“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

14, డిసెంబర్ 2012, శుక్రవారం

నీకు తెలీదు నేను చెప్పింది విను

మొన్నొక అల్లోపతి డాక్టర్ క్లినిక్లో కూచుని ఉన్నాను.ఆ డాక్టర్ నా స్నేహితుడు.ఎప్పుడైనా ఆవైపు వెళితే ఒకసారి అతన్ని పలకరించి వస్తుంటాను.నేను వెళ్లేసరికి ఆయన ఒక పేషంట్ ని చూస్తున్నాడు. అప్పటికే రూమ్ లో ఒక పదేళ్ళ పిల్లా ఆమె తల్లీ ఒకపక్కగా నిలబడి ఉన్నారు. బహుశా అప్పుడు చూస్తున్న పేషంట్ అయిపోయాక వీరి టర్న్ కోసం వేచి ఉన్నారనిపించింది.సరే నేనూ ఎదురుగా కూచుని నాధోరణిలో హోమియోపతిక్ కోణంలో వారిని గమనిస్తున్నాను.

నేను ఒక వ్యక్తిని చూచేటప్పుడూ,మాట్లాడేటప్పుడూ అనేక కోణాలలో వారిని సూక్ష్మంగా పరిశీలిస్తాను.అలా పరిశీలిస్తున్నట్లు వారికి తెలీకుండా చేస్తాను.హోమియోపతిక్ పరంగా,జ్యోతిష్య పరంగా, పంచతత్వపరంగా, ఆధ్యాత్మిక,యోగ/తంత్ర పరంగా ఇలా చాలా కోణాలలో చూస్తాను. దానివల్ల ఆ వ్యక్తిలోని విభిన్న వ్యక్తిత్వఅంశాలు,వారి అలవాట్లూ, మనస్తత్వాలూ, ఉద్దేశాలూ,వారి జాతకంలోని దోషాలూ,వారి పూర్వీకులు చేసిన పాపాలూ అన్నీ తేటతెల్లంగా ఎక్స్-రే లో చూచినట్లు కనిపిస్తుంటాయి.

ఆ అమ్మాయి కొంచం ఆయాసపడుతున్నట్లు కనిపిస్తున్నది. అప్పుడప్పుడు ముక్కులు ఎగబీలుస్తున్నది.అమ్మాయి బొద్దుగా పొట్టిగా ఉన్నది. తల్లి కూడా బొద్దుగా పొట్టిగానే ఉన్నది.డిస్నియా అని చూస్తేనే అర్ధమౌతున్నది.కానీ వారిద్దరిలోనూ అసహనం లేదు. ప్రశాంతంగా ఉన్నారు. ఫాన్ దగ్గరగా జరగడం చూసి వారికి గాలికావాలని అర్ధమౌతున్నది.వాళ్ళను చూస్తేనే "పల్సటిల్లా" తత్త్వం కనిపిస్తున్నది. 

పేషంట్ ను ఇంకొంచం పరీక్షిద్దామని "కూచోండమ్మా" అని కుర్చీ చూపించాను.

"పరవాలేదండి" అంటూ వాళ్ళు నిలబడే ఉన్నారు. 

"ఓహో అయితే 'సల్ఫర్' ఇండికేట్ కావడం లేదన్నమాట." అని మనసులోనే అనుకున్నాను. 

ఈ లోపల ఆ పేషంట్ సరిగ్గా మందులు వేసుకోవడం లేదని విసుక్కుంటూ అతన్ని బెదరగోడుతూ ఏదో మాటలు చెబుతూ కొన్ని కొత్త మందులు రాసిచ్చాడు మా ఫ్రెండ్. అవి వాడి మళ్ళీ ఒకవారం తర్వాత రమ్మని చెప్పి అతన్ని పంపేశాడు. ఈ తల్లీ పిల్లల వైపు తిరిగి కూచోమని సైగ చేశాడు.

"ఏంటమ్మా బాధ?" అడిగాడు. 

"నాక్కాదండి అమ్మాయికి" చెప్పింది తల్లి.

"ఏమైంది" అడిగాడు.

"అమ్మాయికి ఆయాసం అండి"

సరే అమ్మాయిని కూచోబెట్టి స్టేత్ తో లంగ్స్ పరీక్ష చేసాడు. వీజింగ్స్ ఎలాగూ ఉంటాయి. తలపంకిస్తూ "ఎప్పటి నుంచి?" అడిగాడు.

