“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

25, జూన్ 2014, బుధవారం

రాహుప్రభావాలు -- నిత్యజీవితంలో నుంచి కొన్ని ఉదాహరణలు

ప్రస్తుతం రాహుశనుల మీద గురువుగారి కంట్రోల్ పోయింది గనుక రాహువు ప్రజలమీద రకరకాలుగా బాగా విజృంభిస్తున్నాడు.ఈ విషయం మొన్ననే హెచ్చరించాను.

కాని రాహువుయొక్క ఆయాచర్యలు మామూలుగా కేజువల్ దృష్టితో చూస్తే అర్ధంకావు.వాటిని అర్ధం చేసుకోవాలంటే లోతైన మార్మికదృష్టి ఉండాలి.

ప్రస్తుతం ఎన్ని రకాలుగా రాహువు యొక్క చర్యలు జరుగుతున్నాయో అర్ధం చేసుకునే దిశగా కొన్ని ఉదాహరణలు మాత్రం గమనిద్దాం.

ఒకటి

మొదటగా గుంటూరు విజయవాడ మధ్యలో ఈమధ్య జరిగిన యాసిడ్ ట్యాంకర్ రోడ్డు ప్రమాదం గురించి చూద్దాం.ఇది చాలా విచిత్రమైన ప్రమాదం.

ఒక పెళ్ళికి అటెండ్ అయిన కొందరు విజయవాడకు పోదామని బయలుదేరారు.ఒక క్వాలిస్ ఖాళీగా ఉంటె అదెక్కారు.వీళ్ళకు కర్మానుభవ సమయం దగ్గరపడింది.ఆ డ్రైవర్ మీద రాహుప్రభావం విపరీతంగా ఆవహించింది.విపరీతమైన స్పీడుతో కారు తోలడం మొదలుపెట్టాడు.లోపల కూచున్నవారికి పైప్రాణాలు పైనే పోయినంత భయం పుట్టింది.

'బాబూ!!ఇంత స్పీడ్ పోవద్దు.తగ్గించు.లేదంటే మేము దిగిపోతాము'- అని వాళ్ళు ఎంత మొత్తుకుంటున్నా వినకుండా విపరీతమైన స్పీడ్ తో పోనిచ్చి తమకంటే ముందుపోతున్న ఒక యాసిడ్ ట్యాంకర్ ను వెనకనుంచి గుద్దేశాడు.ఆ ట్యాంకర్ వెనుక భాగంలో ఈ కారు ఇరుక్కుంది.ఆ ధాటికి యాసిడ్ ట్యాంక్ మూత తెరుచుకుని కారులోని వారికి యాసిడ్ తో అభిషేకం జరగడం మొదలైంది.అలా యాసిడ్ తో కారునూ అందులోని మనుషులనూ అభిషేకం చేసుకుంటూ కారును మూడు కిలోమీటర్లు లాక్కెళ్ళింది ట్యాంకర్. కారులో ఒకామె అక్కడికక్కడే కారులోనే చనిపోయింది.మిగతావాళ్ళకు తీవ్ర యాసిడ్ గాయాలయ్యి ఒళ్లంతా కాలిపోయింది.అలా కాలిపోతూ హాహాకారాలు చేస్తూ మూడుకిలోమీటర్లు ట్యాంకర్ తో లాగబడుతూ ప్రయాణం చేశారు. చివరకు యాసిడ్ తో ఒళ్ళు కాలిపోయి రోడ్డుమీద పడి బాధతో కేకలు పెడుతూ ఉంటె చాలాసేపటి వరకూ వారిని పట్టించుకున్న నాధుడు లేడు.ఇది జరిగి రెండురోజులయ్యింది.

ఇదెంత విచిత్రమైన సంఘటనో గమనించండి.

యాసిడ్ కు రాహువు కారకుడు అన్న విషయం జ్యోతిష్య విద్యార్ధులకు సుపరిచితమే.రోడ్డు ప్రయాణాలకూ ప్రమాదాలకూ కూడా ఆయనే కారకుడని మళ్ళీ చెప్పనక్కరలేదు.కీటకాలకూ సర్పాలకూ ఇతర పాకే జంతువులకూ రాహువే అధిష్టాన దేవత అని జ్యోతిష్య ప్రామాణిక గ్రంధాలు అంటాయి.

