“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

1, ఏప్రిల్ 2009, బుధవారం

గుడిపాటి వెంకట చలం గారి జాతకం

గుడిపాటి వెంకటచలం. పేరు ఒకప్పుడు ఆంద్రదేశాన్ని కుదిపేసింది.ఎంతోమంది తిట్లకు గురయ్యింది. ఇంకెంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది. ఒక మిత్రుడు నిన్ననే చెప్పాడు చలంగారు మీకు దూరపు బంధువే కదా. ఆయన మీద చాలా చర్చలు జరుగుతున్నై బ్లాగుల్లో. ఆయన జాతకం ఒకసారి విశ్లేషణ చెయ్యకూడదూ అని.నేనూ చలం గారి అభిమానినే కాబట్టి చూద్దాం అనుకున్నా. ఆయన పుట్టిన సమయం దొరకలేదు.అందుకని మనకు తెలిసిన ఇతర విధానాలలో ప్రయత్నం చేద్దాంలే అని చూశాను.

చలం గారిని అర్థం చేసుకోటం ఒక రకంగా అతికష్టం, ఒక రకంగా అతి తేలిక.నేను మొదటగా చలం గారిని గురించి విన్నది 1976 లో అనుకుంటా.అప్పటికే ఆయన రమణాశ్రమ వాసి అయ్యారు.పదోతరగతి చదివే రోజుల్లో ఆయన పుస్తకాలు చదివాను.ఆయనలో నాకు నచ్చిన అంశాలు చాలా ఉన్నా, వెంటనే ఆకట్టుకున్నవి మాత్రం కొన్ని.

ఉదారస్వభావం,స్త్రీ సమస్యలపైన ఆయన భావాలు, భావుకత్వం,నిర్మొహమాటంగా మనసులో మాట చెప్పటం,మానవత్వం,సౌందర్యారాధన మొదలైనవి నన్ను ఆయన అభిమానిని చేశాయి.ఆయన స్త్రీల బాధలను గురించి వ్రాసిన విషయాలు, సంఘటనలు మా ఇళ్ళలో నేను మక్కీకి మక్కీగా చూచాను.బహుశ అందుకే ఆయనంటే అభిమానం కలిగిందేమో చెప్పలేను.

ఆయన
గురించిన చర్చలు అప్పుడప్పుడు పెద్దల మధ్య జరుగుతూ ఉండేవి. మేము పిల్లలుగా పక్కన నిలబడి వింటుండేవాళ్ళం.అప్పటి నుంచి ఆయన పుస్తకాలు ఎక్కడ దొరికినా చదివేవాడిని.ఆయన ఇంటర్వ్యూ రేడియోలో వచ్చింది.చాలా నిదానంగా మెల్లిగా విషయాలు మర్చిపోయిన మనిషిలాగా మాట్లాడారు.అదే ఆయన ఆఖరి ఇంటర్వ్యూ.తరువాత 1979 లో ఆయన పోయినట్టు రేడియోలో వార్తల్లో చెప్పారు.

1987
లో బళ్లారిలో ఉంకి సణ్ణరుద్రప్ప లా కాలేజిలో లా చదువుతున్న రోజులు. రోజంతా బళ్ళారి లైబ్రరీలో మకాం. సాయంత్రం కాలేజీ. లైబ్రరీలో చలంగారి సాహిత్యం మొత్తం ఉండేది.క్లాసుల సంగతి దేవుడెరుగు.రోజంతా విందు భోజనంలా ఉండేది పరిస్థితి.ఆయన మీద అభిమానం పెరిగి పెరిగి ఆయన హాస్పేటలో పని చేసారని చదివాక, ఒకరోజు ఒక మిత్రుడు నేను కలిసి హాస్పేట్ వెళ్లి ఆయన నివశించిన ఇంటి కోసం వెతికాం. దొరకలేదు. 