"పుట్టినప్పటినుంచీ ఉందండి.చలికాలంలో ఎక్కువగా  వస్తుంటుంది." చెప్పింది తల్లి.

"మందులు రాసిస్తున్నాను.అవి వాడి మళ్ళీ వారం తర్వాత కనిపించండి." అంటూ ఒక చీటీ మీద మందులు రాసిచ్చి కొనుక్కుని తెచ్చి చూపించమన్నాడు.

"జాగ్రత్తలు చెప్పవా?" అని గుర్తు చేశాను.

"దుమ్ము తగలకుండా చూచుకొండి.చలిగాలికి తిరగనివ్వవద్దు. ఫ్రిజ్ లో ఉంచిన పదార్ధాలు పెట్టవద్దు. చలికాలం పోయేవరకూ పెరుగు పెట్టవద్దు. రాత్రిళ్ళు ఫెన్ కింద పడుకోరాదు.దూరంగా పడుకోవాలి.రూమ్ లో డస్ట్ లేకుండా శుభ్రంగా ఉంచండి." మొదలైన జాగ్రత్తలూ అన్నీ చెప్పాడు.

"అన్నీ పాటిస్తామండి.కాని అమ్మాయి ఫాన్ లేనిదే పడుకోదు. గాలి కావాలని గొడవ చేస్తుంది" చెప్పింది తల్లి. 

డాక్టర్ కి కోపం వచ్చింది. 

"అయితే అనుభవించండి.నేనేం చెయ్యగలను? చెప్పడం వరకే మా వంతు.వినమూ మా ఇష్టం అంటే బాధపడక తప్పదు." అంటూ నా వైపు తిరిగి "ఇలా ఉంటారు పేషంట్లు" అన్నాడు.

నేనేమీ మాట్లాడలేదు."డాక్టర్లుకూడా ఇలాగే ఉంటారు"మనసులో అనుకున్నాను.

"మరేలాగండి?అమ్మాయి దుప్పటి కప్పితే ఊరుకోదు. తనకి గాలి బాగా కావాలి" అన్నది తల్లి.

"చూడమ్మా.నీకు తెలీదు నేను చెప్పింది విను. డాక్టర్నినేనా నువ్వా?.నేను చెప్పినట్లు వింటే మీ అమ్మాయికి తగ్గుతుంది.చిన్నపిల్ల తనకు తెలీదు. మీరు నచ్చచెప్పాలి" అన్నాడు.

వారు మందులు తీసుకుని వెళ్ళిపోయారు. వారు బయటకి వెళుతూ ఉండగా ఆమెను నేను ఒక ప్రశ్న అడిగాను.

"చూడమ్మా. మీ వైపు గాని మీ వారి వైపుగాని ఎవరికైనా ఉబ్బసం ఉందా?"

"ఉన్నదండి. మా మామగారు అత్తగారు ఇద్దరూ ఉబ్బసం పేషంట్లే" చెప్పింది ఆమె.

నాకు పరిస్తితి అర్ధం అయింది. అది అనవసర ప్రశ్న అన్నట్లు మా ఫ్రెండ్ అసహనంగా ముఖం పెట్టాడు.నాకు నవ్వొచ్చింది.కొద్దిసేపు కూచుని ఇక సెలవు తీసుకుని బయలుదేరాను. అసలు మందు రోగికి కాదు,మా ఫ్రెండ్ కి వెయ్యాలి అనిపించింది.

హన్నేమాన్ దృష్టిలో ఇది డయాగ్నైసిసూ కాదు.ప్రిస్క్రిప్షనూ కాదు.ఎందుకంటే ఇతను మందిచ్చింది రోగానికే గాని రోగికి కాదు.కనుక ప్రస్తుతానికి ఈ మందులకు ఆ అమ్మాయికి బాధ తగ్గినా పూర్తిగా రోగం నయం అవదు. పై ఏడాది వచ్చె చలికాలంలో ఇంకా ఉధృతంగా ఎటాక్ వస్తుంది. అప్పుడు ఏ కార్టిజానో వాడవలసి వస్తుంది. ఈలోపల ఆ అమ్మాయి  రోగనిరోధక శక్తి వేగంగా క్షీణిస్తుంది. ఇక ఆ అమ్మాయి మందులకు బానిస అయిపోతుంది. కానీ రోగం ఉపశాంతినిస్తుందే గాని పూర్తిగా తగ్గదు. నేను 1990-1995 మధ్యలో హోమియో నేర్చుకుని విజయవాడలో మా స్టడీ సర్కిల్ క్లినిక్ లో పనిచేసినప్పుడు ఇలాంటి కేసులు ఎన్నో చూచాను. ఈ అమ్మాయికి ఈ ట్రీట్మెంట్ లో ఏళ్ళు గడిచే కొద్దీ రోగం ముదిరి ఇతర అవయవాలకు వ్యాపిస్తుంది గాని తగ్గదు.ఎందుకిలా జరుగుతుంది? అనే ప్రశ్నకు అల్లోపతి లో జవాబు లేదు. ఒక్క హోమియోపతి మాత్రమే దీనికి జవాబు ఇవ్వగలదు.

