“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

30, డిసెంబర్ 2012, ఆదివారం

డిల్లీ గ్యాంగ్ రేప్ కేసు-కొన్ని ఆలోచనలు-3

అమ్మాయిల అసభ్య వస్త్రధారణ వల్లే ఈ నేరాలు జరుగుతున్నాయని నా ఉద్దేశం కానేకాదు.కాని ఇది కూడా ఈ రకమైన ఘోరాలకు ఒక కారణం అవుతుంది అన్నది వాస్తవం.నిజానికి ఈ అమ్మాయి ఆరోజున అలాంటి బట్టలు వేసుకుని లేదు.సమయం అర్ధరాత్రి కూడా కాదు.తను బారుకో పబ్బుకో పోయి రావడం లేదు.సినిమా చూచి రాత్రి తొమ్మిది గంటల సమయంలో ఇంటికి పోతున్నది.అది తప్పెలా అవుతుంది?

ఆ సమయంలో ఆ బస్సులో ఉన్న నిందితులు ఒక అమ్మాయి కోసం చూస్తున్నారు.అంతే.ఈ అమ్మాయి ఖర్మకాలి ఆ బస్సులో తన స్నేహితునితో కలిసి ఎక్కింది.అంతేగాని అది ఆ అమ్మాయి వస్త్రధారణ తప్పు కాదు.ఆ సమయంలో ఇంకే అమ్మాయి ఆ బస్సులో ఎక్కినా అదే జరిగి ఉండేది.

కనుక అసలు సమస్య వస్త్రధారణలో లేదు.నేరాలను సమర్ధవంతంగా నివారించే వ్యవస్థ మనకు లేదు.చట్టం అంటే ఎవరికీ భయం లేదు.అదీ అసలు సమస్య.'ఏ నేరం చేసినా ఈ దేశంలో ఏమీ కాదు.ఏదో రకంగా తప్పించుకోవచ్చు' అన్న ధీమాను మనం గత 60 ఏళ్ళుగా ప్రజలలో పెంచి పోషించాం. ఇదీ అసలు సమస్య. కనుకనే 'మాకు రక్షణ కావాలి' అని శాంతియుతంగా డిల్లీలో ప్రదర్శన చేస్తున్న దేశ ప్రజల చుట్టూ 10 కంపెనీల పోలీస్ ఫోర్స్ ను మోహరించవలసి వచ్చింది. ఇది ఈ శతాబ్దపు వింతల్లో ప్రముఖంగా చెప్పుకోదగిన వింత అని చెప్పవచ్చు.

ప్రజలలో చట్టం అంటే భయం లేకుండా పోవడానికి అవినీతి రాజకీయులూ, అవినీతి అధికారులే కారణం.ప్రతి కేసునూ నీరుగారుస్తూ, వాళ్ళ వాళ్ళను శిక్ష పడకుండా తప్పిస్తూ,న్యాయవ్యవస్థ అంటేనే,పోలీస్ వ్యవస్థ అంటేనే ప్రజల్లో అపనమ్మకమూ అసహ్యమూ కలిగేలా గత 60 ఏళ్ళ మన స్వాతంత్ర్య చరిత్ర సాగడానికి కారణం వీరిద్దరే.ఈ సమిష్టి పాపం వీరిమీదే ఉన్నది. 

మనది కాపీ రాజ్యాంగం.కాపీ పీనల్ కోడ్.కాపీ వ్యవస్థ.మన దేశ సమస్యలకు మౌలికంగా ఉపయోగపడే విషయాలు వీటిలో ఎక్కడా లేవు.అందులోనూ వీటికి అతుకుల బొంతలా అనేక చిల్లులు.ఒక న్యాయశాస్త్ర పట్టభద్రుడిగా నేను ఈ విషయం నమ్మకంగా చెప్పగలను.ఇక న్యాయం ఈ దేశంలో ఎలా బతుకుతుంది? ప్రస్తుతం నిందితులు పట్టుబడ్డారు అని చెబుతున్నారు. ఇలాంటి ఎన్నో కేసుల్లో గత అనుభవాల దృష్ట్యా ఇక్కడ ఏమి జరుగబోతున్నదో కొంచం ఆలోచిద్దాం. 

1.అసలు నిందితులు వీరో లేక ఎవరో అనామకులను తెచ్చి వీరే నిందితులని చూపుతున్నారో ఎవరికీ తెలియదు.అమ్మాయి స్నేహితుడు వారిని గుర్తుపట్టాడు అని మీడియాలో చెబుతున్నప్పటికీ, ఈ దేశపు పోలీసుల/న్యాయవ్యవస్థ యొక్క గతచరిత్రను బట్టి ఇలాంటి అనుమానం రాక తప్పదు. ఈ అనుమానం హాస్యాస్పదం గా కనిపించినప్పటికీ,మన వ్యవస్తలమీద  ఉన్న మన అపనమ్మకం వల్ల అలా ఆలోచించడం తప్పు కాదు. 

2.ఒకవేళ వీరే అసలు నిందితులు అనుకుందాం.పౌరుల ఆందోళనను ఇంతటితో ఆపితే మాత్రం ఈ క్షణం నుంచీ వీరిని కాపాడే ప్రక్రియ మొదలౌతుంది.ఇది మనం గత ఎన్నో కేసుల్లో చూచాం.వారు గనక 'కొన్ని' కులాలకు చెందిన వారైతే సమాజంలో అనేక వర్గాలు వీరిని కాపాడేందుకు హటాత్తుగా ముందుకొస్తాయి.

