“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

24, జులై 2012, మంగళవారం

జిల్లెళ్ళమూడి స్మృతులు - 1

జిల్లెళ్ళమూడి వెళ్లి చాలారోజులైంది మళ్ళీ ఒకసారి పోయివద్దాం అని అనుకున్నాం. ముందే అనుకున్నట్లుగా చరణ్ సరిగ్గా అయిదింటికల్లా మా ఇంటికి వచ్చి చేరాడు. నేను తెల్లవారుజామున మూడున్నరకే లేచి తయారై ఉన్నాను. ఉదయాన్నే 5.15 కల్లా జిల్లెళ్ళమూడి బయలుదేరాం. తెలతెలవారుతున్న ఆకాశం, ప్రశాంతమైన ఉషోదయ సమయంలో తెల్లవారేలోపలే ఊరుదాటి, పొలాలమీదనుంచి వీస్తున్న చల్లనిగాలిని ఆస్వాదిస్తూ ప్రయాణం సాగించాం. 

జిల్లెళ్ళమూడికి బయలుదేరితే నాకు లోలోపల భావావేశం రావడం మొదలౌతుంది. చరణ్ పరిస్తితి అసలు చెప్పనక్కర్లేదు. దానికి తోడు స్టీరియో లోనుంచి "అమి మంత్ర తంత్ర కుచ్ ని జానీ నేమా (అమ్మా, నాకు మంత్ర తంత్రాలు ఏమీ తెలియవు. నేను నీ బిడ్డను. నాకు ఇంతే తెలుసు) " అంటూ బెంగాలీగీతం మంద్రస్థాయిలో పన్నాలాల్ భట్టాచార్య మధురస్వరంలో వినిపిస్తోంది. అందరం మౌనంగా ఉన్నాం. హై ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్స్ మొదలయ్యాయి. మౌనంగా ఆ గీతాన్ని అందులోని భావాన్ని ఆస్వాదిస్తూ కొంతదూరం ప్రయాణించాము. అంతలో నిశ్శబ్దాన్ని చేదిస్తూ చరణ్ గొంతు వినిపించింది.

"అన్నగారు!! రాముడికీ కృష్ణుడికీ ఏమి కర్మ ఉన్నదని వాళ్ళు జన్మ తీసుకున్నార్రా?" అని అమ్మ ఒకసారి అన్నది. దీని అర్ధమేమిటి? అసలు జన్మకు కర్మ కారణమా? అది రూలా?" అని అడిగాడు చరణ్. 

నాకు నవ్వొచ్చింది.

"చూడు చరణ్. దీనికి గీతలోనే జవాబు ఉన్నది. అమ్మ ఏ సందర్భంలో ఆ మాట చెప్పిందో మనకు తెలీదు. మహనీయుల మాటలను ఆ సందర్భాన్ని బట్టే అర్ధం చేసుకోవాలి. మిగతా అన్ని సందర్భాలకూ వాటిని వర్తింపచేయరాదు. గీతలో భగవానుడే చెప్తాడు. ఈ లోకంలో నాకు ఏ కర్మగాని కర్తవ్యంగాని లేదు అని ఒకచోట అంటాడు. ఇంకోచోట, నా మాయాప్రభావం చేత నేను స్వయంభువుగా ఈ లోకంలో అవతరిస్తున్నాను. కాని లోకులు నన్ను వారివలె మామూలు మనిషిని అనుకుంటారు. నా మాయ వారినలా మోహితులను చేస్తుంది" అంటాడు.

"తండ్రి పిల్లలతో ఆడుతూ తానూ కిందపడిపోయినట్లు లేవలేనట్లు నటిస్తాడు. చేతులు తాళ్ళతో కట్టేసుకున్నట్లు విడిపించుకోలేనట్లు నటిస్తాడు.అంతమాత్రాన అతను లేవలేడని, కట్లు విడిపించుకోలేడనీ కాదు. ఆటలో అలా నటిస్తాడు. అలాగే, మామూలు మనుషుల జన్మకు వారి పూర్వకర్మ కారణం అవుతుంది. కాని అవతారమూర్తుల జన్మకు వారి సంకల్పమే కారణం అవుతుంది. వారివి మనవంటి కర్మబద్ధ జీవితాలు కావు. వారికి కర్మ లేదు" అన్నాను.

చరణ్ కు ఇంకా సందేహనివృత్తి కాలేదు. అది గమనించి, "నీ సందేహం జిల్లెల్లమూడిలో పోతుందిలే కాసేపు ఆగు". అని నవ్వుతూ అన్నాను.