రోగపరంగా ఆ డాక్టర్ చెప్పినది కరెక్టే. కాని రోగి యొక్క తత్వాన్ని (constitution) అతను లెక్కలోకి తీసుకోలేదు. కనుక అతని ట్రీట్మెంట్ వల్ల రోగి తత్వంలో మార్పు రాదు.అలా తత్వపరంగా మార్పు రాకుండా జరిగే క్యూర్ అణచివేత అవుతుంది గాని, రోగ నిర్మూలనం అవదు.రోగం ఏడాది నుంచి ఏడాదికి ముదురుతూ పోతుంది.లేదా సుగరూ బీపీ వంటి కొత్త బాధలు మొదలౌతాయి. అంటే రోగం శరీరంలో ఇంకా లోతుకు పాకిపోతున్నది అని అర్ధం. అది సైంటిఫిక్ క్యూర్ అనిపించుకోదు.

అందుకే హన్నేమాన్ రోగి లక్షణాలనూ, రోగ లక్షణాలనూ, ఉద్రేక ఉపశమనాలనూ, రోగి యొక్క మనస్తత్వాన్నీ, అతని కోరికలనూ,అసహ్యాలనూ, ఉద్వేగాలనూ, అన్నింటినీ పరిగణనలోకి తీసుకొమ్మని 'ఆర్గనాన్' లో చెబుతాడు. అలా అన్ని లక్షణాలకు సరిపోయిన మందే రోగికి తత్వపరంగా నయం చెయ్యగలుగుతుంది.అదే సైంటిఫిక్ క్యూర్ అవుతుంది.అప్పుడు రోగం లోపలనుంచి బయటకు నెట్టబడుతుంది. ప్రాణాధార అవయవాలు కోలుకుంటాయి. హోమియోపతిలో ట్రీట్మెంట్ సరియైన దారిలో నడుస్తుంటే,ఉన్న రోగం ముదరదు,కొత్తరోగాలు రావు. అయితే హోమియో మాత్రలు ఇచ్చిన ప్రతిడాక్టరూ హోమియో సిద్ధాంతాలు పాటిస్తూ ట్రీట్మెంట్ చేస్తున్నట్లు కాదు.దీంట్లో కూడా మాయ ఉన్నది.ఇది మళ్ళీ వేరే కోణం. దీని గురించి ఇంకొక పోస్ట్ లో వ్రాస్తాను. 

