి. చాలా కష్టం. కూచుంటే తెలుస్తుంది" ఆయన ఉవాచ.

ఇక లాభం లేదనుకుని "సరేగానండీ, నాకొక సందేహం ఎప్పటినుంచో పీడిస్తోంది. మీరే దీనికి జవాబు చెప్పాలి" అన్నా.

". అడగండీ. దాందేముంది" అన్నాడు గురూజీ.

" పెద్ద గొప్ప డౌటు కాదనుకోండి. చిన్నదే"

"పర్లేదు చెప్పండి సార్" స్నాక్స్ లాగించి కూల్ డ్రింక్ అందుకుంటూ అన్నాడు ఆయన.

"మనమంటే దాహానికి కూల్ డ్రింకులు తాగుతున్నాం కదా. మరి చేపకు దాహం వేస్తే ఎలా?.అదేంతాగుతుంది పాపం?" అన్నాను.

అదోరకంగా చూచాడు ఆయన. నాకు నవ్వాగడం లేదు.

"ఏంటండి? నేను ధ్యానం గురించి చెబుతుంటే మీకొచ్చిన డౌటు ఇదా?" అన్నాడు అసహ్యంగా మొహం పెట్టి.

"ఇది నా డౌటు కాదండీ కబీరుకు కూడా ఇదే డౌటొచ్చిందిట ఒకసారి" అన్నాన్నేను.

"చుట్టూ నీళ్ళుంటే దాహమెందుకండీ" అన్నాడాయన.

"నిజమే కదా. మర్చేపోయాను. చుట్టూతా ఉన్నదానికోసం వెతకటం ఎందుకు? కరెక్ట్ గా చెప్పారు మీరు" అన్నాన్నేను.

ఆయనకు అర్ధం అయిందని నాకనిపించలేదు.

ఇంతలో మా జీఎమ్ గారు వారి సతీమణి ధ్యానం లోంచి లేచారు. వారి స్నాక్స్ అయినాక అందరం కలిసి మళ్లీ పడవలెక్కి వెనక్కు ప్రయాణంకట్టారు. మా గురూజీకి ఇందాకటి చేపదాహం పజిల్ అర్ధం కాక నన్ను అనుమానంగా చూస్తున్నాడు. అందులో ఏదో కిటుకుందని మాత్రం అతనికి తెలుస్తోంది. అదేంటో అర్ధమై చావటం లేదు.

బయలుదేరి వస్తూ పడవలోనుంచి వెనక్కు చూస్తూ మౌనంగా కూచున్నాను. మేమొదిలేసిన బీచి ప్రశాంతంగా మాకువీడ్కోలు చెబుతున్నట్లు అనిపించింది. కళ్ళు తెరిచి చూస్తూనే ఒక్క క్షణం ఏకాగ్రతగా ఈగిల్ విజన్ మోడ్ లోకి వెళ్లాను. క్రమేణా మాకు దూరంగాజరుగుతున్న బీచ్, సముద్రం, ఆకాశం అన్నీ మౌనంగా ధ్యానంలో ఉన్నట్లుగా అకస్మాత్తుగా నాకు ఒక ఫీలింగ్ కలిగింది.
వెంటనే చాందోగ్యోపనిషత్తులోని మంత్రం నాకు స్ఫురించింది.

శ్లో|| ధ్యాయం వావ చిత్తాధ్బూయో ధ్యాయతీవ పృధివీ ధ్యాయతీవాంతరిక్షమ్ ధ్యాయతీవ ద్యౌ ర్ధ్యాయన్తీవాపో ధ్యాయన్తీవపర్వతా...........||

ఆ ఉపనిషద్రుషికి అన్నీ ధ్యానంలో ఉన్నట్లుగా కనిపించాయి. భూమి, అంతరిక్షం, ఆకాశం, జలమూ, పర్వతాలూ అన్నీ ధ్యానంలో మునిగి ఉన్నట్లుగా
మంత్రద్రష్టకు కనిపించాయి. ఎంత అద్భుతమైన భావన? దీనిని భావన అనడం కంటే దర్శనం అనాలేమో? నిజమే. మనం ధ్యానంలో ఉంటే ప్రకృతికూడా ధ్యానంలో ఉన్నట్లే కనిపిస్తుంది. మన లోపలి స్థితి ఏదో అదే బయటకూడా దర్శనమిస్తుంది. లోపల మార్కెట్టును ఉంచుకొని కళ్ళుమూసుకుని బిగదీసుకుని కూచుంటే లాభంలేదు.

మనిషి గొడవ చెయ్యకుండా మౌనంగా ఉంటే చాలు. ప్రత్యేక ధ్యానాలు అక్కర్లేదు. సమస్తప్రకృతి ఎల్లపుడూ ధ్యానంలోనేఉంది. మనమే గందరగోళంలో ఉన్నాము. మన అంతరంగ కల్లోలాలు శాంతిస్తే చాలు. మన ఆవేశాలు చల్లారితే చాలు. ఎల్లప్పుడూ ఉన్నది ధ్యానమే.
తన్ను తాను మరచి ప్రకృతితో మౌనంగా మమేకం కాగిలిగితే చాలు. తాను అదృశ్యుడై ప్రకృతిని దానిమానాన ఉండనిస్తే చాలు. అదే ధ్యానం. అని ప్రకృతి నాతో చెబుతున్నట్లు అనిపించింది. భావాన్ని ఆస్వాదిస్తూ ఏకాగ్రతను చెదిరిపోనివ్వకుండా నిమిషనిమిషానికీ దూరమౌతున్న బీచ్ వైపు చిరునవ్వుతో చూస్తున్నాను.

బీచ్ చాలా దూరం వెళ్ళిపోయింది. చేప గురూజీ ఇంకా ఆ పజిల్ మీదే ఉన్నాడు.

"సారు బలే విచిత్రమైన మనిషండీ. చేపకు దాహం వేస్తే ఎలా అని ఆలోచిస్తున్నట్లున్నారు" అంటూ జోకేస్తున్నాడు గురూజీ.

అందరి నవ్వులతో నెనూ శృతి కలిపాను.