“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

18, ఆగస్టు 2016, గురువారం

మా అమెరికా యాత్ర - 38 (గురూజీ ఆఫ్ ది హోలీ ట్విన్స్)


















ఇప్పటివరకూ శ్రీరామకృష్ణుల మహా భక్తురాలైన గౌరీమా గురించి మాట్లాడుకున్నాం.ఇప్పుడు మళ్ళీ మన అసలు కధలోకి వద్దాం.

గాంగెస్ లో ఉన్న mothers trust/mothers place ఆశ్రమానికి ప్రస్తుతం అధ్యక్షురాలుగా 'ఇవా ష్రొడర్' అనే యూదువనిత ఉన్నారు.ఈమె సన్యాస నామం 'గౌరీవ్రత మా'.ఈమెకు ప్రస్తుతం 63 ఏళ్ళు.1973 నుంచీ (ఈమెకు 20 సంవత్సరాల వయస్సు ఉన్నప్పటినుంచీ) ఈమె స్వామి భాష్యానందగారి శిష్యురాలు.

స్వామి భాష్యానందగారు చికాగోలో ఉన్న వేదాంత సొసైటీ మరియు మిషిగన్ గాంగెస్ లో ఉన్న వివేకానంద మొనాస్టరీ కి అధ్యక్షులుగా ఉన్నారు.స్వామి భాష్యానంద,స్వామి సర్వగతానంద వీరిద్దరూ 1960 ప్రాంతాల నుంచీ అమెరికాలో ఉంటూ శ్రీరామకృష్ణ వేదాంత భావాలను ప్రచారం చేసిన మహనీయులు.

వీరి గురించి ఇక్కడ చూడవచ్చు.

http://www.motherstrust.org/history.htm

http://www.vedantaprov.org/sarvagatananda.html

ఇవా ష్రోడర్ మొదటి సారిగా 20-5-1973 న తన గురువైన భాష్యానంద గారిని కలుసుకున్నారు. ఈమె వివాహం 1974 లో జరిగింది.ఈమె భర్త పేరు ఎడ్విన్ ష్రోడర్ జూనియర్. ఈయన IBM కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉండేవాడు.1975 లో ఒక కుమార్తె జన్మించిన తర్వాత భార్యాభర్త లిద్దరూ వీరి గురువైన స్వామి భాష్యానందగారి వద్ద బ్రహ్మచర్య దీక్ష స్వీకరించారు. అప్పటినుంచీ వీరిద్దరూ కూతురుతో సహా జపధ్యానాలు చేస్తూ శుద్ధమైన ఆధ్యాత్మిక జీవితాన్ని గడుపుతూ చికాగోలో ఉండేవారు. జీవితంలో దేనికీ వీరికి లోటు లేదు.కానీ విలాసాలమీద ఇద్దరికీ మనసు లేదు. ఒక విధమైన ఆధ్యాత్మిక తపనతో, ఉన్నతమైన దివ్యజీవితం గడపాలన్న తృష్ణతో వీరిద్దరూ ఉండేవారు.శ్రీ రామకృష్ణ వివేకానందుల భావాలు వీరిని ఎంతగానో ఆకర్షించాయి.

1975 నుంచి 1985 వరకూ ఈమె తన కూతురైన జెస్సికాతో కలసి ప్రతిరోజూ ఉదయం నుంచీ రాత్రివరకూ చికాగో వేదాంత సొసైటీ ఆశ్రమంలోనే ఉంటూ ధ్యానసాధన గావిస్తూ అక్కడి సేవా కార్యక్రమాలలో పాల్గొంటూ ఉండేది.

తర్వాత కొన్నేళ్ళకు స్వామి రంగనాధానందగారి వద్ద సన్యాసం స్వీకరించిన ఎడ్విన్ ష్రోడర్, రామకృష్ణా మిషన్ లో చేరి,ఇండియాలోని బేలూర్ మఠానికి వెళ్ళిపోయాడు.ఇప్పుడు కూడా ఆయన అక్కడే ఉన్నాడు.

