“The world is a puzzle; no need to make sense out of it." - Socrates

28, జూన్ 2019, శుక్రవారం

రెండవ లక్నో యాత్ర - 1

17 నుంచి 21 వరకూ IRITM Lucknow లో ఒక చిన్న ట్రైనింగ్. ఆరేళ్ళ క్రితం ఒకసారి లక్నో వెళ్లాను. మళ్ళీ ఇప్పుడు. అప్పుడేమో మాయావతి రాజ్యం. ఇప్పుడు యోగి గారి రాజ్యం. ఊరంతా తేడాలు కనిపిస్తూనే ఉన్నాయి.

నార్త్ ఇండియా అంతా హీట్ వేవ్ లో మునిగి ఉంది. మునుపటి కంటే ఇప్పుడు లక్నో ఇంకా దరిద్రంగా తయారైంది. జనం ఎక్కువయ్యారు. వేడి ఎక్కువైంది. దుమ్ము పెరిగింది. వాహనాలు ఎక్కువయ్యాయి. కానీ అదే తిండి. అదే వాతావరణం. అదే మనుషులు.

ఎందుకొచ్చాంరా బాబూ? అనిపించింది. క్లాస్ రూమూ, లివింగ్ రూమూ మొత్తం సెంట్రల్ ఏసీ గనుక బ్రతికిపోయాం గాని, లేకుంటే ఆ వేడికి హరీమనేవాళ్ళం. సాయంత్రం ఏడువరకూ బజారులోకి పోలేనంత వేడి ఊళ్ళో ఉంది. మొదటిరోజు క్లాస్ అయ్యాక, సిటీ లోకి వెళ్లి దగ్గరలోనే ఉన్న ఆలంబాగ్ అనే సెంటర్లో కాసేపు అటూ ఇటూ తిరిగి వచ్చాం.

IRITM మాత్రం మునుపటి కంటే ఇంకా బాగుంది. కాలుష్యం లేదు. ఎక్కడ చూచినా పచ్చని చెట్లు, పచ్చిక, మంచి పర్యవేక్షణతో చాలా క్లాస్ గా, చాలా హాయిగా ఉంది. ఎరువులు లేకుండా కూరగాయలను క్యాంపస్ లోపలే పండిస్తున్నారు. క్యాంపస్ లోపల నీటి కొలనులు మూడున్నాయి. బోలెడన్ని పూలమొక్కలు, పక్షులు, నెమళ్ళు కనిపించాయి. మెయిన్ హాల్లో ఉన్న వివేకానందస్వామి చిత్రం చూచి సంతోషం కలిగింది.

వాన నీటిని జాగ్రత్తగా పట్టి, భూమిలోకి పంపే ప్రక్రియద్వారా నీటిని రక్షిస్తున్నారు. 'క్యాంపస్ లో మేము వాడుతున్న నీటికంటే వందరెట్లు నీటిని భూమికి అందిస్తున్నాం' అని IRITM డైరెక్టర్ ఏ. పీ . సింగ్ గారు సగర్వంగా మాతో అన్నారు. సోలార్ ప్యానెల్స్ ఉపయోగించి విద్యుత్తును ఉత్పత్తి చేస్తున్నారు. క్యాంపస్ అవసరాలకు చాలా భాగం సోలార్ విద్యుత్తే ఉపయోగపడుతోంది. 

క్లాస్ లో చాలా భాగం పర్యావరణ పరిరక్షణ, పరిశుభ్రత, రైల్వేలలో వీటిని ఎలా అమలు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి? మొదలైన విషయాల గురించే చెప్పారు. మన దేశంలో వేస్ట్ మేనేజిమెంట్, వాటర్ మేనేజిమెంట్ సరిగా చేసి, అర్జంటుగా పొల్యూషన్ తగ్గించక పోతే, ఒక ఇరవై ముప్పై ఏళ్ళలో అనేక రోగాలతో భారతదేశ జనాభాలో సగంమంది హరీమనడం ఖాయమని, లెక్చర్స్ ఇవ్వడానికి వచ్చిన ప్రముఖులు స్టాటిస్టిక్స్ తో సహా పవర్ పాయింట్ చేసి చూపించారు. కానీ ఎవరికీ ఈ విషయం పట్టడం లేదు. అదే విచారకరం.

ఇప్పటికే తమిలనాడులో నీటి ఎద్దడి మొదలైంది. వర్షాలు లేవు. భూగర్భ జలాలు లేవు. మద్రాస్ లో నీళ్ళను రేషన్ పద్ద్తతిలో ఇస్తున్నారట. లాటరీ తీసి అందులో పేర్లు వచ్చిన వారికి నీరు సరఫరా చేస్తున్నారట కార్పోరేషన్ అధికారులు. తిరుమల కొండపైన జలాశయాలన్నీ అడుగంటుతున్నాయని అంటున్నారు. ఇంకా రెండు నెలలు మాత్రమే అక్కడ నీరు సరిపోతుందట. వర్షాలు పడకపోతే తిరుమలలో నీరు ఉండదు. నీరు లేకుంటే భక్తులు పోలేరు. ప్రకృతిలో వస్తున్న మార్పులకు ఇవి కొన్ని మచ్చు తునకలు మాత్రమే.

