“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

5, సెప్టెంబర్ 2016, సోమవారం

మదర్ తెరెసా జాతకం - కొన్ని ఆలోచనలు

మదర్ తెరెసాకు నిన్న 'సెయింట్ హుడ్' ప్రదానం చెయ్యబడిన సందర్భంగా ఆమె జాతకాన్ని ఒకసారి పరిశీలిద్దాం.ఈ జాతకాన్ని వివరించమని చాలా కాలం నుంచీ కొందరు నన్ను కోరుతున్నారు.నా శిష్యురాళ్ళ లో ఈమెకు వీరాభిమానులు కొందరున్నారు. 

నిర్మొహమాటమైన నా అభిప్రాయాలతో వాళ్ళ మనస్సులు నొప్పించడం ఎందుకని ఇన్నాళ్ళూ వ్రాయలేదు.


అయినా, పోయినవాళ్ళ జాతకాలు వ్రాయడం మనకు వెన్నతో పెట్టిన విద్యకదా ! అందులోనూ ఈమెకు నోబుల్ ప్రైజూ వచ్చె.ఇప్పుడు సెయింట్ హుడ్ కూడా వచ్చె.ఇంకా రాయకపోతే ఎట్టాగబ్బా !

అయినా ఈ సెయింట్ హుడ్ ప్రదానం ఏంటో నా మట్టి బుర్రకు ఎప్పటికీ అర్ధం గాదు.సెయింట్ హుడ్ అనేది ఒకళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ వల్ల వస్తుందా? రావచ్చేమో మరి ! మనకు తెల్వద్...

ఇలాటివన్నీ మతప్రచారం కోసం చేసే జిమ్మిక్స్ అని నాకెక్కడో కొండొకచో ఒక పెద్ద అనుమానం. కానీ నా అనుమానాలు ఎవడిక్కావాలి? వాటికి విలువేముంది?

కనుక -  ఆ సంగతి అలా ఉంచి జాతకం వైపు దృష్టి సారిద్దాం.

ఈమె 26-8-1910 న సెంట్రల్ యూరప్ లోని స్కోపే అనే నగరంలో జన్మించింది. ఈ ప్రదేశానికి లాంగిట్యూడ్ 21 E 25; లాటిట్యూడ్ 41 N 59; Time Zone-+1.00 East of GMT.

ఆమె జనన సమయం ఇచ్చిన యాస్ట్రో డేటాబ్యాంక్ వారు ఈ సమయాన్ని conflicting/unverified అని అన్నారు గనుక ఇది నిజమని మనం నమ్మలేం. కానీ మనకు తెలిసిన జ్యోతిశ్శాస్త్ర సూత్రాల ప్రకారం ఈమె జన్మలగ్నం ధనుస్సు అవడానికి అవకాశం లేదు.ఈమె సన్నగా పొట్టిగా ఉండేవారు గనుక ధనుర్లగ్నం అవడానికి అవకాశం లేదు. నా ఉద్దేశ్యం ప్రకారం ఈమె లగ్నం కన్యలో రెండవ నవాంశ అయ్యి ఉండాలి. అంటే - ఉదయం 6.59 నుంచి 7.16 లోపు జనన సమయం అయి ఉంటుంది.

మనపని జననకాల సంస్కరణ కాదు గనుక ఆ విషయాన్ని అలా వదిలేద్దాం.

వక్రశని వల్ల ఈమెకు లోకంతో తీర్చుకోవాల్సిన ఖర్మ చాలా ఉన్నదన్న విషయం అర్ధమౌతున్నది. అది కూడా నీచశని కావడం వల్ల లోకం నీచంగా భావించే సేవాకర్మలైన రోగులకు, ముఖ్యంగా కుష్టు వాళ్ళకు, సేవ చెయ్యడం మొదలైన పనులు సూచింపబడుతున్నాయి. ఆమె చేసినది అదేగా మరి.

