“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

12, జూన్ 2015, శుక్రవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు -12

అప్పారావుగారు చెప్పడాన్ని కొనసాగించారు.

'మరి నాకు ఇదంతా అనిపించాలంటే ఏం చెయ్యాలమ్మా?'- అడిగాను.

దానికి అమ్మనుంచి ఒక అద్భుతమైన జవాబు వచ్చింది.

'ముందు అనుకో నాన్నా.తరువాత అనిపిస్తుంది'

ఏం మాట !!!

'ముందు సాధన చెయ్యి. దాని అనుగుణంగా సిద్ధి కలుగుతుంది.'--అని ఆ మాటకు అర్ధం.


అమ్మ మాటలన్నీ ఇంతే.ఆ మాటలు చాలా మామూలు మాటలు.రోజువారీగా మనం మాట్లాడుకునే మాటలు.కానీ వాటిల్లో ఎంత లోతు ఉంటుందో అది గ్రహించినవారికే అర్ధమౌతుంది.

శ్రీరామకృష్ణులు కూడా ఇంతే.ఆయన కూడా అతి మామూలు మాటల్లో అత్యున్నతమైన వేదాంతాన్ని ఇమిడ్చి చెప్పేవారు.ఈ కోణాన్ని వీరిద్దరి దగ్గరే మనం చూడగలం.ప్రపంచ ఆధ్యాత్మిక చరిత్రలో ఇంకెక్కడా ఇది కనిపించదు.

నాకు ఇంకొక సందేహం ఉండేది.

ఈ విశ్వంలో ఎన్నో గోళాలున్నాయి.ఎన్నో లోకాలున్నాయి.'అనేకకోటి బ్రహ్మాండజననీ దివ్యవిగ్రహా..' అని లలితా సహస్రం కూడా అంటుంది.అలాగే తంత్రశాస్త్రం ప్రకారం - విశ్వంలో ఉన్నవే మన శరీరంలో కూడా ఉన్నాయి.ఈ రెంటికీ సమన్వయము ఎలా కుదురుతుంది?విశ్వంలో ఉన్నవి మన శరీరంలో ఎలా ఉంటాయి?ఎక్కడున్నాయి?మన శరీరమే విశ్వం ఎలా అవుతుంది? అని నాకు చాలా సందేహం ఉండేది.దీనిని అమ్మ ఒక అనుభవం ఇవ్వడం ద్వారా అర్ధమయ్యేలా చేసింది.

ఒకరోజున ధ్యానంలో కూర్చుని ఉన్నాను.అకస్మాత్తుగా ఒక అనుభవం కలగడం మొదలైంది.గమనిస్తూ ఉన్నాను.

ఉన్నట్టుండి నా శరీరంలో ఉన్న కణాలన్నీ దేనికవి విడివిడిగా అయిపోయినట్లు కనిపించింది.శరీరపు హద్దులు(boundaries)అలాగే ఉన్నాయి.కానీ లోపల ఉండే అవయవాలన్నీ అనేకానేక కణాలుగా విడిపోయి దేనికది ఒక ప్రత్యేకమైన వెలుగుతో కూడిన కణంగా శరీరపు బౌండరీ లోపలే నిలిచి ఉన్నది.అనేక కోట్లాది కణాలు అలా విడివిడిగా శరీరం అంతా నిలిచి దేనికదే విడివిడిగా వెలుగుతూ ఉన్నాయి.నేను చూస్తూనే ఉన్నాను. ఓహో ఇదా 'అనేకకోటి బ్రహ్మాండాలు' అన్నదానికి అర్ధం? అనిపించింది.

అలా చూస్తుండగానే--ఉన్నట్టుండి నా శరీరపు హద్దులు(boundaries) కూడా చెరిగిపోయాయి.ఆ కణాలన్నీ చెల్లాచెదురై పోయి చుట్టూ ఉన్న శూన్యంలో విస్తరించిపోయాయి.అంటే నా పరిధి విశ్వపు పరిధితో ఒకటై పోయింది.ఉత్త 'నేను' అన్న స్పృహ ఒక్కటే మిగిలి ఉన్నది.అలా కొంతసేపు అయిన తర్వాత మళ్ళీ శరీరపు హద్దులు తెలియడం మొదలైంది. అంతా వ్యాపించి ఉన్న 'నేను' కుదింపబడి 'ఈ శరీరాన్నే నేను' అన్న స్పృహగా ఘనీభవించింది. అప్పుడు మళ్ళీ -'నేనీ శరీరాన్ని'- అన్న స్పృహ కలిగింది.

