“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

17, నవంబర్ 2016, గురువారం

స్వామి యదునాధానంద గారితో సంభాషణ - 6 (నేనే వాళ్ళ స్థానాల్లో ఉంటే?)

స్వామీజీ చెప్పినది నాకేమీ నచ్చలేదు.

ఇంతకుముందు చెన్నైలో చెప్పినప్పుడూ నచ్చలేదు, ఇప్పుడూ నచ్చలేదు. ఆయనంటే నాకు జాలి కలిగింది. కానీ ఆ విషయాన్ని బయటకు చెప్పి ఆయన భావాలని మార్చాలని నేననుకోలేదు. ఊరకే ఆయన చెబుతున్నది విని ఊరుకున్నాను.

తన సలహాతో చంద్రపాల్ జీవితాన్ని స్వామీజీ పూర్తిగా నాశనం చేశాడని నా ఊహ.

వినడానికి వింతగా ఉంది కదూ?? అలాగే ఉంటాయి నా భావాలు. చిన్నప్పటినుంచీ నన్ను చూస్తున్నవారికే నేను అర్ధమై చావలేదు. ఏదో నా వ్రాతలు పైపైన చదువుతున్న మీకెలా అర్ధం అవుతాను?

చాలా కష్టం.

కానీ, పంచవటి గ్రూపులోని నా శిష్యులలో కొందరు నా భావాలను బాగా వంటపట్టించుకున్నారు. ఇది నిజమేనా? పోనీ ఇలా అనకూడదేమో? వారివీ నావీ ఒకే భావాలు కనుకనే అందరం ఒక గూటికి చేరామని అనుకుంటే సరిగ్గా ఉంటుంది. పోనీ అలాగే అనుకుందాం.

వారిలో ఒకరు అమెరికానుంచి మొన్న నాకు ఫోన్ చేశారు.

'గురూజీ.మీరు వ్రాసినవి మీ భావాలేనా? స్వామీజీ చంద్రపాల్ కు ఇచ్చిన సలహాను మీరు ఆమోదిస్తున్నారా?' అని అడిగారు.

నాకు భలే నవ్వొచ్చింది.

నా భావాలను కనీసం కొద్దిమందైనా సరిగ్గా అర్ధం చేసుకున్నారన్న సంతోషంలో వచ్చిన నవ్వు అది. ఇన్నాళ్ళూ పంచవటి గ్రూప్ లో ఉన్నందుకు 'అసలైన విషయం' కొందరికైనా సరిగ్గా అర్ధం అయినందుకు వచ్చిన నవ్వు అది.

'లేదు.స్వామీజీ భావాలను నేను ఆమోదించడం లేదు.' అన్నాను.

'కానీ మీ బ్లాగ్ చదివే వారు అలా అనుకోవడం లేదేమో? అందుకని మీరు కొంచం వివరిస్తే బాగుంటుంది' అని ఆయన అన్నాడు.

ఇది నిజమే అని నాకూ అనిపించింది.

కొంచం వివరిస్తే గాని నేనేమి చెప్పదలుచుకున్నానో మీకు పూర్తిగా అర్ధం కాదు.

ప్రతి మనిషి జీవితంలోనూ ఎదురు దెబ్బలు తగులుతాయి. తట్టుకోలేనంత బాధ కలిగించే సంఘటనలు ఎదురౌతాయి.అవి చాలా బాధాకరమైన క్షణాలని ఆ మనిషి అనుకుంటాడు.'అంత చెడు సమయం నా జీవితంలో ఇంకెప్పుడూ రాలేదు' అని తర్వాత్తర్వాత తీరికగా కూచుని వెనక్కు తిరిగి చూచేటప్పుడు అనుకుంటాడు. కానీ అతను అర్ధం చేసుకోలేని విషయమే అది. అదేమంటే - ఆ క్షణాలే అతని జీవితంలో బంగారు క్షణాలు. ప్రతి మనిషి జీవితంలోనూ అత్యంత విలువైన క్షణాలేవంటే - అతన్ని అమిత బాధకు గురిచేసిన క్షణాలే.

సుఖంగా గడిపిన రోజులు పెద్ద గొప్పవేమీ కాదు. ఆ సమయంలో మనం మొద్దునిద్ర పోతూ ఉంటాం. కానీ కష్టం వచ్చినప్పుడు మాత్రమె మన కళ్ళు తెరుచుకుంటాయి. ఆ కాసేపే మనం సత్యాన్ని చూడగలుగుతాం. ఆ క్షణాలు చాలా విలువైనవి.వాటిని మనం మిస్ చేసుకుంటే ఇక జీవితంలో మళ్ళీ మనకా చాన్స్ రాదు.