శనిచంద్ర సంయోగం ఆధ్యాత్మిక సంకేతం అయినప్పటికీ - శని నీచ స్థితివల్ల - ఈ ఆధ్యాత్మికత అనేది స్వచ్చమైనది కాదనీ - దీనివెనక మతమార్పిడి అనే ఒక అజెండా ఉందన్న విషయం కనిపిస్తున్నది.

ఉచ్ఛస్థితిలోని రాహుకేతువుల వల్ల ఈమె చేపట్టిన పనులలో కాలం చక్కగా కలసి వస్తుందన్న విషయం తేటతెల్లం అవుతున్నది.

చంద్రుని నుంచి ఆరింట ఉన్న గురు+ఉచ్చ బుదులవల్ల - మతసంబంధమైన తెలివైన కర్మ చేస్తుందని తెలుస్తున్నది. ఈ కర్మవల్ల ఈమెకు లోకప్రఖ్యాతి కలుగుతుందని కూడా సూచన ఇదే యోగం ఇస్తున్నది.

దశమాదిపతీ, సహజ వృత్తి కారకుడూ అయిన శనీశ్వరుడు చంద్రలగ్నంలో నీచస్థితిలో ఉండటం వల్ల - సేవారంగమే ఈమె వృత్తి అనేది స్పష్టంగా తెలుస్తున్నది. శనీశ్వరుని బాధకాదిపత్యం వల్ల, ఈ పనిని ఆమె ఎన్నో బాధలు సహించి చెయ్యవలసి ఉన్నదన్న "కార్మిక్ సిగ్నేచర్" కనపడుతున్నది.

నవాంశలోని ఉచ్ఛగురు+కేతువుల వల్ల మతపరమైన ఔన్నత్యమూ, నాయకత్వమూ కలసి వివాహాన్ని భంగం చేస్తాయన్న సూచన ఉన్నది.

లగ్నం ధనుస్సు అనుకుంటే - దశమంలో ఉచ్ఛ గురుబుధుల వల్ల మంచి మతపరమైన వృత్తి కనిపిస్తున్నది.దీనివల్ల పేరు ప్రఖ్యాతులూ కనిపిస్తున్నాయి. పంచమంలో నీచ శని చంద్రుల వల్ల ఈమె మనస్సు ఎప్పుడూ దీనులకు సేవ ఎలా చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుందని తెలుస్తున్నది.కానీ సప్తమాధిపతి అయిన బుధుడు ఉచ్చలో ఉన్నందువల్ల త్వరగా వివాహం అవ్వాలి.కనుక ధనుర్లగ్నం కరెక్ట్ కాకపోవచ్చు.

దీనికి ఇంకొక కారణం కూడా ఉన్నది.ధనుర్లగ్నమే అయితే - నవమంలో రవి కుజులవల్ల మతపరమైన బలం సూచింప బడుతూ ఉన్నప్పటికీ,ఈమెకు వచ్చిన పేరు ప్రఖ్యాతులు గమనించి చూస్తే - ఈ యోగం అంత బలంగా లేదు.

అదే మనం అనుకున్నట్లుగా - కన్యా లగ్నం అయితే - దశమాదిపతి అయిన బుధుడు లగ్నంలో ఉచ్చలో ఉన్నందువలన కూడా మతపరమైన ప్రఖ్యాత వృత్తి కనిపిస్తున్నది.బాధకుడైన సప్తమాధిపతి గురువు లగ్నంలో ఉన్నందువలన, తలపెట్టుకున్న పనికోసం,  అవివాహితగా ఉండిపోవడం కనిపిస్తున్నది.కనుక కన్యాలగ్నమే కరెక్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

కన్యా లగ్నం రెండో నవాంశ అయితే అది కుంభ నవాంశ అవుతుంది.కనుక అక్కడనుంచి సప్తమంలో ఉన్న శనీశ్వరుని వల్ల వివాహం అయ్యే అవకాశం లేదు.కనుక కన్య రెండో నవాంశ కావచ్చు అని నా ఉద్దేశ్యం.