ఒక్కసారి భూమిని వదలి ఆకాశంలో మేఘాలవరకూ వెళ్లి చూద్దాం. అక్కడనుంచి క్రిందికి చూస్తె,భూమిమీద పోతున్న కార్లు అన్నీ పాకుతున్న చిన్నచిన్న పురుగులలాగా కనిపిస్తాయి.రైళ్ళు అన్నీ చిన్నచిన్న పాముల లాగా కనిపిస్తాయి.కనుకనే వీటిమీద రాహువు ప్రభావం అమితంగా ఉంటుంది. దీనిని మార్మిక పరిభాషలో 'లా ఆఫ్ సిగ్నేచర్' అంటారు.ప్రామాణిక గ్రంధాలలో గ్రహకారకత్వాలన్నీ ఈ సూత్రం ఆధారంగానే నిర్ణయించబడ్డాయి.

భిన్నధ్రువాల మధ్యన ఆకర్షణ ఉంటుంది.అలాగే ఒకే రకమైన ధ్రువాలు ఒక్కచోటికి చేరడమూ కరెక్టే.మార్మిక విషయాలలో ఈ రెండుసూత్రాలూ వర్తిస్తాయి.ఎక్కడ ఏ సందర్భంలో ఏసూత్రం ఎలా వర్తిస్తున్నదో సూక్ష్మంగా గమనించి గ్రహించాలి.

రెండు

ఇకపోతే మొన్న జరిగిన కలకత్తా మెట్రో రైల్వే ప్రమాదం చూద్దాం.

కలకత్తా మెట్రో రైల్వేలోని సొరంగంలో మెట్రో ట్రెయిన్ చాలాసేపు నిలిచి పోయింది.ఊపిరాడక,బయటకు రాలేక ప్రయాణీకులు నానా నరకం అనుభవించారు. చివరకు వారిని నిచ్చెనల మీదుగా బయటకు లాగారు.

పాము అనే జీవి నేలలో ఉన్న సొరంగాలలో బొరియలలో తిరుగుతుంది. మెట్రోరైలు కూడా ఒకరకంగా నేలబొరియలలో తిరిగే పామువంటిదే. రాహువు యొక్క రూపం సర్పమే.కనుక మొన్న జరిగిన మెట్రోరైలు ఘటన కూడా రాహుప్రభావమే అనడానికి సంశయం అక్కర్లేదు.ఆరకంగా భూసొరంగంలో బంధించి జనాన్ని రాహువు హింస పెట్టాడు.

రాహువు హింసపెట్టాడు అనడంకంటే,చేసుకున్న పాపాలకుగాను ఎవరి ఖర్మను వారు అనుభవించారు అనడం సబబుగా ఉంటుంది.గ్రహాలు దైవ స్వరూపాలనీ వాటిని ఎగతాళిగా సంబోధించడం,ఎకసెక్కాలు చెయ్యడంవల్ల, వాటి కోపానికీ చెడుప్రభావానికి తీవ్రంగా గురికావలసి ఉంటుందనీ ఇంతకు ముందు ఎప్పుడో వ్రాసిన పోస్ట్ లో ఒకసారి హెచ్చరించాను.

మూడు

ఋతుపవనాలు వెనక్కు పోవడం కూడా రాహుప్రభావమే.

వస్తున్నాయి వస్తున్నాయి అనుకున్న ఋతుపవనాలు ఎక్కడా పత్తా లేకుండా వెనక్కు పారిపోతున్నాయి.ఎండలు మండిపోతూ,మళ్ళీ రోహిణీకార్తె వచ్చిందా అనిపిస్తూ ప్రతిరోజూ ఎంతోమంది వడదెబ్బ తగిలి చనిపోతున్నారు.

ఇది కూడా రాహుప్రభావమే అని నేనంటాను.

ఇదెలా సాధ్యమో చూద్దాం.

'ఎల్ నినో' అంటే ఏమిటో ఆ టెక్నికాలిటీస్ ఏమిటో నేనిక్కడ వివరించబోవడం లేదు.క్లుప్తంగా చెప్పాలంటే --'సముద్రం మీదనుంచి వీచే వేడిగాలుల వల్ల భూమిపైన చాలామార్పులు కలుగుతాయి'-- అనుకోవచ్చు.దీని ప్రభావంవల్ల మనకు ప్రస్తుతం రావలసిన ఋతుపవనాలు వెనక్కు పోతున్నాయి.లేదా న్యూట్రలైజ్ అయిపోతున్నాయి.

ఇక్కడ ఒకసారి రామాయణంలోకి తొంగిచూద్దాం.

