“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

4, డిసెంబర్ 2012, మంగళవారం

సేవ చెయ్యి సవాళ్లు ఎదుర్కో

నిన్న ఒక ISB కేంపస్ ప్రారంభిస్తూ ఒక మంత్రివర్యులు చక్కని సలహా ఒకటి పారేశారు.విదేశాల్లో ఉన్న భారతీయులు తిరిగి మన దేశానికి వచ్చి సేవలందించాలట. ఈ జోక్ చదివి భలే నవ్వొచ్చింది.ఇదేకాక ఇంకో జోక్ కూడా ఆయన చెప్పారు.మనదేశంలో ఉన్నన్ని సవాళ్ళు ఇంకే దేశంలోనూ లేవట.కనుక సవాళ్లు ఎదుర్కోవడానికీ అలా ఎదుర్కోవడంలో ఉన్న ఆనందం పొందటానికీ వాళ్ళు ఇండియాకు రావాలట. ఇదీ ఘనత వహించిన మంత్రిగారి ఉద్ఘాటన.

ఈ వార్త చదివి నవ్వాలో ఏడవాలో లేక ఈ రెండూ ఒకేసారి చెయ్యాలో అర్ధం కాలేదు. వారు చెప్పిన ఉపన్యాసంలో రెండు పాయింట్లు చెప్పారు. ఒకటి సేవలందించడం, రెండు సవాళ్లు ఎదుర్కోవడం.

విదేశాలలో స్థిరపడిన,పడుతున్న మేధావులను వెనక్కి వచ్చి ఈ దేశంలో  సేవలు అందించమని వారి ఊహ కావచ్చు.ఇదెంత హాస్యాస్పదమో అర్ధం కాదు.సేవ అన్న పదం మన దేశంలో అర్ధం కోల్పోయింది.ఇక్కడ సేవ లేనే లేదు,ఉన్నది దోపిడీ మాత్రమే. సేవ,విలువలు,పవిత్రత ఇత్యాది పదాలు మన దేశపు నిఘంటువులో నుంచి తొలగించబడి చాలా ఏళ్ళయింది. ప్రస్తుతం మన సొసైటీ లో ఉన్నది ఏకసూత్ర పధకం.'నీ చేతనైనంత నువ్వు దోచుకో,నాతో పనుంటే అందులో నా వాటా ఎంతో చెప్పు'- ఇదొక్కటే మన దేశంలో ప్రస్తుతం చెలామణీ లో ఉన్న సూత్రం. మిగతా రూల్సూ రెగ్యులేషన్సూ ఇత్యాదులన్నీ సంపాదించడం చేతగాని వారి కోసం ఉద్దేశించబడినవి. 'సమైక్య దోపిడీ' అనే సూత్రం ఒక్కటే మన దేశపు ఏకైక సూత్రం. నిజాన్ని నిక్కచ్చిగా మాట్లాడే ప్రతి ఒక్కరూ ఇది నిజం అని ఒప్పుకోక తప్పదు.

ఇంతకంటే ఎక్కువ దేశభక్తి భావజాలంతో మన దేశానికి వచ్చి ఏదో సేవ చేద్దామని ఆశించిన కొందరు NRI లు తలబొప్పి కట్టి తిరుగు టపాలో పారిపోయిన వాళ్ళు నాకు కొంతమంది తెలుసు. వాళ్ళు చెప్పినది ఏమంటే, "ప్రస్తుత వ్యవస్థలో ఈ దేశంలో ఏమీ చెయ్యడం సాధ్యం కాదు. సదరు ప్రక్రియలో మా జీవితాలు ఆహుతి చేసుకోవడం ఎందుకు? హాయిగా మా బతుకు మేం బతకడం మంచిది." అని వాళ్ళు చెప్పారు.
  
ఇకపోతే సవాళ్లు ఎదుర్కోవడం గురించి చూద్దాం.ఒక రంగంలో వినూత్నమైన పంధాలో ఆలోచించి ఒక ఆవిష్కరణను సాధించడం దగ్గరనుంచీ,దానిని ప్రజలకు చేరువ చేసే ప్రక్రియలో భాగాలైన,పేటెంట్ తెచ్చుకోవడమూ, బిజినెస్ పర్మిట్ పొందటమూ,లార్జ్ స్కేల్ ప్రోడక్షనూ, మార్కేటింగూ, తద్వారా సమాజానికి ఉపయోగ పడటమే కాక, వందలాది వేలాది మందికి ఉపాధి కల్పించడమూ ఇత్యాదులన్నీ ఇతర దేశాలలో చాలా సులువు కావచ్చు. కాని మన దేశంలో మాత్రం కాదు. ఎందుకంటే ఈ ప్రక్రియల్లో అడుగడుగునా మన దేశంలో అధిగమించలేనన్ని అడ్డంకులు ఎదురౌతాయి. ఎవరైనా ఇలాంటి ఒక ప్రయత్నం చేస్తే, వారికి అతి త్వరలోనే ఒక విషయం అర్ధమౌతుంది. అదేమిటంటే, మన సొసైటీ బయటకు కనిపించేటంత మంచిదీ అమాయకపు సమాజమూ కానే కాదు. ఇది కుళ్ళిపోయిన,స్వార్ధపూరితులైన మనుషులతో నిండిన సమాజం. ఇక్కడ ఏమి చెయ్యాలన్నా ప్రతి వాడూ మొదట అడిగే ప్రశ్న -- "నాకేంటి?". న్యాయంగా ఆ పని తన బాధ్యతగా చెయ్యవలసిన వాడు కూడా ఇదే ప్రశ్న అడుగుతాడు.