అంతేగాక - కన్యాలగ్నం నుంచి నవమంలో ఉన్న ఉచ్ఛ రాహువు వల్ల - మతపరమైన ఔన్నత్యమూ - విదేశాలలో కార్యరంగమూ కనిపిస్తున్నాయి. కనుక కన్యకే మార్కులు ఎక్కువగా పడుతున్నాయి.

ఈ ప్రకారంగా ఉదయం 7.00 గంటలకు జనన సమయం అనుకుంటే - అప్పుడు కన్యాలగ్నం అవుతూ ఘటీ లగ్నం పంచమమైన మకరంలో పడుతున్నది.మకరం భారత దేశానికి సూచిక గనుక - భారత దేశంలో ఈమెకు పేరు ప్రఖ్యాతులు వస్తాయన్న సూచన స్పష్టంగా ఇది ఇస్తున్నది.కర్కాటకం నుంచి శుక్రుడు ఈ ఘటీలగ్నాన్ని చూస్తూ శుక్రదశలో ఈ గౌరవం దక్కుతుంది అని సూచిస్తున్నాడు.ఆమెకు ఇప్పుడు జరుగుతున్న దశ శుక్రదశే. ఎంత విచిత్రమో చూచారా?

జ్యోతిశ్శాస్త్ర సూత్రాలు ఎంత ఖచ్చితంగా పనిచేస్తాయో గమనిస్తే చాలా ఆశ్చర్యం కలుగుతుంది.దశలనేవి మనిషి చనిపోయిన తర్వాత కూడా పనిచేస్తూనే ఉంటాయన్నది అలాంటి ఆశ్చర్యకరమైన వాస్తవాలలో ఒకటి. అలాంటి ఆశ్చర్యకరములైన సూత్రాలలో నుంచి ఒక్క సూత్రాన్ని ఇప్పుడు పరిచయం చేస్తాను.

పేరు ప్రతిష్టలను ఘటీ లగ్నం నుంచి చూడాలి. ఈ ఘటీలగ్నం అనేది లగ్నాత్ అష్టమం అయింది.అంటే మరణానికి సంబంధించినది లేదా మరణం తర్వాత వచ్చే పేరు ప్రతిష్టలకు సూచనగా ఉన్నది.అక్కడే శుక్రుడున్నాడు. దశలను పొడిగించుకుంటూ వస్తే - ప్రస్తుతం ఆమెకు శుక్ర మహర్దశ జరుగుతున్నది.సరిగ్గా చెప్పాలంటే శుక్ర - సూర్య - కేతు దశ జరుగుతున్నది. సూర్యుడు నవమాధిపతిగా ఉండి ఈమెకు వచ్చే పేరు మతపరమైనదై ఉంటుందని సూచిస్తున్నాడు. కేతువు పన్నెండో ఇంటిలో ఉచ్ఛస్థితిలో ఉంటూ మరణానంతరం పట్టే యోగాన్ని సూచిస్తున్నాడు.ఇవన్నీ కలసి - ఆమెకు మరణానంతరం గొప్ప గౌరవం దక్కుతుంది అని చూపిస్తున్నాయి.అదికూడా జరిగే టైం స్లాట్ ను ఖచ్చితంగా సూచిస్తున్నాయి. కనుకనే ఆమె చనిపోయిన 18 ఏళ్ళ తర్వాత ఇప్పుడు ఆ దశలు జరిగే సమయంలో ఆమెకు 'సెయింట్ హుడ్' ప్రదానం చెయ్యబడింది.

ఇంకొక రహస్యాన్ని వినండి.

ఆమె చనిపోయిన 1997 లో రాహుకేతువులు ఏ రాశులలో ఉన్నారో ఇప్పుడు 18 ఏళ్ళ తర్వాత ఖచ్చితంగా అదే రాశులలో ఉన్నారు.కనుక కాలస్వరూపులైన రాహుకేతువుల అనుగ్రహం వల్లే ఈమెకు 'సెయింట్ హుడ్' ప్రదానం చెయ్యబడిందని కనిపిస్తున్నది.

