“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, అక్టోబర్ 2019, సోమవారం

బాసర సరస్వతీ అమ్మవారిని దర్శించాను

ఒకరోజున బాసర స్టేషన్ తనిఖీకి వెళ్లాను. అక్కడి స్టాఫ్ ని అడిగితే ఉదయం నాలుగున్నరకే ఆలయం తెరుస్తారని చెప్పారు. ఉద్యోగానికి సంబంధించిన పని అయిపోయాక తెల్లవారు ఝామున నాలుగున్నరకు బయల్దేరి పది నిముషాలలో ఆలయం దగ్గరకు చేరుకున్నాను. అక్కడ చడీచప్పుడూ ఏమీ లేదు. షాపులూ, ఆలయం కౌంటర్లూ అన్నీ మూసేసి ఉన్నాయి. జోగుతున్న సెక్యూరిటీ వారిని అడిగితే ఆరుగంటలకు మాత్రమే లోనికి వదుల్తామనీ, ఈలోపల అమ్మవారికి అలంకారం చేస్తుంటారనీ అన్నారు.

ఒక గంటసేపు ఆ బజార్లు అన్నీ తనిఖీ చేశాను. ఎక్కడా శుచీ శుభ్రతా లేదు. వానలు బాగా పడుతున్నాయేమో రోడ్లన్నీ తడిగా బురదగా ఉన్నాయి. దానికి తోడు, యాత్రికులు, హోటలు వాళ్ళు రోడ్డుమీదే పారేసిన చెత్త ఎక్కడబడితే అక్కడ కనిపిస్తోంది. దేశమంతా స్వచ్చభారత్ పాటిస్తోంది. ఇక్కడ మాత్రం చెత్త భారత్ కనిపించింది. బాధ కలిగింది.

మన పౌరుల దగ్గరా, అందులోనూ భక్తుల దగ్గరా సివిక్ సెన్స్ ఆశించడం అనేది ఒక పెద్ద పొరపాటనే విషయం నాకు బాగా తెలుసు. అసలు భక్తులనేవాళ్ళే పెద్ద దొంగలు. స్వార్ధపూరితమైన కోరికలతో మాత్రమే వాళ్ళు గుళ్ళూగోపురాలూ తిరుగుతూ ఉంటారు. అలాంటి స్వార్ధపూరిత మనస్తత్వాలు ఉన్నవాళ్ళు పర్యావరణం గురించి, శుభ్రత గురించి, సివిక్ సెన్స్ గురించి ఎందుకు ఆలోచిస్తారు? అందుకే మన యాత్రాస్థలాలన్నీ చెత్త కుప్పలుగా ఉంటుంటాయి. అందుకే, నేను అసహ్యించుకునే వారిలో సోకాల్డ్ భక్తులు మొదటి వరుసలో ఉంటారు.

దాదాపు ముప్పైఏళ్ళ క్రితం ఒకసారి బాసర వచ్చాను. కానీ నేను వెళ్ళిన సమయంలో ఆలయం మూసేసి ఉంది. తలుపులు వేసున్నా తీసున్నా మనకు పెద్ద తేడా ఉండదు గనుక, బయటనుంచే దణ్ణం పెట్టుకుని తిరిగి వచ్చేశాను. తర్వాత మళ్ళీ ఇన్నేళ్ళకు కుదురుతోంది.

బాసరలో అప్పటికీ ఇప్పటికీ చాలా మార్పు ఉంది. అప్పట్లో దేవాలయం చాలా చిన్నగా ఉండేది. వాతావరణం ఒక కుగ్రామంలా ఉండేది. షాపులు ఇన్ని ఉండేవి కావు. ఇప్పుడు చుట్టూ చాలా హంగులు వచ్చాయి. వ్యాపారం పెరిగింది. మనుషుల సందడితో, వ్యాపారాలతో వచ్చే దరిద్రపు 'ఆరా' ఎక్కువైంది. ప్రకృతి సహజమైన ఆధ్యాత్మిక ఆరా తగ్గింది. ఈ ఆలయాన్ని కూడా ఒక పర్యాటకస్థలంగా వృద్ధి చేద్దామనే ప్రభుత్వతపన స్పష్టంగా కనిపిస్తోంది. ఈ క్రమంలో అసలైన ఆధ్యాత్మికత గంగలో కలుస్తోంది. అప్పటికీ ఇప్పటికీ, ఇదే నాకు కనిపించిన పెద్ద తేడా.

బయట ఉన్న వ్యాసుని ఆలయం వద్ద కాసేపు కూచున్నాను. 'ఇక్కడ గోదావరి నది ఉన్నది గనుక ఆయన కొన్నాళ్ళు ఈ కొండమీది గుహలో ఉంటూ తపస్సు చేశాడన్నమాట. ఏం చెయ్యాలన్నా తిండీ నీరూ ఉండాలి. అవి లేకుంటే తపస్సు కూడా సాగదు! కనీసం వ్యాసమహర్షి ఎందుకు ఇక్కడ తపస్సు చేశాడు? అని కూడా ఎవరూ ఆలోచించడం లేదు! అయితే అక్షరాభ్యాసం, లేకపోతే పర్యాటకం. ఇదీ జనానికి అర్ధమైన విషయం !' అనుకున్నాను.

