24, ఆగస్టు 2024, శనివారం

మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల

మా 67 వ పుస్తకంగా 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' నేడు విడుదల అవుతున్నది. ఇది నా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనలో వెలుగుచూచిన న్యూమరాలజీ విధానం.

'సంఖ్యాజ్యోతిష్యం' అంటే బాగుంటుంది కదా? అని కొందరు సందేహం వెలిబుచ్చారు. అనడానికి, వినడానికి బాగానే ఉంటుంది. కానీ, జ్యోతిష్యశాస్త్రం లేకుండా సంఖ్యాశాస్త్రం లేదు. గ్రహాలతో ముడిపెట్టకుండా ఉత్త అంకెలు మిమ్మల్ని ఎంతోదూరం తీసుకుపోలేవు. జ్యోతిష్యశాస్త్రం ముందు, సంఖ్యాశాస్త్రం తరువాత.  అందుకే 'జ్యోతిష్య సంఖ్యాశాస్త్రము' అని పేరుపెట్టాను. 

నా 61 వ పుట్టినరోజు సందర్భంగా జూలై నెలాఖరులో మా ఆశ్రమంలో జరిగిన సాధనాసమ్మేళనంలో ఈ విధానాన్ని శిష్యులకు వివరించాను. ఆ తరువాత ఈ విధానాన్ని గ్రంధస్థం చేయాలన్న సంకల్పంతో, కేవలం రెండువారాలలో ఈ పుస్తకాన్ని వ్రాసి విడుదల చేస్తున్నాను. ఇందులో నాదైన న్యూమరాలజీ విధానం వివరించబడింది. దీనిని 'భారతీయ జ్యోతిష్య సంఖ్యాశాస్త్ర పధ్ధతి' లేదా క్లుప్తంగా 'BJS పద్ధతి' అని పిలుచుకోవచ్చు.

వెస్టర్న్ న్యూమరాలజీ మీద మార్కెట్లో వేలాది పుస్తకాలున్నాయి. అవన్నీ తప్పుల తడికలేనని నేనంటాను. నేనిలా అనడానికి తర్కబద్ధమైన కారణాలున్నాయి.

అంకెలను ఏ బీ సీ డీ లతో పోల్చి మీ నేమ్ నంబర్ రాబట్టడం, లేదా మీ జననతేదీతో పోల్చి మీ డెస్టినీ నంబర్ రాబట్టడాలు సరియైన విధానాలు కావు. కారణం? ఇవన్నీ నిన్నగాక మొన్న మనం కృత్రిమంగా ఏర్పరచుకున్న గ్రెగోరియన్ కాలెండర్ ను అనుసరిస్తూ ఉంటాయి.

లౌకికమైన లావాదేవీలకు తప్ప మీ 'డేట్ ఆఫ్ బర్త్'  కు ప్రకృతిపరంగా ఎటువంటి విలువా లేదు. అదే విధంగా, ప్రకృతికీ గ్రెగోరియన్ కాలెండర్ కూ ఎటువంటి సంబంధమూ లేదు. కాబట్టి దాని ఆధారంగా లెక్కించబడే వెస్టర్న్ న్యూమరాలజీకి తర్కబద్ధత లేదు. అది సత్యాన్ని ప్రతిబింబించదు. దీనికి పూర్తిగా విభిన్నమైనది  మన భారతీయ సంఖ్యాశాస్త్రము. ఇది ప్రకృతిపైన, నవగ్రహాలపైన ఆధారపడినది. కనుక సత్యమైన ఫలితాలనిస్తుంది.

నా పరిశోధనలో వెలుగుచూచిన ఈ సులభమైన విధానాన్ని 52 మంది ప్రముఖుల జాతకాల సహాయంతో తేలికగా సోదాహరణంగా ఈ పుస్తకంలో వివరించాను.

రామకృష్ణ పరమహంస, వివేకానందస్వామి, సిస్టర్ నివేదిత, పరమహంస యోగానంద, రమణ మహర్షి, జిల్లెళ్లమూడి అమ్మ, మెహర్ బాబా, అరవిందయోగి, ఓషో, జిడ్డు కృష్ణమూర్తి, యూజీ కృష్ణమూర్తి, ఆనందమయి మా వంటి మతప్రముఖుల జాతకాలతో బాటు, సుభాష్ చంద్ర బోస్, మోహన్ దాస్ గాంధీ, నాధూరాం గాడ్సే, జవహర్ లాల్ నెహ్రు, సర్దార్ పటేల్, ఇందిరా గాంధీ, పీవీ నరసింహారావు, ఎన్టీ రామారావు, నరేంద్రమోదీ, యోగి ఆదిత్యనాథ్, బెంజమిన్ నెతన్యాహు, రాజా రామ్మోహన్ రాయ్, కందుకూరి వీరేశలింగం పంతులు, విక్రమ్ సారాభాయ్, హరగోబింద్ ఖోరానా, సత్యేన్ద్రనాథ్ బోస్, యల్లాప్రగడ సుబ్బారావు, శ్రీనివాస రామానుజం, ఎలాన్ మస్క్, బిల్ గేట్స్, బ్రునీ సుల్తాన్, ముకేశ్ అంబానీ, గౌతమ్ అదానీ, వెంపటి చినసత్యం, శ్రీపాద పినాకపాణి, మంగళంపల్లి బాలమురళీకృష్ణ, హరిప్రసాద్ చౌరాసియా, పండిట్ రవిశంకర్, ఎమ్మెస్ సుబ్బులక్ష్మి, లతా మంగేష్కర్, కిషోర్ కుమార్, మహమ్మద్ రఫీ, తిరుమలై కృష్ణమాచార్య, బీకేఎస్ అయ్యంగార్, కృష్ణ పట్టాభి జాయిస్, కోడి రామ్మూర్తినాయుడు, దారాసింగ్, బ్రూస్ లీ, మాస్ ఒయామా, మైక్ టైసన్ మొదలైన సెలబ్రిటీల జాతకాలను ఈ సంఖ్యాశాస్త్ర పరంగా విశ్లేషించి చూపించాను.

ఈ విధానాన్ని అనుసరిస్తే, మీ జాతకాన్ని మీరే తేలికగా అర్ధం చేసుకోగలుగుతారు.

