“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

29, డిసెంబర్ 2012, శనివారం

డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు

సాటి మానవుల రాక్షసత్వానికి బలైపోయి పదమూడు రోజులుగా ప్రాణం కోసం పోరాడుతున్న ఒక అమాయక ప్రాణి ఈరోజు కన్నుమూసింది.ఒక లేత కుసుమం ప్రపంచాన్ని చూడకుండానే అర్ధాంతరంగా నేలరాలిపోయింది.'నాకు బ్రతకాలని ఉంది' అని పరితపించిన ఒక నిండు ప్రాణాన్ని మన చేతులతో మనమే కిరాతకంగా చంపేశాం.మన దేశం మీద మరో మాయని మచ్చ ఏర్పడింది.ఇప్పటికే మనం మోస్తున్న పాపఖర్మం ఒక్కసారిగా వందలరెట్లు పెరిగింది.దీని ఫలితం భవిష్యత్తులో ఎలా ఉంటుందో నేను చెప్పలేను గాని, ఇది మన దేశానికి మంచిది కాదు అని మాత్రం చెప్పగలను.

మనం కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతాం.'చేసిన పాపం అనుభవించక తీరదు' అని మన సంస్కృతి వేలయేళ్ళుగా ఘోషిస్తున్నది.కాని మన దేశంలోనే సమస్త పాపాలూ జరుగుతూ ఉంటాయి.సమస్త ఘోరాలూ నేరాలూ జరుగుతూ ఉంటాయి.నిందితులు చక్కగా తప్పించుకుని తిరుగుతూ ఉంటారు.నాయకులు వారిని సిగ్గులేకుండా సమర్ధిస్తూనె ఉంటారు.రాజకీయపు ముసుగులో సమస్తమూ రెండు మూడు రోజుల్లో మరుగున పడి పోతూ ఉంటుంది. మనం కూడా రేపటికి ఈ న్యూస్ ను మర్చిపోయి ఇంకో కొత్త న్యూస్ కోసం ఎదురు చూడటం మొదలుపెడతాం.

మీడియా బలంగా ఉండబట్టి నేడు ఇలాంటి నేరాలు బయటకు వస్తున్నాయి.అందరికీ తెలుస్తున్నాయి.కాని ప్రతి కాలంలోనూ ప్రతి ఊరిలోనూ ఇలాంటి ఘోరాలు మామూలుగా మన దేశంలో జరుగుతూనే ఉన్నాయి.బాధిత మహిళలు బయటకు చెప్పుకోలేక జీవచ్చవాలుగా బ్రతుకులు ఈడుస్తూనె ఉన్నారు(ఒకవేళ రేపిష్టుల చేతిలో బతికి బట్టకట్ట గలిగితే).లెక్కల ప్రకారమే దాదాపు లక్ష రేప్ కేసులు కొన్నేళ్లుగా కోర్టుల్లో మూలుగుతున్నాయి. ఇక లెక్కా డొక్కా లేని కేసులు,రికార్డుల లోకి ఎక్కని కేసులు దీనికి కనీసం ఏభై రెట్లు ఉండవచ్చు.

దాదాపుగా 15 ఏళ్ల క్రితం గుంతకల్లు లో ఇలాంటిదే ఒక దారుణమైన రేప్ కేస్ జరిగింది.ఆ అమ్మాయికి కూడా పందొమ్మిది ఏళ్ళు ఉంటాయి.కేరళకు చెందిన ఈ అమ్మాయి రైల్వే ఉద్యోగిని.కరాటే వచ్చిన వ్యక్తి.స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించి చక్కగా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నది. ఒక రాత్రి తన క్వార్టర్స్ లో దారుణంగా గేంగ్ రేప్ చెయ్యబడి తెల్లవారేసరికి రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నది.ఆ అమ్మాయి చేతులను భూమిమీద పెట్టి మేకులతో నేలకు సిలువ కొట్టి మరీ చంపేశారు.ఒక కనుగుడ్డు పీకేశారు.కొందరు సైకోలు కలిసి ఈ పని చేసినట్లుగా అనిపిస్తుంది.అదొక మహా ఘోరాతి ఘోరమైన దృశ్యం.విచిత్రమేంటంటే ఇప్పటివరకూ ఆ కేస్ ఎటూ తేలలేదు.ఎవరు ఈ ఘోరం చేశారో ఊరిలో అందరికీ తెలుసు,పోలీసులకూ తెలుసు.కాని నిందితులకు ఇప్పటివరకూ శిక్షలు పడలేదు.అమాయకులను పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుకుని కేసును పక్కదారి పట్టించి చివరికి ఫైల్ మూసేశారు.నిందితులు ఇప్పటికీ అదే ఊళ్ళో చక్కగా కాలరెగరేసుకుని తిరుగుతున్నారు. ఆ పిల్ల తల్లిదండ్రులు మాత్రం గుడ్ల నీరు కుక్కుకుని శవాన్ని అక్కడే దహనం చేసి ఆ బూడిద తీసుకుని కేరళకు వెళ్ళే రైలెక్కారు.