1989 లో తన గురువు ఆజ్ఞమేరకు ఈమె ఇండియాకు వచ్చి శ్రీశారదేశ్వరీ ఆశ్రమంలో సన్యాస దీక్ష స్వీకరించింది.విరజా హోమం సందర్భంలో ఈమెకు ఇవ్వబడిన సన్యాసనామం 'గౌరీవ్రత పురీ దేవి'. మొదటి సారిగా ఈ ఆశ్రమంలో సన్యాస దీక్ష స్వీకరించిన అమెరికన్ మహిళ ఈమెయే.

గౌరీమానే ఈమెగా పుట్టిందని ఒక నమ్మకం ప్రబలంగా ఉన్నది.ఎందుకంటే - అమెరికాలో వేదాంత ప్రచారం చెయ్యడానికి రావలసిందిగా గౌరీమాను వివేకానంద స్వామి అభ్యర్దించారు.కానీ ఇండియాలోనే చెయ్యవలసిన పని ఎంతో ఉండటంతో ఆమె అమెరికా వెళ్ళలేక పోయింది.కానీ -' నేను వచ్చే జన్మలో ఆక్కడ పుడతాను' అని గౌరీమా చెప్పిందని అంటారు.ఆ గౌరీమానే ఇవా ష్రోడర్  గా పుట్టిందని కొందరు నమ్ముతున్నారు.

మాతో ఆత్మలోకానంద ఇలా అన్నారు.

'గౌరీవ్రత మా సన్యాసం స్వీకరించడానికి ఇండియాకు వెళ్ళినపుడు నేనూ అక్కడ ఉన్నాను.శారదేశ్వరీ ఆశ్రమం వారు ఈమెను 10 రోజులపాటు నిరంతరం పరీక్ష చేశారు.ఈమె ఎలా ప్రవర్తిస్తుంది,ఎలా తింటుంది, ఏయే వస్తువులు ఇష్టపడుతుంది, ఎలా మాట్లాడుతుంది,ఎలా నిద్రపోతుంది మొదలైన అన్ని కోణాల్లోనూ ఈమెను క్షుణ్ణంగా పరీక్షించారు.అలా పరీక్షించి సంతృప్తి చెందిన తర్వాతే ఈమెకు సన్యాసం ఇవ్వడానికి వారు అంగీకరించారు.

అంతేకాదు.శారదేశ్వరీ ఆశ్రమంలో పాత గౌరీమా వాడిన వస్తువులున్నాయి. వాటిని ఈమె గుర్తుపట్టింది.ఆశ్రమం లోపలి గదులలో ఎక్కడెక్కడ ఏమున్నాయో ఈమె చెప్పింది.అవన్నీ వినిన అక్కడివారు ఈమె గౌరీమా అని,వివేకానంద స్వామి అభ్యర్ధన మేరకు అమెరికన్ శరీరంలో ఈ రకంగా మళ్ళీ వచ్చిందని నమ్మారు.

ఇండియాకు వచ్చి శారదేశ్వరీ ఆశ్రమానికి అధ్యక్షురాలిగా ఉండమని ఇప్పటికీ వారు ఈమెను పిలుస్తూ ఉంటారు.కానీ అమెరికాలో చెయ్యవలసిన పని ఎంతో ఉండటంతో ఈమె ఇండియాకు రావడానికి ఇష్టపడటం లేదు.

మేం గాంగెస్ ఆశ్రమానికి వెళ్ళిన మొదటి రోజునే - "గౌరీవ్రతమా దర్శనం సాధ్యమౌతుందా?" - అంటూ స్వామి ఆత్మలోకానంద గారిని అడిగాను.

దానికాయన - 'సాధ్యం కాకపోవచ్చు.ఆమె చాలా బిజీగా ఉంటారు' - అని జవాబిచ్చారు.

'మాకు ఎక్కువ సమయం అక్కరలేదు.ఒక 5 నిముషాలో లేక 10 నిముషాలో చాలు.ఊరకే ఆమె దర్శనం చేసుకుని వచ్చేస్తాం. ఏమీ మాట్లాడం.' అని ఆయనకు చెప్పాను.

'ఆమెతో చెప్పి చూస్తాను.' అన్నారాయన.

రెండు మూడు రోజులైనా ఈ విషయం గురించి ఆయన ఏమీ చెప్పడం లేదు. బాగుండదని మేమూ ఆ విషయాన్ని పొడిగించలేదు.