టైం ఆరయింది. కౌంటర్లు తెరిచారు. దర్శనానికి కదిలాను. అప్పటికే లోపల ఒక పదిమంది ఉన్నారు. పెద్ద సందడి లేదు. అమ్మ దర్శనం చేసుకుని, కొండపైన ఉన్న వ్యాసగుహకు వెళ్లాను. అక్కడైతే, నేను తప్ప ఎవరూ లేరు. అక్కడికి వెళ్ళే దారిలో షాపులన్నీ మూసేసి ఉన్నాయి. గుహకు అడ్డంగా ఇనుప రెయిలింగ్ ఉన్నది. గుహకు వెళ్ళే దారిలో భక్తులూ షాపుల వాళ్ళూ పారేసిన గార్బేజ్ చూస్తె రెండోసారి అక్కడకు రావాలనిపించలేదు. అంతగా వాడేసిన పూజాసామగ్రీ, దండలూ, చెత్తా చెదారమూ ఎక్కడ బడితే అక్కడ గుట్టలుగా వేసి ఉన్నాయి.

గుహనుంచి తిరిగి వస్తుంటే అప్పుడే షాపులు తెరుస్తున్నారు. ఏం చెబుతాడో చూద్దామని, 'ఆ గుహలో ఏముంటుంది?' అని ఒకాయన్ని అడిగాను. 'అమ్మవారు ఆక్కడే మొదటగా పుట్టింది' అన్నాడు. చచ్చే నవ్వొచ్చింది. ' మీ వ్యాపారాల కోసం ఎన్నెన్ని అబద్దాలు చెబుతార్రా మీరు? అమ్మవారు ఇక్కడ పుట్టిందని నిజంగా మీరనుకుంటే ఈ ప్రదేశాన్ని ఇంత దరిద్రంగా ఎలా ఉంచుతారు?' అనుకున్నా.

మన దేవాలయాల కంటే, చర్చిలూ మసీదులూ చాలా శుభ్రంగా, పద్దతిగా ఉంటాయి. దేవుడు అక్కడ ఉన్నాడని వాళ్ళు నమ్ముతారు గనుక వాటిని ఎంతో శుభ్రంగా ఉంచుతారు. మనకేమో ఆ స్పృహే ఉండదు. మన దేవాలయాలన్నీ మురికికూపాలు. అక్కడ దేవుడున్నాడని మనం అనుకుంటే అక్కడ చెత్తా చెదారం ఎలా పారేస్తాం? అక్కడే నానా రాజకీయాలూ మాట్లాడుకుంటూ అరుచుకుంటూ ఒకరినొకరు తోసుకుంటూ ఎలా ఉంటాం? అందుకే పాపులర్ హిందూమతమంతా పెద్ద డొల్ల అని నేనెప్పుడూ అంటాను. 

బయటకొచ్చాను. ఆటోలు లేవు. ఉన్న ఒకడూ 'ఒక్కరికైతే నేను రాను' అన్నాడు. 'సరే, మార్నింగ్ వాక్ చేసినట్లు ఉంటుంది' అనుకుంటూ రెండు కి.మీ. దూరంలో ఉన్న స్టేషన్ కు నడక సాగించాను. దారిలో అన్ని కులాల సత్రాలూ దండిగా దర్శనమిచ్చాయి. 'అకులా సమయాంతస్థా సమయాచార తత్పరా' అనే లలితానామం గుర్తొచ్చింది. నవ్వుకున్నాను. 

ప్రభుత్వమూ, ప్రజలూ కలసి ఈ క్షేత్రంలో పిల్లల అక్షరాభ్యాసానికి ఎక్కువగా ప్రాధాన్యతను పెంచుతున్నారు. మిగతా వాళ్ళు, ఏవేవో గొంతెమ్మ కోరికలతో ఇక్కడకు వస్తున్నారు. కులసత్రాలు కడుతున్నారు. పూజారులేమో వాళ్ళ ఉద్యోగాలు వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని, సరస్వతీదేవి అసలైన తత్వాన్ని ఎవరూ గమనిస్తున్నట్లు నాకు అనిపించలేదు. ఉపాసకులనేవాళ్ళు ఎక్కడా లేరు. ఇది తపోభూమి అన్న విషయం కూడా ఎవరికీ గుర్తు లేదు. 'తారాస్తోత్రం' లో అమ్మవారిమీద నేను వ్రాసిన కొన్ని శ్లోకాలూ పద్యాలూ గుర్తొచ్చాయి. ప్రపంచమంతా ఇంతే ! చక్రవర్తి దర్బార్ లో నిలబడి పుచ్చు వంకాయలు కోరుతున్నారు మనుషులు ! తపోభూమిని షాపింగ్ కాంప్లెక్స్ గా మారుస్తున్నారు. ఛీ ! అని అసహ్యం వేసింది.

'ఈ చౌకబారు మనుషులని ఎలా భరిస్తున్నావమ్మా?' అని మనసులో అనుకుంటూ స్టేషన్ కు నడక సాగించాను.