ఈ పుస్తకం వ్రాయడంలో నాకు సహాయపడిన నా శ్రీమతి సరళాదేవి, శిష్యులు అఖిల, లలిత, ప్రవీణ్, చావలి శ్రీనివాస్, మూర్తి, సంధ్యలకు నా ఆశీస్సులు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.

మా ఇతర పుస్తకాలలాగే ఈ పుస్తకం కూడా ఇక్కడ లభిస్తుంది.

చదివి చూడండి మీకే అర్ధమౌతుంది.

read more " మా 67 వ పుస్తకం 'భారతీయ జ్యోతిష్య సంఖ్యా శాస్త్రము' విడుదల "

18, ఆగస్టు 2024, ఆదివారం

ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది?

ఈరోజు మధ్యాహ్నం 12.56 నిముషాలకు వేసిన ప్రశ్నచక్రం ఇది. 

కలకత్తా డాక్టర్ మరణం వెనుక అసలు ఏముంది? అన్నది తెలుసుకోవడమే ఈ ప్రశ్న ఉద్దేశ్యం.

9 వ తేదీన ఈ సంఘటన జరిగింది. కానీ ప్రశ్న చూడాలని నాకు అనిపించలేదు. ఈరోజు మధ్యాహ్నంపూట ఆదేశం వచ్చింది. అందుకని ప్రశ్న జాతకం చూడటం జరిగింది.

రహస్యాలకు నిలయమైన వృశ్చికం లగ్నమౌతూ దీనివెనుక చాలా రహస్యాలు దాగున్నాయని, ఇది సింపుల్ కేసు కాదని చెబుతోంది. 

చంద్రుడు 3 లో ఉంటూ స్నేహితులు, సహచరుల పాత్ర ఉందని చెబుతున్నాడు.

శని 4 లో వక్రించి ఉంటూ, 3 లోకి వచ్చి చంద్రుని కలుస్తూ తన క్లాసుమేట్లు, ఇంటిదొంగలు దీనివెనుక ఉన్నారని చెబుతున్నాడు.

లగ్నాధిపతి కుజుడు 7 లో గురువుతో కలసి శుక్రస్థానమైన శత్రురాశిలో ఉంటూ, ప్రొఫెసర్లు మొదలైన గురుస్థానంలో ఉన్నవాళ్ల పాత్ర కూడా ఉందని, ఈ అమ్మాయి వారి వలలో పడిందని చెబుతున్నాడు.

గురుకుజులతో యురేనస్ కూడా అక్కడే ఉంటూ సంఘవిద్రోహశక్తులు దీని వెనుక ఉన్నారని ఈ అమ్మాయిని చంపింది వారేనని, గురువులకు వారికీ  స్నేహం ఉందని, వారందరూ ఒక గ్రూపని చెబుతున్నాడు.  

పంచమాధిపతి గురువు 7 లో కుజ యురేనస్ లతో కలసి ఉండటం, ఈ పని చేసినది తెలియని మనుషులు కాదని, ఈ అమ్మాయికి వారికీ బాగా పరిచయం ఉందని స్పష్టంగా చెబుతోంది.

రాహువుతో నెప్ట్యూన్ కలసి 5 లో ఉంటూ, డ్రగ్ మాఫియాను సూచిస్తున్నాడు. ఆ ముఠా  సభ్యులతో ఈ అమ్మాయికి స్నేహంగాని, కనీసం గట్టి పరిచయం గాని ఉందని. వారు ఈ అమ్మాయికి బాగా పరిచయస్తులే అని సూచిస్తున్నాడు. రాహువు గురురాశిలో ఉండటం ముస్లిములను సూచిస్తుంది. కనుక వారిలో వీరు కూడా ఉండవచ్చు.

10 లో రవి బుధ శుక్రులున్నారు.  వీరిలో రవి బలంగా ఉంటూ నాయకుల అధికారుల హస్తాన్ని స్పష్టంగా చూపిస్తున్నాడు.

రవితో ఉన్న బుధుడు వక్రించి, ఆ నాయకుల, అధికారుల బుద్ధి వక్రించిందని చూపిస్తున్నాడు.

లగ్నము, శని, గురుకుజులు, రవిబుధశుక్రులు ఒకరికొకరు కేంద్రస్థానాలలో ఉంటూ, వీరిమధ్యన జరిగిన తీవ్రమైన ఘర్షణను సూచిస్తున్నారు.

గురుశుక్ర శని కుజులు డిగ్రీ దృష్టులలో చాలా దగ్గరగా ఉన్నారు. వీరిలో శుక్ర శనులు నీచమైన సెక్స్ నేరాలను సూచిస్తారు. గురుశుక్రులు ఈ నేరంలో గురువుల పాత్రను సూచిస్తారు. శని కుజులు హింసాత్మక సంఘటనకి సూచకులు. గురుశనులు దృఢకర్మను సూచిస్తారు. గురుకుజులు అధికార దుర్వినియోగాన్ని సూచిస్తున్నారు.

నవాంశలో శని 6 లో నీచలో ఉంటూ నీచులైన స్నేహితులను, తక్కువస్థాయి పనివారిని శత్రువర్గంగా సూచిస్తున్నాడు.

సూర్యుడు 6 లో ఉఛ్చస్థితిలో ఉంటూ అధికారులతో ఈ అమ్మాయికి శత్రుత్వం వచ్చిందని స్పష్టంగా చూపిస్తున్నాడు.

నవాంశలో గురువు ఉఛ్చస్థితిలో ఉన్నందున ఈ కేసు ఇంత సంచలనాన్ని సృష్టించి, దేశవ్యాప్త ఉద్యమాన్నిరేకెత్తించి, సుప్రీంకోర్టు సూమోటోగా తీసుకునేవరకూ తెచ్చింది. లేకపోతే, గతంలో జరిగిన ఎన్నో వందల రేప్ /మర్డర్ కేసులలాగే ఇది కూడా వెలుగులోకి రాకుండా ఉండిపోయేది.

ఈ కేసులో నేరస్థులకు శిక్ష పడుతుందా? అన్నది అసలు ప్రశ్న.