కష్టం వచ్చినప్పుడే మనిషి కళ్ళెదురుగా సత్యమైన దారికి తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడు కూడా ఆ దారిని చూడలేకపోతే, దానిలో నడవలేకపోతే, ఇక ఆ జీవితం వృధానే.

చంద్రపాల్ జీవితంలో అలాంటి సమయం అప్పుడొచ్చింది. తన బంధువులూ స్నేహితులూ నిజంగా తనవాళ్ళేనని అప్పటిదాకా తను అనుకుంటున్నాడు. కానీ వారంతా నిజానికి తనవాళ్ళు కారనీ, నిజానికి ఈ ప్రపంచంలో తనకెవరూ లేరన్న చేదునిజాన్ని ముఖాముఖీ దర్శించే అవకాశం అతనికి వచ్చింది.కానీ అతనా అవకాశాన్ని దారుణంగా పోగొట్టుకున్నాడు.మళ్ళీ పాత జీవితంలోకి అడుగు పెట్టాడు. భగవంతుడు ఇచ్చిన సువర్ణావకాశాన్ని చేజేతులా జారవిడుచుకున్నాడు.దురదృష్టవశాత్తూ దానికి స్వామీజీ పరోక్షంగా కారకుడయ్యాడు.

పుట్టినప్పటినుంచీ తను ఉంటున్న ఊబిలోనుంచి బయటకొచ్చి ఒడ్డున నిలబడి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న చంద్రపాల్ ను స్వామీజీ తిరిగి అదే ఊబిలోకి తోసేశాడు. ఇదీ అసలక్కడ జరిగిన సంగతి !!!

కానీ వారిద్దరికీ ఈ విషయం తెలీదు.

చంద్రపాల్ కు తెలియకపోతే వింత లేదు. అతను అజ్ఞానంలో ఉన్నాడు.అతనొక సామాన్య మానవుడు.ఎటు పోవాలో అతనికి తెలియదు. కానీ ఈ విషయం స్వామీజీకి కూడా తెలియకపోవడమే అసలైన వింత. అది చాలదన్నట్లు ఇరవై ఏళ్ళ తర్వాత కూడా ఆయన అదేదో గొప్ప విజయం అయినట్లు అందరికీ చెప్పుకోవడం ఇంకా పెద్ద వింత.

ప్రపంచం యొక్క నిజస్వరూపాన్నీ, మానవ సంబంధాల డొల్లదనాన్నీ చంద్రపాల్ కు విడమర్చి చెప్పి అతన్ని నిజమైన ఆధ్యాత్మిక పధంలో నడిపించడం స్వామీజీ చేసి ఉండవలసింది. కానీ అలా జరగలేదు. జరగకపోగా, దానికి పూర్తి విరుద్ధమైన పని జరిగింది.

జీరో నుంచి కోటీశ్వరుడు కావడం ఎలా? అనేది చంద్రపాల్ చేశాడు. కానీ ఒక అజ్ఞాని నుంచి జ్ఞానిగా ఎలా మారాలి? అన్నది అతను మిస్ అయ్యాడు.డబ్బు సంపాదించడం కంటే, సత్యజ్ఞానాన్ని పొందటమే జీవితంలో అతి ముఖ్యమైన అంశం.డబ్బు లేకుంటే జీవితంలో పెద్దగా పోయేది ఏమీ లేదు.కానీ చచ్చేలోపు జ్ఞాని కాలేకపోతే, ఆ జీవితం టోటల్ గా వేస్ట్ అయినట్లే.

ఈ కధంతా స్వామీజీ చెబుతూ ఉన్నపుడే నాకు రెండు ఆలోచనలు వచ్చాయి. అవేమంటే - స్వామీజీ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడిని? చంద్రపాల్ స్థానంలో నేనుంటే ఏం చేసేవాడిని?

మొదట్లో వీటిని బ్లాగులో వ్రాయాలని అనుకోలేదు. పంచవటి గ్రూపులో నా శిష్యులకు మాత్రమే చెబుదామని అనుకున్నాను. కానీ తర్వాత నా ఉద్దేశ్యం మార్చుకున్నాను. అలా మార్చుకోవడానికి కారణం ఏమంటే - ఈ సీరీస్ చదివినవారు, స్వామీజీ భావనలు నా భావనలే అనుకునే ప్రమాదం ఉన్నది. ఈ విషయాన్ని నేను క్లారిఫై చెయ్యాలి.