హనుమంతుడు సముద్రాన్ని దాటే సమయంలో ఆయన నీడను పట్టుకుని క్రిందకు లాగాలని ఒక శక్తి ప్రయత్నిస్తుంది.దాని పేరు 'సింహిక'.అది 'రాహువు'కు తల్లి అని రామాయణం అంటుంది.రాహువుకు 'సైంహికేయుడు' అని నామాంతరం ఉన్నది.సముద్రం మీద ప్రయాణించే వాటిని అది అరికట్టి క్రిందకులాగి స్వాహా చేసేస్తూ ఉంటుంది.అయితే హనుమంతుడి ముందు దాని శక్తి సరిపోదు.ఆయన దానిని సునాయాసంగా ఓడించి ముందుకు సాగిపోతాడు.అందుకే రాహువు యొక్క దుష్ప్రభావాలనుంచి తప్పుకోవడానికి హనుమంతుడిని పూజించాలి.

మనం ఇప్పుడు 'ఎల్ నినో' అంటున్నదానినే వాల్మీకి 'సింహిక' అన్నాడు. పూర్తిగా అదే ఇది కాకపోవచ్చు.కాని రెండూ సముద్రప్రభావాలే.దగ్గరదగ్గరగా రెండూ ఒక రకమైనవే.

అప్పుడు ముందుకు వెళుతున్న హనుమంతుడిని క్రిందకు లాగాలని ప్రయత్నించింది సింహిక.ఇప్పుడు ముందుకు వెళుతున్న ఋతుపవనాలను వెనక్కు లాగేసింది 'ఎల్ నినో ఎఫెక్ట్'.ఇది రాహుప్రభావమే అంటే ఇప్పుడు ఒప్పుకుంటారా మరి??

ఆమధ్యన మాయమైన మలేషియా విమానం కూడా శపితయోగం మంచి పట్టుమీద ఉన్నపుడే మాయమై ఇంతవరకూ కనిపించకుండా పోయింది.ఇది గమనార్హం.

ఒక్కసారి పక్కన ఉన్న బొమ్మను చూడండి.Wet and warm packet ను మింగుతున్నట్లుగా Dry warm packet సర్పాకారంలో ఉండటం స్పష్టంగా చూడవచ్చు.ఇక్కడ రాహువు మనకు స్పష్టంగా దర్శనం ఇస్తున్నాడు.ఈ కోణంలో చూస్తే, ఇప్పుడు చదువరులకు విషయం కొంత అర్ధం అయిందనుకుంటాను.

కనుక ప్రస్తుతం మండే ఎండలకూ,వడదెబ్బతో ప్రతిరోజూ పోయే ప్రాణాలకూ కూడా  రాహువే కారణం అయ్యాడు.

ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే ఈ విషయాలు చాలా విచిత్రంగా సూక్ష్మంగా ఉంటాయి.వాటిని చూచే దృష్టితో చూస్తేనే అవి అర్ధం అవుతాయి. ఆషామాషీగా పైపైన చూస్తే అవి అర్ధంకావు.రాహుప్రభావం చిత్రవిచిత్రాలతో కూడి ఉంటుందని ఇంతకు ముందే వ్రాశాను.రాహువుకు 'మాయావి' అని ఒక పేరున్నది.దీనిని మనం జాగ్రత్తగా గమనించాలి.

రాహువు యొక్క విచిత్రమైన ప్రభావాలు ఎలా ఉంటాయో కొన్ని ఉదాహరణలు మాత్రమే ఇక్కడ వివరించాను.అవి ఇంకా ఎన్నో రకాలుగా ఉంటాయి.ఎక్కడికక్కడే ప్రత్యేకంగా ఉంటాయి.ప్రతి సంఘటనా విభిన్నంగా ఉంటుంది.కర్మనుంచి తప్పుకోవడానికి మనిషి అతితెలివితో తీసుకునే జాగ్రత్తలను రాహువు చాలా తేలికగా ఇంకా తెలివిగా అధిగమించగలడు.ఆ వరం ఆయనకు దైవం చేతనే ఇవ్వబడింది.

రాబోయే రోజులలో ఇంకా ఎన్నెన్ని చిత్రవిచిత్ర సంఘటనలు జరుగుతాయో, ప్రజలకు వారివారి కర్మక్షాళనం ఎలా జరుగుతుందో,శపితయోగం ఇంకా ఎన్నిరకాలుగా జనులను కాటేస్తుందో వేచిచూద్దాం.