“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

21, మార్చి 2013, గురువారం

సంగీతం-జ్యోతిషం-2 (ఎమ్మెస్ సుబ్బులక్ష్మి జాతకం)

సంగీత ప్రపంచంలో ముందుగా కొందరు గాయనీమణుల జాతకాలు చూచి తర్వాత గాయకుల వద్దకు వద్దాం.సంగీత సామ్రాజ్యంలో  ఎమ్మెస్ సుబ్బులక్ష్మి గానానికీ గాత్రానికీ ఒక ప్రత్యేకత ఉన్నది. లతామంగేష్కర్ కూడా ఆమె గానాన్ని అభిమానించేదంటే ఆ గాత్రమాధుర్యం ఎలాంటిదో అర్ధం చేసుకోవచ్చు.కర్నాటక సంగీతంలో ముగ్గురు ప్రసిద్ధ మహిళా గాయనీ మణులలో సుబ్బులక్ష్మి పేరు ప్రధమంగా చెప్పుకోవాలి.మిగతా ఇద్దరు-డీ.కే.పట్టమ్మాళ్,ఎమ్మెల్ వసంత కుమారి. వీరి ముగ్గురి జాతకాలూ వరుసగా పరిశీలిద్దాం.

అదృష్టవశాత్తూ మిగతావారిలా కాకుండా ఎమ్మెస్ జననసమయం మనకు  లభిస్తున్నది. ఈమె 16-9-1916 న 9.30 కు మదురై లో జన్మించారు. జాతక చక్రం ఇక్కడ చూడవచ్చు.

ఈమె భరణీ నక్షత్రంలో జన్మించారు. గురుచంద్ర సంయోగం వల్ల గజకేసరీయోగం ఈమె జాతకంలో ఉన్నది.కాని గురువు వక్రస్తితివల్ల ఈమెకు ధార్మికరంగంలో ఎంతో కర్మ బాకీ ఉండిపోయిందని చెప్పాలి.కనుకనే జీవితమంతా భక్తిపరమైన ధార్మికమైన సంగీతం ఆలపించినా దానిమీద ఆమె సంపాదించినది పెద్దగా లేదు. ఒకవేళ సంపాదించినా అక్కడికక్కడే ఏదో దానధర్మాలకు ఆ డబ్బును ఇచ్చివేసేది.ధనమ్మీద పెద్దగా ఆశలేకపోవడం వల్లనే పాడే సమయంలో ఆమెలో నిశ్చలనిమగ్నతా ఆ గళంలో ఏదో అలౌకికమైన మహత్తూ కనిపించాయేమో అనిపిస్తుంది.

చంద్రలగ్నాత్ తృతీయాదిపతి అయిన బుధుడు ఆరింట ఉచ్చస్తితిలో ఉండటం చూడవచ్చు. ఆత్మకారకుడు కూడా ఈమె జాతకంలో బుదుడే అయి ఉన్నాడు.బుధుని ఉచ్చ స్తితివల్లె ఆమెకు అపారమైన సంగీతప్రతిభ సహజంగా కలిగింది.బుధదశ మొదలు కావడంతోనే ఆమెను 'భారతరత్న' అవార్డ్ వరించింది. వాక్ స్తానాధిపతి అయిన శుక్రుడు విద్యాస్తానంలో శని కేతువులతో కలిసి ఉండటంవల్ల ఈమె సాధారణ గాయకురాలు కాదనీ నిజమైన ఆధ్యాత్మిక నిమగ్నత కలిగిన గాయకురాలనీ అర్ధమౌతుంది. అందుకే ఆమె గానం చేస్తున్నపుడు నిశ్చలమైన ధ్యానస్తితిలో ఉండి పాడటం గమనించవచ్చు. 

