4, జూన్ 2017, ఆదివారం

రెండవ అమెరికా యాత్ర -44 (బోటింగ్ మెడిటేషన్)

మంజు ఆంటీ వచ్చేసరికి మధ్యాన్నం పన్నెండు అవుతుందని ఆమె ఫోన్ చేసి చెప్పింది. మేము ఉదయాన్నే లేచి తయారై ఉపాహారం సేవించి లేక్ దగ్గరకు చేరుకున్నాం. ఇక్కడ సమ్మర్ మొదలైనప్పటికీ మనం ఇండియాలో అందులో గుంటూరు విజయవాడ ఎండలు చూసినవాళ్ళం గనుక మనకు ఇదొక లెక్క కాదు. ఇది మన చలికాలంలా ప్లెజంట్ గా ఉంది. కనుక బోటింగ్ చేద్దామని ప్లాన్ చేశాం.

రేవులో ఒక ప్లాస్టిక్ పెడలింగ్ బోటు రెడీగా ఉన్నది. అందులో ఇద్దరు మాత్రమే బోటింగ్ కు వెళ్ళవచ్చు. అందుకని ఇద్దరిద్దరు చొప్పున బోటింగ్ కు బయల్దేరాం. అలా కొన్ని రౌండ్స్ అయిన తర్వాత, ఒడ్డున కూచుని మాట్లాడుతున్న నేను అప్రయత్నంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. నన్ను చూచి అందరూ నా పక్కనే కూచుని వాళ్ళూ ధ్యానం మొదలు పెట్టారు. ఈ విధంగా జరగడం, అప్రయత్నంగా ధ్యానస్థితి దానంతట అదే పైకొనడం పంచవటి సభ్యులకు, ముఖ్యంగా నాతో క్లోజ్ గా ఉండేవారికి చాలాసార్లు అనుభవమే.

అయితే, అప్పుడొక విచిత్రం జరిగింది. ఆ సమయంలో సరళాదేవి, ఆనంద్ బోటింగ్ చేస్తూ లేక్ మధ్యలో ఉన్నారు. సరిగ్గా అదే సమయంలో అసంకల్పితంగా వాళ్ళిద్దరూ కూడా పెడలింగ్ ఆపేసి ధ్యానస్థితిలోకి వెళ్ళిపోయారు. బోటు అలా నీటిపైన తేలుతూ ఉండిపోయింది. అలా ఒక అరగంట సేపు లేక్ మధ్యలో బోటులో తేలుతూ ఉన్న తర్వాత అలల తాకిడికి బోటు ఇంకోవైపుకు ఒడ్డుకు కొట్టుకొచ్చింది. అప్పుడు వాళ్ళు తేరుకుని మళ్ళీ పెడలింగ్ చేస్తూ మావైపు వచ్చారు. ఆ తర్వాత మాతో పాటు కలసి ఇంకొక అరగంట వాళ్ళూ ధ్యానం చేశారు. ఇంటర్నల్ గా కనెక్ట్ అయి ఉన్న మనుషులు దూరంతో సంబంధం లేకుండా మనతో ఎలా రెస్పాండ్ అవుతారు అనడానికి ఇదొక ఉదాహరణ. ఈ మధ్యకాలంలో ఇలాంటి లోతైన ధ్యానస్థితి ఎప్పుడూ రాలేదని ఆనంద్ ఆ తర్వాత నాతో అన్నాడు.

నిజానికి, ఒక ధ్యాని మాత్రమే జీవితంలో ప్రతి క్షణాన్నీ ఎంజాయ్ చెయ్యగలడు. ఎందుకంటే అతని మనస్సూ ఇంద్రియాలూ పూర్తిగా అతని కంట్రోల్లో ఉంటాయి గనుక. అలా ఉన్నప్పుడు మనం ఏది చేస్తున్నా ధ్యానస్థితి మననుంచి జారిపోదు. అయితే ఇది తేలికగా వచ్చే స్థితి కాదు. ఎన్నో ఏళ్ళ కఠోర సాథనతో ఈ స్థితిని సాధించుకోవాలి. ఇదంతా చెయ్యలేని మామూలు మనుషులు జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నామన్న భ్రమలో బ్రతుకుతూ ఉంటారు గాని నిజానికి వారిది ఎంజాయ్ మెంట్ కాదు. భయంతో కూడిన తొందరపాటు పరుగు మాత్రమే.

