“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

19, ఆగస్టు 2014, మంగళవారం

మహనీయుల దర్శన మార్గాలు

నా పోస్ట్ లు చదివిన చదువుతున్న కొందరు గుజరాత్ అడవులలోకి వెళ్లి అశ్వద్దామను కలవాలని ప్రయత్నించబోతున్నారని నాకు తెలిసింది.

మహనీయులైన వారిని కలవాలంటే విధానం అది కాదు.పిక్నిక్ కు వెళ్ళినట్లు అడవిలోకి వెళ్లి వెతికితే అక్కడ ఎవరూ కనిపించరు.ఇంకా చెప్పాలంటే ప్రస్తుత కాలంలో ఏ నక్సలైట్లో రాడికల్సో కనిపించవచ్చు.అది మరీ ప్రమాదం.

చిరంజీవులు ఉన్నారు.కానీ వారు మనకు కనిపించరు.వారికి అతీత శక్తులు ఉంటాయి.రకరకాల వేషాలలో రకరకాల చోట్ల వారు సంచరిస్తూ ఉంటారు.ఒకే సమయంలో అనేక చోట్ల కూడా ఉండగలరు.అందుకే అశ్వత్థామ గుజరాత్ అడవులలోనూ మధ్యప్రదేశ్ అడవులలోనూ హిమాలయాల లోనూ చాలామందికి కనిపించాడు.ఇప్పటికీ కనిపిస్తున్నాడు.

అలాగే ఆంజనేయస్వామి కూడా.

రామనామ భజనా స్మరణా జరిగేచోట ఆయన తప్పకుండా ఉంటాడని మన నమ్మకం.ఆయనను చూచిన వారు ఎందఱో నేటికీ ఉన్నారు.

అయితే అలా చూడడానికి విధానం వేరే ఉన్నది.బజారులో వస్తువుకోసం వెదికినట్లు వెదికితే వారు కనపడరు.వారి దర్శనాన్ని పొందాలంటే దానికి చాలా సాధనాబలం ఉండాలి. నియమయుతమైన జీవితాన్ని కొన్నేళ్ళ పాటు తపోమయ దీక్షలో గడపి ఉండాలి.అప్పుడే వారిని దర్శించే భాగ్యం కలుగుతుంది.

నానా రకాల కోళ్ళనూ కుక్కలనూ పందులనూ ఇంకా ఇతర జంతువుల మాంసాలనూ తింటూ,సారాయి త్రాగుతూ,బ్రహ్మచర్యం లేకుండా,జీవితంలో నానా వెర్రివేషాలూ వేస్తూ, అసూయా కుళ్ళూ కుత్సితాలతో అహంకారంతో ఇంద్రియలాలసత్వంతో నిండి ఉన్న నేటి మనుష్యులు చిరంజీవుల దర్శనాన్ని కాంక్షించడం హాస్యాస్పదం. 

అదెన్నటికీ జరిగే పని కాదు.

నియమయుతమైన జీవితమూ నిరంతర తపస్సూ లేనిదే ఎవరూ వారిని దర్శించడం సాధ్యం కాదు.అలాంటి ఎవరో ధన్యాత్ములకు మాత్రమే వారి దర్శనం కలుగుతుంది.అది కూడా మనం అడవులలో పడి వెదికితే వారు కనబడరు.వారు కనిపించాలి అనుకుంటే మనకు కనిపిస్తారు.లేకుంటే వారు మన పక్కనే ఉన్నా కూడా మనం గుర్తించలేము.ఆయనెవరో ఎల్లయ్యో పుల్లయ్యో అనుకుంటాము.అలాంటి మాయ మన మనస్సులను ఆ సమయంలో కప్పివేస్తుంది.

పాతతరాలలో మన కుటుంబాలలో ఋషితుల్యులైన మనుష్యులు ఉండేవారు.వారు ఎంతో నియమయుతములైన జీవితాలను గడపేవారు.అలాంటి వారికి మహనీయుల దర్శనాలు కలగడం విచిత్రమేమీ కాదు.ఈనాడంటే బ్రాహ్మణ కుటుంబాలు కూడా భ్రష్టు పడుతున్నాయి గాని,మొన్న మొన్నటి వరకూ కూడా ఋషితుల్యులైన మనుష్యులు ప్రతి కుటుంబంలోనూ ఉండేవారు.