సూర్యుని రాశిసంధి స్తితివల్ల ఆమె తనయొక్క స్వచ్చమైన గాన నైపుణ్యానికీ వృత్తికీ మధ్య సంఘర్షణ అనుభవించినదని అర్ధమౌతుంది.తన గాన ప్రావీణ్యానికి తగిన అధికారపదవులు ఆమెను వరించలేదు.దీనికి కారణం సూర్యుని రాశిసంధి స్తితి.బహుశా ఆమెకూడా వాటిని కోరుకొని ఉండదు. చంద్రలగ్నాధిపతి అంగారకుడు నవాంశలో ఉచ్ఛస్తితివల్ల,ఆయనకూ గురువుకూ ఉన్న పరస్పర దృష్టివల్ల ధార్మికంగా చాలా పట్టుదలా నియమనిష్టలూ కలిగిన వ్యక్తి అని తెలుస్తుంది.అలాగే శని శుక్రులు కేతువుతో సంయోగం చెందటంవల్ల,మెరుపులతో కూడిన కళారంగంలో ఉంటూ కూడా నిర్లిప్తతతో కూడిన విరాగాన్ని ఆమె కలిగి ఉండేదన్న విషయం చూడవచ్చు.

లగ్నాత్ ద్వితీయాదిపతి లగ్నంలో ఉంటూ తృతీయాధిపతి అయిన గురువు చేతా,దశమాదిపతి అయిన పూర్ణచంద్రుని చేతా చూడబడటం ఒక గొప్ప యోగం.ఈ యోగం ఈమెకు మంచి సంగీత ప్రజ్ఞను కట్టబెట్టింది. అంతేగాక సంగీతాన్ని ఆమె వృత్తిగా చేసుకున్నదనీ అందులో ఆమెకు గొప్ప పేరు ప్రఖ్యాతులు వస్తాయనీ సూచన ఉన్నది.

ఈమె జనన సమయంలో శుక్ర/బుధ/శుక్ర దశ జరుగుతూ ఉండటం గమనిస్తే  ఈమెకు సంగీత సరస్వతీ కటాక్షం పుట్టుకనుంచే ఎంత బలంగా ఉన్నదో అర్ధమౌతుంది.అంతేగాక గత వ్యాసంలో నేను చెప్పినట్లు కళారంగానికీ ముఖ్యంగా సంగీతానికీ బుధశుక్రుల అనుగ్రహం తప్పకుండా ఉండాలి అన్న సూత్రం ఇక్కడ అక్షరాలా రుజువు కావడం గమనించవచ్చు.గతజన్మలో ఎంతో సాధనా పుణ్యబలమూ ఉంటేనే ఈ జన్మలో చిన్నప్పటినుంచే ఇంతటి ప్రతిభ అలవడుతుంది.లేకుంటే ఇలాంటి గ్రహస్తితులు ఉండటం దుర్లభం. ఇలాంటి ప్రతిభ కూడా అసాధ్యమే.

శాస్త్రీయ సంగీతంలో మాత్రమె గాక భజనలు పాడటంలోనూ మామూలు పాటల్లోనూ కూడా ఈమె సిద్ధగాత్రం కల్గిన విదుషీమణి. ఈమె గానానికి ముగ్దులవని వారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు.అన్ని భాషలలో ఆ ఉచ్చారణ సరిగ్గా సరిపోయేటట్లు ఆమె ఎలా పాడగలిగిందా అని ఆలోచిస్తే అబ్బురం అనిపిస్తుంది.

ఈమె జీవితంలో ముఖ్య ఘట్టాలను జాతకపరంగా పరిశీలిద్దాం.


1926 లో పదేళ్ళ వయసులో చంద్రదశ మొదలవ్వడంతోనే ఆమెకు కీర్తిప్రతిష్టలు రావడం మొదలైంది. అదే సమయంలో ప్రధమంగా హైస్కూల్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఒక మరాటీ పాట పాడింది.అదే ఏడు తన మొదటి రికార్డింగ్ కూడా జరిగింది.సహవాయిద్యంగా  తల్లిగారైన షణ్ముగవడివు వీణానాదం తోడైంది.

సభాముఖంగా తన మొదటి కచ్చేరి పదకొండేళ్ళ వయసులో తిరిచినాపల్లిలో ఇచ్చింది.ఇదీ చంద్ర దశ మొదట్లోనే జరిగింది. 