ధ్యానం అంటే ఎందఱో ఎన్నో విధాలుగా నిర్వచనం ఇచ్చారు. నేనిచ్చే నిర్వచనం ఏమంటే - జీవితాన్ని అన్ని రకాలుగా పూర్తిగా ఎంజాయ్ చెయ్యడమే నిజమైన ధ్యాని లక్షణం అని నేనంటాను. నిజానికి ధ్యానంలో మంచి మాస్టరీ ఉన్నవారే అలా చెయ్యగలరు. మిగతావారికి అది సాధ్యం కాదు.

అందరం కలసి అలా ఆరుబైట పచ్చికలో ధ్యానంలో ఒక గంట గడిపాక మంజు ఆంటీ వచ్చారని అందరం లేచి ఆమెను ఆహ్వానించడానికి ఇంటి ముందుకు వెళ్లాం. ఆమె కారు తనే డ్రైవ్ చేసుకుని వచ్చారు. ఆమె పొట్టిగా సన్నగా ఉన్నారు. వయస్సు దాదాపు 70 పైనే ఉంటుంది. చిన్నపిల్లలా స్వచ్చమైన ముఖంతో నిర్మలమైన కళ్ళతో ఉన్నారు.

ఆమె ఒక రెండు గంటలు మాతో గడిపారు. ఆమె మాతో ఏం మాట్లాడారో ఆ వివరాలన్నీ వచ్చే పోస్ట్ లో వ్రాస్తాను. ప్రస్తుతానికి బోటింగ్ ఫోటోలు మీ కోసం.













































































read more " రెండవ అమెరికా యాత్ర -44 (బోటింగ్ మెడిటేషన్) "

2, జూన్ 2017, శుక్రవారం

రెండవ అమెరికా యాత్ర -43 (ఋష్యాశ్రమం)























మనం సక్రమమైన పద్ధతిలో ఉంటే అమెరికాలో ఉన్నా కూడా హిమాలయాలలోని ఋష్యాశ్రమంలో ఉన్నట్లు ఉండవచ్చు అనడానికి శ్రీనివాస్ గారి ఇల్లే ఒక ఉదాహరణ. వారి ఇంట్లో అడుగు పెడుతూనే ఇల్లంతా పరమ సాత్విక తరంగాలతో నిండి ఉన్నట్లు గమనించాను. దానికి కారణం వారి జీవన విధానం.

అమెరికాలో ఇరవై ఏళ్ళ నుంచీ ఉంటున్నా కూడా క్రమం తప్పకుండా నిత్యం సంధ్యావందనమూ గాయత్రీ జపమూ చేస్తున్న నిష్ఠాపరులలో శ్రీనివాస్ ఒకరు. శుద్ధ శాకాహారం, సాంప్రదాయ జీవనం వారి జీవన శైలులుగా తోచాయి. అందుకే వారి ఇంటిలో అడుగుపెడితే సొంత ఇల్లులాగా చాలా హాయిగా అనిపించింది. ఇక్కడుంటున్న చాలా మందికి ఉన్న అలవాట్లు - ఆల్కహాలు తీసుకోవడం, మాంసాహారం తినడం, ఒక తీరూ తెన్నూ లేని జీవితం గడపడం - మొదలైన చేష్టలు వారిలో మచ్చుకైనా లేవు. అందుకే వారి ఇంటిలోని తరంగాలు పరమ సాత్వికంగా అనిపించాయి. వారింటిలో ప్రతి గదీ ఒక పూజామందిరం లాగా ఉంది. కనుక వారి ఇంటికి "ఋష్యాశ్రమం" అని పేరు పెట్టాను. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నా కూడా ఆ విధమైన సాత్విక ఆధ్యాత్మిక జీవితం గడుపుతున్న వారిని చూస్తే చాలా ముచ్చట అనిపించింది. చాలామంది ఊరకే మాటలు చెబుతారు గాని ఆచరణలో ఆ మాటలు ఎక్కడా కనిపించవు. కానీ వీరి దగ్గర మాటలు తక్కువ ఆచరణ ఎక్కువగా కనిపించింది. అనవసరమైన మాటలు గాని, సాంప్రదాయ విరుద్ధమైన నడవడిక గాని వీరి దగ్గర మచ్చుకైనా కనిపించలేదు.

