అన్తః శాక్తః బహిః శైవః లోకే వైష్ణవః అయమేవాచారః

9, జూన్ 2025, సోమవారం

భట్టిప్రోలు భయంకరి

చాలా రోజుల తర్వాత శిష్యపరమాణువు పరిగెత్తుకుంటూ వచ్చాడు. రాగానే భోరుమన్నాడు.

నాకు కంగారు పుట్టింది.

'ఏమైంది నాయనా' అన్నాను కంగారు బయటకు కనపడకుండా జాగ్రత్తపడుతూ. 

'స్వామీజీకి యాక్సిడెంట్ అయింది' అన్నాడు వెక్కుతూ.

విరక్తిగా నవ్వాను.

'పిచ్చివాడా ! స్వామీజీగా మారడమే ఒక పెద్ద యాక్సిడెంట్రా. ఆ తర్వాత ఎన్ని అయితే మాత్రం లెక్కేముంది?' అన్నాను.

'అది కాదు అదికాదు ఈ ఈ ఈ ' అని వెక్కిళ్లు పెడుతూ నసుగుతున్నాడు.

'చెప్పన్నా ఏడువ్. ఏడిచన్నా చెప్పు' అన్నాను.

'మరి వాళ్లిద్దరూ ఏమయ్యారు?' అన్నాడు.

'ఎవరా ఇద్దరు?' అన్నాను.

'అదే చిన్నమస్త, ప్రత్యంగిర?' అన్నాడు.

'చిన్నమస్త చీరాల కెళ్ళింది, ప్రత్యంగిర పాలకొల్లులో ఉంది' అన్నాను.

'మిమ్మల్ని అడగడమంత బుద్ధి తక్కువ ఇంకేమీ ఉండదు' అన్నాడు కోపంగా.

'తెలుసుకున్నావ్ గా ! ఇక దయచెయ్' అని తలుపెయ్యబోయాను.

'సారీ గురూజీ. ఏదో నోరు జారి మనసులో మాట బయటకొచ్చింది. ఇకమీద రానివ్వను జాగ్రత్తగా ఉంటాను, నా డౌటు తీర్చండి మరి' అన్నాడు.

'ఒక కథ చెబుతా వింటావా?' అడిగాను.

'ఓ ! చెప్పండి' అన్నాడు చతికిలబడుతూ.

'అనగనగా ఒక పోపు గారున్నారు. కోట్లాదిమంది కాథలిక్కులు ఆయన్ను దైవంగా కొలిచేవారు. ఆయన పిలవకుండానే జీసస్ పలుకుతాడని, దేవుడితో డైరెక్ట్ హాట్ లైన్ ఆయనకుందని అనుకునేవారు. ఏ భక్తుడొచ్చి ఏ కష్టం చెప్పుకున్నా ఆయన ఆశీర్వాదంతో తగ్గిపోయేది. పెద్దపెద్ద దేశాధినేతలే ఆయన దర్శనం కోసం వచ్చేవారు. ఇదిలా ఉండగా,  వన్ ఫైన్ మార్నింగ్ పోపుగారు జబ్బుపడ్డారు. బెస్ట్ డాక్టర్లు మందులిచ్చినా తగ్గలేదు. చక్రాల కుర్చీకి అంకితమైపోయారు. అప్పుడొక విచిత్రం జరిగింది' అని ఆపాను, పరమాణువు ఫీలింగ్స్ గమనిస్తూ.

'ఏం జరిగింది గురూజీ? కొంపదీసి జీసస్ గాని ప్రత్యక్షమయ్యాడా?' పరమాణువు పగిలిపోయేలా ఉంది.

'అదేం జరగలేదు. "పోపుగారి ఆరోగ్యం కోసం భక్తులందరూ దేవుడిని ప్రార్ధించండి" అని వాటికన్ ఒక ప్రెస్ రిలీజ్ చేసింది. అంటే, పాతపేషంట్లే ఇప్పుడు డాక్టరుకు వైద్యం చెయ్యాలన్నమాట' అన్నాను.

పరమాణువు నోరెళ్లబెట్టాడు.

'మరి పోపుకీ, దేవుడికీ ఉన్న హాట్ లైన్ ఏమైంది? తెగిపోయిందా? దేవుడు చూసుకోడా? భక్తులు ప్రార్ధించడం ఎందుకు? దేవుడికీ పోపుకీ చెడిందా?' అని నీలాంటి ఒక భక్తుడే అడిగాడు. నేనేం చెప్పాలి?' ప్రశ్నించాను.

నోరు అలాగే ఉంది.

'మూసుకో. ఇంకో కథ విను. అనగనగా ఒక శ్రీవిద్య గురువుగారున్నారు. అంటే సిన్మాయాక్టర్ శ్రీవిద్యకు గురువు కాదు. నేర్పించే గురువన్నమాట. "క్షేమంకరీ మంత్రం జపించండి' మీకు ఏ ఆపదా రాదు" అని నీలాంటి పరమాణువులకు ఊదరగొట్టేవాడు. ఒకరోజున అదే మంత్రాన్ని ఒక రెండొందలమంది శిష్యసమూహానికి ఉపదేశించి, తన ఊరికి తిరిగి వస్తుండగా, ఈయన కారుకే యాక్సిడెంట్ అయింది. కట్ చేస్తే, గురువుగారు ఆస్పత్రిలో బెడ్ పైన. ఒళ్ళంతా కట్లు. కాలేమో సీలింగుకు వేలాడుతోంది. అప్పుడు కూడా మరో విచిత్రం జరిగింది' మళ్ళీ సస్పెన్స్ లో ఆపాను.

పరమాణువు లేచి నిలబడ్డాడు.

'నేను తట్టుకోలేను గురూజీ. త్వరగా చెప్పి నన్ను రక్షించండి. క్షేమంకరి బెడ్ పక్కన ప్రత్యక్షమైందా?' అన్నాడు ఏడుస్తూ.

'ఆపేయ్ వెధవేడుపు. అంత ఊహించుకోకు. అలాంటివాళ్ళెవరూ రాలేదు. 'గురువు గారు ప్రాణాపాయస్థితిలో ఉన్నారు. ఆయన క్షేమంకోసం భక్తులందరూ క్షేమంకరిని మీమీ పనులన్నీ మానుకొని మరీ ప్రార్ధించండి' అంటూ ఆశ్రమం నుండి ప్రెస్ రిలీజ్ మాత్రం వచ్చింది'

'అప్పుడేమయింది?' నిరాశగా అన్నాడు పరమాణువు.

'ఏమౌతుంది? మామూలే. 'స్వామీజీని క్షేమంకరి ఎందుకు రక్షించలేదు. వాళ్ళిద్దరికీ చెడిందా?' అని వారి భక్తుడే ఒకాయన నన్నడిగాడు' అన్నాను.

'అసలూ, అందరి భక్తులూ మిమ్మల్నే ఎందుకడుగుతారు?' డౌటు వెలిబుచ్చాడు పరమాణువు.

కోపంగా చూశాను.

'అనుమానిస్తున్నావా ! మూర్ఖుడా ! భట్టిప్రోలు భయంకరిని ప్రయోగిస్తా నీ మీద. జాగ్రత్త !' అన్నాను గర్జిస్తూ.

భయపడ్డాడు.

నేను కొనసాగించాను.

'అనగనగా ఇంకో స్వామీజీ గారున్నారు.  రమ్మంటే రాజశ్యామలే కదిలి వస్తుందంటారు. హోమాలు చేసి ప్రభుత్వాలనే మార్చేస్తామంటారు. అవతలివాళ్ళు వారాహిని ప్రయోగించారు. రాజశ్యామల రాజమండ్రికి పారిపోయింది. ఇప్పుడు స్వామీజీ ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు' అన్నాను.

'అంటే, అందరికంటే వారాహి పవర్ ఫుల్ అంటారా గురూజీ?' అడిగాడు.

'వాళ్ళెవరూ నాకు పరిచయాలు లేరు నాయనా. అసలు వాళ్లంతా ఎక్కడుంటారో కూడా నాకు తెలీదు. తెలిస్తే ఇలా ఎందుకుంటాను?' అంటూ ఇంకో కథను మొదలుపెట్టాను.

'అనగనగా ఇంకో స్వామీజీ ఉన్నారు. చిన్నమస్తతో చిత్రాలు చేస్తానంటారు. ప్రత్యంగిరతో పల్టీలు కొట్టిస్తానంటారు. వేలాది భక్తులకు వేవిళ్లు తెప్పించానంటారు. ఆయనకీ యాక్సిడెంట్ అయింది. ఆస్పత్రి, కట్లు, కాలు, సీలింగ్ . అన్నీ మామూలే' అని ఆపాను.

'అర్ధమైంది గురూజీ. తర్వాత కథ నేను చెప్తాను' అన్నాడు ఉత్సాహంగా.

ముచ్చటేసింది. 

'చెప్పుకో' అంటూ కుర్చీలో వెనక్కు వాలాను.

'చిన్నమస్త, ప్రత్యంగిరలు ప్రత్యక్షం కాలేదుగాని, యధావిధిగా ఆశ్రమం నుండి ప్రెస్ రిలీజ్ వచ్చింది. ''భక్తులెవరూ ఆస్పత్రికి వచ్చి డిస్ట్రబ్ చేయద్దు. మీమీ ఇళ్లలోనే ఉండి, చిన్నమస్తను చిన్నగాను, ప్రత్యంగిరను పెద్దగాను జపాలు చెయ్యండి. స్వామీజీ కోలుకోవడం కోసం ప్రార్ధించండి' అనేది దాని సారాంశం'' అన్నాడు పరమాణువు.