అంటే -- విశ్వంలో అనేక సోలార్ సిస్టమ్స్ ఉన్నట్లే శరీరంలో కోట్లాది కణాలున్నాయి.ఒక్కొక్క కణం ఒక్కొక్క సూర్యమండలమే.వెరసి మన దేహమే ఒక విశ్వం.దీనినే తంత్రశాస్త్రం చెప్పింది.ఈ అనుభవాన్ని అమ్మ ఒకరోజున నాకు ధ్యానంలో ఇచ్చింది.

నేనేం అడిగినా అమ్మ మాటలతో జవాబు ఇవ్వడమే గాక,ఒక అంతరిక అనుభవం ద్వారా కూడా సమాధానం చెప్పేది.ఆ విధంగా ఆ విషయాన్ని ప్రాక్టికల్ గా అర్ధమయ్యేలా చేసేది.అమ్మ బోధించే విధానం అలా విలక్షణంగా ఉండేది.

నిజమైన ఆధ్యాత్మికత అంటే గ్రంధపాండిత్యం కాదనీ అనుభవజ్ఞానం అనీ నేను నమ్మే విషయాన్నే అప్పారావన్నయ్య కూడా చెప్పడంతో వింటున్న నాకు ఆనందం కలిగింది.

'ధ్యానం అంటే శ్వాసమీద ధ్యాస'- అని ఈ మధ్యన కొందరు ప్రచారం చేస్తున్నారు.నిజానికి ఇది అమ్మ ఎప్పుడో ఏభై ఏళ్ళ క్రితం చెప్పిన వాక్యం.కానీ దానిని నేడు కొందరు కాపీకొట్టి వాళ్ళదిగా ప్రచారం చేసుకుంటున్నారు. అమ్మ నాతోనే ఈ మాట చెప్పింది.

'శ్వాసమీద నిఘా వెయ్యి నాన్నా'-- అని అమ్మ నాతో ఒకసారి అన్నది. మొదట్లో తను ఏం చెయ్యమంటున్నదో నాకు అర్ధమయ్యేది కాదు.శ్వాస మీద నిఘా ఉంచితే ఏమౌతుంది?ముక్కులోనుంచి శ్వాస రావడం పోవడం తెలిసేది .ఆ తర్వాత ఏమి చెయ్యాలో అర్ధమయ్యేది కాదు.

ఏదైనా ఇంతే.అమ్మ ఎక్కువగా వివరించి చెప్పదు.సూక్ష్మంగా చెబుతుంది. అనుభవాన్ని ధ్యానంలోనో నిత్యజీవితంలోనో ఇస్తుంది.మనం అర్ధం చేసుకోవాలి.

శ్వాసమీద నిఘా వెయ్యడం మొదలుపెట్టాను.క్రమంగా ఆలోచన మొదలైంది. శ్వాసకు మూలం ఎక్కడుంది అని చూడగా ఊపిరితిత్తుల చలనం వల్ల,వాటి సంకోచ వ్యాకోచాల వల్ల శ్వాస కలుగుతున్నదనే స్పృహ మొదలైంది. ఆ ఊపిరితిత్తుల కదలికకు మూలం ఎక్కడుంది అని వెదికాను.అప్పుడు నా స్పృహ అప్రయత్నంగా వెన్నులోకి పోయింది. వెన్నుపాము లోని నాడీకేంద్రాల సూచనల వల్ల, అక్కడనుంచి నిరంతరం వస్తున్న స్పందనలవల్ల ఊపిరితిత్తులు ఆడుతున్నాయన్న అనుభవం వచ్చింది.ఆ తర్వాత వెన్ను అడుగున ఉన్న మూలాధారం నుంచి తలలో ఉన్న సహస్రారం వరకూ ప్రాణప్రవాహం తెలిసింది.ఆ తర్వాత కాలి వేళ్ళనుంచి తలవెంట్రుకల వరకూ ప్రాణప్రవాహం అనుభవమైంది.ప్రాణసంచారం షట్ చక్రాలలోనే కాదు. అరికాళ్ళనుంచి తల చివరవరకూ ఉంటుంది.ఇదంతా అమ్మ అనుగ్రహించిన అనుభవమే.నా ప్రయత్నం ఏమీ లేకుండానే ఇదంతా జరిగింది.దీనినే నా పుస్తకంలో వ్రాశాను' అన్నారు అప్పారావన్నయ్య. 