ఒక మేనేజర్ అయినవాడు ఒక చక్కని నిర్దుష్టమైన వ్యవస్థలో పని చేస్తున్నపుడు తన పనిలో సహజంగా ఎదురయ్యే సవాళ్లు అవి ఎంత క్లిష్టమైనవైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోగలుగుతాడు. అలా ఎదుర్కొని వాటిని అధిగమించడంలో ఆనందం ఉంటుంది కూడా. కాని అతను పని చెయ్యవలసిన వ్యవస్థలోనే మౌలికమైన లోపాలు దారుణంగా ఉండి,వాటిని చక్కదిద్దవలసిన వారే వాటిని పెంచి పోషిస్తూ,అవే అతని పురోగతికి ఘోరమైన ప్రతిబంధకాలుగా మారుతున్నప్పుడు,వాటిని అధిగమించలేకా, మరోపక్క తను నమ్మిన విలువలను త్యాగం చేసి రాజీ పడలేకా అతను భయంకరమైన సంఘర్షణను ఎదుర్కోవలసి వస్తుంది.అలాంటప్పుడు అతనికి ఒక ప్రశ్న ప్రతిరోజూ ఎదురౌతుంది.'ఎందుకోసం నేను ఇదంతా చెయ్యాలి? ఎవరి కోసం చెయ్యాలి? హాయిగా ఇంకో దేశంలో నా బతుకు నేను చక్కగా బతకొచ్చు కదా?' అని ప్రతిక్షణమూ అనిపిస్తుంది.  

విదేశాలలో కష్టానికి తగిన ప్రతిఫలం ఉంటుంది.ఇంటలిజెన్స్ కీ, హార్డ్ వర్క్ కీ విలువ ఉంటుంది.మన దేశంలో మాత్రం అదే ఘోరంగా లోపించింది. ఇక్కడ ఈ రెండింటి ఫలమూ ఎవరో వేలిముద్రగాడి దోపిడీకి బలై,వాడి ఎకౌంట్ లోకి చేరిపోతుంది.అంతే కాదు. విదేశాలలో ఒక స్పష్టమైన సమాజవ్యవస్థ ఉంది. 'రూల్ ఆఫ్ లా' ఉన్నది.మనకు ఈ రెండూ ఉన్నట్లు కనిపిస్తున్నాయి. కాని నిజానికి లేవు. మన సొసైటీ ఒక మేడిపండు.

ఒక 'నాన్ ప్రాఫిట్ సంస్థ' ప్రారంభించాలని ఈ మధ్యనే ప్రయత్నం చేస్తూ కనుక్కుంటే ఒక విషయం తెలిసింది. రిజిస్ట్రేషన్ స్థాయిలోనే కనీసం అయిదు వేలు లంచం ఇవ్వాల్సి ఉందట.అదే విదేశాలలో అయితే ఇల్లు కదలకుండా,లంచం ఇవ్వకుండా,ఒక్కరోజులో ఈ ప్రక్రియ పూర్తవుతుంది.ఇదీ మన దేశపు దౌర్భాగ్యం. ఈ ఒక్క సంఘటనను జనరలైజ్ చేసో లేక డీలా పడిపోయో నేను ఇది చెప్పడం లేదు. మరి ఇదంతా ఎందుకు చెబుతున్నానంటే, మనవాళ్ళు స్టేజీలు ఎక్కి చెప్పే నీతులు భలేగా ఉంటాయి. కాని ఆచరణలో అంతా డొల్లే అన్నది చేదు వాస్తవం. మన సమాజంలో ప్రతివాడూ ఇతరులకు భలే సలహాలు ఇస్తాడు.కాని ఆ నీతులను ఆ చెప్పేవాడు ఎంతవరకు ఆచరిస్తున్నాడో అందరికీ తెలుసు. వారి అతి చిన్న లాభాన్ని కూడా ఎవరూ ఒదులుకోరు. కాని ఇతరులకు మాత్రం ఏకంగా వారివారి జీవితాలనే త్యాగం చెయ్యమని సలహాలు ఇస్తారు. ఇలాంటి మాటలు ఎవరూ నమ్మరు. ఒకవేళ నమ్మితే వారి పని అధోగతే.