విజయవాడ శ్రీలక్ష్మి కేసూ,గుంటూరు ప్రసన్నలక్ష్మి కేసూ ఏమై పోయాయో ఇప్పుడు ఎవరికైనా గుర్తుందా అసలు? చిలకలూరిపేట బస్సుదహనం కేసు ఏమైపోయిందో ఎవరికైనా పట్టిందా? ఇలాంటి కేసులు ప్రతి నగరంలోనూ ఎన్నో జరిగాయి.ఈనాడూ జరుగుతున్నాయి.అందుకే మన దేశంలో న్యాయం అనేది ఎప్పుడో చచ్చిపోయింది, మన దేశంలో న్యాయంలేదు,అర్హులకు న్యాయం ఎప్పుడూ జరగదు అని నేనెప్పుడూ వ్రాస్తూనే ఉంటాను. నా వ్రాతలు చూచి నాది పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అని చాలామంది,ముఖ్యంగా సోదరీమణులు,  నన్ను విమర్శిస్తుంటారు.వారికి తెలియని ఒక్క విషయం ఏమిటంటే, నేను వ్రాసే ప్రతిదీ అనుభవంలో నుంచీ పరిశీలనలోనుంచీ వ్రాస్తాను.ఉత్త ఊకదంపుడు గాసిప్ ఊహించి ఎప్పుడూ వ్రాయను.మన అదృష్టం బాగుండి మనం ఈ దేశంలో ఏమీ కాకుండా బతికి బట్టకడుతూ ఉన్నాం గాని,చట్టాల గొప్పదనం వల్లో,వ్యవస్థయొక్క పటిష్టత వల్లో మాత్రం కానేకాదు. నూకలుంటే మనం బతికుంటాం.లేకుంటే మనకు కూడా ఏమైనా కావచ్చు.అదీ ఘనత వహించిన మన దేశపు గొప్పదనం.

మన సమాజం ఒక మేడిపండు అని ఓషో వంటి ప్రవక్తలు ఎప్పుడో చెప్పారు.ఇది పైకి చూడటానికి చాలా అందంగా కనిపిస్తుంది.కాని లోపల అన్నీ పురుగులే.ఈ పురుగులు తయారు కావడానికి ఎన్నో కారణాలు మన సమాజంలో ఉన్నాయి.ఒక కారణం అయితే దానిని బాగు చెయ్యగలం.ఎన్నో కారణాలు ఉంటే ఎలా బాగుచేయ్యాలి? అసలు బాగుచేసుకోవాలన్న స్పృహ కూడా మనకు లేదే?ఒకవేళ ఉన్నా మంచి రాజకీయ నాయకులు లేరే? ఇక 'బాగు' ఎలా సాధ్యం? మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ స్త్తితిలో ఉన్న సమాజాన్ని ఎలా బాగు చేసుకోవాలి?