'పర్లేదోయ్. ఎదుగుతున్నావ్. వెరీ గుడ్. ముందుకెళ్లు' అన్నాను.

అప్పుడు నాలాంటి ఒక పరమాణువు వచ్చి, 'ఎందుకిలా జరిగింది గురూజీ? వాళ్లిద్దరూ ఏమయ్యారు? హాట్ లైన్ ఏమై పోయింది? ఇన్నాళ్లూ తమ కష్టాలు తీర్చిన స్వామీజీ కోలుకోవాలని ఆ భక్తులే ప్రార్ధించవలసిన పరిస్థితి రావడం ఏంటి? ఇదంతా గందరగోళంగా ఉంది? నాకేమీ అర్ధం కావడం లేదు. స్వామీజీకి వాళ్ళిద్దరికీ చెడిందా? అసలేమైంది? నా డౌట్ తీర్చండి' అని మిమ్మల్ని అడిగాడు' అన్నాడు పరమాణువు.

'కరెక్ట్ గా చెప్పావ్' అన్నాను భుజం తడుతూ.

పరమాణువు దుఃఖం మాయమైంది. 'మరి నా డౌటు?' అన్నాడు సూతనోత్సాహంతో.

'నీ డౌటూ నా డౌటూ ఒకటే. జీససు, క్షేమంకరి, చిన్నమస్త, ప్రత్యంగిర, రాజశ్యామల, వారాహి ఈ దేవతలున్నారు చూశావూ, అంతా బాగున్నపుడు పలికిన వీళ్ళందరూ, నిజంగా అవసర సమయంలో మాత్రం ఎందుకు ముఖాలు చాటేస్తున్నారు? అన్నదే ఆ డౌటు. ఇది నీదీ నాదీ మాత్రమే కాదు. బుర్ర ఉండి, లాజికల్ గా ఆలోచించగలిగిన ప్రతివాడిదీ ఇదే డౌటు. నువ్వు ఆన్సర్ చెప్పు' అన్నాను.

'నాకు బుర్ర ఉంటే మీ దగ్గరకెందుకొస్తాను?' అన్నాడు.

'వెరీ గుడ్ ఆన్సర్. కుజుడు రాశి మారాక నీ బుర్ర పాదరసమై పోయింది. విను చెప్తా' అంటూ ఇలా ముగించాను.

'చిన్నమస్త చీరాల కెందుకెళ్ళిందో తెలుసా? అదామె పుట్టినిల్లు. రాజశ్యామల రాజమండ్రి కెందుకెళ్ళిందో తెలుసా? అదామె మెట్టినిల్లు. ప్రత్యంగిర పాలకొల్లు కెందుకెళ్ళిందో తెలుసా? అదామె పడకటిల్లు. వారాహి వరంగల్లు కెందుకెళ్ళిందో తెలుసా? అదామె వంటిల్లు. జీసస్ జెరూసలేం కెందుకెళ్లాడో తెలుసా. అదాయనను పూడ్చినిల్లు'. అన్నాను.

' ఛీ అదేంటి గురూజీ. పుట్టినిల్లు బాగుంది గాని, పూడ్చినిల్లేంటి అసహ్యంగా' అన్నాడు.

'నోర్ముయ్, ఫ్లో కి అడ్డురాకు. పుట్టినిల్లు ఉన్నపుడు పూడ్చినిల్లు కూడా ఉంటుంది. ఏం? వాళ్ళకి మాత్రం కాస్త వెకేషన్ వద్దా? సరదాలు ఉండవా? ఉండకూడదా? పద్దాక పిలుస్తుంటే వాళ్ళుమాత్రం ఎందుకు పలుకుతారు? వాళ్ళ పనులలో వాళ్ళు బిజీగా ఉన్నారు. అందుకే పలకలేదు. ఇరవైనాలుగ్గంటలూ ఫోన్ మోగుతుంటే నువ్వు మాత్రం ఎత్తుతావా? ఇదీ అంతే. ఎంత దేవతలైనా వాళ్లకూ కొంచెం రెస్టు కావాలి కదా. రెస్టు తీసుకుంటున్నారు. వీళ్ళని పట్టించుకోలేదు. అందుకే ఇవన్నీ జరిగాయి. వెరీ సింపుల్' అన్నాను.

'అదికాదు గురూజీ. మిగతావాళ్ల సంగతి నాకు తెలీదుగాని, మా స్వామీజీకి మాత్రం వాళ్లిద్దరూ ఎప్పుడూ పక్కనే ఉంటారు. వాళ్ళు కార్లో ఉండగా ఇలా ఎలా జరిగిందో?'  పాదరసం మళ్ళీ పనిచేసింది.

'దేవతలు గుళ్లలో ఉండాలిగాని, మన రోడ్లమీద కార్లల్లో తిరక్కూడదు నాయనా, తిరిగితే ఇలాగే అవుతుంది. అయినా, వాళ్ళు దేవతలు కదా, యాక్సిడెంట్ టైంలో  విండో లోంచి బయటకు దూకేసి ఉంటారు. తప్పించుకున్నారు. ఈయన  దూకలేకపోయాడు. అంతే. సింపుల్ ' అన్నాను.

'అర్ధమైంది గురూజీ. నా జన్మ ధన్యమైంది, ఇప్పుడు నన్నేం చెయ్యమంటారు?' అన్నాడు పరమాణువు.

'మీ ఇంట్లో బావుందా?' అడిగాను.

'ఉంది. ఎందుకు?' అడిగాడు అనుమానంగా.

నీకిప్పుడు 'భట్టిప్రోలు భయంకరి' మంత్రం ఉపదేశిస్తాను. ఇంటికెళ్లి, ఎవరితో పలక్కుండా సూటిగా దొడ్లోకెళ్లి బావిలో దూకు, అందులోనే మూడురాత్రుళ్ళూ మూడు పగళ్ళూ ఉండి ఈ మంత్రం జపించు' అన్నాను.

'అప్పుడేమౌతుంది గురూజీ' అన్నాడు భక్తితో తేలిపోతూ.

'ఏమీ కాదు. నీకు స్పృహ తప్పుతుంది. తాళ్ళేసి పైకి లాగుతారు. ఆస్పత్రిలో స్వామీజీ పక్కన నీకు బెడ్ దొరుకుతుంది. అప్పుడాయన్నే నీ సందేహం అడుగు. నీకు సరియైన జవాబొస్తుంది. ప్రాబ్లం సాల్వ్' అన్నాను.

'భలే ఐడియా. సరే గురూజీ. ఉపదేశించండి' తొందరపడ్డాడు.

'మరి పదిలక్షలు తెచ్చావా?' అడిగాను.

'అదేంటి?' అడిగాడు అయోమయంగా.

'మంత్రాలు ఊరకే వస్తాయనుకున్నావురా మలపసన్నాసి? పోయి డబ్బులు తెచ్చుకో. అప్పుడే నీ ముఖం నాకు చూపించు. ఈ లోపల మళ్ళీ ఒచ్చావంటే చంపుతా. ఫో' అంటూ బయటకు తోసి తలుపేశా.

'హమ్మయ్య' అనుకుంటూ వెనక్కు తిరిగేసరికి, సోఫాలలో ఎవరెవరో కూచుని ఉన్నారు.

'ఎవరు మీరంతా?' అడిగాను భయం భయంగా.

'నేను ప్రత్యంగిర. అది చిన్నమస్త. ఈమె రాజశ్యామల. ఈయన జీసస్. ఇది వారాహి' అంది ఒకామె.

'మరి ఆమె?' అన్నాను మౌనంగా ఉన్న ఒకామెవైపు చూస్తూ. 

'నేనేరా. భట్టిప్రోలు భయంకరిని. నన్నేగా పదిలక్షలకు అమ్మబోయావ్ ఇప్పుడే. నీ పని చెప్పడానికే వచ్చాంరా అందరం' అని సోఫాలోనుంచి లేచింది ఆమె. ఆమెతోబాటు అందరూ లేచి నిలబడ్డారు.

నాకు స్పృహ తప్పింది.

read more " భట్టిప్రోలు భయంకరి "

16, మే 2025, శుక్రవారం

గురుగోచారం - మే 2025

నిన్న, గురుగ్రహం వృషభం నుండి మిధునం లోకి మారింది. తెలిసినవారికి వారి జీవితాలలో అనేక మార్పులు కనిపిస్తాయి. తెలీనివారికి ఏ బాధా లేదు.

గతంలో లాగా, రాశిఫలాలు వ్రాయదలుచుకోలేదు. కానీ ఈ గోచారాన్ని నిర్లక్ష్యం చేయలేము కూడా. అందుకే ఈ పోస్టు. దేశఫలాలు చూద్దాం.

మిధునంలో జీవకారకుని సంచారం కదా ! అమెరికాకు నూతనోత్సాహం వచ్చింది. అందుకేనేమో, 'యుద్ధాన్ని ఆపింది నేనే' అంటోంది. అంతేకాదు. ఇప్పటివరకూ టెర్రరిస్టులుగా తనే ముద్రవేసిన వాళ్ల దగ్గరకే వచ్చి మరీ గ్రూప్ ఫోటోలు దిగుతోంది. ఇప్పటిదాకా గ్లోబల్ టెర్రరిస్టులైనవాళ్లు ఉన్నట్టుండి రాత్రికి రాత్రే చాలా మంచివాళ్లై పోయారు. ఇదేం వింతో మరి?