విదేశాలలో స్థిరపడిన భారతీయులు ఎందుకు మన దేశానికి రావాలో నాకైతే అర్ధం కాదు.ఇక్కడ ఉన్న దుమ్మూ, ధూళీ, మురికీ, అవినీతీ, దోపిడీ, వ్యవస్థలేమీ,తెలివికి గుర్తింపులేకపోవడమూ,లాంటి మురికి గుంటల్లోపడి ఈత కొట్టాలని ఉంటే నిరభ్యంతరంగా రావచ్చు.లేదా వారికి కూడా ఏవైనా 'హిడెన్ అజెండాలు' ఉంటే అలాగే రావచ్చు.కానీ సదరు మంత్రి మహాశయులు చెప్పినట్లు మాత్రం -- దేశానికి సేవ చెయ్యడం కోసమో, సవాళ్లు ఎదుర్కోవడం కోసమో -- అయితే మాత్రం అస్సలు రానక్కరలేదు అనే నా అభిప్రాయం.

కొన్నేళ్ళ క్రితం మన రాష్ట్రంలో మెడికల్ పీజీ ఎంట్రన్స్ లో స్టేట్ ఫస్ట్ వచ్చిన ర్యాంకర్ కు తను కోరుకున్న 'రేడియాలజీ' సీటు దక్కక తీవ్రమైన నిరాశకు లోనయ్యాడన్న విషయం మరొక్కసారి చదువరులకు గుర్తు చెయ్యదలుచుకున్నాను.ఇదీ మన వ్యవస్థ. మన వ్యవస్థ ఎంత చక్కగా ఉందో ఈ ఒక్క ఉదాహరణ తేటతెల్లం చేస్తుంది.మన దేశంలో ఇలాంటి ఉదాహరణలు కోకొల్లలుగా చూపగలను.కాని వేరే దేశాలలో ఇలాంటివి ఊహకు కూడా దొరకవు. మరి అలాంటి మెరిట్ స్టూడెంట్స్ ఈదేశంలో ఎందుకు ఉండాలి? ఉండి ఎవర్ని ఉద్ధరించాలి?

నన్నెవరైనా అడిగితే మాత్రం తెలివీ,కష్టపడి పనిచేసే తత్వమూ ఉన్న ప్రతివారినీ ఈ దేశం వదిలి వెళ్ళమనే చెబుతాను.ఎందుకంటే ప్రస్తుతం మనం చెబుతున్న - 'సేవ చెయ్యి సవాళ్ళు ఎదుర్కో' అనేది పచ్చి బూటకం.ఇది ఎదుటి వాడికోసం మనం ఇస్తున్న ఉచితసలహా.కాని ప్రతివారూ ఆచరిస్తున్నది మాత్రం '(ఏదో రకంగా) సేవ్ చెయ్యి, (అదేమని) సవాల్ చేసినవాడిని ఎదుర్కో'. 

అందుకే విదేశాలలో స్తిరపడిన భారతీయులు ఇక్కడికి ఎంతమాత్రం తిరిగి రానవసరం లేదు. వచ్చినా వారు ఈ వ్యవస్థలో  బతకలేరు. అంతే కాదు ఏమాత్రం అవకాశం ఉన్నా, ప్రతివాడూ విదేశాలకు పోయి అక్కడ స్తిరపడటమే మంచిది అనేది ప్రస్తుత పరిస్థితుల్లో నా నిశ్చితాభిప్రాయం. దేశాన్ని ఉద్ధరించడం తరువాయి, కనీసం వాళ్ళ తెలివికీ కష్టానికీ తగిన గుర్తింపూ చక్కని జీవితమూ అయినా వారికి దక్కుతాయి.ఎవరైనా ఆశిస్తున్నవి అవేగా మరి. తమ జీవితం పాడు చేసుకొని దేశాన్ని ఉద్ధరించడం ఎలా కుదురుతుంది? అయినా విదేశాలలో స్తిరపడ్డ వారు వచ్చి మన దేశానికి అందించవలసిన సేవలు ఏమున్నాయి? అసలు ఇక్కడున్నవారు ఏమి చేస్తున్నట్లు? వీళ్ళు దేశానికి సేవ చెయ్యలేరా? లేక వీరి సేవలు దేశానికి చాలవా? లేక NRI ల సేవలే కావాలని దేశమాత రోదిస్తున్నదా? లేక వీరు పాడు చేస్తుంటే వారోచ్చి బాగు చెయ్యాలా?

ఏంటో అన్నీ అర్ధంకాని చిక్కుప్రశ్నలే. పొయ్యేవాణ్ణి వాడిదారిన పోనివ్వక వెనక్కు లాగటం ఎందుకో అర్ధం కాదు. మనం ఒక్కరమే ఎందుకు బాధలు పడాలి? వాళ్ళను కూడా ఈ ఊబిలోకి లాగుదాం అన్న ఆలోచన కావచ్చు. హతోస్మి. భ్రష్టానాం కావా గతి:?