ప్రతి నాయకుడూ నాయకురాలూ అధికారం లేనప్పుడు నీతులు చెప్పడం,ప్రజల కోసమే తాము జీవిస్తున్నామన్న భ్రమ కల్పించడం,అది నమ్మి ప్రజలు అధికారం కట్టబెట్టగానే విచ్చలవిడిగా దోపిడీ మొదలుపెట్టడం.ఆ నాయకుడి కులంవాళ్ళూ అనుచరులూ కూడా ఆదోపిడీలో భాగం పంచుకోవడం,నిస్సిగ్గుగా సమర్ధించడం.ఇదేగా మన దేశ వ్యవస్థ.కాదని ఎవరైనా అనగలరా? ఇలాంటి సమాజం అసలెలా బాగుపడుతుంది?

ఎన్ని చెప్పినా ఎంత తిట్టుకున్నా మన ప్రజలు చాలా మంచివారు.మానవత్వం ఉన్నవారు అని ఒప్పుకోక తప్పదు.ఈ దేశం మంచిదే.ప్రజలూ మంచివారే. కాని నాయకులే దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారు.వేల ఏళ్లుగా మనది బానిస మనస్తత్వం.రాజుని దేవుడిగా కొలిచే బానిస బతుకులు మనవి. నాయకులు ఎలా ఉంటే మనం అలా అనుసరిస్తాం.మనది గొర్రె జాతి.కనుక నాయకుడు నీతిగా ఉండి ప్రజలని నీతిగా నడిపిస్తే మనమూ నీతిమంతులుగా జీవిస్తాం.నాయకులే అవినీతిపరులుగా మారి,అవకాశవాదంతో దేశాన్ని దోచుకుంటూ ఉంటే మనం కూడా అదే చేస్తాం.ఎందుకంటే గొర్రెలకు మెదడు ఉండదు కదా. 'యధారాజా తదా ప్రజా' ఒక్కటే వాటికి తెలిసిన సూత్రం.ఇప్పుడు మన సమయంలో జరుగుతున్నది అదే. ఖర్మ ఏమిటంటే ఎన్నుకోడానికి మంచి నాయకులే కరువైన స్తితి మన దేశపు దౌర్భాగ్యం.ఎక్కడో ఒకరో ఇద్దరో 'మోడీ' వంటి మంచి సమర్ధులైన నాయకులు ఉంటే, వారికి చస్తే అవకాశం ఇవ్వం. వారికి మెజారిటీ రాదు. కనుక వారు మనకు ఏమీ చెయ్యలేరు.మనల్ని బాగుచేసే అవకాశం అలాంటివారికి మనం చస్తే ఇవ్వం.ఇలాంటి జాతి మనది.

మన దేశం ఏమై పోయినా మనకు అనవసరం.ప్రపంచ దేశాలు మనల్ని చూచి చీదరించుకుని నవ్వుతున్నా మనకు అనవసరం.మన ఆడపిల్లలు ఇలా గ్యాంగ్ రేపులకు గురై చనిపోతున్నా మనకు అనవసరం.భ్రస్టు పట్టిన మన విధానాలవల్ల దేశం రోజురోజుకూ ఆర్ధిక సంక్షోభం దిశగా ప్రయాణిస్తున్నా మనకు అనవసరం. మనకు సమర్ధుడైన నాయకుడు అక్కర్లేదు.మనం తీసుకున్న ప్రభుత్వ రుణాలు మాఫీ చేసేవాడు మనకు కావాలి.మన నేరాలనుంచి మనల్ని కాపాడేవాడు మనకు కావాలి.వాడు ఎంత వెధవైనా మన కులంవాడు మనకు కావాలి.మనకు కాంట్రాక్టులూ ఉద్యోగాలూ దొంగదారిన కట్టబెట్టేవాడు మనకు కావాలి.ఈ క్రమంలో పక్కవాడికి ఎలాంటి అన్యాయం జరిగినా మనకు పట్టదు.ఇదీ మన వ్యవస్థ.ఇలాంటి వ్యవస్థలో అసలు న్యాయం అనేది బతికుంటుంది అనీ,జరుగుతుంది అనీ ఎలా విశ్వసించగలం?

ఇదంతా అలా ఉంచి,ప్రస్తుత డిలీ గ్యాంగ్ రేప్ కేస్ నేపధ్యంలో అసలంటూ ఈ సమస్యకు పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా?అన్న విషయం తర్వాతి పోస్ట్ లో చూద్దాం.