1929 లో పదమూడేళ్ళ వయసులోనే ప్రతిష్టాత్మక మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ లో ఆమె మొదటి సంగీత కచ్చేరి చేసింది.అప్పుడు చంద్ర/గురు దశ ఆమెకు జరిగింది. అప్పటివరకూ అక్కడ ఆడవారిని పాడనిచ్చేవారు కారు.గురు అనుగ్రహం వల్ల ఈ ఖ్యాతి ఆమెకు దక్కింది.

ఆమె చాలా చిన్నవయసులోనే సంగీత సాధన మొదలుపెట్టింది.కర్నాటక సంగీతాన్ని సెమ్మంగుడి శ్రీనివాసయ్యర్ దగ్గరా,హిందూస్తానీ సంగీతాన్ని పండిత నారాయణరావ్ వ్యాస్ దగ్గరా నేర్చుకున్నది.సంస్కృతాన్నీ తెలుగునూ నేదునూరి కృష్ణమూర్తి వద్ద అభ్యసించింది.అందుకే ఆమె ఉచ్చారణ అంత స్పష్టంగా ఉత్తరాది బెంగాలీ గుజరాతీ గాయకులలో ఉండే ఉచ్చారణా లోపాలు లేకుండా ఉండేది. అపభ్రంశ శబ్దాలు లేకుండా అర్ధానికి తగినట్లు పదాలను స్పష్టంగా పలకడం బహుశా ఆమెకు సంస్కృతమూ తెలుగూ నేర్చుకున్నందువల్లనే వచ్చి ఉండవచ్చు. 

1938 లో 'సేవాసదనం' అనే తమిళ సినిమాలో నటించింది.అప్పుడామెకు కుజ/గురు దశ జరిగింది.1941 లో 'సావిత్రి' అనే సినిమాలో నారదునిగా నటించింది.అప్పుడు కుజ/శుక్ర దశ జరిగింది.1945 లో 'భక్త మీరా' అనే సినిమాలో ఆమె నటించి పాడిన భజనలు ఆమెకు ఎంతో ఖ్యాతిని తెచ్చి పెట్టాయి.ఈ సినిమా 1947 లో హిందీలో తీయబడింది.మొదటి రెండు సినిమాలు ఆమెకు ప్రాంతీయంగా పేరును తెస్తే చివరి రెండు సినిమాలు ఆమెకు జాతీయ ఖ్యాతిని ఆర్జించి పెట్టాయి.అప్పుడామెకు కుజదశ అంతమై,రాహుదశ మొదలైంది.రాహువు శనీశ్వరుని సూచిస్తూ తులా లగ్నానికి యోగకారకుడౌతున్నాడు. హిందీ 'మీరా' సినిమా విడుదలైనప్పుడు ఆమెకు రాహు/గురు దశ జరిగింది.ఈ విధంగా గురు అనుగ్రహం ఆమెకు ప్రతిసారీ కలుగుతూనే వచ్చింది.

1954 లో పద్మభూషణ్ అవార్డ్ ఆమెను వరించింది.అప్పుడామెకు రాహు/శుక్ర దశ జరిగింది.1956 లో కూడా ఇదే దశ జరుగుతూ ఉన్నపుడు సంగీత నాటక అకాడెమి అవార్డ్ ఆమెకు ప్రదానం చెయ్యబడింది. 

రాహుదశ తర్వాత జరిగిన గురుదశ ఆమె ఖ్యాతిని అత్యున్నత శిఖరాలకు చేర్చింది.ఈమె జాతకంలో రాహువు కేంద్ర స్తితిలో ఉండటం వల్లనూ,శని ప్రతినిధి కావడం వల్లనూ యోగాన్నిచ్చాడు.గురువు గజకేసరీ యోగంలో ఉన్నాడు. కనుక రెండు దశలూ ఆమెకు యోగించాయి.

1966 లో గురు/బుధ దశలో యునైటెడ్ నేషన్స్ లో కచేరి ఇచ్చి ప్రపంచ దేశాల ప్రశంశలను అందుకున్నది.గురు బుధుల యోగాలను ముందే అనుకున్నాం.