అంతేకాదు. 'ఇండియాలో యాపిల్ ఫోన్లు తయారు చేయొద్దు' అని యాపిల్ సంస్థకు అమెరికా చెప్పింది. ఆఫ్కోర్స్ ! టిం కుక్ ఈ మాటను పట్టించుకోలేదనుకోండి. అది వేరే సంగతి ! ట్రంప్ మనల్నీ, రోగ్ దేశం పాకిస్తాన్ని ఒకే గాటన కట్టి మాట్లాడుతున్నాడు.

ట్రంప్ పక్కా వ్యాపారవేత్త. మనదేశం నుండి వేలాదికోట్ల డిఫెన్స్ డీల్స్ ఏవైనా అమెరికాకు దొరికితే హఠాత్తుగా ఇండియా ఎంతో మంచిదైపోతుంది. ప్రస్తుతం అది లేదుకదా ! అందుకని ఇప్పుడు మనం కనిపించం మరి. సహజమే !

మేషం నుండి మూడోభావంలో గురుసంచారం కదా ! పాకిస్తాన్ కు ధైర్యం తగ్గిపోతుంది. అయితే, త్వరలో రాహువు కుంభంలో లాభస్థానంలోకి వస్తాడు. అప్పటినుంచీ మళ్ళీ కుట్రలు ఊపందుకుంటాయి.  IMF (Islamic Mujahideen Fund) డబ్బులొస్తున్నాయి కదా ! వాటిని టెర్రరిస్టులకు పంచి, మళ్ళీ మన దేశంపైకి  వాళ్ళను ఉసిగొల్పుతుంది. పాకిస్తాన్ తో గట్టిగా వ్యవహరించడం ఒక్కటే దీనికి మార్గం. పొరపాటున కూడా పాకిస్తాన్ ను, బాంగ్లాదేశ్ ను నమ్మకూడదు. నమ్మితేమాత్రం వెన్నుపోటే. విశ్వాసం అనేది ఆ రక్తంలో ఉండదు. 

మకరం నుండి శత్రుభావంలో గురుసంచారం గనుక, మనకు శత్రుబాధ ఉన్నప్పటికీ అది బాగా అదుపులో ఉంటుంది. మోదీగారి సమర్ధవంతమైన నాయకత్వమే దీనికి కారణం. మోడీవంటి కళంకం లేని దేశభక్తుడు మనకు PM గా ఉండటం మన అదృష్టం అన్నది ఎంతమంది గ్రహిస్తారో మరి !

బయట చూద్దామంటే టర్కీ, చైనా, పిల్లదేశం అజర్ బైజాన్ లు మాత్రమే మనకు శత్రువులు. కానీ దేశజనాభాలో దాదాపు 40 శాతం మన శత్రువులే. బయటివారికంటే లోపలివాళ్లే చాలా ప్రమాదం. మన దేశంలో ఉంటూ 'జై పాకిస్తాన్' అన్నాడంటే వాడిని వెంటనే మోసుకెళ్లి పాకిస్తాన్ బార్డర్లో పారెయ్యాలంతే. పోలీసులు, కోర్టులు ఏవీ ఈ విషయంలో కల్పించుకోకూడదు.  లేదంటే ప్రస్తుత ఇజ్రాయెల్ పరిస్థితి ముందుముందు మనకు కూడా వస్తుంది.

గుంటనక్క టర్కీని ఆర్ధికరంగంలో బహిష్కరించడం చాలా మంచిపని. వీలైతే చైనాను కూడా అదే చెయాలి. ఆర్ధికరంగంలో దెబ్బ కొడితేనే ఎవడైనా మాట వినేది. మంచిమాటలు ఇలాంటివాళ్ల దగ్గర పనిచేయవు.

లేకపోతే, అతిమంచితనం చేతగానితనం అవుతుంది. విశ్వాసం లేని కుక్కలకు మంచితనం ఎందుకు చూపించాలి? దేశంకంటే ఏదీ ఎక్కువ కాదు కదా !

read more " గురుగోచారం - మే 2025 "

12, మే 2025, సోమవారం

మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల

నేడు బుద్ధపూర్ణిమ. ప్రపంచానికి పండుగరోజు. అందుకని, శ్రీ సదాశివ బ్రహ్మేంద్ర సరస్వతీస్వామివారు రచించిన  'ఆత్మవిద్యా విలాసము' అనే గ్రంధమునకు నా వ్యాఖ్యానమును మా 72 వ పుస్తకంగా ఈ పవిత్రదినాన విడుదల చేస్తున్నాము.

యోగీంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు వ్రాసిన 'సదాశివేంద్ర స్తవము' ను కూడా ఇందులో పొందుపరచాము.

స్వామివారి గురించి  ఇంతకుముందు వ్రాసిన 'శివయోగ దీపిక' పోస్టులో వివరించాను. ఆయన వ్రాసిన గ్రంధములలో ముఖ్యమైనది 'ఆత్మవిద్యా విలాసము'. ఇది 64 శ్లోకములతో కూడిన చిన్న పుస్తకమే. కానీ భావగాంభీర్యతలో చాలా గొప్పది. ఈ శ్లోకములకు అర్థమును వివరిస్తూ, ఆటవెలది, కందము, ఉత్పలమాల ఛందస్సులలో పద్యములుగా తెనిగించాను. ఈ పద్యములను కేవలం రెండు రోజులలో వ్రాశాను.

'సదాశివేంద్ర స్తవము' లో 45 శ్లోకములున్నాయి. చాలావరకు 'ఆత్మవిద్యావిలాసము'లో ఇవ్వబడిన భావములనే స్వీకరించి, సదాశివేంద్రులను స్తుతిస్తూ శృంగేరి జగద్గురువులు ఈ శ్లోకాలను రచించారు. కనుక మొదటి 64 శ్లోకములలో వాడబడిన ఛందస్సులను మళ్ళీ వాడటం ఎందుకనిపించింది. అందుకని, ఒక క్రొత్త ఒరవడిలో, 'వృషభగతి రగడ' అనే ఛందస్సులో ఈ 45 పద్యములను రచించాను. కొన్ని పద్యములు, దీనికి దగ్గరి ఛందమైన 'మత్తకోకిల' లో వచ్చినాయి. 

రగడలలో 20 దాకా రకాలున్నాయి. ఇవి, లయ-తాళ ప్రధానమైన ఛందోరీతులు. 'సదాశివేంద్రస్తవము'లో నేను వ్రాసిన పద్యములు పూర్తిగా ఛందోబద్ధములుగా లేవు. ఏమంటే, యతిప్రాసల చట్రంలో ఇముడ్చబడినపుడు, భావవ్యక్తీకరణలో స్వేచ్ఛాసౌందర్యం కుంటుపడుతుంది. కనుక, లయకు నడకకు మాత్రమే ప్రాధాన్యతనిస్తూ ఈ పద్యములను వ్రాశాను. చదవడానికి, గుర్తుపెట్టుకోవడానికి, రాగబద్ధంగా పాడుకోవటానికి రగడలు దరువులు చాలా తేలికగా హాయిగా ఉంటాయి.

శృంగేరీ పీఠాధిపతులందరూ ఈ 'ఆత్మవిద్యావిలాసము' ను వేదంతో సమానంగా స్వీకరించారు. శ్రీ సచ్చిదానంద శివాభినవ నృసింహభారతీస్వామి వారైతే, తన చివరిక్షణం వరకూ ఈ పుస్తకమును దగ్గర ఉంచుకుని, దీని శ్లోకములను వింటూ దేహత్యాగం చేశారు.

ఆత్మజ్ఞానియైన అవధూత యొక్క స్థితిని వివరించే గ్రంధం ఇది. ముముక్షువులైనవారికి ఈ గ్రంధము నిత్యపారాయణాగ్రంధం మాత్రమే కాదు, నిత్య ధ్యానగ్రంధం కావాలి.

అవధూతోపనిషత్ మరియు అవధూతగీతలలో ఉన్న భావజాలమే దీనిలో ఇంకొకవిధంగా చెప్పబడింది. అవధూతోపనిషత్ అనేది కృష్ణయజుర్వేదమునకు చెందిన సన్యాసోపనిషత్తు. అంటే, సన్యాససాంప్రదాయమును ఉగ్గడించే శ్లోకములను కలిగి ఉంటుంది. ఇటువంటివి నాలుగువేదములలో కలిపి 19 ఉపనిషత్తులున్నాయి. ఇవి లౌకికజీవితమును పూర్తిగా త్యజించి, ఆధ్యాత్మికజీవితాన్ని గడపడం పైన దృష్టిని ఉంచుతాయి. ఈ గ్రంథంలో చెప్పబడిన అవధూతస్థితి కూడా దీనినే వర్ణిస్తున్నది.

అవధూతస్థితిని గురించి అనుకోవాలంటే  దత్తాత్రేయుల తరువాత సదాశివేంద్రులనే చెప్పుకోవాలి. ఈయన మన తెలుగువాడు మాత్రమే కాదు, మూడువందల ఏళ్ల క్రితం మనకు దగ్గరగా తమిళనాడులో నడయాడిన మహోన్నతుడు. మనమేమో ఇటువంటి మహనీయులను మర్చిపోయి, పీర్లను, ఫకీర్లను ఆరాధిస్తూ, దర్గాలలో తాయెత్తులు కట్టించుకుంటూ, మన మూలాలను మర్చిపోయి మతాలు మారిపోతూ, 'అందరూ దేవుళ్ళే కదండీ' అని నంగినంగి మాటలు మాట్లాడుకుంటూ, హిందూమతానికి ద్రోహులుగా, దరిద్రులుగా తయారై ఉన్నాము. ఇదీ మన పరిస్థితి !