'గౌరీవ్రత మా' గురించి మేము చాలా విన్నాము.ఆమె ఒక ఫైర్ బ్రాండ్ సన్యాసిని అని,ఎంత పెద్దవారినైనా సరే చెడామడా కడిగి పారేస్తుందని,చాలా ధైర్యవంతురాలని,ఎవర్నీ లెక్క చెయ్యదని, అమెరికాలోని గ్రాండ్ రాపిడ్స్ అనే ఊరు కేంద్రంగా పనిచేస్తున్న 'బాలికా వ్యభిచార ముఠా' తో ప్రాణాలకు తెగించిమరీ దశాబ్దాలుగా ఒక్కతే పోరాడుతూ ఉన్నదని, ఈ క్రమంలో కొన్ని వందలమంది ఆడపిల్లలను ఆమె ఆ కూపం నుంచి రక్షించిందనీ - ఇలా చాలా చాలా ఆమె గురించి విన్నాము.

మేము అక్కడకు వెళ్లి మూడు రోజులైంది.ఆదివారం నాడు శ్రీరామకృష్ణా యూనివర్సల్ టెంపుల్ లో నేను 'శ్రీవిద్య' అనే సబ్జెక్ట్ మీద ఉపన్యాసం ఇచ్చాను.అదే రోజున నేను వ్రాసిన 'శ్రీవిద్యా రహస్యం', 'తారా స్తోత్రం' అనే పుస్తకాల కాపీలను స్వామి ఆత్మలోకానందగారికి ఇచ్చి వారి లైబ్రరీలో ఉంచమని చెప్పాను.గౌరీవ్రత మా గారికి కూడా కాపీలు ఇవ్వమని చెప్పాను.

మరుసటి రోజున దాదాపు మధ్యాన్నం పదకొండు గంటల సమయంలో మేము రిట్రీట్ హోమ్ బయట నిలబడి ఉండగా, మమ్మల్ని ఉన్నఫళంగా దేవాలయం దగ్గరకు రమ్మని చేతులు ఊపుతున్న స్వామి ఆత్మలోకానంద గారు కనిపించారు.ఏమిటా అని మేము అక్కడకు గబగబా నడుచుకుంటూ వెళ్లాం.దగ్గరకు వెళ్లేసరికి - 'మాతాజీ టెంపుల్ లో ఉన్నారు.త్వరగా వెళ్లి కలవండి' అంటూ ఆయన హడావుడిగా చెప్పారు.

మేమందరం హడావుడిగా టెంపుల్ లోపలకు వెళ్ళాము. లాన్సింగ్ లోని 'భారతీయ టెంపుల్' నుంచి వచ్చిన ఒక పూజారీ ఒక వనితా టెంపుల్ లో నిలబడి మాతాజీతో మాట్లాడుతూ కనిపించారు.వారిద్దరూ మధ్యవయసులో ఉన్నారు.పూజారి గుజరాతీ లాగా ఉన్నాడు.మంచి బుగ్గలు,భారీ శరీరంతో చూడగానే ఏ మాత్రం శరీరశ్రమ లేకుండా చక్కటి సుఖజీవితం గడుపుతున్నవాడిలా కనిపించాడు.వనితేమో మన ఉత్తరాది మహిళలాగా ఉన్నారు.వారితో మాతాజీ మాట్లాడుతూ కనిపించారు.

మాతాజీ సన్యాస దుస్తులలో లేరు.ఒక పాంటు, పైన ఒక స్వెటర్ వంటిది వేసుకుని ఉన్నారు.ఆమె వీపు మా వైపు తిప్పి ఉండటంతో వారిలో మాతాజీ ఎవరో తెలియక ' ఈమేనా మాతాజీ?' అని ఆత్మలోకానంద గారినే అడిగాను. 'అవును ఆమే' అని ఆయన చెప్పారు.

మాతాజీ మామూలు ఎత్తులో బక్కపలచగా ఉన్నారు.వయస్సు వల్లనో లేక ఆహార నియమాలు పాటిస్తున్నందువల్లనో తెలీదుగాని ఆమె కొంచం నీరసంగా ఉన్నట్లు కనిపించినా, ఆమె ముఖమూ కళ్ళూ చాలా కాంతిగా వెలుగుతూ ఉన్నాయి.