1968 లో గురు/కేతు దశ జరిగినప్పుడు మద్రాస్ మ్యూజిక్ అకాడెమీ ఇచ్చే అత్యున్నత బిరుదైన 'సంగీత కళానిధి' అవార్డ్ ఆమెను వరించింది.ఈ అవార్డ్ పొందిన మొట్టమొదటి మహిళ ఈమె.కేతువు కేంద్ర స్తితీ,శని శుక్రులతో కలిసి ఉండటమూ దీనికి కారణాలు.

1974 లో గురు/కుజ దశ జరిగినప్పుడు రామన్ మెగసెసే అవార్డ్ ఆమెను వరించింది.లగ్న సప్తమ రాశుల యోగంవల్ల ఈ ఔన్నత్యం కలిగింది.

1975 లో గురు/రాహు దశ జరిగినప్పుడు 'పద్మవిభూషణ్' బిరుదు ప్రదానం చెయ్యబడింది.గురు రాహువుల స్తితులు ముందే అనుకున్నాం.అయితే ఇది దశాఛిద్రకాలం కనుక ఈ సమయంలో ఆమెకు కుటుంబంలో కష్టాలు మొదలయ్యాయని ఊహించవచ్చు.కాని ఆ కోణాలు ప్రస్తుతం మనకు అనవసరం గనుక వాటిపై మనం వ్యాఖ్యానించడం తగదు. 

కాని అన్నమాచార్య కీర్తనలను వెలుగులోకి తెచ్చే ఒక సంఘటన ఈ సమయంలో జరిగింది. అది మాత్రం చూద్దాం.ఎంతటి గొప్పవారికైనా ఏదో ఒక సమయంలో కష్టాలు తప్పవు. ఎంతటి మంచి చేసే గ్రహాలైనా ఏదో ఒక దశలో బాధలు పెట్టక మానవు.అలాగే సుబ్బులక్ష్మి జీవితంలో కూడా జరిగింది. 1979 లో ఆమె భర్త సదాశివన్ తన కల్కి పత్రికలో నష్టాలవల్ల తమ ఇంటిని అమ్మేసి మద్రాస్లో వల్లువార్ కొట్టం అనే ఒక మారుమూల ప్రాంతంలో అద్దె ఇంటికి మారవలసి వచ్చింది.ఆ సమయంలో సరిగ్గా ఎమ్మెస్ జాతకంలో శని మహాదశ మొదలైంది.శని/శని జరుగుతున్న సమయంలో వాళ్ళు డబ్బుకు చాలా ఇబ్బందులు పడ్డారు.దేశాధినేతల సత్కారాలందుకున్న ఆమె అలాంటి పరిస్తితిని ఎదుర్కొనవలసి రావటం చూస్తె విధి అనేది ఎంత బలీయమో కదా అనిపించకమానదు.ఆ దంపతులు మానధనులు.ఎవరినీ చేయి చాచి అడగకపోగా,ఊరకనే ఎవరైనా ఇచ్చినా తీసుకోరు. 

ఈ పరిస్తితిలో,ఎలా వీరికి సహాయం చేయాలా అని అనేకమంది మహనీయులు ఆలోచించి చివరికి తిరుమల తిరుపతి దేవస్థానం ఈవో గా ఉన్న పీవీ ఆర్కే ప్రసాద్ గారిద్వారా మరుగున పడిన అన్నమాచార్య కీర్తనలను వెలుగు లోకి తేవాలన్న సదుద్దేశ్యానికి ఈ పరిస్తితిని జోడించి 'బాలాజీ పంచరత్నమాల' రికార్డులను చెయ్యడమూ దాని రాయల్టీని ఆమెకు  చేతికి ఇవ్వకుండా బ్యాంక్ లో వేసి ఆ వడ్డీని ఆమెకు వచ్చేలా చెయ్యడమూ జరిగాయి.ఎందుకంటే చేతికిస్తే తనకంటూ ఏమీ ఉంచుకోకుండా వెంటనే ఎవరికో దాన ధర్మాలకు ఇచ్చేసే మనస్తత్వం ఆమెది.లగ్నాత్ యోగకారకుడైన శని,చంద్ర లగ్నాత్ బాధకుడు కావడం దీనికి కారణం.గోచార రీత్యా అప్పుడు వక్రిగా ఉన్న శని ఆ స్తితిని వదల్చుకొని అతిచారముతో వేగంగా కన్యారాశిలో ప్రవేశిస్తున్నాడు.కన్య లగ్నాత్ ద్వాదశం కావడంతో బాధలు పెట్టాడు.కాని శని/బుధ అంతర్దశ మొదలు కావడం తోనే పరిస్తితి మెరుగుపడి దైవానుగ్రహం ఆమెపైన వర్షించింది. కారణం ఇంతకు ముందు చెప్పినట్లు ఆత్మకారకుడైన బుధుడు ఉచ్ఛస్తితిలో ఉండటమే. బుధునికి అధిదేవత విష్ణువని గుర్తుంచుకుంటే ఈ సమయంలో వేంకటేశ్వరుని కటాక్షంతో వారి బాధలు తీరిన వైనం ఎంత చక్కగా సరిపోయిందో అర్ధమై గ్రహప్రభావం ఎంత ఖచ్చితమో తెలుస్తుంది.