యధావిధిగా ఈ గ్రంధమును వ్రాయడంలోనూ, విడుదల చేయడంలోనూ నాకు తోడునీడలుగా ఉన్న సరళాదేవి, అఖిల, లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.

ప్రస్తుతానికి ఇది E Book గా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

జిజ్ఞాసువులకు, ముముక్షువులకు, తెలుగుపద్యముల అభిమానులకు ఈ గ్రంధం మహదానందాన్ని కలిగిస్తుందని నమ్ముతున్నాను.

read more " మా 72 వ పుస్తకం 'ఆత్మవిద్యా విలాసము' విడుదల "

7, మే 2025, బుధవారం

Operation Sindoor

నిర్దిష్టమైన ప్లానింగ్ తరువాత ఆపరేషన్ సిందూర్ జరిగింది.

ఆలస్యమైందని కొంతమంది ఆక్రోశించారు. కానీ, ఇటువంటి చర్యలకు ముందు చాలా ప్లానింగ్ అవసరమౌతుంది. దౌత్యపరంగా ముందు పాకిస్తాన్ ను దిగ్బంధం చేయాలి. అందుకే ఈ ఆలస్యం. నిజానికి ఇది ఆలస్యం కాదు, అవసరం.

ఉత్తరభారతంలో, సిందూరమంటే పాపటి కుంకుమ. పెళ్ళైన ఆడవాళ్లు ధరిస్తారు. మొన్న జరిగిన పహల్ గావ్ దాడిలో ఎంతోమంది సిందూరాలు చెరిగిపోయాయి. అందుకే ఈ పేరును పెట్టారులాగుంది. సరైన పేరు !

విదేశీ వ్యవహారాల కార్యదర్శి విక్రమ్ మిశ్రీ, కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్ లు ఇచ్చిన ప్రెస్ మీట్ కూడా చాలా బాగుంది. ఇద్దరు మహిళలు రక్షణదళాల ఆఫీసర్స్. విక్రమ్ మిశ్రీ యేమో కాశ్మీర్ పండితుల వంశానికి చెందినవాడు. ఆడవాళ్లకు కాశ్మీర్ గడ్డపైన జరిగిన అన్యాయానికి ప్రతీకారచర్యగా ఈ ముగ్గురితో ప్రెస్ మీట్ పెట్టించడం పాకిస్తాన్ ను చెప్పుతో కొట్టినట్లుగా ఉంది.

అంతేకాదు. షరియా అమలులో ఉన్న పాకిస్తాన్ వంటి ఉగ్రవాద ఇస్లామిక్ దేశాలలో ఆడవాళ్ళ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అందరికీ తెలుసు. బురఖా తీసి కాలేజీకి వెళ్లే ధైర్యం ఎవరికీ లేదు. ఆడపిల్లలకు ప్రాధమిక స్కూల్ కూడా అందుబాటులో ఉండదు. అలాంటిది మనదేశంలో ముస్లిం మహిళలు ఎంతగా ఎదగగలరు అనడానికి కల్నల్ సోఫియా ఖురేషి ఒక ఋజువు. 'ఇండియాలో ముస్లిములకు భద్రత లేదు' అని వాదించే దొంగలు ఈమెను చూచి బుద్ధితెచ్చుకోవాలి.

మొన్న వాఘా బార్డర్ దగ్గర పాకిస్తాన్ కు పంపించబడుతున్న పాక్ పౌరులైన ఆడవాళ్ళు గోడుగోడున ఏడుస్తున్నారు. ఎందుకు? ఇండియాలో ముస్లిములకు రక్షణ లేదుకదా? మరి మీ దేశమైన పాకిస్తాన్ కు వెళ్ళడానికి అంత ఏడుపెందుకు? ఇవన్నీ దొంగనాటకాలు కావా?

అదలా ఉంటే, పాకిస్తాన్ లో ఎక్కడెక్కడ తీవ్రవాదుల శిబిరాలున్నాయో మన ఇంటెలిజెన్స్  వర్గాలు చాలా సరిగ్గా కనిపెట్టి వాటిని బ్లాస్ట్ చేశాయి. మంచిదే. కానీ మన దేశంలోనే ఉన్న అంతర్గత శత్రువులను కూడా అదేపని చేస్తే బాగుంటుంది. మొన్న కాశ్మీరులో జరిగింది ఏమిటి? యాపిల్ అమ్ముకునేవాడినుంచి, గుర్రాలు నడుపుకుంటూ బ్రతికేవాడివరకూ అందరూ పాకిస్తాన్ కు (OGW) ఓవర్ గ్రౌండ్ వర్కర్సే. అసలైన ప్రమాదం వీళ్ళతో ఉన్నది.

మనదేశంలో పాకిస్తానీయులు బంగ్లాదేశీయులు కోట్లల్లో ఉన్నారని ఒక అంచనా. ముందు వీళ్ళను ఏరిపారేసే పనిని ప్రభుత్వం చేపట్టాలి. వీరెవరికీ దేశభక్తి ఉండదు. ఏ దేశం తిండి తింటున్నారో ఆ దేశానికే వెన్నుపోటు పొడిచే ఇలాంటి విశ్వాసం లేనివాళ్లను ముందుగా గుర్తించి వారి పని పట్టాలి. అప్పుడే ముందుముందు దేశానికి, దేశప్రజలకు రక్షణ ఉంటుంది.

ఓట్లకోసం కోట్లాదిమంది పాకిస్తాన్ బంగ్లాదేశీయులను మన దేశంలోకి రానిస్తూ, వారిని ఇండియాలో సెటిల్ కానిస్తున్న రాష్ట్రాల సంగతి ముందు చూడాలి. 'అమెరికా ఫస్ట్' అని ట్రంప్ అన్నట్లు, మనకు 'ఇండియా ఫస్ట్' అన్నదే నినాదం కావాలి. అలాంటి నేషనల్ ఫీలింగ్స్ ఉన్న నేతలనే మనం ఎన్నుకోవాలి. దేశద్రోహులను ఎన్నుకోకూడదు.

ఆపరేషన్ సిందూర్ తో వ్యవహారం అయిపోదు. ఇప్పుడే మొదలైంది. యుద్ధాన్ని మొదలుపెట్టడం తేలికే. ఆపడమే కష్టం. టర్కీ, చైనాల సహాయంతో పాకిస్తాన్ తప్పకుండా తిరుగుదాడి చేస్తుంది. ఈ యుద్ధంలో మన దేశం గెలవాలని ప్రార్ధిద్దాం. న్యూక్లియర్ వార్ గా మారకూడదని కోరుకుందాం.

టర్కీలో ప్రకృతి విలయాలు జరిగినపుడు మనదేశం ఎంతో సహాయం చేసింది. ఆహారపదార్ధాలు, మందులు, సహాయకబృందాలు అన్నింటినీ పంపి మానవత్వాన్ని చూపించాం మనం. కానీ అదే టర్కీ ఈనాడు మనకు వెన్నుపోటు పొడుస్తోంది. ముస్లిం దేశాలనుండి స్నేహాన్ని, మంచితనాన్ని ఆశించడం పొరపాటని దీనిని బట్టి అర్ధమౌతుంది. మతం ముందుకొచ్చేసరికి వాళ్ళ అసలు రంగు బయటపడుతుంది.

మోదీగారి ప్రభుత్వాన్ని నూటికి సూరు శాతం బలపరుద్దాం. అప్పుడే మన దేశానికి భద్రతా భవిష్యత్తూ రెండూ ఉంటాయి.

read more " Operation Sindoor "

2, మే 2025, శుక్రవారం

మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల

నేడు వైశాఖ శుక్లపంచమి.  ఆదిశంకరులవారి పవిత్ర జన్మదినం.43 ఏళ్ల క్రితం, మా గురువర్యులైన స్వామి నందానందగారి సమక్షంలో సరిగ్గా  ఈనాడే నాకు ఉపనయనం జరిగింది. ఆ విధంగా, పంచవటి శిష్యులకు ఈ రోజు రెండువిధాలుగా ముఖ్యమైన రోజు అవుతున్నది.

'శంకరశ్శంకరస్సాక్షాత్' (శంకరులు సాక్షాత్తు ఈశ్వరుడే) అనిపించుకున్న మహనీయుడు పుట్టిన పవిత్రమైన రోజు ఇది. వేదములలో దాగి ఉన్న అద్వైతమునకు ఒక నిర్దిష్టమైన రూపాన్నిచ్చి, లోకానికి బోధించిన ఘనుడాయన. అమానుషములైన ఎన్నో పనులను కేవలం 32 ఏళ్ల చిన్న జీవితంలో సాధించిన మహనీయుడాయన.

తన పొట్ట, తన సుఖం మాత్రమే చూచుకునే అల్పులు, కోట్లాదిమంది పురుగులలాగా ఈ లోకంలో పుట్టి పోతుంటారు. కానీ ఇటువంటి దివ్యాత్ములు ఎప్పుడో ఒకసారి మాత్రమే పుడతారు. భారతజాతికి, సనాతనధర్మానికి ఒక దిశను కల్పించిన మహనీయుడాయన. వేలాది ఏళ్లకు ఒకసారి మాత్రమే అటువంటి మహనీయుల జననం జరుగుతుంది. వారి చరిత్రను నేను వ్రాసిన 'మహనీయుల జాతకాలు - జీవిత విశేషాలు' అనే గ్రంధంలో వివరంగా చర్చించాను.