వీరి ఇల్లు ఒక సరస్సు ముందు ఉన్నది. అంటే మధ్యలో ఒక పెద్ద కృత్రిమ సరస్సు నిర్మించి దాని చుట్టూ కాలనీ లాగా ఇళ్ళు కట్టారన్నమాట. ఆ సరస్సు సరిగ్గా వీరి బ్యాక్ యార్డ్ లో ఉంటుంది. అక్కడ వాతావరణం చాలా అద్భుతంగా ప్రశాంతంగా, ధ్యానానుకూలంగా ఉన్నది. ఎవరి ఇంటికి వెనుకగా వారు వుడెన్ డెక్ నిర్మించుకున్నారు. దానిమీద కూచుని సరస్సును వీక్షించవచ్చు. లేదా ఇంటి వెనుక ఉన్న పెద్ద లాన్ లో కూర్చుని ధ్యానంలోకి జారిపోవచ్చు. సరస్సులో బోటింగ్ చెయ్యడానికి వీలుగా కొంతమంది పడవలను పెట్టుకున్నారు. వింటర్ లో అయితే ఆ నీరంతా గడ్డ కట్టినప్పుడు దానిమీద స్కేటింగ్ కూడా చేస్తారని శ్రీనివాస్ చెప్పారు.

ఈ సారి అమెరికాకు వచ్చిన ప్రతిసారీ మీ ఇంట్లో ఒక వారం ఉంటానని వారితో చెప్పాను. దారీ తెన్నూ లేని జీవన విధానాలతో ఎటు పోతున్నామో తెలియని నేటి అమెరికా సొసైటీలో కూడా ఇలాంటి వారు ఉన్నారంటే ఇదికదా మన భారతీయ సాంప్రదాయ జీవన విధానం అనిపించింది.
read more " రెండవ అమెరికా యాత్ర -43 (ఋష్యాశ్రమం) "

1, జూన్ 2017, గురువారం

రెండవ అమెరికా యాత్ర -42 (షాంపేన్ సరస్వతీదేవి ఆలయంలో ప్రశ్నలు సమాధానాలు)

ప్రసంగం అయిపోయాక, సభికుల నుంచి ఈ క్రింది ప్రశ్నలు వచ్చాయి. వాటికి నేను ఈ క్రింది విధంగా సమాధానాలిచ్చాను.

1. లలితా సహస్రనామాలు చదివేటప్పుడు స్వరయుక్తంగా చదవడం అవసరమా?

జవాబు:-- అవసరం లేదు. ఎందుకంటే ఇవి వేదమంత్రాలు కావు. పురాణాలనుంచి వచ్చిన స్తోత్రాలు ఇవి. లలితా సహస్రం బ్రహ్మాండపురాణం లోనిది. వేదమంత్రాలకు స్వరం ఉంటుంది. వాటిని రాగయుక్తంగా చదవాలి. కానీ పురాణోక్త మంత్రాలకు ఆ నియమం లేదు. కనుక ఆ భయం అవసరం లేదు.

2. మేము ఎవరి దగ్గరా ఉపదేశం తీసుకోలేదు. లలితా సహస్ర నామాలు చదవవచ్చా?

జవాబు:-- నిరభ్యంతరంగా చదువుకోవచ్చు. ఉపదేశం తీసుకుంటే మంచిదే. లేకున్నా ఇబ్బంది లేదు. మీకు లోలోపల ఎంత ఆర్తి ఉన్నది? అనేదే ముఖ్యం గాని మీరు ఉపదేశం తీసుకున్నారా లేదా అనేది ముఖ్యం కాదు.

3. చదివేటప్పుడు తప్పులు పోతే ఏం చెయ్యాలి?

జవాబు:-- తప్పులు చదువుతున్నామని మీకు తెలిసినప్పుడు దిద్దుకోవాలి. తెలియకుండా తప్పులు చేస్తే ఏమీ దోషం లేదు. అమ్మ సర్వజ్ఞ కదా. ఆమెకు అన్నీ తెలుసు. అన్నింటినీ ఆమె చూస్తూనే ఉంటుంది. ఆమె మీ హృదయాన్ని చూస్తుంది గాని మీ మాటలో స్వచ్చతను కాదు. శ్రీరామకృష్ణులు ఇలా అనేవారు. ఒక తల్లికి నలుగురు పిల్లలున్నారు. వారిలో పెద్దవాడు 'అమ్మా' అని చక్కగా పిలవగలడు. కానీ చిన్నవాడు మాటలు పలకలేడు. వాడికి అలా పిలవడం రాదు. వాడు ఉత్తగా 'అం' అంటాడు. అంతమాత్రాన వాడంటే తల్లికి కోపం ఉండదు. ఇంకా ప్రేమ ఎక్కువ ఉంటుంది. వాడికి మాటలు ఇంకా రాలేదని ఆమెకు తెలుసు గనుక. ఇదీ అంతే.