లగ్నాధిపతి కుజుడు 7 లో శత్రుస్థానంలో ఉండటం, దశమాధిపతి రవి దశమస్థానంలో బలంగా ఉండటం, ఇద్దరికీ కేంద్రదృష్టి ఉండటాలను బట్టి, లాభాధిపతి బుధుడు 9 లోకి వస్తూ, కుజునితో 3/11 దృష్టిలోకి రావడాన్ని బట్టి, కొంత హడావుడి జరుగుతుంది గాని, పూర్తి న్యాయం మాత్రం జరగదని, అసలైన నేరస్థులు తప్పించుకుంటారని ప్రశ్నశాస్త్రం చెబుతోంది.

ప్రశ్న సమయంలో చంద్ర రాహు రాహు గురు బుధదశ నడిచింది. రాహు-గురు -వక్రబుధులు సంఘవిద్రోహ మాఫియాను, అధికారులు మాఫియాతో కుమ్మక్కు అవడాన్ని సూచిస్తున్నారు.  లగ్నము, చంద్రుడు, రాహువు, గురువు, బుధుడు ఒకరికొకరు తృతీయాలలో ఉన్నారు. అంటే, ఇదంతా ఒక పెద్ద నెట్ వర్క్ అని స్పష్టంగా కనిపిస్తున్నది.

ఇది మామూలు రేప్ కేసు కాదు. దీని వెనుక చాలా పెద్ద నెట్ వర్క్, డ్రగ్ మాఫియా, అధికారుల పాత్ర అన్నీ ఉన్నాయి. దీనిని ఛేదించాలంటే నాయకులకు, అధికారులకు  చాలా చిత్తశుద్ధి, నిజాయితీలు ఉండాలి. ప్రస్తుతకాలంలో అవి ఎంతమందిలో ఉన్నాయి?

అదీగాక దీనివెనుక ఉన్న మాఫియా ముఠాను కదిలించడం అంత సులభం కాదు. వారికి నాయకుల అధికారుల అండదండలున్నాయి గనుక అసలు నేరస్థులు దొరకరని చెప్పవచ్చు.

పైగా, రోజులు గడిచేకొద్దీ ఎంత పెద్ద న్యూసైనా సరే పాతబడిపోతుంది. పబ్లిక్ మర్చిపోతారు. కనుక ఈ కేసులో న్యాయం జరుగుతుందా లేదా అనేది ఎవరికైనా తేలికగా అర్థమౌతుంది.  

ప్రసన్నలక్ష్మి, మీరాజాస్మిన్, ప్రత్యూష, సుశాంత్ సింగ్ ఇలా గతంలో ఎన్ని జరగలేదు ! వారిలో ఎందరికి న్యాయం జరిగింది? ఇప్పుడు  మాత్రం ఎలా జరుగుతుంది? పాత రికార్డును బట్టే కదా ప్రస్తుత ఇమేజి ఏర్పడేది !

వ్యవస్థలు కుప్పకూలినపుడు ఎవరి రక్షణబాధ్యత వారిదే అవుతుంది. అందుకే రైల్వే ఎప్పుడో చెప్పింది, ' మీ లగేజికి మీరే బాధ్యులు ' అని.
read more " ప్రశ్నశాస్త్రం - కలకత్తా డాక్టర్ హత్యకేసులో ఏం జరిగింది? "

10, ఆగస్టు 2024, శనివారం

బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్

బాంగ్లాదేశ్ సంక్షోభంలో కూరుకుపోయింది.

దీనిని వాళ్ళు 'రెండవ స్వతంత్రం' గా వర్ణించుకోవచ్చు గాక. కానీ విధ్వంసం దిశగా వాళ్ళు వెళుతున్నారనడానికి గత వారంరోజులుగా అక్కడ హిందువులపైన జరుగుతున్న మారణకాండలే సాక్ష్యాలు.

దీనివెనుక అమెరికా, పాకిస్తాన్, చైనాల కుట్ర అనుమానం లేకుండా ఉంది. ఇస్లామిక్ తీవ్రవాదుల కుట్ర ఉంది.

దీనివల్ల మన దేశానికి కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉంది. అటు బర్మాలో కొన్ని భాగాలు, ఇటు ఇండియాలో సెవెన్ సిస్టర్స్, అస్సాం, వేస్ట్ బెంగాల్, బీహార్ వరకూ ఇస్లామిక్ రాజ్యమంటూ క్రొత్త నినాదం ముందుకొస్తుంది. దానికి అల్ ఖైదా, ఇరాన్ లు ఆజ్యం పోస్తాయి. మనదేశంలో ఉన్న ఇస్లామిక్ స్లీపింగ్ సెల్స్ లోపలనుంచి సహకరిస్తాయి. ఇంటా బయటా సమస్యలు  చుట్టుముడతాయి. వెరసి ఇండియా పెను ప్రమాదంలో పడబోతోంది.

ఇప్పటివరకూ జమ్మూకాశ్మీర్లో  మాత్రమే తీవ్రవాదాన్ని ఎదుర్కొంటున్న మన ప్రభుత్వం ఇక తూర్పునుండి కూడా చొరబాటులను, అల్లర్లను, తీవ్రవాదాన్ని ఎదుర్కోవలసి వస్తుంది. అస్సామ్, వేస్ట్ బెంగాల్ లు ప్రధానంగా టార్గెట్ అవుతాయి.

ఈ విషయంలో గ్రహాలేమంటున్నాయి?

ఇదంతా యురేనస్ గ్రహం యొక్క ప్రభావం. జూన్ నెలలో యురేనస్ గ్రహం, భారతదేశాన్ని సూచించే వృషభరాశిలోకి అడుగుపెట్టింది. ఒక్క నెలలోనే మన దొడ్డివాకిలి లాంటి బాంగ్లాదేశ్ లోని ప్రజాప్రభుత్వం కూలిపోయింది.

84 ఏళ్ల కొకసారి యురేనస్ గ్రహం రాశిచక్రాన్ని ఒక చుట్టు చుట్టి వస్తుంది. అంటే, ఒక్కొక్క రాశిలో అది 7 ఏళ్ళు ఉంటుంది. గతంలో 1940-48 మధ్యలో యురేనస్ వృషభరాశిలో సంచరించింది. మళ్ళీ ఇప్పుడు అదే స్థితిలోకి వచ్చింది.

ఏయే విషయాలు యురేనస్ అదుపులో ఉన్నాయి?