ఆ అనుభవాలు నిజాలే కావడంతో వింటున్న నాకు చాలా ఆనందం కలిగింది.

'అన్నయ్యా. మీరు అమ్మతో ఎంతో చనువుగా మసలేవారు.అమ్మ జీవితంలో జరిగిన ఎన్నో సంఘటనలను దగ్గరగా చూచారు కదా. పుస్తకాలలో ఎక్కడా రికార్డ్ కాని సంఘటనలు మీకేమైనా తెలిస్తే చెప్పండి". అని అడిగాను. 

'ఉన్నాయి. చెప్తాను' అంటూ మొదలు పెట్టారాయన.

షిరిడీ సాయిబాబా జీవితంలో  ఒక సంఘటన ఉన్నది.ఆయన మూడురోజుల పాటు సమాధిస్థితిలో ఉండి ఎక్కడికో పోయి ఆ తర్వాత మళ్ళీ లేచాడు.అలాంటి సంఘటనే అమ్మ జీవితంలో జరిగింది. ఒకరోజున అమ్మ కొమ్మూరు డాక్టరు గారితో ఇలా చెప్పింది.

'నేను మూడురోజులపాటు సమాధిలో ఉంటాను.ఆ మూడు రోజులూ నా శరీరాన్ని జాగ్రత్తగా సంరక్షించండి' అని చెప్పి అమ్మ నిద్రపోతున్నట్లుగా పడుకుంది.కాసేపటికి డాక్టరు పరీక్షించగా శ్వాస లేదు.నాడి ఆగిపోయి ఉన్నది. అయితే శరీరం చల్లబడలేదు. మూడు రోజులూ అమ్మ పక్కనే ఉండి అమ్మ చెప్పినట్లే జాగ్రత్తగా అమ్మను చూచుకుంటూ ఉన్నాము. మూడు రోజుల తర్వాత ఊపిరి ఆడటం మొదలైంది. నాడి కొట్టుకోవడం మొదలైంది. మేము చూస్తుండగానే అమ్మ కదిలి లేచి కూచున్నది.

ఇది మా కళ్ళ ఎదురుగా జరిగిన సంఘటన. కానీ ఈ  విషయం పుస్తకాలలోకి ఎక్కడా రాలేదు.  

గ్రంధస్థాలు కానివి ఇలాంటివి చాలా సంఘటనలు ఉన్నాయి.నాకు గుర్తున్న ఇంకొక సంఘటన చెబుతాను.

ఒకసారి అమ్మ వెనుక భాగంలో పెద్ద దోసకాయంత గడ్డ లేచింది.మొదట్లో అది కేన్సరేమో అని భయపడ్డారు. తర్వాత కాదని పరీక్షలలో తెలిసింది.తెంపు లేకుండా వస్తున్న భక్తులకు దర్శనానికి ఇబ్బంది లేకుండా ఉండటానికోసం ఒక ఏర్పాటు చెశారు.ఒక కుర్చీలో ఒక స్కూటరు టైరు ఉంచి దానిపక్కనే ఎత్తు సమానంగా ఉండటానికి గుడ్డలు పేర్చి ఆ టైరు గుంటలో ఆ గడ్డ ఇమిడేలా అమ్మను కూర్చోబెట్టి భక్తులకు దర్శనం ఇప్పించేవారు.