మేము దాదాపు పదిమందిమి టెంపుల్ లోకి నిశ్శబ్దంగా ప్రవేశించి అక్కడక్కడా విడివిడిగా నిలబడ్డాము.వారితో మాట్లాడుతున్న మాతాజీ ఎందుకో వెనక్కు తిరిగి మమ్మలనందరినీ చూచి ఆశ్చర్య పోయారు. "ఇప్పటివరకూ ఇక్కడ ఎవరూ లేరు.ఉన్నట్టుండి మీరంతా ఎక్కడనుంచి వచ్చారు?ఆకాశం నుంచి దిగి వచ్చారా హటాత్తుగా?' అని నవ్వుతూ అడిగారు.

'ఈయనే వీళ్ళ గురూజీ' అంటూ ఆత్మలోకానందగారు ఆమెకు నన్ను పరిచయం చేశారు.కొంచం వెనుకగా నిలబడి ఉన్న నేను వెంటనే గబగబా ముందుకు వచ్చి ఆమె పాదాలు తాకి ప్రణామం చేశాను.

ఆమె గబుక్కున వెనక్కు జరిగారు.

'నో ! డోంట్ డూ దట్ ! ఎవరి ప్రణామమూ స్వీకరించవద్దని 'వందనా మా' నాకు చెప్పారు.అలా చేస్తే మీకంటే నేను ఎక్కువ అన్న ఫీలింగ్ నాకు కలుగవచ్చు.ఆ అహంకారం నాకొద్దు. అందుకే ఎవరు నా పాదాలు తాకి ప్రణామం చేసినా నేనొప్పుకోను' అన్నారామె.

లాన్సింగ్ నుంచి వచ్చిన దుబ్బ పూజారికి, వనితకు మమ్మల్ని పరిచయం గావించారు మాతాజీ.

అల్టార్ ముందు నిలబడి ఏవైనా శ్లోకాలు చదవమని ఆమె నన్నూ, దుబ్బ పూజారినీ అడిగారు.నాకు ఈ శ్లోకాలూ గట్రా ఇష్టం ఉండదు గనుక మౌనంగా ధ్యానిస్తూ నిలబడ్డాను.దుబ్బ పూజారి మాత్రం శుక్ల యజుర్వేదం నుంచి 'శం నో మిత్రశ్శం వరుణ: శంనో భవత్వర్యమా...' అంటూ శాంతి మంత్రాలు చదివాడు.

ఆ తర్వాత మాట్లాడుకుంటూ అందరం బయటకు వచ్చాము.

"రండి.పంచతప సాధన చేసిన చోటు చూపిస్తాను" - అంటూ ఆలయం వెనుక ఉన్న లాన్ లోకి దారి తీశారు మాతాజీ.

రెండు రోజుల క్రితం మేము చూచిన కుటీరం వద్దకు అందరం దారితీశాం.ఆ కుటీరాన్ని సమీపిస్తూనే అక్కడ నిక్షిప్తం గావించబడిన హోలీ రెలిక్స్ యొక్క వైబ్రేషన్స్ నాకు తాకసాగాయి.నాకు వెన్నులో కంపనాలు మొదలయ్యాయి.

కుటీరం చుట్టూ నిలబడిన మాకు 1990 లో అక్కడ జరిగిన పంచతప సాధన గురించి మాతాజీ వివరించారు.

'ఈ ప్రదేశంలోనే నేను నా గురువైన స్వామి భాష్యానంద, ఇంకొక స్వామీజీ తో కలసి ఐదురోజుల పాటు సాగే పంచతప సాధన చేశాను.అయిదురోజుల పాటు మాకు నీరూ ఆహారం నిద్రా లేవు. నాలుగు పక్కలా అగ్ని కుండాలు వెలిగించి మధ్యలో మేము కూచుని అయిదు పగళ్ళూ అయిదు రాత్రులూ ఎడతెగకుండా ధ్యానం చేశాము. అప్పుడే మాకు వెలుగుతున్న శ్రీ యంత్రం దర్శనమిచ్చింది. "ఇక్కడ నాకు ఆలయం నిర్మించు.నేనిక్కడ నివసిస్తాను." అన్న మాటలు మాకు వినిపించాయి." అంటూ మాతాజీ చెప్పసాగారు.