ఇటువంటి పవిత్రమైన ఈ రోజున, మా 'పంచవటి' నుండి వెలువడుతున్న 71 వ పుస్తకంగా 'గీతా కంద మరందము' అనే గ్రంధాన్ని విడుదల చేస్తున్నాము.

ఇప్పటివరకూ మా సంస్థనుండి వచ్చిన పుస్తకాలకూ దీనికీ భేదం ఉన్నది. ఇప్పటివరకూ వచ్చిన 70 పుస్తకాలు నేను వ్రాసినవి. వాటిలో కొన్నింటిని నా శిష్యులు ఇంగ్లీషు, హిందీ భాషలలోకి అనువాదాలు చేశారు. ఈ పుస్తకం మాత్రం నా శిష్యురాలైన శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి వ్రాసినది. మార్చి నెలలో మా ఆశ్రమంలో జరిగిన ఆధ్యాత్మికసమ్మేళనం సందర్భంగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఇది నేడు E-Book గా విడుదల అవుతున్నది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.

ఉత్తమగ్రంధాలను నేను వ్రాయడం కాదు, నా శిష్యులు కూడా వ్రాస్తే నాకు ఎంతో సంతోషం కలుగుతుంది. ఈ పనికి శ్రీకారం చుట్టింది శ్రీమతి సింహాద్రి జ్యోతిర్మయి. అయితే, నా శిష్యురాలైన తర్వాత ఈమె కవయిత్రి కాలేదు. ముందునుంచీ ఈమెలో రచనాశక్తి, కవిత్వశక్తి ఉన్నాయి. వీరి తాతముత్తాతలు, మేనమామలు అందరూ మంచి కవులే. వెంకటేశ్వరస్వామివారిపైన పద్యములను, శతకములను ఈమె రచించింది. నవ్యాంధ్ర రచయిత్రుల సంఘానికి (న.ర.సం) ఉపాధ్యక్షురాలు. ప్రస్తుతం ఈ గ్రంధమును రచనచేసి, నాకు అంకితమిచ్చింది. ఇది ఈమె యొక్క నిష్కల్మషమైన మనస్సుకు, గురుభక్తికి నిదర్శనం.

ఘంటసాల వెంకటేశ్వరరావుగారు మధురంగా ఆలపించిన 108 గీతా శ్లోకములకు మరికొన్ని శ్లోకములను చేర్చి మొత్తము 150 కంద పద్యములలో రచయిత్రి ఈ పుస్తకమును వ్రాశారు. అందుకే 'కంద మరందము' అని పేరు పెట్టారు. మకరందము అనినా, మరందము అనినా, అర్ధం ఒకటే.

అచ్చ తెలుగు కందపద్యముల నడకలో ఉన్న అందము, గీతాశ్లోకములలో ఉన్న భావగాంభీర్యతలు కలసి పాలలో తేనె కలిపినట్లుగా వీరి రచన వచ్చింది. తెలుగుపద్యముల అభిమానులకు, ఆధ్యాత్మిక జిజ్ఞాసువులకు ఈ గ్రంధము అమృతతుల్యముగా ఉంటుందనడం అతిశయోక్తి కాబోదు.

వీరి ఇలవేల్పు అయిన వేంకటేశ్వరస్వామివారి కటాక్షం ఈమెపైన స్థిరంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను.

ఈ సందర్భంగా ఒక విషయం చెప్పాలి.

భగవద్గీతకు సమగ్రమైన వ్యాఖ్యానమును వ్రాయడం నా ముందున్న లక్ష్యాలలో ఒకటి. దీనికి రెండు కారణాలున్నాయి.

ఒకటి - మహనీయులైనవారందరూ భగవద్గీతకు వ్యాఖ్యానం వ్రాశారు. అప్పుడుగాని వారి రచనావ్యాసంగానికి పరిపూర్ణత రాలేదు. గీతకు సమగ్రమైన వ్యాఖ్యానాన్ని మొట్టమొదటగా వ్రాసినది ఆదిశంకరులు. ఈ పనిని చేయడం ద్వారా, మహాభారతంలో దాగి ఉన్న ఈ అద్భుతమైన అమృతభాండాన్ని బయటకు తీసి, ఆ అమృతాన్ని లోకానికి పంచిపెట్టాడాయన. ఈ పనిని ఆయన 2500 ఏళ్ల క్రితం చేశారు. 

అయితే,  ఈనాటికీ మన హిందువులలో గీతను పూర్తిగా చదవనివారు కోట్లల్లో ఉన్నారు. ప్రపంచం నేడు గీతకు ఎంతో ఉన్నతమైన స్థానాన్నిస్తున్నది. విదేశీ విశ్వవిద్యాలయాలలో భగవద్గీతను బోధిస్తున్నారు. అన్ని మతగ్రంధాల కంటే దీనిలో అత్యంత ఉత్తమమైన భావాలున్నాయని ప్రపంచ మేధావులే ఒప్పుకుంటున్నారు. అయితే మనకు మాత్రం గీతలో ఏముందో తెలియదు. కనీసం ఒకటి రెండు శ్లోకాలు కూడా మనకు రావు. వచ్చినా అర్ధాలు తెలియవు. తెలిసినా ఆచరణలోకి రావు. ఇది మన హిందువులకు పట్టిన అనేక దరిద్రాలలో ఒకటి. దీనిని పోగొట్టాలంటే, గీతకు సమగ్రమైన నిస్పాక్షికమైన వ్యాఖ్యానాన్ని వ్రాయాలి. దానిని విస్తృతంగా ప్రజలలోకి తీసుకువెళ్లాలి.

రెండు - వేదముల సారం ఉపనిషత్తులు. ఉపనిషత్తుల సారం భగవద్గీత. కనుక, గీతకు సరియైన వ్యాఖ్యానాన్ని చేయగల్గితే అది వేదోపనిషత్తులను వ్యాఖ్యానించినట్లే అవుతుంది. ఇంతకంటే మానవజన్మకు సార్ధకత ఇంకేముంటుంది?

ఈ రెండు కారణాల వల్ల ఈ ఉత్తమలక్ష్యాన్ని నా ముందు ఉంచుకున్నాను.

ఇప్పటివరకూ వచ్చిన వ్యాఖ్యానకర్తలందరూ, వారివారి సాంప్రదాయాలకు అనుగుణంగా ఆయా కోణాలలో మాత్రమే గీతను వ్యాఖ్యానించారు గాని, నిష్పక్షపాతంగా, ఉన్నదున్నట్లుగా గీతార్ధములను వ్రాయలేదు. కొద్దో గొప్పో చలం గారు ఆ పనిని చేశారు. కానీ ఆయనకు శాస్త్రపాండిత్యం లేదు. వేదాంత-యోగపరమైన సాధనలలో లోతుపాతులూ ఆయనకు తెలియవు.

బహుశా నా సంకల్పం 2026 లో సాకారం కావచ్చు. ఈలోపల నా శిష్యురాలు ఈ పనికి శ్రీకారం చుట్టింది. ఒక చిన్నపాటి గీతను పూర్తి చేసింది. త్వరలో రాబోతున్న నా గీతావ్యాఖ్యానానికి పల్లవి (prologue) లాంటిదిగా  ఈ పుస్తకమును అనుకోవచ్చు.

కలకండను బస్తాడు తిననక్కరలేదు. ఒక చిన్నముక్కను తినినా తీపిగానే ఉంటుంది. అదేవిధంగా, అర్ధం చేసుకొని ఆచరించగలిగితే, మన జన్మలు ధన్యం కావడానికి భగవద్గీతలోని కొన్ని శ్లోకాలైనా చాలు. సంక్షిప్తగీత కూడా విక్షేపాలను అంతం చేసే నిక్షేపంలాంటి దైవమార్గంలోనే నడిపిస్తుంది, సరిగా అర్ధం చేసుకోగలిగితే.

యధావిధిగా, ఈ పుస్తకం కవర్ పేజీని అద్భుతంగా తయారుచేసిన ప్రవీణ్ కు, టైప్ సెట్టింగ్ మరియు ప్రూఫ్ రీడింగ్ పనులను చూచుకున్న అఖిలకు, పబ్లిషింగ్ ని చూచుకున్న శ్రీనివాస్ చావలికి ఆశీస్సులు. వీరంతా మా పంచవటి పబ్లికేషన్ టీమ్ రధసారధులు.

కవితారసికులు, గీతాశాస్త్రాధ్యయన తత్పరులు అయిన తెలుగుపాఠకులు ఈ గ్రంధమును ఇతోధికంగా ఆదరిస్తారని ఆశిస్తున్నాను.

 ఈ పుస్తకం ఇక్కడ లభిస్తుంది.

read more " మా 71 వ పుస్తకం 'గీతా కంద మరందము' విడుదల "

1, మే 2025, గురువారం

నీడల వెంట పరుగులు

చిన్నచిన్న విషయాలకు ఆత్మహత్యలు చేసుకున్నవారిని గతంలో ఎంతోమందిని మనం చూశాము. కానీ, సోషల్ మీడియాలో తన ఫాలోయర్స్ తగ్గిపోతున్నారని ఆత్మహత్య చేసుకున్నవారికి ఇప్పుడు చూస్తున్నాం. మిషా అగర్వాల్ కేసు వాటిలో ఒకటి. 

వారం క్రితం ఏప్రియల్ 24 న ఈమె చనిపోయింది. అప్పటికి ఆమెకు 24 ఏళ్ళు. రెండురోజులలో 25 ఏళ్ళు వస్తాయి. కాస్మెటిక్స్ రంగంలో ఎదగడం ఈమె కల. లా గ్రాడ్యుయేట్ అయిన ఈమె జ్యుడిషియల్ పరీక్షలకు తయారౌతున్నది.