అల్లోపతిలో ఉబ్బసం అంటే అందరికీ అవే మందులు ఉంటాయి. కాని హోమియోపతిలో ఏ ఇద్దరు ఉబ్బసం పేషంట్లకూ ఒకే మందు ఉండదు.రోగి యొక్క తత్వాన్ని బట్టి మందు మారిపోతుంది. ఈ అమ్మాయికి అంత ఉబ్బసం లోనూ, చలిగాలి కావాలి. అదే విచిత్ర లక్షణం. ఈ లక్షణాన్ని విస్మరించడం వల్ల ట్రీట్మెంట్ మొత్తం పక్కదారి పడుతుంది. కాని అలా అన్ని లక్షణాలనూ పరిగణన లోకి తీసుకోవడం అల్లోపతీ లో ఉండదు.ఇక్కడ క్లినికల్ టెస్ట్ చూపించే రీడింగ్ ఒక్కటే ప్రధానం.అందులో రోగిని మనిషిగా కాకుండా ఒక పశువుగా మాత్రమె ట్రీట్ చేస్తారు.పేషంట్ చెబుతున్నది వినిపించుకోరు.ఇలాంటి కేసులు చూచే,మా గురువుగారు అల్లోపతీని 'పశువైద్యం'అనేవారు.ఎందుకంటే వెటరినరీ మెడిసిన్ లో కూడా పశువు ఇష్టాఇష్టాలు లెక్కలోకి తీసుకోరు. అలాగే అల్లోపతీ చికిత్స లో కూడా పేషంట్ చెబుతున్న సూక్ష్మ వివరాలు అస్సలు వినరు. అది వాళ్ళతప్పు కూడా కాదు. వాళ్ళ సిస్టం అంతే. తత్వపరమైన చికిత్స అల్లోపతి లో ఉండదు.అంటే అల్లోపతిని నేను తక్కువ చెయ్యడం లేదు.కొన్నికొన్ని సీరియస్ సందర్భాలలో,కొన్ని కొన్ని రోగాలలో అదీ చాలా అవసరమే. కాని క్రానిక్ డిసీజెస్ తగ్గించడం ఒక్క హోమియోపతిలోనే సాధ్యం అవుతుంది అని నా అనుభవం చెబుతున్నది.అల్లోపతీ విధానంలో ఇలాంటి పరిశీలనా, పొటెన్సీ డ్రగ్స్ తో చికిత్సా ఉండదు.ఒక పేషంట్ ను వారు చూచే విధానం వేరుగా ఉంటుంది.హోమియోలో చూచే విధానం వేరుగా ఉంటుంది.

ఈ అమ్మాయికి పల్సటిల్లా, కార్బోవెజ్ ప్రస్తుతానికి సరైన మందులు. వాటిని వాడితే తనకి రోగం పూర్తిగా నయం అయిపోతుంది. వచ్చె చలికాలానికి ఇంత తీవ్రపు ఎటాక్ రాదు. క్రమేనా ఒకటి రెండు సంవత్సరాలలో తనకి పూర్తిగా తగ్గవచ్చు. ఎందుకంటే పుట్టినప్పటినుంచే ఉన్నది గనుక వంశపారంపర్యంగా జీన్స్ లో వచ్చింది. అమ్మాయి తాతయ్యకూ నానమ్మకూ అదే రోగం ఉన్నది. కనుక తండ్రి జీన్స్ ద్వారా ఈ అమ్మాయికి సంక్రమించింది.వివాహం అయ్యేలోపు ఈ అమ్మాయికి హోమియో ట్రీట్మెంట్ ద్వారా తగ్గించకపోతే రేపు ఈ అమ్మాయి పిల్లలకు కూడా వస్తుంది. దానికి constitutional treatment ఇవ్వాలి. అది అల్లోపతీలో ఉండదు.వీళ్ళకు అర్ధం అయ్యేటట్లు చెప్పేవారు లేరు. చెప్పినా చాలామంది వినరు. కర్మ అనుభవించవలసి ఉన్నపుడు మంచి చెప్పినా అర్ధం కాదు.

లోకంలో చాలామంది ఇలాగే అజ్ఞానంలో ఉంటారు.అది వారి తప్పుకూడా కాదు.అంతా కర్మప్రభావం.ప్రారబ్ధకర్మ బలంగా ఉన్నపుడు ప్రతిదీ తప్పుదారిలో తీసుకెళుతుంది.అది తప్పుదారి అనికూడా వారికి ఆ సమయంలో తోచదు. వారు చేస్తున్నది కరెక్టే అనిపిస్తుంది.అదే మహామాయ. రోగికి కర్మ తీరే సమయం వచ్చినపుడే సరియైన హోమియో వైద్యుడు దొరుకుతాడు.ఇది వినడానికి వింతగా నవ్వొచ్చే మాటలా వినిపిస్తుంది. కాని సత్యం.అలాగే మనిషికి కూడా నిజంగా కర్మ తీరే సమయం వచ్చినపుడే సరియైన గురువూ దొరుకుతాడు. ఇదీ వినడానికి వింతగా అనిపిస్తుంది. కాని ఇది కూడా సత్యమే.

రెండు వందల ఏళ్ల క్రితమే హన్నేమాన్ చేసిన పరిశోధనకూ ఆయన మేధాశక్తికీ సునిశిత పరిశీలనకూ ఆశ్చర్య పోతూ, ఆయన పోయి ఇన్నాళ్లైనా ఆయన రీసేర్చిని అర్ధం చేసుకోలేని లోకాన్ని చూచి జాలిపడుతూ మౌనంగా ఇంటి దారి పట్టాను.