ఆయనకు
తుంగభద్రలో తారానాధ్ గారు మిత్రుడు. ఇప్పటి మంత్రాలయం రైల్వే స్టేషన్ ప్రాంతాన్ని అప్పట్లో 'తుంగభద్ర'అనేవారు.ఇప్పటి మంత్రాలయం స్టేషన్ దగ్గిరలో తారానాధ్ గారి బంగళా చింతతోపుల్లో దూరంగా విసిరేసినట్లు ఉంది. ఒకరోజు అక్కడకు పోయి వచ్చాం. అప్పుడు తారానాధ్ గారి కూతురు అక్కడ తేనెటీగల పెంపకం చేస్తున్నారు. ఆమె మెడికల్ డాక్టర్.ఆమె చిన్నప్పుడు చలంగారు వారింటికి రావటం ఆమెకు గుర్తుంది. ఆవరణ అంతా తిరిగి చలంగారు తిరిగిన చోట మనమూ తిరుగుతున్నాం అని ఆనందపడ్డాం. అప్పటికే నేను తాంత్రికదేవత అయిన తారాదేవి ఉపాసన మొదలుపెట్టి ఉండటంతో తారానాద్ గారి ఇంటికి పోవడం ఎందుకో భలే నచ్చింది.

తర్వాత ఉద్యోగరీత్యా విజయవాడలో 1991 లో ఉన్నపుడు ఒకరోజు దారిన పోతుంటే ఒక మిత్రుడు చూపాడు ఇది రచయిత్రి లతగారి ఇల్లు,ఇందులో కొంత కాలం చలంగారు ఉన్నారు అని. నేను నరసరావుపేటలో బ్రహ్మానందరెడ్డి కాలేజీలో ఇంటర్ చదివే రోజుల్లో లతగారు మా కాలేజీ ఫంక్షన్ కి గెస్ట్ గా వచ్చారు.అప్పటికే ఆమె వ్రాసిన కొన్ని నవలలు(దెయ్యాలు లేవూ? నవల అందులో ఒకటి) నేను చదివి ఉండటమూ ఆమె రంగనాయకమ్మనూ ఆమె వ్రాసిన విషవృక్షాన్నీ ఆ ఫాక్షన్ లో ఏకి పారెయ్యడమూ నాకు గుర్తొచ్చాయి.చలంగారికి విజయవాడలో చాలామంది మిత్రులు ఉన్నారుట. ఇల్లు చూస్తె నాకు చలంగారి మాటలు గుర్తు వచ్చాయి.ఆయన విజయవాడ ఒదిలి శాశ్వతంగా తిరువన్నామలై పోయే రోజున ప్లాట్ఫారం మీద ఆయనకు సెండాఫ్ ఇవ్వటానికి ఒక్కడూ రాలేదుట. సంగతి ఆయనే రాసుకున్నాడు నిర్వేదంగా.

చలంగారు పెనమలూరు రోడ్డులో అప్పుడు ఉన్న మాలపిచ్చమ్మగారనే అవధూతను అప్పుడపుడు దర్శించేవాడు. ఆమె దిగంబరి. రోడ్డు పక్కనే దుమ్ములో కూచొని ఉండేది. ఎవర్నీ పట్టించుకునేది కాదు. కాని చలం బస్సు దిగుతూనే ప్రేమగా నవ్వేది. అతన్ని దగ్గిరికి తీసుకుని ముద్దు చేసేది. ఆమె ఎప్పుడూ సమాధిస్థితిలో ఉండేది.కాని లోకులు ఆమెనొక పిచ్చిది అనుకునేవారు. ఒకరోజు మాలపిచ్చమ్మ గారి ఆలయం దర్శించాను. ఆమె కూచుని ఉండే చోటులోనే కట్టారు. బందరు రోడ్డులో ఉంది. ఆమె ఒకరోజున చలంగారిని భ్రూమధ్యంలో తాకి ఏదన్నా వెలుగు కనిపించిందా అని అడిగింది. చలం లేదన్నాడు. ఆమె నిరాశగా,'నీకీ జన్మకి ఇంతేరా నువ్వు కోరుకుంటున్నది వచ్చే జన్మకే' అంది. సంగతి ఆయనే వ్రాసుకున్నాడు.