రాన్రాను ఆ గడ్డతో చాలా ఇబ్బంది అయ్యింది.అప్పుడే నా పుట్టినరోజు వచ్చింది.ప్రతి పుట్టినరోజుకూ నేనెక్కడున్నా అమ్మ దగ్గరకు వచ్చి అమ్మతో తలకు నూనె రాయించుకుని స్నానంచేసి కొత్త బట్టలు కట్టుకుని అమ్మ చేతితో ముద్దలు తినడం నా అలవాటు. అందుకని యధాప్రకారం ఆరోజుకూడా వచ్చాను. అప్పుడు అమ్మ ఆ గడ్డతో బాధపడుతూ ఉన్నారు.మేమంతా బయట వేచి చూస్తూ ఉన్నాము. 

లోపల తన పక్కనే ఉన్న డాక్టరు గారితో అమ్మ ఇలా చెప్పింది.

'ఒక కొత్త బ్లేడు తెప్పించి ఆ గడ్డను కోసి పారెయ్యండి'

వింటున్న అందరూ డాక్టరుతో సహా దిమ్మెరపోయారు ఆమాట విని. 

'అదేంటమ్మా? మత్తు ఇవ్వకుండా ఆ గడ్డను బ్లేడుతో ఎలా కొయ్యమంటావు? అమ్మో మేం చెయ్యలేము.' అన్నారు.

ఈరోజుకీ ఆ గ్రామంలో డాక్టరు లేడు.ఇక నలభై ఏభై ఏళ్ళ క్రితం,ఆ కుగ్రామంలో ఎనస్తీషియా,ఆపరేషన్ థియేటరూ ఎక్కడనుంచి వస్తాయి?

వాళ్ళ మాటలకు అమ్మ ససేమిరా ఒప్పుకోలేదు.చివరకు అమ్మ చెప్పినట్లే ఒక కొత్త బ్లేడు తెప్పించి దానితో ఆ గడ్డను పరపరా కోసి పారేశారు. దానిలోనుంచి బోలెడంత చీమూ నెత్తురూ వచ్చాయి.ఆ విధంగా వాళ్ళు తన ఒంటిని కోస్తుంటే, "కోస్తున్నది తన ఒంటిని కాదు" అన్నట్లు అమ్మ నిర్వికారంగా చూస్తూ ఉన్నది.కనీసం కళ్ళలోనైనా, ఇసుమంత బాధకూడా లేదు.రమణమహర్షి చేతిమీద కేన్సర్ పుండు లేస్తే దానిని మత్తు ఇవ్వకుండా కోస్తే మహర్షికూడా ఇలాగే ఏమాత్రం చలించకుండా కోయించుకున్నారని చదివాం.కానీ ఈ సంఘటన మా కళ్ళ ఎదురుగానే జరిగింది.అయితే, ఇది కూడా పుస్తకాలలో ఎక్కడా రికార్డ్ కాబడలేదు.' అన్నారు అన్నయ్య. 

'అన్నయ్యా. ఈ సంఘటన జరిగినప్పుడు మీరు ఎదురుగా ఉండి చూచారా?' అని నేను అడిగాను.

'ఉన్నాను. అయితే ఆ గదిలో నేను లేను. చెప్పాగా మేమంతా బయట వేచి ఉన్నాం అమ్మ దర్శనం కోసం. ఆ సమయంలో ఈ సంఘటన జరిగింది. జరిగిన వెంటనే అలాగే కట్లు వేశారు. ఆ వెంటనే నన్ను లోపలకు  రమ్మని అమ్మ పిలిచింది.వెళ్లాను. ఏమీ జరగనట్లుగా అమ్మ మామూలుగా కూచుని ఉన్నది. యధాప్రకారం నాకు తలకు నూనె పెట్టి, కొత్త బట్టలు పెట్టి,  నోట్లో ముద్దలు పెట్టింది.

ఇది ఎలా సంభవం? అంతగా శరీరంతో సంబంధం లేకుండా ఎలా ఉండగలుగుతారు? అని నాకు చెప్పలేని సందేహం కలిగింది.మా కళ్ళ ఎదురుగానే ఇది జరిగింది కనుక నమ్మకుండా ఉండలేము.కానీ ఇదెలా సాధ్యం?ఎవరైనా సరే ఈ విధంగా ఎలా ఉండగలరు?'- అని నాకనిపించింది.ఆ తర్వాత  ఒకరోజున ఒక అనుభవం ద్వారానే అమ్మ జవాబు చెప్పింది.

