“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

10, జులై 2012, మంగళవారం

విశ్వాత్మ(స్వామి విశ్వాత్మానంద) గారు ఇక లేరు

నా బ్లాగు చదువరులకు ఒక దుర్వార్త. నేను పోయినేడాది విశ్వాత్మగారి గురించి వ్రాసినప్పుడు చదివినవారికి ఆయన గుర్తుండి ఉంటారు. మొన్న ఆదివారం 8-7-2012 న హటాత్తుగా ఆయన చనిపోయారు. ఆ సంఘటన  కూడా చాలా బాధాకరంగా జరిగింది. ఆయన శరీరం మూడురోజులనుంచీ విజయవాడ NTR Health University మార్చురీ లో పోస్ట్ మార్టం కోసం వేచి ఉన్నది.

ఆదివారం నాడు ఉదయమే ఆయన ఒక శిష్యునితో కలిసి సీతానగరం వైపు కృష్ణానదీ తీరంలో ఒక పూజను నిర్వహించి తిరిగివస్తున్నారు. శిష్యుడు మోటార్ సైకిల్ తోలుతుంటే ఆయన వెనుక కూర్చొని ఉన్నారు.ప్రకాశం బారేజీ దాటగానే ఒక ట్రాఫిక్ సిగ్నల్ వస్తుంది. ఎడమవైపు వెళితే అమ్మవారి గుడి, కుడివైపు వెళితే కృష్ణ లంక వస్తాయి. ఆ సిగ్నల్ దగ్గర వెనుకనుంచి వచ్చిన ఒక ట్రాక్టర్ ఈ మోటార్ సైకిల్ ను గుద్దేసి వెళ్ళిపోయింది.ఆ ట్రాక్టర్ కు నంబర్ లేదు.  విశ్వాత్మ గారు కిందపడి పోగా తలకు బలమైన దెబ్బ తగిలి అక్కడికక్కడే ప్రాణం వదిలారు. కపాలమోక్షం అలా అయింది. 

ఆయన స్వచ్చమైన సన్యాసి. తన వివరాలు ఎవరికీ చెప్పేవారు కారు. "నవ్వులాట" శ్రీకాంత్ గారికి ఆయన మంచి మిత్రుడు అని చెప్పవచ్చు. శ్రీకాంత్ గారి ఆఫీస్ కి చాలా సార్లు వచ్చి కూచొని తీరికసమయంలో చాలాసేపు మాట్లాడేవారు. నేను ఆయన్ను విజయవాడ బుక్ ఎగ్జిబిషన్ లో ఒకసారి మాత్రమె చూచాను. కొద్దిసేపు మాట్లాడాను. ఆ కొద్దిసేపటిలోనే ఆయనంటే నాకు గౌరవభావం కలిగింది. నిరాడంబరుడు, నిర్మొహమాటి, చాలా ఉన్నతమైన వేదాంతభావాలు కలిగిన సాధువు అని చెప్పాలి.

ఆయన పుట్టింది సంపన్నమైన కమ్మకులంలో. పెరిగింది సత్యసాయిబాబా సన్నిధిలో ప్రశాంతినిలయంలో. కోట్లు మూలుగుతున్నా ప్రాపంచిక జీవితంమీద విరక్తితో సన్యాసం తీసుకున్నాడు. సత్యసాయిబాబా బెడ్ రూం లోకి అప్పాయింట్ మెంట్ లేకుండా సరాసరి వెళ్లి మాట్లాడగలిగే చనువు ఆయనకు ఉండేది. ఆయనకు తెలియని గురువులు లేరు. ముప్పై ఏళ్ళ క్రితమే ఓషో రజనీష్ తో కొన్నినెలలు పూనాలో ఉండి ఆయనతో కలిసి వ్యాహ్యాళికి వెళ్ళేవాడు. ఒజాయ్ లో జిడ్డు కృష్ణమూర్తితో కొన్ని నెలలు కలిసి గడిపాడు. దలైలామాతో పరిచయం ఆయనకు ఉంది. ఇంకా చాలామంది ప్రసిద్ధ గురువులతో, సమాజంలో ఉన్నత వ్యక్తులతో ఆయనకు వ్యక్తిగత పరిచయాలు ఉండేవి. హిమాలయాలకు తరచూ వెళ్లి కొన్ని నెలలు అక్కడ ఉంటూ ఉండేవాడు. టిబెట్ యోగులతో ఆయనకు పరిచయాలున్నాయి. కానీ ఎక్కడా బయటపడకుండా చాలా నిరాడంబరంగా కనిపించేవాడు. నాలుగు రోజుల క్రితమే టిబెట్ నుంచి తిరిగి వచ్చినట్లు తెలిసింది.

ఆయన ఉండేది విజయవాడలో అయినా ఎక్కడ ఉంటాడో ఎవరికీ చెప్పేవాడు కాదు. ఎక్కువగా ఎవరితోనూ సంబంధాలు పెట్టుకోడు. కానీ ఎక్కడో యధాలాపంగా కలిస్తే చాలా ఆప్యాయంగా మాట్లాడేవాడు. చాలా మంచి మనిషి. ఉన్నతమైన వేదాంతి. ఉత్త వేదాంత పాండిత్యం కలిగిన ఊకదంపుడు  వ్యక్తి కాదు. వేదాంతాన్ని ఆచరించి జీవితంలో అనుసరించిన వ్యక్తి. ఆయన జేబులో దొరికిన సెల్ ఫోన్ లో ఎవరో కొందరు భక్తుల నంబర్లు తప్ప తనవాళ్ళవంటూ ఎవరివీ నంబర్లు లేవు. ఆ శిష్యులకు కూడా ఆయన బంధువులు ఎవరో ఎక్కడున్నారో తెలియదు. అందుకే ఆయన శరీరం మూడురోజులనుంచీ మార్చురీలో పడి ఉంది.