ఒక మనిషి చనిపోయిన తర్వాత 18 గంటలు కూడా గుర్తుంచుకోని నేటి కాలంలో - 18 ఏళ్ళ తర్వాత కూడా బిరుదులూ గౌరవాలూ ప్రదానం చెయ్యబడుతున్నాయంటే ఆ జాతకం విశిష్టమైనదే అయ్యుండాలి.ఆ విశిష్టతలేమిటో పైన వివరించాను కదా !

ఎందుకంటే - ఒకే పనిని చేసిన అందరికీ ఒకే గౌరవం ఈలోకంలో దక్కదు.ఒక్కోసారి ఎక్కువ కష్టపడిన వారికి తక్కువ గౌరవం లభిస్తుంది.తక్కువ కష్టపడిన వారికి ఎక్కువ గౌరవం దక్కుతుంది.ఈలోకంలో ఇదొక విచిత్రం.ఇది అందరికీ తెలిసినా కొన్ని ఉదాహరణలిస్తాను.

మన దేశానికి స్వాతంత్రం రాకముందు దానికోసం ఎంతో కష్టపడి, ఆస్తులు, ప్రాణాలు పోగొట్టుకున్న వారు ఎందఱో ఉన్నారు.వారికి ఏ గుర్తింపూ రాలేదు.వారు ఏ సుఖాలూ అనుభవించలేదు.ఎవరికీ తెలియబడకుండా వారు మౌనంగా కాలగర్భంలో కలసిపోయారు.కానీ నేడు ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగం చేస్తున్న నాయకులు మాత్రం అప్పటి స్వతంత్ర సమర యోధుల పేర్లు చెప్పుకుని స్వర్గసుఖాలను ఇక్కడే అనుభవిస్తున్నారు.కంటి తుడుపుగా వాళ్ళ 'దినాల' నాడు జెండా ఎగరేసి ఒక సెల్యూట్ కొడతారు.సరిపోతుంది.

సొమ్మొకడిది సోకొకడిది అంటే ఇదేగా మరి !!

అలాగే - మదర్ తెరెసా కంటే ఎంతో ముందు, ఇంకా ఎన్నో దుర్భర పరిస్థితులను ఎదుర్కొని, ఈమెకంటే ఇంకా ఎంతో ఎక్కువ సేవ చేసిన గౌరీమా, సిస్టర్ నివేదిత, సిస్టర్ క్రిస్టీన్ మొదలైన మహోన్నత త్యాగమూర్తులు మనకిప్పుడు గుర్తే లేరు.నిజానికి వారికి ఎన్ని నోబుల్ ప్రైజులిచ్చినా తక్కువే. వారికి 'సెయింట్ హుడ్' మనం ఇవ్వనక్కరలేదు. అది భగవంతుడే ఇచ్చాడు. అయినా - ఒకరికి సెయింట్ హుడ్ ఇవ్వడానికి మన తాహతెంత? అలా ఇవ్వడానికి వాళ్ళకంటే మనం ఎక్కువా?

ఈలోకం ఇంతే. అసలైన వ్యక్తులకు ఇక్కడ గుర్తింపు ఎప్పటికీ ఉండదు. ఎవరికైతే బలమైన ఒక వ్యవస్థ యొక్క సపోర్ట్ ఉంటుందో, ఎవరికైతే ధనబలం ఉంటుందో, ఎవరికైతే మంచి మార్కెటింగ్ నెట్వర్క్ ఉంటుందో - వాళ్ళే ఈలోకంలో చెలామణీ అవుతారు.ఇవి లేనివారు - వారెంత నిజమైన మహానీయులైనా సరే - ఊరూ పేరూ లేకుండా ఉండిపోతారు.మట్టిలో కలసిపోతారు.

మాయ అంటే ఇదే.