4. వెయ్యి విష్ణు నామాల కంటే శివనామం ఉత్తమమని, వెయ్యి శివ నామాల కంటే దేవీ నామం ఉత్తమమని అంటున్నారు. దీనికేదైనా ప్రత్యేక కారణం ఉన్నదా? మనకున్న షణ్మతములలో ఏది గొప్పది? అసలిదంతా ఏమిటి?

జవాబు:-- విభిన్నతే మన మతంలో ఉన్న ప్రత్యేకత. శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణాపత్యం, కౌమారం అనేవి షణ్మతములు. వీటిని ఆది శంకరాచార్యుల వారు స్థిరపరచారు. ఆయన కాలంలో ఇంకా తొంభై ఆరు మతాలు (శాఖలు) మన దేశంలో ఉండేవి. వాటినన్నింటినీ ఆయన ఖండించి ఈ ఆరింటిని స్థిరీకరించారు. వీటిలో ఒకటి గొప్పా ఒకటి తక్కువా అని లేదు. ఏ రూపంలో కొలిచినా నువ్వు కొలుస్తున్నది ఒకే బ్రహ్మమునే అనేది అసలైన సత్యం. ఈ విషయం గుర్తుంటే ఏ గొడవలూ ఉండవు. అయితే, శక్తి ఆరాధన ఎందుకు గొప్పది అంటే, తల్లికి మనం ఇచ్చే గౌరవంలో ఆ రహస్యం ఉన్నది. దేవుడైనా సరే జన్మ తీసుకోవాలంటే ఒక తల్లి కడుపులోనుంచే రావాలి. కనుక తల్లికి మన మతంలో అత్యంత గొప్ప స్థానం ఉన్నది. దైవాన్ని తల్లిగా పూజించడం మన మతపు అతి గొప్ప సౌలభ్యాలలో ఒకటి. శక్తి లేక శివుడు ఏమీ చెయ్యలేడని చెప్పడంలో కారణం కూడా ఇదే. ఆదిశక్తి నుంచే అన్నీ వచ్చాయని మనం నమ్ముతాం. అందుకే శక్తి ఆరాధన అన్నింటిలోకీ సర్వశ్రేష్టమని అంటారు. 

5. 'మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ' - మొదలుగా గల శ్లోకాల అర్ధం ఏమిటి?

ఈ నామాలు కుండలినీ యోగాన్ని సూచిస్తున్నాయి.

మూలాధారైక నిలయా బ్రహ్మగ్రంధి విభేదినీ - మూలాధార చక్రంలో ఉండి నువ్వు బ్రహ్మగ్రంధిని భేదిస్తున్నావు. మణిపూరాంతరుదితా విష్ణుగ్రంధి విభేదినీ - మణిపూరక చక్రంలో ఉండి నువ్వు విష్ణుగ్రంధిని భేదిస్తున్నావు. ఆజ్ఞాచక్రాంతరాళస్తా రుద్రగ్రంధి విభేదినీ - ఆజ్ఞాచక్రంలో ఉన్న నీవు రుద్రగ్రంధిని భేదిస్తున్నావు. సహస్రారాంబుజారూడా సుధాసారాభివర్షిణీ - సహస్రార చక్రానికి చేరిన నీవు అమృత వర్షాన్ని కురిపిస్తున్నావు. తటిల్లతా సమరుచి షట్చక్రోపరి సంస్థితా - మెరుపుతీగలా నీవు ఆరు చక్రాలను దాటి ఆ పైన ఉన్న భూమికను చేరుకుంటున్నావు. మహాశక్తి కుండలినీ బిసతంతు తనీయసీ - నీవు మహాశక్తివైన కుండలినివి. దేహంలో ఉన్న అన్ని నాడులనూ నీవు అమృత వర్షంతో తడుపుతున్నావు.

ఈ నామాలన్నీ శ్రీవిద్యలో మూల సాధనైన కుండలినీ జాగృతినీ, చక్రభేదనాన్నీ, గ్రంధి భేదనాన్నీ, అమృతవర్షాన్నీ సూచిస్తున్నాయి. మనలో మూడు గ్రంధులున్నాయి. సాధనలో వీటిని భేదించడం జరుగుతుంది. ఈ ప్రక్రియే ఇక్కడ సూచింపబడింది. వీటన్నిటినీ త్వరలో రాబోతున్న నా పుస్తకం - 'లలితా సహస్రనామ రహస్యార్థ ప్రదీపిక' లో వివరంగా చర్చించాను. అది చదవండి.