తిరుగుబాట్లు, విప్లవాలు, పెద్ద ఎత్తున అల్లర్లు, ప్రభుత్వాలు కూలిపోవడాలు, దేశాలమధ్యన యుద్ధాలను ఈ గ్రహం కంట్రోల్  చేస్తుంది.  ఇది చరిత్ర చెబుతున్న నిజం ! 

కనుక అప్పటి పరిస్థితులే అటూ ఇటూగా మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఎదురౌతాయి.

1940-48 మధ్యలో ఏం జరిగింది?
-----------------------------------------------
1939-45 మధ్యలో రెండవ ప్రపంచ యుద్ధం జరిగింది.
 
అప్పుడే భారత స్వతంత్రపోరాటం కూడా జరిగింది. 1947 లో మనకు స్వతంత్రం వచ్చింది.

రెండో ప్రపంచయుద్ధంలో ఏడున్నర కోట్ల మంది ప్రపంచప్రజలు + సైనికులు చనిపోయారు. 

భారత విభజన సమయంలో జరిగిన సరిహద్దు అల్లర్లలో 5 నుండి 10 లక్షల మంది చనిపోయారు.

2024-2030 మధ్యలో మళ్ళీ అవే పరిస్థితులు రాబోతున్నాయి.

ప్రస్తుతం జరుగుతున్న ఉక్రెయిన్ - రష్యా యుద్ధం, ఇజ్రాయెల్ - ఇరాన్ యుద్ధం, చైనా - తైవాన్ సంక్షోభం, బాంగ్లాదేశ్ లో తీవ్రవాద ఇస్లామిక్ ప్రభుత్వ ఏర్పాటు ఇవన్నీ ముదిరి ముదిరి మూడవ ప్రపంచయుద్ధంగా మారబోతున్నాయి. 

రోహిణీ శకట భేదనం
-----------------------------
రోహిణీ నక్షత్రంలో యురేనస్ 1943-45 మధ్యలో సంచరించాడు. అప్పుడే రెండవ ప్రపంచయుద్ధం ముదిరి పాకాన పడింది. జపాన్ పైన అణుబాంబు ప్రయోగం జరిగింది కూడా అప్పుడే.

మళ్ళీ ఇప్పుడు 2026-28 మధ్యలో యురేనస్ రోహిణీ నక్షత్రంలో సంచరించబోతున్నాడు. 84 ఏళ్ల క్రితం ఉన్న పరిస్థితులను ప్రపంచం మళ్ళీ చూడబోతోంది.

మేషరాశిలో శని స్థితి
-----------------------------
మేషరాశి శనికి నీచస్థితి. ప్రస్తుతం శనీశ్వరుడు 2027-30 మధ్యలో మేషరాశిలో సంచరించబోతున్నాడు.  ఈ సమయంలో ప్రపంచదేశాల ప్రజలకు, ముఖ్యంగా భారత ఉపఖండపు ప్రజలకు నానాకష్టాలు తప్పవు.

యురేనస్ సంచారం + శని మేషరాశి సంచారం రెండూ కలిసి, 2026 నుండి 2029 వరకూ నాలుగేళ్లు ప్రపంచదేశాలకు చుక్కలు కనిపించబోతున్నాయి.

ఇదే సమయంలో భారతదేశం కూడా కనీవినీ ఎరుగని గడ్డు పరిస్థితులను, సంక్షోభాన్ని ఎదుర్కొనబోతోంది.

కేంద్ర, రాష్ట్ర  ప్రభుత్వాలు, ప్రజలు, ముఖ్యంగా హిందువులు ఐకమత్యంగా ఉంటూ దేశభద్రతకు, దేశప్రయోజనాలకు పెద్దపీట వెయ్యకపోతే మాత్రం, ఆ తరువాత ఏ పీటా వేసుకోవడానికి ఎవరూ మిగలరు.

ఈ హెచ్చరికను ఆషామాషీగా తీసుకోకండి.

బ్రహ్మంగారు వ్రాసిన కాలజ్ఞానం ఇదే కావచ్చు, కలియుగాంతం ఇదే కావచ్చు. ఇప్పటినుండి ఏడేళ్లలో మన కళ్ళముందే మనం వాటన్నింటినీ చూడబోతున్నాం. తస్మాత్ జాగ్రత !

ఈ సబ్జెక్ట్ పైన చేసిన వీడియోను ఇక్కడ చూడండి.

జైహింద్ !  
read more " బాంగ్లాదేశ్ సంక్షోభం - యురేనస్ సైకిల్స్ "

28, జులై 2024, ఆదివారం

4 వ సాధనా సమ్మేళనం విజయవంతం

ఆషాఢపూర్ణిమ గురుపూర్ణిమ. ఆనాడు సనాతన భారత సాంప్రదాయానికి పరమగురువైన వ్యాసభగవానుని స్మరించి మనమందరం ఆరాధిస్తాం. కనుక అది వ్యాసపూర్ణిమ అయింది. అదేసమయంలో, వ్యాసభగవానుని ప్రతిరూపాలుగా భావిస్తూ ఎవరి గురువులను వారు పూజించడం కూడా మన సంప్రదాయం.

వ్యాసపూర్ణిమ తరువాత వచ్చే సప్తమి నేను పుట్టినరోజు గనుక, ఈ నెల 26, 27, 28 తేదీలలో వచ్చిన వీకెండ్ లో మా ఆశ్రమంలో గురుపూర్ణిమ ఉత్సవాలను జరిపాము.

ఈ మూడురోజులపాటు మా ఆశ్రమంలో 4 వ ఆధ్యాత్మిక సాధనాసమ్మేళనం జరిగింది. పంచవటి సాధనామార్గానికి చెందిన ఉన్నతదీక్షలను సభ్యులకు ఇవ్వడం, వాటి లోతుపాతులు నేర్పించడం, సాధన చేయించడం, సందేహనివారణ చెయ్యడం, ఆధ్యాత్మిక మార్గనిర్దేశనం చెయ్యడం జరిగింది. జ్యోతిష్యశాస్త్రం, సంఖ్యాశాస్త్రం, యోగసాధన, హోమియోపతి వైద్యాలలో నాదైన విధానాన్ని సభ్యులకు నేర్పించడం జరిగింది.

ఆ సందర్భంగా తీసిన కొన్ని ఫోటోలను ఇక్కడ చూడవచ్చు.