ఆయన కృష్ణాజిల్లా చల్లపల్లి దగ్గరలోని కొడాలిలో ఉన్న మళయాళ స్వాములవారి సాంప్రదాయ ఆశ్రమంలో కొన్ని నెలలు ఉన్నారు. అక్కడ ఆశ్రమం వారికి ఆయన బాగా పరిచయం ఉన్నారు. కనుక చివరికి ఆ ఆశ్రమంవారే ఆయన దేహాన్ని తీసుకువెళ్ళి కొడాలిలో అంత్యసంస్కారం నిర్వహించాలని నిర్ణయించారు. ఆ కార్యక్రమం ఈరోజు జరగవచ్చు.

నదీమూలం ఋషిమూలం పరిగణించరాదు అంటారు. నది పుట్టినచోట చిన్న కాలువలాగే ఉంటుంది. దాని మహత్తు అక్కడ తెలీదు. సముద్రంలో కలిసే చోట దానిని చూడాలి. అలాగే మహనీయుల విలువను కూడా వారు పుట్టిపెరిగిన కుటుంబమూ పరిసరాలూ నిర్ణయించవు. ఆధ్యాత్మిక జీవితంలో వారు అందుకున్న స్థాయీ, వారి జీవితమూ మాత్రమే దానికి గీటురాళ్ళు. విశ్వాత్మగారు కూడా అటువంటి మంచి వేదాంతీ నిజమైన సాదువూనూ.

దేనినీ కూడా ఆయన గుడ్డిగా విమర్శించడం ఎవరూ చూడలేదు. ఆయన మాటల్లో ఒక రీజన్ ఉండేది. ప్రతివిషయాన్నీ చక్కగా సమన్వయ దృష్టితో చూచేవారు. కాని అసత్యాన్ని ఎక్కడా సమర్ధించేవారు కాదు. లోపం ఉంటే ఎంత పెద్దవారినీ ఒప్పుకునేవారు కాదు. ఆయనకు చిన్నప్పటి నుంచీ తెలిసిన సత్యసాయిబాబాని కొన్ని విషయాలలో విమర్శించడం నాకు తెలుసు.


ప్రస్తుతం రాశి చక్రంలో గురువూ కేతువూ మూడు డిగ్రీల దూరంలో ఉన్నారు. గురువు ఆధ్యాత్మిక గురువులకు సూచకుడు. కేతువు హటాత్ సంఘటనలకు దుర్ఘటనలకు సూచకుడు. శుక్రరాశి వల్ల జలసంబంధ ప్రదేశం సూచితం.ఈ దుర్ఘటన కృష్ణానదీ తీరంలోనే, ప్రకాశం బారేజీమీదే జరిగిందని గమనించాలి. మానవుల మీద గ్రహప్రభావం ఖచ్చితంగా ఉంటుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ.


మన దేశంలో ట్రాఫిక్ రూల్స్ ఎవరూ పాటించరు. ఆ మాటకొస్తే ఏ రూల్సూ ఎవరూ పాటించరు. ప్రతివారూ రూల్స్ ఎదుటివారికి మాత్రమె, నాకుకాదు అనుకోవడం మనదేశంలోని విచిత్రపరిస్తితి.గట్టిచట్టాలూ,మంచి న్యాయవ్యవస్తా, పోలీస్ వ్యవస్థా లేకపోవడం మనకొక పెద్దలోపం. ప్రతిదానిలో రాజకీయప్రమేయం ఇంకొక చండాలం. పౌరుల్లో సివిక్ సెన్స్ లేకపోవడం ఇంకొక ప్రధానలోపం.భారతీయులకు ముందుగా కావలసింది సిక్స్త్ సెన్స్ కాదు సివిక్ సెన్స్ & కామన్ సెన్స్ అని నేనెప్పుడూ అంటుంటాను. ట్రాఫిక్ రూల్స్ పాటించని రాష్ డ్రైవింగ్ వల్ల ఎంతమంది జీవితాలు ఇలా రోడ్డుపాలు అయిపోతున్నాయో దేవుడికేరుక.

అంత మంచి సాధువు జీవితం ఇలా ముగియటం మాత్రం బాధాకరం. కర్మ ఎవరినీ వదలదు అనడానికి విశ్వాత్మగారి జీవితంలో చివరిఘట్టం  ఇంకొక  ఉదాహరణ అనిపిస్తుంది.


ఆయన  గురించి వ్రాసిన పాత పోస్ట్ లు ఇక్కడ చూడవచ్చు.


http://teluguyogi.blogspot.in/2011/01/blog-post.html

http://teluguyogi.blogspot.in/2011/01/blog-post_07.html

http://teluguyogi.blogspot.in/2011/01/blog-post_11.html