“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

8, జులై 2012, ఆదివారం

రాహుకేతువుల ఆవృత్తులు - ప్రపంచవ్యాప్త సంఘటనలు- ఒక పరిశీలన

రాహుకేతువులు ఛాయాగ్రహాలైనప్పటికీ వాటి ప్రభావం భూమ్మీద అమితంగా ఉంటుంది అనేది సత్యం.  వీటియొక్క విద్యుత్ అయస్కాంతప్రభావం భూమిమీద ఖచ్చితంగా ఉంటుంది అని ఎన్నో సార్లు రుజువైంది. వీటి యొక్క సైక్లిక్ మూమెంట్ వల్ల అనేక సంఘటనలు భూమ్మీద యాక్టివేట్ అవుతుంటాయి.ఈ రాహుకేతువులు రాశిచక్రాన్ని ఒకసారి చుట్టి రావడానికి 18 ఏళ్ళు పడుతుంది. కనుక ప్రతి 18 ఏళ్ళకూ వీటియొక్క ఒక సైకిల్ పూర్తి అవుతుంది. అందుకనే మనిషి జీవితంలో కూడా ప్రతి పద్దెనిమిది ఏళ్లకూ ఒక విధమైన దశ పూర్తి అవుతుంది.


పుట్టిన నాటినుంచీ 18 ఏళ్ళవరకూ మనిషికి లోకమంటే ఏమిటో తెలియని ఒక విధమైన అమాయకత్వదశ నడుస్తుంది.18 ఏళ్ళు వచ్చేసరికి మనిషి యవ్వనం లోకి అడుగుపెడతాడు.లోకం కొత్తగా కనిపించడం మొదలౌతుంది. తిరిగి 36 ఏళ్ళు వచ్చేసరికి ఆ వేడి తగ్గి ఒకవిధమైన పరిపక్వత వస్తుంది.బాధ్యతలు చుట్టుముడతాయి. బాధ్యతలు ముగిసి 54 ఏళ్ళు వచ్చేసరికి మధ్యవయసు  దశ మొదలౌతుంది.ఎందుకు పుట్టామో ఏం సాధించామో తెలియక మనిషి అయోమయంలో పడే దశ ఇది. తర్వాత వచ్చే ఆవృత్తిలో 72ఏళ్లలోపు చాలామంది పరలోక ప్రయాణం కడుతుంటారు. ఎవరైనా మిగిలితే ఆ తర్వాతి దశలో ఎలాగు చావు తప్పదు. కనుక రాహుకేతువుల అయిదు  చుట్లలోనే మనిషి జీవితం దాగుంది అని చెప్పవచ్చు. ఒకరకంగా చూస్తె పంచభూతాలనే అయిదుచుట్లుగా చుట్టుకున్న రాహుకేతువులనే కాలసర్పం మానవులను బంధించి ఉందని ఊహించవచ్చు.


రావుకేతువులు వృశ్చికంలోనూ వృషభంలోనూ ఉన్నపుడు నీచస్తితిలో ఉంటాయని ఒక భావన ఉంది. వీరి ఉచ్ఛనీచల గురించి అనేక అభిప్రాయాలు ఉన్నప్పటికీ ఎక్కువగా  అనుసరించబడే రాశులు ఇవి రెండే. వీరు నీచస్తితిలో ఉన్న ప్రతిసారీ ఏమేమి సంఘటనలు జరిగాయో, ప్రపంచవ్యాప్తంగానూ మన దేశంలోనూ కూడా, ఒక్కసారి పరిశీలిద్దాం.

నవంబర్ 1899 నుంచి ఏప్రిల్ 1901  

USS Maine అనే యుద్ధ నౌక హవాన హార్బర్ లో పేలిపోయి మునిగిపోయింది. దానిలోని దాదాపు 300 మంది సిబ్బంది చనిపోయారు. దీనివల్ల అమెరికా స్పెయిన్ దేశాల మధ్య యుద్ధం ప్రారంభం అయ్యింది. అమెరికా ఫిలిప్పైన్స్ మధ్య కూడా ఈ సమయం లోనే యుద్ధం జరిగింది. కొలంబియా లో వచ్చిన సివిల్ వార్ లో దాదాపు లక్షమంది చనిపోయారు. గురుశనులు అమెరికాకు సూచిక అయిన ధనుస్సులో ఉండటం చూడవచ్చు. కొందరి అభిప్రాయం ప్రకారం దీనికి ఎదురుగా ఉండే మిధునం అమెరికాను సూచిస్తుంది.


జూన్ 1918 నుంచి నవంబర్ 1919 వరకూ

 మొదటి ప్రపంచయుద్దపు రోజులు. ప్రపంచమంతా  యుద్ధ జ్వాలలతో గందరగోళంగా ఉంది. ఇదే సంవత్సరంలో మన దేశంలో జలియన్వాలాబాగ్ సంఘటన జరిగింది. షిర్డీసాయిబాబా మరణం కూడా అప్పుడే జరిగింది. గురుశనుల సాముదాయక దృష్టి తులారాశిమీద పడటం చూడవచ్చు. తుల సమతుల్యతకు సూచిక. ప్రపంచపు సమతుల్యత దెబ్బతినడం సూచింపబడుతున్నది. గురుశనులు వక్రించి ఉండటమూ రాహువు నుంచి గురువు అష్టమంలో ఉండటమూ చూడవచ్చు.