స్వామీజీ భావాలు ఆయనవే. అవి నావి కావు. నేను ఊరకే జరిగిన సంఘటనను యధాతధంగా వ్రాశానేగాని, అంతమాత్రం చేత ఆయన అభిప్రాయాలతో నేను ఏకీభవిస్తున్నట్లు కాదు.ఆయన భావాలతో నేను కొంతవరకే ఏకీభవిస్తాను.ఆ తర్వాత నా దారి పూర్తి విభిన్నంగా ఉంటుంది.

ఈ విషయాన్ని స్పష్టం చెయ్యడానికే ఈ పోస్ట్ వ్రాస్తున్నాను.

నా ఆలోచనలను విడివిడిగా వరుసగా చూద్దాం.

1. స్వామీజీ స్థానంలో నేనుంటే??

స్వామీజీ స్థానంలో నేనుంటే చంద్రపాల్ తో ఇలా చెప్పేవాడిని.

'చూడు చంద్రపాల్ ! ఇప్పుడైనా ప్రపంచం అంటే ఏంటో నీకు అర్ధమైందా? నువ్వు ప్రేమించిన వారెవరూ నీవారు కారు. నీ స్నేహితులు నీకు నిజమైన స్నేహితులు కారు. నీ బంధువులు కూడా అంతే.అందరూ అవకాశవాదులే.అందరూ స్వార్ధపరులే. నిజంగా నిన్ను ప్రేమిస్తున్న వాళ్ళు ఈ ప్రపంచంలో ఎవరూ లేరు. ఉన్నారని నువ్వు అనుకుంటూ ఉంటె అది నీ భ్రమ. కనీసం ఇప్పుడైనా కళ్ళు తెరువు. సత్యాన్ని గ్రహించు. నిజంగా నీ వారెవరో తెలుసుకో. నిన్ను నువ్వు తెలుసుకునే మార్గంలో కనీసం ఇప్పటికైనా నడక ప్రారంభించు.

నీ జీవితంలో ఇప్పటికే 50 ఏళ్ళు భ్రమతో కూడిన రోజులుగా గడచిపోయాయి. నీ జీవితం ముప్పాతిక వంతు ఇప్పటికే వృధా అయింది.కనీసం ఇప్పుడైనా మేలుకో. ఆధ్యాత్మిక మార్గంలో అడుగుపెట్టు. దారి కావాలంటే నేను చూపిస్తాను.నాతో నడువు.నేను చెబుతున్నది నిజమో కాదో నీకు నీకే అర్ధమౌతుంది. ఎన్నటికీ చెదరని సంతృప్తిని ఆనందాన్నీ నువ్వు పొందే మార్గం నేను చూపిస్తాను.నేను చెబుతున్న సంతృప్తీ ఆనందమూ నిన్ను ఎప్పటికీ వదలిపోవు.ఏది నీతో ఉన్నా ఏది లేకపోయినా, ఎవరు నీతో ఉన్నా ఎవరు లేకపోయినా నీ స్థితిలో ఏ మార్పూ రాని గమ్యాన్ని చేర్చే దారిని నీకు చూపిస్తాను. నా అడుగుల్లో అడుగులు కలిపి నడువు.

ఒకవేళ నీలో కసి ఉంటే, అన్నీ కోల్పోయానన్న బాధ నీలో ఉంటే, వెనక్కు వెళ్ళు.అన్నీ మళ్ళీ సంపాదించు. నిన్ను నమ్ముకున్న నీ కుటుంబానికి ఆధారం కల్పించు. ఆ డబ్బంతా వారికి ఇచ్చేసి అప్పుడు నా దగ్గరకు రా.

ఇప్పుడు నా మార్గంలోకి నువ్వొస్తే నీలో కొంత అసంతృప్తి మిగిలి ఉంటుంది. 'చేతకానివాడిలా నేను పారిపోయి వచ్చాను' అని నీలో ఒక గిల్టీ ఫీలింగ్ ఉంటుంది. దానిని తొక్కగలిగితే మరీ మంచిది.కానీ ఆ పనిని చేసే శక్తి నీకు లేకపోతే, నీలో ఉన్న గిల్టీ ఫీలింగ్ ను నువ్వు జయించలేకపోతే, వెనక్కు వెళ్లి, సంపాదించి, నువ్వనుకుంటున్న డొల్ల విజయాన్ని మళ్ళీ సాధించి, అప్పుడు దాన్ని విసరి పారేసి, నాతో రా. నేను చెబుతున్నదేంటో నీకు ప్రాక్టికల్ గా చూపిస్తాను.