 


read more " 4 వ సాధనా సమ్మేళనం విజయవంతం "

14, జులై 2024, ఆదివారం

మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల

ఈరోజు మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 66 వ పుస్తకం, మరియు మొదటి హిందీ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు హిందీ అనువాదం. తెలుగు, ఇంగ్లీష్ భాషలలో ఆదరణను పొందడంతో. దీనిని హిందీ లోకి అనువాదం చేసి విడుదల చేస్తున్నాం.

ఈ పుస్తకాన్ని ఇంగ్లీష్ నుండి హిందీలోకి చాలా త్వరగా అనువాదం చేసిన నా శిష్యురాలు పూజా బగాడియాకు కృతజ్ఞతలు మరియు ఆశీస్సులు తెలుపుతున్నాను. శుద్ధమైన, సరళమైన హిందీలోకి ఈ అనువాదం జరిగింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

హిందీ అభిమానులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆశిస్తున్నాం.

read more " మా హిందీపుస్తకం 'మధుశాల' విడుదల "

5, జులై 2024, శుక్రవారం

The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల


ఈరోజు మా క్రొత్తపుస్తకం The Wine House విడుదలౌతున్నది. ఇది మా సంస్థ నుండి వెలువడుతున్న 65 వ పుస్తకం.

ఇది నా తెలుగు పుస్తకం 'మధుశాల' కు ఇంగ్లీష్ అనువాదం. తెలుగుపుస్తకం మంచి పాఠకాదరణను పొందింది. అందుకని దానిని ఇంగ్లీష్ లోకి అనువాదం చేద్దామన్న సంకల్పం కలిగింది.

కేవలం రెండునెలల లోపే 'మధుశాల' ను ఇంగ్లీష్ లోకి అనువాదం చేసిన నా శిష్యులకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను.  అంతేకాదు, ఈ పుస్తకం హిందీ అనువాదం కూడా అయిపోయింది. పదిరోజులలో అది కూడా मधुशाला అనే 'ఈ బుక్' గా హిందీరాష్ట్రాల ప్రజలకు అందుబాటులోకి వస్తుంది.

నా పుస్తకాలన్నీ తెలుగు, ఇంగ్లీష్, హిందీ మూడుభాషలలోనూ వస్తాయని ఇంతకు ముందు చెప్పాను. అది నేడు The Wine House తో మొదలుపెట్టబడింది.

ప్రస్తుతం 'ఈ-బుక్' గా విడుదల అవున్నప్పటికీ, త్వరలో ఇది ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.

ఏకాంత ధ్యానసాధనను ఇష్టపడేవారికి ఈ పుస్తకంలోని 140 చిన్నికధలు ఎంతో సహాయపడతాయి. అంతేకాదు, నా ఫిలాసఫీ మొత్తం ఈ పుస్తకంలో అతి తేలికమాటలలో చెప్పబడింది. ప్రయత్నించండి.

read more " The Wine House ఇంగ్లీష్ పుస్తకం విడుదల "

24, జూన్ 2024, సోమవారం

ప్రపంచ యోగ దినోత్సవం - 2024

జూన్ 21 2024 న వేసవి అయనాంతపు రోజు. ఆ రోజున  ప్రపంచమంతా యోగదినోత్సవాన్ని జరుపుకుంది. పంచవటి సాధనామార్గాన్ని అనుసరించేవారందరూ, ఆనాడు మా శైలిలో యోగవ్యాయామాన్ని చేసి ఈ పర్వదినాన్ని జరుపుకున్నారు. 

మాకిది ఏడాదిలో ఒక్కరోజు మాత్రమే చేసే మొక్కుబడి తంతు కాదు. ఇది మా రోజువారీ దినచర్యలో భాగం.

యోగసాధనలో ఆసనాలు, ప్రాణాయామాలు మొదటిమెట్లు మాత్రమే. కనీసం వీటి విలువనైనా ప్రపంచం నేడు గుర్తిస్తోంది. రోగాలకు భయపడి కొందరైనా యోగాన్ని చేస్తున్నారు. కొంతలోకొంత నయం.

మన ప్రధానమంత్రి మోదీగారు మన దేశానికి చేసిన గొప్ప మేళ్లలో ఇదీ ఒకటి. మనం మర్చిపోతున్న మన విజ్ఞానాన్ని మనకు, ప్రపంచానికి గుర్తుచేసిన ఈ మహానుభావుడికి దేశం మొత్తం ఋణపడి ఉంది. కానీ ఆయనకు మనం ఓట్లు వెయ్యం. మెజారిటీ ఇవ్వం. మనకు మేలు చేసేవాడు మనకు అక్కర్లేదు. మనల్ని నాశనం చేసేవాళ్ళే మనకు కావాలి. వాళ్లనే గెలిపించుకుంటాం. నాశనమౌతూనే ఉంటాం. ఇది మెజారిటీ ఇండియన్స్ పరిస్థితి.

అదలా ఉంచితే, పంచవటి సభ్యులందరూ ఎవరి ఇళ్లలో వారు చేస్తున్న యోగసాధనా కొలేజ్ ను ఇక్కడ చూడవచ్చు. 






read more " ప్రపంచ యోగ దినోత్సవం - 2024 "

19, మే 2024, ఆదివారం

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది

మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది ఇది నా కలం నుండి వెలువడుతున్న
64 వ పుస్తకం. ఆశ్రమం ప్రారంభించిన తర్వాత నేను విడుదల చేస్తున్న రెండవ పుస్తకం.

ఈ పుస్తకంలో 140 సంఘటనలు, సంభాషణలు ఉన్నాయి. అవి చిన్నవే. నిత్యజీవితంలో మనకు రోజూ ఎదురయ్యేవే. కానీ అవే మనల్ని ఆలోచింపజేస్తాయి. జీవితపు లోతులను స్పృశింపజేస్తాయి. వాటిలో ప్రధాన పాత్రధారి సాకీ. వీటన్నిటిలోనూ, సాకీ అడుగుతుంది. నేను చెబుతూ ఉంటాను. నేనెవరో మీకు తెలుసు.

ఈ ‘సాకీ’ ఎవరు?