మాతాజీ అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే నాకు 'గౌరీమా' యొక్క దివ్యమైన జీవితం గుర్తొచ్చింది.ఆమె చేసిన తపస్సు గుర్తొచ్చింది.ఆమె యొక్క నిస్వార్ధమైన సేవ గుర్తొచ్చింది.నాలో భావోద్రేకం మొదలైంది.

"అమెరికాలో పుట్టిన తెల్లవాళ్ళు అయి ఉండీ మన హిందూధర్మం మీద ఎంతో ప్రేమతో,శ్రీ రామకృష్ణుల మీద భక్తితో 26 ఏళ్ళ క్రితమే వాళ్ళు అలాంటి సాధన అక్కడ చేశారా? ఎంత పవిత్రమైన ఆత్మలై ఉండాలి వీళ్ళు? హిమాలయాలలో గౌరీమా చేసిన తపస్సు ఇన్ని వేల మైళ్ళ దూరంలో ఈ ఆలయం రావడానికి ప్రేరకం అయిందా? అభాగినుల కోసం ఆమె ఆ జన్మలో అంత కష్టపడితే ఈ జన్మలో ఈమె మళ్ళీ ఇక్కడి దిక్కులేని అమ్మాయిల కోసం ఇంత కష్టపడుతున్నదా? ఏమిటీ జన్మలు? అసలు వీళ్ళు మానవులేనా? లేక దేవతలా?ఇలాంటి మనుషులు ఇంకా భూమ్మీద ఉన్నారా? " అన్న భావోద్రేకం నాలో సుడులు తిరిగి నా కళ్ళలోనుంచి ధారగా నీళ్ళు కారసాగాయి.

మాట్లాడుతూ మాట్లాడుతూ నావైపు చూచిన మాతాజీ నా కన్నీటిని చూచి చలించిపోయారు.

'ఓహ్...నో...గురూజీ !'  అంటూ ముందుకొచ్చిన ఆమె, హటాత్తుగా చేయి చాచి నా చెంప మీదనుంచి జారుతున్న కన్నీటి బిందువును తన వేలితో తీసుకున్నారు.

'ఈ బిందువును ఆ బిందువుకు అర్పిస్తున్నాను' అంటూ కుటీరం చుట్టూ కట్టిన చెక్క కర్రల క్రిందుగా వంగి లోపల ఉన్న శ్రీచక్రం వద్దకు వెళ్లాలని ఆమె ప్రయత్నించారు.కానీ,పెద్దవయసు కావడంతో ఆమె శరీరం సహకరించలేదు. ఆత్మలోకానంద గారిని దగ్గరకు రమ్మని పిలిచిన ఆమె, తన వేలికి ఉన్న కన్నీటి బిందువును ఆయనకు ఇచ్చారు.ఆయన వంగి కుటీరంలోనికి వెళ్లి ఆ కన్నీటి బిందువును శ్రీచక్రపు బిందువు మీద ఉంచారు.దానిక్రిందే శ్రీరామకృష్ణ, శ్రీమాత, గౌరీమాల చితాభస్మం నిక్షిప్తం చెయ్యబడి ఉన్నది.

నేను వద్దని వారించే లోపే ఇదంతా కన్నుమూసి తెరిచే లోపు జరిగిపోయింది.నేను నేలకు అతుక్కుపోయినట్లు నిలబడి పోయాను.

'ఇక్కడకు చాలామంది వస్తూ ఉంటారు .కానీ నేను నీవంటి వ్యక్తి కోసమే ఎదురు చూస్తున్నాను గురూజీ.' అంటూ కొద్దిసేపు నావైపే చూస్తూ మౌనంగా ఉండిపోయిన మాతాజీ చివరకు ఇలా అన్నారు.

'ఠాకూర్(శ్రీ రామకృష్ణులు), శ్రీమా(శారదామాత) లు ఇద్దరినీ నేను హోలీ ట్విన్స్ అని పిలుస్తాను.వారు అనాది నుంచీ సృష్టిలో ఉన్నారు.ఒకరు శివుడు.ఇంకొకరు శక్తి.నువ్వు వారి బిడ్డవు.అందుకేనేమో,నిన్ను 'గురూజీ ఆఫ్ ది హోలీ ట్విన్స్' అని పిలవమని బిందువు నాకు చెబుతున్నది. నిన్ను ఇకనుంచీ అలాగే పిలుస్తాను.' అన్నదామె.