"అన్నగారు మీరొకసారి చెప్పారు. రామకృష్ణుల జీవితంలో ఆయనకు ఒక వ్యక్తి తారసపడతాడు. అతనికి తన ఒంటిలోనుంచి వెలుగును వెదజల్లే శక్తి ఉంటుంది. ఆ కధ మళ్ళీ ఒకసారి చెప్పండి." అడిగాడు చరణ్.


"చంద్రుడు గిరిజుడు అని ఇద్దరు వ్యక్తులు రామకృష్ణునికి తెలుసు. ఆయన తంత్ర సాధనలు చేసిన సమయంలో వారు పరిచయం అయ్యారు. వారిలో ఒకరికి ఈ సిద్ధి ఉండేది. ఒకరోజు బాగా చీకటి పడేదాకా మాట్లాడి రామకృష్ణులు కాళికా ఆలయానికి వెళదామని బయలుదేరుతారు. చిమ్మ చీకటిలో ఆయనకు దారి కనపడక తడుముకుంటూ ఉంటారు. అప్పుడు గిరిజుడు తన చేతిని పైకెత్తి ఫ్లడ్ లైట్ లాగా వెలుగును దారిపోడుగూతా ప్రసరిమ్పచేస్తాడు. ఆ వెలుగులో ఆయన ఆలయానికి చేరుతారు. ఇంతవరకూ కథ అందరికీ తెలుసు. కాని ఆ తర్వాత తెలియని కథ ఇంకొకటుంది. ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా గిరిజుడు ఆ పని చెయ్యలేకపోతాడు. ఆ వెలుగు రాదు. ఎందుకంటే రామకృష్ణులు ఆ శక్తిని తనలోనికి ఆకర్షించి అతన్ని ఆ దాస్యం నుంచి విముక్తుణ్ణి చేస్తారు. సిద్ధులు సాధనా మార్గంలో ఆటంకాలు. కనుక ఆ సిద్ధిని తనలోకి తీసుకుని అతన్ని తేలికపరుస్తారు. ఈ సంగతి అతనికి తెలియదు. అవతారపురుషుని ముందు శక్తిప్రకటన చెయ్యడం ఆంజనేయుని ముందు కుప్పిగంతుల వంటిది. చంద్రునికి గుటికాసిద్ధి ఉండేది. దానివల్ల అతనూ ఇబ్బందుల పాలయ్యాడు. తర్వాత దానిని వదిలిపెట్టి సాధన కొనసాగించాడు." అంటూ ఆ కధను వివరించాను. 
  
దారిలో  చాలాచోట్ల మనుషులు రోడ్డుకి అడ్డంగా నిలబడి ఉండటమూ ఎంత హారన్ కొట్టినా పక్కకు తోలగకపోవడమూ చూచి, "వీళ్ళు మనుషులా పశువులా. పశువులే నయం. హారన్ కొడితే పక్కకు పోతాయి. వీళ్ళు వాటికంటే ఘోరంగా ఉన్నారు". అన్నాడు. " తప్పు చరణ్. వీళ్ళంతా మనకు గురువులు. సహనాన్ని  మనకు నేర్పుతున్నారు". అని నవ్వుతూ అనుకున్నాం. చరణ్ కి జీసస్ మాట ఒకటి గుర్తుకొచ్చింది. "O Father in Heaven, forgive them, for they know not what they are doing" అన్నాడు. 

"మంచి మాట చెప్పావ్ తమ్ముడూ. మహనీయుల మనోభావం అదే.ఈ లోకంలో ఉన్న మనుషులను చూచి వాళ్ళు అదే అనుకుంటారు. మన అజ్ఞానమూ, బద్దకమూ, మొండితనమూ చూచి ప్రతి మహానీయుడూ అనుకునేది ఈ మాటలే" అన్నాను.

"నిజమే. అన్నగారు." అంటూ ఒప్పుకున్నాడు చరణ్. "అన్నగారు నాదొక సందేహం. అడగమంటారా?"

"అడుగు. దానికి పర్మిషన్ కావాలా?" అన్నా రోడ్డుమీదనుంచి దృష్టి తిప్పకుండా నవ్వుతూ.

అమ్మ ఒకచోట " కాలం అనేది అసలు లేదు నాన్నా" అని ఒక మహోన్నతమైన స్టేట్మెంట్ ఇచ్చింది. అమ్మ చెప్పిన అన్ని స్థాయిలూ ఎంతో కొంత అర్ధం అయ్యాయి కాని ఈ భావం ఎంత గింజుకున్నా అర్ధం కావడం లేదన్నగారు. దీనిమీద మీ భావం ఏమిటి?" అడిగాడు.