ఆ రోజుల్లో అమ్మ ఆరోగ్యం త్వరగా కుదురుకోవాలని ఏకాహం చేసేవాళ్ళం. అందులో నేనూ ఉన్నాను.భజనలో కూర్చుని అమ్మను తలచుకొని ఏడుస్తున్నాను. ఇంతలో ఒక అద్భుతం జరిగింది.

అక్కడ కమలమ్మగారని ఒక సాధకురాలు ఉండేవారు.భజన జరుగుతుండగా ఆమె హటాత్తుగా నా దగ్గరకు వచ్చి నా నెత్తిమీద తన అరికాలు ఉంచింది.

వెంటనే నాకొక అద్భుతమైన అనుభవం కలగడం మొదలైంది.

మామూలుగా 'నేను' అన్న స్పృహ ఎవరికైనా దేహంవరకే ఉంటుంది కదా. ఎప్పుడైతే కమలమ్మ గారు తన అరికాలిని  నా తలపైన ఉంచిందో వెంటనే నా 'నేను' అన్న స్పృహ అకస్మాత్తుగా విస్తరించి ఆ గది అంతా నిండిపోయింది. అంటే భజన జరుగుతున్న గది నిండా నేనే ఉన్నాను. నాలోనే ఆ గదీ, గదిలో భజన చేస్తున్న మనుషులూ, కమలమ్మగారూ, ఏడుస్తున్న నేనూ-- అన్నీ ఉన్నాయి. ఇదెంత విచిత్రమో గమనించారా? రూమంతా నిండిన 'నేను' తనలో ఉన్న ఏడుస్తున్న 'నేను' ను నవ్వుతూ చూస్తున్నది.అప్పటి విస్తరించిన 'నేను' లో ఏ బాధా లేదు. అది ఆనందంగా ఉన్నది.తనలో ఉన్న ఏడుస్తున్న 'నేను' ను అది నవ్వుతూ చూస్తున్నది. ఆ స్పృహ కొద్దిసేపు మాత్రమే నాకు ఉన్నది. ఎప్పుడైతే కమలమ్మగారు తన పాదాన్ని నా తలమీద నుంచి తీసేసిందో ఆ అనుభూతి వెంటనే మాయమై పోయింది. సడెన్ గా నా పరిధి మళ్ళీ నా దేహానికి కుంచించబడింది. మళ్ళీ నేను మునుపటిలా ఏడుస్తూ అందరిలో కూచుని ఉన్నాను.అంటే ఒకే దేహంలో ఇద్దరు ఉన్నట్లు అన్నమాట.ఒక పెద్దనేను.ఇంకొక చిన్న నేను.అయితే, పెద్ద నేనులో దేహం ఉన్నది.దేహంలో చిన్ననేను ఉన్నది' అన్నారు అన్నయ్య.

'ఉపనిషత్తులలో చెప్పబడిన ఒకే చెట్టుమీద ఉన్న రెండుపక్షుల లాగానా?' అన్నాను నేను.

'ఆ! ఆ! అదే! అదే!' అన్నారు అన్నయ్య ఆనందంతో. 

ఆ విధంగా శరీరంలో ఉంటూ కూడా దానితో ఎలాంటి సంబంధం లేకుండా ఎలా ఉండవచ్చో అమ్మ ప్రత్యక్షంగా నాకు అలాంటి అనుభవాన్ని ఇవ్వడం ద్వారా నిరూపించింది.అమ్మ ఇలాగే చేస్తుంది.తానే స్వయంగా కాక,ఇతరుల ద్వారాకూడా మనకు అనుభవాలు కలిగించే శక్తి అమ్మదగ్గర ఉండేది.అప్పుడు నాకర్ధమైంది.వారి శరీరాలను కోస్తున్నా కూడా చలనం లేకుండా మహనీయులు ఎలా ఉంటారో? ' అన్నారు అన్నయ్య.

