“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

7, డిసెంబర్ 2016, బుధవారం

సాయన సూర్య సంక్రమణం - ప్రముఖుల మరణాలు

ప్రస్తుతం వరుసగా ప్రముఖుల మరణాలు జరుగుతున్నాయి. వీటి వెనుక గల జ్యోతిష్య కారణం వృశ్చికరాశిలో ఉన్న శనిసూర్య సంయోగమే. దీనిగురించి కొంత చూద్దాం.

శనీశ్వరుడు వృశ్చికరాశిలో సంచరిస్తున్న ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో చాలా ఘోరాలు జరుగుతాయని గతంలో ఎంతోముందే వ్రాశాను.దానికి కారణాలు కూడా వివరించాను.ఇప్పుడు గోచార సూర్యుడు శనీశ్వరునితో కలసిన ఈ నెల సమయంలో ముఖ్యంగా ప్రముఖుల మరణాలు, వాయుయాన ప్రమాదాలు, రసాయన పేలుళ్లు జరుగుతున్నాయి.

కాకపోతే ఈసారి సాయన సూర్య సంక్రమణం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. సాయన సిద్ధాంత రీత్యా ప్రస్తుతం సూర్య శనులిద్దరూ ధనూరాశిలో ఉన్నారు. ఎందుకంటే - సాాయన సిద్ధాంత రీత్యా నవంబర్ 22 న సూర్యుడు వృశ్చిక రాశినుంచి ధనూరాశిలోకి ప్రవేశించి అక్కడ ఇప్పటికే ఉన్న శనీశ్వరుని పరిధిలోకి వచ్చాడు.

సూర్యుడు అధికారులకు, ప్రముఖులకు సూచకుడని జ్యోతిశ్శాస్త్రం వచ్చినవారికి బాగా తెలిసిన విషయమే.మరణానికి కారకుడైన శనీశ్వరునితో ఈయన కలసినప్పుడు ఏం జరుగుతుందో మళ్ళీ ప్రత్యేకంగా వివరించనక్కరలేదు.

>>బాల మురళీకృష్ణ మరణం
ప్రముఖ కర్నాటక సంగీత విద్వాంసుడు మంగళంపల్లి బాలమురళీకృష్ణ సరిగా అదే 22-11-2016 న మరణించాడు.

>>జయలలిత మరణం
దీనికి సరిగ్గా రెండు నెలల ముందు (ఆ నెలలో సాయన సంక్రమణానికి ఒకరోజు ముందు) 22-9-2016 రోజున జయలలిత సింపుల్ అనారోగ్యం(fever and dehydration) తో ఆస్పత్రిలో చేరింది.కానీ క్రమేణా ఈ అనారోగ్యం ముదురుతూ పోయింది.విదేశాల నుంచి డాక్టర్ని రప్పించి మరీ చికిత్స మొదలు పెట్టారు.తులారాశిలోకి వఛ్చిన ఈ సంక్రమణం సూర్యునికి నీచత్వాన్ని ఆపాదిస్తుంది.కనుకనే సింపుల్ ఫీవర్ అండ్ డీ హైడ్రేషన్ తో ఆస్పత్రిలో చేరిన ఆమెను ట్రీట్ చెయ్యడానికి విదేశీ డాక్టర్లు అవసరం అయినారు.

22-10-2016 వృశ్చిక సంక్రమణానికి ఒకరోజు ముందు "కోలుకుంటున్నది" అని ప్రకటించబడిన ఆమె ఆరోగ్యం మళ్ళీ క్షీణించడం మొదలైంది.

నవంబర్ 19 న "ఆమె పూర్తిగా కోలుకుంది" అని చెప్పిన డాక్టర్లు ఆమెను క్రిటికల్ కేర్ నుంచి మామూలు రూముకు మార్చారు.

కానీ నవంబర్ 22 తర్వాత ఆమె ఆరోగ్యం మళ్ళీ వేగంగా క్షీణించింది.ఇదే రోజున బాలమురళీ కృష్ణ కన్ను మూశాడు. డిసెంబర్ ఐదున హార్ట్ ఎటాక్ తో ఆమె చనిపోయింది.

దీర్ఘరోగాలతో బాధపడేవారు చాలామంది, అమావాస్యకూ పౌర్ణమికీ, నెలనెలా సూర్యుడు రాశి మారే సమయంలోనూ, మళ్ళీమళ్ళీ ఆస్పత్రిలో చేరుతూ ఉంటారు.దీనిని చాలామంది జీవితాలలో గమనించవచ్చు.ఈ విధంగా వెంటవెంటనే జరుగుతూ ఉంటే - వారి ప్రాణశక్తి పని అయిపోయిందనీ అవి ఆఖరు రోజులనీ అర్ధం చేసుకోవచ్చు.ఎంతమంది డాక్టర్లు ట్రీట్ చేసినా "ప్రాణం" సహకరించనిదే వాళ్ళు ఏమీ చెయ్యలేరు. 

>>నేడు - అంటే - 7-12-2016 న - తమిళ ప్రముఖుడైన "చో రామస్వామి" (శ్రీనివాసయ్యర్ రామస్వామి) చెన్నైలో మరణించాడు.

ప్రముఖులే కాదు, మామూలు మనుషులలో కూడా, సామాన్యస్థితి నుంచి ఎదిగి ఉన్నతస్థితికి వచ్చిన వారిలో వృద్ధులు చాలామంది ఈ నెలలో పరలోక ప్రయాణం కట్టక తప్పదు. ఎందుకంటే వారివారి జీవితాలలో వారూ ప్రముఖులే కాబట్టి.

సాయన సూర్యుడు ధనూరాశిని వదలి మకరరాశిలోకి ఈ నెల 22 న ప్రవేశిస్తాడు. అంటే ఇంకా 15 రోజులుంది. చూద్దాం ఈలోపల ఇంకా ఎంతమంది లేచిపోతారో??

సాయనానికీ నిరయనానికీ అయనాంశ ఒక్కటే తేడా కాదు. సూక్ష్మమైన తేడాలు చాలా ఉన్నాయి.అయితే అవన్నీ వివరించి చెప్పడమూ, మనిషి జీవితాన్ని అవెలా ప్రభావితం చేస్తాయో భూతద్దంలో చూపిస్తూ చక్కగా వివరించడమూ నేను ఇక్కడ చెయ్యదలుచుకోలేదు.వాటిని తెలుసుకోవడానికి ఎవరికి అర్హత ఉన్నదో వారికి మాత్రమే నేర్పిస్తాను.

జ్యోతిశ్శాస్త్రం పైకి కనిపించేటంత సింపుల్ సైన్స్ కాదు. దీనిలో చాలా అర్ధంకాని లోతులున్నాయి.సాయన సూర్య సంక్రమణం కూడా ప్రముఖుల జీవితాలను ఎలా ప్రభావితం గావిస్తుందో చెప్పడం మాత్రమే ఇక్కడ నా ఉద్దేశ్యం.