పదిలక్షలమంది ఫాలోయర్స్ తన ఇంస్టాగ్రామ్ లో ఉండాలని ఈమె తీవ్రంగా కలలు కనేది. అంతమంది రాకపోగా, ఉన్నవారు కూడా క్రమేణా తగ్గిపోతూ ఉండటంతో, డిప్రెషన్ లో పడిపోయి, ఆత్మహత్య చేసుకుని చనిపోయింది.

'మనుషులను సోషల్  మీడియా పిచ్చి ఎంత దూరం తీసుకుపోతుంది?' అనడానికి ఈ అమ్మాయి ఒక నిదర్శనంగా మిగిలిపోయింది.

కామెంట్లు, లైకులు చూసుకోవడం. వ్యూయర్లు, ఫాలోయర్లు వ్రాసే 'ఆహా ఓహోలు' నిజాలనుకుని ఉబ్బిపోవడం. గ్రూపులు, గొడవలు, ఇవన్నీ బ్లాగులు వ్రాసే కొత్తలోనే, అంటే 2010 ప్రాంతాలలోనే నేను గమనించాను. ఇదొక వ్యసనమని, ఒక రొచ్చు ప్రపంచమని నాకప్పుడే అర్ధమైంది. అందుకే, వ్యూయర్స్ టాబ్ ను, ఫాలోయర్స్ టాబ్ ను, కామెంట్స్ సెక్షన్ ను నా బ్లాగ్ నుండి అప్పుడే తీసేశాను. ప్రతివారితోనూ మాట్లాడటం, వాళ్ళ కామెంట్లకు జవాబులివ్వడం, ముచ్చట్లు పెంచుకోవడం అన్నీ అప్పుడే మానేశాను.

సోషల్ మీడియా ఫాలోయర్స్ నిజంగా మనల్ని ఫాలో అవుతారని అనుకోవడం పెద్ద భ్రమ. ఆ భ్రమమైకంలో బ్రతకడం ఒక మానసికరోగం. అటూ ఇటూ అయితే ఈ రోగం తీవ్రమైన డిప్రెషన్ కు దారితీస్తుంది. ఈ అమ్మాయి కేసులో అదే జరిగింది.

సోషల్ మీడియాలో పోస్ట్ చేసేవాళ్ళు వాళ్లకు తోచక చేస్తుంటారు. చదివేవాళ్ళు కూడా ఏమీ తోచకనే చదువుతుంటారు. ఇది ఉత్త కాలక్షేపం మాత్రమే. దీని విలువ అంతవరకే. కొంతమంది తమ మానవసంబంధాలను మెరుగుపరుచుకోవడానికి దీనిని ఉపయోగిస్తే, మరికొంతమంది మోసాలు చెయ్యడానికి వాడుకుంటారు. వాస్తవప్రపంచంలో లాగే దీనిలో కూడా అన్ని రకాల మనుషులూ ఉంటారు. వాస్తవప్రపంచంలో కృంగుబాటుకు ఎంత ఆస్కారం ఉందో, ఇక్కడ కూడా అంతకంటే ఎక్కువగా ఉంది. ప్రాక్టికల్ గా లేకపోతే రెండిట్లోనూ దెబ్బ తినక తప్పదు.

బిజినెస్ ప్రొమోషన్ కు సోషల్ మీడియాను వాడుకోవచ్చు. తప్పులేదు. కానీ చేసేపనిలో నిజాయితీ ఉండాలి. దురాశ పనికిరాదు. సోషల్ మీడియా మీద లక్షలు కోట్లు సంపాదిద్దామని భావించి, దురాశకు పోతే, చివరకు డిప్రెషన్ మిగులుతుంది. లేదా అంతు తెలియని ఈ పరుగుపందెంలో పడి హార్ట్ ఎటాక్ లు తెచ్చుకుంటారు. లేదా క్రైమ్ లో ఇరుక్కుంటారు.

కలల్లో బ్రతకడం, ఐడెంటిటీ క్రైసిస్, ఇతరుల కంటే తానేదో గొప్ప అన్న భ్రమలో ఉండటం, ఫాలోయర్స్ కౌంటు చూసుకుంటూ మురిసిపోతూ కలల్లో తేలిపోవడం - ఇవన్నీ మానసిక రోగలక్షణాలు. మిషా అగర్వాల్ వంటి అభాగ్యులు వీటికి బలౌతూ ఉంటారు.

ఈ అమ్మాయి 26-4-2000 న పుట్టింది. ఆనాటి జాతకంలో డిప్రెషన్ లక్షణాలు, జీవితంలో ఫెయిల్ అయ్యే పోకడలు, ఆత్మహత్య చేసుకునే యోగాలు స్పష్టంగా ఉన్నాయి. ఇంతకు ముందైతే వాటన్నిటినీ వివరించి పెద్ద పోస్ట్ వ్రాసి ఉండేవాడిని. చాలామంది సూయిసైడ్ చేసుకున్న సెలబ్రిటీస్ జాతకాలు అలా వ్రాశాను కూడా. ఇప్పుడు రూటు మార్చాను. దగ్గరివారికి కొందరికి మాత్రమే ఆ జ్యోతిష్యకోణాలను వివరిస్తున్నాను.

సోషల్ మీడియా యొక్క కృత్రిమప్రపంచంలో నీడల వెంట పరిగెత్తడం చివరకు ఎక్కడకు తీసుకుపోతుందో ఈ అమ్మాయి కేసులో రుజువైంది. ఇప్పుడే ఇలా ఉంటే, రేపు AI విప్లవం వస్తే పరిస్థితి ఇంకెలా ఉంటుందో? ప్రపంచజనాభాలో సగంమంది పిచ్చోళ్ళు అయ్యే అవకాశం మాత్రం గట్టిగా కనిపిస్తున్నది.

సోషల్ మీడియా అనేది జీవితంలో ఒక చిన్నభాగంగా ఉండాలి. అంతేగాని అదే ప్రపంచమై పోయి, చివరకు వాస్తవప్రపంచాన్ని మర్చిపోయే స్థితికి మనల్ని తీసుకుపోకూడదు.

అదే జరిగితే, చివరకు ఇలాగే అవుతుంది.

read more " నీడల వెంట పరుగులు "

30, ఏప్రిల్ 2025, బుధవారం

అక్షయతృతీయనాడు ఏం చెయ్యాలి?

పదవి, అహంకారం, గర్వం, లెక్కలేనితనం, దౌర్జన్యం  - ఒకవైపు

సాత్వికజీవనం, తపస్సు, మర్యాద, మంచితనం, నిదానం - మరొకవైపు

రెంటికీ జరిగిన ఘర్షణలో మొదటివర్గమే గెలిచింది.

అడవిలో తపోమయజీవనం గడుపుతూ, ధ్యాననిష్ఠలో ఉన్న జమదగ్నిమహర్షి హత్యకు గురయ్యాడు.

ఆయన కుమారుడైన పరశురాముడు క్రుద్ధుడయ్యాడు.

భారతఉపఖండమంతా 21 సార్లు వెదకి, దుర్మదాంధులైన పాలకులను వారి సైన్యాలను ఒక్కడే ఎదుర్కొని, వారిని అంతం చేశాడు పరశురాముడు.

దౌర్జన్యాన్ని ఒంటిచేతితో ఎదుర్కొని నిలిచి, తపశ్శక్తి ఒక్కటే ఆయుధంగా న్యాయంకోసం ఒక్కడే పోరాడిన మహావీరుడు పరశురాముడు. 

మానవచరిత్రలో అంతటి మహావీరుడు మరొకడు లేడు. 

అంతటి అమానుషశక్తి సంపన్నుడు కనుకనే, సాక్షాత్తు నారాయణుని అవతారాలలో ఆరవ అవతారంగా పూజించబడుతున్నాడు.

నిజంగానా?

దశావతారాల బొమ్మలలో తప్ప ఎక్కడా ఆయన ఆరాధన కనిపించడం లేదే?

ఒక్క కేరళలో, తుళునాడులో, ఉత్తరభారతం కొన్ని ప్రాంతాలలో కొంతమంది బ్రాహ్మణులు తప్ప ఎవరు పరశురామావతారాన్ని పూజిస్తున్నారు?

ఎవరూ లేరు.

మళ్ళీ కదిలిస్తే చాలు 'సనాతనధర్మం' గురించి అందరూ ఉపన్యాసాలిస్తారు. 

ఎక్కడుంది సనాతనధర్మం?

ఎవరిని పూజించాలి? ఎవరిని పూజిస్తున్నాం?

మన మహాపురుషులెవరు? మనం గుళ్లుకట్టి పూజిస్తున్నదెవరిని?

మనకసలు ఆత్మాభిమానం ఉందా?

ఆత్మపరిశీలన చేసుకోండి. అర్ధమౌతుంది.

ఈ రోజు పరశురామజయంతి.

నిస్సహాయస్థితిలో ఉన్నాసరే, న్యాయంకోసం, ధర్మంకోసం, రాజులనే ఎదుర్కొని పోరాడిన మహాఋషి పుట్టినరోజు ఇది.

మనజాతికి ఆత్మాభిమానాన్ని నేర్పిన అవతారపురుషుడు పుట్టిన రోజు ఇది.

కనీసం ఈరోజైనా ఆయనను ఆరాధించాలి.

కానీ, అందరూ ఏం చేస్తున్నారు? బంగారం షాపులకు ఎగబడి, కొద్దో గొప్పో బంగారం కొనుక్కుని, సనాతనధర్మాన్ని ఏదో ఉద్ధరించామని మురిసిపోతూ, సాయంత్రం సాయిబాబా గుడికెళ్తున్నారు.