అనుకోకుండా లభించిన ఈ గౌరవానికి నేను ఇబ్బందిగా నవ్వాను.

'నీవు ఇక్కడకు వచ్చి ఉండగలవా? ఈ ఆశ్రమ బాధ్యతలు స్వీకరించగలవా? ఇక్కడ ఉన్న శ్రీయంత్రం బాగోగులు దాని పూజా పునస్కారాలు వగైరాలు చూచుకోగలవా? నేను ఒక పూజారిని డబ్బులిచ్చి పెట్టుకోగలను.కానీ ఆపని నాకిష్టం లేదు.దీనికి సరియైన మనిషి కావాలి.దీనిని సక్రమంగా ఆరాధించగల మనిషి కావాలి.అది నువ్వే అని నాకు అనిపిస్తున్నది. చెప్పు. నీవిక్కడికి వచ్చి ఈ ఆశ్రమంలో ఉండగలవా? నువ్వు అలా ఉండే పనైతే, నాకు ఎంతో రిలీఫ్ గా ఉంటుంది.నీ వల్ల మా అమెరికాలో ఎంతోమందికి ఉత్తేజం కలుగుతుంది.దివ్యజీవన రహస్యాలను తెలుసుకోవాలని ఆశిస్తున్న మా తెల్లవాళ్ళు ఎందఱో ఉన్నారు. అలాంటి వారికి నీ రాకవల్ల ఎంతో మేలు కలుగుతుంది.ఇక్కడకొచ్చి ఉంటానంటే నీకు వసతి, భోజన ఏర్పాట్లు నేను చూస్తాను.ఆధ్యాత్మిక కార్యక్రమాలకు నువ్వు నాయకత్వం వహించు.సేవా కార్యక్రమాలు నేను చూచుకుంటాను.నువ్వు మాలో ఒకరివి. మా ఆశ్రమంలోనే నువ్వు ఉండిపోతానని నాకు ప్రామిస్ చెయ్యి." అంటూ ఆమె చెయ్యి చాచింది.

అనుకోని ఈ పరిణామాలకు నేను బిత్తరపోయాను.ఏం మాట్లాడాలో నాకు అర్ధం కాలేదు.

'మాతాజీ! నాకూ ఇక్కడ ఉండాలనే ఉన్నది.ఈ ప్రదేశంలోని శక్తి నన్ను అమితంగా ఆకర్షిస్తున్నది.కానీ నాకు కొన్ని బాధ్యతలున్నాయి.ఉద్యోగం ఉన్నది.పిల్లల పెళ్ళిళ్ళు చెయ్యాలి.అవి ఒకటి రెండేళ్లలో తీరిపోతాయి.అప్పుడు నా ఉద్యోగానికి రాజీనామా చేసేస్తాను.మీరు చెబుతున్న పనిని నేను అప్పుడు చెయ్యగలుగుతాను.ఆర్నెల్లు ఇక్కడా ఆర్నెల్లు ఇండియాలోనూ అప్పుడు నేను ఉండగలను.కానీ అలా చెయ్యడానికి నాకు కొంత సమయం కావాలి.' అని నేను జవాబిచ్చాను.

అర్ధమైనట్లుగా ఆమె తల ఊపింది.

అలా మాట్లాడుకుంటూ మళ్ళీ ఆలయం ముఖద్వారం వద్దకు మేము చేరుకున్నాము.

లాన్సింగ్ దుబ్బ పూజారీ, వనితా వీడ్కోలు తీసుకుని వెళ్ళిపోయారు.మా వైపు తిరిగిన ఆమె మాలో అందరినీ పరిచయం చెయ్యమని అడిగింది.పద్మజ అందరినీ పరిచయం చెయ్యసాగింది.

ఈయన 'ఆనంద్' అని అంటూ ఆనంద్ ను మాతాజీకి పరిచయం చేసింది.

ఆనంద్ తో ఆమె ఇలా అన్నారు.

'మీ గురూజీ అంటే మీకు ఇష్టమేనా?'