జనవరి 1937 నుంచి జూలై 1938

జపాన్ జర్మనీల దురహంకార చర్యల వల్ల రెండవ ప్రపంచయుద్దానికి కావలసిన ఘట్టం సిద్ధం అయ్యింది. చైనా లోని నాంకింగ్ పట్టణం పైన జపాన్ జరిపిన అమానుష దాడిని "రేప్ ఆఫ్ నాంకింగ్" అని ఇప్పటికీ అంటారు.ఈ సమయంలో హిట్లర్ ప్రణాలికలు చాలా చురుకుగా సాగాయి. 1939 లో రెండవ ప్రపంచయుద్ధం మొదలైంది. గురుశనుల సాముదాయకదృష్టి వృషభం మీదా, కన్యమీదా ఉంది. నవీన భారతదేశాన్ని సూచించే వృషభం వల్ల ఈ సమయంలో మన దేశంలో స్వతంత్రం కోసం తీవ్ర ప్రయత్నాలు జరిగాయి. రంగం సిద్ధం అయింది.


ఆగస్ట్ 1955 నుంచి ఫిబ్రవరి 1957

హంగేరీ లో విప్లవం వచ్చింది. కాని అది బలవంతంగా మిలిటరీ చేతిలో అణిచివేయబడింది. క్యూబా లో కూడా విప్లవం వచ్చింది. సూడాన్ కు బ్రిటన్ చేతులోనుంచి స్వతంత్రం వచ్చింది. సామాన్య జనాన్ని సూచించే శని రాహువుతో కూడి ఉండటం గమనించవచ్చు.ఇదే సమయంలో జనానికి ఉపయోగపడే పోలియో వాక్సిన్ కనుక్కోబడింది.ట్రీటీ ఆఫ్ రొమ్ ద్వారా EEC (యూరోపియన్ ఎకనామిక్ కమ్యూనిటీ) స్థాపించబడింది. రష్యా గగనతలంలోకి స్పుత్నిక్ ను ప్రయోగించింది. మన దేశంలో అయితే ఇదే సమయంలో  భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయి.

మార్చి 1974  నుంచి సెప్టెంబర్ 1975

అమెరికాలో వాటర్ గెట్ కుంభకోణం జరిగి ప్రెసిడెంట్ నిక్సన్ రాజీనామా చెయ్యవలసి వచ్చింది. అమెరికాను సూచించే  మిథునంలో శని వక్రించి ఉండటం రాహువు నుంచి అష్టమంలో ఉండటం  చూడవచ్చు. సైప్రస్ ను టర్కీ ఆక్రమించింది. అంగోలా కు స్వతంత్రం వచ్చింది. లెబనాన్ లో సివిల్ వార్ మొదలైంది. అమెరికా రష్యాల స్పేస్ క్రాఫ్ట్ డాకింగ్ జరిగింది. మనదేశంలో పోఖరాన్ అణుపరీక్ష జరిగింది. ఎమర్జెన్సీ విధించబడి దేశం సంక్షోభానికి గురయ్యింది.


నవంబర్ 1992  నుంచి మే 1994
    
బిల్ క్లింటన్ అమెరికా అధ్యక్షుడయ్యాడు. యూరోప్ దేశాలన్నీ కలిసి సంఘటిత మార్కెట్ ను మొదలు పెట్టాయి. రువాండా మారణహోమంలో కనీసం పదిలక్షల మంది టుట్సీ జాతివారు హుటూ సైన్యం చేతిలో ఊచకోతకు గురయ్యారు.షూమేకర్ తోకచుక్క గురుగ్రహాన్ని డీ కోట్టింది. గురువు వక్రించి ఉండటమూ,శనిగురువుల మధ్య శని కుజుల మధ్యా షష్టాష్టకం ఉండటమూ కుజుడు నీచలో ఉండటమూ తన అష్టమ దృష్టితో శనిని చూస్తూ ఉండటమూ చూడవచ్చు.ఇందువల్లే అంత మారణహోమం జరిగింది. మనదేశంలో బాబ్రీమసీదు విధ్వంసం కూడా అప్పుడే జరిగింది. 
  
ఇకపోతే మళ్ళీ ఇప్పుడు రాహుకేతువులు నీచస్తితిలో ఉన్నాయి. ప్రస్తుత ప్రపంచ రాజకీయాల గురించీ సంఘటనల గురించీ ప్రత్యేకంగా చెప్పనక్కరలేదుకదా.  అవి కళ్ళ ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాయి. కనుక రాహుకేతువులు నీచస్తితిలో ఉన్న ప్రతిసారీ ప్రపంచవ్యాప్తంగా  ముఖ్యమైన సంఘటనలు తప్పక జరుగుతాయి అని ఖచ్చితంగా చెప్పవచ్చు. అయితే ఆయా సంఘటనలు గురువు, శని, కుజుల స్తితులను బట్టీ  అవి ప్రభావితం చేసే రాశులను బట్టీ జరుగుతూ ఉంటాయి. గ్రహగతులను సూక్ష్మంగా పరిశీలించడం వల్ల వాటిని అర్ధం చేసుకోవచ్చు.