చాలాబాగుంది కదూ ! ఇదే మరి సనాతనధర్మమంటే !

పరశురాముడిని మర్చిపోయాం గనుకనే పహల్ గావ్ జరిగింది.

ఆత్మాభిమానం నశించింది గనుకనే, అందరూ మనల్ని తొక్కుతున్నారు.

కనీసం ఈరోజైనా పరశురాముని ఆరాధించండి. ఆయన చరిత్రను చదవండి. ఆయనను ధ్యానించండి. ఆయన పౌరుషాన్ని కొద్దిగానైనా మనకు ప్రసాదించమని వేడుకోండి.

అప్పుడే భారతజాతికి మనుగడ ఉంటుంది.

లేదంటే, ఈరోజు మనం హాయిగా షాపింగులు చేసుకుంటూ, బంగారాలు కొనుక్కుంటూ, సాయంత్రం సినిమాలకెళ్తూ బ్రతకవచ్చు. రేపు మన పిల్లలు, వారి పిల్లలు ఈ దేశంలో ఉండలేక పారిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. మన ఆడపిల్లలు నేడే లవ్ జిహాద్ లకు గురౌతున్నారు. రేపు ఇంకేం జరుగుతుందో కాస్త ఊహించుకోండి.

నకిలీ సనాతనధర్మాన్ని కాదు, అసలైన సనాతనధర్మాన్ని అనుసరించండి.

అప్పుడే మనకు భవిష్యత్తు.

తమ మూలాలను, తమ మహనీయులను మర్చిపోయేవారిని, ఆత్మాభిమానం లేనివారిని ఎవరూ బాగుచెయ్యలేరు.

read more " అక్షయతృతీయనాడు ఏం చెయ్యాలి? "

28, ఏప్రిల్ 2025, సోమవారం

సనాతనధర్మం

మొన్న కొంతమంది మా ఆశ్రమాన్ని చూడటానికి వచ్చారు.

కాసేపు కూర్చుని సేదతీరాక, వారిలో ఒకాయన, 'నేను సాయిబాబా ఆలయాల కమిటీకి ప్రెసిడెంట్ ను' అని పరిచయం చేసుకున్నాడు.

జాలిగా ఆయనవైపు చూశాను.

'ముప్పై ఏళ్ళనుంచీ ఇదే మార్గంలో ఉన్నాను' అన్నాడాయన.

ఏడుపొచ్చింది.

'పంచవటి' అని బోర్డుమీద ఉంది. పంచవటి అంటే నాసిక్ దగ్గర కదా?' అన్నాడాయన.

'అవును. వనవాసం సమయంలో సీతారామలక్ష్మణులు ఉన్న ప్రదేశం పేరే పంచవటి. అంతేకాదు, రామకృష్ణులు సాధన చేసిన ప్రదేశం పేరు కూడా అదే' అన్నాను.

'యోగాశ్రమం అని ఉంది. మీరు యోగా నేర్పిస్తారా?' అడిగాడాయన.

'మీరనుకునే యోగా, మాకు తెలిసిన యోగశాస్త్రంలో ఎల్కేజీ మాత్రమే' అన్నాను.

ఆయనకు అయోమయంగా ఉంది.

'మీరు ఇస్కాన్ భక్తులా?' అడిగాడాయన.

'మేము కృష్ణభక్తులమే. కానీ ఇస్కాన్ భక్తులం కాదు. వాళ్ళ పిడివాదం మాకు నచ్చదు' అన్నాను. 

'ఎవరైనా వాళ్ళ ఊరిలో సద్గురువు ఆలయాన్ని కట్టుకుంటామంటే, సాయిబాబా గుడి ఎలా కట్టాలో అదంతా నేను సలహాలిస్తుంటాను' అన్నాడాయన.

'హిందూమతంలో ఉండటం ఎందుకు? ఇస్లాం స్వీకరించండి' అందామనుకున్నా.

'సనాతనధర్మాన్ని కాపాడటానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి కదా?' అన్నాడాయన.

'సనాతనధర్మానికి సాయిబాబాకూ ఏంటి సంబంధం?' అడిగాను.

ఆయన మాటలు ఆగిపోయాయి.

'సద్గురువుకు ఆలయం కట్టాలంటే ఆదిశంకరుల ఆలయాన్నో, రామానుజుల ఆలయాన్నో, మధ్వాచార్యుల ఆలయాన్నో, లేక ఈ మూడుభావనలనూ సమన్వయం చేసిన రామకృష్ణుల ఆలయాన్నో కట్టాలి. అసలు సాయిబాబా సద్గురువు ఎలా అవుతాడు?' అడిగాను.

సాయిబాబా పేరు చెబుతూనే నేనుకూడా అందరిలాగా డంగై పోయి, కాళ్ళు పట్టుకుంటానని అనుకున్నట్టున్నారు. నేనలా లేకపోయేసరికి వాళ్లకేం అనాలో తోచలేదు.

'సద్గురువైనవాడు శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలని వేదం చెబుతోంది. సాయిబాబా ఈ రెండూ కాదు. మరి ఆయన సద్గురువేంటి?' అడిగాను.

'మీరెవరిని పూజిస్తారు?' ప్రశ్నలు మొదలయ్యాయి.

'ధ్యానమందిరానికి వెళ్లి చూడండి. తెలుస్తుంది' అన్నాను.

'అక్కడ రామకృష్ణుల ఫోటో ఉంది' అన్నాడు.

అవును. ఆయనను మేము ఆరాధిస్తాము.  అయితే, ఇంకా చాలామంది ఫొటోలు  ధ్యానమందిరంలో ఉన్నాయి. వివేకానందస్వామి, రమణమహర్షి, జిల్లెళ్ళమూడి అమ్మగారు, మెహర్ బాబా, అరవిందులు, కంచి పరమాచార్య, మా గురువులు ఇలా చాలా ఉన్నాయి. అన్నింటినీ మించి, కలకత్తా కాళీమాత ఫోటో ఉంది. కనిపించలేదా?' అడిగాను.  

'మీది రామకృష్ణా మిషనా?' మళ్ళీ ప్రశ్న.

'మాది ఏ మిషనూ కాదు. మాదగ్గర వాషింగ్ మిషను తప్ప ఇంకేమీ లేదు. అక్కడున్న ఫోటోలలో ఉన్నవారి సంస్థలతో దేనితోనూ మాకు సంబంధం లేదు. కేవలం వారి ఉదారభావాలు మాత్రం మాకు నచ్చుతాయి. వాటిలో కూడా అన్నీ నచ్చవు. ప్రాచీన ఋషిప్రోక్తమైన వేదాంత-యోగభావాలతో కలిసినంతవరకూ ఎవరిభావాలైనా మాకు నచ్చుతాయి. కలవకపోతే నచ్చవు. వాటిని బోధించిన అసలైన మహనీయులను అందరినీ మేము ఆరాధిస్తాము' అన్నాను, 'అసలైన' అనే పదాన్ని వత్తి పలుకుతూ.

'సేవా కార్యక్రమాలు ఏమీ చెయ్యరా?' అడిగాడాయన.

'సమాజసేవ పైన మాకు నమ్మకం లేదు. దానిపేరుతో చేయబడే వ్యాపారం కంటే, ఆత్మసేవే ముఖ్యమని నా ఉద్దేశ్యం. అందుకే ఏ విధమైన సేవనూ మేము పెట్టుకోలేదు. నా ఉద్దేశంలో సేవ అనేది అసలిప్పుడెవరికీ అవసరం లేదు' అన్నాను.

వారు చేస్తున్న 'సేవ' గురించి చెప్పడం ఆయన మొదలుపెట్టాడు.

'ఏడాదికొకసారి ఊరంతా తిరిగి లారీడు బియ్యం పోగుచేసి అందరికీ అన్నదానం చేస్తుంటాము' అన్నాడాయన.

'అందరూ డబ్బులేసుకుని అందరూ కూచుని తింటే అది పార్టీ అవుతుందిగాని అన్నదానం ఎలా అవుతుంది? అసలు దానమంటే ఏమిటి? అది ఎవరికి అవసరం?' అన్నాను.

ఆయనకు కోపం వచ్చింది. అయినా తమాయించుకుని, 'పిల్లలకు భగవద్గీత పోటీలు పెడుతుంటాము' అన్నాడు.

'పోటీలు పెట్టడానికి అదొక గేమ్ కాదు. పోటీలతో భగవద్గీత ఎన్నటికీ అర్ధం కాదు. ముందు పెద్దలు దానిని సరిగ్గా అర్ధం చేసుకుంటే తరువాత పిల్లలకు నేర్పవచ్చు' అన్నాను.

'శాస్త్రీయసంగీతం నేర్పిస్తుంటాము. గాయకులను పిలిచి కచేరీలు చేయిస్తాము' అన్నాడాయన.

'అవి లలితకళలు. అది మన సంస్కృతి. వాటిని నిలబెట్టడం మంచిదే. కానీ మీరనుకుంటున్న సనాతనధర్మం అదికాదు' అన్నాను.

ఆయన మాటమార్చి, ' మీకు వాచ్ మెన్ లేడా?' అడిగాడు.

'ఉన్నాడు. మీకు కనిపించడు' అన్నాను.

'ఇంత ఎడారిలో ఎలా ఉంటున్నారు?' అన్నాడాయన.

'దేవుడే దిక్కు' అన్నాను.

నా మాటలు వాళ్లకు రుచించలేదు.