3.వీరిపైన మోపిన సెక్షన్ల ప్రకారం వీరికి ఉరి శిక్ష పడే అవకాశం లేదు. మహా అయితే యావజ్జీవశిక్ష పడుతుంది.అంటే ఒక పదేళ్ళ తర్వాత ఏదో కారణంతో వారు విడుదలై బయటకు వస్తారు. ప్రస్తుతం వీరంతా 20 ఏళ్ళ వారని అంటున్నారు గనుక అప్పటికి వారికి మహా అయితే 35 ఏళ్ళు వస్తాయి.ఈ అనుభవంతో వాళ్ళు మరీ రాటుదేలి,ఈసారి పట్టు బడకుండా ఎలా నేరాలు చెయ్యచ్చో చేసి చూపిస్తారు. అంటే మళ్ళీ ఒక 15 ఏళ్ళ తర్వాత ఇంకో కొందరు నిర్భయలు బలై పోతారు.ఇలాంటి కేసుల్లో శిక్ష పడి బయటకి వచ్చినవారు ఇంకా కసితో మరిన్ని నేరాలు చేస్తారనీ, రెండో సారి పట్టుబడకుండా తెలివిగా చేస్తారనీ గణాంకాలూ,చరిత్రా,మనస్తత్వ శాస్త్రమూ చెబుతున్నాయి.

4. ఒకవేళ వీరికి ఉరిశిక్ష పడింది అనుకుందాం.వెంటనే కొన్ని సంఘాలు ముఖ్యంగా ఆయా నేరస్తుల కులసంఘాలు తలెత్తుతాయి. 'ఉరిశిక్ష అమానవీయం, అమానుషం', 'నిందితులకు బుద్ధి లేకపోతే మనకు లేదా','ఉరిశిక్ష మానవత్వం అనిపించుకోదు' మొదలైన వాదనలు మొదలౌతాయి.ఇలా కొన్నేళ్ళు గడుస్తుంది. ఈలోపు వాదనలు కింది కోర్టు నుంచి సుప్రీం కోర్టు దాకా సాగి సాగి చివరిలో రాష్ట్రపతి యొక్క 'మెర్సీ పిటిషన్' దాకా వెళతాయి. ఈలోపు ఈ నేరస్తులను జైల్లో ఉంచి వారి కోరికలను తీర్చడానికి ఒక 100 కోట్లు ప్రజాధనం ఖర్చు అవుతుంది. ఏం? పరాయి దేశస్తుడైన కసబ్ కోసం 34 కోట్లు ఖర్చు పెట్టిన మనం, మన దేశ పౌరులే అయిన వీరికోసం ఆ మాత్రం ఖర్చు పెట్టలేమా?ఈలోపు ఏకారణంతో అయినా రాష్ట్రపతి కరుణిస్తే వీరికి మరణ దండన తప్పి,జైలు శిక్ష ఖాయం అవుతుంది.మళ్ళీ చరిత్ర పునరావృతం అవుతుంది.

5.కనుక ప్రజలు చేస్తున్న ఈ ఆందోళనను ఈ సమస్యకు సరైన పరిష్కారం వచ్చేవరకూ కొనసాగించవలసి ఉంటుంది.అటువంటి పట్టుదల మన ప్రజల్లో ఉందా?అన్నది ఒక అంతుచిక్కని ప్రశ్న.అది లోపిస్తే మాత్రం,ఈ కేసులో న్యాయం ఎట్టి పరిస్తితిలోనూ జరగదు.

6. పత్రికలూ టీవీలూ కూడా,పై పంధానే అనుసరించాలి.రెండు రోజుల తర్వాత ఈ న్యూస్ మానేసి,దీనిని కోల్డ్ స్తోరేజీలో పెట్టి, వేరే ఏవో న్యూసులు చూపడం కాకుండా,దీనికి పరిష్కారం వచ్చేవరకూ ఈ న్యూస్ ను సజీవంగా ఉంచాలి. ప్రజాగ్రహాన్ని ప్రజ్వరింప చేస్తూనే ఉండాలి.అప్పుడే ప్రభుత్వం కొంత కాకపోతే కొంతన్నా దిగివస్తుంది. ఎందుకంటే నేరస్తులను ఎదో రకంగా కొమ్ముకాసే వ్యాధి మన దేశంలో మొదట్నించీ ఉన్నది.దీనిని ఎత్తి చూపవలసిన మీడియానే అలసత్వ ధోరణి అవలంబిస్తే, ఇక మనకు ఏ దారీ లేదు.మన దేశంలో లెజిస్లేచరూ,జుడిషియరీ,ఎగ్జిక్యూటివూ  ముగ్గురూ ఘోరంగా ఫెయిల్ అయ్యారు.మిగిలిన ఒక్క ఆశాకిరణం మీడియా మాత్రమే.

మన వంతుగా ఏదో ఒక పోస్ట్ వ్రాసి ఊరుకున్నాం అనుకోకుండా, నిజంగా మీరు ఈ విషయంలో సీరియస్ గా ఆలోచించే వారైతే,మీమీ వ్యక్తిగత స్థాయిలోనూ,కుటుంబ స్థాయిలోనూ ఈ సమస్య మీద మీ బాధ్యత ఏమిటో,మీరేం చెయ్యాలో వచ్చే పోస్ట్ లో వ్రాస్తాను. ఆచరించే సత్తా మీలో ఉందా?