నేను మౌనంగా వింటున్నాను.

ధ్యానంలో  ఇలాంటి అనుభవాలు కలిగేమాట నిజమే.

'నేను' అనే feeling కి రెండు స్థితులున్నాయి. ఒకటి -- శరీరానికి పరిమితమైన చిన్ననేను (localized 'I').రెండు -- శరీరపు పరిధిని దాటి అనంతంగా విస్తరించిన నేను (expanded 'I').ఈ రెండవ స్థితిలో ఉన్నపుడు విశ్వమే తన శరీరం అవుతుంది."విశ్వం విష్ణు:"-అని విష్ణుసహస్ర నామాల మొదట్లోనే ఉంటుంది.అలాంటి స్థితిలో ఈ భూమే తనలోని ఒక ధూళికణం అయి కూచుంటుంది.ఇక ఆ భూమిలో ఉండే తన శరీరం ఎంత? ఆ శరీరంలో ఉండే ఒక కురుపు ఎంత?దానిని కోస్తుంటే బాధ ఎందుకుంటుంది?క్షవరం చేయించుకుంటే మనకు బాధ ఉంటుందా? గోళ్ళు కత్తిరించుకుంటున్నప్పుడు మనకు బాధ ఉంటుందా? ఇదీ అంతే. మహనీయులు విశ్వవ్యాప్తమైన విష్ణుస్థితిలో ఉంటారు గనుక వారికి శరీరస్పృహ ఉండదు. ఆ స్థితి మనకు అనుభవంలో లేదు గనుక అది మనకు ఎంతో వింతగా ఉంటుంది.అంతే.

నా ఆలోచనను భగ్నం చేస్తూ--'అయితే ఈ అనుభవాలన్నీ ఇప్పుడుకూడా నాతో ఉన్నయ్యా? అంటే-- లేవు.ఆ సమయంలో అమ్మ వాటిని ఇచ్చింది. అంతే.ఇప్పుడు కావాలంటే కూడా ఆ అనుభవాలు రావు. కానీ ఆ జ్ఞాపకాలు నాకు ఇప్పటికీ ఉన్నాయి.' అన్నారాయన.

మా శ్రీమతీ, పిల్లలూ ఈ సంభాషణను మౌనంగా వింటున్నారు.

సమయం రాత్రి పది అయింది.ఇక ఎక్కువగా ఆయనను ఇబ్బంది పెట్టకూడదని, -- ' సంతోషం అన్నయ్యా. ఎప్పటివో సంగతులను మాకోసం చెప్పారు.బాగా లేటైంది.ఇంక విశ్రాంతి తీసుకోండి. మేం బయలుదేరతాం' అని లేచాను.

'సరే. మీరు ఇలా వచ్చి అలా పోవడం కాదు.ఒక రెండు మూడు రోజులు ఉండేలాగా వచ్చి మీ పుస్తకాన్ని మీ నోటితోనే మాకు వివరిస్తే బాగుంటుంది. మేం అందరం వింటాము. మీరు ఇక్కడ ఉండే ఏర్పాట్లు నేను చేస్తాను.' అన్నారాయన.

అది జరుగుతుందని నాకు అనిపించలేదు.ఎందుకంటే,అలా పురాణం చెప్పినట్లు చెప్పడం నాకిష్టం ఉండదు.

'ప్రయత్నిస్తాను అన్నయ్యా' అని లేచాను.

అందరం అన్నయ్యకు నమస్కరించి సెలవు తీసుకుని, కారెక్కి గుంటూరు దారి పట్టాము.కారు జిల్లెళ్లమూడి వదిలి రోడ్డెక్కి పెదనందిపాడు వైపు దూసుకుపోతున్నది.గుంటూరు చేరేసరికి రాత్రి పన్నెండు అయింది.

దారిలో పెద్దగా ఎవరమూ మాట్లాడుకోలేదు.

అమ్మ రూపం మా అంతరంగాలలో మెదులుతూ నవ్వుతూ మమ్మల్ని చూస్తున్నట్లు అనిపించింది.