హైదరాబాద్ నుంచి సంజయ్ చంద్ర ఇలా వ్రాస్తున్నారు.
-----------------------------
అశ్వథామ యోగిపుంగవుని గురించి మీరు వ్రాస్తున్న పోస్ట్ లను చదువుతున్నప్పుడు, మీతో రెండు విషయాలను పంచుకోవాలని అనిపించింది.

1) మా తాతగారు శ్రీ బులుసు సత్యనారాయణ గారు (మా నాన్నగారి తండ్రి) 

ఈయనకు ఆంజనేయస్వామి వారి దర్శనము అయింది అని అంటారు. విజయవాడ కొండలలోని పురుగుల ఆంజనెయస్వామి (వీర అభయ) వారిని ఉపాసించారట.మూడు తరముల వరకు యేవిధమైన పీడలు లేకుండా మా కుటుంబాన్ని రక్షించెదను అని స్వామి అభయం ఇచ్చారట. ఈయన తపోబలము గురించి మా బంధు వర్గములో చాలా సంఘటనలు కధలుగా చెపుతారు. వీరిని నేను చూడలేదు.

2) మా తాతగారు శ్రీ రొయ్యూరు సత్యనారాయణగారు ( మా తల్లిగారి తండ్రి) :

ఈయనకు అశ్వథామ యోగిపుంగవుని దర్శనము అయ్యింది అని మా తల్లిగారు చెప్పేవారు. వీరు నిరంతర ధ్యాని. అత్యంత ప్రశాంత మనస్కులు. వీరు నిరంతర గాయత్రిమంత్ర ధ్యానులు. వీరికి భద్రాచలం అడవులలో అశ్వథామవారు ఒక సూర్యోదయ సమయమున కనిపించారట. ఫది అడుగుల ఎత్తు, బ్రహ్మతేజముతొ,అత్యంత ఆత్మవిశ్వాసముతో కనిపించారట.చిరు దరహాసముతో వీరివంక కరుణపూర్వకముగా చూసి అడవిలోకి వెల్లిపోయారంట.మా తాతగారి తండ్రిగారు, భద్రాచలములో సన్యాసాస్రమములో శ్రీరామ ఐక్యం అయినప్పుడు ఈ సంఘటన జరిగిందట.
-------------------------------------
తపోబలం ఉన్నపుడు అలాంటి వారి దర్శనం కలుగుతుంది.అంతేగాని తపస్సు లేకుండా ఉత్త క్యూరియాసిటీతో కొండలలో కోనలలో తిరుగుతూ అక్కడి గుహలలోకి పోయి తొంగి చూస్తే ఏమి జరుగుతుందో వేమన యోగి ఒక పద్యంలో వివరించాడు.

ఆ||గుహలలోన జొచ్చి గురువుల వెదుకంగ
క్రూరమృగ మొకండు తారసిలిన
ముక్తి మార్గమదియె ముందుగా జూపురా
విశ్వదాభి రామ వినురవేమ

గురువుల కోసం కొండ గుహలలోకి పోయి వెదికితే అక్కడ ఏ పులో సింహమో కూచుని ఉంటే అప్పుడు ఎక్కువ కష్టపడకుండా ముక్తిమార్గాన్ని అదే చూపిస్తుంది.ఉత్త బోధ చేసి ఊరుకోదు.సరాసరి మోక్షాన్నే ప్రసాదిస్తుంది.

ఒక వస్తువుకోసం ప్రయత్నం చెయ్యడంలో లౌకిక విధానాలు వేరు.ఆధ్యాత్మిక విధానాలు వేరు.చాలాసార్లు ఈ రెండూ ఒకదానికొకటి వ్యతిరేకంగా ఉంటాయి.ఆధ్యాత్మిక లోకంలో అర్హత ప్రధానమైనది.దానిని సంపాదించకుండా ఊరకే దేశాలు పట్టుకుని తిరిగినంత మాత్రాన అక్కడ ఏమీ కనపడదు.

చదువరులు ఈ విషయాన్ని చక్కగా గ్రహించాలి.