లోకమంతా మాయలోనే పడి ఉంది మరి !!

నాకు క్రిస్టియానిటీ అంటే ఏమీ ద్వేషం లేదు. క్రీస్తంటే నాకు గౌరవమే. శ్రీరామకృష్ణుల భక్తుడినైన నేను క్రీస్తును ఒక సెయింట్ గా తలుస్తాను. కానీ నేటి క్రైస్తవం చేసే మాయలంటే మాత్రం నాకేమాత్రమూ పడదు.

ఎక్కడో జరిగిన రెండు అద్భుతాల పరంగా నేడు ఈమెకు సెయింట్ హుడ్ ఇస్తున్నామని అంటున్నారు.కానీ మదర్ తెరెసా చనిపోవడానికి ముందు ఆమె మానసిక పరిస్థితి ఎలా ఉన్నదో వీళ్ళు మరచిపోతున్నారు.

చివరి రోజులలో ఆమె ఒక సైకలాజికల్ పేషంట్ గా మారింది. సైతాన్ ఏ మూలనుంచి తనను ఎటాక్ చేస్తుందో నని అనుక్షణం భయపడుతూ, గదిలో ఒక మూలలో నక్కి - 'జీసస్ సేవ్ మీ' అని గొణుక్కుంటూ ఉండేది.అలాంటి మానసిక పరిస్థితిలో ఆమె తనువు చాలించింది. ఈ విషయాలను ఆమెకు పర్సనల్ సేవకురాలైన సిస్టర్ నిర్మల స్వయానా వెల్లడించింది.

మరణానికి ముందు ఉన్న మానసిక స్థితే ఆ తర్వాత కూడా ఉంటుందనేది భగవద్గీత మాత్రమే చెప్పిన సత్యం కాదు. నేటి పారా నార్మల్ రీసెర్చి కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తోంది. మరి అదే నిజమైతే - అటువంటి బాధాకరమైన మానసిక పరిస్థితిలో తనువు చాలించిన వ్యక్తి 'సెయింట్' ఎలా అవుతుందో నాకైతే అర్ధం కాదు.

మనం ఏదైనా నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలి. మదర్ తెరెసా మన దేశానికి తెచ్చిన చెడ్డ పేరు చాలా ఉంది.

దేశదేశాలలో తిరిగి - ఇండియా పరమ దరిద్ర దేశం - అక్కడ మురికీ, రోగాలూ, మాల్ న్యూట్రిషనూ, మూఢనమ్మకాలూ, అవినీతీ తప్ప ఇంకేమీ లేవని ప్రచారం చేసి - అక్కడి ఆడవారినీ పిల్లలనూ ఆదుకోవాలని అర్ధించి - ఇదంతా విని 'అయ్యో పాపం' అంటూ మనసు కరిగిపోయిన విదేశీయులు దానం చేసిన డబ్బుతో ఇక్కడ సేవా కార్యక్రమాలను ఆమె చేసింది.పనిలో పనిగా మతమార్పిడులూ చేసింది. ఏ మిషనరీ అయినా ఇదే చేస్తాడు ఇది విచిత్రం ఏమీ కాదు.

ఈ క్రమంలో - విదేశాల దృష్టిలో - మన దేశపు ఇమేజి చాలా దిగజారిపోయింది.

మన దేశం అంటే వెస్ట్ లో చాలా నీచమైన అభిప్రాయం ఎప్పటినుంచో ఉన్నది. మన ఫిలాసఫీ ఆధ్యాత్మికతా తెలిసిన కొందరికి తప్ప మిగిలిన విదేశీయులందరికీ ఇండియా అంటే ఒక నరకంతో సమానం. ఈనాటికీ ఇదే మన ఇమేజి. ఇలాంటి ఇమేజిని మదర్ లాంటి వారి చర్యలు మరీ ఎక్కువ చేశాయి. అయితే దీనికి ఆమెను తప్పు పట్టవలసిన పని లేదు. దీనికి కారకులు మన నాయకులే. ఇలాంటి మదర్లను సపోర్ట్ చేస్తున్నది వాళ్ళేగా?