'నువ్వనుకుంటున్నదానిని జీవితం నీకు ఇవ్వలేక పోతే నువ్వేం చేస్తావు?' అని కదా అడిగావు. ఇదే నా సమాధానం.

'నీ జీవితాన్ని నువ్వు కొత్తగా నిర్మించుకో. పాత జీవితాన్ని విసరి పారెయ్యి.' ఇదే నా జవాబు కూడా. కానీ నేను చెబుతున్న కోణం వేరు.

మళ్ళీ పాత ఊబిలోకి అడుగుపెట్టి డబ్బు సంపాదించి మళ్ళీ కోటీశ్వరుడివి కమ్మని నేను చెప్పను. నా ఉద్దేశం అది కాదు. నువ్వు అలా చేసినా కూడా అది అంతిమ విజయం కాదని నేను చెబుతున్నాను. అదొక ఎండమావి. ఈ విషయం నీకిప్పుడు అర్ధం కాదు. కానీ ఇది నిజం.

నీ పాత రొచ్చు జీవితాన్ని వదిలేయ్. అసలైన కోణంలో జీవితాన్ని చూడటం నేర్చుకో.ఏ క్షణం నిన్ను వదిలేసి పారిపోతాయో తెలియని వాటికోసం నీ విలువైన జీవితాన్ని పణంగా పెట్టకు.దానిబదులు, ఎప్పుడూ నీతో ఉండే దానికోసం ప్రయత్నం చెయ్యి.

డబ్బు ఒక్కటే ఇప్పటిదాకా నీకు తెలిసిన నిజం.అది నిజం కాదు.పచ్చి అబద్దం. డబ్బు ఒక్కదానితోనే మనిషికి శాంతి ఎప్పటికీ రాదు. అధికారమైనా అంతే.ఇంకేదైనా అంతే. ఇవేవీ లేకున్నా 'ఆ ఒక్కటి' ఉంటే నీకన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నా 'ఆ ఒక్కటి' లేకుంటే నువ్వు బికారివే. ప్రస్తుతం ఈ విషయం నీకు ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు కదా !! నువ్వు బికారిగానే రైళ్ళలో తిరుగుతున్నావు. నేను చెబుతున్నదీ నీకు ఇప్పటిదాకా తెలియనిదీ అయిన ' ఆ ఒక్కటి' ఏంటో తెలుసుకో. దానిని పొందే ప్రయత్నం చెయ్యి.అదే కొత్త జీవితం అంటే. అదే అసలైన సత్యం.

అని చెప్పి అతని కళ్ళు తెరిపించే ప్రయత్నం చేసి ఉండేవాడిని.కానీ స్వామీజీ ఆ పనిని చెయ్యలేదు.

కొంచం కొంచంగా అతని కళ్ళు అప్పుడే తెరుచుకుంటున్నాయి. కానీ స్వామీజీ ఆ కళ్ళను పూర్తిగా మూసేసాడు. నేనలా చేసి ఉండేవాడిని కాను.

2. చంద్రపాల్ స్థానంలో నేనుంటే??

చంద్రపాల్ స్థానంలో నేనుంటే - స్వామీజీని ఇలా అడిగేవాడిని.

'స్వామీజీ.నా జీవితాన్ని కొత్తగా మళ్ళీ నిర్మించుకొమ్మని మీరు చెబుతున్నారు.బాగుంది. కానీ మీనుంచి నేను వినాలనుకున్నది ఇది కాదు. ఈ Corporate motivational jargon కాదు నాకు కావలసింది.ఇవి నాకెప్పుడో తెలుసు.కావాలంటే వాటి గురించి నేనే మీకు ఇంకా బాగా చెప్పగలను. ఎందుకంటారా? ఈ విషయాలు నాకు ప్రాక్టికల్ గా తెలుసు. మీరు ఊరకే పుస్తకాలు చదివారు.నేను పుట్టినప్పటి నుంచీ బిజినెస్ ఫీల్డ్ లో మునిగి తేలినవాడిని. కనుక You can win, Everything is in your hands, If you have a will you have a way, Nothing is too late to start ... మొదలైన చెత్త కాదు మీరు నాకు చెప్పాల్సింది. ఇవన్నీ నాకెప్పుడో తెలుసు.