దానికి ఆనంద్ - ''yes. he is my god" అని సమాధానం ఇచ్చాడు.

వెంటనే దానికి నేను అభ్యంతరం చెబుతూ -'No no.the Lord is the God for all of us. అన్నాను.

మాతాజీ నావైపు ప్రేమతో కూడిన కోపంతో చూచారు.

'గురూజీ.మీరు చాలా మారాలి.ఇప్పటివరకూ ఎవరికీ తెలియనివ్వకుండా మీ శక్తినంతా మీలోనే దాచుకున్నారు. ఇప్పుడు వీరందరి కోసం మీరు ఓపెన్ కావాలి.మీలోని దివ్యత్వాన్ని మీరు బాహాటంగా ప్రదర్శించాల్సిన సమయం వచ్చింది.ఆయన ఇస్తున్న గౌరవాన్ని మీరెందుకు వద్దని అంటున్నారు? ఆయన మాటకు ప్రతిగా మీరు కూడా -"You are my god too' అనాలి.అది సరియైన విధానం.ఆత్మ అందరిలో ఉన్నది అని మన శాస్త్రాలు చెప్పడం లేదా? ' అని ప్రశ్నించారు.

ఆమె చెబుతున్న దానిలో సత్యం అర్ధమైన నాకు నోట మాట రాలేదు.వెంటనే నాకు వివేకానంద స్వామి గుర్తొచ్చారు.

'ఎంత మహనీయుడవయ్యా? ఎక్కడో వేల మైళ్ళ దూరంలో ఉన్న తెల్లవాళ్ళకు మన శాస్త్రాలలోని సత్యాలను బోధించడమే గాక,వాటిని ఆచరణాత్మకంగా ఎలా జీవితంలో ఆచరించాలో కూడా బోధించి చూపించావు. "ఆత్మవత్సర్వభూతాని"అన్న వేదవాక్యాన్ని ఇలా ఆచరణాత్మకంగా వీళ్ళు ఆచరిస్తున్నారా? అద్భుతం!! నువ్వు నిజంగా సప్త ఋషులలో ఒకడవే.' అని మనసులో భక్తితో ఆయన్ను స్మరించాను.

వెంటనే చేతులు జోడించి 'అవును మాతాజీ.మీరు చెబుతున్నది నిజమే. నేను తప్పుగా మాట్లాడాను.నన్ను క్షమించండి.' అంటూ ఆనంద్ వైపు తిరిగి ఇలా అన్నాను.

'ఆనంద్.You are my god too.నీలోని దైవానికి నేను నమస్కరిస్తున్నాను'

మాతాజీ తృప్తిగా తల పంకించారు.

శ్రీలలిత అనే మా బృందంలోని అమ్మాయిని హగ్ చేసుకుని మాతాజీ ఇలా అడిగారు.

'డూ యూ లవ్ యువర్ గురూజీ?'

దానికామె చటుక్కున 'నో' అని జవాబు చెప్పింది.

ఊహించని ఆ జవాబుకు ఒక్క క్షణం ఆశ్చర్యపోయిన మాతాజీ - "దెన్ యూ ఆర్ మైన్" అంటూ నవ్వేసింది.

'నాలో ఏమీ లేదు.నాకేమీ తెలీదు.ఎందుకు ఇక్కడకు వచ్చానో కూడా నాకు స్పష్టత లేదు.' అని శ్రీలలిత అన్నది.

'నీలో అంతా ఉంది.అది ఒక ముసుగుతో కప్పబడి ఉన్నది.నేనూ నా గురుదేవులైన స్వామి భాష్యానంద గారితో ఎన్నో ఏళ్ళక్రితం ఇదే మాట అన్నాను.దానికాయన నాతో ఇదే మాట అన్నారు.అంతా నీలో ఇప్పటికే ఉన్నది.అయితే అది మూయబడి ఉన్నది.నువ్వు చెయ్యవలసినది ఆ ముసుగును తెరవడమే.దానినే సాధన అంటారు.ఒక్క రెండేళ్ళు ఆగు.నీకు అంతా అర్ధమౌతుంది.అజ్ఞానపు ముసుగు తొలగడానికి నాకు 12 ఏళ్ళు పట్టింది.నీకు అంత పట్టదు.రెండేళ్లలో అంతా అయిపోతుంది." అన్నారు మాతాజీ.