"అద్వైతస్తితిలోకి వెళ్ళే ముందో, లేక అక్కణ్ణించి కిందకు వచ్చే స్తితిలోనో అమ్మ ఈ మాట అని ఉంటుంది తమ్ముడూ. ఆ స్థాయిలో అది సత్యమే. కాని ఇంద్రియబద్ధులమైన మనకు అది సత్యం కాదు. It is an ultimate statement emanating from the indivisible and undifferentiated state of being, but not applicable to poor mortals like us". అన్నాను.

"సరేగాని తమ్ముడూ నీవు అమ్మ సాహిత్యం బాగా చదివావు కదా. నాదొక సందేహం చెప్పు. అతీతలోకాల గురించి, జన్మలగురించి అమ్మ ఎక్కడైనా ఎవరితోనైనా చెప్పిందా? "సాహిత్యం వల్ల రాహిత్యం రాదు నాన్నా" అన్న అమ్మ వాక్యాన్ని మాత్రం చెప్పకు. అది నాకు తెలుసు" అన్నా నవ్వుతూ. 

"అసలు కాలమే లేదు అంటుంటే, ఇక లోకాలు జన్మలు గురించి అమ్మ ఎలా చెబుతుంది అన్నగారు?"

"అలా కాదులే తమ్ముడూ. అమ్మ ఆ ఒక్క మాటే అందరితోనూ చెప్పలేదు. అందరితోనూ ఆ స్థాయిలో మెలగలేదు. ఏ మహానీయుడూ తత్వాన్ని అలా జెనరలైజ్ చేసి చెప్పడు. ఎవరూలేని సమయంలో బాగా సన్నిహితులతో మాట్లాడేటప్పుడు " ఫలానా వాడు ఫలానా చోట పుట్టాడురా" అనో " వీడు పూర్వజన్మలో ఫలానా" అనో లేదా "వీణ్ణి ఫలానా లోకానికి పంపించాను" అనో అమ్మ అనే ఉంటుంది.   అలాంటి సన్నివేశాలు అమ్మ సాహిత్యంలో ఎక్కడైనా చదివావా?"

"లేదు అన్నగారు. నేను చదవలేదు.వినలేదు." 

"అవన్నీ సత్యాలే తమ్ముడు. లోకాలు జన్మలు అన్నీ ఉన్నాయి. కాని వాటిగురించి నలుగురితో మామూలు మాటలు మాట్లాడేటప్పుడు ఏ మహనీయుడూ వెల్లడించడు. అప్పుడు అందరికీ పనికొచ్చే మామూలు వేదాంతం చెబుతారు. రహస్యమైన విషయాలు అందరిలోనూ ఉన్నపుడు చెప్పరాదు. ఎవరూ చెప్పరు కూడా. కాని అవి జరిగే ఉంటాయి." అన్నాను.

"అడుగుదాం అన్నగారు. అక్కడ అమ్మను చూచి అమ్మతో ఎంతో మాట్లాడిన వాళ్ళు, ఎన్నోఏళ్ళు అమ్మతో కలిసి జీవించినవాళ్ళు ఉన్నారు. వసుంధరక్కయ్య ఉన్నది ఆమెను అడుగుదాం." అన్నాడు చరణ్.

నేను 'సరే' అంటూ తలాడించాను. చూస్తూ ఉండగానే బాపట్ల వచ్చింది. అక్కడ ఉపాహారం కానిచ్చి మళ్ళీ బయలుదేరి ఒక అరగంటలో జిల్లెళ్ళమూడి పరిసరాలకు చేరాము. వాగుమీద ఉన్న బ్రిడ్జిదాటి కుడిచేతి పక్కకు మలుపు తిరిగి కొద్దిదూరం ప్రయాణం చేసి ఊళ్లోకి అడుగుపెట్టాము. ఆ దారిలో వెళ్ళే ప్రతిసారీ ఒకేమాట అనుకుంటాము. "ఎంతమంది హేమాహేమీలు మహానుభావులు అమ్మ దర్శనంకోసం ఈ దారిలో నడిచారో కదా" అని. అలా అనుకుంటూ ఉండగానే ఊరోచ్చింది. కొంచం దూరం పోవడంతోనే, "అందరిల్లు" అంటూ బోర్డ్ కనిపించింది. లోపలి వెళ్ళడంతోనే మల్లు ఇంకా కొందరు నిలుచుని నవ్వుతూ కనిపించారు. వాళ్ళను చూడటంతోనే సంతోషం అనిపించింది.

(సశేషం)