'సరే. ఏదో ఆశ్రమం అని ఉంటే చూచి పోదామని వచ్చాము. వెళ్లొస్తాం' అన్నాడాయన.

'సనాతనధర్మం ఏమిటో తెలుసుకోవాలంటే పదినిముషాలు సరిపోదు. తీరిగ్గా రండి. కూచుని మాట్లాడుకుందాం'. అన్నాను.

వాళ్ళు వెళ్లిపోయారు.

చాలా జాలేసింది.

ముప్పై ఏళ్ళనుంచీ గుడ్డిగా నడుస్తున్నంత మాత్రాన అది సరియైనదారి అవాలని ఎక్కడుంది?

ఆ మాటకొస్తే, సరైనదారిని తెలుసుకోవాలని మాత్రం ఎవరికుంది?

ఎవరికి తోచిన పనిని వారు చేస్తూ, 'ఇదే సనాతనధర్మం' అనుకుంటున్నారు. 

దే మరి కలిమాయ అంటే !

ఈ మాయప్రపంచాన్ని, ఈ మనుషులను, సంస్కరించడం ఎవరివల్లా కాదని నాకు మరోసారి అర్ధమైంది.

read more " సనాతనధర్మం "

27, ఏప్రిల్ 2025, ఆదివారం

మా 70 వ పుస్తకం 'శివయోగ దీపిక' విడుదల

నా కలం నుండి వెలువడుతున్న 70 వ పుస్తకంగా, శ్రీ సదాశివబ్రహ్మేంద్రసరస్వతీస్వామివారు రచించిన 'శివయోగదీపిక' అనబడే సంస్కృతగ్రంధమునకు తెలుగు వ్యాఖ్యానము నేడు వెలువడుతున్నది. దీని మాతృక 300-400 ఏళ్ల క్రిందటిది.

16-17  శతాబ్దముల మధ్యలో తమిళనాడులో జీవించిన శ్రీ సదాశివేంద్రసరస్వతీస్వామికే సదాశివయోగీంద్రుడనిన నామాంతరమున్నది. మహాయోగి మరియు బ్రహ్మజ్ఞానియైన ఈయన, శ్రీ పరమశివేంద్ర సరస్వతీస్వామి శిష్యుడు. ఈయన కంచి కామకోటి పీఠమునకు  58 వ ఆచార్యునిగా ఉన్నారు.


సదాశివయోగీంద్రులు వెలనాటి నియోగి బ్రాహ్మణకుటుంబంలో శ్రీవత్సస గోత్రంలో జన్మించారు. నేను కూడా అదే కావడం నా అదృష్టం. కనుక స్వామివారు మా పూర్వీకులేనని చెప్పడానికి ఎంతో గర్విస్తున్నాను. వెలనాడు అంటే కృష్ణా పెన్నా నదుల మధ్యప్రాంతం. ముఖ్యంగా గుంటూరు, రేపల్లె, నెల్లూరు ప్రాంతాలను ఆ కాలంలో వెలనాడు అనేవారు.


ముస్లిముల రాక్షసదండయాత్రలనుండి, వారు పెట్టిన హింసలు, అరాచకాలనుండి తప్పించుకోవడానికి, తమ ఆడవారిని తమ కుటుంబాలను కాపాడుకోవడానికి, ఆ కాలంలో అనేక తెలుగుకుటుంబాలు వారివారి ఆస్తిపాస్తులను వదలిపెట్టి, కట్టుబట్టలతో తమిళనాడులోని కుంభకోణం కోయంబత్తూరు మొదలైన ప్రాంతాలకు పారిపోయి అక్కడ క్రొత్తజీవితాన్ని మొదలుపెట్టాయి. అటువంటి కుటుంబాలలో వీరిది కూడా ఒకటి.


వీరి పూర్వనామధేయం శివరామకృష్ణశర్మ. పరమశివేంద్రులవారి వద్ద ఉపదేశమును పొంది, అనేక ఏళ్లపాటు కావేరీతీరంలో తపస్సు చేసిన తరువాత ఈయన బ్రహ్మజ్ఞానసిద్ధిని పొందారు. శాస్త్రాలలో ఎంతో ఉన్నతంగా కొనియాడబడిన అవధూతస్థితిని అందుకున్న అతికొద్దిమంది నవీనులలో ఈయనొకరు. వీరి సజీవసమాధి తమిళనాడులోని కరూర్ జిల్లాలో గల నేరూరు గ్రామంలో ఉన్నది.


సదాశివయోగీన్డ్రుల గురించిన అనేక మహిమలు మరియు గాధలు దక్షిణాదిలో ప్రచారంలో ఉన్నాయి. వాటిలో కొన్నింటిని పరమహంస యోగానందగారు తన పుస్తకం Autobiography of a yogi లో పొందుపరచారు. అనేక భక్తికీర్తనలను, వేదాంతగ్రంథములను సదాశివ బ్రహ్మేంద్రస్వామి రచించారు. వాటిలో బ్రహ్మసూత్రములకు, యోగసూత్రములకు వ్రాసిన వ్యాఖ్యానములు పేరెన్నిక గన్నవి.


పిబరే రామరసం, భజరే గోపాలం మానస, గాయతి వనమాలీ మధురం, ఖేలతి మమ హృదయే రామ, మానస సంచరరే బ్రహ్మణి, స్థిరతా నహినహి రే, మొదలైన కీర్తనలు ఈనాటికీ కీర్తనాప్రియులైన భక్తుల నోళ్ళలో నానుతూ ఉంటాయి. బాలమురళీకృష్ణ,  పురుషోత్తమానందస్వామి వంటి మధురగాయకులు వీటిని ఎంతో శ్రావ్యంగా గానం చేశారు.


వీరి గ్రంధములలో ఒకటి - మంత్ర, లయ, హఠ, రాజ, భక్తి, జ్ఞానయోగముల మేలుకలయిక అయిన ఈ గ్రంథము. ఎన్నో యోగసాధనల సంకలనా సమాహారంగా ఈ గ్రంథం గోచరిస్తుంది. పంచవటి నుండి వెలువడుతున్న 70 వ గ్రంథముగా దీనిని పాఠకులకు అందిస్తున్నాము.


ఇటువంటి మహనీయుడు వ్రాసిన ఈ అద్భుతగ్రంధమును నా వ్యాఖ్యానంతో ఆయనయొక్క మాతృభాష అయిన తెలుగులోకి తేగలగడం నా అదృష్టంగా భావిస్తున్నాను.


ఈ పుస్తకమును వ్రాయడంలో నాకు అనుక్షణం చేదోడువాదోడుగా ఉన్న నా శ్రీమతి సరళాదేవికి, శిష్యులు అఖిల. లలిత, శ్రీనివాస్ చావలి, ప్రవీణ్ లకు ఆశీస్సులు తెలియజేస్తున్నాను.


ప్రస్తుతం ఈ పుస్తకం E-Book గా అందుబాటులోకి వస్తున్నది. యధావిధిగా ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా వస్తుంది.


మా ఇతర గ్రంధములను ఆదరించినట్లే అద్భుతమైన ఈ గ్రంధాన్ని కూడా ఆదరిస్తారని విశ్వసిస్తున్నాను.

read more " మా 70 వ పుస్తకం 'శివయోగ దీపిక' విడుదల "

23, ఏప్రిల్ 2025, బుధవారం

మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల

ఇంతకు ముందు నాచే తెలుగులో వ్రాయబడిన 'భారతీయ జ్యోతిష సంఖ్యాశాస్త్రము' అనే పరిశోధనా గ్రంధం, ఇప్పుడు ఇంగ్లీషులోకి తర్జుమా చేయబడి, Indian Astro Numerology అనే E-Book గా నేడు విడుదల అవుతున్నది. 

ఇది నా కలం నుండి వెలువడుతున్న 69 వ గ్రంధం. ఇక్కడ లభిస్తుంది. త్వరలో ప్రింట్ పుస్తకంగా విడుదల అవుతుంది.

పాశ్చాత్య సంఖ్యాశాస్త్రానికి భిన్నమైన మన భారతీయ సంఖ్యాశాస్త్రాన్ని నా పరిశోధనలో కనిపెట్టి  52 జాతకచక్రాల సహాయంతో సోదాహరణంగా ఈ గ్రంధంలో వివరించాను.

ఈ గ్రంధం తెలుగులో చాలా ప్రజాదరణను పొందింది. హైద్రాబాద్, విజయవాడ పుస్తకప్రదర్శనలలో ఎక్కువగా పాఠకులు తీసుకున్న గ్రంధాలలో ఇదీ ఒకటిగా నిలిచింది. ఈ పద్ధతి చాలా బాగుందని, జాతకాల విశ్లేషణలో బాగా ఉపయోగపడుతున్నదని చదువరుల నుండి నాకు మంచి రివ్యూలు కూడా వచ్చాయి.  

అంతర్జాతీయ పాఠకుల ఉపయోగార్ధమై ప్రస్తుతం దీనిని ఇంగ్లీషులోకి అనువదించి విడుదల చేస్తున్నాము.

తెలుగు పుస్తకమును ఇంగ్లీషులోకి అనువాదం చేసిన నా శిష్యురాలు స్నేహలతారెడ్డికి ఆశీస్సులు తెలుపుతున్నాను.

ఇంగ్లీషు చదివేవారిలో దీనికి విస్తృత పబ్లిసిటీని కల్పించాలని Panchawati USA టీమ్ వారిని కోరుతున్నాను.

read more " మా 69 వ పుస్తకం Indian Astro Numerology విడుదల "