పైగా, నాదొక ప్రశ్న.మీరు నాకు చెబుతున్నవి ముందు మీరు ఆచరించి ఆ తర్వాత నాకు చెప్పాలి. మీ జీవితాన్ని మీరే వదిలేసి సన్యాసం స్వీకరించబోతున్నారు. ప్రస్తుతం బ్రహ్మచారిగా మీరున్నారు.కొన్నేళ్లలో మీరూ స్వామీజీ అవుతారు కదా?జీవితం నుంచీ దాని బాధ్యతల నుంచీ పారిపోతున్న మీరు,అదే జీవితాన్ని ధైర్యంగా ఎదుర్కోమని నాకెలా చెప్తున్నారు?మీరు చెయ్యని చెయ్యలేని పనిని నన్ను చెయ్యమని ఎలా చెప్పగలుగుతున్నారు?

అసలు స్వామి వివేకానందను మీరు సరిగ్గా అర్ధం చేసుకోలేదని నా ఉద్దేశ్యం. ఈ రోజుల్లో ఆయన బోధనలను పూర్తిగా వక్రీకరిస్తున్నారు.ఆయన్ను ఒక యూత్ ఐకాన్ గా, ఒక పాజిటివ్ తింకర్ గా, ఒక మేనేజిమెంట్ గురుగా ప్రాజెక్ట్ చేస్తున్నారు.ఇది పూర్తిగా తప్పు. మీరు చేస్తున్నది ఘోరమైన పొరపాటు.ఒక ప్రవక్తను మీరు చాలా దిగజారుస్తున్నారు. ఆయన చెప్పింది మేనేజిమెంట్ క్లాసులు కాదు. శుద్ధమైన వేదాంతాన్ని ఆయన ప్రాక్టికల్ గా బోధించారు. అసలు ఆయన్ను మీరు ముందు సరిగ్గా అర్ధం చేసుకోండి.

"ప్రపంచాన్ని జయించండి" అని ఆయన చెప్పినదానికి అసలైన అర్ధం - మోసపూరిత వ్యాపారాలు చేసి ఏదో రకంగా కోట్లు సంపాదించమని కాదు. ఇదే ప్రపంచంలో దాని వ్యామోహపు మురికిగుంటలో పడి ఈత కొడుతూ చచ్చేవరకూ ఇదే నిజం అనుకుంటూ అఘోరించమని కాదు. ప్రపంచపు నిజస్వరూపం ఏమిటో తెలుసుకోండి. దానిపైన మీ వ్యామోహాన్ని జయించండి. మిమ్మల్ని మీరు నిజంగా తెలుసుకోండి. అని ఆయన చెప్పాడు.ఆయనొక మహాప్రవక్త. ఆయనొక దేవత. కానీ, మీరేమో ఆయన్ను రోడ్డు మీదకు లాగి ఒక చీప్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ను చేసి కూచోబెట్టారు.

"ఉత్తిష్టత జాగ్రత ప్రాప్యవరాన్నిబోధత" అన్న కఠోపనిషత్తు మంత్రాన్ని ఆయన మీకు బోధించాడు. దానర్ధం -" నిద్ర నుంచి లెండి. కష్టపడండి. మీ గమ్యం చేరేవరకూ విశ్రాంతి తీసుకోవద్దు' అన్నది నిజమే. కానీ ఆయన చెబుతున్నది -ఒక IIT పరీక్షనో ఒక IIM పరీక్షనో, లేదా ఒక సివిల్ సర్వీస్ పరీక్షనో పాసయ్యేవరకూ తిరిగి తిరిగి వ్రాసి దానిని సాధించమని కాదు. బిజినెస్ లో ఒకసారి ఫెయిల్ అయితే మళ్ళీ మళ్ళీ అదే బిజినెస్ చేసి బ్లాక్ మనీ కూడబెట్టమని కాదు.ఆయన మనల్ని చెయ్యమంటున్న ప్రయత్నం అది కాదు.ఆయన చెబుతున్నది డబ్బు సంపాదన గురించి కానే కాదు.