స్వతంత్రం వచ్చి ఇన్నాళ్ళౌతున్నా - జనాభా 130 కోట్లు దాటిపోతున్నా - ప్రకృతి సహజ వనరులు రోజురోజుకీ దిగనాసిల్లి పోతున్నా - ఏమీ చెయ్యకుండా - ఎవరి దోపిడీ వాళ్ళు నిస్సిగ్గుగా కొనసాగిస్తున్న నాయకులదే ఈ తప్పు. వీరి వల్లనే - స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు అవుతున్నా - ప్రపంచ దేశాలలో మనదేశం ఇంకా దరిద్రదేశం గానే గుర్తింపబడుతూ ఉన్నది.

స్వతంత్రం రాకముందు బ్రిటిష్ వాడి దోపిడీ వల్ల మన దేశంలో దరిద్రం ఉందంటే - పోనీలే అనుకోవచ్చు.కానీ ఈ 70 ఏళ్ళలో మనం ఒరగబెట్టింది ఏమిటి? ప్రపంచ దేశాలు దానం చేస్తే ఆ డబ్బుతో మన దేశంలోని కుష్టురోగులకూ, పిల్లలకూ, ఆడవారికీ సేవ చేసుకుంటూ వారిని బ్రతికించుకునేటంత హీనస్థితిలో ఉన్నామా మనం? ఒకవేళ ఉంటే మాత్రం - అలా ఉన్నందుకు మనమందరమూ చాలా సిగ్గుపడాలి.

ఈనాడు మదర్ తెరెసా, సెయింట్ తెరెసా అయింది. కానీ అదే సమయంలో - ప్రపంచ దేశాల వేదికమీద ఈ అవార్డును ప్రదానం చేస్తున్న విదేశీయులు - "మన దేశాలనుంచి వెళ్లి ఇండియాలోని దరిద్రులకూ, కుష్టురోగులకూ సేవ చేస్తూ, ఒక మురికి ఇండియానూ - ఒక దరిద్రపు ఇండియానూ ఉద్ధరిస్తూ ప్రాణాలు పణంగా పెట్టి, అదేపనిలో తనువు చాలించిన మహనీయురాలు" అని ఇచ్చే ఉపన్యాసాలు విన్నపుడు మాత్రం నా మనస్సు చివుక్కు మంటుంది.

విదేశాలు మన దేశం గురించి ఇలా మాట్లాడుతూ - హేళనగా నవ్వుతూ ఉండే అవకాశం మనం వారికి ఎందుకివ్వాలి? ఎవరో వచ్చి మన దేశాన్ని బాగుచెయ్యాలా? మనమే ఆపనిని చేసుకోలేమా?

ఏం? మనకు నాయకులు లేరా? వనరులు లేవా? తెలివితేటలు లేవా? సమర్ధులైన ప్రజలు లేరా? వ్యవస్థలు లేవా? మన దేశాన్ని మనమే బాగుచేసుకోలేమా? ఆ పనికి మత సేవాసంస్థలు అవసరమా?

స్వతంత్రం వచ్చి 70 ఏళ్ళు గడిచాక కూడా సోషల్ సర్వీస్ అంటూ కొన్ని సంస్థలు - ప్రభుత్వం చెయ్యవలసిన పనినీ - పౌరులు తాము చేసుకోవలసిన పనినీ - అవి చెయ్యడం అవసరమా? అందులోనూ మతపరమైన సంస్థలు - మతమార్పిళ్లు చేస్తూ - 'ఇలాంటి సేవలు' చెయ్యడం, మనం చేయించుకోవడం, అలా చేసిన వారికి బిరుదులు ప్రదానం చేసి చంకలు చరుచుకోవడం అవసరమా? మనకు కాస్తైనా ఆత్మాభిమానం అక్కరలేదా?

ఆలోచించండి.