1988 లో శని/చంద్ర దశ జరిగినప్పుడు మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇచ్చే 'కాళిదాస్ సమ్మాన్' అవార్డ్ ఆమెను వరించింది.తులా లగ్నానికి శని యోగ కారకుడు.దశమంలో ఉంటూ వృత్తిపరమైన గౌరవాన్ని సూచిస్తున్నాడు.చంద్రుడు దశమాధిపతిగా గజకేసరీ యోగంలో ఉన్నాడు. 

1990 లో శని/రాహు జరిగినప్పుడు ఆమెకు ఇందిరా గాంధీ అవార్డ్(జాతీయ సమైక్యతకు) ప్రదానం చెయ్యబడింది.రాహువు మకరంలో ఉంటూ శనిని సూచిస్తున్నాడు.

1998 లో ఆమె జాతకంలో బుధదశ ప్రారంభం అయింది.బుధ/బుధ దశ జరిగినప్పుడు భారతదేశ అత్యున్నత బిరుదైన 'భారతరత్న' ఆమె సొంతం అయింది.ఆత్మకారకుడైన బుధుడు ఆమె జాతకంలో ఉచ్చస్తితిలో ఉన్న ప్రభావం అది.

ఎన్ని ప్రదర్శనలిచ్చినా ఎన్ని బిరుదులు సొంతం చేసుకున్నా ఆమెలో ఒక్క విశిష్ట గుణం కనిపించేది. తన ప్రదర్శనల వల్ల వచ్చిన ధనంలో సింహభాగం ఆమె దానధర్మాలకూ, వివిధ సంస్థలకు (ఫండ్ రైసింగ్ కార్యక్రమాలకూ)  అక్కడికక్కడే ఇచ్చి వేసేది. లోకమంతా జేజేలు పలుకుతూ ఆమె ప్రతిభను గౌరవించినా కూడా ఆమెలో కించిత్తు గర్వంగానీ అహంకారంగానీ కనిపించేది కాదు. పైపెచ్చు వినమ్రతతో కూడిన సంస్కారం ఆమె ముఖంలో తొంగి చూచేది. లతామంగేష్కర్ అన్నట్లుగా సుబ్బులక్ష్మి ఒక 'తపస్విని' గానే జీవితమంతా బ్రతికినట్లు కనిపిస్తుంది.

లతా మంగేష్కర్ ఆమెను 'తపస్విని'అని పిలిచింది. ప్రఖ్యాత హిందూస్తానీ గాయకుడు బడెగులాం ఆలీఖాన్ ఆమె పేరు సుబ్బులక్ష్మి కాదు 'సుస్వరలక్ష్మి' అన్నాడు.కిశోరీ అమోంకర్ అయితే ఆమెను 'ఆట్ట్వా సుర్' (ఎనిమిదో స్వరం) అన్నాడు.సరోజినీ నాయుడు ఆమెను 'గానకోకిల' అని పిలిచింది. ఎవరెన్ని రకాలుగా ప్రశంసించినా ఆమె అదంతా దైవం యొక్క,తన గురువైన కంచి పరమాచార్యుల యొక్క అనుగ్రహంగానే భావించేది. 