ఉమర్ ఖయ్యాం పేరును వినని సాహిత్యపిపాసి ఉండడు. ఆయన వ్రాసిన "రుబాయత్" ను, దువ్వూరి రామిరెడ్డిగారు, ‘పానశాల’ అనే పేరుతో తెలుగులో పద్యాలుగా వ్రాశారు. అది చదవని సాహిత్యాభిమాని కూడా ఉండడు. ఇదే రుబాయత్ ను, హిందీకవి హరివంశరాయ్ బచ్చన్ ‘మధుశాల’ అనే పేరుతో హిందీలో వ్రాశాడు. హిందీ అభిమానులు దానిని తప్పకుండా చదివి ఉంటారు. పరమహంస యోగానంద గారు కూడా దీనిపైన వ్యాఖ్యానించారు.

ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరి సాకీ. ఈ సాకీ అనే పాత్ర, మధుశాలలో మధువును పొసే అమ్మాయి. అనేకమంది కవులు అనేకవిధాలుగా సాకీని తీసుకున్నారు. ఒక మంచి స్నేహితురాలిని, ప్రియురాలిని, ఊహాసుందరిని, ఆత్మసహచరిని, సమాధిస్థితిలో కలిగే మత్తును, చివరకు దైవానుభూతిని కూడా ‘సాకీ’ అంటూనే కొందరు మార్మికవాదులు పిలిచారు.

ఏతావాతా, ఈ సాకీ, ఒక మానవవనిత కాదు. కల్పితభావన మాత్రమే. సాకీ అనే పేరులోనే ఏదో గమ్మత్తుంది. బహుశా మన 'సఖి' కి ఇది పార్సీ రూపమై ఉంటుంది. మన తెలుగుకవులలో కూడా ఎవరి సాకీ వారికుంది.

వారందరినీ వదిలేసి, ఉమర్ ఖయ్యాం స్వప్నసుందరిని నేను కాజేసినందుకు ఆయనకు క్షమార్పణలు చెబుతున్నాను. కాకపోతే, మేమంతా ఒకటే కాబట్టి, ఆయన ఏమీ అనుకోడనే నా భావన.

కవి చెప్పాలనుకున్నదానిని, కల్పితపాత్రల ద్వారా చెప్పడం, చెప్పించడం, సాహిత్యప్రక్రియలో సర్వసాధారణం. ప్రాచీన కవులందరూ అదే చేశారు. నేనొక కవినని చెప్పను గాని, నేనూ అదే చేశాను.

ఉమర్ ఖయ్యాం సాకీ ఎవరో అందరికీ తెలుసు. మరి, నా రచనలో ప్రత్యక్షమయ్యే ‘సాకీ’ ఎవరు? అని చాలామంది నా శిష్యులు, అభిమానులు అడిగారు. దీనికి జవాబును ఎలా చెప్పాలి?

నా నిత్యజీవితంలో ఎదురైన, ఎదురౌతున్న అనేక సంఘటనలలో పాత్రధారులైన మనుషులందరూ సాకీలే. వారిలో నా శిష్యులున్నారు, పరిచయస్తులున్నారు, స్నేహితులున్నారు. దారిలో ఎదురయ్యే సంబంధంలేని మనుషులున్నారు. అందరూ సాకీలే.

ఏమంటే, ప్రతివారినుంచీ నాకొక వెలుగు కనిపిస్తుంది. ఒక క్రొత్త దృక్కోణం గోచరిస్తుంది. ఒక క్రొత్త మెరుపు దర్శనమిస్తుంది. నేను నేర్చుకున్నదంతా జీవితం నుంచే నేర్చుకున్నాను. అవన్నీ వ్రాయాలంటే కొన్ని వేలున్నాయి. కానీ వాటన్నిటి సారం మాత్రం ఒకటే. వాటినే, దానినే, ఈ 140 చిన్న చిన్న సంభాషణలుగా ఈ పుస్తకంలో మీకందిస్తున్నాను.

నా మిగతా పుస్తకాలు చిక్కటి వేదాంతగ్రంధాలు. వాటి భాష చాలామందికి అర్థం కాకపోవచ్చు. ఇబ్బంది పెట్టవచ్చు కూడా. కానీ వాటిల్లో ఏముందో ఈ చిన్న పుస్తకంలో కూడా అదే ఉంది. చాలా తేలికైన భాషలో ఉంది.

చిక్కటి వేదాంతాన్ని అతి సులభమైన తేలికభాషలో చెప్పడం రామకృష్ణులు, జిల్లెళ్ళమూడి అమ్మగార్ల విధానం. మామూలు మాటలను కూడా అర్థంకాని కవితాధోరణిలో చెప్పడం జెన్ సాధువుల, మార్మికకవుల విధానం. ఈ పుస్తకంలో నేనీ రెంటినీ అనుసరించాను.

‘మధువు’ అనే పదానికి కొంచెం వివరణ అవసరం. మధువంటే తేనె. మధువంటే సారాయి. అదే విధంగా, మధువు అంటే బ్రహ్మానుభూతి కూడా. ఉపనిషత్తులలో ‘మధువిద్య’ అనే విద్య ఉన్నది. కనుక మధువు అనే పదానికి చాలా అర్థాలున్నాయి.

మధువంటే మనకందరికీ తెలిసిన సారాయి కాదు. మధువంటే అనుభూతి. ఆ అనుభూతి భౌతికం కావచ్చు, అంతరికం కావచ్చు. చాలాసార్లు అది అంతరికమైనదే అయి ఉంటుంది.

భావప్రపంచంలో లీనుడై కవి బాహ్యప్రపంచాన్ని మరచిపోతాడు. ఇంద్రియప్రపంచాన్ని అధిగమించిన యోగి మనుషులకు తెలియని ఏదో చోట తన ఆత్మను లీనం చేస్తాడు. సారాయికి బానిసైన చవకబారు మనిషి ఆ మత్తులో కొద్దిసేపు తన బాధలను మరచిపోతాడు. మౌలికంగా ఇవన్నీ ఒక్కటే అనడం సాహసమే అయినప్పటికీ, ‘మత్తు’గా ఇవన్నీ ఒక్కటే అని చెప్పాలి. ఆ మత్తు యొక్క గుణంలోనూ, జీవితానికి అదిచ్చే పరిణతిలోనూ తేడాలుండవచ్చు. కానీ మౌలికంగా చూచినపుడు, అన్నీ మత్తులే.