ఆమె నావైపు చూచి ఇలా అన్నారు.

'గురూజీ! ఈమెను నీలా మార్చాలి.నీ శిష్యులందరినీ నీ అంత స్థాయికి నీవు చేర్చాలి.నీ అంతవారినిగా వీరందరినీ నువ్వు తయారు చెయ్యాలి.'

అదెంత కష్టమైన పనో,అలా జరగడానికి మధ్యదారిలో ఎన్ని ఆటంకాలున్నాయో అర్ధమైన నేను ఏమీ చెప్పకుండా మౌనంగా మాతాజీ వైపు చూస్తూ ఉండిపోయాను.

అలా - సరళాదేవి,లక్ష్మి,సుమతి,అఖిల,శ్రీలలిత,నాగమణి,సూర్య,మాధవ్, ఆనంద్,రాజు  - అందరినీ మాతాజీకి పరిచయం చేసింది పద్మజ.

చివరగా తనను తాను చూపించుకుంటూ 'నేను పద్మజను' అంటూ చెప్పింది.తను మాతాజీని ఇంతకూ ముందే కలిసింది.ఈ రిట్రీట్ ను ప్లాన్ చేసిందీ దానికి కావలసిన ఏర్పాట్లు చేసిందీ ఆమే. ఆయా ఏర్పాట్లు చేసే పనిలో భాగంగా నెలముందే తను ఒకసారి వచ్చి మాతాజీని కలిసింది.

'అవును.నువ్వు నాకు తెలుసు.'You are my lion' - అని పద్మజ వైపు చూస్తూ మాతాజీ అన్నారు.

'You are Ma Kali' అని పద్మజ మాతాజీతో నవ్వుతూ అన్నది.

'No.I am not Kali.Kali destroys.I protect.I am not Kali, I am Durga the protector and you are my lion' అని మాతాజీ ఆమెతో అన్నారు.

ఆ విధంగా మాలో అందరినీ ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని మాట్లాడింది గౌరీవ్రత మా.

'మీ గ్రూప్ చాలా ప్రత్యేకంగా ఉన్నది.మిమ్మల్ని వదలి నేను వెళ్ళలేక పోతున్నాను.కానీ నాకు చాలా పని ఉన్నది.నన్ను లోపలకు వెళ్ళమని చెప్పండి. లేదంటే నేను ఇలాగే మీతో మాట్లాడుతూ ఉండిపోతాను.' అని ఆమె చివరకు అన్నది.

అప్పుడు మేమందరం కలసి - 'ఇక మీరు లోనికి వెళ్ళండి మాతాజీ.మీకు చాలా పని ఉన్నట్టుంది' అని అన్నాము.

అలా అన్న తర్వాత కూడా ఇంకో అరగంట పాటు, శ్రీ రామకృష్ణుల గురించి, శ్రీమాత గురించి, గౌరీమా గురించి, శారదేశ్వరీ ఆశ్రమం గురించి మాతో అలా మాట్లాడుతూనే ఉన్నది ఆమె.

చివరకు మమ్మల్ని వదల్లేక వదల్లేక ఆమె లోపలకు వెళ్ళింది.

ఆమె చాలా సీరియస్ మనిషనీ, చాలా కరుకుగా మాట్లాడుతుందనీ విన్న మేము ఆమెలో ఒక ప్రేమతో కూడిన మాతృమూర్తిని చూచి విన్నదానికీ కన్నదానికీ పోలికే లేదని ఎంతో ఆశ్చర్యపోయాము.

ఆ విధంగా ఒక్క 5 నిముషాల సమయాన్ని కూడా మాకివ్వడానికి నిరాకరించిన ఆమె ఏకంగా గంటన్నర పాటు మాతో మాట్లాడుతూ ఉండిపోయి, చివరకు మమ్మల్ని వదలి వెళ్ళలేక వెళ్ళలేక వెనక్కు తిరిగి చూస్తూ లోపలకు వెళ్ళిపోయింది.

లోపలకు వెళుతున్న ఆమెకు మనస్సులోనే ప్రణామం చేసి మేము రిట్రీట్ హోం కు బయలుదేరాము.

(ఇంకా ఉంది)