ఆమె కంచి పరమాచార్యుల శిష్యురాలు.ఆయనంటే ఆమెకు విపరీతమైన భక్తి  ఉండేది. ఆ భక్తి చాలామంది మనుషులు తమ గురువుల పట్ల చూపించే దొంగభక్తి కాకుండా త్రికరణశుద్ధి తో కూడిన భక్తిగా ఉండింది.అందుకే ఆమె గురు అనుగ్రహాన్ని అంతగా చూరగొనగలిగింది.స్వామికి కూడా తన శిష్యురాలైన ఎమ్మెస్ అంటే అమితమైన వాత్సల్యం ఉండేది. 

ఆమె సంగీతసాధనతో దైవాన్ని చేరుకుందో లేదో మనకు తెలియదు గాని ఆమె పాడిన భజగోవింద శ్లోకాలనూ,విష్ణు సహస్రనామాలనూ, మీరా భజనలనూ,అన్నమయ్య,త్యాగయ్య,ఇంకా అనేక ఇతర మహనీయుల కీర్తనలనూ వింటుంటే మనకే కళ్ళముందు భగవంతుడు నిలిచినంత అనుభూతి కలుగుతుంది. సంగీతం నిజంగా దైవాన్ని చేర్చే సాధనమే అన్న సత్యం ఇలాంటి గాయనీమణులను చూచినప్పుడు మనకు రూడిగా అర్ధమౌతుంది.

ఈ విధంగా,ఈమె జాతకంలో చంద్రుడూ, కుజుడూ, రాహుకేతువులూ, గురువూ,శనీ,బుధుడూ అందరూ ఆమెను అమితంగా అనుగ్రహించారు. సూర్యుడు ప్రాపంచికం కంటే కూడా ఆధ్యాత్మికమైన వరాలను ఈమెకు ఇచ్చినట్లు తోస్తుంది.ఇంతకుముందు నేను వ్రాసినట్లుగా,నిజమైన సంగీత సరస్వతీ కటాక్షం కావాలంటే నవగ్రహాలూ కరుణించక తప్పదు అన్న విషయం సుబ్బులక్ష్మి జీవితం గమనిస్తే నిజమే అని ఎవరికైనా అనిపించక మానదు.


ఆమెకు సంతానం లేని విషయాన్నీ, భర్తకు రెండో భార్య కావడాన్నీ జ్యోతిష్య పరంగా విశ్లేషించలేదు. ఎందుకంటే ఆమె జాతకంలోని అన్ని కోణాలు స్పర్శించడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదు.సంగీతం వరకే నేను చూచాను.కాని ఆ కోణాలు కూడా కావలసిన వారికి పై చక్రంలో వాటిని దర్శించడం పెద్ద కష్టమేమీ కాదు. సంతాన కారకుడైన గురువు వక్రస్తితీ,దానికి తోడు  పంచమాధి పతి శనికేతు గ్రస్తుడవడమూ,భావ చక్రంలో నవమం శనికేతువులతో కూడి యుండటమూ గమనిస్తే సంతాన విషయం తెలుస్తుంది.ఇకపోతే, వివాహవిషయం ఇక్కడ వ్రాయడం భావ్యం కాదు గనుక వ్రాయడం లేదు.చివరిగా ఒక కొసమెరుపు. రాశిచక్రం కంటే భావ చక్రంలో ఎమ్మెస్ జాతకం ఇంకా స్పష్టంగా కనిపిస్తుంది.రాశులిచ్చే ఫలితాలకు రాశిచక్రాన్నీ భావాలిచ్చే ఫలితాలకు భావచక్రాన్నీ చూడాలి. భావపరులైన జాతకులకు భావచక్రాన్నే చూడవలసి ఉంటుంది.ఇది ఎలా తెలుసుకోవాలి?అంటే అనుభవం మీద అంతా తెలుస్తుంది అనే జవాబు వస్తుంది.ఔత్సాహిక జ్యోతిష్కుల సౌకర్యార్ధం భావచక్రాన్ని కూడా ఇక్కడ పొందుపరుస్తున్నాను.

వచ్చే వ్యాసంలో మిగిలిన ఇద్దరు గాయనీమణుల జాతకాలు పరిశీలిద్దాం.