ఇప్పటికే మనకు వాతావరణంలో చాలా మార్పులు కన్పిస్తూ ఉన్నాయి. వర్షాలు లేవు. వేడి ఎక్కువైంది. దుమ్ము ఎక్కువైంది. త్రాగునీరు అడుగంటుతున్నది. తినే తిండి అంతా కాలుష్యమయం. జంక్ ఫుడ్ వాడకం ఎక్కువైంది. నేటి యూత్ లో పిల్లల్ని పుట్టించే శక్తి తగ్గిపోతున్నదని గణాంకాలు చెబుతున్నాయి. ఒకవేళ పుట్టినా రోగిష్టి పిల్లలు పుడుతున్నారు. బయటకు అంతా బాగా ఉన్నట్లు కన్పించినా, భవిష్యత్తు అంధకారమయమే అని విసిటింగ్ లెక్చరర్స్ అందరూ ముక్తకంఠంతో అన్నారు.

ఎప్పటినుంచో నాలో ఉన్న భావాలనే మళ్ళీ వాళ్ళు మాకు లెక్చర్ ఇస్తుంటే మౌనంగా విన్నాను.

జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవం. క్యాంపస్ లో కూడా జరిగింది. ఉదయం అయిదున్నరకి లోకల్ యోగా టీచర్స్ కొంతమంది వచ్చి లాన్స్ లో యోగా చేయించారు. 'మీలో ఎవరికైనా యోగాలో అనుభవం ఉందా?' అని అడిగారు. నేనేమీ మాట్లాడలేదు. మౌనంగా నాకేమీ రానట్లు ఊరుకుని, వాళ్ళు చెప్పినవి చేశాను. చాలా బేసిక్ లెవల్ ఆసనాలు చేయించారు. యోగా గురించి వాళ్ళ లెక్చర్ వింటే నవ్వొచ్చింది. మౌనంగా అదీ విన్నాను. వాళ్ళంతా వెళ్ళిపోయాక స్టేజి మీద శీర్షాసనం వేసి ఒక ఫోటో దిగాను.

యోగా చెయ్యడం వల్ల వాళ్ళ జీవితాలలో ఎంత మంచి జరిగిందో వక్తలు చెప్పుకొచ్చారు. ఎంతసేపూ వారి వారి అహంకార ప్రదర్శన తప్ప, విషయం ఏమీ లేదు. జాలేసింది. పోనీలే, ఏదో కొంచం మంచిదారిలోనే పోతున్నారు కదా అనిపించింది.

మనుషుల మనస్తత్వాలు మాత్రం ఎక్కడైనా ఒకటే. అహంకారం, భయం, దురాశ, ఏం చెయ్యాలో తెలియని ఒక విధమైన ఆత్రం - ఇవి తప్ప ఇంకేమీ కనిపించలేదు. ఊర్లో తిరుగుతూ మనుషులను గమనిస్తూ ఉంటే ఎప్పుడో జరిగిన ఒక సంఘటన గుర్తొచ్చి నవ్వొచ్చింది.

'ఎప్పుడు చూసినా దేనినో వెదుకుతున్నట్లు కనిపిస్తావు. మళ్ళీ ఏదీ ఉంచుకోవు. ఏదీ ఒద్దంటావు. అసలు దేనికోసం నీ వెదుకులాట?' అని ఒక ఫ్రెండ్ ముప్పై ఏళ్ళ క్రితం నన్నడిగాడు.

'మనిషి కోసం' అని  క్లుప్తంగా జవాబిచ్చాను.

మూడు దశాబ్దాల క్రితం నేను చెప్పిన ఆ జవాబు ఈ నాటికీ వర్తిస్తుంది. అదే వెదుకులాట ఈనాటికీ కొనసాగుతోంది. అప్పటికీ ఇప్పటికీ తేడా ఏంటంటే, అప్పట్లో నావాళ్ళంటూ నాకెవరూ లేరు. ఇప్పుడు నాకోసం ప్రాణం పెట్టే మనుషులు కొందరు కాకపోతే కొందరైనా నాతో ఉన్నారు.

నిజమైన మనుషులను చూడకుండానే నేను పోతానేమో? మనిషి అనేవాడు ఈ ప్రపంచంలో నాకసలు కనిపించడేమో? అని నా జీవితంలో చాలాసార్లు అనుకున్నాను. కానీ ఎట్టకేలకు కొందరిని చూడగలిగాను.














(ఇంకా ఉంది)