నిజమైన జీవిత గమ్యాన్ని చేరుకోవడంలో చూపవలసిన శ్రద్దను గురించి ఆయన చెబుతున్నాడు. నిజమైన జీవిత గమ్యం అంటే పరీక్షలు పాసవడం, ఉద్యోగాలు సంపాదించడం, వ్యాపారాలు చెయ్యడం, రాజకీయంగా పదవులు సంపాదించి దొంగ సొమ్ము కూడబెట్టడం - ఇవి కావు. పోనీ నువ్వు అక్రమంగా కాకుండా సక్రమంగా సంపాదించినా కూడా - అంతిమ విశ్లేషణలో అదెందుకూ పనికిరాదు. నీకది చెదిరిపోని ఆనందాన్ని ఎప్పటికీ ఇవ్వలేదు.

నేను మీ మాటలతో చాలా డిసప్పాయింట్ అయ్యాను. మీనుంచి ఇలాంటి చీప్ కార్పోరేట్ జార్గన్ కాదు నేను వినాలని ఆశించినది. నిజమైన జీవితాన్ని గురించి నేను వినాలనుకున్నాను. మీ మాటలు నన్ను చాలా ఆశాభంగానికి గురి చేశాయి.

ఒకవేళ - నిజమైన ఆనందం మీరు కోరుకుంటున్న సాధు జీవితంలో ఉంటే - నన్ను కూడా అందులోకి రమ్మని మీరు పిలవాలి.అప్పుడు మీరంటే నాకు గౌరవం ఇనుమడించేది. లేదా నన్ను తిరిగి ఏ ఊబిలోకైతే మీరు నెట్టాలని భావిస్తున్నారో, అదే సత్యమైతే, మీ కాషాయ వస్త్రాలు వదిలేసి మీరు కూడా నా దారిలోకి రావాలి. అప్పుడు మాత్రమే మీలో నిజాయితీ ఉన్నట్లు నేను భావిస్తాను.

మీరు ఒక దారిలో పోతూ నన్ను వేరే దారిలోకి పొమ్మని చెప్పడంలో మీ ఆంతర్యం ఏమిటి? ఇది సరియైన గైడెన్స్ యేనా? మీరు చెబుతున్నది లాజిక్ కు విరుద్ధంగా ఉన్నది.మీ మాటలు నిజాలని నేనెలా నమ్మాలి?

నేనే చంద్రపాల్ నైతే ఇవే మాటలను స్వామీజీని అడిగి ఉండేవాడిని.

ఏదేమైనా - చంద్రపాల్ కథ విని నాకు చాలా జాలేసింది. స్వామీజీని చూస్తే కూడా ఇంకా జాలేసింది.

ప్రకృతి చంద్రపాల్ జీవితంలో ఒక గొప్ప అవకాశాన్ని కలిగించింది. ప్రపంచపు నిజతత్వాన్ని అతనికి చూపిద్దామని అతని కళ్ళు కొంచం తెరిచింది.కానీ ఆ తెరుచుకుంటున్న కళ్ళను స్వామీజీ మళ్ళీ మూసేశాడు. ఎంత గట్టిగా అంటే - మళ్ళీ అవి తెరుచుకోనంతగా !!

ఇరవై లక్షలు ఇచ్చి లాతూర్ భూకంపంలో అన్నీ కోల్పోయిన అభాగ్యులకు చంద్రపాల్ నాలుగు ఇళ్ళు కట్టించి ఇచ్చి ఉండవచ్చు. కానీ అతను మాత్రం Homeless గానే మిగిలిపోయాడు.తన అసలైన ఇంటిని అతను చేరుకోలేకపోయాడు.ఎప్పుడూ చెదిరిపోని, నాశనం కాని ఒక గొప్ప ఇంటిని చేరుకునే అవకాశాన్ని అతను శాశ్వతంగా కోల్పోయాడు.

ఒక జ్ఞానిగా మారే అవకాశం కోల్పోయి ఒక మామూలు వ్యాపారిగా అయిపోయాడు.

గొంగళి పురుగుకు సీతాకోక చిలుకగా మారే అవకాశం వచ్చింది. కానీ అది వెనక్కు వెళ్ళిపోయి గొంగళి పురుగులానే ఉండిపోయింది. అదికూడా - ఒక సీతాకోక చిలుకగా మారాలని ప్రయత్నిస్తున్న ఇంకొక గొంగళి పురుగు సలహా విని !! ఎంత బాధాకరం !!

మళ్ళీ అలాంటి అవకాశం అతని జీవితంలో వస్తుందా? 

ఏమో? ఎవరికి తెలుసు?

(ఇంకా ఉంది)