తరువాత రమణాశ్రమం దర్శించినప్పుడు, రమణస్థాన్ లో చలంగారున్న ఇల్లు, ఆయన సమాధి చూచాను. మహర్షి పోయిన తరువాత అందరూ ఆశ్రమం ఖాళీచేసి పొతే, చలం ఒక్కడే మహర్షి సమాధి దగ్గర అలా కూచుని ఉండేవాడు. ఎంత మానసిక సంఘర్షణకి లోనయ్యాడో ఆ రోజుల్లో. అది గుర్తొచ్చి కళ్ళలో నీళ్లు ధారలుకట్టాయి.ఆశ్రమంలో ఉన్న మూడురోజులు చలంగారు అనుక్షణం గుర్తోచ్చేవారు. చలంగారిని నేను చూడలేదు.కాని ఆయనకు నాకు తెలియని ఏదో అనుబంధం ఉంది అనిపించింది చాలాసార్లు.

సౌరిస్ గారు భీమిలీలో ఉంటున్నారని తెలిసి వెళ్లి కలుద్దామని ఎన్నోసార్లు అనుకున్నా.ఎందుకో వీలవలేదు. విశాఖపట్నం వరకు వెళ్లికూడా ఎందుకో భీమిలీ వెళ్ళలేక పోయేవాణ్ని.కాని మిత్రుడు చంద్రశేఖర్ ఒకటి రెండు సార్లు వెళ్లి వచ్చాడు. పోయి వద్దాం అనుకుంటూ ఉంగానే సౌరిస్ గారి మరణవార్త తెలిసింది.జిల్లెళ్ళమూడి అమ్మగారి విషయంలో కూడా ఇలాగే జరిగింది.
మిత్రుడు చరణ్ తండ్రి చెరుకుమిల్లి సత్యనారాయణగారుచలం గారు, మంచి ఫ్రెండ్స్. వారిద్దరి మధ్యా ఉత్తరాలు సాగేవి.సత్యనారాయణ గారు జిల్లెళ్ళమూడి అమ్మగారి ప్రియభక్తుడు.చలానికి అమ్మగారిని చూడాలని ఆశ.కాని అశక్తుడు, తిరువన్నామలై నుంచి బాపట్ల రాలేడు.ఈ సంగతి సత్యనారాయణ గారు అమ్మగారి చెవిని వేశారు.

అమ్మగారి ఆరోగ్యం కూడా బాగాలేదు. విపరీతమైన దగ్గు. అయినా సరే
జిల్లెళ్ళమూడి అమ్మగారు చలం కోసమే తన భక్తులు అందరితో కలిసి బాపట్ల నుంచి అరుణాచలం వెళ్లి రమణస్థాన్లో చలాన్ని దగ్గిరికి తీసుకుని ముద్దుచేసి వచ్చింది. అప్పుడు చలం పసి పిల్లాడిలా భోరున ఏడ్చాడు 'నా కోసం నువ్వే వచ్చావా అమ్మా' అంటూ. 'నేనిక్కడ ఆశక్తుడనై పడి ఉన్నాను, నాకోసం నువ్వే వచ్చావు. ఏడిరా నీ ఈశ్వరుడు?అని ఎవరైనా అడిగితె ఇప్పుడు చూపగలను ఇదుగో చూడండి అంటూ' అంటూ సత్యనారాయణగారికి వ్రాసిన ఉత్తరం ఇప్పటికీ చరణ్ దగ్గిర భద్రంగా ఉంది.

చలంగారు మొదట్లో జాతకాలు నమ్మేవారు కాదు. అదే చలంగారు చివరిలో భగవత్ గీతకు భాష్యం వ్రాశాడు. వచ్చే వ్యాసంలో చలం గారి జాతకం చూద్దాం.