జీవితమే మధుశాల అనేది నా అభిప్రాయం. ఏమంటే, లౌకికులైనా, వేదాంతులైనా, సామాన్యులైనా, అసామాన్యులైనా, ఎవరైనా ఇక్కడ బ్రతకవలసినవారే. అందరికీ అదే రంగస్థలం. దీనిని విడచి ఎవరూ సాము చెయ్యలేరు. ఎవరికి కలిగే అనుభవాలైనా ఇక్కడనుంచే కలుగుతాయి. కనుక, దీనికంటే వేరే మధుశాల లేదని నా ఉద్దేశ్యం. దీనిని విడచి వేరే మధుశాలకు పోవలసిన పని కూడా లేదని నేనంటాను.

నీ నిత్యజీవితాన్ని విడచి, ఆధ్యాత్మికమంటూ వేరే ఎక్కడా లేదు. ఇదే నా అభిప్రాయం. జీవితాన్ని 50 ఏళ్లపాటు పరిశీలించినమీదట నేనీ నిశ్చితాభిప్రాయానికి వచ్చాను. ఇదే మాటను జిల్లెళ్ళమూడి అమ్మగారు కూడా అనేవారు.

ఇందులో నేనొక త్రాగుబోతుగా మీకు కనిపిస్తాను. సరదాగా నేను వేసిన నాటకాలలో చాలా పాత్రలు ధరించాను. అలాగే, ఇదికూడా ఒక పాత్ర. ఈ పాత్రపోషణ ద్వారా లోతైన జీవితసత్యాలను తేలికైన మాటలలో మీకు వివరించే ప్రయత్నాన్ని చేశాను. ఈ నాటకంలో నా సహపాత్రధారిణి సాకీ. నా జీవితంలో నాకెదురైన అందరూ సాకీలే. అసలు నా జీవితమే పెద్ద నాటకం.  అందులో అన్నీ పాత్రలే.

త్రాగుడును నేనస్సలు సమర్ధించను. మనిషి జీవితానికి అది అవసరమైనది కాదు. దాని జోలికి పోవద్దని మీకందరికీ సలహా ఇస్తాను కూడా. ఈ పుస్తకంలో చెప్పబడిన మధుసేవనం అంతర్మధనమే గాని, సారాయిని త్రాగడం కాదు.

జీవితమే మధుశాల. అందులో, మనకిష్టమైనవారు, మనతో వారి మనస్సును అరమరికలులేకుండా పంచుకునే వారు, ఆత్మీయంగా మనతో మాట్లాడేవారు, అందరూ సాకీలే. ఈ కోణంలో మాత్రమే మీరు ఈ పుస్తకాన్ని, ఇందులో కనిపించే సాకీని అర్థం చేసుకోవాలి.

జీవితంలో ప్రతి సన్నివేశమూ మనల్ని అలౌకికమైన అనుభూతి మత్తులో ముంచుతున్నపుడు వేరే మధువు యొక్క అవసరం మనకు ఏముంటుంది?

మనసు పెట్టి చదివితే, ఈ చిన్నపుస్తకం మీ జీవితాన్ని ఎంతో ఉన్నతంగా మార్చివేస్తుంది. ఈ మాట మాత్రం గట్టిగా చెప్పగలను.

ఈ పుస్తకాన్ని వ్రాయడంలో నాకు తోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవి,  శిష్యులు, శిష్యురాళ్ళు, అఖిల. లలిత, ప్రవీణ్, శ్రీనివాస్ చావలి లకు, పంచవటి సభ్యులందరికీ నా కృతజ్ఞతలు, ఆశీస్సులు.

సాకీలకందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. వారెందరో ఉన్నారు, అందరి పేర్లూ వ్రాయలేను. అందుకే సాకీ పేరుతోనే వారందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను.

యధావిధిగా ఈ 'ఈబుక్' ఇక్కడ నుండి మీకు లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా కూడా వస్తుంది.
read more " మా క్రొత్త పుస్తకం 'మధుశాల' విడుదలైంది "

1, ఏప్రిల్ 2024, సోమవారం

విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం




గత మూడురోజులపాటు మా చండ్రపాడు ఆశ్రమంలో జరిగిన మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ నిన్న విజయవంతంగా ముగిసింది. 

పాత క్రొత్త శిష్యులందరూ మూడు రోజులపాటు ఆశ్రమంలో ఉండి, వారి  జీవితానికి మరింత నిండుదనాన్ని అద్దుకుని, ఆనందంతో నిండిన మనసులతో వారివారి ఇండ్లకు తిరిగి వెళ్లారు.

క్రొత్తవారికి పంచవటి సాధనామార్గంలో ప్రాధమిక దీక్షనివ్వడం జరిగింది. పాత శిష్యులకు ఉన్నతస్థాయికి చెందిన యోగసాధనా మార్గాలను ఉపదేశించడం జరిగింది.  పంచవటి సాధనా మార్గంలో పాటించవలసిన నియమాలను, విధివిధానాలను, జీవితంలో తెచ్చుకోవాల్సిన మార్పులను వారికి స్పష్టంగా వివరించడం జరిగింది.

దేహాన్ని నిర్లక్ష్యం చెయ్యడం ఎంతమాత్రమూ మా విధానం కాదు. కనుక, మా యోగసాధనా మార్గాన్ని అనుసరిస్తూ, గత రెండు నెలలలో 15 కేజీలనుండి 5 కేజీల వరకూ ఆరోగ్యవంతంగా బరువును తగ్గినవారికి బహుమతులు ఇవ్వడం జరిగింది.

అదేవిధంగా, బరువు పెరగవలసిన కేటగిరీలో, 4 నుండి 9 కేజీల వరకూ బరువు పెరిగిన వారికి కూడా బహుమతులు ఇవ్వడం జరిగింది.

జ్యోతిష్యశాస్త్రపు లోతుపాతులను అందరికీ పరిచయం చేస్తూ, 1887 BCE కి చెందిన గౌతమబుద్ధుని అసలైన జాతకచక్రాన్ని వారికి వివరించడం జరిగింది. నా విశ్లేషణా విధానాన్ని బుద్ధుని జాతకచక్రం యొక్క విశ్లేషణతో వారికి అర్ధమయ్యేలా వివరించడం జరిగింది. బుద్ధుని యొక్క ఈ అసలైన జననతేదీని వెలుగులోకి తెచ్చినవారు ప్రఖ్యాత భారతీయ చరిత్ర పరిశోధకులు కోట వెంకటాచలం గారు.