6. నాకు ఒక గురువు గారున్నారు. ఉపదేశం అయింది. కానీ నేను ఆయన చెప్పినట్లు చెయ్యడం లేదు. నాకు తోచిన రీతిలో చేసుకుంటున్నాను. ఇది దోషమా?

ఇలాంటి వారికి ఏం సమాధానం చెప్పాలి? గురువు చెప్పినట్లు విననప్పుడు అసలు వీళ్ళు ఎందుకు దీక్షలు తీసుకుంటారో? నాకు నవ్వొచ్చింది. ఆమెకు ఇలా చెప్పాను.

జవాబు:-- ఇందులో రెండు మార్గాలున్నాయి. ఒకటి - మీ మనసు చెప్పిన ప్రకారం మీరు పోవడం. రెండు - మీ గురువు చెప్పినట్లు వినడం. ప్రస్తుతం మీకు మీ మనసు చెప్పినట్లే నచ్చుతోంది కనుక అలాగే చెయ్యండి. ఇంతకంటే మీరు ఇంకేం చెయ్యగలరు? ఒకవేళ నేను ఇంకో రకంగా చెప్పినా మీరు వింటారో లేదో అనుమానమే. కనుక ప్రస్తుతానికి మీకు తోచిన రీతిలోనే మీరు చేసుకోండి.

7. అందరికీ గురువు దొరకడం కష్టం కదా? అలాంటి వారు ఏం చెయ్యాలి?

జవాబు:-- ఇందులో కష్టం ఏమీ లేదు. మీకు నిజమైన ఆర్తి ఉంటే, తప్పకుండా మీ గురువు లభిస్తాడు. భగవంతుడే ఆయన్ను మీ దగ్గరకు పంపిస్తాడు. కానీ మీరాయన్ని గుర్తించలేరు. అలా గుర్తించడానికి మీ అహం మీకు అడ్డొస్తుంది. ఆ అహాన్ని జయించనిదే మీకు గురు అనుగ్రహం ఎన్నటికీ దొరకదని అర్ధం చేసుకోండి. గురువు కోసం త్రికరణ శుద్ధిగా దైవాన్ని ప్రార్ధిస్తే మీకు గురువు తప్పకుండా లభిస్తాడు. ఇందులో అనుమానం లేదు.

8. పారాయణ చేసే సమయాలలో నియమనిష్టలు ఏవైనా పాటించాలా?

జవాబు:-- అలాంటి డొల్ల నియమనిష్టల మీద నాకు నమ్మకం లేదు. శుద్ధమైన హృదయం కలిగి ఉండటాన్ని మించిన నియమ నిష్టలు ఎక్కడా లేవు. మీరు ఉపవాసాలు ఉండవచ్చు, నేలమీద పడుకోవచ్చు, ఇంకా ఎన్నెన్నో చెయ్యవచ్చు, కానీ మీ నిత్యజీవితంలో మీ చుట్టూ ఉన్న వారితో సక్రమంగా మీరు ప్రవర్తించకపోతే మీ నియమ నిష్టలన్నీ దండగమారి పనులని తెలుసుకోండి. వాటివల్ల మీకు అహంకారం పెరగడం తప్ప ఉపయోగం ఏమీ ఉండదు.
read more " రెండవ అమెరికా యాత్ర -42 (షాంపేన్ సరస్వతీదేవి ఆలయంలో ప్రశ్నలు సమాధానాలు) "

Secret Of Sri Vidya - E Book ఈ రోజున రిలీజైంది

చాలా రోజులనుంచీ చాలామంది అడుగుతున్నారు - శ్రీ విద్యారహస్యం పుస్తకాన్ని ఇంగ్లీషులో ఎప్పుడు రిలీజ్ చేస్తున్నారు? అంటూ. అది ఈరోజున జరుగుతున్నది.

మొదట్లో అనువాదకుల సహాయం తీసుకుందామని అనుకున్నప్పటికీ, చివరకు ఈ పుస్తకాన్ని ఇంగ్లీషులోకి నేనే అనువాదం చేశాను. ఇలా చెయ్యడం ద్వారా రచయిత యొక్క మూలభావాలు అనువాదంలో మారిపోకుండా ఉంటాయన్నది నా ఊహ.

E - Book కావలసిన వారు Google play books ద్వారా దానిని పొందవచ్చు.

నేను జూలైలో ఇండియాకు వచ్చాక ప్రింట్ బుక్ రిలీజ్ అవుతుంది. 
read more " Secret Of Sri Vidya - E Book ఈ రోజున రిలీజైంది "