త్వరలో వెలువడబోతున్న 'మహనీయుల జాతకాలు - జీవిత విశ్లేషణలు' అనే 500 పేజీల మా జ్యోతిష్యశాస్త్ర పరిశోధనా గ్రంధంలో ఈ జాతక విశ్లేషణను మీరు చూడవచ్చు.

ఇకపోతే, పదేళ్ళనుండీ నేను చెబుతూ వస్తున్న రీతిలోనే మా ఆశ్రమం నేడు ఎదుగుతున్నది. అసలైన హిందూమతాన్ని కులానికతీతంగా ఆచరణాత్మకంగా అందరికీ బోధిస్తూ, అజ్ఞానపు మురికిని వదిలిస్తూ, శిష్యుల దేహ-ప్రాణ-మానసిక స్థాయిలను సరిచేస్తూ, ఆధ్యాత్మిక మార్గదర్శనం ద్వారా నిజమైన హిందువులను, నిజమైన మనుషులను తయారు చేస్తూ,  అప్రతిహతంగా ముందుకు సాగుతున్నది.

తిరిగి, మూడు నెలల తర్వాత, జూలైలో వచ్చే నా పుట్టినరోజు సందర్భంగా గురుపూర్ణిమా రిట్రీట్ జరుగుతుంది. ఇప్పటివరకూ ఉపదేశించిన సాధనలలో మంచి పరిపక్వతను అందుకుని, అసలైన హిందువులుగా అసలైన యోగులుగా తయారై ఆ రిట్రీట్ కు రావలసిందిగా శిష్యులనందరినీ కోరుతున్నాను.

క్రొత్తగా మా వద్ద దీక్షాస్వీకారం చేసి మా సాధనామార్గంలో నడవాలనుకునేవారు ఈ క్రింది 5 పుస్తకాలను తప్పకుండా చదివిన తర్వాత మాత్రమే మమ్మల్ని సంప్రదించగలరు. లేనిచో మా మార్గంలో ప్రవేశం లభించదు. గమనించండి.

1. శ్రీవిద్యా రహస్యం

2. లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక

3. తారా స్తోత్రం

4. ధర్మపథం

5. వెలుగు దారులు లేదా MUSINGS

read more " విజయవంతంగా ముగిసిన 3 వ సాధనా సమ్మేళనం "

7, మార్చి 2024, గురువారం

మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో)

ఎన్ని ప్రవచనాలు వినినా, ఎన్ని పుస్తకాలను చదివినా, ఎన్ని యూట్యూబ్ వీడియోలు చూచినా, ఎన్ని కబుర్లు చెప్పినా, అసలైన ఆధ్యాత్మికమార్గంలో ప్రాక్టికల్ గా నడవనిదే దమ్మిడీ ఉపయోగం కూడా ఉండదు. మిగతావన్నీ టైం వేస్ట్ పనులు మాత్రమే.

ఇది సత్యం.

అందుకే 'పంచవటి స్పిరిట్యువల్ ఫౌండేషన్' ఉద్భవించింది. తపన ఉన్న జిజ్ఞాసువులకు, సాధకులకు అసలైన ఆధ్యాత్మికలోకపు దారులు చూపిస్తుంది. నడిపిస్తుంది.

అందుకే ఈ ఆహ్వానం.

ఈ నెల 29, 30, 31 తేదీలలో మా ఆశ్రమంలో మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (పంచవటి సాధనా సమ్మేళనం) జరుగుతుంది.

ఈ మూడు రోజులు, ఉదయం 4 నుండి రాత్రి 7 గంటల వరకు. మధ్యాహ్నం భోజనవిరామం తప్ప, మిగిలిన సమయమంతా వివిధరకాల సాధనలలో మీరు సమయాన్ని గడపవలసి ఉంటుంది. ఆ వివరాలన్నీ, ఇక్కడకు వచ్చిన తర్వాత చెప్పబడతాయి. నేర్పబడతాయి.

ఎదురుచూస్తున్నవారికి ఇదే ఆహ్వానం.

ఈ రిట్రీట్ లో రెండు విభాగాలు ఉంటాయి.

ఇప్పటివరకూ ఆశ్రమానికి రాని క్రొత్తవారికి, మొదటిరోజున అంటే మార్చి 29 తేదీన, అవగాహనా సమ్మేళనం ఉంటుంది.  ఈ ఒక్క రోజు మాత్రమే వారికి ఆశ్రమంలో మాతోబాటు ఉండే అవకాశం ఉంటుంది. ఈ సమయంలో పంచవటి సాధనామార్గం గురించి వారికి వివరించబడుతుంది. మీ మీ సందేహాలను తీర్చుకునే అవకాశం కలుగుతుంది.

పాతవారికి మరియు గతంలో అటెండ్ అయినప్పటికీ, దీక్షాస్వీకారం చెయ్యని క్రొత్తవారికి ఈ సారి ఆశ్రమంలో  మూడు రోజులు ఉండే అవకాశం ఇవ్వబడుతుంది. వారు సీనియర్ సభ్యులతో కలసి మూడు రోజులు ఆశ్రమంలో ఉండవచ్చు, కలసి సాధనలు చెయ్యవచ్చు. మా మార్గం యొక్క లోతుపాతులను మీ శక్తిమేరకు గ్రహించవచ్చు.

ఆశ్రమంలో మినిమమ్ సౌకర్యాలు మాత్రమే ఉంటాయి. కంఫర్ట్స్ ఉండవు. వేసవి ఎండలు బాగా ఉంటాయి. వాటికి తట్టుకునే సంసిద్ధత ఉన్నవారు మాత్రమే రాగలరు. ఆశ్రమంలో ఉన్నపుడు ఆశ్రమ నియమాలను పాటించవలసి ఉంటుంది. మీరు ఏవైనా మందులను వాడుతూ ఉంటే, వాటిని తెచ్చుకోవడం మరచిపోకూడదు. 

రాదలచుకున్నవారు 98493 - 89249 అనే నంబర్ లో పంచవటి ఫౌండేషన్ సెక్రటరీ శ్రీ రామమూర్తి గారిని సంప్రదించగలరు.

read more " మూడవ స్పిరిట్యువల్ రిట్రీట్ (ఈ నెల 29, 30, 31 తేదీలలో) "